28, నవంబర్ 2012, బుధవారం

ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు

ప్రకృతిలో పరమాత్మతత్త్వం ప్రతిబింబిస్తుంది. ప్రకృతిలో ప్రతీది సృష్టికర్త నియమానుసారం నడుస్తూ, సృష్టికర్త సందేశాన్ని సకల మానవాళికి అందిస్తుంది. ప్రకృతితో సహజీవనం చేసే పశుపక్షాదులు కూడా భగవంతుడు తమని సృష్టించినప్పుడు ప్రాసదించిన సహజగుణంలోనే ఉంటూ, సృష్టికర్త సందేశాన్ని తెల్పుతాయి. అవన్నియూ ఎలా జీవించాలో, ఏం నేర్చుకోవాలో మానవునికి తెలియజేస్తునే వుంటాయి. 
భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నీరు, అగ్ని, గాలి, నది, సముద్రం, పక్షులు, చెట్టు,పువ్వు............... అన్నీ మానవావళి శ్రేయస్సుకీ, మానవజన్మ సార్ధతతకు కావాల్సిన సందేశాలను తమ మనుగడ ద్వారా ఇస్తూనే వుంటాయి. అది ఎలాగో ఓసారి పరిశీలిద్దాం. 
                                                               భూమి
          
             గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను, పుష్ప ఫలవృక్షాలను, ప్రాసాదిస్తూ, అలానే, మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కల్గిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా - క్షమత్వమును, ఓర్పునూ, భూతదయను కల్గివుండాలన్న సందేశం "భూమి"ది.

                                                             ఆకాశం

            వచ్చి పోయే మేఘాల వలన మలినపడకుండా, సూర్యచంద్రులు, నక్షత్రాలు, వాయువు తనతో ఉన్నా, వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరుచుకోకుండా, నిర్మలంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా వచ్చే పోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని, ఎన్ని బంధాల మద్య ఉన్నా  వాటితో సంగత్వం కల్గియుండక నిర్మలంగా వుండాలన్న సందేశం "ఆకాశము"ది. 

                                                             సూర్యుడు

             ఒక చిన్న మడుగైనా, పిల్లకాలువైనా, నదైనా, మహాసముద్రమైనా అన్నింటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ, అలానే, నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కన్పించడం ద్వారా - మానవుడు సమత్వదృష్టి కల్గియుండాలని, అలానే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరములయందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశము "సూర్యుడు"ది.

                                                             చంద్రుడు

             వెలుగూచీకటలతో వృద్ధిక్షయాలను పొందడం ద్వారా - జీవితంలో సుఖదుఃఖాలు సహజమనే సందేశం "చంద్రుని"ది.
                                                               నీరు

           ఎటువంటి మలినాలైనను వాటిని శుద్ధిచేసి తాజాదనమును, నిగారింపును తీసుకురావడం ద్వారా - మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వము కల్గియుండాలన్న సందేశం "నీటి"ది. 
                                                                అగ్ని

            స్థూల మాలిన్యాలని హరింపజేసి, ప్రకాశిస్తూ, కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా - మానవుడు కూడా కర్మపాశాలను హరింపజేసుకొని భక్తిజ్ఞానంలతో ప్రకాశించాలన్న సందేశం "అగ్ని"ది. 

                                                              గాలి

         అన్నిచోట్ల తిరిగినను, అన్నింటిని స్పృశించినను అన్నింటిని ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ, అంతటా ఉన్ననూ ఏదీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ, అలానే తను ఉన్నచోట వాతావరణమును చల్లగా, ఉల్లాసంగా ఆహ్లాదంగా మార్చుతూ, అందరిలో జీవాన్ని నింపడం ద్వారా - మానవుడు కూడా అహంకారరహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటిబొట్టులా నిస్సంగుడై జీవించాలని, అలానే ఉన్నచోట అందరిని ఆనందంగా వుంచుతూ, ఉల్లాసంగా జీవించాలనే సందేశం "గాలి"ది.
                                                              నది

       తాను ఎక్కడ యున్నదో పట్టించుకోక పర్వతమైన, లోయైనా, వంకలైనా, డొంకలైనా, రాళ్ళరప్పల సందులైనా ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ, తనకి మూలమైన సముద్రాన్ని చేరేంతవరకు ప్రయాణిస్తూనే వుంటూ, పత్రపుష్పాదులు, చెక్కముక్కలు, చెత్తా చెదారములు, చిరు చిరు ప్రాణులు ప్రవాహంలో తనతోపాటు తీసుకువెళ్తూ, తనలో పాలుపోసినా, చెత్తను పడేసిన సముద్రంలో కలిసేంతవరకు ప్రవహించడమనే తన సహజలక్షణమును వదలకపోవడం ద్వారా - మానవ జీవితం కూడా పరవళ్ళుతో ప్రవహించే తనలాంటిదేనని, ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని పట్టించుకోక గమ్యం చేరేంతవరకు గమనమును సాగించాలన్న సందేశం "నది"ది.

                                                            సముద్రం

            అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలలు ద్వారా, మరియు ఎన్ని నదులు తనలో ప్రవేశించుచున్ననూ పొంగిపోర్లిపోకుండా, అలానే నదులు తనలో చేరక ఎండిపోయినను తాను వట్టిపోకుండ ఉండడం ద్వారా - ఎన్ని సంపదలు తనని చేరుతున్న పొంగిపోక, అలానే ఏ సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చుతగ్గుల స్థితి యందు స్థితప్రజ్ఞతో గంభీరుడై, అనుకున్నది సాదించాలనే పట్టుదలతో మానవుడు ఉండాలన్నది "సముద్ర" సందేశం.
                                                          పక్షులు

          కిలకిలారావాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతి లోనే ఉంటూ, ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం "పక్షుల"ది.

                                                          చెట్టు

         తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా, మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్ధ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం "చెట్టు"ది.

                                                           పువ్వు

          మొక్కపై అలరారుతూ అందంగా వికసించి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కల్గిస్తూ, వాడిపోయక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది "పువ్వు".

కానీ, మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు?
అన్నీ కాకపోయినా ఇందులో ఒకటైనా జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దల వాక్కు.

4 కామెంట్‌లు: