21, డిసెంబర్ 2019, శనివారం

సాధకులారా ఒక్క క్షణం ...{విగ్రహారధన}

ఇక విగ్రహారధన గురించి -
                    

సాధరణంగా మనం ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఆకారం, ఒక ధ్యేయం లేనిదే సాధన చేయలేము. అందుకే సాధకులకు ఉపయుక్తంగాను, సులభసాధ్యంగాను ఉండటానికి సహస్రనామాలు, స్తోత్రాలు, మంత్రాలు, విగ్రహారాధనలు అంటూ ఆధ్యాత్మికమార్గాన్ని సుగమం చేశారు మనఋషులు.
                      
పరబ్రహ్మం సర్వవ్యాపియై యుండినను, అది అవ్యక్తమైయుండిన కారణమున, ఒక  వ్యక్తవస్తువు నాశ్రయించక పోతే గోచారం కానేరదు.  అటులనే మనసు చంచలమైనది. ప్రతిక్షణం చింతుస్తూ ఉంటుంది. దానిని నియంత్రించి ఏకాగ్రత సాధించటానికి కూడా ఓ మార్గం  విగ్రహారాధన.

సగుణ జ్ఞాన హీనస్య న హి నిర్గుణవేదనమ్'
సగుణజ్ఞానం లేనివారికి నిర్గుణజ్ఞానం సిద్ధింపదు.

మనోధృతిర్ధారణా స్యాత్ మాధిర్బ్రహ్మాణి |
అమూర్తో చేత్ స్థిరా న స్వాత్ తో మూర్తి || 
మనస్సు యొక్క ధృతి (స్థిరత్వం) ధారణ అనబడుతుంది. బ్రహ్మస్థితి పొందటం సమాధి అవుతుంది.కానీ, మనసు స్థిరంగా ఉండదు కాబట్టి ఆలంబనగా విగ్రహాన్ని గ్రహించటం అవసరమౌతుంది.
అంటే జ్ఞానస్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి. అది విగ్రహారాధన వలన సాధ్యమౌతుంది.
     
కావున, నిర్గుణ నిరాకార పరబ్రహ్మను ధ్యానించగలిగే స్థితిని చేరేవరకు సగుణమూర్తిని ఉపాసించటం సముచిత విధానమే.

భగవంతుని విగ్రహాన్ని చూడగానే ఇంద్రియాలు శాంతిస్తాయి. మనస్సు ప్రశాంతతను పొందుతుంది. పరమేశ్వరుని నామాలను కీర్తించగానే బుద్ధికి ప్రశాంతత చేకూరుతుంది. ఇది పారమార్థిక పురోగతికి దోహదపడుతుంది.
                 

గురువైన వషిష్టులవారు ద్వారా జ్ఞానాన్ని పొందినా, శ్రీరాముడు ఎందుకు లింగప్రతిష్టలు చేసి పూజించాడు? 
ఏ శక్తి లేకుంటే శ్రీరామచంద్రుడు, హనుమా మరియు కపిల, నారద, వశిష్ట, భరద్వాజ, అగస్త్య, భృగుమహర్షులు, శ్రీశంకరులు విగ్రహప్రతిష్టలు, శ్రీచక్రస్థాపనలు ఎందుకు చేస్తారు? 

మానవనిర్మిత వ్యవస్థలోఒకకాగితముపై ప్రభుత్వ కరెన్సీ ముద్రవుంటే దానికి విలువ ఏర్పడినప్పుడు సర్వేశ్వరసృష్టిలో వేదాల ప్రాతిపదికన ఆగమశాస్త్రం ప్రకారం మంత్రశక్తులతో ఆవాహనంచేస్తూ ప్రతిష్టించిన విగ్రహాలలో దైవత్వం ఉండదా?

రాతిలో దైవమును చూడలేనివారు, వాదనలు ఎన్నో చేయవచ్చు. కాని రాతిలో కొలువై ఉండగల శక్తి దైవానికి ఉంది. దానిని దైవమహత్యంగా మనం తీర్మానిస్తే అది భక్తి అవుతుంది. ప్రహ్లాదుడు భక్తిగా అలా ప్రార్ధించాడు కాబట్టే, రాతిస్థంబం నుండి నృసింహస్వామి ప్రత్యక్షం అయ్యాడు. 
                
ఇక విగ్రహమును ఆరాధించడం అంటే విగ్రహంలోవున్న విశ్వవ్యాప్తచైతన్యమును ఆరాధించడం.  భక్తులు విగ్రహంలో దైవమును చూస్తారు. అది విశ్వాసం.

