8, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఏమోయ్! కోడలకు ఏమిస్తావ్...

మూడు మాసాల క్రితం కార్తీకంలో - 

నా స్నేహితురాలు శారద వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థం సందర్భంగా, స్నేహితులమంతా కలవడం జరిగింది. నిశ్చితార్థం వేడుక ముగిసాక, అందరం కబుర్లలో మునిగాం. శారద తన కోడలికి ఆరోజున పెట్టిన దశవతారాల హారంతో పాటు, వివాహం రోజున తను పెట్టాలనుకుంటున్న నగలు గురించి చెప్పగా, ప్రియంవద అనే మరో మిత్రురాలు సడన్ గా 'ఏమోయ్ భారతీ, నీవూ కోడలు అన్వేషణలో వున్నావు కదా, నీవేమిస్తావు కోడలికి' అని అడిగింది. పేరుకు తగ్గట్లుగా, ప్రియంగా తాను విన్న, చదివిన కధలతో సందర్భోచితంగా చక్కటి చర్చలు చేసే తను, ఇలా అడిగిందంటే, ఏదో చెప్పాలనుకుంటుదన్న విషయం అర్ధమై, 'నీవే చెప్పు, ఏమివ్వమంటావు' అని అడిగా నవ్వుతూ.

'అయితే నేను విన్న ఒక కధ చెప్తాను వినండి ముందు' అని తను అనగానే, అందరం ఉత్సాహంగా ''ఊఁ" కొట్టాం. కధలంటే అందరికీ ఆనందమే. 
తను చెప్పిన కధ యధాతధంగా - 
ఒక రాజుగారు తన కుమారునికి వివాహం చేసి కోడలుకై అనేకనేక వజ్ర వైడూర్య స్వర్ణాభరణములు సమకూర్చి ఇచ్చినా, కోడలు ముఖంలో పూర్ణానందమును కానరాక, మరి ఏమిస్తే ఆనందంగా వుంటుందో నని ఆలోచిస్తూ, ఒకరోజు కొలువుదీరిన సభలో ప్రశ్నించగా, అక్కడ వున్నవారు స్వర్ణాభరణాలు, మంచి మంచి వస్త్రాలు, విలువైన బహుమతులు సూచించగా, ఈ సమాధానాలు సరికావని అనుభవంతో నెఱిగిన రాజు అసహనంతో, తన మహామంత్రిని రేపు సభలో సరైన సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ, లేకుంటే కారాగారవాసం తప్పదని హెచ్చరించెను. ఆనాటి రాత్రి సమాధానం తట్టక, నిద్ర రాక ఆలోచిస్తూ వీధుల వెంబడి దిగులుతో ఆ మంత్రివర్యులు తిరుగుతుండగా, ఊరి బయట చెరువు చెంత ఓ  యువతి ఏడుస్తుండడం గమనించి, ఆ యువతి దగ్గరకు వెళ్ళి, ఎవర్నీవు... అని ఆరా దీయగా, తను ఎవరో తెలుపుతూ, అనాకారితనం వల్ల తనకి వివాహం కాకపోవడం, అందరి హేళనకు గురికావడం, వృద్దాప్యంలో వున్న తల్లితండ్రులు తనకై బెంగపడ్తూ ఆనారోగ్యగ్రస్థులవ్వడం... తదితర విషయాలు వివరించి, తన తల్లితండ్రులను ఎలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేటట్లు చేయాలో తెలియడం లేదని చెప్పగా, ఆ యువతికి తన తల్లితండ్రులపై ఉన్న ప్రేమను, మాట్లాడే విధానంలో సంస్కారమును గుర్తించి, అమ్మాయి! నేను ఈ రాజ్యపు మహామంత్రిని, నిన్ను నా కోడలుగా చేసుకుంటానని చెప్తూ, రేపు బహుశా నేను కారాగారవాసిని కావొచ్చును కనుక, నీ తల్లితండ్రులను తోడ్కొని ఇప్పుడే మా ఇంటికి వెళ్దామని చెప్పగా, ఆ యువతి నమస్కరించి, ఎందుకు మీరు శిక్షింపబడుతున్నారని అడగడం, జరిగింది మహామంత్రి గారు చెప్పడం, దానికి ఆ అమ్మయి సమాధానం చెప్పడం, ఆశ్చర్యానందాలకు లోనై, రేపు మీ అమ్మానాన్నలతో సభకు రా...