13, సెప్టెంబర్ 2012, గురువారం

*శుద్ధ ఆహారము*


భగవంతుడు, ప్రారబ్ధం వదిలించుకొని పరమాత్మ యందు ఐక్యం కావడానికే మానవ దేహం ప్రసాదిస్తాడు. కానీ; మన ఇంద్రియాలద్వారా వివిధ అపవిత్రమైనకార్యాలు చేస్తూ, అశుద్ధఆహారాన్ని స్వీకరిస్తూ, చివరికి ఈ పవిత్రమైన దేహాన్ని మట్టికే అంకితమిచ్చి, ప్రారబ్ధాన్ని పోగొట్టుకోలేక, మరింత పోగుచేసుకొని మరిన్ని దేహాల్నీ మరల మరల పొందుతూ జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, శ్రమిస్తూ దుఃఖితులమౌతున్నాం. 
అందుకే అలా కాకుండా 
ఈ దేహం యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం,
సత్కర్మలు ఆచరిస్తూ, సద్భావనతో చరిద్దాం,
ఆరోగ్యకరమైన శుద్దాహారమునే స్వీకరిద్దాం,
తద్వారా తరిద్దాం.

మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని. 
దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: / 
దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ //
బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.

మరి ఈ శుద్ధఆహారం అంటే ఏమిటీ?
ఆహరవిషయములో వస్తుశుద్ధి (తీసుకునే పదార్ధము శుభ్రతగా ఉన్న మాత్రమే చాలదు, అది ఎటువంటి ధనముచేత, లేక యే విధంగా వచ్చిందో ఆ మార్గము శుద్ధముగా ఉండవలెను), పాత్రశుద్ధి ( వండే, తినే పాత్రలశుద్ధి), వాహక శుద్ధి (వండేవారు, వడ్డించేవారు శుద్ధత కలవారై) ఉండాలి. పాపపు సొమ్ముచే గానీ, పాపపు పనులచే గానీ వచ్చిన వస్తువు మంచిదైనను అది పాపాహారమే యగును. అలాగునే ఇతరులు కష్టపడి మనకై చేసినపనికి తగిన ప్రతిఫలం ఇవ్వక సంపాదించిన సొమ్ముచే భుజించెడు అన్నం పాపాన్నమే యగును. ఇట్టి ఆహారమును తీసుకున్నవారి మనస్సు నిర్మలముగా ఉండదు. శాంతి, దయ, వైరాగ్యాదులు వీరికి కలగవు. 
అటులనే ప్రతిఒక్కరూ వారు స్వభావములు అనుసరించి తీసుకునే ఆహారములో సాత్త్వికం, రాజసము, తామసము అను భేదములు కలవు.
సాత్త్వికాహారము సత్త్వగుణమును వృద్ధి చేయును. సత్త్వశుద్ధిచే చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధిచే ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగును. 
శ్రీ మద్భగవద్గీత యందు పదిహేడవ అధ్యాయంలో తెలిపింది ఇదే -
ఆయుస్సత్వ్త్వ బలారోగ్యసుఖప్రీతివివర్ధనాః /
రస్యాస్స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్వికప్రియాః 
ఆయుస్సును, మనోబలమును, శరీరబలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిగా బాగుగా అభివృద్ధి నొందించునదియు, రసము గలదియు, చమురుతో కూడినదియు, దేహమందు చాలాకాలమునుండి సత్తువ నిచ్చునదియు, మనోహరమైనదియు సాత్త్వికాహార మనబడును. ఈ ఆహారమును సాత్త్వికులు ఇష్టపడుదురు. 
కావున విజ్ఞులు ఇట్టి ఆహారమును స్వీకరించవలెను.
కట్వామ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః /
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకా మయప్రదాః //
అమితముగా చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, దాహము కలుగజేయునవిగాను, మనఃక్లేశం కలుగజేయునట్టి ఆహరం రాజసాహారం అనబడును. ఈ ఆహారమును రాజసులు ఇష్టపడుదురు. ఈ విధమైన ఆహారం దుఃఖశోకరోగములను కలిగించును. 
ఇటువంటి ఆహారమును త్యజించవలెను.
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ /
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ //
సారం నశించి పాచిపోయినట్టి పదార్ధమును, ఒకరు తినగా మిగిలిపోయినదియును, అశుద్ధముగా ఉన్నటియు (భగవంతునికి నివేదనచేయనటువంటివి) ఆహారము తమోగుణమును పెంచును. ఈ విధమైన ఆహారమును తామసులు ఇష్టపడుదురు. 
ఇటువంటి ఆహారమును స్వీకరించరాదు. 
అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృత చిత్తానాం ధర్మస్సమ్యక్ న భాసతే //
అన్నదోషముచేత మనస్సు కలుషితం అయి చిత్తమునందు ధర్మరహస్యం ప్రకాశింపదు.  కావున ఆహరవిషయమును సామాన్యమని తలంచరాదు. ఆహారశుద్ధి తప్పనిసరి.
ఇక భగవంతునికి నివేదన చేసి భగవంతున్ని స్తుతిస్తూ ఎందుకు భోజనం చేయాలంటే - మనం తీసుకున్న మిశ్రమాహారమందలి నిరుపయోగమైనదానిని మలమూత్రస్వేదములుగా బహిర్గతమొనర్చి, సారమును మాత్రమే గ్రహించి, అందలి పిండిపదార్ధములను విడగొట్టి గ్లూకోజ్ గా  మార్చి దేహములోని సూక్ష్మాణువులకు అందించి, కొవ్వుపదార్ధములను వేరుచేసి చర్మమునకు, కీళ్ళ సందువులకు అందించి, అందలి కాల్షియమును ఎముకలకు అందిస్తూ...... ఇలా సప్తధాతువులకు ఆహారం అందడానికి కారణం -
 
మనం భుజించే ఆహారంను జీర్ణమయ్యేటట్లు చేస్తున్న "జఠరాగ్ని". ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి, ఆహరపదార్ధములను జీర్ణమయ్యేటట్లు చేస్తుంది ఈ జఠరాగ్నే!
ఈ విధంగా మనం తీసుకున్న ఆహరం,
 జఠరాగ్ని
 
చే పక్వంకానిచో, రక్తాదులద్వారా శరీరమంతటను వ్యాపింపలేదు. కావున జఠరాగ్ని శరీరమున కీలకస్థానం ఆక్రమించుకొని యున్నది. అంతటి కీలకమైన జఠరాగ్నిరూపమున భగవానుడే ఉండి, శరీరమునకు పుష్టిని చేకూర్చుతున్నట్లు గీత యందు పదిహేనేవ అధ్యాయమున పద్నాలుగవ శ్లోకం ద్వారా తెలుస్తుంది.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః /
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //
(నేను వైశ్వనరుడను జఠరాగ్నిగానయి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో కూడుకొని నాలుగువిధములగు అన్నమును వచనము చేయుచున్నాను.
నాలుగు విధములగు అన్నము :- 1) భక్ష్యమనగా దంతములచే కొరికి తినెడు గారెలు మొదలగు ఘనపదార్ధములు. 2) భోజ్యమనగా దంతములతో కాస్తా నమిలి  భుజించెడు క్షీరాన్నాదులు లాంటివి. 3) లేహ్యమనగా నాలుకచే చప్పరించి తినెడు పచ్చడి లాంటి పదార్ధములు 4) చోష్యమనగా నాలుకచే చప్పరించకనే ఆహారముగా తీసుకొనెడు క్షీరం లాంటి పానాదులు).
అందుకే భోజనంకు ముందు ఈ శ్లోకమును మరియు  బ్రహ్మార్పణం బ్రహ్మ....... క్రింద వివరించిన ఈ శ్లోకమును కూడా పఠించి, 
జీవులకు ఇంతటి మహోపకృతి నొనర్చుచున్న ఆ పరమాత్ముణ్ణి స్తుతిస్తూ, భగవంతునికి నివేదన చేసిన ఆహరమునే దైవభావముతో భుజించడం పరమోత్తమం. 
{ఇందుకే పూర్వం ఆహారమును భుజించుటకు ముందు  భగవంతునికి నివేదన చేసిన పిమ్మట దేహమును క్షేత్రముగాను, ఆత్మను క్షేత్రమందు గల సర్వేశ్వరునిగాను భావన చేయుచు, ఆ ఆహారమును స్వీకరించే ఆచారముండేది. ఇటువంటి ఆచారములవలన క్రమేపి శివ జీవైక్య జ్ఞానం కలుగుతుంది. 
ఇక్కడ నా చిన్నప్పటి విషయం ఒక్కటి జ్ఞాపకం వస్తుంది. మా చిన్నతనంలో మా అమ్మమ్మ మాకు అన్నం తినిపిస్తూ ఇది మనూరి బంగారమ్మతల్లి ముద్ద అనీ, ఇది బెజవాడ కనకదుర్గ ముద్ద అనీ, ఇది రాయగడ మజ్జిగౌరమ్మ ముద్ద అనీ, ఇది కంచి కామాక్షిది, ఇది కాశీ విశాలాక్షిది, ఇది తిరుపతి వెంకన్నది, ఇది భద్రాది రామన్నది, ఇది శ్రీశైలం మల్లన్నది, ఇది సింహాద్రి అప్పన్నది........అంటూ ఒకొక భగవన్నామముతో అన్నం ముద్దలను పెట్టడం బాగా జ్ఞాపకం. కానీ అలా తినిపించడంలో పరమార్ధం కొంతకాలం క్రితం వరకు నాకు తెలియలేదు. చిన్నప్పటినుండి దైవ స్మరణ చేయిస్తూ పెద్దలు ఈ రీతిలో మనకు అన్నం తినిపించడంలో ఓ మంచి ఆధ్యాత్మిక బోధ ఉన్నదని తెలియక నా పిల్లలకు నేనలా చేయలేకపోయాను. నా పిల్లలు అన్నం తినమని మారాం చేసినప్పుడు, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్నది, ఇది అక్కది, ఇది అమ్మమ్మది, ఇది నానమ్మది, ఇది తాతయ్యది,  ఇది పిన్నది, ఇది అత్తది.......... అనీ సన్నిహిత బంధువుల పేర్లు చెప్తూ తినిపించేదానిని. నాలా తెలియని తల్లులు ఎందఱో ఉండవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను - అప్పటి ఆచారవ్యవహారాల్లో ఉన్న గొప్పతనమునూ మరియు మన పూర్వీకులు, పెద్దవారు వారి వారి పనులద్వారా ఉగ్గుపాలనుండియే తత్త్వబోధ చేసేవారని. అది గ్రహించక అజ్ఞానంలో నేనున్నానని. ఇక్కడ మరొక అనుభవపూర్వక విషయమును కూడా నేను చెప్పాలనుకుంటున్నాను - ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా ఏర్పడిన అవగాహన వలన మన ఆచారవ్యవహారాల్లో ఉన్న అంతరార్ధం అర్ధమై, వాటిని ఆచరణలో పెట్టడంతో గతంలో కంటే  నాదిప్పుడు ఎంతో సరళమైన ప్రశాంతకర జీవనమైంది}
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ /
బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
హోమసాధనములు {సృక్ (సృక్ అనగా హోమములో, కొయ్యతో చేయబడిన గరిటివంటి యే పాత్రచే హవిస్సు అన్నాదులు హోమింపబడునో దాని పేరు), స్రువం (స్రువమనగా హోమములో, కొయ్యతో చేయబడిన యే పాత్రచే ఘ్రుతమును ఎత్తి హోమింతురో దానియొక్క పేరు) మున్నగునవి}, హోమద్రవ్యములు (అన్నం, నెయ్యి మొదలగునవి), హోమాగ్ని, హోమం చేయువారు, హోమం చేయబడింది....అన్నియును బ్రహ్మస్వరూపములే అన్న బ్రహ్మభావమును కలిగి బ్రహ్మార్పణ భావంతో ఈ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు..... క్రమేపి బ్రహ్మస్వరూపమును పొందగలడు.
ఈ శ్లోకమందు హోమం గురించి చెప్పబడినప్పటికిని సమస్త కార్యములందు ఈ ప్రకారమే, అంటే సమస్తమూ బ్రహ్మమయమే అన్న భావనతో చేసినచో - ప్రతీ కార్యమందునూ చేయువారు, చేయబడింది బ్రహ్మస్వరూపములే యగును. 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని చాందోగ్యోపనిషత్ తెలిపిన విధంగా ఈ సమస్తమూ బ్రహ్మమే అను భావమును దృఢపరచుకొని సర్వకార్యాలు నిర్వర్తించువాడు బ్రహ్మస్వరూపమే పొందును. ఈ ప్రపంచమున సమస్తమూ బ్రహ్మస్వరూపమేకానీ, అన్యం కాదు. ఈ విషయం సదా జ్ఞప్తియందు ఉంచుకొని, చిత్తమందు బ్రహ్మభావన, దైవభావన కలిగియుండి అన్నాదులు స్వీకరించినచో, ఈ స్వీకరించనెడి ప్రక్రియ ఓ యజ్ఞమే యగును, భుజించు పదార్ధము అమృతమే యగును. 
పూజితం హ్యశనం నిత్యం బలమూర్జం చ యచ్ఛతి /
అపూజితాం తు తద్భుక్తముభయం నాశయేదిదమ్ //
దైవభావముతో భుజించెడు అన్నం సత్త్వగుణమును, బలమును, దివ్యమైన ఓజస్సును కలుగజేయును. అట్లుకాక భుజించెడు ఏ పదార్ధమైనను ఆత్మబలమును, తేజస్సును నశింపజేయును.
బ్రహ్మభావనతో భుజింప అభ్యసించువారికి ఈ దేహం దేవాలయముగాను, ఆత్మ పరబ్రహ్మ స్వరూపముగాను బోధపడును. 
అటులనే భోజనం చేయునప్పుడు ఇట్టి భావంతో మౌనంగా భుజించువారు ఉత్తమ సాత్త్వికులు. భోజనం చేయునప్పుడు వ్యర్ధ విషయములు మాట్లాడుచు భుజించువారు రజోతామసతత్త్వం కలవారగుదురు. 

మానేన భోజయిత్వా తు స్వర్గం ప్రాప్తో న సంశయః /
ప్రజల్పన్ భుజంతే యస్తు తేనాన్న మశుచిర్భవేత్ //
పాపం న కేవలం భుంక్తే తస్మాన్మౌనం సమాచరేత్ /
ఉపవాసనమం భోజ్యం జ్ఞేయం మౌనేన నారద! //
మౌనంతో భుజించువారు స్వర్గమును పొందగలరు. దీనియందు సందేహం లేదు. మాట్లాడుతూ భుజించిన అన్నము అశుచి అగుతున్నది. వ్యర్ధవిషయాలు మాట్లాడుచు భుజించు అన్నం అన్నమే కాదు, పాపరూపమే యగును. మౌనంతో భుజించిన భోజనం ఉపవాస సమానమే అగుచున్నది. ఉపవాసం వలన ఎంత ఆత్మశుద్ధి కలుగునో అంత పుణ్యం మౌనంగా భుజించడం వలన కలుగును.

ఈ రీతిలో సాత్త్వికమైన ఆహారమును మౌనముగా దైవానికి నివేదనచేసి, దైవమును స్తుతిస్తూ తీసుకున్న ఆహారం శుద్ధాహారం అవుతుంది. 
శుద్ధ ఆహరముచే మనస్సు నిర్మలమవును. శాంతి, దయ, వైరాగ్యం, దైవచింతన, బ్రహ్మభావన కలిగి పరబ్రహ్మప్రాప్తి పొందవచ్చును. 
పుత్రోత్పత్తికి హేతువగు శుక్లశోణితం ఏ అన్నపానీయములచే స్త్రీపురుషులకు ఏర్పడునో అట్టి అన్నము శుద్ధముగా ఉన్నచో - దైవ, మాతాపితరులయందు, గురువులయందు, వేదశాస్త్రాలయందు, సాదు సత్పురుషులయందు విశ్వాసం గల ధర్మాతులైన వంశోద్ధారక సంతానం కలుగుదురని శాస్త్రవచనం. 

29 కామెంట్‌లు:

  1. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ /
    బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //..

    భుజించే ముందు పఠించే ఈ మంత్రార్థ వివరణ బాగుంది...
    మంచి పోస్ట్ భారతి గారూ!
    అభినందనలు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  2. శ్రీ గారు!
    నా ప్రతీ పోస్ట్ చదివి మీ అభిప్రాయమును తెలుపుతున్నందుకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  3. ఇంత వివరంగా మనసుకి హత్తుకునేలా ఎలా రాసారో అని చదివిన వెంటనే నాలో కలిగిన భావన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మగారు!
      "పద్మార్పిత" మదిలోని భావాలను, ఆ చిత్రాలను చూస్తున్నప్పుడు అచ్చం మీలానే అనుభూతి చెందుతాను... మనస్సుని హత్తుకునేలా ఇంత చక్కగా ఎలా వ్రాస్తారో నని! నిజమండి, మీ భావాలను చదువుతున్నప్పుడంతా ఓ అబ్బురమైన భావానుభూతి. ఆ అనుభూతిని అక్షరీకరించలేక, నా స్పందనను తెలపలేక మౌనంగా అభినందిస్తూ ఆరాదిస్తుంటాను. నేను ఎంతగానో అభిమానించే మీరు నా మదిలో మీయందు ఉన్న ఓ భావనని మీ భావస్పందనగా తెలపడం ఆనందంగా ఆశ్చర్యంగా ఉందండి. ధన్యవాదాలండి.

      తొలగించండి
  4. మీ బ్లాగులో చాలా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయండీ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వర్మ గారు!
      మీరు 'స్మరణ' ని సందర్శించించడం సంతోషంగా ఉందండి.
      ధన్యవాదాలండి.

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. శ్రీనివాస్ గారు!
      మీకు నచ్చినందుకు సంతోషమండి. ధన్యవాదాలండి.

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. అజ్ఞాత గారు!
      మీ పేరు చెప్తే బాగుంటుంది.
      నిజమే... మీరన్నట్లు ఆచరణ చాలా ముఖ్యం.
      ధన్యవాదాలండి.

      తొలగించండి
  7. భారతిగారూ, మీ ప్రతి పోస్ట్ నేనూ చదువుతాను , కానీ నాకు అంతగా మీరు రాసే విషయాల మీద జ్ఞానం ఉండదు.
    కానీ మీ వివరణ బాగుంటుంది. అంతే లెండీ పండితులు పండితులే, పామరులం ఎలా అర్ధం కావాలి చెప్పండీ..

    రిప్లయితొలగించండి
  8. నా ప్రతి పోస్ట్ మీరు చదువుతున్నారంటే చాలా ఆనందంగా ఉందండి. అందుకు ధన్యవాదాలండి.
    అరెరే ఎంత మాట మేరాజ్ ఫాతిమా గారు! ఏదో కొద్దిగా ఆధ్యాత్మిక విషయాలను అవగాహన చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఆచరణలో పెడుతున్నాను గానీ, నాకు అంత జ్ఞానం లేదండీ.
    అయిన మీరు మరీనూ...... 'గృహహింస' అంటూ హాస్యభరితంగా ఓ వాస్తవికతకు దర్పణం పడుతూ, 'కనబడుటలేదు' అంటూ అల్లరి అల్లరిగా పండుమామ, బంగారు మరదలులతో అలరిస్తూ, 'బహుమతి' లో అనంత తీవ్ర ఆవేదనకి వేసిన అక్షర శిక్షను తెలుపుతూ, అబినవ బ్రహ్మ అంటూ గురువులకు 'అక్షరాంజలి' అర్పిస్తూ, నా....నేను....నాకై....నాలో......దాగిపోతున్నాను.....అంటూ 'అంతరాన' హృదయావిష్కరణ చేస్తూ, హృద్యమైన కధాంశం 'బయ్యం' తో మనస్సులను కదిలించి, నిజాయితిగా ఉండే స్థైర్యాన్ని, మంచికోసం పోరాడే దైర్యాన్ని, నిస్సహాయులకు ఆదుకునే శక్తిని, క్షమించబడడం క్షమించడం అనే సద్గుణములను ప్రసాదించమని 'ఈద్ ముబారక్' లో భగవంతున్ని స్తుతించిన మీకు అర్ధం కానివంటూ ఏమైనా ఉంటాయా మేరాజ్ గారు?

