14, జనవరి 2024, ఆదివారం

కాదేదీ కబర్లకనర్హం.....

కొన్ని నెలల క్రితం మిత్రురాలు రుక్మిణి జీ (రుక్మిణీదేవి | భారతీయం బ్లాగర్) వాట్సప్ లో పంపిన ఈ క్రింద వీడియో నచ్చి, మరి కొందరు స్నేహితులకు ఫార్వర్డ్ చేసాను.



{तूने जो कमाया है दूसरा ही खायेगा
खाली हाथ आया था खाली हाथ जाएगा
जब तलक ये सांसे हैं तब तलक ये रिश्ता है
सांस जिस घड़ी टूटी तो रिश्ता टूट जायेगा
जीते जी तू माया में राम नाम को भुला
मौत का समय आया तो राम याद आएगा

మీరు సంపాదించినది ఇతరులు తింటారు లేదా  అనుభవించుతారు
ఖాళీ చేతితో వచ్చావు ఖాళీ చేతితో పోతావు
ఈ శ్వాస ఉన్నంత కాలం ఈ సంబంధ అనుబంధాలు ఉంటాయి 
శ్వాస విడిపోయిన  మరు క్షణం సంబంధ అనుబంధాలు విచ్చిన్నమవుతాయి
జీవించి ఉండగా మీరు మాయలో పడి రాముని నామమును మరచి పోతారు
మరణ సమయం వస్తే ఆ రామ నామం  గుర్తు వస్తుంది}

ఈ వీడియో చూసి ఇది సత్యం అని కొందరు, నైస్ వీడియో అని కొందరు బదులివ్వగా, కొన్ని కొన్ని తరచి చూసి చర్చించే సత్సంగ మిత్రులు ఎప్పటిలా చర్చకు తెర తీసారు. 

మిత్రురాలు శారద మాట్లాడుతూ -
భౌతికంగా ఖాళీ చేతులతో రావడం, పోవడం కన్పిస్తుంది గానీ, పాప పుణ్య కర్మ మూటలు మరణించినప్పుడు తీసుకొని వెళ్తాం, అవి అనుభవించడానికి మరల పుడతాం. 


కర్మలు చేయకుండా ఉండలేం, కర్మ ఫలితాలు అనుభవించకుండా తప్పించుకోలేం. ఈ కర్మ వలయాన్ని భేదించుట అంత సులువు కాదు. అలానే మరణ సమయంలో భగవంతుని నామం గుర్తు రావాలంటే, అందుకు తగ్గ అభ్యాసం ముందు మనం చేస్తేనే గుర్తుకు వస్తుంది. లేదంటే మన ప్రారబ్దంలో ఏదైనా పుణ్య ఫలం ఉంటేనే సాధ్యమౌతుందనగా,

నిజమే, ఎవరూ వట్టిగా పుట్టలేదు, ప్రారబ్ధం అనే మూటలను నెత్తిన పెట్టుకుని మరీ పుడతాం. కర్మ ఫలం బట్టే జన్మలు. ఇక జన్మించాక కర్మలు చేయాల్సిందే. ఆ కర్మ ఫలితాలు ఇప్పుడో (ఈ జన్మలోనో) మరెప్పుడో (మరు జన్మలలోనో) అనుభవించక తప్పదు. అవతార పురుషులకైనా తప్పదు. రాముడు వాలిని చెట్టు చాటు నుండి ఒక్క బాణం వేటుతో హతమార్చిన ఫలితంగా, మరు జన్మలో కృష్ణ నిర్యాణం ఓ వేటగానిచే ఒక బాణం దెబ్బతో అనుభవించాల్సి వచ్చింది.  వెళ్ళి పోయేటప్పుడు ప్రాణవాయువు కర్మ వాసనలను తీసుకెళ్తుంది. ఏ వాసనలతో పోతామో అది మరుజన్మకు నాంది అవుతుంది. ఆ కర్మ వాసనల వలనే కదా, శ్రీకృష్ణ పరమాత్మ సాంగత్యం పొందినా సరే, అర్జునుడు కన్నప్పగా, భీముడు మధ్వాచార్యులుగా పుట్టారని పెద్దలు చెప్తుంటారు. మరి ఈ కర్మ వలయాన్ని చేధించడం ఎలా భారతీ గారు? ఇది పద్మగారి ప్రశ్న.

చెప్పారుగా గీతాచార్యుడు... "కర్మయోగం".
కర్మయోగమే మనకున్న ఏకైక అవకాశం.  కర్మని ఓ యోగంలా చేయడమే. మన దైనందిక కర్మలను, బాధ్యతలను కర్తవ్యమును ధర్మబద్దంగా నిర్వహిస్తూ, దైవస్మరణ విడువకుండా సాధనా మార్గంలో సాగిపోవాలి. మనకోసం, మన కుటుంబం కోసం కర్మలు చేయక తప్పదు! అంటే పనులు చేయడం ఎలాగూ తప్పదు. ఆ పనులేవో భగవంతుడుని స్మరిస్తూ చేస్తే, అది ఉపాసన అవుతుంది. ఏ ఉపాసనా చేయకున్నా మన రోజులు గడిచిపోతాయి. నిస్సారంగా జీవితం ముగిసిపోతుంది. పుట్టాం...గిట్టాం... అంతే! అదే మన జీవనవిధానం ఉపాసనతో అనుసంధానం చేస్తే జీవితం సారవంతమై అర్థవంతంగా పూర్తి అవుతుంది. 


కర్మని భగవత్ స్మరణతో చేస్తే, ఆ కర్మ యోగమౌతుందని నేను చెప్తుండగా...

ఏమిటో... ఈ కర్మ బంధనాలు...
ప్రారబ్ధ మూటలను భారంగామోస్తూ, ఇది నా తలరాత, విధిరాత అనుకుంటూ మరిన్ని కర్మలు మూట కట్టుకుంటూ...కర్మత్రయానికి లోబడి చావు పుట్టుకల చక్ర భ్రమణంలో పడి బ్రతుకుతున్నవారు కొందరు.
నిండు గుండెతో, మెండైన నమ్మికతో దైవాన్ని ఆశ్రయించి  మోసేది ఆయన, చూసేది నేను అనుకుని భక్తి మార్గంలో జీవిస్తూ జన్మ పరంపరను తగ్గించుకునేవారు మరికొందరు.
మోసేది ఎవరు? చూసేది ఎవరు? ఉన్నది ఒక్కటే... చావు పుట్టుకలు శరీరానికే అని ధ్యానమార్గంలో నడిచేవారు మరికొందరు.
పై మూడు సిద్ధాంతాలు గురించి ఔనని చెప్పిన, కాదని చెప్పినా, అవి ఎఱుకలో లేని మాటలే.  అన్నీ భ్రమ, భ్రాంతి లోవే... అన్నీ స్వప్న సదృశ్యమే... అని కొట్టిపారేస్తూ జ్ఞానమార్గంలో ఇంకొందరూ...
హూ... ఈ కర్మల గురించి ఎంతని చెప్పగలం? ఎంతని తెలుసుకోగలం? భగవాన్ గీతలో చెప్పారుగా... అభ్యాస జ్ఞాన ధ్యానాలకంటే కర్మఫల త్యాగమే గొప్పదని.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ||

కర్మఫల త్యాగం మనం చేయలేం. అంతటి పరిణితి రాలేదు కాబట్టి. నన్నడిగితే కర్మలను భగన్నామస్మరణతో కలిపి సాధన చేయడమే ఒకింత సులభం అన్పిస్తుందని రజినీ గారు చెప్తుండగా...

