2, జులై 2018, సోమవారం

సీతమ్మకై, విధికై ..... చింతన, చింతలేలా?

వైదికకాలంలోని అన్ని పురాణేతిహాసగాధలు ధార్మికంగా ఉంటాయి. సందేశాత్మకంగా ఉంటాయి. ఇది గ్రహించడం తరతమ ఆలోచనాబేధాలను బట్టి, యోగ్యతను బట్టి అర్ధమౌతుంటాయి. కొన్ని కొన్ని తమ తమ విజ్ఞతతో అందుకోవాల్సియుంటుంది. సత్యం తెలుసుకోవాలంటే, అవగాహనను పెంచుకుంటూ, ప్రతీ ఘటనను పారమార్థికంగా పరిశీలించండం అలవర్చుకోవాలి. 

ఈ మధ్య ఒకరు రెండు ప్రశ్నలడిగారు - 

1. గర్భవతి అయిన సీతమ్మను అడవిలో విడిచిపెట్టేశారే ... ఇది శ్రీరామునికి ధర్మమా? ఆమె ఏమైనా చేసుకుంటే? 
2. తలరాతను తప్పిచుకోలేమా?
ముందుగా తల్లి సీతమ్మ గురించి అర్ధం చేసుకుందామంటూ ... పెద్దలు చెప్పగా... విన్నదీ, చదివినదీ ... నా చిరు అవగాహన మేరకు, ఇలా బదులిచ్చా - 
                          

                  
భగవంతుడైనా మానవునిగా జన్మించినప్పుడు మానవునిగానే జీవించాలి. ప్రకృతిలోనికి దిగివచ్చిన పరాత్పరుడు ప్రకృతి విధి విధానాన్ని అనుసరిస్తూనే, అనుభవిస్తూనే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ మానవుడు మాధవుడుగా ఎలా మారాలో తెలియజేయాలి. లోకాన్ని రక్షించాలనుకున్నప్పుడు ఈ లోకంలో ఒకరిగా బ్రతకాలి కాబట్టే, ఎంతో సహనంతో సాదాసీదాగా ఓ చక్కటి భార్యగా తన భర్తను అనువర్తిస్తూ జీవించిన  మహా సాధ్వి సీతమ్మతల్లి. ఎంతో విజ్ఞత గల సీతమ్మతల్లి, తన ప్రాతివత్యంతో రావణుడు తనని ఎత్తుకెళ్లినప్పుడే సంహరించగల ధీశాలి అయినను, తన భర్తచే రాక్షస సంహారం జరిపించి, ధర్మనిరతి, సత్య ఔన్నత్యం, రాజనీతి,  మానవుడు మాధవుడుగా ఎలా మారాలో రాములవారి ద్వారా లోకానికి తెలియజెప్పాలని భావించిన దొడ్డ యిల్లాలు. అటువంటి సీతమ్మ, శ్రీరాముని వంశాకురం తన గర్భంలో జీవం పోసుకుంటున్నప్పుడు, ఆ వంశమును నిలబెట్టాలనే తపిస్తుంది తప్ప, తాను ఏమీ చేసుకోదు. సీతమ్మతల్లి భర్త మనసెరిగిన ధర్మానువర్తురాలు.   ఇప్పటికాలంలా సరైన ఉత్తీర్ణత లేదనో, అనుకున్న కళాశాలల్లో సీటు రాలేదనో... చిన్ని చిన్ని ఇబ్బందులకు అవివేకపు ఆలోచనలతో ఆత్మహత్యలు చేసుకునే మానసిక దుర్బలత ఆనాడు లేదు. ఈ కలియుగపు దృష్టితో ఆ యుగాన్ని వీక్షించడం తగదు. 
ఇక నా రామయ్యతండ్రి ధర్మ నిరతి - 
సత్యం ని అసత్యం కప్పగలదు గానీ, సత్యంను కాల్చలేదు. కానీ, సత్యం వెలుగుచూస్తే అసత్యం బూడిదవుతుంది. సత్యమైన సీతను అగ్ని కాల్చలేదు.  ఈ సత్యంను అందరూ గ్రహించాలనే పరాయివాని చరలో కొంతకాలం వుండివచ్చిన సీతను రాముడెలా స్వీకరించాడన్న లోకాపవాదు రాకూడదనే సీతమ్మచే అగ్నిప్రవేశం చేయించాడు. అయినను  జనాపవాదు తప్పలేదు. 
                        
