25, జులై 2016, సోమవారం

సనత్సుజాతీయం (చివరి భాగం)



పొరపాటే మృత్యువనియు, మృత్యువుకు ఆకృతి లేదనియు, కోపమూ, మొహమూ, పొరపాట్లు కారణంగా మృత్యువు వుండుననియు, తన మృత్యువుకు తానే కారణుడనియు, ఇంద్రియములకు బద్ధులైనవారు జన్మ పరంపరలలో చిక్కుకుంటున్నారనియు, అంతర్యామి యొక్క అస్తిత్వమునే సర్వత్రా దర్శించువారు అమృతత్త్వం అనుభవించెదరనియు చెప్తూ...  సుకర్మ దుష్కర్మలను వివరిస్తూ, ఫలాపేక్షతో పుణ్యకర్మలు చేసినా దుఃఖభాజనులగుదురనియు, పాపపుణ్యాలకు అతీతంగా వుండి ఆత్మనిష్ఠలో ఉన్నవారు బద్ధులు కారనియు...  సనత్సుజాతులవారు వివరించినదంతా విన్న ద్రుతరాష్ట్రుడు ఇలా ప్రశ్నిస్తాడు -
మహామునీ! ధర్మాన్ని ఆచరించకపోవడం వలన ధర్మం దెబ్బతింటుందా? అధర్మం ఆచరిస్తే ఆ ఫలితం మనం అనుభవింప వలసి వస్తుందా? ధర్మం గొప్పదా? అధర్మం గొప్పదా? అని ప్రశ్నించగా,

ధర్మాధర్మాలు రెండూ మనలోనే ఉన్నాయి. ఆచరించటం ఏది ఆచరిస్తావో దానిబట్టి ఫలితముంటుంది. కర్మాచరణం వలన మానవుడు ఉద్ధరింపబడతాడు. సత్కర్మ ఆచరిస్తే సత్కర్మఫలమైనటువంటి స్వర్గం అనబడేటువంటి ఒక స్థితి వస్తుంది,  అంటే అమృతత్త్వం వస్తుంది. దుష్కర్మ ఆచరిస్తే దుష్కర్మ ఫలంగా నరకం అని చెప్పబడేటువంటి ఒకానొక పాపఫలం సంక్రమిస్తుంది, అంటే అహంతో జీవించడం. ఈ ధర్మ ధర్మాల కర్మాచరణం వలనే జ్ఞానం పొందటం, అజ్ఞానం పొందటం వుంటుంది. సత్కర్మాచరణ చేసినట్లయితే, క్రమేణా మనకి, మనస్సుకి వివేకమొస్తుంది, తద్వారా సత్ జ్ఞానం కల్గుతుంది, తద్వారా ఆత్మ సాక్షత్కార కాంక్ష కల్గుతుంది, అది కలిగినందువలన ఆత్మ యందు మనస్సు నిశ్చలత పొందడానికి కావల్సిన సాధనా తృష్ణ మనలో వస్తుంది, అది రావడం వలన కర్తృత్వభావన వీడి ప్రతిఫలాపేక్ష లేకుండగ భగవదర్పణ చేయడం వలన అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతత్త్వమంటే ఆత్మ నిష్ఠతో అందర్నీ ఆత్మస్వరూపులుగా భావిస్తూ విశ్వజనీయమైన ప్రేమతో దివ్యజీవనం గడపడం.

ఏ మంచిపనయినాసరే ఆ పనులు మంచివని తెలుసుకున్నంత మాత్రమున ఉపయోగం లేదయ్యా,  ఆచరిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అని సనత్సుజాతులవారు చెప్పగా,

దృతరాష్ట్రుడు మరల 'ఈ ప్రపంచంలో ధర్మమే ఎక్కువ బలము గలదై పాపాన్ని ఓడిస్తుందా? లేక పాపమే ధర్మాన్ని ఓడిస్తుందా?' అని ప్రశ్నించగా -

రాజా! నీ దృష్టిలో ధర్మా ధర్మములు రెండూ సమాన బలముగలవి కావచ్చును. కానీ నీకే తెలుస్తుంది ... ధర్మ మార్గమున అధర్మాన్ని జయించినవారు ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు. అలా కాక, అధర్మ మార్గమున ధర్మాన్ని జయించినప్పుడు అశాంతికి గురై లోలోన పరితాపంతో జీవిస్తాడు. కాబట్టి రెండింటికి ఫలం ఎలా ఉందో, దాన్నిబట్టి ఏది బలీయమో నీవే యోచించి తెలుసుకో. ఓ దృతరాష్ట్రా! పుణ్యపాపాలకు అతీతంగా, కర్మఫలాన్ని అపేక్షింపక, కర్మయోగిగా జీవిస్తూ బ్రహ్మానంద స్వరూపులైనవారు అమృతత్త్వాన్ని పొందుతారు, అంటే ధర్మాచరణం చేత, పుణ్యాన్ని లెక్కచేయకుండా, పాపాన్ని క్షాళనం చేసుకొని పరిశుద్ధులైనట్టివారు, నిత్యమూ, శాశ్వతమూ, సత్యమూ అయినటువంటి పరమాత్మ స్వరూపమయినట్టి ధ్యానంలో అమృతత్త్వంను పొందుతారు.
అని సనత్సుజాతులవారు చెప్తూ, ఇంకా ఇలా వివరిస్తున్నారు -
ఆత్మను దర్శనం చేయకుండా, వ్యక్తులను దర్శనంచేసి, పరోపకారం చేసినా ఒకటే, పరాపకారం చేసినా ఒకటే. పరోపకారం ఎప్పుడు చేసినా 'నిర్లింగమచలం శుద్ధం' ... ఎవరికైతే చేస్తున్నారో వాళ్లలో ఉన్న పరిశుద్ధమైన పరబ్రహ్మమును చూడాలే తప్ప, వారు ఏ కులం, గోత్రం, దుర్మార్గుడా, ఎలాంటివాడు అని చూడకూడదయ్యా దృతరాష్ట్రా!

యోన్యథానన్త మాత్మానం
అన్యథా ప్రతిపద్యతే
కింతేన నకృతం పాపం
చోరేణాత్మాపహారిణా

అనంతమయినట్టి పరమాత్మ ఒకే విధంగా అందరిలోనూ ఉన్నను, మరియొక విధంగా ప్రతిపాదనం చేసుకొని, వీరు మావాళ్లు, వీరు పరాయివాళ్ళు అన్న భావన చేసుకున్నవారు ఏ సత్కర్మాచరణం చేసిన అది పాపమే అవుతుందయ్యా ...

జ్ఞాని మానుషమైన సంపద అంటే మనిషిచేత సృజింపబడ్డ సంపదలను నమ్మక, దైవీ సంపదల మీద నమ్మకముంచి లోకహిత కాముకుడై, నిశ్చలుడై ఉంటాడయ్యా. ఎవరు పొగిడినా తెగడినా, అది అలా మాట్లాడినవారి స్వభావలక్షణంగా ఉన్నట్టిమాటగా భావించి 'లోక స్వభావవృత్తిర్హి' లోకస్వభావ ప్రవృత్తి ఇంతేనని తెలుసుకొని ఊరుకుంటాడేగాని పట్టించుకోడయ్యా. తనకి అన్వయించుకొని బాధపడడు, బదులియ్యడు.