రాజుగారి సమక్షంలోనే నిన్ను నా కోడల్ని చేసుకుంటాను, ఆ పిమ్మట నీవే  ఈ సమాధానం రాజుగారికి చెప్దువు గానీ, అని చెప్పడం జరిగింది.
మరునాడు సభలో జరిగింది రాజుగార్కి చెప్పి, వారి అనుమతితో ఆ యువతిని తన కోడలుగా చేసుకోవడం, ఆ అమ్మయినే  సమాధానం చెప్పమనడం, ఆ యువతి 'క్రొత్తగా అడుగెట్టిన కోడలకు స్వేచ్ఛ నివ్వండి, తనకి నచ్చినట్లుగా తనని వుండనిస్తే చాలు' అని సమాధానము చెప్పేసరికి సభ అంతా హర్షధ్వానలతో దద్దరిల్లింది. అయితే ఇక్కడ ఓ ట్విష్ట్ ఉంది... ముందురోజు రాత్రి ఆ మంత్రిగార్కి, యువతికి జరిగిన సంభాషణ విన్న ఇద్దరు గంధర్వులు కూడా ఆ సభకు వచ్చి, జరిగింది చూసి, ఆనందంతో అశరీరవాణిగా పలికిరిలా...
ఓ మంత్రివర్యా! నీ మంచితనం, నిజాయితి, నీ కోడలు తెలివి బహు ముచ్చటగా నున్నాయి. నీకో వరం ఇద్దామనుకుంటున్నాం, నీ కోడలు పగలంతా అనాకారిగా, రాత్రి అందంగా... లేదా పగలు అందంగా, రాత్రి అనాకారిగా ఉండేటట్లు వరమిస్తాం. ఈ రెండింటిలో ఏం కావాలో కోరుకోమని అడగగా, తను ఎలా ఉండాలనుకుంటున్నదో కోరుకునే స్వేచ్ఛను నా కోడలికే ఇస్తున్నానని మహామంత్రివారు అనగానే, చెప్పింది ఆచరణలో చూపినందుకు మెచ్చి, ఇకపై అనాకారితనం పోయి, అందంగా ఉంటుందని అనుగ్రహించి ఆశీర్వదించారు ఆ గంధర్వులు...అని కధ ముగించింది. 
అయితే కోడలకు స్వేచ్ఛనివ్వాలంటావు...అదే ఇస్తే వాళ్ళకి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయి, మన నెత్తి నెక్కి ఊరేగరా? మన పద్దతులు, ఇక్కడ ఎలా వుండాలో చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది...అని కొంత సందేహంతో ప్రశ్నిస్తున్న శారదకు బదులిస్తూ, మనం ఏమీ నేర్పనవసరం లేదు ఈ కాలం పిల్లలకు...వాళ్ళే తెలుసుకుంటారు నెమ్మది నెమ్మదిగా.  ఈ తరం పిల్లలు స్వేచ్ఛాయుతులు ఆలోచనాపరులు కాబట్టి వారికి నచ్చినట్లు వారిని ఉండనిస్తే చాలు. అంతగా ఏదైన చెప్పాలనుకుంటే స్నేహపూరితంగా చెప్పాల్సిన రీతిలో చెప్తే సరి. ఇక వాళ్ళు కాదు మనం ఎలా వుండాలో ముందుగా తెలుసుకోవాలి. అందరికీ ఓ వీడియో ఫార్వార్డ్ చేస్తున్నాను...చూడండంటూ వాట్సాప్ కు ఈ వీడియో పంపింది ప్రియంవద.
                