మార్కేండేయుడు శివలింగమందు పరమేశ్వరుడు ఉన్నాడని నిశ్చయభక్తితో పూజించినప్పుడు వానియొక్క యమబాధ నివృత్తికొరకు ఈశ్వరుడు ఆవిర్భవించి కాలున్ని నిలువరించలేదా? తరిగొండ వెంగమాంబకు, హత్తిరాంబావాజీ గారికిని శ్రీ  
వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షం కాలేదా? 

సాకారమా, నిరాకారమా, ద్వైతమా, అద్వైతమా అనే వాదనలు ఎందుకు? పరమసత్యం తెలుసుకోవడానికి ఇన్ని వివరణలు విశ్లేషణలు ఎందుకు? ఈ వివరణలు, విశ్లేషణలు అన్నీ మనస్సుతో ఇచ్చినవే. ఇవన్నీ అహంలోనివే. అసలు తత్త్వానికీ, ఆత్మకు వీటికి సంబంధంలేదు. మనస్సు నశించడానికి అవన్నీ తెలియాల్సిన పనిలేదంటారు శ్రీరమణులు.

వేదాంతపుస్తకాలు చదవడం, మననంచేసుకోవడం, కంఠస్థంచేయడం, తర్కించడంవలన జ్ఞానంరాదు. ఇవన్నీ సాధనాక్రమంలో సోపానాలు. ఆధ్యాత్మిక పరిణితికి దోహదంచేస్తాయి. మనం తెలుసుకుంటుంది విషయజ్ఞానం. విషయజ్ఞానం చాలావరకు అవగాహనకి తప్ప ఆత్మానుభవానికి ఉపయోగపడదు. శాస్త్రప్రమాణంతో శోధనవలన కలిగే ప్రయోజనం కంటే హృదయనివేదనవలన కలిగే ప్రయోజనం శక్తివంతమైనది.   
                   
సాధక మిత్రులారా! 
ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తిగతభావననే పరమావధిగా బ్రతకడం సరికాదు. ఆత్మానుభవం కోసమే, ఈ సాధన చేస్తున్నామన్న విషయం గ్రహించండి. మాది ఈ మార్గం, మాది ఈ సిద్ధాంతం, మాది ఈ తత్త్వం అనే బదులు మన అందరిది భగవంతుని మార్గం అని అనుకోవడంలో ఎంతటి సామరస్యత. ఆధ్యాత్మికమార్గాలన్నీ ఆత్మానుభవానికే అనుకోవడంలో ఎంతటి సానుకూలత.
భగవంతుడు మన మన యోగ్యతలబట్టి ఓ మార్గాన్ని చూపిస్తాడని నమ్మి, మనం నిమిత్తమాత్రులమని భావించి, అన్నింటినీ అనంతునికి నివేదిస్తూ, వినయంగా మసులుకోవడంలో  ఎంతటి సౌహార్ధత.
వ్యక్తిగతభావనను అనుభవిస్తున్నంతవరకు మనలో అనంతత్వ పూర్ణత్వం అవగతం కానట్లే. 
ఎవరు ఏ మార్గముననుసరించినా, తమలోని అహంభావనను పొగొట్టుకొనుటకే. ఎవరు ఏ మార్గముననుసరించినను చివరకు వారు తెలుసుకున్నది తాను ఆత్మయేనని. 
భిన్నత్వాన్ని చూడటం జీవత్వం. ఏకత్వాన్ని చూడటం దివ్యత్వం. ఏకత్వం వచ్చినప్పుడు మనకంటే భిన్నంగా ఏదీ ఉండదు. స్వీకరించడం, విడిచిపెట్టడం, దోషాలను గుర్తించడం...అంటూఏదీఉండదు.

భౌతికం-ఆధ్యాత్మికం, జగం-బ్రహ్మం, నేను-నీవు, అజ్ఞానం-జ్ఞానం ... ఈ ప్రతిపాదనలన్నీ ఆత్మానుభవం కల్గినంతవరకే. అది గ్రహించి ఈ ప్రతిపాదనలు ఏవీ లేకుండా సాధన చేస్తే - అన్యంగా ఏదీ ఉండదు. అంతా బ్రహ్మత్వమే. అంతా సత్యమే. సదా సత్యాన్ని సమ్మతిస్తే సరిపోతుంది.

సాధన అనగా అహమునకు జన్మస్థానమైన నేను ఎవరో తెలుసుకొనుటకు చేయు నిరంతరాన్వేషణ. ఆత్మలో  సుస్థితులై ఉండుటయే సరైన సాధన. 'నేను' అన్నప్పుడు హృదయంలో వున్న సత్యం గనుక స్ఫురిస్తే అది జ్ఞానస్వరూపం.