మోక్షమనే మార్గంలో వెళుతున్నవానికి బహు దారులున్నాయి నాయనా... 'సత్యార్జవే హ్రీర్దమ శౌచవిద్యాహః' అంటే సత్యవాక్కు, ఋజు ప్రవర్తనం, లజ్జించటం, దమం, శౌచం, విద్యా... అనే దారులున్నాయి.
సత్యవాజ్మియమం మొదటి దారి అంటే మొదటి గుణం. సత్ప్రవర్తనం రెండో గుణం, చేయకూడని పనులు చేయడానికి లజ్జిపడటం మూడో గుణం, ఇంద్రియములను మనస్సును నిగ్రహించుకునే నాల్గవ గుణం, బహి (శారీరక) శౌచం, అంతశ్శౌచం ఐదవ గుణం, హితమైన పనులుచేస్తూ, అందరిలో అంతర్యామిని చూసే విద్య ఆరవ గుణం. 'షణ్మానమోహ ప్రతిబన్ధకాని' ఈ అరున్నూ మానాభిమానములు మోహంను తొలగించేసి,మోక్షానికి వెళ్లేదారిని ఇస్తాయి రాజా, వీటిని ఆచరణలో పెట్టి ఎంతో ఆర్తితో మోక్షంకై యత్నించాలి నాయనా.

అటుపై  మౌనమంటే ఏమిటో చెప్పమని దృతరాష్ట్రుడు అడగగా -

యతో నవేదా మనసా సహైనమ్
అనుప్రవిశన్తి తతోథ మౌనమ్
యత్రోత్ధితో వేదశబ్దస్తధా యం
స తన్మయత్వేన విభాతిరాజన్

మౌనం మనస్సుకు సంబంధించినది.  మౌనమంటే  తెలుసుకోవటం, చూడటం, అది తాను అవటం. వేదశబ్ధం ఎక్కడెక్కడయితే అమలుపరచటానికి వీలవుతుందో అక్కడక్కడల్లా వున్నది మౌనమే. ఆ స్థితే తన్మయత్వ స్థితి. తానే అది అయ్యే స్థితి.

                       *  లోకాస్సమస్తా సుఖినోభవంతు  *

3 కామెంట్‌లు:

  1. వర మౌనీంద్రు సనత్సుజాతుల వచో పర్వంబు దివ్యంబుగా
    పరమామ్నాయపు సారమెల్ల నొకచో భాసించ మీ శైలిలో
    పరమార్థంబులు దెల్పినారు , 'స్మరణన్' వాణీ విలాసంబుగా
    వర మార్గంబున తీర్చి దిద్దుట గనన్ , వందారు, శ్రీ భారతీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టారు గారు,

      మీ ఈ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదములు.
      మీ ప్రతీ వ్యాఖ్య ఆనందదాయకంగా ఉత్తేజాన్ని కల్గిస్తూ ప్రోత్సాహపూరితంగా ఉంటాయి. మీ ఆశీస్సులు సదా ఉండాలని ఆకాంక్షిస్తూ ...
      నమస్సులతో
      భారతి.

      తొలగించండి
  2. ధృతరాష్ర్రుడు మృత్యువు గురించి సనత్సుజాతీయుల వారిని వివరణ నిమ్మని కోరుట.. వారి వివరణను నీదైన శైలిలో చక్కగా విశదీకరించి చెప్పావు భారతీ!..

    శరీరం నుండి ఆత్మవియోగంతో కలిగే దు:ఖానికే మృత్యువని పేరు.మృత్యువు వలన కలిగే వియోగ దు:ఖాన్ని సహించేందుకు ధృడమైన మనస్సు, ఆత్మవిశ్వాసం, ధైర్యమవసరం. ధర్మానికి ప్రధమ లక్షణం ధైర్యం.

    పరమాత్మను తెలుసుకొని మృత్యువును దాటాలి - అధిగమించాలి. పరమాత్మ ఆశ్రయం మోక్షదాయకం. ఆతని అనాశ్రయం మరణదాయకం...

    భౌతిక శరీరంతో జీవాత్మకు కలిగే సంబంధమే జన్మ. శరీరం నుండి జీవాత్మ విడిపోవడమే మృత్యువు. మరణానంతరం జీవాత్మతో ధర్మమొకటే వెళుతుంది...

    నాకు తెలిసిన రెండుమాటలతో మరోసారి అభినందనలతో....చక్కటి పోస్ట్ ను అందించినందుకు థాంక్యూ....

    రిప్లయితొలగించండి