    రిప్లయితొలగించండి
  9. భారతి గారూ, మొదటగా మీకు అభినందనలు ఎందుకో తెలుసా మంచి మనస్సు ఉన్నందుకు.
    చాలు ఆ ఆభరణం మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకొని వెళ్తుంది. భారతి గారూ ఇతరులలోని మంచిని మెచ్చుకోవాలంటే సంస్కారం ఉండాలి. అది మీలో ఉంది.
    ఇకపోతే నేను పామరురాలిని అన్నది ఎందుకంటే మీ ఆద్యాత్మక రచనలు చదివి అందరూ వాటిని విశ్లేషించి ఉన్నారు , నేను బాగుంది అని సింపుల్ గా అనటం తప్ప ఏమి చేయలేక పోయాను. నా రచనలు మీ వ్యాఖ్య లో మెరిసి ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా.. మరోమారు ధన్యవాదాలు...మెరాజ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేరాజ్ ఫాతిమా గారు!
      ఏదైనా మన దృష్టికోణం బట్టే ఉంటుంది. మీ మంచి మనస్సుకు అంతా మంచిగానే కన్పిస్తుంది. ఇక నా రచనలు చదివి, మీ స్పందనను చిరు మాటలో తెలిపినా చాలండీ - మీ ఆ చిరు స్పందనే నాకు అనంతమైన ఆనందమును ఇస్తుంది. ఇక మనకి నచ్చిందీ, ఇష్టమైనది పదే పదే జ్ఞాపకం వస్తాయి. మీ రచనలంటే నాకు ఇష్టం. నాకిష్టమైన మీ రచనలన్నిటినీ కాకపోయినా, కొన్నింటిని అందుకే ప్రస్తావించాను. నిన్న చదివిన 'అంతర్వేదన'....... మీలో కదలాడిన భావాలకు తగ్గ ఆ పదప్రయోగాలు........ బాబోయ్......... మీకున్న పదజాల ప్రజ్ఞకు జోహార్లండి.

      తొలగించండి
    2. భారతి గారూ, మీ ప్రశంసకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

      తొలగించండి
  10. అమ్మా!

    ''యెట్టి ఆహారమో అట్టి ఆలోచన'' - భగవాన్ శ్రీ సత్య సాయి ఉవాచ !!
    input ని బట్టి output వుంటుంది.
    అతి గా ఉష్నంగా ఉన్న అతి శీతలంగా ఉన్న ఆహార పదార్థాలు రాజసిక తామస గుణాలకు ప్రేరకాలైతే,
    సమ ఉష్ణోగ్రత (room temperature ) కలిగిన ఆహారం తీసుకోవటం సత్వ శుద్ధికి దోహదం
    ఏమండి !! oka request

    యమస్య కరుణ నాస్తి,
    క్షీణం ఆయుహు దినే దినే !!
    so కిం కర్తవ్యం?
    హరి కీర్తనం
    హరి అంటే మోక్షస్థితి
    కీర్తనం అంటే అది పొందేందుకు చేసే ప్రయత్నం సాధన

    సో మీ నుంచి మాకు మరింత ప్రేరణ దాయక భక్తి జ్ఞానవైరాగ్య ఉపకరణాలు అందాలని ఆకాంక్షిస్తూ !!

    nice post

    ?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందుకో ? ఏమో !
      శివ గారు!
      'యెట్టి ఆహారమో అట్టి ఆలోచన'
      హరి కీర్తనం
      చక్కటి మాటలను తెలిపారు.
      ధన్యవాదాలండి.
      తప్పకుండ నాకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను 'స్మరణ' లో స్మరిస్తాను.

      తొలగించండి
  11. http://endukoemo.blogspot.in/2012/08/bhagavadgeetha-by-swamy-brahmananda.html

    అమ్మ! ఇక్కడ Delhi కి దగ్గరలో అక్షర ధామం అని స్వామి నారాయణ వారు temple ఉన్నది, వీరు కూడా ditto మన అది శంకరుల మల్లెనే, మనవారు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేసి యావత్ భారతావనిని పావనం చేస్తే ఈ స్వామి నారాయణడు, ఉత్తర భారతావని నుంచి దక్షిణ భారతానికి వచ్చి యావత్ భారతావనిని పరమ పవిత్రమొనర్చారు. పై link లో వారి సాధన జీవిత కథ విశేషాల సమాహారం ఉన్నది మీరు మన ఇతర bloggerS తప్పక వీక్షించగలరు !!
    సాయిరాం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివ గారు!
      చక్కటి విషయాలను తెలియజేశారు. అలానే అందరికీ ఉపయుక్తమైన లింక్ ని తెలిపినందులకు ధన్యవాదాలండి.
      సాయిరాం.

      తొలగించండి
  12. మీరు అన్ని పురాణాలలోని ఆహార సంబంధ విషయాలు ఏర్చి కూర్చిమాకు అందించారు.అలాగే ప్రక్రుతి జీవనంలో కూడా మంతెన గారు ఇలాగే చెబుతారు.వాటిలో మేము కొన్ని పాటిస్తాము.చాలా చక్కటి పోస్ట్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవిశేఖర్ గారు!
      మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములండి.
      వినాయకచవితి శుభాకాంక్షలండి.

      తొలగించండి
  13. వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండి.
      మీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలండి.

      తొలగించండి
  14. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    లాస్య రామకృష్ణ
    బ్లాగ్ లోకం

    రిప్లయితొలగించండి
  15. లాస్య గారు!
    ధన్యవాదాలండి. మీకు, మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలండి.

    రిప్లయితొలగించండి
  16. భారతిగారికి, నమస్కారములు.
    ఆహరశుద్ధి గురించి గూగుల్ సెర్చ్ చేస్తుండగా మీ ఈ పోస్ట్ చూడడం జరిగింది. బాగుంది మీ పోస్ట్.
    ఈ మద్య నేను ధ్యాన తరగతులకు వెళ్తున్నాను. అచ్చట ఈ ఆహార శుద్ధి, నియమములు గురించి కొన్ని నియమ నిబందనలు తప్పనిసరి అంటున్నారు. ముఖ్యంగా మాంసాహారం హింసాపూర్వక ఆహారమని, జీవహింస మహా పాపమని, దానిని పూర్తిగా విడిచిపెట్టమని, అప్పుడే మీకు ధ్యానం, జ్ఞానం కల్గుతాయని చెప్తున్నారు. ఇదే నిజమైతే శాకాహారంలో జీవం లేదా? ఉంది కదా, మరి అవి తినడం హింస కాదా? అంతకంటే మిక్కిలిగా మరో సందేహం కల్గుతుంది ... హింసారహిత ఆహారమును భుజించువారు (బ్రాహ్మణులు తదితరులు) అందరూ ధ్యానులూ, జ్ఞానులూ కావాలి కదా! మరి నేను చూసినంతవరకు అలా లేదు.
    ఈ విషయంపై కాస్త మీ అభిప్రాయంను తెలపగోరుచున్నాను.

    రిప్లయితొలగించండి
  17. శైలజగారికి, నమస్కారమండి.

    మీ సందేహాలకు నాకు తెలిసినంతవరకు శుద్ధ ఆహారం (ద్వితీయ భాగం) నందు తెలిపాను. చూడగలరు.

    రిప్లయితొలగించండి