10 కామెంట్‌లు:

  1. "హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు" అని ప్రహ్లాదుని సూక్తి. పరమాత్ముడు లేని ద్రవ్యం అమ్టూ ఉంటే అది ఆపరమాత్ముని కన్నా స్వతంత్రమైనది కావలసి ఉంటుంది. అది "ఏక మేవా౽ద్వితీయం బ్రహ్మా" అన్న శ్రుతి వాక్యప్రామాణికతకు భంగం. అందుచేత శంకలు మాని పరమాత్ముడిని సర్వము నందునా దర్శించటమే కర్తవ్యం. ఈ విషయంగా పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తిగారు తమ సీతారామాంజనేయ సంవాదంలో చెప్పిన పద్యం అనుసంధానించుకోవటం సముచితంగా ఉంటుంది.

    మ॥ గరిమన్‍ స్వర్ణ మనేకభూషణములన్‍ కన్పట్టు చందంబునన్‍
    పరమాత్ముం డఖిలప్రపంచమయుడై భాసిల్లు నట్లౌటచే
    సురసిధ్ధోరగయక్షకిన్నరనరస్తోమాది శశ్వత్‍ చరా
    చరరూపోజ్వల సర్వభూతములకున్‍ సద్భక్తితో మ్రొక్కెదన్‍

    రిప్లయితొలగించండి
  2. అద్భుతః భారతిగారు. ఎంత చక్కటి విశ్లేషణ. 👏👏👏

    శ్యామలీయంగార్కి నమస్కారములు. దయజేసి మీరు ప్రస్తవించిన పద్యమునకు అర్ధం తెలియజేయరా.

    రిప్లయితొలగించండి
  3. గరిమన్.... పద్యానికి భావము:
    స్వర్ణం అంటే బంగారం. అది ఆభరణాలలో ఉంటుంది. ఆభరణాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటికి చేచబడిన ఇతరవస్తువుల వలనా, వాటి యొక్క వివిధమైన స్వరూపాల వలనా అవి ఒకదానికి ఒకటి భిన్నంగా కనిపిస్తాయి. కాని అన్నింటిలోనూ ముఖ్యంగా ఉండేది బంగారమేను. అలాగే జీవులు వివిధ రకాలుగా ఉంటాయి. సృష్ఠిలో నిర్జీవవస్తువులూ వివిధాలుగా ఉన్నాయి. జీవంలేదూ అనిపించే వాటిలోనూ, వివిధమైన జాతులుగా కనిపించే జీవుల్లోనూ ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. దేవతలైనా, యక్షులూ రాక్షసులూ, కిన్నరలూ, నరులూ వగైరా ఏజాతి వారైనా పరమాత్ముడి అంశతో ఉన్న స్వరూపాలే. అందుచేత ఆయారూపాలలో సాక్షాత్మరిస్తున్న పరబ్రహ్మవిలాస స్వరూపాలే ఐన సర్వభూతాలకూ సత్యమైన భక్తితో (పరమాత్ముణ్ణి పుర్స్కరించుకొని) నమస్కరిస్తున్నాను.

    ఈ పద్యాన్ని అవధారణం చేయండి. సర్వసమత్వం సిధ్ధిస్తుంది. విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః" అన్న గీతాశ్లోకం కూడా ఇటువంటి భావాన్నే సూచిస్తున్నది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే శ్యామలరావుగారు. చక్కటి మీ వ్యాఖ్యకు, పద్య వివరణకు మనసార ధన్యవాదములండి.

      తొలగించండి
  4. నాకు చెప్పడం చేత కాలేదు.ఆలోచింపజేసిన టపాలు.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారమండి.
      బాగున్నారా?
      కొందరి మాటలను ఖండించాలని ఎప్పటికప్పుడు అనుకున్నా, వారిని నొప్పించడం అవుతుందేమో నన్న చిరువెరపుతో మౌనంగా వుండిపోయేదాన్ని.కానీ, ఈసారి అలా వుండలేక ఇలా టపా రూపేణ బదులిచ్చాను.
      మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  5. చాల వివరణాత్మకంగా రాసారు. బహు బాగు బాగు భారతిగారు.

    రిప్లయితొలగించండి
  6. అడిగిన వెంటనే పద్యార్ధం తెలిపినందుకు మనఃపూర్వక ధన్యవాదములు శ్యామలీయంగారు.

    రిప్లయితొలగించండి