ఇప్పుడు శ్రీముని ముందు రెండు ధర్మ ప్రశ్నలున్నాయి - 
1. రాజ్యాధికారం వంశపారంపర్య సంక్రమణం. రాజ్యంలో అందరూ నన్ను అంగీకరించి రాజుని చేశాకా, రాజధర్మంను పాటిస్తూ సీతమ్మను విడిచిపెట్టడం.  
2. వివాహధర్మానుసారాం భర్తగా భార్యను జీవితాంతం పోషించాలి కాబట్టి సీతకోసం రాజ్యాన్ని విడిచిపెట్టడం. 
విడిచిపెట్టడం - అందరికోసం ఒకరినా ... ఒకరికోసం అందరినా...    

అయితే ధర్మసూక్ష్మం నెఱిగినవాడు శ్రీరామచంద్రుడు. రాజ్యపాలనను విడిచిపెట్టడం స్వధర్మానికి విరుద్ధం. ఆ కాలంలో రాజధర్మాన్ని అనుసరించి ఒక రాజు తన ప్రజలకు సుస్థిరమైన పాలన, రక్షణ అందివ్వడానికి అవసరమైతే స్వసుఖాన్ని, ప్రాణాన్ని త్యజించాలి. రాజ ధర్మం సర్వ సమ్మతం. భర్తధర్మం వ్యక్తిగతం. అందుచే సీతా పరిత్యాగం తప్పనిసరైంది. అలా కాకుండా, సీతకై సింహాసనాన్ని విడిస్తే - వ్యక్తిగత సౌఖ్యంకై వంశపరువుని, రాజధర్మాన్ని తప్పినట్లవుతుంది. స్వధర్మాన్ని వీడినట్లవుతుంది. ఈ రీతిలో చేసినట్లయితే, తన పూర్విజులు స్వాయంభువ మనువు నుండి తన తండ్రి దశరధుని వరకు కళంకాన్ని, తన తదుపరి వంశీకులకు అధోగతిని తెస్తుంది. ఇది వంశ ప్రతిష్ఠాభంగం. అందుచే గర్భవతి అయిన సీతమ్మను విడిచిపెట్టాడు. అదీ ఎక్కడ... నట్టడవిలో కాదు, నయవంచకుల నడుమ కాదు, కీకారణ్యంలో కాదు, కీచకుల నడుమ కాదు, మహర్షులు ఋషులు నడయాడే సురక్షిత పవిత్ర ప్రాంతమునకు దగ్గర్లో. ఇది అందరూ గుర్తిస్తే బాగుంటుంది. 


మనకు అర్ధమైన, కాకున్నా మన పురాణ ఇతిహాసాలలో ప్రతీ ఘటన వెనుక చక్కటి పరమార్ధముంటుంది. ఇది సత్యం. అందుకే - త్రికరణశుద్ధిగా శ్రమించి శోధించి, ఛేదించి సాదించు ... లే, మేల్కో అని అంటారు స్వామి వివేకానందులవారు. 

త్రేతా, ద్వాపర యుగములందు పంటలు పండకపోయిన, అకాల మరణములు చెందిన, ఏ కష్టం ఏర్పడినా... రాజునే ప్రశ్నించేవారు. రాజా! నీ పాలనలో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, అందుకే ఇలా జరుగుతుందని నిందించేవారు. రాజు మహర్షులతో, మంత్రులతో ఆ తప్పిదం ఎక్కడ జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి, సరిదిద్ది ధర్మానుసారం పరిపాలన సాగేది. అటువంటి రాజపాలనలో అందరూ ఎంతో సుభిక్షంగా సురక్షితంగా ఉండేవారు. 

ఆ యుగంలో ధర్మం - సత్యం అనే పాదం కుంటుపడి మిగిలిన మూడు పాదాలపై నడిచింది. సత్యం మసకబారితేనే సీతారాములకు జనాపవాదు తప్పలేదు. ఈ యుగంలో ధర్మం - మూడుపాదాలు కొరవడి, దానం అనే  పాదంపై నడుస్తుంది. అందుకే ఇన్ని వాదనలు.కుతర్కాలు. తర్కానికి అందదు సత్యం. 





                                                               కర్మ - ఖర్మ 

తలరాతని తప్పించుకోలేమా? 
అసలు తలరాత అంటే ఏమిటీ?

ఆయుష్షు తీరో, జవసత్వాలుడిగో నశించిపోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరోశరీరానికి కర్మల్ని బదిలీచేస్తాయి. శరీరాలు నశించిన కర్మశేషాలు నశించవు.  వెన్నంటే వస్తాయి, వెంటాడుతునే ఉంటాయి. ఆ కర్మశేషాలనుభవించడానికి మరల మరల జన్మించడం. 
మనకి ఆ కర్మశేషాలు గుర్తుండక పోవచ్చు కానీ, మరిచిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు. ఇదే విధి లేదా తలరాత లేదా లలాటలిఖితం. 

కర్మలకు మరణం లేదు. మనిషి మరణించినా కర్మలు మరోజన్మకు పయనిస్తాయి. గతజన్మ కర్మలు కంటికి కనిపించవు. కానీ, ఈ జన్మలో అనుభూతమౌతాయి. పూర్వజన్మల కర్మబీజ ఫలాలే విధిరాతలు. గతజన్మల కర్మలశేషఫలంకు అంటే విధికి , నేటి కర్మల ఫలితంకు అనుసంధానింపబడి సాగుతుంది ఈజన్మ జీవనయానం.
సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో గాని, అనుకునేరీతిలో జీవనం సాగనప్పుడు, అనుకోని అవాంతరాలప్పుడు అనిపిస్తుంటుంది - ఇదంతా మన తలరాత అని. మనచేతిలో ఏదీలేదు, తలరాత ఎలా వుందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాం. ఇదో నిరాశావాదం.  ప్రారబ్ధమే మనిషిని నడిపిస్తే, అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా? విధి చేతిలో మనం కీలుబొమ్మలమైతే ఇక మనం చేయగలిగింది ఏముందీ?  ఇది నా తలరాత అని అనుకున్నంతకాలం ఆవేదన తప్పదు, నిరాశ వీడదు.







జన్మించిన ప్రతీజీవి విధికి తలవొగ్గక తప్పదు. కానీ, ప్రతిఒక్కరికి విధిని ఎదిరించేశక్తి వుంది.  విధి బలీయమైనదే కావొచ్చు... కానీ, దానిని మార్చుకోవచ్చు... వజ్ర సంకల్పంతో, నిరంతర సాధనతో, అకుంఠిత భక్తితో.  ఇందుకు ఉదాహరణంగా కొన్ని గాధలు గుర్తుచేసుకుందాం -


విధిరీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి, తన ఆత్మ విశ్వాసంతో,  వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి - సత్యవంతుల కధ మనందరికీ విధితమే. 
పదహారు ఏళ్ళు మాత్రమే ఆయుష్షు ఉన్న మార్కండేయుడు తన అకుంఠితభక్తితో యముణ్ణి జయించి, శివుని ఆశిస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా?
చదువునందు రాణించలేక, తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి, నాయనా! నీకు విద్యారేఖ లేదు, చదువుకునే యోగం లేదు, కాబట్టి నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లి, తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై, ఇంటికి బయలుదేరి, మార్గమధ్యంలో దప్పికై, ఓ రాతిగిలక బావి దగ్గర ఆగి, దాహం తీర్చుకుంటూ, తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతిగిలకను చూసి, బలహీనమైన తాడువల్ల రాయే అరగగా, నేను సాధనతో విద్యను ఆర్జించలేనా అన్న దృఢ నిశ్చయంకు వచ్చి, పదునైన రాతిముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకోని, తిరిగి గురువు చెంతకు వెళ్ళి, నిరంతర సాధనతో అనతికాలంలోనే విద్యను అభ్యసించి, సంస్కృత వ్యాకరణం వ్రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా?

చిన్నప్పుడు మా అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు, అమ్మ, మా మేనమామగారు కష్టసుఖాలు చెప్పుకునేవారు. ఒకోసారి అమ్మ - మన తలరాతలిలా ఏడ్చయిరా అన్నప్పుడు, చేసుకునేవారికి చేసుకున్నంత అక్కాయ్ ... అయినా కష్టాలు మంచికే, అన్నీ తెలుసుకోవచ్చు, అయినవారు ఎవరో, కానివారు ఎవరో తెలుసుకోగలుగుతాం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనుభవించక తప్పదని తెలిసి మంచిగా బ్రతకాలని చూస్తాం. ఎప్పుడు కంటే దేవుణ్ణి ఎక్కువ తలుస్తాం, కష్టం గట్టెక్కాక దేవునిదయవలన బయటపడ్డామని తెలుసుకొని, ఎల్లవేళలా దేవుణ్ణి నమ్మండని పిల్లలకు మంచి చెడు చెపుతాం. అన్నీ మన మంచికేనే ... అనేవారు.  


అందరం ఒకటి గుర్తుంచుకోవాలి -  మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయం. విధిరాతలు స్వయంకృతం.  స్వీయకర్మలే మన విధిరాతలు. అంటే మన విధిరాత విధాతలం మనమే. గతజన్మల  కర్మశేషాలే నేటి విధిరాతలయినట్లు, నేటి కర్మలే మరుజన్మ విధిరాతలు. కర్మలు చేయడం అనివార్యం. ఆ కర్మలలో కొన్ని ప్రారబ్దాలుగా మూటకట్టుకోవడం నిజం. అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు. ఇలా పుట్టడం ... గిట్టడం ... తప్పదా ఈ చక్రపరిభ్రమణం ... రాదా ముక్తి?
వస్తుంది ... ఎప్పుడు? గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు... 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః' 
ఈశ్వరార్పణ బుద్ధితో, భగవత్ కైంకర్యబుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమౌతాయి. 


బ్రహ్మణ్యాధాయ కర్మాణి  సంగం త్యక్త్వా కరోతి యః 
లిప్యతే న స పాపేన పద్మపత్ర మివామ్బసా 
ఎవరు కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి, ఆసక్తి లేకుండా తన కర్మలు  ఆచరిస్తారో, అటువంటి వారు నీటిచే అంటబడని  తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు. 

ప్రతీ ఒకరు చింత చింతన వీడి సానుకూల దృక్పధం ఏర్పరుచుకోవాలి.



ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి. 
సానుకూల భావం సాధనా సోపానం. 
సంకల్పం దృఢమైతే సాఫల్యం సమక్షంలోనే.


37 కామెంట్‌లు:

  1. ఆనాటి రాజధర్మం గురించి బాగా చెప్పారు. అర్ధం చేసుకోక విమర్శించేవారు విమర్శిస్తునే ఉంటారు. వేమనగారు అందుకే అన్నారు ...



    ఓగు బాగెరుగా యుత్త మూఢజనంబు

    నిల సుధీజనముల నెంచజూచు

    కరిని గాంచి కుక్క మొరిగినసామ్యమౌ

    విశ్వదాభిరామ వినురవేమ !



    విధిరాతలు గురించి కూడా చక్కగా చెప్పారు. నైస్ పోస్ట్.,

    రిప్లయితొలగించండి
  2. విథి బలీయ , మయ్యును , బుథు లధిగమింతు
    రనుచు నుదహరించిన తీరు ఘనము , ' భార '
    తీయ , వచ సంవిధాన , మతి ప్రశంస
    నీయ , మెన్న నెన్ని గతుల నేని , యనఘ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టారు గారు,
      నమస్సులు.
      బాగున్నారా?
      మీ స్పందనకు మనసార ధన్యవాదములు.

      తొలగించండి
  3. చక్కగా చెప్పారు. కాని నిందలు వేసేవారికి వారివారి ఎజెండాలు వారికుంటాయి. రాముడు వచ్చి శిక్షించడన్న నమ్మకం మాత్రం వారికి తప్పకుండా ఉంది. అందుచేత వారిచిత్తం వచ్చినట్లు వారు మాట్లాడుతారు. వచ్చే నిందయేదో అది రాముడికి ఎన్నడో వచ్చింది సాక్షాత్తు ఆయన రాజ్యంచేస్తున్న కాలంలోనే. ఈరోజున అవ్యక్తుల మాటలలో వచ్చే నిందలను గురించి విచారించటం దేనికి? మంచిచెడుల తారతమ్యం చక్కగా గ్రహించ గలవారు ఏకాలంలో ఐనా స్వల్పసంఖ్యాకులుగానే ఉంటారు. నరుని నాలుక పలుచన. ఈ నరజాతిలో అందరూ ఏమి మాట్లాడినా విషయం సరిగా తెలిసే మాట్లాడుతున్నారా? పోనివ్వండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సర్,
      నమస్తే.
      నిజమేనండీ ... నరుని నాలుక పలుచన. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుంటే మనస్సుకు బహు కష్టంగా ఉంటుంది.
      మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  4. రాజ ధర్మం వ్యక్తి ధర్మం వేరు వేరన్న విషయం బాగా చెప్పేరు.

    రిప్లయితొలగించండి
  5. రామభక్తుడు22 ఏప్రిల్, 2021 8:09 PMకి

    *మా రాములోరి గాదే...*
    *ఒకపరి సదివేయండి మరి..*
    👇👇👇👇👇👇👇

    పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు.