పై వీడియో పంపించాక, నా వంక చూస్తూ,ఏమిటాలోచిస్తున్నావు భారతీ, అని ప్రశ్నించిన తనతో...ఏం లేదు, కొద్దిరోజుల క్రితం వాట్సాప్ గ్రూప్ లో ఈ స్వేచ్ఛ గురించి చర్చ జరిగింది. విశాల అనే మిత్రురాలు మీరు ఎవరికీ లోబడకుండా స్వేచ్ఛగా ఉన్నారా అని ప్రశ్నించింది. తను స్వేచ్ఛగా లేనని, బాధ్యతలు బంధాలుకు పరిమితమై ఉన్నానని, అందరికీ నచ్చేలా లోబడి వుండడమే బెటర్ అన్న విశాల అభిప్రాయాలు నేను చెప్తుండగా ...
ఊఁ...విశాలగారే కాదు...చాలమంది బాధ్యతలకు, బంధాలకు లోబడే ఉన్నారు. అది తినవద్దు, ఇది తినవద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు...బయట తిరగవద్దు, ఏది కావాలన్న మేము సమకూర్చుతాం, టైముకు తింటున్నామా పడుకున్నామా...ఇత్యాది విషయాల్లో పిల్లల ప్రేమైక ఆంక్షలు...మనకి నచ్చింది స్వేచ్ఛగా తినడానికి లేదు, తిరగాడానికి లేదు...ఒకోసారి కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు, కొందరి విషయంలో పిల్లల నిర్లక్ష్యం, కుటుంబ ఒత్తిళ్లు...వీటి కారణంతో అన్నింటికీ లోబడే ఉంటున్నాం అనుకోవడం కంటే, వాళ్ళకి మనపై, మనకు వాళ్ళపై ఉన్న ప్రేమను, బంధంను గుర్తిస్తే, ఈ లోబడే అనే భావం మనలో రాదు. ప్రేమ ఎప్పుడూ బంధనం కాదు, అది మరింత స్వేచ్ఛనిస్తుందని ప్రియంవద అంటూ, మరి నీవేం చెప్పావని అడగగా -
                 

    
నీవన్నట్లుగా బాధ్యతలు, ప్రేమైక బంధాలు అందరికీ ఉన్నావే. అటు, కుటుంబపరంగా ఒకింత ఒడిదుడుకులున్నప్పటికీ అవగాహనతో  అన్నింటినీ  సరళంగా సమన్వయపర్చుకుంటూ, సంతృప్తికరంగా
ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాను. ఇటు, అంతరాన ఆధ్యాత్మిక చింతనలతో, ఏ చింత లేకుండా,  ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్పానని చెప్తుండగా -  
అనుకుంటాంగానీ, ఎక్కడో చోట మనస్సు బందీగానే ఉంటుంది. నిజంగా నీవు పూర్తి స్వేచ్చగా ఉన్నావా? అదెలా సాధ్యమని అక్కడే ఉన్న ఝాన్సీ అనే స్నేహితురాలు అడగగా...అవును, నా మనస్సు చాలా స్వేచ్ఛగా ఉందని దృడంగా చెప్తూ, కాస్త వివరించానిలా. 
ఇదే ప్రశ్న ఓ సంవత్సరం ముందు విశాల అడిగివుంటే, నా సమాధానం ఎలా వుండేదో గానీ, మీకు తెలుసు కదా,  ఆగష్టు 2020 లో కోవిడ్ బారిన పడడం...నేను సీరియస్ కండీషన్ లో ఉండడం... ఆ క్షణంలో "ఉంటే రాముడిచ్చిన కుటుంబంలో, లేకుంటే రాముని పాదాల చెంత"...అంతేకదా...అని నేను అనుకోగానే, నాలో ఎంతో ధైర్యం...పద్నాలుగు రోజుల పాటు యూరిన్ ద్వార రక్తం పోతుండేది...ఉలిక్కిపడేలా నా గుండె సడి నాకినిపించేది...అయినా చలించక, ఇంటిల్లుపాది కోవిడ్ బారిన పడడంతో వారితో, ఫోన్ చేసి పలకరించే ఆత్మీయులతో మాట్లాడుతున్ననూ... ఆ పద్నాలుగు రోజులూ పడుకున్నా, మగతలో వున్నా, మెలుకువగా వున్నా, నిరాటంకంగా "రామ నామ జపం నాలో". రామ స్మరణ ఓ ధారణ... అప్రయత్నంగా ఓ యజ్ఞంలా సాగే జపం...ఆ రాములోరే చేయించుకున్నారు...లేకుంటే ఆ శక్తి నాకెక్కడిది? అప్పుడే అమ్మవారి స్వప్న దర్శనం...చిత్రంగా రామానుగ్రహంతో పదిహేనవరోజు నుండి నార్మల్ కు వచ్చాను. ఆరోజు నాకు వైద్యమిచ్చిన డాక్టర్ గారు, 'అమ్మా! ఏ దైవాన్ని కొలిచావమ్మా...మిమ్మల్ని నేను గానీ, ఈ మందులు గానీ బ్రతికించలేదు...మీరు నమ్మిన ఆ దైవమే మిమ్మల్ని కాపాడింది అని అన్నారు. 
ఆ మాటలతో నేను ఏ స్థితిని దాటివచ్చానో, రాముని కృప ఎంతలా నామీద వుందో అర్ధమై మూగబోయాను. 
                   

