11, ఆగస్టు 2013, ఆదివారం

ఒకప్పుడు నేను విన్న కధను గుర్తుచేసిన 'శ్రీ శ్యామలీయం గారి భాగవతం'

పరమ భాగవతోత్తముడైన బమ్మెర పోతానామాత్యులవారు తన సహజపాండిత్యంతో అనితరభక్తితో మానవాళికి ఆత్మోన్నతిని అందించే శ్రీ మద్భాగవతాన్ని తెలుగులోనికి అనువదించగా,
దానిని తిరిగి ధారావాహికంగా భక్తజన హృదయాలను రంజింపజేస్తూ, ఎంతో భక్తితో తను చేస్తున్న ఈ పనిని ఓ తపస్సులా భావిస్తూ శ్రీమదాంధ్రమహాభాగవతంను సరళముగా అందిస్తున్న శ్రీ శ్యామలీయంగారికి నమస్సులు. వారి శ్యామలీయం భాగవతం చదువుతుండగా ఒకప్పుడు నేను విన్న ఈ కధ జ్ఞాపకం వచ్చింది.
శుకమహర్షి భాగవతమును ఏడురోజులలో పరీక్షిత్తు మహారాజునకు తెలిపి ముక్తిని కలుగజేసినట్లు తెలుసుకున్న ఓ మహారాజు తన ఆస్థాన పురోహితున్ని పిలిచి, ఆ భాగవతమును తనకి విశదపరచమని, తనకు అలానే ఏడురోజుల్లో మోక్షమును కలుగజేయమని, లేనిచో నీ పౌరాణికత్వం రద్దుచేసి, దేశబహిష్కరణ చేస్తానని శాసించెను. అంతట ఆ పౌరాణికుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చెప్పినను ఆరాజు మనస్సు భగవద్వీలీనం చేయక ఏడవరోజు ముక్తికై ఎదురుచూస్తుండడంతోనే ఆరురోజులూ గడిచిపోయాయి. మరుసటిదినం ఏడవరోజు అగుటచే పౌరాణికుడు మహావ్యాకులతతో వుండగా, ఆ పండితుని సేవకుడు తన యజమాని విచారమునకు కారణం అడిగితెలుసుకొని, ఈ పనికి నన్ను నియమించండి, మీ బదులుగా నేను వెళ్లి ఈ పనిని పూర్తిచేస్తానని చెప్పి, తానే రాజభవనానికి వెళ్ళి, ప్రభూ! ఈ చిన్నివిషయానికి తానేల రావలయునని తలచి, మోక్షము యొక్క రహస్యమును తమకు తెలిపి రమ్మని నా యజమాని ఆదేశించగా నేను వచ్చితిని అని చెప్పి, ఓ రాజా! ఈ రోజు పురాణం ప్రారంభించుటకు ముందు మీరు బంధీకృతులు కావలసియున్నది అని చెప్పగా ... మోక్షం వచ్చుటకు ఇదికూడా అవసరం కాబోలు అని రాజు అంగీకరించగా, రాజును ఒకస్తంభమునకు కాలుచేతులు కట్టి బంధించి, ఆ పిమ్మట ఆ సేవకుడు అనేకరకముల ఫలహారములు తెప్పించి రాజుముందు పెట్టి,
మహారాజా! శుభముహూర్తం దగ్గరకు వచ్చింది, ఈలోపునే మీముందున్న ఫలహారములను స్వీకరించాలి కావున వెంటనే భుజించమని చెప్పెను. ఇదెలా సాధ్యం? బంధీకృతమైన నేను ఎలా భుజించగలనని రాజు ప్రశ్నించగా, ఓ రాజా! పరీక్షన్మహారాజు వలే మీకు తగిన వైరాగ్యం లేదు, మీ బంధనములు తెగలేదు. ఇట్టిస్థితిలో ఏడురోజుల్లో మీకు మోక్షమిప్పించుట ఎట్లా సాధ్యమౌతుంది?
ఓ రాజా! 
జనమేజయులకు రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునను తప్పించి, చిత్తంబు హరికి అర్పించి, ప్రాయోపవిష్టుండైన పరమభాగవతుడైన పాండవపౌత్రుండు
పరీక్షిత్తు మహారాజుకున్న వైరాగ్యం మీలో లేదు. మీరింకనూ ఆశాపాశములతో ఈ మాయాప్రపంచంన కట్టుబడే యున్నందున మోక్షం సాధ్యం కాదు. రాజా! ప్రీతితో, ఆసక్తితో, ఫలాభిలాషతో, కర్తృత్వబుద్ధితో గడుపుజీవితం బంధమును కలిగిస్తాయి. బంధమెంతవరకుండునో అంతవరకు మోక్షం లేదు. ముక్తి పొందడానికి యోగ్యత, సాధన, ఆచరణ కావలసియున్నది. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికి మాత్రమే ముక్తి సాధ్యమగును.
ఓ మహారాజా! దేహపుత్రకళత్రాది వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఏకాంతప్రదేశమున అకార ఉకార మకారాలనే మూడక్షరాలతో కూడిన బ్రహ్మబీజమైన *ఓంకారము*ను మనస్సులో స్మరిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్శ్వాశాలను వశపరుచుకోవాలి. విషయాల వెంబడి పరుగిడే ఇంద్రియాలను బుద్ధి అనే సారధితోను, మనస్సనే పగ్గంతోను బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిపై నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమముగా ధ్యానించాలి. రజో, తమో గుణాలచే ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సునూ, ఆ గుణాలవలన కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చెయ్యాలి. అలా చేసిననాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతారని, వారే మోక్షం పొందుతారని శుకమహర్షి చెప్పినట్లుగా,  అప్పటికే సర్వమూ పరిత్యజించి, హృదయాంతరమున హరిని నిలిపి, మనస్సును భగవద్విలీనం చేయుటచే పరీక్షిత్తు మహారాజు మోక్షం పొందాడు మహారాజా, అని భక్తుడైన ఆ సేవకుడు చెప్పగా, తన తప్పుని రాజు గ్రహించి పశ్చత్తాపపడెను. సేవకుడు తిరిగి తన యజమాని ఇంటికి వెళ్ళగా, అప్పటికే జరిగిన విషయాలన్నీ జనుల ద్వారా తెలుసుకున్న ఆ పండితుడు ఈ భక్తోత్తముడిని సాదరంగా ఆహ్వానించి, 'నాయనా! ఈ దినమునుండి నేనే నీకు సేవకుడిని, మీరే నేటి నుండి నా గురువులు' అని రెండు చేతులను ముకుళించి నమస్కరించెను.

*ఓంకారం* గురించి మరింత వివరణ ఈ లింక్స్ నందు -
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post.html
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post_29.html)
 

ఎప్పుడో విన్న స్మరించుకోదగ్గ ఈ కధ మరుపున పడకూడదని స్మరణ లో పోస్ట్ చేస్తున్నాను.

2 కామెంట్‌లు:

  1. భారతిగారూ

    మంచి కథ ప్రస్తావించారు. చాలా సంతోషం.

    మీరు చెప్పినది అక్షరసత్యం. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఒక తపస్సు అనే అనే భావిస్తున్నాను. ఎప్పుడైన ఎవరైనా సందేహం ఎటువంటిదైనా ప్రస్తావిస్తే నా శక్తిమేరకు నివృత్తు చేయటం విధిగా కూడా అనుకుంటున్నాను.

    మీరు భాగవత ధార చదువుతున్నారు. అది నాకు అత్యంత సంతోషదాయకమైన విషయం.
    భగవానుడి అనుగ్రహం మీ యందు నిలుచు గాక!

    రిప్లయితొలగించండి
  2. భారతి గారూ, మీ భక్తి శ్రద్ద్దలకు నా అభినందనలు , ప్రతి విషయమూ వివరంగా చెప్పగలిగే మీ శైలి చాలా నచ్హుతుంది నాకు.

    రిప్లయితొలగించండి