మనతో పాటు మన కర్మ మూటలు మోసుకుపోవడం తప్పనప్పుడు, ఆ కర్మ మూటలేవో సుకర్మ అంటే పుణ్య మూటలైతే బాగుంటుంది కదా... నాకో కథ గుర్తుకొస్తుందంటూ -
ఒకానొక ధనవంతునికి ఓ సందేహం వచ్చింది. మరణించినప్పుడు మనతో ఈ సంపద రాదంటారే...ఊహు ...ఈ సంపద అంతా నాతోనే వుండాలి, నేను మరణించాక కూడా నాతో పాటే వుండాలి...ఎలా మరి...ఎన్నో విధాల యోచించిన సరైన ఆలోచన తట్టక, ఓ ప్రకటన చేస్తాడు. నేను మరణించాక కూడా నా సంపదనంతా నేను తీసుకెళ్ళడానికి సరైన సలహా ఇచ్చిన వార్కి లక్ష బంగారు వరహలిస్తానని.
ఈ ధనికునికి డబ్బు పిచ్చి కాకపోతే, ఇదెలా సాధ్యమని అందరూ అనుకుంటున్న తరుణంలో ఓ యువకుడు వచ్చి, నేను మీకో సలహా ఇస్తాను. మీరు నా సలహా అమలు చేస్తే, మీ సంపద అంతా మీతో తీసుకు వెళ్ళవచ్చునని చెప్పగా, ఎంతో ఆతృతగా, 'ఎలా' అని ప్రశ్నిస్తాడు కోటీశ్వరుడు. మీరు అమెరికా వెళ్ళారనుకొండి, అక్కడ ఈ ఇండియా రుపీ చెల్లుతుందా? చెల్లదు కదా. మరి అక్కడ చెల్లాలంటే మీకు కావల్సిన డబ్బు మొత్తం బ్యాంక్ లో ఎక్సేంజ్ చేసుకొని డాలర్లుగా మార్చుకొని తీసుకువెళ్ళి ఉపయోగించుకుంటారు. అదే రష్యా వెళ్తే రూబుల్ గా, జపాన్ వెళ్తే యెన్ గా మార్చుకొని వెళ్తాం. అదే రీతిలో మీ డబ్బు / సంపద స్వర్గానికి తీసుకు వెళ్ళాలంటే మార్చుకొని తీసుకు వెళ్ళాలి. 
'అవునా! ఏ బ్యాంక్ లో ఎక్సేంజ్ చేయాలి? ఆ బ్యాంక్ ఎక్కడుంది? ఆ బ్యాంక్ లోనికి నా డబ్బును ఎలా ట్రాన్స్ఫర్ చెయ్యాలి'? 


మీ దగ్గర ఉన్న సంపదను సేవా కార్యక్రమాలకు, సత్కర్మలకు వినియోగించి పుణ్యంగా మార్చుకుంటే, మీతో పాటు మీ పుణ్య సంపదను తీసుకువెళ్ళవచ్చు..... అని చెప్పిన యువకుడిని ఎంతో సంతోషంతో సత్కరించి, ఆ సూచననుసరించి తరించెను ఆ ధనికుడు.
నిజమేకదా...మానవసేవే మాధవసేవని పార్వతి గారు చెప్పారు.

నామ స్మరణ చేయువారికి పాపాలు పోతాయన్నది నిజమేనా? నాకు తెలిసిన కొందరు నామ స్మరణ చేస్తునో, స్తోత్రాలో మంత్రాలో పఠిస్తునో, వంట చేస్తుంటారు. పూజలు, ఆలయ దర్శనాలు, అర్చనలు చేస్తుంటారు. మరి వారికి పాపాలు పోయినట్లేనా? పాప ఫలితం వారికి ఉండదా? ముక్తస్థితిలో వారున్నట్లా? వారనే కాదు, మిమ్మల్నే తీసుకొండి...రామ స్మరణంలో ఉంటారు. మరి మీకు ఇక ఏ పాప కర్మ ఫలితాలు లేనట్లేనా...
ఆగండి వాణిగారు, మీ మనోభావం నాకు అర్థమైంది. 
నామ స్మరణ చేస్తే పాపాలు పోతాయన్నది సత్యం. ఇది శాస్త్ర వచనం. అయితే కుంజర శౌచం మాదిరిగా చేస్తే, కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు. అంటే, నామజపం చేస్తున్నా, పాప కర్మలు మరల మరల చేస్తే ఆ కర్మ ఫలాలు అనుభవించాల్సిందే. 
ఇక నా గురించి అంటారా... ప్రాపంచిక బంధపాశముకు కట్టుబడి, కాలానుగుణంగా ఎవర్నీ నొప్పించక నొవ్వక సాగుతున్న నేపథ్యంలో చిరు చిరు తప్పులు తప్పవు. నా దృష్టిలో ఒప్పైన కర్మ, మీ దృష్టిలో తప్పు కావచ్చు.  మా తాతయ్య గారు ఓ మాట చెప్పేవారు...కర్మ అంటే, మనం చేతులతో చేస్తున్నదే కాదు, మనో వాక్కులతో చేసేది కూడా కర్మే. అలానే ప్రస్తుతం మనకు ఏం జరుగుతుందో అది మాత్రమే కాదు, మనకు ఏదైతే జరుగుతోందో, దానికి మనం ఎలా అనుభూతి చెందుతున్నామో, ఎలా స్పందిస్తున్నామో అనేది కూడా మన కర్మే. మనం చెడు చేయకపోవచ్చు కానీ; మన కళ్ళెదుట జరిగే చెడును చూస్తూ అడ్డుకోక పోవడం కూడా తప్పే. అది కూడా మన కర్మల ఖాతాలో జమవుతుంది. ఉదాహరణకు మహాభారతంలో భీష్మ, ద్రోణులు పెద్దలైనా, ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకోలేకపోతారు. రాజుకు విధేయులై ఉండాలన్న ధర్మం పాటించినా, కళ్ళముందు జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డుకోరు. జీవితమంతా మంచిగా బ్రతికినా, కళ్లెదుటి అధర్మ కార్యాన్ని అడ్డుకోలేని ఫలితానికి శిక్షగా యుద్ధంలో చంపబడతారు. నాది సర్ధుబాటు మనస్థత్వం. తటస్థ వైఖరి. వెంటనే దేనిని ఖండించలేను. కానీ, ఆ క్షణాల్లో నాలో రామ స్మరణం రెట్టింపు అవుతుంది. కొంతసేపటికి ప్రశాంతత... అలాగని మనస్సులో దేనిని మోయను... ఏదీ నిలవదు. నా ఈ వైఖరి కొంత తప్పే... కావున, నా కర్మ ఫలాలు నేను అనుభవించక తప్పదు. ఐతే రామ స్మరణ నడుమ పాపపుణ్యాల గురించి చింతన, చింత లేనే లేదు. కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడం స్థితప్రజ్ఞత. అంతటి ప్రజ్ఞ నాలో రాలేదింకా వృద్ద పక్షిలా. ఇక రామ నామ స్మరణం భక్తిగా అలవర్చుకున్నది... శ్రీరాముడు అంటే అమిత ప్రేమ, నా అంత్యకాలంలో రామ ధ్యాసలోనే తుదిశ్వాస విడవాలని. ఓ గృహిణిలా నా కర్మలు నేను సరిగ్గా నిర్వర్తిస్తూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, అప్పుడప్పుడు మీలాంటి వారితో సద్గోష్టిలో పాల్గొంటూ, మాయలో పడి గాడి తప్పుతున్న మనస్సును రామ స్మరణతో తిరిగి గూటిలో పెడుతూ సరళమైన జీవనం సాగిస్తున్నాను వాణి గారు. ఇదే నా కర్మలన్నింటిలో ప్రధాన కర్మ. ఇంతకు మించి నాకేమీ తెలియదని చెప్పగా, బాగుంది బాగుంది కానీ, ఆ వృద్ధ పక్షి ఊసేమిటి మధ్యలో...అని అడిగిన మిత్రులకు ఎప్పుడో చదివిన ఈ కథను చెప్పాను.
అనగనగా ఓ ఎడారి ప్రాంతంలో నివాసముండే ఓ పక్షి వృద్ధాప్య దశకు చేరుకున్నాక, జవసత్వాలు తగ్గి బక్క చిక్కేక, తన దీనావస్థకు దుఃఖిస్తూ,
అయ్యో! యవ్వనంలో వున్నప్పుడు ఎట్లా వుండేదానిని, ఇప్పుడు ఇలా వున్నాను...ఆహా... ఏమి నా తలవ్రాత అని అనుదినం చింతుస్తూ  కృంగిపోసాగింది. 
అలాంటి తరుణంలో ఆ పక్షి మసకబారిన కంటి చూపుకి, 
ఒక దేవదూత పక్షి అటుగా వెళ్ళడం కనిపించింది. వెంటనే కాస్తా సత్తువ కూడబెట్టుకొని, ఆ పక్షిని పిలుస్తూ, 
ఓ దైవ కపోతమా! నీవు ఎటు వెళ్ళుచున్నావు? అని అడుగగా...
ఆ దేవదూత పక్షి "నేను దైవం వద్దకు వెళ్తున్నానని" బదులిస్తుంది.
అంతట ఈ వృద్ధపక్షి, ఓ దేవదూత! నా ఈ దీన స్థితిని నీవు చూసితివి గదా, నాయందు దయపూని, నాకీ దైన్యత ఇంకెంతకాలమో దైవాన్ని అడిగి బదులీయరాదా? అంటూ వినమ్ర పూర్వకంగా, ఆర్తిగా అడిగింది.
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ద పక్షి ఎంతో ప్రాదేయపూర్వకంగా, దేవుని సమాధానం తెలుసుకోవాలనే తపనతో దేవదూత కపోతమును హృదయపూర్వకంగా వేడుకోగా,  ఆ పక్షి దైన్యతను చూసిన, ఈ దేవదూత పక్షికి కళ్ళు చెమర్చగా, 'నీకేం భయంలేదు, నీ తరఫున నేనడుగుతా, దైవం నుంచీ సమాధానం తప్పకుండా తీసుకుని వస్తాను అంటూ బయలుదేరిన ఆ దేవదూత పక్షి భక్తితో దైవం వద్దకు వెళ్ళి, సమయాసమయాలు చూసుకుని, మంచి తరుణంలో ఈ వృద్ధపక్షి ఉదంతం అంతా చెప్పి, హే! పరమ దయాళు! స్వామి! ఆ వృద్ధ పక్షి దైన్య స్థితి పోవడానికి ఎంత కాలం పడుతుందోనని తెలుసుకుని రమ్మని చెప్పిందని విన్నవించుకోగా -
అంతట దైవం, "ఆ వృద్ధ పక్షి రూపంలో వున్న జీవుడికి "వినాదైన్యేన జీవితం, అనాయాసేన మరణం" సంప్రాప్తమవ్వాలంటే, ఇంకా ఏడు జన్మలు పడుతుంద"ని పలికెను.

అప్పుడు ఆ దేవదూత పక్షికి ఆ వృద్ధ పక్షి దైన్య రూపం, హృదయపూర్వక ప్రార్థన గుర్తుకువచ్చి, 'అలా కాదు... స్వామి! ఏదైనా తరుణోపాయం వుంటే సెలవీయండి' అని వేడుకోగా, అంతట ఆ పరందాముడు దయామృత వదనుడై, కృపా రసార్ద్ర హృదయుడై, చిరు మందహాసంతో, "దైన్య స్థితినుంచీ దైవ స్థితికి చేరేందుకు మార్గమొక్కటి వున్నది, ఏది జరిగినా, ఏది ప్రాప్తించినా, ఏది ఏమైనా, అంతా ఈశ్వరేచ్ఛ మేరకే, అంతా భగవదనుగ్రహం మేరకే జరుగుతుందని, నేను చేసింది ఏమీ లేదని, పరిపూర్ణ విశ్వాసంతో, బలీయమైన నమ్మికతో, దృఢమైన చిత్తంతో... ఎదురౌతున్న ప్రతీదీ ఈశ్వర ప్రసాదమనే భావించి, 'సర్వకారణమీశ్వరం' అనెడి వాక్యాన్ని ఆశ్రయించి వున్నట్లయితే, అప్పుడు పరిస్థితి మారవచ్చును" అని సూచన చేసెను.
అంతట ఆ దేవదూత పక్షి శీఘ్రగతిన వృద్ధ పక్షి వద్దకు వచ్చి, పరమాత్ముని మాటలు వినిపించి, ధైర్యాన్ని ఆనందాన్ని నింపి, సంతోషంగా వెడలిపోతుంది.


ఇక ఈ వృద్ధపక్షి దేవ కపోతం మాటలను శ్రద్ధగా విని, విశ్వాసంతో ఆచరణ లోనికి తెచ్చుకుంది. 
ఎంతలా అంటే - ఇవాళ ఆహారంగా కాసిన్ని రెక్కల పురుగులు దొరిగాయి... సంతోషం, ఈశ్వర ప్రసాదం... ఈశ్వరా! నీకు కృతజ్ఞతలు.
మరోరోజు ఆహారంగా పప్పు ధాన్యాలు లభించాయి... ఇది ఈశ్వర అనుగ్రహం... ఈశ్వరా! నీకు ప్రణతులు. 
ఇంకో రోజు ఆహార అన్వేషణ గావిస్తుంటే, కంట్లో నలుసుపడి తీవ్రంగా బాధించింది, అప్పుడు కూడా, ఇదీ ఈశ్వర ప్రసాదమే, ఈశ్వరా! నీకు కన్నీటితో నమస్సులు..
వేరొక రోజు ఆహారంకై వెళ్తుండగా... ముళ్ళకంప గీరుకుంది... మరీ సంతోషం... ఇదీ ఈశ్వరానుగ్రహమే... ఈశ్వరా! నమోనమః ఇలా... ఆహారం దొరికినా, దొరకున్నా, ఎక్కువైనా, తక్కువైనా, భుక్తాయాసమైన, కడుపుమాడిన... ఏది ఏమైనా సరే, ప్రతీసారి, ప్రతీ చోట... ఈశ్వర, ఈశ్వర, ఈశ్వరా నీవే సర్వమూ, అంతా నీ అనుగ్రహమే... నీకు మనసా, వాచా, కర్మణా మ్రోకరిల్లుతున్నాను తండ్రీ... అని శరణాగతి భావంతో జీవించ సాగింది.
కొన్ని నెలలు అనంతరం అటుగా మరల వచ్చిన దేవపక్షి ఈ వృద్ధపక్షి కేసి ఆకాశం నుంచే చూస్తూ, ఆహా! ఎంతటి మార్పు... మచ్చుకైనా మునుపటి దైన్యత, వృద్దచాయలు లేవే... అని ఆశ్చర్యానందాలకు లోనై, వెంటనే దైవం వద్దకు వెళ్ళి విషయం చెప్పి, ఏమిటి ఆ వృద్ద పక్షిలో ఇంత మార్పు? ఏడు జన్మల వరకూ దుఃఖ ఛాయలు కూడా పోవు అని మీరు నాకు సెలవిచ్చారు... ఇప్పుడు ఏడు నెలలలోనే ఇంత మార్పా? అని అడుగగా, అప్పుడు పరమాత్ముడు చెబుతాడు... ఇదంతా నేను అన్న అహాన్ని వీడిన ఔన్నత్యమని. శరణాగత సమర్పణ ఫలితమని. ఈ కథ విన్నాక,

భారతీ గారు, మీరు భక్తితో రామ నామస్మరణం ఎందుకు అలవర్చుకున్నారోనన్న మాటలు వింటుంటే -

అంతకాలే చ మావేవ స్మరన్ ముక్త్వా కలేబరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః||

మరణసమయంలో ఎవరైతే నన్నే స్మరించుచు దేహమును వీడుదురో వారు నన్నే చేరుదురు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరమ్|
తం తమేవైతి కౌంతేయః సదా తద్భావభావితః||

ఓ కుంతీపుత్రా! ఎవరేయే భావమును స్మరించుచు తుదకు దేహత్యాగ మొనర్చునో వారు ఆ భావమునే పొందుదురు. అంటే మన ఉత్తరజన్మ మన కట్టకడపటి భావముపై ఆధారపడి ఉంటుందన్నది యదార్థం... అన్న గీతాచార్యుని మాటలతో పాటు ఎక్కడో చదివిన ఓ కథ కూడా గుర్తుకు వస్తుంది.

ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి మరు జన్మకు కారణమవుతాయి.

ఒకసారి ఒక రాజ్య కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చి, రాజు వద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వుంది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొనగా, రాజు అందుకు సమ్మతించాడు.
రాత్రి అయింది. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే తలంపుతో, ఆ రాజు మారువేషంలో చాటుగా మూగవాన్ని గమనిస్తూ బయల్దేరాడు.
 
అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ కాపలాదారుని కొడుకు కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు -

కామం క్రోధంచ, లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః.

(మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని, జ్ఞానమనే రత్నాన్ని అపహరించడానికి పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త)

ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. మూగవానిగా నటిస్తున్నాడు. ఇతణ్ణి వెంబడించి, గమనించాలి' అని రాజు భావించాడు. 

రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు -

జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః

(పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, ఇవి మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త)

ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది.

మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః 

(తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు [ఇదంతా మిథ్య అని అర్థం] జాగ్రత్త! జాగ్రత్త) అని చాటాడు. 

ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ యువకుడు
 
ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః

(ఆశాపాశంచేత కట్టుబడి తిరుగుతూ, లోక కర్మల చేత బహుచింతలకు లోనై, ఆయువు క్షీణించడం ఎరుగలేరే... జాగ్రత్త జాగ్రత్త) అని చాటాడు...

ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మ గల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతణ్ణి తన రాజప్రాసాదానికి రప్పించి, అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకొని రాజు తన కోటకు వెళ్ళి పోయాడు.

మర్నాడు ఆ యువకుని తండ్రిని పిలిపించి,
అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగవాడు కాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు... అని. తండ్రి ఆశ్చర్యానందంకు లోనై, తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక, ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.
అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. 
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ యువకుడు. ఈ కోరిక విని రాజు అమితాశ్చర్యపోయి, ఇచ్చిన మాట ప్రకారం అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ యువకుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించగా,
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి, “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని, ఇప్పుడు ఎందుచేతనో ఒక దేశం నుండి చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, ఆ దేశంలో పాపాత్ములే లేరా! లేదా పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం”... అని చెప్పగా, బ్రహ్మకీ ఇది విచిత్రంగా తోచి, అసలు విషయం పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. 
ఇక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు ఈ జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతున్నారు. 
ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి ఈ జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా, బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది.

అదేమంటే - మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా, ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది.

మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింప చేసి, వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, భక్తితో తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి, వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు భక్తి మైకంలో గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.

ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై, ఈ జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.

"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో 
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. 
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు -
"ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా?నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు. కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం నాకు ఒక పాఠమైనది” అని తెలపగా...

అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి, సత్యలోకం చేరుకొన్నాడు. 
మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేదా ముక్తి లభిస్తుంది. 
సత్ చింతన కాక, వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తున్నది.
నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక! కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా అలవర్చుకోవాలని ఎప్పటిలా ప్రియంగా చెప్పింది ప్రియంవద.

జహా జహా చలూ కరూ పరిక్రమా, జో జో కరూ సో సేవా
జబ సోవూ కరూ దండవత్, జానూ దేవ న దూజా 
                          - సంత్ కబీర్
నేను నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది చేసినా, అది భగవత్ సేవ గానే భావిస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను... 
సంత్ కబీర్ లా కర్మలను భగవత్ తలపుతో జత చేసే భావన మనలో ధృఢమౌతే ధన్యులమే కదా... కానీ, అంత ధృఢ సంకల్పం లేదే... నిట్టూర్పుతో నెమ్మదిగా అన్నారు నిర్మల గారు.

గత మూడు దశాబ్దాలుగా మీకు నేను తెలుసు. నేను తెలిసి తెలిసీ ఏ తప్పులు చేయలేదు, భగవత్ ఆరాధన మానలేదు. నా జీవితం ఓ సుడిగుండం. అయినా ఈ ఆధ్యాత్మిక చింతన అలవడేకా మునుపటిలా దుఃఖం లేదంది నీరజ.

అసలు ఎందుకీ కష్టాలు? కొందరికి బ్రహ్మరాత ఇలా ఉంటాదేమిటి? ఇది వారి ప్రారబ్దం అంటారు...
 అసలు ఈ ప్రారబ్ధం ఏమిటి? ఈరోజు చేసిన వంట ఈరోజే తింటున్నాం కదా. అలాగే ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవించేయాలి కదా... మరు జన్మలకు ఎందుకు? 
హైమ గారి ఈ ప్రశ్నలకు, ఈరోజు వంట ప్రిజ్ లో దాచుకొని దాచుకొని తింటారు కదా, ఈరోజు చేతికి అందిన పంట ఫలాదులను ఈరోజే తినేయరు కదా,  గర్భంలో పడిన బిడ్డను వెంటనే కనేయలేరు కదా. దేనికైనా సమయం రావాలి. విత్తనాలు చల్లగానే అవి అంకురించవు. నియమిత కాలంలోనే మొలకెత్తుతాయి కదా! ఈ ఏడాది పండిన ధాన్యం కొన్ని మరుసటి సంవత్సరపు పంటకు కారణమయినట్లే, కొన్ని మన కర్మలు మరుజన్మకు కారణమవుతాయి. 


మనం చేసిన సత్కర్మలైనా, దుష్కర్మలైనా కొన్ని వెంటనే ఫలితాన్ని ఇస్తే, కొన్ని కొన్ని వెను వెంటనే తమ ప్రభావాన్ని చూపవు, కాలానుగుణంగా తమ ఫలితాన్ని చూపుతాయి. 
ఇక బ్రహ్మ కాదు, మన తలరాతలు మనమే వ్రాసుకుంటాం.
కర్మ ఎలా ఉంటుందో ఒక దగ్గర చదివాను. కృష్ణుడు కంసుని సంహరించి, తన తల్లిదండ్రులను కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూడగానే "నాయనా! నీవే పరమాత్మవి కదా. నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. ఎందుకు 14 ఏళ్ళు ఆగావు... కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి" అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు "అమ్మా! నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? విన్న దేవకి ఆశ్చర్య చకితురాలయింది.
"కృష్ణా ఇదెలా సాధ్యము? ఎందుకిలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ, గత జన్మలో నీవు " కైకేయివి", నీ భర్త "దశరథుడు". 
ఇక ప్రారబ్ధం అంటారా... కర్త, కర్మ, క్రియ మూడూ భగవంతునివే. కానీ; ఈ మూడు మనవే అని మన నెత్తిన వేసుకుని మోయడమే ప్రారబ్దం... ఝాన్సీగారు ఈ వివరణ ఇస్తూ, ఈమధ్య నేనో పాట విన్నాను, చాలా బాగుంది... వినడంటూ పార్వర్డ్ చేసిన వీడియో -


పైన ఉదాహరించిన కథా రచయితలకు హృదయపూర్వక నమస్సులు.

                ఈ కబుర్లు కొనసాగుతునే ఉన్నాయి...

2, జులై 2023, ఆదివారం

శ్రీ దత్తుని వైభవం - ఇరవై నలుగురు గురువులు



మూడుస్థితులు దాటి దోషాలు వెదకని తత్వం లోకి వెళ్ళినవారికి పరమాత్మ సాకారం అవుతాడని, గురువు దైవమూ దత్తుడే అని, తనను స్మరించిన వారికి వెంటనే అనుగ్రహించే సిద్ధుడు దత్తుడు అని...క్రిందటి టపాలో స్మరించుకున్నాం.


దత్త వైభవం

యోగమే దత్తుని మార్గం.
నిస్సంగత్వమే దత్తుని ఉపదేశం.
జ్ఞానమే దత్తుని ఉపాసన.

దత్త ప్రపంచం లోని వారు ఎల్లప్పుడూ దత్తోహం అని ధ్యానిస్తూ ఉంటే, దత్త స్వరూపులుగా అవదూతలుగా మారిపోతారని ప్రతీతి. 

దత్తాత్రేయుడు ప్రతిరోజు స్నానం కాశిలో, ధ్యానం మాహురీపురములో, భిక్ష కొల్హాపురిలో, నిద్ర సహ్య పర్వతం దగ్గర చేయుదురని గురుచరిత్రలో తెలుపబడింది.

దత్తుని ఇరవై నలుగురు గురువులు

సృష్టిలో ప్రతీ అంశం నుండి మానవుడు జ్ఞాన సముపార్జన చేయవచ్చును. అలా ప్రకృతిలోని పంచభూతాలు, పశు పక్ష్యాదులు తనకి గురువులని దత్తాత్రేయుల వారు తెలిపిన ఇరవై నలుగురు గురువుల వివరణ -

1) పృథ్వి (భూమి):
జీవులు కాళ్ళతో తొక్కుతున్నా,  తనపై మలమూత్రాదులను విసర్జిస్తున్నా, త్రవ్విన, దున్నిన అన్నిటినీ భరించి ద్వేషభావం లేకుండా సస్యాలు ఆశ్రయము ఇచ్చి, పోషిస్తున్న భూమి నుండి సహనాన్ని నేర్చుకున్నాను.

2) వాయువు: 
వాయువు వివిధ వస్తువుల బట్టి శీతల ఉష్ణ, సుగంధ దుర్గంధాలపై సంచరించిన, తాత్కాలికంగా వాటిచేత ప్రభావితుడైనట్లు అనిపించినా, దేనితోనూ సంగత్వమేర్పరచుకోక, తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా వుండే వాయువును చూసి, వేటి నడుమ వుండాల్సివచ్చిన వాటికి చిక్కకుండా నిర్మలంగా నిస్సంగుడనై ఉండడం నేర్చుకున్నాను.

3) ఆకాశం: 
గాలి, మేఘం, సూర్యచంద్ర నక్షత్రాదులతో నిండివున్నట్లు కనిపించిన, దేనితోనూ ఎలాంటి సంబంధం లేకుండా సర్వత్రా వ్యాపించి ఉండే ఆకాశాన్ని చూసి, ఆత్మ కూడా ఆకాశం వలె సర్వవ్యాపి అని, శరీరాదులతో ఈ నశ్వర జగత్తు ఆత్మ యందే ఉన్ననూ దేనితో సంగత్వం లేకుండా ఉందనే సత్యాన్ని గ్రహించాను. అలానే త్రిగుణాల వికారరూపమైన దేహానికి దానివలన కలిగిన మనోవికారాలకు అంటనివాడై ఆకాశం మాదిరిగా స్వచ్ఛంగా వుండాలని గ్రహించాను.

4) జలం: 
ప్రాణికోటికి దాహం తీర్చి, అందరికీ ఆరోగ్యం చల్లదనం కల్గించి, వృక్షములను సస్యములను పోషించి, తనను తాకిన అన్నిటినీ శుద్ది చేసి, శుభ్రతను, పవిత్రతను ఇస్తుంది జలం. పరిశుద్ధ జలం మురికిని పోగొట్టే విధంగా మహాత్ములు పరిశుద్ద అంతఃకరణ కలిగియుండి ప్రాపంచిక మానవుల మనోమాలిన్యం శుభ్రపరచాలని గ్రహించాను.

5) అగ్ని: 
ఒకసారి నివురుగప్పిన నిప్పులా, ఒకప్పుడు విశేషాగ్నిలా ప్రజ్వరిల్లుతూ వెల్లడవుతుంది. రాపిడివల్ల ప్రకటతమయ్యే అగ్నితత్వం వస్తువులలో సూక్ష్మంగా దాగియుండును. మథనం చేత విశేషాగ్నిగా ప్రకటతమై యజ్ఞం చేసేవారి పూర్వపాపాలను హరించి, రానున్న కర్మదోషాలను నివారించడం కోసం ఎవరినుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు కానీ, తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడుగాకనే, వారి పాపాల్ని దహిస్తాడు. అలాగే జ్ఞాని కూడా తన తపశ్శక్తిని గుప్తంగా వుంచుకుంటూ, మానవులను పావన మొనర్చడానికే సర్వులనుండి బిక్షనుగొని వారిని అనుగ్రహించాలని, దీనివలన తాను అపవిత్రుడు కాడని తెలుసుకున్నాను.
తనకి ఆహుతి ఇచ్చిన దేనినైనా దోషమెంచక స్వీకరించి నిర్మలముగా ప్రకాశించే అగ్నిలా, పదార్థములను యెంచక ఆహారంగా ఎవరేం సమర్పించినా స్వీకరించి, నిర్మలముగా తపో జ్ఞానాలతో యతి ప్రకాశించాలని గ్రహించాను. అగ్ని వివిధ వస్తువుల గుణ బేధాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారి యున్నట్లు, తత్వజ్ఞానమనే అగ్నితో వివిధమైన వస్తువుల గుణాలను నిరసించి, సర్వగతమైన సర్వేశ్వరుని తత్వాన్ని గ్రహించి, తనలో తాను అణిగియుండాలని తెలుసుకున్నాను. అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టెను చేరినప్పుడు ఆ రూపంలో భాసిస్తుంది. అలాగే ఆత్మగూడ వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాల్లో గోచరిస్తుందని తెలుసుకున్నాను.

6) చంద్రుడు:
చంద్రుడు సదా పూర్ణుడే యున్నను, భూమితో పరిభ్రమించుట వలన వృద్ధి క్షయములు పొందినట్లు కనిపించేలాగున, జనన మరణములు శరీరంనకే గాని, ఆత్మకు లేవని గ్రహించాను. అలానే ఆత్మ అనంతం, సంపూర్ణం అయినను శరీర మనో బుద్ధుల ఛాయా ప్రసరణచే ఆత్మ పరిమితమనే భ్రాంతి కలుగుచుందని తెలుసుకున్నాను.

7) సూర్యుడు: 
సూర్యుడు ఒకడే అయినను అనేక నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కనబడినట్లు, ఆత్మ ఒకటే అయినను దేహాది ఉపాధి భేదముచే వివిధమూ భిన్నమూ అయినట్లు కనబడుతుందని గ్రహించాను. సూర్యుడేవిధంగా నీటిని తన కిరణాలతో స్వీకరించి మరలా ఎలా విసర్జించునో అట్లే జ్ఞాని కూడా తాను సేకరించిన జ్ఞానాన్ని బోధ రూపంలో జీవులకు ప్రసాదించాలని గ్రహించాను. ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి. కలువలు ముకుళించుకుంటాయి. అలానే జీవులు వారి వారి పరిపాకాన్ననుసరించి ఆ బోధను గ్రహించగలుగుతారు కానీ,
సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును ఉష్ణశక్తిని అంతటా సమానంగా ప్రసాదించడంలో జీవుల గుణ దోషాలను యెంచనట్లే, యతులు తమ అనుగ్రహమును గుణ దోషాలు యెంచక అందరికీ ప్రసాదించాలని గ్రహించాను. సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్యరూపాలను సర్వులకూ గోచరింపజేసినట్లే, జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసువులకు తెలియజేయాలని గ్రహించాను.

8) కపోతం (పావురం):
ఒకచెట్టుపై పావురముల జంట తమ పిల్లలతో వున్నవి. ఒకరోజు ఒక వేటగాడు పన్నిన వలలో పిల్ల పావురాలు చిక్కుకున్నవి. బయటకు వెళ్ళి వీటికి ఆహారం తెచ్చిన తల్లిపావురం పిల్లలు వలలో చిక్కుకోవడం చూసి, ప్రేమపాశంతో వాటి వద్దకు వెళ్ళి అదీ చిక్కుకుంది. అప్పుడే వచ్చిన మగపావురం వచ్చి తన భార్య పిల్లలు వలలో పడుట చూసి, వాటిమీదున్న మమకారంతో ఆ వల వద్దకు వెళ్ళి, అందులో చిక్కుకుపోవడం చూసి వ్యామోహ మమకారాలే బంధాలకు కారణమని గ్రహించాను.

9) అజగరం (కొండచిలువ):
కొండచిలువ తన ఆహారం కోసం అలమటించి తిరుగాడక, యాదృచ్చికంగా లభించిన ఆహారంను రుచికరమైన కాకపోయినా స్వీకరించినట్లు, ఇహపర సుఖాలకోసం ప్రాకులాడక, దైవికంగా లభించిన దానితో సంతుష్టి చెందవలెనని, కొండచిలువ జన సంచారమునకు దూరంగా నివసిస్తున్నట్లే మునియైన వాడు అందరకు దూరంగా యుండి నిరంతర ఆత్మనిష్ఠతో యుండవలెనని తెలుసుకున్నాను.

10) సముద్రం:
వర్షాకాలంలో నిండుగా పొంగి ఎన్ని నదుల నీరు తనలో కలిసిన పొంగుటగానీ, వేసవిలో నీరు తగ్గిన కృంగుటగాని చేయదు. చెలియలి కట్టను దాటదు. తనలో ఉన్న ముత్యాలు బయటకు నెట్టుటగానీ, బయటనుండి వచ్చు అపరిశుద్ధ వస్తువులను తనయందు ఉంచుకొనుటగాని చేయదు. అట్లే జ్ఞాని పరిపూర్ణుడై సుఖాలకు పొంగక, దుఃఖాలకు కృంగక, ధర్మమనే చెలియలి కట్టను అతిక్రమించకుండా ఉండాలని, అలానే తనలోని సద్గుణాలను వదలక, దుర్గుణాలను తనలోనికి రానీయక మెలగవలెనని గ్రహించాను.

11) మిడుత:
దీపకాంతిని చూసి భ్రాంతితో దానికి ఆకర్షింపబడి మిడుత నశించును. ఆ విధంగనే మానవులు దుఃఖ నిలయాలైన విషయాలును సుఖాలని భ్రమించి, రూపలావణ్య మోహముచే భ్రాంతిలో పడి ప్రశస్తమైన జీవితాన్ని వృథా చేసుకుంటూ దుఃఖమయ విషయాలలో చిక్కి నశిస్తున్నారు. అందుకే మనస్సును విషయమోహములకు గురికానివ్వకూడదని గ్రహించాను.

12) భ్రమరము:
భ్రమరము ఒక కీటకమును తెచ్చి ఒక గూడునందుంచి ఆ గూడు చుట్టు తిరుగాడుతూ ఎక్కువ ఝాంకారం చేయును. ఆ కీటకం భయంతో ఎల్లప్పుడు ఆ ఝాంకారం చేయుచున్న భ్రమరము పైననే దృష్టిని నిలిపి, దానినే చింతించుట వలన కొంతకాలమునకు ఈ కీటకం తానే భ్రమరమగును. అటులనే శిష్యుడు నిరంతరం తన గురువుపై దృష్టిని నిలిపి ధ్యానించినచో తానే గురువైనట్లు, ఆత్మనే ద్యానించినచో ఆత్మ స్వరూపమై భాసిల్లుతారని తెలుసుకున్నాను.

13) ఏనుగు:
మగ ఏనుగు తన ఎదుట ఉంచబడిన బొమ్మ ఏనుగును చూసి కామోద్రకానికి లోనై, గడ్డి ఆకులు కొమ్మలతో కప్పిన గోతిలో పడి బంధింపబడుతుంది. ఆ రీతిలో స్త్రీ సంబంధ వ్యామోహ ప్రలోభాలకు బంధింపబడి పతనం కారాదని మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను.

14) లేడి:
మధుర సంగీతమునకు లేడీ పరవశమగును. వేటగాడు పొదలో దాక్కొని, శ్రావ్యంగా వాద్య సంగీతాన్ని వినిపించి దగ్గరకు వచ్చిన లేడిని వలపన్ని పట్టుకొనెను. అలాగే ప్రాపంచిక విషయముల చేత ఆకర్షింపబడి లౌకికమైన వాటికి హరిణమువలె చిక్కి విషయవలయంలో పట్టుబడకూడదని గ్రహించాను.

15) చేప:
జిహ్వేంద్రియానికి బానిసయైన చేప గాలానికి ఉన్న ఎరని మ్రింగాలని ప్రయత్నించి, తానే బలి అయిపోతుంది. దేహరక్షణ నిమిత్తం తగు ఆహారాన్ని స్వీకరించాలి తప్ప, జిహ్వ చాపల్యంతో చేపవలె రుచికరమైన ఆహారములకు ఆకర్షితులై అనర్ధాన్ని తెచ్చుకోక,  రుచులపట్ల అనాసక్తి వహించవలెనని తెలుసుకున్నాను.

16) తేనెటీగ:
(కొందరు తేనె సేకరించిన వ్యక్తి అని చెప్తారు)
తేనెటీగలు ఎంతో శ్రమించి తేనెను సేకరించి, ఆ తేనెను అనుభవించక ఒకచోట నిల్వచేస్తాయి. ఆ తేనెను తేనె సేకరించువాడు అపహరించి అనుభవిస్తాడు. అధికంగా ధనమును సంపాదించి అనుభవించక దాచుకొని పరులుపాలు చేయడం మంచిది కాదని గ్రహించాను. అలాగే తామరపువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగ రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధింపబడి మరణిస్తుంది. అలాగే యతి కూడా సుగంధ పదార్థాల పట్ల ఆసక్తుడై వాటిని సమర్పించే గృహస్థుని యింట చిక్కి పతితుడు కారాదని తెలుసుకున్నాను.

17) పింగళ అనే వేశ్య: 
పింగళ అనే వేశ్య ధనవంతులగు విటులకై గుమ్మం వద్ద అర్ధరాత్రి వరకు వేచియుండి,  ఎవరూ రాకపోవడంతో మోహం వీడి ఇంటిలోనికి పోయి స్వీయ పరిశీలన చేసుకొని, ఆనందమయుడైన ఆత్మారాముని వదిలి బుద్ధిహీనురాలినై మోహముకు లోనై తప్పు చేస్తున్నానని గ్రహించి, ఇక నుండి భగవంతుని ధ్యానములో తరించాలని తలచి, సర్వం త్యజించి పరమాత్మ పైన మనస్సు లగ్నం చేసి ముక్తురాలైంది . క్షణికమైన ఇంద్రియ సుఖంలకై దాసులై పరితపించుటకంటే  అంతర్యానం చేసి ఆత్మానందం పొందుట అసలైన సుఖమని గ్రహించాను.

18) లకుముకి పిట్ట :
(కొందరు గ్రద్ద అంటారు)
ఒక చేప/ మాంసపు ముక్కను నోటకరచుకొని పోవుచుండగా, ఇతర పక్షులు కొన్ని ఆ మాంసపు ముక్క కొరకు వెంబడించి పొడుస్తుంటే, ఆ బాధ భరించలేక ఆ మాంసపు ముక్కను జారవిడిచి ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది. అంతవరకు వెంబడించిన పక్షులు ఆ మాంసపు ముక్క పడినవైపు పోయినవి. త్యాగం పరమ సుఖం నిచ్చును. పామరు లాశించు లౌకిక సుఖాలు ఆశించుట దుఃఖహేతువని, వాటిని త్యజించుటయే శాంతికి మార్గమని తెలుసుకున్నాను.

19) బాలుడు -
చిన్న పిల్లలకు మానాభిమానములు ఉండవు. నిందాస్తుతులు వారికి సమానమే. చింతలుండవు. ఆడుతూ పాడుతూ ఆనందంగా నుందురు. అదే విధంగా యోగి చింతలు, మానాభిమానములు విడిచి, అన్నిటికీ అతీతుడై ఆత్మానందంలో నుండవలెనని తెలుసుకున్నాను.

20) కన్య -
ఒక యుక్త వయస్సు వచ్చిన కన్య యింటికి ఆమె  తల్లితండ్రులు ఇంటలేని సమయమున వివాహ నిమిత్తమై బంధువులు వచ్చిరి. వారి భోజనమునకు ఇంట బియ్యం లేనందున, ఆ కన్య వడ్లు దంచుట ప్రారంభించింది. ఆమె చేతిగాజుల సవ్వడి విని, ఈ ఇంట్లో వడ్లు దంచుటకు కూలీలను వినియోగించే శక్తి కూడా లేదని తెలుసుకొని, తమ పేదరికాన్ని గ్రహించి ఏం భావిస్తారోనని భయపడి ఒక్కొక్క గాజు మాత్రమే ఉంచుకొని మెల్లగా వడ్లు దంచింది. పలువురు ఒకచోట చేరితే ముచ్చట్లు కబుర్లు తప్పవని,  కావున ఆధ్యాత్మిక చింతనాపరులు ఒంటరిగా కూర్చుండి సాధన చేయవలెనని, జన సంసర్గం మంచిది కాదని తెలుసుకున్నాను.

21) శరాకారుడు -
బాణములను తయారుచేయు శరాకారుడు ప్రక్కన ఎవరున్నారు, ఏమి జరుగుతున్నది గమనించక ఏకాగ్రచిత్తముతో బాణం మొనలను పదును పెట్టడం చూసి, అలానే యోగి ఆత్మచింతన యందు ఏకాగ్రచిత్తుడై ఉండవలెనని తెలుసుకున్నాను.

22) పాము -
పాము తనకై ఇల్లు నిర్మించుకొనక, చీమలు/చెదలు నిర్మించుకున్న పుట్టలలోనే నివాసముంటుంది. యోగి కూడా తనకై గృహాదులు ఏర్పరుచుకొనక, ఇతరులు నిర్మించిన మఠాల యందు శిధిలాలయాలలోను జీవించాలని, అంతేగాక పాము తన జీవకృత్యాలను యే యితర జీవులకు తెలియనివ్వనట్లే, యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలని, సదా ఒకేచోట వుండక పాము తిరుగుతున్నట్లే, యోగి కూడా ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండక ఏకాంతంగా గడుపుచూ, పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు అంత్యకాలంలో తన దేహాన్ని నిశ్చింతగా విడువవలెనని తెలుసుకున్నాను.

23) సాలెపురుగు -
సాలెపురుగు తాను నిర్మించుకున్న సాలెగూటిలో తాను చిక్కి గతించిపోతుంది. అలానే మనిషి తన మనోభావాలనే విష వలయంలో చిక్కి నశించిపోతున్నాడు. యోగి ప్రాపంచిక విషయ వాసనలతో కూడిన మనస్సుకు చిక్కి పతనం కారాదని తెలుసుకున్నాను. అలాగే, సాలెపురుగు తన నోటి నుండి వెలువడే పదార్థమును దారములా మలిచి గూడును అల్లును. కొంత కాలానికి ఆ సాలెపురుగే ఆ గూడును పాడుచేసి మ్రింగివేయును. సాలీడు వలె పరబ్రహ్మ తన నుండియే జగత్తును సృష్టించును, తానే అంతయు లయింపజేయును. కనుక ఈ జగత్తంతా బ్రహ్మమయమని గుర్తించుకొనవలెనని తెలుసుకున్నాను.

24) తుమ్మెద:
తుమ్మెద ఒక పుష్పము నుండిగాక అనేక పుష్పాల నుండి మకరందమును గ్రహించు విధముగా యతి ఒకే ఇంటి నుండిగాక కొన్ని ఇళ్ళకు భిక్షకు వెళ్ళి గ్రహించినదానితో తృప్తి జెంది జీవించాలని గ్రహించాను. అలాగే తుమ్మెద వివిధ రంగులుగల పువ్వుల నుండి తేనె గ్రహించినట్లు సాధకుడు సకల శాస్త్రాల నుండి సారం గ్రహించాలని తెలుసుకున్నాను.

ఈ విధంగా దత్తులవారు తన గురువుల గురించి చెప్పి, మానవుడు తన దేహమే అత్యంత ప్రియమని భావిస్తూ, ధనమును ఆర్జిస్తూ, చివరికి తనువు చాలించును. ఎవరి కొరకైతే తాపత్రయ పడుతూ సంపాదిస్తాడో, వారే ఆ మృత దేహాన్ని కాల్చి బూడిద చేయుదురు. తిరిగి తాను ఆర్జించిన కర్మఫలముననుసరించి మరలా జన్మించును. కనుక శ్రేష్టుడైన వాడు సంసార మోహమందు పడక, ఈ మానవ దేహం పతనం కాకముందే సద్గతి పొందుటకు ప్రయత్నం చేయుటే ధ్యేయంగా యుండవలెనని తెలిపెను. 

దత్తుని రూపం - నామం 




ఈయన రూపం లోకంలో కనిపించే నాలుగు ఆశ్రమాలకూ అతీతమైనది.
తనది ఐదవ ఆశ్రమమని దత్తాత్రేయుడు పింగళనాగుడనే మునికి చెప్పెను. లోకంలో తన కన్నా వేరైనది ఇంకేది లేదనే సత్యాన్ని తెలిసిన వైరాగ్యవంతుడికి సంబంధించిన ఆశ్రమము ఈ ఐదవ ఆశ్రమము.
దత్తోపనిషత్తులో ఆయన ఈ ఆశ్రమంలోని వారు చరాచర జగత్తును తమ ఆత్మపరంగా సందర్శించి, త్రిగుణాతీతులుగా నిస్సంగులుగా ఉంటారనీ, వారికి ఎటువంటి కర్మ కలాపాలతో పనిలేదని తెలిపెను.

సకల ప్రాణులను తరింపచేయు మంత్రమేదైనా ఉన్నదా ప్రభూ అని శుకమహర్షి పరమేశ్వరుని అడిగినపుడు ఆ మహాదేవుడు చెప్పిన మాట "దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం".





తెలిసో తెలియకో మన పూర్వీకులు (ముందు తరాల వారు) సరిగ్గా సంప్రదాయకంగా పితృ కర్మలు చేయక పోవడం వలన, మరణించినవారి కర్మకాండలు సరిగ్గా నిర్వర్తించక పోవడం వలన పితృ దోషాలు సంక్రమిస్తాయి. పితృ శాప ఫలితంగా ఇంట్లో కలహాలు, వివాహ ఆటంకాలు, అనారోగ్యాలు, మనస్థాపం, కుటుంబ అభివృద్ధి లేకపోవడం, సంతానం లేకపోవడం... ఇత్యాది అనేక బాధాకర సమస్యలు ఉత్పన్నమౌతాయి. 
ఈ పితృ దోషం చిన్నగా ఉంటే - బిడ్డల వివాహం ఆలస్యం, గర్భస్రావం, కుటుంబ సభ్యులకు ఇ ఎన్ టి సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయని,
మధ్యమముగా ఉంటే - బుద్ధి మాంద్యం, విడాకులు, తీవ్ర కలహాలు, మనశ్శాంతి లేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని,
తీవ్రంగా ఉంటే - అగమ్యగోచర జీవితం, అకాల మరణాలు తదితరం ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. దీనికి ఏకైక సులభ పరిష్కార మార్గం దత్తుని పాదాలు పట్టుకోవడం. వీలైనంతవరకు దత్తుని నామస్మరణ చేస్తే, ఎంతటి పితృ దోషమైన తొలగిపోతుంది. 

దత్తుని అనుగ్రహం చేత ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. గ్రహబాధలు తొలగుతాయి. పితృ శాపం నుండి విముక్తి కలుగుతుంది. అన్నింటికి మించి జ్ఞానం లభిస్తుంది. ఇహ పరానికి దత్తోపసన ప్రధానం. దత్త నామ స్మరణ ఇంతటి దివ్యమైనది. 

అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః
స్మర్తృగామి స్వభక్తాన ముద్ధార్ధ భవసంకటాత్

ఆస్తికుడైనా, నాస్తికుడైనా దత్తా అని తలచినంత మాత్రముననే వారిని అనుగ్రహించుదురు అన్న మాట కొందరికి అసత్యంగా ఉండవచ్చు. ఎన్నిసార్లు పిలిచినా పలకడేం... అన్న పరిహాసం కొందరిది.
దత్తుని దర్శనమో, అనుగ్రహమో గుర్తించడానికి మహర్షులం కాకున్నా, నిర్మలమైన భక్తులమై యుండాలి. కానీ, సంశాయాత్ములైన తమలో భక్తి, నిర్మలత్వం, విశ్వాసం కొరవడినదన్న సత్యాన్ని గ్రహించరు. బహుశా కలి ప్రభావవేమో!
ఎవరు గ్రహించిన, గ్రహించకపోయినా మానవులను ఉద్ధరించుటకు తాను తన ధర్మరక్షణ కార్యమును నేటికీ కొనసాగించుచూ ఉన్నారన్నది యదార్థం. గుర్తించినా, గుర్తించకపోయినా తనని తలచిన వారికి ఏదో రూపేణా అనుగ్రహ ఫలితం అందుతుంది.
ఇక్కడ ఓ కథ చెప్పాలనిపిస్తుంది -
ఒకానొకప్పుడు ఓ రాజుగారికి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే కనిపించడేం? అన్న సందేహం వచ్చి, సమాధానం చెప్పమని సభాసదులను ప్రశ్నించగా, భక్తుడగు ఒక సేవకుడు నేను సమాధానం చెప్పెదనని, ఒక కడవ నిండా పాలు తెప్పించి, అదే పనిగా కలియబెడుతుండగా, కొంత సమయం వేచి చూసి అసహనంతో ఆ రాజు ఏం చేస్తున్నావు, భగవంతుడు ఎక్కడ అని అగ్రహించగా, కోపం వద్దు ప్రభూ, ఈ పాలులో నెయ్యి ఎక్కడ ఉందో వెతుకుతున్నాను అని సేవకుడు చెప్పెను. దానికి రాజు నవ్వి, ఓయీ! అజ్ఞాని! పాలు కాచాలి, తోడుపెట్టి పెరుగు అయ్యాక, చిలికి చిలికి వెన్న తీసి కాస్తే, అప్పుడు నెయ్యి కనిపిస్తుంది అని అనగా, ప్రభూ! ఇదే మీ సందేహానికి సమాధానం. నెయ్యి పాలంతటను వ్యాపించియున్నను, జలాంశముచే క్షీరం గలసి యున్నందువలన కనిపింపక యున్నట్లే, భగవంతుడు చరాచరమంతా నిండియున్నా మాయ అను ఆవరణమువలన కనిపించడం లేదని, చిలికి చిలికి నెయ్యిని కాంచినట్లే, హృదయమందు ఆత్మానాత్మమధనము చేయువారికి భగవానుడు కనిపించునని చెప్పెను. 
ఇది అర్థమైన వారికి అర్థమైనంత🙏

ఏ చోట చదివానో, ఏ నోట విన్నానో గానీ...మనస్సు పట్టిన నాలుగు మాటలు -

ఎక్కడ దత్త దత్త దత్త అని స్మరించబడుతోందో,
ఎక్కడ దత్త నామసంకీర్తన జరుగుతోందో, 
ఎక్కడ దత్త నామము భజింపబడుతోందో
అటువంటి ఇల్లు, సిధ్ధుల ఆశ్రమం.
అక్కడ సకల దేవీదేవతలు  కొలువై ఉంటారు.

