30, జనవరి 2013, బుధవారం

ఆహా... వారు మరింత చతురులు కదా !

ఆహా ..... ఎంతటి చతురుత అన్న టపా చదివిన ఓ మిత్రురాలు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి ఇలా అంది ...
భారతీ! గురువులు కూడా ఎంతో చమత్కారంగా మాట్లాడతూ, శిష్యుల తప్పులను సున్నితంగా సరిదిద్దుతూ నీతిబోధలు చేస్తుంటారు. అందుకు ఉదాహరణంగా నేను విన్నది,  
'శ్రీ రమణులది' చెప్తాను విను-

విదేశీయులూ శ్రీ రమణుల దర్శనార్ధం వచ్చేవారు. ఓసారి అలా రమణాశ్రమమునకు వచ్చిన ఓ విదేశీ స్త్రీ క్రింద కూర్చోలేక కూర్చోలేక కూర్చుని భగవాన్ కూర్చునే సోఫా వైపుకు కాళ్ళు చాచింది. ఇది అక్కడే ఉన్న భగవాన్ శిష్యుడొకరికి సహింపరానిదిగా తోచి, అమ్మా! కాళ్ళు ముడుచుకొండని చెప్పడాన్ని చూసిన మహర్షి; "సరి సరి, ఆమె క్రింద కూర్చోటానికే కష్టపడుతుంటే కాళ్ళు ముడుచుకోవాలా?" అన్నారు నవ్వుతూ. అంతట ఆ శిష్యుడు భయపడుతూ 'లేదు లేదు, ఇక్కడి మర్యాద ఆమెకు తెలియదని చెప్పాను, అంతే' అని బదులివ్వగా; "ఓహో... అట్లాగా... మర్యాద కాదా? అయితే వాళ్ళవైపు కాళ్ళు చాపటం నాకున్నూ మర్యాద కాదు కదా మరి. ఆ మాట నాకున్నూ తాకి వస్తుంది కదా" అని నవ్వుతూ మందలించి కాళ్ళు ముడుచుకున్నారు శ్రీ రమణులు. ఆ మరుసటి రోజు కూడా ఎంతో కాళ్ళు నొప్పులున్న రమణమహర్షి, కాళ్ళు చాచటం, అంతలోనే మర్యాద కాదు కాబోలు అని కాలు ముడుచుకోవడం చేయగా..., ఇది చూసి దుఃఖితుడైన తన శిష్యుణ్ణి చూసి నవ్వేస్తూ కాళ్ళు చాచి ఎప్పటిలా కూర్చుంటూ, "మీరంతా కూడా ఇలా కూర్చోండి ఓ రెండు కధలు చెప్తాను, వినండి" అంటూ అవ్వయార్ కధను, నామదేవ్ కధను చెప్పారట భారతీ... 

శ్రీ రమణులు చెప్పిన అవ్వయార్ కధ -

కైలాసంనుంచి వచ్చిన తెల్లఏనుగును ఎక్కి సుందరమూర్తి వెడుతుంటే చూసి చేరరాజు అశ్వం చెవులో పంచాక్షరి మంత్రమును చెప్పి, దానినెక్కి తానూ వెళ్ళాడట కైలాసానికి. వాళ్ళిద్దరూ వెళ్తున్నారని గణపతిపూజ చేస్తున్న అవ్వయారుకి తెలిసి తానూ పోవాలని తొందరపడుతుంటే ఆ గణపతి అవ్వను చూసి 'అవ్వా! తొందరపడకు, పూజ సావకాశంగా కానియ్యి, నేను వాళ్ళకంటే ముందు నిన్ను కైలాసంకు చేరుస్తాలే' అని అన్నాడట. సరేనని భక్తితో పూజ పూర్తిచేయగానే "అవ్వా! కళ్ళు మూసుకో" అన్నాడు. అంతే, కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల ఎదుట కూర్చొని ఉంది. సుందరమూర్తీ, చేరరాజూల కంటే తన భక్తి వలన ముందుగానే వచ్చింది. అవ్వ పాపం పెద్దదాయే. పరమేశ్వరున కెదురుగా ఇట్లా నాలాగే కాళ్ళు చాచి కూర్చున్నది. ఇది చూసిన పార్వతీదేవికి పట్టరానిబాధ. పరమేశ్వరునికి ఎదురుగా కాళ్ళు చాచిందే, ఇది అపరాధం కదా అన్న దిగులుతో 'నేను చెప్పనా అవ్వతో' అని పరమేశ్వరునికి మనవి చేయగా, "అమ్మో, మాట్లాడకు, ఆమెనేమీ అనరాదు" అని అన్నాడట ఈశ్వరుడు. అయినా ఆ అమర్యాదను సహించలేక చెలికత్తెతో చెప్పగా, ఆ చెలికత్తె అవ్వను సమీపించి 'అవ్వా అవ్వా, కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు అని అన్నాదట. 'అట్లాగా అమ్మా, ఈశ్వరుడు ఎటులేడో చెప్పు, ఇటు తిప్పానా?' అని కాళ్ళు ఇటు తిప్పితే ఇటు, అటు తిప్పితే అటు పరమేశ్వరుడు తిరగవలసి వచ్చింది. అప్పుడు పార్వతిని చూసి, "చూసావా? నేను చెబితే విన్నావు కాదు, ఆమె ఇప్పుడు నన్నెలా తిప్పుతుందో చూడు, అని ఈశ్వరుడు అనగా అంతట  అవ్వని క్షమించమని అడిగింది  పార్వతీదేవి. ఇట్లాగే ఉంటుంది కాలు చాపవద్దనటం.....!

