16, అక్టోబర్ 2012, మంగళవారం

లేవండి! మేల్కోండి! గమ్యాన్ని చేరుకోండి! (స్వామి వివేకానందుని ప్రబోధాలు)

సమస్త విశ్వంలోను ఉత్తమోత్తమైన శరీరం ఈ మానవదేహమే. మానవుడే సర్వోత్తమ జీవి. సర్వోత్తమ జీవితం విజయవంతంగా గడపగలిగే శక్తి మానవునికే ఉంది. అందుకే మనం ఎలా జీవించాలో మనమే నిర్ధేసించుకోవాలి. 
ముందుగా ఒక ఆదర్శవంతమైన లక్ష్యాన్ని తీసుకోండి.ఆ లక్ష్యాన్నే జీవితంగా గడపండి. ఆ లక్ష్యాన్నే సదా భావించండి, ధ్యానించండి, జీవనాడిగా చేసుకోండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతిభాగాన్ని ఆ లక్ష్యంతో మమేకం అయ్యేటట్లు చేయండి. ఇదే విజయరహస్యం. దేనినైన మనం సాదించగలం. ముందుగా ఆత్మవిశ్వాసం కలిగియుండాలి. ఇదే పరిపూర్ణ వికాస మంత్రం. ఆత్మవిశ్వాసమే వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. శక్తి అంతా నీలోనే ఉంది. అది తెలుసుకొని ఆ శక్తిని బయటికి తీసుకురా. ప్రతీపనినీ, ఏ కార్యానైన నేను సాదించగలనన్న సంకల్పబలాన్ని పెంచుకో. నీ సంకల్పం గట్టిదైతే పాము విషం కూడా నిన్నేమి చేయలేదు.
ఒకటి ముందుగా గుర్తించండి - 

మనమున్న ప్రస్తుతస్థితికి మనమే బాధ్యులం. ఏం కావాలని మనం అభిలాషిస్తామో ఆ ప్రకారంగా మనల్ని మనం రూపుదిద్దుకోగలం. ఆ సామర్ధ్యం మనకుంది. ఇప్పుడు మనమున్న వర్తమానస్థితికి మన పూర్వ కర్మలు కారణమైతే, అదే కారణాన్ని బట్టి, మనం కోరిన విధంగా మన భవిష్యత్తును ప్రస్తుత కర్మల ఫలితంగా మనం రూపొందిన్చుకోవచ్చును. అందుచేత మనం ఏ తీరుగా నడుచుకోవాలో మనమే నిర్ణయించుకొని ప్రవర్తించాలి. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చుదిద్దుకుంటారో, ఆ విధంగా ఎదుగుతారు. బలహీనులుగా భావించుకుంటే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులని భావించుకుంటే బలవంతులే అవుతారు. బలహీనతకు పరిష్కారం బలహీనతను చింతించటం కాదు; బలాన్ని గురించి ఆలోచించటమే! మీలో నిబిడీకృతమై ఉన్న బలాన్ని గుర్తించండి.బలమే ప్రాణం. బలహీనతే మరణం. బలమే ఆనందం, శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఃఖం, నరక సదృశ్యం.
అపజయాలకు వెనకంజు వేయకండి. లక్ష్యసాదనను అంటిపెట్టుకొనే ఉండండి. ప్రయత్నంలో వెయ్యిసార్లు అపజయం ఎదురైనా పట్టువదలక మరోమారు ప్రయత్నించండి. విజయాన్ని సాధించలంటే అద్భతమైన పట్టుదల, సంకల్పశక్తిని కల్గియుండి పనిచేయాలి.అప్పుడే మీ గమ్యాన్ని మీరు తప్పకుండ చేరుతారు. పవిత్రత సహనం పట్టుదల వీటన్నిటికి మించిన ప్రేమ విజయసాధనకు అత్యంతావసరం. సంపూర్ణ ప్రేమభావం కలిగియుండాలి. ప్రతిజీవిలోను భగవంతుడు ఉన్నాడనే పరమసత్యాన్ని అవగాహన చేసుకోవాలి. ఎవరు జీవారాధకులో వారే నిజమైన దైవారాధకులు. పవిత్రంగా, ప్రేమగా ఉండటం, పరులకు మంచి చేయడం - ఇదే పూజలన్నింటి సారాంశం.
ధనార్జనలోగాని, దైవార్చనలోగానీ లేక ఏ ఇతర కార్యాచరణలోగాని ఏకాగ్రతాశక్తి  ఎంత బలవత్తరంగా వుంటుందో కార్యసిద్ధి అంత బాగా సమకూరుతుంది. ఈ ఏకాగ్రత ద్వారానే సత్త్వరజస్తమో గుణాత్మకమైన మనస్సు జయింపబడి, అవలయున్న జ్ఞానకాంతి వెల్లువలా ప్రసరిస్తుంది. మంచి చెడు ఆలోచనల సముదాయమే మనస్సు. మనం పవిత్రులమై మంచి ఆలోచనలకు తగిన ఉపకరణాలుగా మారితే అవి మనలో ప్రవేశించి ఘనకార్యాలను సాధిస్తాయి. ఒక్క క్షణమైనా లేదా ఏ ఒక్క విషయంపైనైనా మనస్సును నిగ్రహించలేని మనం స్వతంత్రులమా??? స్వేచ్ఛాజీవులమా........ఆలోచిం
చండి. 
నిగ్రహం లేని మనస్సు పతనదిశగా పయనింపజేసి వినాశనానికి దారి తీస్తుంది. నిగ్రహించబడ్డ మనస్సు మనల్ని సంరక్షిస్తుంది. సర్వస్వతంత్రులను చేస్తుంది. మనిషి మనస్సు యొక్క శక్తి అపారం. అది ఎంత ఏకాగ్రత నొందితే, అంత శక్తివంతమౌతుంది. ఇదే మనస్సు మర్మం. సంకల్పశక్తితో మనస్సుని తుచ్చమైన ప్రాపంచిక సుఖాలకోసం కాకుండా, అంతరంగిక వికాశానికి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వినియోగించాలి. ఈ ప్రపంచం మనకు కనబడేతీరు మన మానసిక పరిస్థితి మీద ఆధారపడియుంటుంది. ఈ ప్రపంచం మనపట్ల ఎలా వుందని భావిస్తామో, ఆ భావాన్ని రూపొందించేది మన స్వకీయ మానసిక దృక్పధం మాత్రమే. పచ్చకామెర్లు వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. వస్తువులను అందంగా, అందవికారంగా కనిపింపజేసేవి మనభావనలే. ఈ ప్రపంచమంతా మన మనస్సులోనే ఇమిడివుంది. అందువల్ల సమ్యక్ దృష్టిని అలవర్చుకోవాలి. స్వప్రయత్నంతో మన ఔనత్యం కోసం మనమే సచ్చీరులుగా మారాలి. అటులనే లక్ష్యంపై ఉండే శ్రద్ధ సాధనపైన ఉండాలి. గమ్యంపై మనకు ఎంత శ్రద్ధ వుంటుందో, దాని గమనం పై అంతే శ్రద్ధ ఉండాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్'.
నీవు గతంలో పొరపాట్లు చేయవచ్చు. నీలో దోషాలు ఉండవచ్చు. ఐతే ఏం? ఇకపై ఆ పొరపాట్లు మరల చేయకుండా నీ దోషాల్ని నీవు సంపూర్ణంగా సరిదిద్దుకోగల్గితే భవిష్యత్తులో నీవే భగవత్సరూపంగా పరిణమించవచ్చు. మానవులు సాధారణంగా తమ దోషాలను సాటివారి మీద మోపుతారు. అలా ఇతరుల మీద నెట్టడానికి వీలుకాకపోతే ఆ నెపాన్ని దైవం మీద కానీ, తాము సృష్టించిన విధివ్రాత అనే భూతం మీద కానీ నెట్టేస్తారు. విధి అనేది ఎక్కడ ఉంది? విధి అంటే ఎవరు? ఎవరు చేసుకునే కర్మ వారు అనుభవించక తప్పదు. మన విధిని మనమే రూపొందించుకుంటున్నాం. పిరికివారు, పనికిమాలిన మూర్ఖులు మాత్రమే 'ఇది విధి వ్రాత' అంటారు. "నా కర్మకు నేనే కర్తను" అనేవాడే ధీశాలి, విజయశీలి! ఈ దుఃఖమంతా నా కర్మఫలితమే. అందుచే దీన్ని తొలగించటం కూడా నా చేత మాత్రమే జరగాలని(సాధ్యమని) గ్రహించిన వారే బలవంతులు. మనకు కావాల్సిన బలం, సహాయం, సమస్తమూ మనలోనే ఉన్నాయి.
నీవు మోక్షం పొందకపోయినంతన మాత్రాన మునిగిపోయినదేమిటి? పవిత్రతాపూర్ణులై, మనసా వాచా కర్మేణా త్రికరణశుద్ధిగా తమ పరోపకార్యాలద్వారా పరులను సంతోషపరచడం, ఇతరులలోని సౌశీల్యాన్ని పరమాణువంతటి దాన్నైనా పర్వతమంతగా పెంచి శ్లాఘించడం....... ఇత్యాది మంచి లక్షణాలు ద్వారా తమ హృదయాలను వికసింపజేసుకునే వారే మహాత్ములు. భగవంతుడుపై నమ్మకం లేనివాడు నాస్తికుడు కాడు; తనపై తనకి నమ్మకం లేనివాడే నాస్తికుడు.
నా ప్రియమైన సోదరీ సోదరులారా!
లేవండి!
మేల్కోండి!
గమ్యాన్ని చేరుకోండి!
  

2 కామెంట్‌లు:

  1. మా ఇంట్లో స్వామి 5 అడుగుల వివేకానందుని పెయింటింగ్ ఉంది...
    ఆయన chikago ఉపన్యాసాలు చదివి తీరాల్సినవి.
    ఆయన బోధనలో ఒక ఆకర్షణ ఉంది...
    ఆయన బోధనలు పుస్తక రూపంలో చదివినా..
    ఒక ఉద్వేగానికి లోనౌతాము...
    భారతి గారూ!...
    చక్కని పోస్ట్...అభినందనలు...
    మీకు శరన్నవరాత్రుల శుభాభినందనలు...@శ్రీ

    రిప్లయితొలగించండి
  2. శ్రీ గారు!
    వివేకానందుని బోధనలో ఓ ఉత్తేజం ఉంటుంది. మీరన్నది నిజం.... ఓ విధమైన ఉద్వేగానికి లోనౌతాం.
    మీ అభినందనలకు అభివందనములు.
    మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి