28, ఏప్రిల్ 2022, గురువారం

మంచివారిలోనే భగవంతుడు ఉంటాడా?

కొన్ని రోజుల క్రితం - 

నా స్నేహితురాలి బ్లాగ్ లో ఒకరు ఈ క్రింద ప్రశ్నలు వేశారు. దానికి క్లుప్తంగా ఓ వ్యాఖ్యల బదులివ్వడం తెలియక, కాస్త వివరంగా ఇక్కడ తెలుపుతున్నాను.

                         

అన్నీ భగవంతుని మయమే ...
అవును, ఇది సత్యం. ఇందులో సందేహం లేదు.
                         

అందరిలో భగవంతున్ని చూడాలనే కదా చెప్తారు ...
అవును, ఇదీ సత్యమే.
                        
           
వాళ్ళతో స్నేహం వద్దు, వీళ్ళతో స్నేహం వద్దు... నా ఫ్రెండ్స్ కొంత చెడ్డవారే. ఏం అయితే, వారిలో భగవంతుడు వుండడా? మంచివారిలోనే ఉంటాడా?
ఎందుకుండడు? అందరిలో ఉంటాడు.

ఒక విష సర్పం ఎదురైతే, ఆ ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడని దగ్గరకు వెళ్ళక, ఎందుకు ప్రక్కకు తప్పుకోవడం? అది హాని చేస్తుందనే పరిజ్ఞానం వలన. ఈ జ్ఞానం ఎలా కల్గింది? పెద్దలు చెప్పడం వలన.
                       

అలాగే, చెడు సహవాసాలతో హాని జరుగుతుందని, చెడు స్నేహాలు వద్దని పెద్దలుచెప్తారు. 
                         
కర్ణుడు ఎంతటి ఉదాత్తుడు... అయినా నేటికీ దుష్ట చతుష్టయంలో ఒకరిగానే నిలిచిపోయాడు. కారణం, దుర్యోధనాదుల స్నేహం. 
                   

           

     
మట్టిలో చేరి ఇనుము పట్టు తుప్పు
అగ్నిలో చేరి ఇనుమును అదియు వీడు
సాహచర్యముచే నిట్లు జరుగుచుండు...
ఇనుము మట్టితో చేరినప్పుడు, తుప్పుపట్టి దాని శక్తి కోల్పోతుంది. అదే నిప్పుతో చేరేసరికి ప్రకాశవంతంగా మెత్తగా మారుతుంది. 
సహవాసం ప్రభావం ఇలా ఉంటుంది. కీడు మేలు అనేది మనం సహవాసం చేసేవారి మంచి చెడులపై ఆధారపడి ఉంటుంది. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవేమిటో నేను చెప్తాను అంటారు విజ్ఞులు. చెడ్డవారితో చెలిమి ఉన్నప్పుడు మంచివారిని కూడా చెడ్డగానే చూస్తారు. తాటిచెట్టు క్రింద పాలు త్రాగుతున్నానంటే, ఎవరు నమ్ముతారు? కనుక చెడుస్నేహాలకు కాస్త దూరంగా ఉండమని పెద్దలు చెప్తుంటారు.
                          


అంతటా భగవంతుడు ఉంటాడన్నది అబద్దమా?
అబద్దం కానే కాదు. 
                    


నీతులు చెప్పేవారు వంద శాతం మంచివారా?
వంద శాతం మంచివారని ఎవరూ చెప్పలేరు. నాకు మంచిగా అనిపించింది, వేరొకరికి కాదనిపించవచ్చు. కానీ, నీతులు చెప్పేవారిలో అధికులు, సమాజ హితం కోరేవారే. మన శ్రేయస్సు కోరేవారే. మంచి చెడు సహజం. అయితే సంబంధ బాంధవ్యాలను సరైన రీతిలో తీసుకోవాలి. చెడును తెలియజెప్పి సంస్కరించగలగాలి  ఎవర్నీ ద్వేషించనక్కర లేదు. విమర్శించనక్కరలేదు. కానీ, ఎన్నుకోవలసినవారిని సరైన రీతిలో ఎన్నుకోవాలి. వారి ప్రభావం మనపై ఉంటుంది కాబట్టి.  
                           

                    
బ్రతుకుతెరువు కోసం చదువుకుంటే ఉద్యోగం, డబ్బు, హోదా వస్తాయి. ఇలాంటివి చదివితే కూడు వస్తుందా? కష్టపడితే కూడుగానీ, భక్తి కూడు పెడుతుందా? 
                        

ఒకప్పుడు విద్యను వ్యక్తిత్వ వికాసం కోసం అభ్యసించి, యశస్సు సాధించేవారు. కానీ, నేటి విద్యా విధానంలో విద్య అంటే - కేవలం ఉద్యోగం, ధన సముపార్జన అన్న భావన ఏర్పడింది. ఈ చదువులతో తర్కవాదములలో ప్రవేశిస్తున్నారు. ఇది కాదు చదువు యొక్క విలువ. ఆస్తులు, హోదాలు పొట్ట కూటి కోసం చదివేది మాత్రమే చదువు కాదు. జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా గుర్తించేలా చేసేదే అసలైన విద్య. మనల్ని సంస్కరింపజేసేదే అసలైన విద్య. 

 భక్తి - భుక్తి ... కొన్ని అద్భుతాలు -

ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా, ఒక సంఘటన జరిగింది.

వివేకానందుడు సన్యసించారు కనుక, వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.     

భిక్షగా ముడి సామాన్లు లభిస్తే, వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.

వివేకానందుడికి ఆరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి, ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం, సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని.

ఇటువంటి భావం కలిగివున్న ఆ ధనవంతుడు  స్వామీజీతో ఇలా అన్నాడు..

“ఓ స్వామీ! చూడు.. చూడు.. నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి, నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా? ఏ సంపాదనా లేకుండా దేవుడు.. దేవుడూ.. అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు.  నీ భక్తి నీకిప్పుడు భోజనం పెడుతుందా? చూసావా... నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా.. ఆకలి బడలిక తప్ప!” అని దెప్పిపొడవటం మెుదలుపెట్టాడు.

స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.

అప్పుడు ఒక అద్బుతం జరిగింది.

ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి, స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు, 

“మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీ రామ చంద్రమూర్తి కున్న అనుగ్రహం.
దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.

స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే... పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే,  ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి, భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ, నేను కలలో చూసింది మిమ్మల్నే!”
"శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి, మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే, నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా... లే... లేచి అతనికి భోజనం పెట్టు!  అని ఆజ్ఞాపించారండి.
"ఆహా.. ఏమి నాభాగ్యం... మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం,  ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు, ఎవరూ మరచిపోలేరు."
"నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను" అన్నాడు.

స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయ హస్తమైతే తనజీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో.. అదే అభయ హస్తమిది.

ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ, క్షమాపణ కోరాడు.

ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే, ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, చాలా ఉన్నాయి మన మహర్షుల యోగుల అనుభవాలు. వారి వారి జీవిత చరిత్రలు చదివితే ఇలాంటివి తెలుసుకోవచ్చు.

                                    🕉️🕉️🕉️🕉️🕉️

పూర్వకాలంలో సకల శాస్త్రములను అభ్యసించిన ధర్మపరాయణుడైన ఓ కడు బీద బ్రాహ్మణోత్తముడు, విద్య విక్రయం పాపమని భావించి, ఒక బడిలో ఉచితంగానే విద్యాబోధన చేస్తుండెను. విద్యార్ధుల తల్లితండ్రులు దయదలచి ఏమైన యిస్తే, అదే జీవనాధారమయ్యేది. ప్రతీరోజు ఇంటిలో వంటకం అయిన తరువాత తల్లి స్వయంగా వచ్చి పిలుస్తేనే, అతడింటికి వెళ్ళి బోజనం చేసేవాడు. ఇంట్లో ఏమైన వండితే మధ్యాన్నం 12గంటలకు తల్లి వచ్చి పిలిచేది. లేనిచో, ఆ బడిలోనే కూర్చొని భగవద్గీత పారాయణం చేయుచుండెను. తరచుగా పస్తులుండడం వారికి పరిపాటి. ఒకరోజు ఒంటి గంటైనను తల్లి రాకపోవడంతో ఈ దినమూ ఉపవాసమేనని గ్రహించి, గీత పారాయణం చేయుచుండగా, 
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే | అను శ్లోకం పఠనం నకు వచ్చెను.
                        


అపారమైన కృష్ణ భక్తి ఉన్నను, ఆకలి బాధతో ఆ శ్లోకం యొక్క మొదటను, తుదను ఎర్రటి పెన్సిల్ తో రెండు బ్రాకెట్లను వేసెను.
ఆ సమయమున ఈ పంతులుగారి వద్దే చదువుచుండెడి ఆ నగరంలోని రాజుగారి కుమారుడు, ఒక గంప నిండుగా సామానులను తీసుకొని పంతులయ్యగారి ఇంటికి వచ్చి, ఈ దినమునకు కావల్సిన వంటసామగ్రిని పై విస్తరాకులలో పెట్టినాను, వాటిని ఈ దినం బోజనమునకు ఉపయోగించుకొని గంప యొక్క అడుగుభాగమున వున్నవి చూసుకొని, రేపటినుండి వాడుకోమని కన్నీరు కార్చుతూ చెప్పగా, ఆ రాజకుమారుని చెక్కిళ్ళకు రెండు ప్రక్కల ఎర్రగా నెత్తురు కారేలాగున వాతలు ఉండుట చూసి, ఆ ఉపాధ్యాయుని తల్లి, అయ్యో! బాబు! ఎవరు నాయనా! నిన్నిలా కొట్టారని అడగగా, తల్లీ! మీ కుమారుడగు పంతులుగారు, చెప్పినట్లు నేను చేయుట లేదని సందేహం కలిగి నా ముఖమున వాతలు వేసెనని చెప్పెను. దానితో ఆ తల్లి ఆందోళనగా బడికి వెళ్ళి, నాయనా! మనమిక ఈ గ్రామంలో వుండగలమా? రాజుగారి కుర్రవానిని నెత్తురు కారేలాగున ముఖమున వాతలు వేయవచ్చునా? ఎంతో సహనశీలుడవయిన నీవు, ఏల ఈ ప్రమాదకరమగు పని చేసితివి? ఈ నగరపు వారి సహాయం వల్లనేగదా, ఈ మాత్రమైన అనుష్ఠానం చేసుకొని, జీవించగలుగుతున్నాం అని అంటున్న తల్లిమాటలు అర్ధంకాక, అయోమయంగా తల్లితో సహా రాజుగారి ఇంటికి వెళ్ళగా, రాజు కుమారుడు బోజనం చేసి, మరల బడికి వచ్చుటకు సిద్ధమై యుండెను. ఆ అబ్బాయిని అడుగగా, నేను మీ ఇంటికి రాలేదని చెప్పెను. ఆ బాలుని ముఖంపై ఎటువంటి వాతలు లేకుండెను. అంతట ఆ ఇరువురు ఇందులో ఏదో రహస్యముందని యోచిస్తూ, ఇంటికి వచ్చి ఆ గంపను చూడగా, పైన ఆ రోజుకు సరిపోవు బియ్యం, పప్పులు ఉండెను. విస్తరాకు దిగువున అమూల్యమగు రత్నములు కనిపించెను. అప్పుడు తాను చదివిన శ్లోకం, గీసిన గీతలు గుర్తుకు వచ్చి, వచ్చింది శ్రీకృష్ణుడేనని, తాను గీసిన గీతలు కృష్ణుని ముఖంపై వాతలయ్యనని, ఇది శ్రీకృష్ణుని మహిమగా గుర్తించారు.
     
                                      🕉️🕉️🕉️🕉️🕉️

ఒకప్పుడు భద్రాచలం ప్రయాణమంటే, ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అటువంటి పరిస్థితుల్లో, రామదర్శనంకై వచ్చే భక్తులకు ఏదైన సహాయం చేయాలన్న సంకల్పం పమిడిఘంటం వెంకటరమణ దాసుది. కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని ఆయన యాయవార వృత్తి ద్వారా సంపాదించిన దానితోనే, నిత్యాన్నదానం చేయాలన్న గొప్ప సంకల్పంతో ఇల్లిల్లు తిరిగి దానంగా వచ్చేదానిని శుభ్రంగా వండి, వేడి వేడి అన్నం,  కాస్త పప్పో, పచ్చడినో, మజ్జిగలతో భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుండేవాడు. అంతకంతకు భక్తజనం పెరగడం, అన్ని ఇళ్ళకు వెళ్ళి అడిగి తెచ్చిన వాటితో వచ్చినవారికి లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఒకనాడు ఆయన ఏర్పాటు చేసిన ఆ అంబ సత్రంలో వంటపాత్రలను ఎవరో ఎత్తుకు పోవడం, వేరే వంటపాత్రలు లేకపోవడంతో వండేవాళ్ళు వెళ్ళిపోవడంతో, అంతా రాములవారే చూసుకుంటారని, రాముడే దిక్కని, రామునిపై భారం వేసి నిబ్బరంగా ఉండగా, ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి, తాము వంటవాళ్ళమని, వండటానికి తమ దగ్గర రెండు గుండిగలు వున్నాయని, ఈరోజు వంటపని తాము చేసిపెడతామని చెప్పి, వెంటనే వంట ప్రారంభించి, ఎప్పటిలాగే భక్తులు వచ్చే సమయానికి వండడం పూర్తి చేసారు. కమ్మటి వాసన, చక్కటి రుచులతో రోజుటి కంటే గొప్పగా ఉన్నాయంటూ భక్తులు లొట్టలు వేసుకుంటూ తిన్నారట. ఆపై కుర్రాళ్ళు కనిపించలేదు. వారికోసం వెతికినా వారి ఆచూకి తెలియలేదు. ఆ రూపం వున్న కుర్రవాళ్ళని గతంలో ఎవరూ చూసి ఎరగరు. గోపన్నను విడిపించేందుకు తానీషాకు మాడలు చెల్లించిన అన్నదమ్ములు రామలక్ష్మణులే నేడూ నిరంతరాయంగా జరుగుతున్న ఈ అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించినట్లు గ్రహించారంతా. ఆ తర్వాత ఆ గుండిగలలో వండి, చేస్తున్న అన్న ప్రసాదం బహు బాగుండేదని భక్తుల మాట. భక్తులు అంతకంతకూ పెరగడం యాచించింది సరిపోవడం లేదని, నీవే దిక్కని రామున్ని ప్రార్ధించడం, హఠాత్తుగా ఒక ధనవంతుడు వచ్చి, నా తల్లి స్వప్నంలో కనిపించి మీ సత్రానికి తన భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పిందని, 4వేల ఎకరాలు మీకు రాసిస్తున్నానని, ఆ పత్రాలు అందజేయడం జరిగింది. ఆ ధనవంతుడు హనుమకొండ నుండి వచ్చిన తుంగతుర్తి నరసింహారావు అనే వకీలు గారు. దాసుగారు తదనంతరం, క్రమేణా ఆ సత్రాన్ని అందరు మరిచినా, ఆ సత్రం పాడుబడిన, ఆస్తి అన్యాక్రాంతమైన, కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరిపీఠం తన ఆధీనంలోకి తీసుకొని, చక్ర సిమెంట్స్ అధినేత కృష్ణమోహన్ గారి సహకారంతో వేద పాఠశాలను నెలకొల్పి మరల అన్నదానం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ రెండు గుండిగలు రామ గుండిగ, లక్ష్మణ గుండిగ పేరిట ఉన్నాయి. 
                

                                     🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు (1896-1990) తినడానికి ఏమీలేక నీరసించి సొమ్మసిల్లగా, ఆ జగన్మాతే స్వయంగా అన్నం తినిపించడం జరిగింది. ఈ వివరణ నామ - మంత్ర వైశిష్ట్యం ఈ టపాలో చూడగలరు.

                                         🕉️🕉️🕉️🕉️🕉️

                       

ఇటువంటి పుస్తకాలు చదివితే, భక్తి కూడు పెడుతుందని, అలాగే మనం కష్టపడి సంపాదించిన కూడుకు మూలమైన సృజనకర్త ఎవరన్నదీ అవగాహనకు తెస్తుంది.
                         

ఇలాంటివి చదివితే - 
జ్ఞానోదయం అవుతుంది. 
మానసిక వికారాలుండవు.
వ్యక్తిత్వ వికాసం కల్గుతుంది.
మన దగ్గరకు వచ్చిన ప్రతీ విషయం అవగాహన అవుతోంది. 
మనకు కల్గిన ప్రతీ సందేహానికి
 సమాధానం దొరుకుతుంది.
                        

పుస్తక పఠనం వలన ప్రయోజనం -
మన పురాణ ఇతిహాసాలలో, యోగుల మహర్షుల చరిత్రలలో ఆత్మజ్ఞానానికి సంబంధించిన విజ్ఞానమే కాదు, మన దైనందిక జీవితాల్ని ఉత్తమ మార్గంలో నడుపుకోవడానికి దోహదపడే అంశాలు అనేకముంటాయి. అనేక కధల రూపంలో ఉపయుక్త ప్రధానాంశాలను ప్రబోధిస్తాయి. నీతి నియమాలను, ధర్మ సూక్ష్మాలను, సాంఘిక ఆర్ధిక రాజకీయ రంగాల్లో మనం నడుచుకోవాల్సిన విధానాల్ని వివరిస్తాయి. చారిత్రాత్మిక సంఘటనల ద్వారా మనకు ఉపయోగపడే అనుభవాలు కోకొల్లాలుగా ఉంటాయి.  ప్రపంచంలో ప్రముఖుల ఆత్మకథలు (బయోగ్రపీ) చదివితే, వారిలో  చాలామంది తమకు ప్రేరణ స్పూర్తి భారతీయ శాస్త్ర గ్రంథాలే అని పేర్కొనడం గమనార్హం.
మన సంస్కృతి పట్ల అవగాహన రావాలన్న, మన ఔనత్యం అవగతం కావాలన్న శాస్త్ర పఠనమో, శ్రవణమో తప్పనిసరి. 
                     

పై ప్రశ్నలకు నా అవగాహన మేరకు సమాధానాలు తెలిపాను. తప్పులుంటే తెలపండి.....

ఒకోసారి కొందరు రచయితలు చక్కటి సందేశమున్న సంభాషణలను తెలుపుతుంటారు. అలాంటిదే ఒకటి ఈ మధ్య నాకు వాట్సాప్ లో వచ్చింది. ఇది మూల గ్రంథంలో ఉందో, లేదో నాకు తెలియదు గానీ, మంచి సందేశం ఉండడంతో ఇక్కడ షేర్ చేస్తున్నాను.
 
కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది.
కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...

నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పు కాదే.

పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ, నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు.

పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది.

ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం, కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే.

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే... స్నేహం వల్లనే.

అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని అన్నాడు కర్ణుడు.

దానికి కృష్ణుడు సమాధానంగా -

కర్ణా!

నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను.

నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది.

నేను పుట్టిన రాత్రే, నా కన్న తల్లితండ్రి నుండి వేరుచేయబడ్డాను.

చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను.

నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు. కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.

నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు.

మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ.

సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.

జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుంచి దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.

సరే, ఇంతకు దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో, నీకు మంచిపేరు వస్తుంది.

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణమన్న నింద వేస్తారు అందరూ నాపైన.

ఒకటి గుర్తుంచుకో కర్ణా...

జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి.

జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు.

దుర్యోధనుడు అవనీ, యుధిష్టరుడు అవనీ, అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.

ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకీ, నీ బుద్ధికి తెలుసు..

మనకు ఎంత అన్యాయం జరిగినా, మనకు ఎన్ని పరాభవాలు జరిగినా, మనకు రావల్సినది మనకు అందకపోయినా...

మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది.

జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో, ఎవరో కాస్త ఆదుకున్నారో... అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు... అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.



6 కామెంట్‌లు:

  1. నేటి యువతకు మీలాంటి అవసరం ఎంతో ఉంది మేడమ్. అజ్ఞాత అబ్బాయి ప్రతీ సందేహంకు సమాధానం వివరంగా తెలిపారు. మంచిగా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. ఒప్పించేలా,మెప్పించేలా ఎంత బాగా వ్రాస్తారో... హేట్సాప్ భారతీగారు.

    రిప్లయితొలగించండి
  3. అంటే అన్నాననుకోకండి, భారతీ గారు! భావుకత్వం నాకు రాదు, ఏదైన ప్రాక్టికల్ గా నేను ఆలోచిస్తాను. ఈ వ్రాతలు వలన నిజంగా యువత మారుతుందా? ఎంత చెప్పిన వారి ధోరణి వారిదే. నో డౌట్... మీ పోస్ట్ బాగుంది. కానీ ప్రాక్టికల్ గా చూడండి...ఎవరూ వినరు...మారరు. అలాంటప్పుడు ఇంత కష్టపడి చెప్పడం లేదా వ్రాయడం అవసరమా? దీని వలన ఒరిగేది ఏమీ లేదు.