శ్రీ రమణులు చెప్పిన రెండవ కధ నామదేవునిది -

స్వామి విఠల్ తనయందే ఎక్కువ మక్కువగా ప్రీతిగా ఉన్నాడని నామదేవ్ గర్విస్తే, జ్ఞానదేవాదులొకసారి ఘోరా కుంభారునింటికి నామదేవున్ని విందుకు తీసుకువెళ్ళి, విందనంతరం ఇష్టాగోష్టిలో ఘోరాకుంభారునీతో 'ఏమోయ్! నీవు కుండలు బాగా చేస్తావ్ కదా, మరి ఈ మా కుండల్లో పక్వమైనవి ఏవో, కానివేవో నాణ్యం చూసి చెప్పవోయ్...' అని చమత్కరించగా -
వారి ఒక్కొక్కరి తలమీద రెండు మొట్టికాయలు వేస్తూ పరీక్షించడం మెదలుపెట్టారు ఘోరాకుంభారులవారు. అక్కడున్న వారంతా తలవంచి నమ్రతతో వూరుకోగా, నామదేవుడు మాత్రం 'ఏమిటేమిటీ, నన్నే కొట్టవస్తావా?' అని ఎదిరించగా; వెంటనే ఇది పక్వంలేని కుండ అని ఘోరాకుంభారులవారు అనగానే అందరూ పక్కున నవ్వారు. ఇక వెంటనే ఉక్రోషంతో, అవమానభారంతో నామదేవుడు లేచి, విఠల్ దగ్గరకు వచ్చి విలపించగా -
"అందరూ కొట్టినప్పుడు నమ్రతగా ఉన్నప్పుడు నీవెందుకు అలా ఉండలేకపోయా"వని విఠల్ ప్రశ్నించగా; మీకు ఎంతో చేరువైన నేనూ, వారూ ఒకటేనా? నన్నా కొట్టేది అని నామదేవుడు బదులివ్వగా -
"అదే అహంకారం. వాళ్ళంతా నా యదార్ధ స్వరూపం తెలుసుకొని స్వస్థచిత్తులై మౌనంగా వున్నారు. ఓ పనిచేయ్... ఇక్కడికి సమీపంలో ఉన్న అడవిలో ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఉన్న సాధువును సేవించి యదార్ధం తెలుసుకో" మన్న స్వామి విఠల్ మాటలు విని అక్కడికి వెళ్ళిన నామదేవునికి లింగంపై కాళ్ళుపెట్టి పడుకున్న సాధువు కనబడగానే, 'అయ్యయ్యో... స్వామీ అపరాధం, అపరాధం; దేవుడినెత్తిన కాళ్లేమిటీ?' అని కపించిపోతూ అనగా, 'ఓహో... నామదేవా... విఠల్ పంపాడా?' అని ఆ సాధువు అడగడం చూసి, ఆశ్చర్యపడిన నామదేవుడు ఆవేదనతో 'అయ్యా! లింగం మీద కాళ్లేమిటీ?' అని మరల అడగగా; 'అట్లాగా నాయనా! నాకు తెలియదే, కాళ్ళు ఎత్తలేకుండా యున్నాను, కాస్తా అవతల పెట్టవయ్యా' అంటే; సరేనని, కాళ్ళు ఎత్తి ఎటు పెడితే అటు లింగం కన్పించడంతో తనపై పెట్టుకుంటే తానూ లింగంలా గోచరించేసరికి విభ్రాంతితో నిలిచాడు. ' హు... తెలిసిందా ఇప్పుడు' అని సాధువు ప్రశ్నించగా 'తెలిసింది స్వామీ' అంటూ జ్ఞానేశ్వరుల శిష్యుడైన ఆ విశోబాకేశునకు నమస్కరించి ఇంటికి వెళ్లి గదిలో కూర్చొని ధ్యానమగ్నుడై విఠోబా వద్దకు వెళ్ళడం మానాడు నామదేవ్.
కొన్నాళ్ళకు విఠల్ పరుగెత్తుకొని వచ్చి, "నామా! నామా! నీవు రావటం లేదేమీ?" అని ఆర్తిగా అడగగా, 'ప్రభూ! నీవు లేని చోటేది? నిన్ను సదా ఇక్కడే, నాలోనే చూస్తున్నా'ని అనగా ఆనందంతో స్వామి విఠల్ అంతర్ధానమయ్యాడు...అని మహర్షి చెప్పి తన శిష్యునికి జ్ఞానోదయం చేసెనట. 
భారతీ!  రమణమహర్షి ఎంత చమత్కారంగా తన శిష్యుల తప్పులను సరిదిద్దుతూ జ్ఞానబోధ చేసేవారో కదా ... ఆహా... వారు మరింత చతురులు కదా !