    అవడానికి పెద్దాడివే అయినా అల్లరిచేశావు.

    అందరాని చందమామకోసం అలకలుపోయావు.
    కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు.

    బాగా చిన్నప్పుడే హాస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు.

    ఆయన్నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు.

    ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభని ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు.

    తీరా పెళ్ళయ్యీ భోజనాలకి కూచుందాఁవనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు.

    చెప్పొద్దూ! అంతహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు.

    ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభని ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.

    ఎంతముద్దుచేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు.

    నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానాయాగీ చేసేసింది.

    నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదుపొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది.

    ఇక్కడుంటే తమిళనాడులోలా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏఁవిటో?

    పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు.

    ‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు.

    నీకుతోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓవుత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు.

    తనూ నారబట్టలు కట్టేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.

    ఇహ మీతమ్ముడు. చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! వందచెప్తారు.

    డబ్బడిగితే జేబుఖాళీ అంటారు.
    పన్చెబితే చెయిఖాళీలేదంటారు.

    అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు.

    వాళ్ళతో కలిసి నీమూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు.

    నిశ్శబ్దమందిరాల్లో నిదరోయే మహరాజుబిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠికిందే పడుకున్నావు.

    ఒకటారెండా..పధ్నాలుగేళ్ళు!

    ఎన్నోతప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు.

    జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మాసరదా తీర్చకుండా బయటే ఊరేగుతూవుంటారు.

    అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు.

    అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచినవెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు.

    నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు.

    ఇంటో అన్నీవుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం!

    అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆలేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపెంచెంది, తెద్దాఁవని బయల్దేరావు.

    మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు.

    ఏమాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు.

    నిస్సహాయతనేది సామాన్యమానవుణ్ణి ఎలాబాధిస్తుందో నిరూపించావు.

    మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు.

    ఎంతో ఇష్టంకాబట్టే ఎంతకష్టపడాలో అంతాపడ్డావు.

    ఏసాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ ఆరుమెట్ల పుస్తకాలూ చెప్పలేదు.

    తాతయ్య నోటివెంట నీకథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటనుమానం కోతుల్నెలా లొంగదీసుకోవడమని!

    అదీ చూసేవాళ్ళం మాచిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం!

    వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది!

    ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువుచేసిన స్నేహమూ, ఆనక వాళ్ళసాయంతోనే నువుకట్టిన వారధీ చూస్తే...

    దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!

    సెభాషోయ్ రామా! నీగురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా!

    నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీజీవితం!

    నిలకడలేనివాళ్ళతో పొంతన
    నీళ్ళని దాటడానికొక వంతెన
    నిర్భయమేగావుంటే నీచెంతన
    నిరాధారులకిచ్చావు సాంత్వన
    నికార్సైనది నీమార్గం ఎంతైనా
    నిరతమూ మాకదేకదా చింతన

    నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!

    నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని
    నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!

    పదిమందీ కలిస్తే పండగ! పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!

    అందాలరాముడు....
    అందువలన దేముడు!!


    వాట్సాప్ సేకరణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామభక్తులు గారు
      ఎంత చక్కటి సేకరణ
      బహు ముచ్చటగా ఉంది

      ఇంత మంచి సేకరణను వ్యాఖ్యగా అందించినందుకు మీకు మనసార 🙏

      తొలగించండి
    2. ఏసాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ ఆరుమెట్ల పుస్తకాలూ చెప్పలేదు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  6. రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నీతి: "లక్ష్మణుడిలాంటి తమ్ముడ్ని పక్కనపెట్టుకోవాలి. విభీషణుడిలాంటి లాంటి తమ్ముడిపై ఓ కన్నేసుండాలి"- ఓ 'చిరు'మాట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విభీషణుడు రావణుడి ప్రాణరహస్యం ఏదో రాముడికి చెప్పాడన్నది వట్టి కల్పన. వాల్మీకి అలా ఏమీ చెప్పలేదు. విభీషణుడు ధర్మమూ హితమూ చెప్పినా రావణుడు వినక చెడిపోయాడు. ఇదే వాల్మీకీయం. అసలుకథ.

      తొలగించండి
    2. నేనొకసారి చెక్ చేసుకుంటాను. థాంక్స్ శ్యామలీయం గారు

      తొలగించండి
    3. అవునండీ శ్యామలీయంగారూ! సారధి మాతలి సూచనపై, రాముడు బ్రహ్మ ముహూర్తంలో.. బ్రహ్మాస్త్రం ప్రయోగించగా, అది రావణుని గుండెల్లో గుచ్చుకోని మరణించాడు.

      కొన్నిచోట్ల "చావు బ్రతుకుల్లో వున్న రావణుడీనుంచి, ధర్మాలు నేర్చుకోమని రాముడు.. లక్ష్మనుడ్ని పంపాడు" అని చదివాను. అదికూడా హంబలక్కేనా?

      తొలగించండి
    4. రావణుడు రాముడి బ్రహ్మాస్త్రానికి పడినమాట వాస్తవంగా వాల్మీకి రామకథ చెప్పిన మాట. ఐతే రావణసహారం‌ బ్రాహ్మీముహూర్తంలో జరిగిందని వాల్మీకంలో లేదే! రావణుడి నుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోమని రాముడు లక్ష్మణుణ్ణి ఆదేశించటం అన్నది కూడా కల్పితకథే. వాల్మీకంలో లేదు. కవులకు కల్పనాచాతురిని ప్రదర్శించే స్వేఛ్ఛ తప్పకుండా ఉంది. ఐతే మూలకథను కాని పాత్రలనూ వాటిస్వభావాలను కాని అనుచితంగా ఉండేలా మార్చకూడదు. ముఖ్యంగా గోన బుధ్ధారెడ్డి గారి రంగనాథరామాయణం ఇలాంటి చిత్రమైన కథలకు కాణాచి. కొండొకచో అనుచితమైన కల్పనలూ కద్దు. రాముడు కోరి శివుడి వింటిని చూసి ఇలా అంటాడట "ఇది చాల చులకన ఇది చాల అలతి నిలువదు నాముందు నీవు భూపాల పొగిడితి పదిమార్లు....." ఇదంతా ఏమిటీ? సాక్షాత్తు పరమేశ్వరుడి విల్లు చులకన అంటాడా మర్యాదాపురుషోత్తముడు!? ఇంక మునిపల్లె సుబ్రహ్మణ్యకవి గారి ఆథ్యాత్మరామాయణ కీర్తన చూడండి "బెండు వంటి విల్లు నడుముకు రెండుచేసె మల్లు" అని రాముడి చేత అనిపిస్తారు! శివుడి విల్లు బెండులాగా ఉంటే బోలెడు మంది చచ్చిచెడి దాన్ని లాగికొని రావటం ఎందుకు జరిగిందీ? రాముణ్ణి పెద్ద చేయాలన్న తాపత్రయంలో శివుణ్ణి తేలికపరచి అపచారం చేస్తున్నాం‌ అన్న స్పృహ లేకపోతే ఎట్లా? ఒక కవి రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అన్నారు అందంగా - కాని అహల్య రాయిలా మారిపోయిందని రామాయణం చెప్పలేదే? ఇకపోతే పత్రికల్లో వస్తున్న రామాయణభారతాదుల్లో కూడా రచయితలు అత్యత్సాహంగా అదనపు మాటలు స్వంతంగా పేర్చుతున్నప్పుడు మూలవిరుధ్దమైన భావాలు కనబడుతున్నాయి. ఇలాంటివి ఎన్నో మరి. అందుకే నాటకాలూ సినిమాలూ‌ సులభవచనరచనలూ చదివి పొరపాటు అభిప్రాయాలకు రావద్దని అందరికీ విన్నవించుకొనేది.

      తొలగించండి
    5. చిరంజీవి గారు,
      'ఓ వీరుడా! రామా! అన్ని అస్త్రాలు తెలిసిన నీవు, ఇంకా ఉపేక్షిస్తున్నావెందుకు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు... అన్న రధసారధి మాతలి మాటలు విని, తనకు అగస్త్యుడు ప్రసాదించిన బ్రహ్మాస్త్రాన్ని రావణుని వక్షస్థలంపై ప్రయోగించడం, ఆ అస్త్రం రావణుని హృదయాన్ని చీల్చి సంహరించి తిరిగి అంబులపొదికి చేరుకోవడం ఒకేసారి జరిగాయి. అస్త్ర ప్రభావంతో వెంటనే రావణుడు సంహరింపబడ్డాడు. ఇంతవరకు మీరు చదివింది నిజం.

      నాకు తెలిసినంతవరకు రాముడు లక్ష్మణుని రావణుని వద్దకు వెళ్ళి ధర్మాలు నేర్చుకోమని చెప్పడం కట్టుకధే.

      తొలగించండి
    6. అంబులపొదిలోకి చేరుకోడానికి ముందు, గంగానదిలో(శ్రీలంకలో గంగానది ఎందుకుంది అని అడక్కండి. అది ఏదైనా నీటి వాగో, మడుగో కావచ్చు) మునిగి, తనను తాను శుద్ది చేసుకోని మరీ తిరిగి వచ్చింది బ్రహ్మాస్త్రం.

      తొలగించండి
    7. >>ఐతే రావణసహారం‌ బ్రాహ్మీముహూర్తంలో జరిగిందని వాల్మీకంలో లేదే!

      క్షమించండి, ఇది కూడా నా పొరపాటే, దేవతలు పెట్టిన ముహూర్తము అని రాయబోయి, బ్రహ్మ ముహూర్తం అని రాశాను.

      తొలగించండి
    8. >> ఇకపోతే పత్రికల్లో వస్తున్న రామాయణభారతాదుల్లో కూడా రచయితలు అత్యత్సాహంగా అదనపు మాటలు స్వంతంగా పేర్చుతున్నప్పుడు మూలవిరుధ్దమైన భావాలు కనబడుతున్నాయి.

      అందుకేనండీ ఇంగ్లీషోడు పేటెంటులుండాలి అనేది.

      తొలగించండి
  7. మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే - లక్ష్మణుడులాంటి తమ్ముడు అండగా మన ప్రక్కన ఉండాలి. విభీషణుడులాంటి తమ్ముడు చెప్పే మంచి మాటలు వినే వివేకమూ మనలో ఉండాలి. ఇది 'పెద్దల' మాట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతి ఒక్కడూ, తనకి తాను రాముడీగానూ, అవతలివాడు రావణుడిగానూ ఫీలఔతుంటారు. తనకు సప్పోర్టూన్నంతమాత్రాన తమ్ముడు లక్ష్మణూదూ కాదు, ఎదురు తిరిగినంతమాత్రాన విభీషణుడూ కాదు.

      తొలగించండి
  8. శ్యామలీయం గారు,
    మీ వ్యాఖ్య చూడడం ఒకింత ఆలస్యమైంది. ఈ లోగా నాకు తెలిసింది తెలిపాను. మీ వివరణ... విస్తారమైన మీ పరిశీలనకు జోహార్లు 🙏

    రిప్లయితొలగించండి
  9. చిరంజీవి గారు,
    రావణుని వక్షఃస్థానమును చీల్చి తీవ్రవేగంగా భూమిలోనికి వెళ్ళి వచ్చి అమ్ములపొదిని చేరిందని చదివిన జ్ఞాపకం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "భూమిలోకి వెల్లి అక్కడి గంగలో తనని తాను శుద్ది చేసుకొని" అని రాయబడి వుంది భారతిగారూ

      తొలగించండి
    2. చిరుగారూ, చెప్పాను కదండీ, కవుల ఊహలు వాల్మీకాన్ని మించి విస్తరించబోయి అప్పుడప్పుడు అపోహలకు దారితీస్తున్నాయి అని. వాల్మీకంలో ఉన్నది చూడండి:

      రుథిరాక్తః సవేగేన శరీరాంతకరః శరః
      రావణస్య హరణ్ ప్రాణాన్ వివేశ ధరణీతలమ్‌ (యుధ్ధ-108-19)
      వేగంతో కూడి శరీరాన్ని అంతంచేసే ఆ బాణం రావణుడి ప్రాణాన్ని హరించి రక్తసిక్తమై భూమిలోనికి చొచ్చుకొనిపోయింది.

      స శరో రావణం హత్వా రుధిరాఽర్ద్రీకృతచ్ఛవిః
      కృతకర్మా నిభృతవత్ స్వతూణీం పునః ఆవిశత్ (యుధ్ధ 108-20)
      రక్తంతో తడిసి మెరుస్తున్న ఆబాణం తనపని పూర్తిచేసినదై తిరిగి తనయొక్క స్వస్థానమైన (రాముడి) తూణీరంలోనికి నిశ్శబ్దంగా ప్రవేశించింది.

      ఇక్కడ బాణం గంగాస్నానం చేయటం అన్నది ఒక ఊహ ఐతే అది వియద్గంగా పాతళగంగా అనో, భూమిమీది గంగ ఐతే - శ్రీలంకలో గంగానది ఎక్కడ అనో చర్చలు బయలుదేరుతాయి కదా!

      తొలగించండి
    3. విపులముగా తెలియజేసినందుకు ధన్యవాదములు సర్

      తొలగించండి
    4. శ్యామలీయంగారూ! రామాయణాన్ని వాల్మీకి ఏభాషలో రాశారంటారు?

      తొలగించండి
    5. చిరుగారు, వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం కావ్యాన్ని సంస్కృతభాషలో రచించారు. ఇది జగద్విదితమే. భారతదేశంలో సంస్కృతం నిన్నమొన్నటిదాకా అనుసంధానభాషగా ఉండేది.

      తొలగించండి
    6. ఏమీలేదండీ! నా సందేహమేమిటంటే, వాల్మీకి ఒక బోయ. మారిపోయే సమయాఇకి, అతనికి భార్యా, పిల్లలు వునంట్ళుగా తెలుస్తోంది. ఆ వయస్సులో సంస్కృతం నేర్చుకోని మరీ అంత ఉద్గ్రంధం రాశాడంటే నమ్మడానికి అంతగా శక్యమవ్వట్లేదు.

      ఇక హనుమంతుడికి సముద్రంలోని పాతాళలోకంలో ఒక కొడుకు ఉన్నాడని, అతనితో హనుమంతుడు యుద్ధం చెయ్యాల్సొచ్చిందనీ.. విన్నాను.

      తొలగించండి
    7. పురాణపాత్రలను గురించి అనేకకథలు వ్యాప్తిలో ఉంటాయి.వేటికీ ఆధారాలు ఉండవు. వాల్మీకి బోయ అంటూ ఏవేవో‌కథలున్నాయి. కాని రామాయణం ఉత్తర కాండలో ఒక్క చోట తప్ప వాల్మీకి తన పరిచయం ఎక్కడా చెప్పుకోలేదు.నేను ప్రచేతసుడి కొడుకుల్లో ఒకడిని (అంటే ప్రాచేతసుడిని) వేలాది సంవత్సరాలు తపస్సుచేసిన మహర్షిని. నాదగ్గర అసత్యమూ పాపమూ లేవు. సీత విశుధ్ధ చరిత అని చెప్తున్నాను నేను. నామాట అసత్యం ఐతే నా తపస్సు అసత్యం అగుగాక అంటాడు ఒకపాత్రగా తాను రాముడితో. తమ గురించి చెప్పుకోవటంపై మహర్హులకు ఎన్నడూ అంత ఆసక్తి లేదు. కాబట్టి వాల్మీకిని గురించి మనకు నిజంగా ఆట్టే తెలియదు. ఆయన పెద్దైన తరువాత సంస్కృతం నేర్చుకోవటం‌ కాదు. ఒక మునికుమారుడిగా సంస్కృతభాషావాతావరణంలోనే‌ పెరిగాడని అనవచ్చును. ఐతే వేదములు అప్పటికే వ్యాప్తిలో ఉన్నా ఇతరసాహిత్యం ఏర్పడి లేదు రామాయణమే సంస్కృతంలో వచ్చిన తొలిసాహిత్యస్వరూపం. అందుకే వాల్మీకి ఆదికవి.

      తొలగించండి
    8. ఉత్తర కాండ ప్రక్షిప్తమే కదా?

      తొలగించండి
    9. ఇలా చారిత్రాత్మక అధారాలు లేనివాటి గురించి ఎంత చర్చిస్తే, అంత గందరగోళంగా వుంటాయ్. ఇక వొదిలేద్దాంలేండి

      తొలగించండి
  10. వాల్మీకి రామాయణం, రాముని పట్టాభిషేకంతో ముగిసిపోతుంది. కథకి సుఖాంతం లాగన్నమాట. ఆ తర్వాత వొచ్చేదంతా పాత సినిమా టైటిల్తో వచ్చే కొత్త కథలే..

    రిప్లయితొలగించండి
  11. చిరుగారు, మీరు ఉత్తరకాండ గురించి కొన్ని మాటలు అన్నారు. ఈచర్చను పొడిగించటం నాకూ అంత సమ్మతం కాదు కాని ఉత్తరకాండ గుంరించి చెప్పకుండా ఉండలేక నిన్ననే శ్యామలీయంలో వ్రాసాను ఉత్తరకాండ వాల్మీకి కృతమే అని. ఆసక్తి ఉంటే చదవండి.

    రిప్లయితొలగించండి
  12. శ్యామలీయం గారూ!వాల్మీకం పట్ల మీకున్న సాధికారతకు నమస్సులు!!

    రిప్లయితొలగించండి