21, డిసెంబర్ 2019, శనివారం

సాధకులారా! ఒక్కక్షణం...

సాధకులు అనేకమార్గాల్లో తమ గమనమును సాగిస్తారు. ఎవరి అభిరుచికి తగినట్లుగా వారు ఓ మార్గాన్ని అవలంభిస్తారు. ఏ మార్గంలో గమనమున్న అందరి గమ్యామూ, లక్ష్యమూ ఒక్కటే. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలు వేరువేరు కానీ; అన్నిమార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం నిర్ధేశింపబడినవే. అన్ని మార్గాలు పరమాత్మ బోధించినవే.
ఇన్ని మార్గాలు ఎందుకు చెప్పారంటే, మన ప్రవృత్తిని బట్టి తగినదానిని అనుసరించటానికి. ఏదీ ఎక్కువ కాదు, తక్కువా కాదు. ఎవరి యోగ్యత బట్టి, అర్హతకు అణుగుణంగా ఆ మార్గంలో నడిపిస్తాడు. మనమో మార్గంలో వెళ్తున్నామంటే, అది ఆ భగవంతుని ప్రేరణే. ఎవరు ఏ మార్గంలో సమర్ధవంతంగా నడవగలరో, వారిని ఆ మార్గంలో నడిపించేది ఆ భగవంతుడే. 
అయితే ఏ మార్గంలో పయనించిన సడలని విశ్వాసంతో, దృఢసంకల్పంతో, శ్రద్దగా వెళ్ళగలిగితే- భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు, నాతో ఉన్నాడు అన్న భావన క్రమేపి మాయమై, భగవంతుడే ఆత్మస్వరూపుడై మనలో ఉన్నాడు, మనలా నడుస్తున్నాడన్న భావనామయప్రజ్ఞ కలుగుతుంది. ఉన్నది ఉన్నట్లు ఎరుకై సర్వమూ శివమౌతుంది. 

అయితే కొందరు భగవంతుని యందు ప్రేమ(భక్తి)తో సాధన ప్రారంభం చేసి, ఆ సాధన గొప్పది, ఈ సాధన గొప్పది, మా సాధనామార్గం గొప్పదన్న తారతమ్యభావన కనబర్చడం సమంజసమా? చేసేది, చేయించేది ఆ భగవంతుడే అన్న భావనను విస్మరించి వ్యక్తిగత అభిప్రాయాలతో మాట్లాడడం సముచితమా? 

1. ఈమధ్య వాట్సాప్ లో ఓ వీడియో వచ్చింది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు.  
                 
తాను, తన చుట్టూ ఉన్న ఈ జగత్తు, అంతా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకున్న జ్ఞాని, ఇలా మంత్రజపాలు, నామస్మరణలు, విగ్రహారధనలు చేయడు. కేవలం భక్తునికి మాత్రమే ఇలాంటి పరితపన. ఈస్వామిజీ అంతిమక్షణాల్లో కూడ శివారాధన చేస్తున్నారంటే ఈయన పరమభక్తుడే గానీ జ్ఞానికాదు...అని కొందరి వ్యాఖ్యానం.

2. ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. అందుకు వనరులు సమకూర్చుకుంటాం. పునాదులు వేస్తాం. చక్కటి ఇల్లు కట్టుకుంటాం. సౌఖ్యంగా అందులో ఉంటాం. ఇల్లు నిలబడేంతవరకే పునాదిని గుర్తిస్తాం. ఇల్లు కట్టాక, రోజూ పునాదిని చూస్తామా, తలుస్తామా? అలానే నామం, జపం, విగ్రహం అనే వనరులుతో భక్తనే పునాదులు వేసి, ఆపై జ్ఞానమనే గృహంలో ప్రవేశించాక, పూజాదికాలు అనవసరం. ప్రారంభంలోనే అవన్నీ. భక్తిమార్గం విడిచి జ్ఞానమార్గం పట్టాలి గానీ, ఇంకా భక్తి, పూజలు, నామజపాలు అనుకుంటే ఏం ఎదుగుతారు? 