27, జనవరి 2013, ఆదివారం

ఆహా.....ఎంతటి చతురత!

క్రిందటి గురువారం ఓ స్నేహితురాలు కోరిక మేరకు తనతో కల్సి షిర్డీ సాయి గుడికి వెళ్లాను. పూజాది కార్యక్రమములు పూర్తయ్యాక బయల్దేరుతుండగా - 'బాబా! ఇంటికి బయల్దేరుతున్నాం, వెళ్ళుటకు అనుమతి ఇవ్వు' అని తను అడగడం చూసి ఒకింత ఆశ్చర్యానందములకు లోనయ్యాను. బాబా ఉన్నప్పుడు షిర్డీ వెళ్ళినవారు తిరిగి వస్తున్నప్పుడు బాబా అనుమతి కోరేవారని చదివాను. కానీ, ఇప్పటికీ ఇలా ఎంతో భక్తీనమ్మకాలతో దానిని ఆచరించేవారు ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆటోలో తిరిగి వస్తుండగా తనతో అదే చెప్తూ గతంలో పెద్దలు దగ్గరకు, మహర్షుల దగ్గరకు, గురువుల దగ్గరకు వెళ్ళినవారు తిరిగి వస్తున్నప్పుడు అనుమతి కోరేవారని చదివానని చెప్తుండగా, ఎప్పుడో చదివిన శ్రీరమణమహర్షి వారి కాలంలో జరిగిన ఓ చమత్కారపు ఘటన గుర్తుకొచ్చింది. 

తెనాలి దగ్గర పెద్దపాలేం వాస్తవ్యులు కృష్ణయ్య అను నతను తను రచించిన "ధనుర్దాసు చరిత్ర" అనే పద్యకావ్యాన్ని రమణాశ్రమమునకు వచ్చి శ్రీ రమణులకు అంకితమిస్తూ ఇలా వ్రాసారట -
బహుమతులన్నిటిలోనికి కన్యనివ్వటం ఉత్తమమైనది కాబట్టి ఈ కావ్యకన్యకను పెండ్లియాడమని  భగవాన్ రమణులకు సమర్పించుచున్నాను. నాకు తెలుసు, మీరింతకు ముందే ముక్తికాంతను పెండ్లాడినారు. దయచేసి ఈ కావ్యకన్యకను కూడా స్వీకరించి తప్పులు దిద్ది, ఈమె బలహీనతలను క్షమించి బాగా చూచుకోండి. నా వైష్ణవ కన్యకకు భగవాన్తో ఈ వివాహం జరగడం వాళ్ళ అద్వైతానికీ విశిష్టాద్వైతానికి పెండ్లి జరిగినట్లయింది. మీరు నా అల్లుడైనప్పటికీ మా ఇంటికి రండని అడుగలేను. ఎందుకంటే మిమ్మల్ని చూడడానికి ఎంతోమంది రాజులు, గొప్పవారు, సాధకులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు కదా" అని, 

వీడుకోలును అంతే చమత్కారంగానే అడిగారట -

"చూసినవారందరూ పరవశించేలాగా, ఈ నీ రూపంలో ఏ మాయలు దాచావ్? 
అందరి శ్రమను పోగొట్టేలా, ఈ గాలిలో ఏ శక్తిని పొందుపరిచావ్?
అన్ని రోగాలను అణచివేయగల్గేలా, ఇక్కడి నీటిలో ఏ మందు కలిపావ్?
వచ్చినవాళ్ళు తిరిగి వెళ్ళుటకు అయిష్టపడేలా ఏ మత్తుమందు ఈ చుట్టుపక్కలా వెదజల్లావ్?
పురుషోత్తమా! మాలాంటి సామాన్యులకు రకరకాల కోరికలు కలుగుతుంటాయి. కొన్ని సఫలమౌతాయి, కొన్ని కావు. నా అన్ని కోరికలు ఇక్కడ తీరాయి. అందులో ఒకటి, ధనుర్దాసు చరిత్రను పద్యకావ్యముగా వ్రాయాలని; రెండు, బంధుమిత్ర  సపరివారంగా వచ్చి నా కావ్యకన్యక చేతిని మీకందివ్వాలని; మూడవది, ఈ పెండ్లి విందును మీతో కలిసి తృప్తిగా ఆరగించాలని; నాల్గవది, ఇక్కడ కొన్ని రోజులుండి మీ దర్శనంతో నా కనులకు విందు చేయాలని. మీ కృపవలన నా ఈ కోరికలన్నీ తీరాయి.
పురుషోత్తమా! నీ గొప్పతనాన్ని నీవు మాత్రమే తెలుసుకోగలవు, మేమెంత కాలం ఇక్కడ ఉన్నా, తిరిగి వెళ్ళుటకు మా పాదాలు కదలవు. నేనేమి చేయగలను?
ఓ పావనుడా! నేను వెళ్ళడానికి మీ అనుమతిని దయచేసి ఇవ్వండి."

నాకు జ్ఞాపకం వచ్చిన ఈ ముచ్చటని నా స్నేహితురాలికి చెప్పగా, తను అన్నదిలా - 
ఆహా.....ఎంతటి చతురత!

17, జనవరి 2013, గురువారం

అమ్మా! నాకో సందేహం.....


ఓం... నమో నారాయణాయ
 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
 దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
 దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
 హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే
 అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
 వంకర కన్నుల మీరు శంకర కింకరులు
 వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు.....

ఉదయం ఈ పాటను మా అమ్మాయి అనూష పాడుతూ - 
అమ్మా! నాకో సందేహం... హరి హరులు వేరు వేరా? భగవంతుడు ఒక్కడే అంటారు కదా. మరి ఇన్ని రూపాలెందుకు? ఇన్ని బేధాలెందుకు? మానవుల మద్య ఈ విబేధాలెందుకు?
అమ్మా! నాకో సందేహం..... అంటూ నాలుగు ప్రశ్నలు సంధించింది. నాకు తెలిసినంతలో జవాబు చెప్పాను ఇలా -
హరి హరులు వేరు కాదమ్మా...
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే /
శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః //
                                                    - స్కందోపనిషత్తు
శివుని యొక్క రూపమే విష్ణువు. విష్ణువు యొక్క రూపమే శివుడు. శివుని హృదయమే విష్ణువు. విష్ణు హృదయమే శివుడు. 

భగవంతుడు ఒక్కడే. 
"ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అన్నది శ్రుతి వాక్యం. 
సత్స్వరూపమైన పరబ్రహ్మ ఒక్కటే అయినను జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులను బట్టి అనేక స్వరూపాలుగా, పలు పేర్లుగా పిలవబడుచున్నది.

పరమాత్ముడు ఒక్కడైనను, ఆ కాలమందున్న జనుల యొక్క మనఃపక్వతను అనుసరించి ఒక్కొక్క కాలమందొక్కొక్క అవతారం వహించెను.
బహునా త్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ /
అనేక భేదాభిన్నస్తు క్రీడతే పరమేశ్వరః //
ఈ జగమంతయూ బ్రహ్మమే. ఆ బ్రహ్మమగు పరమేశ్వరుడు అనేక విధములుగా అవతరించి క్రీడించుచున్నాడు.

సృష్టిస్థిత్యంత కరణీం బ్రహ్మవిష్ణు శివాత్మికామ్ / 
స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దనః //
సృష్టి స్థితి లయ కారణముల కొఱకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేర్లు వహించిన పరమాత్మ ఒకటియే గాని అన్యం లేదు.

నారాయణశ్శివో విష్ణుశ్శంకరః పురుషోత్తమః /
ఏతేషు నామాభిర్బ్రహ్మపరం ప్రోక్తం సనాతనమ్ //
నారాయణ, శివ, విష్ణు, శంకర, పురుషోత్తములను నామములన్నియు సనాతనమైన పరబ్రహ్మము యొక్క పేరులే గానీ వాటి మద్య బేదం లేదు.

మానవుల అజ్ఞానం కొలదే ఈ విబేధాలు. పూర్వం ఈ విబేధాలు ఎక్కువగా ఉండేవి. ( ఈ మద్యనే ఓ పుస్తకం చదివాను. శైవం కంటే వైష్ణవ మతం గొప్పదని ఓ ఆచార్యులవారి ప్రబోధం. తదుపరి టపాలో దీనిని ప్రస్తావిస్తాను) ఈ అజ్ఞానమును వీడమని, అంతా పరబ్రహ్మమయమేనని శాస్త్రవచనం. అంతా ఒకటేనని మహర్షుల మాట. ఏకం సత్ అన్నది గురువుల ప్రబోధం. 
యో సౌ విష్ణుస్స్వయం బ్రహ్మాయో బ్రహ్మా సౌ మహేశ్వరః /
వేదత్రయే చ యజ్ఞే స్మిన్ పండితేష్వేష నిశ్చయః //
ఎవ్వడు విష్ణువో, వాడే స్వయంగా బ్రహ్మదేవుడు. ఎవ్వడు బ్రహ్మదేవుడో, వాడే మహేశ్వరుడు. ఈ రహస్యం మూడువేదముల యొక్క, యజ్ఞాదుల యొక్క, పండితుల యొక్క నిశ్చితాభిప్రాయం. 
గతంలో ఓ పోస్ట్ లో ప్రస్తావించిన పరమానందయ్య అనే గురువుగారు తన శిష్యులకు జ్ఞానోదయం కల్గించిన కధను మరోసారి మా అమ్మాయికి గుర్తుచేశాను.
పరమానందయ్య శిష్యుల కధలు చాలావరకు అందరికీ తెలుసు. శిష్యుల అమాయకత్వం, ఆ అమాయకత్వంలో వారు చేసే పనులు, గురువుగారి బోధలు ...... వీటినీ పరిశీలిస్తే మనల్ని ఉద్ధరించే  సందేశాత్మకమైన ఆధ్యాత్మిక ప్రభోదాలే ఉంటాయి. (పరమానందయ్య శిష్యులు అజ్ఞానపు అమాయక చేష్టలు మన చేష్టలకు ప్రతిబింబాలే)
పూర్వం శివుడే గొప్పయని శైవులు, విష్ణువే గొప్పయని వైష్ణువులు పరస్పర నిందలతో, కొట్లాటలతో అవివేకంగా ప్రవర్తించేవారు. శివుడైనా, విష్ణువైన ఒకే పరబ్రహ్మమునకు చెందినవారని, ఒకే చైతన్య స్వరూపులని, అవివేకంతో ప్రవర్తించక ఈ రెండు రూపాలు మనిషి ఆధ్యాత్మిక జ్ఞానత్వమునకు ముఖ్యమే అని తెలుసుకొని అజ్ఞానమును వీడమని.... తెలియజెప్పే కధనమిది.
ఓ రోజు విశ్రమిస్తున్న పరమానందయ్యగారి కాళ్లు ఇద్దరు శిష్యులు పడుతూ, నేను పడుతున్న కుడికాలు గొప్పని ఒకరు, నేను పడుతున్న ఎడమకాలు గొప్పదని మరొక శిష్యుడు వాగ్వివాదం చేసుకుంటూ, చివరికి గురువుగారి కాళ్ళునే మరచెంబుతో ఒకరు, పానపాత్రతో మరొకరు కొట్టడం మొదలుపెట్టారు. ఆ బాధకి గురువుగారికి మెలుకువ వచ్చి ఆ రెండు కాలు తనవే నని, మీరు చేసిన ఈ అజ్ఞానపుపని నన్నే గాయపరిచిందని, మనిషి మనుగడకు రెండు కాళ్లు ముఖ్యమే కాబట్టి రెండు కాళ్లు గొప్పవేయని, మానవుల మనఃపక్వతను బట్టి వారిని ఉద్ధరించడానికే అనేక రూపాల్లో అవతరించిన భగవంతుడు ఒక్కడే అని, అది గ్రహించి అజ్ఞానమును వీడమని.

హరిం హరం విధాతారం యః పశ్యేదేకరూపిణమ్ /
స యాతి పరమానందం స యోగీ బ్రహ్మ ఉచ్యతే //
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకరూపంగా ఎవరు చూచుచున్నారో, అట్లున్న యోగి శాశ్వతానంద పొందే బ్రహ్మమని చెప్పబడుదురు.