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత గారు,
    (మీరు అడిగిన విధానం బట్టి మీరెవరో నాకు అర్థమైందమ్మా)
    ముందు ఒక సత్యాన్ని గ్రహించండి -
    మన భారతీయ సంస్కృతి ఔనత్యాలను ప్రపంచంలో ఎందరో శ్లాఘిస్తున్నారు. కానీ మన వాళ్ళలో కొందరికి మన ఔనత్యం తెలియదు. మన సంస్కృతి సంప్రదాయాలు తెలియవు.
    ఒకప్పటి తరం వారికి కొంతైనా తెలిసినట్లు, నేటి తరంవారికి తెలియదు. ఎందుకని?
    వారికి తెలియకపోవడమనేది పొరపాటా? మనం తెలియజెప్పకపోవడం పొరపాటా?
    ఇంట్లోవారికి తెలియక కొంత, తెలిసినా చెప్పే తీరిక లేక కొంత, వారి కళ్ళకు గంతలు కట్టి గుడ్డిగా పెంచుతుంది ఎవరు?
    నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యల సాన్నిధ్యం లేకుండా సెల్ ఫోన్లుతో నెట్టింట్లో పడేస్తుంది ఎవరు?
    ర్యాంకులు తప్ప విలువలతో కూడిన విద్యను అందివ్వనిది ఎవరు?
    డబ్బులు పరపతి పదవులు అంటూ పరుగులెట్టిస్తూ ప్రక్కదారి పట్టిస్తుంది ఎవరు?
    నేడు - విలువలతో కూడిన విద్య, మన సంస్కృతులపై అవగాహన ఎక్కడుంది? ఇంట్లో లేదు, పాఠశాలల్లో లేదు, బయట సమాజంలో లేదు.
    మనకు తెలిసింది మనం ఆచరిస్తూ, వారికి తెలియచెప్పాల్సిన బాధ్యత ఎవరికుంది? మనకి లేదా?
    ఏది తప్పో, ఏది ఒప్పో తెలియని జనరేషన్కి ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవరు చెప్పాలి? కాస్తో కూస్తో తెలిసిన మనకి ఆ బాధ్యత లేదా?

    వాళ్ళ ప్రశ్నలకు -
    మనం సమాధానం...వారు కనెక్ట్ అయి, కన్విన్స్ అయ్యేటట్లు సరిగ్గా ఇవ్వగలిగితే, అందరిలో కాకున్నా కొందరిలోనైన చక్కటి మార్పు వస్తుంది. కాదంటారా?
    ఇంట్లో సంప్రదాయాలు సంస్కృతి పట్ల సదవగాహన కల్పిస్తే,
    స్కూల్ లలో మొరాలిటీ మోరల్ ఎడ్యుకేషన్ కల్చర్ వస్తే తప్పకుండా నేటితరం వారిలో మార్పు వస్తుంది.

    మన ధర్మం, నైతిక విలువలు, చక్కటి శాస్త్రాలు గురించి తెలియక ప్రశ్నిస్తున్నప్పుడు, వాటి మీద దాడి చేస్తున్నప్పుడు, వాటి గురించి మనకు తెలిసినది చెప్పకుండా నిశ్శబ్ధంగా ఉండడం పెద్ద తప్పు.
    ఈ లోకానికి చెడ్డవాడు వలన అంత ప్రమాదం లేదు కానీ, మంచివాడు మౌనమే పెద్ద ప్రమాదం అన్నది లోకోక్తి.
    అందుకే మీకు తెలిసిన మంచిని ప్రచారం చేయండి ... ఒక్కరైనా మారవచ్చు అని చెప్పిన శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఒకానొక సందర్భంలో బ్లాగ్ విడిచిపెడదామని అనుకున్నా... కానీ, ఈ మాటలు స్పూర్తితో నా ఆలోచనల్లో మార్పు వచ్చి, కొనసాగిస్తున్నాను.

    నాకు మన పురాణ ఇతిహాసాలు వేదాలు గురించి తెలియకపోయినా, మన పెద్దలు, నేటి ప్రవచనాకారులు చెప్పింది, వివరించింది శ్రద్ధగా విని, చక్కటి పుస్తకాలను చదివి, తెలుసుకుంటున్న మంచి విషయాలను కొద్దో గొప్పో స్మరణ ద్వారా తెలుపుతుంది అందుకేనండి....
    దీనివలన నాకు తరిగేది ఏమీ లేదు, ఒరిగేది చాలా ఉంది.

    రిప్లయితొలగించండి
  5. భారతి గారు, కర్ణుడు ద్రోణాచార్యుల వారి శిష్యుడే. అందులో సందేహంలేదు. (గోగ్రహణం నాడు అర్జునునితో తలపడటం అనవసరం అన్న ద్రోణుని కర్ణుడు వాగుడుకాయ అన్నాడు. గురువునే నిందిస్తావా అని అశ్వధ్ధామ కర్ణుణ్ణి ఆక్షేపించాడు) వాట్సాప్ కవులు ఏవేవో వ్రాస్తున్నారు.

    రిప్లయితొలగించండి