ఆ తర్వాత నుండే, నిరంతరం గాడీ తప్పుతూ ప్రాపంచికత వైపు పరుగులు తీసే నా మనస్సు - ఏ స్థితిలో వున్నా, ఎలా వున్నా "రామ" అనుకోవడం, బాధ్యతలు బంధాలతో ఉరుకులు పరుగులు తప్పకున్నా, తప్పని రామ జపం, ఎవరితో మాట్లాడుతున్నా, మాట మాటకి నడుమ రామ స్మరణం అలవర్చుకుంది. ప్రాపంచిక గమనంలో చిన్న చిన్న ఎత్తుపల్లాలు, చిరు ఒడిదుడుకులున్నను, అన్నింటికీ మించి నాకంటే1.5 సం|| పెద్దయిన చిన్నన్నయ్య అకాల మరణం...అంతరాన్ని బలంగా తాకినను, కొద్దిసేపు మాత్రమే ఆ దుఃఖ స్పర్శ. వెన్వెంటనే మనస్సు రామ స్మరణంతో ఇవేవి మోయక, యదేచ్ఛగా ఆనందంలో ఓలలాడడం...ఏదో అలౌకిక శాంతి... ఇప్పటికీ అన్నయ్యని తలుచుకోగానే వేదనతో భారమౌతుంది మనస్సు...కానీ అది కొన్ని క్షణాలు మాత్రమే...రామ స్మరణతో వెంటనే తేలికైపోతుంది...ఇది అప్రయత్నంగా జరుగుతుంది. గతంలో మంచి అమ్మాయి కోడలుగా రావాలని, కుటుంభీకుల గురించి ఆశ, ఆరాటాలు వుండేవి...ఇప్పుడు అవేమీ లేవు...అంతా భగవదేచ్చ అన్న నిశ్చింత...
ఇలా వుంది నా అంతర గమనం... అటు ఇటు (ప్రాపంచికం, పారమార్ధికం) రెండింటి కలయికే జీవితం...ఇలా సాగుతుంది ప్రశాంతంగా నా జీవనం... ఇప్పుడు చెప్పండి, నేను స్వేచ్ఛగా ఉన్నానా...లేదా? 
                   

కొన్ని క్షణాల మౌనాన్ని బ్రేక్ చేస్తూ, నెమ్మదిగా చెప్పాను - అయితే అందరం ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలి. మన అభిప్రాయాలే మనల్ని ఇబ్బందికి గురిచేస్తుంటాయి. మన ఆలోచనలే అడ్డంకులు. కొన్నింటికి లోబడి ఉన్నామన్నది మన భావనే. మన హృదయంలో సరైన భావనే మన జీవితాల్ని నిర్ధేశిస్తుంది. ముందుగా మనం  ఇతరుల అభిప్రాయాలు అనుభవాలతో ముడిపడి వుండక, మనకు ఏం కావాలో అన్న స్పష్తమైన అభిప్రాయంకు రావాలి. దానికి బలమైన పూనిక ఉండాలి. మనలో మనం నిజాయితిగా ఉన్నామా, లేదా అని గమనించుకోవాలి. మనం మన అంతరంగంలో నిజాయితిగా లేనప్పుడు, పరాయిధ్యాసని అనుభవిస్తున్నట్లే. మన నిజమైన స్థితిని విడిచి, పరాయి స్థితిలో ఉన్నట్లే. ఈ పరాయి స్థితి నుండి స్వస్థితి లోనికి పయనించాలంటే నిరవధిక ప్రార్ధన వలనే సాధ్యమౌతుంది. ప్రాపంచిక బంధాలనుండి మానసిక విడుదల ప్రసాదించేదే భక్తి. ఈ భక్తే స్వేచ్ఛను ప్రజ్వలింపజేసే ఆయుధం. ఈ భక్తే హృదయమందిరంలో పూర్ణంగా మనస్సు లయమయ్యేలా జేసి, లౌకిక ఆనందాన్ని ఇస్తుంది. 
                       

ఆనందం స్వేచ్ఛ అనేవి బాహ్యవనరులలో కాదు, అంతరాన ఉంటాయి. త్రికరణశుద్ధిగా భగవంతునికి శరణాగతమైనప్పుడు మనస్సు దానికదే అదుపులోనికి వస్తుంది. మనస్సుని పవిత్రంగా వుంచుకోవాలి. మనస్సుని పవిత్రంగా వుంచుకోవడమంటే బాహ్యంగా మంచిగా ప్రవర్తించడం కాదు, హృదయంలో మనం మనలా స్వేచ్చగా, పరధ్యాస లేకుండా వుండడమే పవిత్రత...ఇదే చిత్తశుద్ధి.
                      