3. భగవంతున్ని సామాన్యులు విగ్రహాల్లో పటాల్లో చూస్తూ నామ, మంత్రజపాలు చేస్తుంటారు. ఇది భక్తిస్థాయి. కానీ, జ్ఞాన
సాధకులు ప్రపంచమంతా పరమేశ్వరున్ని చూస్తారు కాబట్టి, పూజాదికాలు అవసరం లేదు. శ్రీ రమణమహర్షి ఏనాడైన మంత్రోపదేశాలు విగ్రహారాధనలు చేసారా? సత్యం నిరాకారం. అది గ్రహించినచో నామజపాలు, పూజలు వుండవు.

4. ఏ రోజుకారోజు స్వీయపరిశీలనలు, స్వభావదోషనిర్మూలనలు అనుకుంటే ఎన్ని జన్మలు ఎత్తాలో లక్ష్యసాధనకై. 
ఒహ్హో...ఎనెన్ని వాదనలో తమమార్గమే అనుసరణీయమని. 

నేనొక అతి సామాన్య సాధకురాలిని. ఇటువంటి ప్రశ్నలకు బదులిచ్చేశక్తి నాకు లేదుగానీ, ఇటువంటి వాదనలు విన్నప్పుడు నాలో కొన్నిభావాలు కదలాడుతుంటాయి. ఆ భావాల సమాహారమే ఈ టపా.
ముందుగా వీడియో గురించి - 
నావరకు ఆ వీడియో చూడగానే అణువణువు అవ్యక్తభావంతో స్పందించగా, గీతలో ఈ శ్లోకం స్ఫురించింది. 

యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః |  
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే|| 

ఉత్తములు ఏయే కర్మను ఆచరించెదరో, దేనిని ప్రామాణికంగా గ్రహించిదరో, దానిని ప్రాపంచిక జనులు ప్రమాణంగా విశ్వసించి ఆచరించుదురు.
శ్రేష్ఠులకు(జ్ఞానులకు) అనుష్టానం అవసరం లేనప్పటికిని, ఇతరులకై పూజాదికాలు అనుష్టిస్తారు. లోకోద్ధారణకై దేహమును వీడువరకు మనం తరించుటకై, ఇట్టి సందేశాత్మక క్రియలను ఆచరించుదురు. జ్ఞానులు తాము తరించినవారైనను ఇతరులను తరింపజేయువారై జనోద్ధరణే జీవితాదర్శమై వుందురు.
ఇటువంటి స్వామీజీలు మన ఉద్ధరణకై వైయుక్తిక ధర్మాచరణను దేహము  వీడువరకు ఆచరిస్తూ మార్గదర్శకం చేస్తారు. 

నిజమే, ప్రాపంచిక ప్రపంచంలో -
సౌఖ్యవంతమైన ఇల్లు నిర్మించుకున్నాక పునాదులును తలవనవసరం లేదు. కానీ, ఏ భవంతి నిర్మాణానికైన బలమైన పునాదులు అవసరమన్న విషయం ఎరుకై, అయినవారికో, అడిగినవారికో తదుపరి నిర్మాణధారులకు, అనుభవంతో అవగాహనతో చెప్తాం. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ అన్వయింపు సరికాదు. ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి సంబంధించినది. సత్యాన్ని బాహ్యవస్తువులతో ముడిపెట్టి చూచుట తగదు. అందరి శ్రేయస్సు కోరే పెద్దలు ఓ మాట చెప్తుంటారు. ఏరు దాటాక తెప్ప తగలేయవద్దని. ఎందుకంటే ఆ తెప్ప మరికొందరు ఏరు దాటడానికి ఉపయోగపడుతుందని. అలానే జ్ఞానులు వారికి అవసరం లేకున్నా, మనందరి శ్రేయస్సుకై పునాదుల్లాంటి మూలాల్ని విస్మరించక, కడవరకు ఆచరించి చూపిస్తూ ఎలా తరించవచ్చో అడగకపోయిన ఆ జ్ఞానాన్ని అందిస్తారు.  ఆచరించమని సూచిస్తారు.  

భక్తిమార్గం అనుసరించువారు ప్రపత్తిద్వారా అనగా శరణాగతం కావడంద్వారా, కర్మమార్గం అనుసరించువారు కర్మఫలత్యాగంద్వారా, ధ్యానమార్గం అనుసరించువారు తమ చిత్తవృత్తులను నిరోధించడంద్వారా, జ్ఞానమార్గం అనుసరించువారు ఆత్మవిచారణద్వారా అహంను పొగొట్టుకుందురు. 
                 
  

భక్తి - పూజాదికాలు -నామజపం 
విశ్వాసంతో అంతర్యామికి అనుసంధానం (కనెక్ట్) అవడం భక్తి. నాలో నాతో నేను అనుసంధానం అవడం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతకు ఆలంబన- భక్తిపూర్వక పూజాదికాలు నామజపాలు విగ్రహారధన.
దైవం వైపు విశ్వాసంతో మనసుపెట్టి ప్రయాణం చేయడమే భక్తిమార్గం. విశ్వచైతన్యమును ఏ రూపనామాలు లేకుంటే మనం దేనినీ తెలుసుకోలేం కాబట్టి, మన ఋషులు ఏర్పరిచినదే ఈ ఆరాధన విధానం.
'మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరియసీ'... 
మోక్షమునకుండు అనేకసాధనలలో భక్తి ముఖ్యమైనదని శ్రీ శంకరభగవద్పాదులవారు అంటారు.
                  

తైలం లేక దీపమెట్లు ఉండదో, పుష్పం లేక ఫలమెట్లు కలుగదో, అలాగుననే పవిత్ర హృదయమను ప్రమిద యందు, భక్తియను తైలం నిండుగా లేనివారికి అజ్ఞానాంధకార నాశకమైన పరంజ్యోతియను జ్ఞానదీపం ప్రకాశించదు. అలాగుననే భక్తియను సుగంధపుష్పం లేనియెడల, శాశ్వతానంద జ్ఞానఫలం కలుగదు. కనుక అనన్యమైన భక్తిని, అనన్య చింతనను కలిగి యుండమని శ్రీ మళయాళస్వామి తదితరులు చెప్తుంటారు.  

నిజమే సత్యం నిరాకారమైనది. రూపనామాలు లేనిదాని మీద మనస్సును నిలపడం కష్టం.  సాకారాన్ని పట్టుకుంటూ తద్వారా నిరాకారాన్ని చేరుకోగలం. దైవస్మరణ నుండే అహంస్ఫురణ వరకు వెళ్ళగలం. భగవంతుడు నుండే భగవత్ తత్త్వంలోనికి ప్రవేశించగలం. దైవం నుండే దైవత్వం
వైపు పయనం చేయగలం. సాకారంతో సంబంధం లేకుండా నిరాకారం లోనికి వెళ్ళిపోవడం శ్రీరమణులు వంటి వారికే సాధ్యం. అంతటివారితో మనకు పోలికేమిటి? 
           
ఆ మహర్షిలా 'విచారణా మార్గం' మనకు త్వరగా అంతుపట్టదు. అందుకే ఏకవస్తువును చింతించడం...అది నామమో, రూపమో...ఏదో ఒకటి...మనో నిశ్చలతకై!

అన్ని మార్గాలలో జ్ఞానమార్గమే శ్రేష్ఠమైనదని  చెప్తున్నా, మిగతా మార్గాలు తక్కువ అని అనుకోవడానికి లేదు. 




               
కబీర్ దాసు, తులసీదాసు, తుకారామ్, రామదాసు, ఘోరాకుంబార్ తదితరులు భక్తిచే నామోచ్చరణ, పూజాదికాలు చేస్తూ తరించారన్నది మరువరాదు. 
               


             
పంచేంద్రియాలతో పంచోపచారాలు,  పుష్పాదుల అలంకరణ, మంత్రమూ, నామోచ్చరణ... వీటన్నిటితో తాదప్యతే పూజ. 
భక్తులకు నామామృతం పానం చేయుటయే సులభ సరళమార్గం. మానసికశక్తి, ఏకాగ్రత, మనోనిగ్రహతలను పెంచేశక్తి శబ్ధంలో ఉంది. వేదాలలో ఉన్నది తమ స్వీయప్రజ్ఞతో గ్రహించి మన ఉద్ధరణకై ఋషులు అందించినవే- ఈ నామాలు మంత్రాలూ. నామ మంత్ర జపోచ్ఛరణ చేస్తున్నప్పుడు, ఆ శబ్ధ తరంగాలలో శక్తి అపారంగా ఉంటుంది. ఆ నామ మంత్రాలలో అక్షరాలు జపిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ షట్చక్రాలను జాగృతి చేయడం ద్వారా కుండలినీశక్తి జాగృతమౌతుందని అనుభవజ్ఞులు చెప్తుంటారు. ఇనుమును కొలిమియందుంచి కమ్మరివాడు ఊదునప్పుడు అగ్నివలె ప్రకాశం, దహనశక్తి యెట్లు కలుగుచున్నదో, అలాగుననే నామ, మంత్ర, ధ్యానాదుల శక్తిచే ధర్మనిష్ట పెరుగుతుంది. క్రమేణా వైరాగ్యం అలవడుతుంది. నామ మంత్రాలు ముక్తిప్రదాయకమైనవే. ఒక కరకు బోయవాడిని మహర్షిగా మార్చింది నామమే. ధృవుడును ధృవతారగా నిలిపింది నారాయణ నామతపస్సే.
                   
    విషయవాంఛలతో, మమకారబంధాలతో, 
ఇతరత్రా బంధనాలతో సతమతమౌతు, కలుషితంగా వున్న మనస్సులోనికి భగవన్నామం ప్రవేశిస్తే, కుండలోని కలుషితమైన నీరు చిల్లగింజతో శుద్ధి అయినట్లుగా, పరిశుద్ధమౌతుంది. భక్తివిశ్వాసాలే కాలక్రమేణ విచారణలోనికి మారి, జ్ఞానమార్గంలోనికి పయనింపజేస్తాయి. జ్ఞానమార్గంలో ఉన్నా, వైయుక్తిక ధర్మాచరణను విడిచిపెట్టక ఆచరిస్తునే, లక్ష్యం వైపు పయనం సాగించాలి. అప్పుడే లోకం చూపు పోయి లోచూపు వస్తుంది. మహాజ్ఞానులైన నారదుడు నారాయణమంత్రాన్ని, హనుమా రామమంత్రాన్ని విడిచిపెట్టేరా? శ్రీరమణులు అరుణాచలేశ్వరున్ని తలవడం మానేసారా?

శ్రీరమణులు మంత్రోపదేశంగానీ, దీక్షనివ్వటంగాని  చేయకున్నా, నామజపం యొక్క ప్రాశస్త్యాన్ని కొనియాడేవారు. శరణాగతి నొందగోరేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనేవారు. భగవంతుని నామమూ ఆత్మా ఒకటేననేవారు. అంతేకాక ఆత్మసాక్షత్కారమైన పిదప భగవన్నామస్మరణ హృదయంలో అప్రయత్నంగా సాగిపోతుందనేవారు. అసలు చేయవలసింది ఆత్మవిచారమే అని తెలిసినా, నామజపం చేయుట మంచిదేనా అని ఒకరు ప్రశ్నించగా- "అన్ని పద్ధతులు విచారణకే దారితీస్తాయి. అందువల్ల అన్నీ మంచివే. మన నిజతత్త్వం జపమే. ఆత్మసాక్షత్కారమైతే జపం తనంతట తానే సాగిపోతుంది. ఒక దశలో సాధనమే మరొకదశలో సాధ్యమౌతుంది. అప్రయత్నంగా నిరంతరంగా సాగే జపమే - సాక్షత్కారమంటే" అని బదులిచ్చింది గమనించండి. అలాగే మూర్తిధ్యానం జ్ఞానం పొందడానికి ఉపయోగపడదా అన్న ప్రశ్నకు, "తప్పకుండ ఉపయోగపడుతుంది. ఈ ఉపాసనవలన మనస్సుకి ఏకాగ్రత ఏర్పడుతుంది. ఇతర భావాలేవీ లేకుండా, ధ్యానించిన మూర్తితోనే మనస్సు నిండిపోతుంది. తరువాత మనస్సు ఆ ధ్యానింపబడే మూర్తితో ఏకమై నిర్మలమౌతుందని" బదులిచ్చారు. మరిన్ని వివరణలకై 'నీ సహజస్థితిలో ఉండు 'అన్న పుస్తకమును చూడండి. 

భిక్షాటనం జపో ధ్యానం స్నానం శౌచం శివార్చనమ్|కర్తవ్యాని షడేతాని యతీనాం నృపదండవత్ ||
భిక్షాన్నం, జపం, ధ్యానం, స్నానం, బహిరంతరశౌచం, దేవతార్చనం... ఈ ఆరును యతీశ్వరులకు కూడ రాజదండనం వలె కర్తవ్యమని శ్రుతి తెలుపుతుంది. యతీశ్వరులకే ఇవన్నీ ఉండాలని అంటున్నప్పుడు మనం దేవతార్చనలు, నామజపాలు వద్దనుకోవడం సమంజసమా?
                 
    శాంతి జీవనానికైన ఆత్మానుభూతికైన సద్గుణాలే అవసరం. అందుకే ఉదయం లేచేటప్పుడే, మనం సద్బుద్ధితో, సత్ ప్రవర్తనతో నడుచుకోవాలనే దృఢసంకల్పం చేసుకోవాలని, రాత్రి పడుకునేముందు ఆనాటి మన దినచర్యలను సమీక్షించుకొని తప్పులుంటే సవరించుకోవాలనే సంకల్పం చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. మన ప్రవర్తనలో దోషాలు లేకుండా చూచుకోవాలి. మన గుణాల్లో మార్పు రావాలి. అప్పుడే ధర్మనిష్ట పెరుగుతుంది. మనో శుద్ధత ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కల్గుతుందో అప్పుడే లోపలున్న సత్యంతో సంధానమవగలం. అందుకై స్వీయపరిశీలన తప్పనిసరి. 
                    
అన్ని మార్గాలు ఆత్మసాధనతోనే ముగుస్తాయని శ్రీరమణమహర్షి 
అనేవారు. అలానే మన సాధనలో ప్రతి అంకం, కేవలం సోపానాలు మాత్రమే. నామజపం, ధ్యానసాధన, దేవతార్చన ఇవన్నీ మనలోని నిరాకార దైవాన్ని తెలుసుకునే వరకు సాగాల్సిందే! ఏ సాధనా మార్గమైనా సత్ప్రవర్తనతోనే ముడిపడి ఉంది. మనం చేసే అర్చన వల్ల మనం కోరుకున్నది వస్తుంది. మనం సత్ప్రవర్తనతో ఉంటే దైవమే మన వద్దకు వస్తుంది. 
అందుకే మనల్ని మనం సత్శీలకులమై ఉన్నమో, లేమో అని శోధన చేసుకోవాలనేవారు.

మనస్సు అణిగేందుకే స్వీయవిచారణ, నామజపం, పూజాదికాలు. భక్తిమార్గంలో వెళ్ళేవారికి ఇంతకన్నా సమర్ధవంతమైన పద్ధతి  ఏముంది?

ఇక విగ్రహారధన గురించి తదుపరి టపాలో...











11 కామెంట్‌లు:

  1. చాల చాలా బాగుంది భారతిగారు. నాకెంతో ఉపయుక్తంగా ఉంది. నేనూ ఈ విమర్శలు ఎదుర్కొన్నాను. బట్ మీలా ఆన్సర్ చెప్పలేకపోయాను.

    రిప్లయితొలగించండి
  2. Entha baagaa cheppaaro.....chaala sandehalu teerchaaru. Nice post 🙏

    రిప్లయితొలగించండి
  3. చాలా చక్కగా చక్కటి వివరణ ఇచ్చారు భారతిగారు. నాకు ఇటువంటి అనుభవాలు ఉన్నాయండీ.
    త్రిపుటి శరీరత్రయాలు పంచీకరణం చిదాభాసుడు కూటస్థుడు సూక్ష్మశరీరం చిజ్జడగ్రంధి విశ్వుడు తైజసుడు ప్రాజ్ఞుడు ...అని ఎన్నెన్నో విశ్లేషణలు...అనర్గళంగా మాట్లాడతారు. వారికి ఆత్మానుభవం కల్గిందో లేదో నాకు తెలియదు. వారు జ్ఞానత్వం పొందినవారే కావచ్చు. వారిని వేలెత్తి చూపే స్థాయి కాదు నాది. టెంత్ క్లాస్ పేపర్లు దిద్దాలంటే ఆ అర్హత ఉన్నవారే దిద్దాలి. అలాగే వారు జ్ఞానత్వం గురించి మాట్లాడే స్థాయి నాకు లేదండి. ఆ అర్హత నాకు లేదు. ఓనమాలు స్థాయి నాది. కానీ వారు సత్సంగంలో పూజలు దైవదర్శనాలు అంటూ సమయం వృధా చేస్తున్నారు అంటున్నప్పుడు నాకో సందేహం మనస్సును మెలిపెట్టేది. వీరి ఇంటిలో భావితరంవారికి వీరు ఎలా ఆధ్యాత్మికతను అందిస్తారు? పూజాదికాలు ఉండవు కాబట్టి వారి వారి మనవళ్ళు మునిమనవళ్ళుకు భక్తి అనే బీజం ఎలా పడుతుంది? శరీరమనే క్షేత్రంలో భక్తి అనే బీజం నాటి నామస్మరణ అనే నాగలితో దున్ని సాగు చేస్తేనే కదా...చివరికి జ్ఞానఫలం అందుకోగలం. మరి ఈ జ్ఞానమార్గ సాధకుల ఆంతర్యం అవగతం కాక తికమకపడేదానిని. ఇప్పుడు ఓ స్పష్టత మీ టపా ద్వారా వచ్చింది. థాంక్సండీ భారతిగారు. శరీరమనే క్షేత్రంలో భక్తి అనే బీజం నాటి నామస్మరణ అనే నాగలితో దున్ని సాగు చేస్తేనే కదా...చివరికి జ్ఞానఫలం అందుకోగలం. మరి ఈ జ్ఞానమార్గ సాధకుల ఆంతర్యం అవగతం కాక తికమకపడేదానిని. ఇప్పుడు ఓ స్పష్టత మీ టపా ద్వారా వచ్చింది. థాంక్సండీ భారతిగారు.

    రిప్లయితొలగించండి
  4. చాలా ఆత్మనుభూతిని.ఆత్మ పరిశీలన కలిగించే చర్చ మీ blog ద్వారా గొప్ప కృషి ఆధ్యాత్మిక అంశాల సేద్యం చేస్తున్నారు

    రిప్లయితొలగించండి
  5. ఈ రోజు ఒకరు YouTube లో శివకుమార స్వామి గారి వీడియో చూశాక నన్ను అడిగారు, శివకుమార స్వామి ఎవరు అని, ఆయన మరణించినప్పుడు ఎందుకు అన్ని కోట్ల మంది ప్రజలు బాధ పడ్డారు అని.

    అప్పుడు నేను అడిగాను సరే నీకు మదర్ థెరిసా తెలుసా? అని

    అతను, అయ్యో ఎందుకు తెలియదు "ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీత, చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఆమె గురించి ఒక పేరా కూడా ఉంది" అని.

    నేను చెప్పాను, సరే అయితే ఆమె ఇక్కడికి వచ్చి చేసిన సేవ అనే పనులు దానితో చేసిన మత ప్రచారం, మత మార్పిడి, మీడియా ఆమెకి ఇచ్చిన ప్రాదాన్యం గురించి వదిలేయ్యు.
    కానీ అసలు ఏమీ ఆశించకుండా 132* విద్యాసంస్థలను స్థాపించి ఏటా *50,000 మంది గ్రాడ్యుయేట్లను, సంవత్సరానికి 10,000 మంది గురుకుల్ విద్యార్థులకు విద్యను* అందిస్తూ సాంప్రదాయ విద్యావిషయక అభ్యాసాన్ని పరిరక్షిస్తు, అలాగే అందులో ఉన్న అంతమంది విద్యార్థులందరికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తూ, ఏటా 5 లక్షల మంది రైతులకు మద్దతు ఇచ్చే వ్యవసాయ కార్యక్రమాలను చేస్తూ, *ఇలాంటి ఇంక ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆ స్వామి శివకుమార స్వామి గారి గురించి భారతదేశంలో పుట్టిన మనకు ఇంక తెలియకపోవడం ఒక విధంగా సిగ్గుచేటు. అది మన దౌర్భాగ్యం.

    ఇంత చేసిన ఆ స్వామిని మీడియా అతని ప్రయత్నాలను మరియు విజయాలను హైలైట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు, ఎందుకంటే అతను ఎప్పుడూ కాషాయ వస్త్రం కట్టుకొని, కుంకుమ ధరించేవాడు".

    🚩🚩జైశ్రీరామ్🚩🚩
    🚩🚩జైహింద్🚩🚩

    రిప్లయితొలగించండి
  6. సేకరణ : ఈ లింక్ లో
    https://www.facebook.com/share/p/iUgnJjnLmXFV2zEt/?mibextid=oFDknk

    రిప్లయితొలగించండి