జీవితం అంటే - నేను, నా కుటుంబం, నా వాళ్ళు, నా సంపాదన, నా హోదా, భేదాలు, ఖేదాలు మోదాలేనా?
ఏదో బ్రతికేసాం అని కాకుండా జీవితం సార్ధకమయ్యేలా అంతరం తృప్తి పడేలా, స్వేచ్ఛగా జీవించేలా సాధనతో చిలికేద్దాం...అమృతం అందుకునేంతవరకు.

స్వేచ్ఛాజీవనమంటే పిల్లలు చెడిపోరా? పెద్దలమైన మనమైన స్వేచ్ఛ అనుకుంటే సంసారంలో కలతలు రావా? అని ప్రశ్నించిన మరో మిత్రురాలికి -
                     

సంసారంలో కొంత సర్దుబాటుతత్త్వం ప్రేమతో అలవర్చుకున్నవారికి స్వేచ్ఛ స్పర్శ అనుభూతమౌతుంది. 
"స్వేచ్ఛా జీవనమంటే అజ్ఞానం, అహంకారం, పెత్తనం, హద్దు మీరడం లాంటి గుణాలతో ఇష్టం వచ్చిన రీతిలో యదేచ్ఛగా నడుచుకోవడం కాదు, ఎంతో కొంత క్రమశిక్షణను అలవర్చుకోకపోతే నిత్య జీవితంలో మనకూ, మూగజీవాలకూ తేడాయే ఉండదు. సహజ సుందరమైన జీవితం క్రమశిక్షణ ఫలితంగానే నడుస్తుంది. విచక్షణ, క్రమశిక్షణలతో కూడుకున్నదే నిజమైన స్వతంత్ర జీవనం. వివేకారాహిత్యంతో యిష్టారాజ్యంగా ప్రవర్తించడం స్వేచ్ఛాజీవనం కాదు" అన్న రామకృష్ణ మఠంకు చెందిన స్వామి చెప్పిన మాటల్ని గుర్తుచేసింది రజిని అన్న మిత్రురాలు. 
ఇంతలో అక్కడే ఉన్న సంధ్య అనే సత్సంగ మిత్రురాలు, అవునవును... నాకు కొన్నిరోజులు క్రితం స్వేచ్ఛ గురించి ఓ మెసేజ్ వచ్చిందంటూ ఈ క్రింద మెసేజ్ షేర్ చేసింది. 

💦✨ స్వేచ్ఛ. 

మాటల్ని వల్లించడం సత్యం కాదు. శాస్త్రాల్ని తెలిసి ఉండడం సత్యం కాదు. మనిషి మాటల్లో మునిగిపోయాడు. మనిషి బంధాల నడుమ బంధీలా ఉన్నాడు. సంతోషంగా ఉన్నానంటాడు గానీ, తాను స్వేచ్ఛగా లేనని అనుకుంటున్నాడు. 
అట్లాంటి మనిషికి స్వేచ్ఛ ఇచ్చినా, అతను దాన్ని అనుభవించలేడు. 

బంధపాశాలకు కట్టుబడితే మనిషికి స్వాతంత్య్రమిచ్చినా స్వీకరించలేడు. వాదాలతో, శాస్త్రాలతో, మాటలలో సత్యం మరుగున పడిపోయింది. అందువల్ల మనం వాటికి అలవాటు పడిపోయాం. 
సత్యాన్ని గుర్తించే అర్హతను కోల్పోయాం. దీన్ని బట్టి ఎవరయితే అస్థిత్వాన్ని గుర్తించలేరో, తమ లోలోతుల్లోకి వెళ్లి తమ అసలు స్వరూపాన్ని చూడలేరో వాళ్లు సత్యాన్ని గ్రహించలేరు.

ఒక పర్వతం మీద ఒక సత్రం ఉండేది. దూర ప్రయాణాలు చేసేవాళ్లు అందులో బస చేసేవాళ్లు. పుణ్యక్షేత్రాలు దర్శించుకునే వాళ్లు ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్లు. ఎందుకంటే ఆ పర్వతం మీద గొప్ప ఆలయముంది. ఆలయాన్ని సందర్శించాలనుకున్న వాళ్లు ఆ సత్రంలో దిగేవాళ్లు.

ఆ సత్రం యజమాని దగ్గర ఒక చిలుక ఉండేది. దాన్ని పంజరంలో పెట్టి సత్రం ముందు పంజరాన్ని వేలాడదీశాడు. దాన్ని ఎంతో ముద్దుగా చూసుకునేవాడు. దానికి ఫలాలు తినిపించేవాడు. దానికి స్వేచ్ఛ అన్నమాట నేర్పించాడు. అది ఎప్పుడూ ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటల్ని వల్లిస్తూ ఉండేది. సత్రంలో దిగిన వాళ్లకు గొప్ప వినోదంగా ఉండేది. వాళ్ళు కూడా దానికి తినడానికి ఏమైనా పెట్టేవాళ్లు. వాళ్ళు పెట్టినది తింటూ, అది ‘స్వేచ్ఛ,స్వేచ్ఛ’ అని అరుస్తుండేది. రాత్రయినా పగలయినా అవే మాటల్ని వల్లిస్తూ ఉండేది. నిజానికి ఆ పక్షికి స్వేచ్ఛ అనే మాటకు అర్థం తెలీదు. అది ఉన్నది పంజరంలో. తను స్వేచ్ఛగా లేనని, పంజరంలో ఉన్నానని, స్వేచ్ఛ అనే మాటకు తనకు అర్థం తెలీదని దానికి స్పృహ లేదు.

ఇలా ఉండగా, ఒక సారి వివేకవంతుడయిన ఒక వ్యక్తి ఆ సత్రంలో దిగాడు. చీకటిపడుతుండగా ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించడంతో చుట్టూ చూశాడు. సత్రం ముందు పంజరంలో చిలుక ఆ మాటలు వల్లిస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయాడు. పంజరం దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. అతన్ని చూసి చిలుక ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంది. అది స్వేచ్ఛగా లేదని, ఆమాటకు దానికి అర్థం తెలీదని, అది పంజరంలో ఉందని అతనికి తెలుసు. అతనికి స్వేచ్ఛ అంటే ఏమిటో  తెలుసు. అతను వెంటనే పంజరం తలుపు తెరచి చిలుకను బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఆ చిలుక బయటకు రావడానికి ఇష్టపడలేదు. అతను బలవంతంగా బయటకు తీసి వదిలిపెట్టినా, మళ్లీ పంజరంలోకి వెళ్లింది. ఎప్పటిలా ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అని అరవడం మొదలుపెట్టింది. రెండుమూడు సార్లు అతను ప్రయత్నించాడు. చివరకు నాలుగోసారి దాన్ని పట్టుకుని, దూరంగా వెళ్లి ఆకాశంలోకి వదిలిపెట్టాడు. అది ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంటూ ఎగిరిపోయింది.

ఆవ్యక్తి ఆనందంతో సత్రానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారు జామునే ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించి, నిద్రమత్తు వదిలించుకుని, లేచి సత్రం ముందుకు వచ్చి చూశాడు. చిలుక పంజరంలో దూరి ‘స్వేచ్ఛ!స్వేచ్చ!’ అంటూ ఉంది.
ఇది చదివాక నిజమే కదా...కొందరు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటారే గానీ, బంధనాల్లోనే ఉండడానికి ఇష్టపడతారు ఆ చిలకలా! ...అని అనుకున్నాం. 
ఒక మూడు రోజులు క్రితం మరల ఇదే టాపిక్ వాట్సాప్ గ్రూప్ లో రావడం... రుక్మిణిజీ అనే మిత్రురాలు 'బాధ్యత లేకపోవడం స్వేచ్ఛ కాదు, స్వేచ్ఛ అనేది పూర్తిగా అంతరంగికమైనది, మన బాధ్యతలలో భగవంతుడు తోడునీడగా ఉంటాడనే పూర్ణ విశ్వాసం మనలో ఉన్నప్పుడు అంతర్లీనంగా అనుభవమయ్యే పరమానందమే స్వేచ్ఛ' అని చెప్పి, కొన్ని ప్రశ్నలు వేయడంతో గతంలో జరిగిన ఈ చర్చ గుర్తుకు వచ్చి స్మరణలో పదిలపర్చుకుంటున్నానిలా...

పై కథా రచయితలకు నమస్సులు.

అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు కోణంలో  - "స్వేచ్ఛ" ...
తదుపరి టపాలో...