ఎవరి హృదయం నిరంతరం దత్త దత్త దత్త అని స్పందిస్తుందో, అట్టి హృదయమే మాలాపురం. (మాలాపురం దత్తుని ఆవిర్భవ స్థానం)

ఎవరి మనసు "అనసూయ"
ఎవరి బుధ్ధి "అత్రి" అవుతుందో,
వారి హృదయంలోకి దత్తమై వచ్చేవాడే దత్తుడు.

దత్తుని వైభవం అనంతం. నాకు తెలిసింది అణుమాత్రం.

              🙏శ్రీ దత్త శరణం మమ🙏




28, జూన్ 2023, బుధవారం

శ్రీ దత్తాత్రేయ వైభవం - అనుగ్రహ లీలలు

 



 అత్రి అనసూయల చరితం 
 శ్రీ దత్తాత్రేయుని జననం 

అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవం
దిగంబరం మహాతేజం దత్తమానందమాశ్రయే

అత్రి అనసూయల అఖండ తపఃశక్తిని, పాతివ్రత్యశక్తిని త్రిమూర్తులు మెచ్చి, 

"ఆత్మానా స్వయం దత్తః ఇతి దత్తాత్రేయః"

త్రిమూర్తులు ఏక స్వరూపంలో శ్రీ దత్తుడిగా దత్తమయ్యారు. 

అత్రి అనసూయల పుత్రుడు కావున ఆత్రేయుడై, దత్తాత్రేయుడుగా కొనియాడబడుతున్నాడు.

సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులు ఒక్కటైతే, అది పరబ్రహ్మ స్వరూపమౌతుంది. దత్తునిది షోడశ కళాపరిపూర్ణుడయిన పరబ్రహ్మతత్వం.

పై విషయాలు క్రిందటి టపాలో స్మరించుకోవడమైంది.

గురుదేవ దత్త

శ్రీమద్భాగవతం పేర్కొన్న ఏకవింశతి (21) అవతారములలో దత్తావతారం ఆరవది.

అన్ని అవతారములు తమకు నిర్దేశించిన కార్యమును పూర్తి చేసుకొని నిష్క్రమిస్తే, ఒక్క దత్తావతారం మాత్రం నేటికీ విరాజిల్లుతున్నది.

అవతారములన్నింటిలో గురుదేవ అని దత్తాత్రేయుని మాత్రమే పిలుస్తాం. శ్రీ దత్తుడు గురువు దైవము కూడా. అందుకే ఆయనను గురుదేవ దత్త అని వ్యవహరిస్తారు.




ఈ శ్లోకము పరిపూర్ణముగా దత్తునికే వర్తిస్తుంది.

బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగవిద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు దత్తాత్రేయుడు. 

బ్రహ్మకు ఆవరించిన మాయను తొలగించి, వేదాలను స్ఫురణకు తెచ్చిన పరబ్రహ్మం "దత్తాత్రేయుడు".
వశిష్టులవార్కి  యోగవిద్యను ప్రబోధించిన గురుదేవులు "దత్తాత్రేయుడు".
పరశురాముడికి  శ్రీవిద్యను ప్రసాదించిన పరమాత్ముడు "దత్తాత్రేయుడు".
కార్తవీర్యర్జునుని అనుగ్రహించి ఆత్మవిద్యను తెలిపిన భక్తవత్సలుడు "దత్తాత్రేయుడు".
యదువుకు  జ్ఞానబోధను,  ప్రహ్లాదునికి ఆత్మానంద బోధను, అలర్కునకు ఆత్మజ్ఞానాన్ని, పింగళనాగునకు జ్ఞానయోగసిధ్ధిని.....ఇలా ఎందరినో అనుగ్రహించి తరింపజేసిన మహిమాన్వితుడు "దత్తాత్రేయుడు".

స్మర్తుగామి

"స్మరణమాత్ర సంతుష్టాయ దత్తాత్రేయాయ నమః"

దత్తస్తుస్మరణ ప్రియః అని పురాణ వచనం. స్మరణ మాత్రం చేతనే ప్రీతుడౌతాడు. 

దలాదనుడు అనే మహర్షి, స్మరించినంత మాత్రముననే ప్రత్యక్షమగునందురే, ఒకపరి దత్తుని పరీక్షించాలని, 'దత్త దత్త' అని పిలిచాడట. వెంటనే దత్తుడు ప్రత్యక్షమై ఏం కావలెను అని అడుగగా, పరీక్షించదలచి పిలిచితిని, మన్నింపమని మనవి చేయగా, 
"మమ ప్రకృతిరీదృశీ, స్మర్తుగామీ  సందేహూ, ద్విసప్త భువనేష్వహం" అని దలాదన మహర్షికి చెబుతూ, ఇది నా ప్రకృతి. భక్తి ఉన్నా, లేకున్నా నన్ను ఒక్కసారి పిలిస్తే, ఈ పదునాల్గు భువనములలో ఎక్కడ ఉన్నా వారి ముందు ప్రత్యక్షమై వారి కష్టాలు తీరుస్తాను అని, మహర్షికి దత్తాత్రేయస్వామి వజ్ర కవచం తెలిపెను.

ఆధ్మాత్మికతత్వాన్ని గ్రహించాలనుకునే జ్ఞానసాధకులకైనా, భక్తియోగాన్ని అనుసరించే భక్త జనావళికైనా, సంసారంలో ఉంటూనే కర్మయోగంతో మోక్షాన్ని సాధించాలనుకునే కర్మయోగులకైనా, అంతర్యామి దర్శనముకై అంతర్యానం చేస్తున్న ధ్యానులకైన.....
ఇహపర తృప్తిని అందించగల దైవం దత్తాత్రేయుడు. 

శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ లీలలు

కృతయుగములో బ్రహ్మ సృష్టి చేసెను. వారెల్లరు తపస్సులు జ్ఞాన విశారదులైరి. అందరూ పరమాత్మ ధ్యానంలో యుండుట వలన సృష్టి జరుగుట లేదు. ప్రజలలో అనురాగ విద్వేషాలు లేవు. ప్రాణిజాలమునకు సంసార సుముఖత కలిగించుటకు అవిద్య లేక మాయను సృష్టించుటకు బ్రహ్మ తీవ్రంగా ఆలోచిస్తూ, ఆ క్రమంలో తీవ్ర ఒత్తిడి నొంది, తాను సృష్టించిన అవిద్య వలన స్మృతిని కోల్పోయి, వేదములను మరచిపోవుట వలన రేణుకాదేవిని ఆరాధించగా, ఆమె ప్రత్యక్షమై, దత్తాత్రేయుని ఆశీస్సులు పొందమని చెప్పి, సహ్యాద్రిపై ఉన్న దత్తాత్రేయుని చూపించగా, 




బ్రహ్మ అనఘాదేవి సమేత దత్తాత్రేయుని  దర్శించి, అన్నింటినీ మరిచానని, పూర్వ స్మృతిని ప్రసాదించమని కోరగా, రేణుకాదేవియే వేదమాత, ఆహ్లాదిని, జ్ఞానయోగి, గాయత్రి... అని తెలిపి, నీవు విస్మరించినదంతయు స్ఫురణకు వచ్చునని దత్త ప్రభువు చెప్పెను. అంతట అనఘాదేవి నుండి వేదములు రేణుకాదేవిని చేరినవి. పిమ్మట రేణుకాదేవిని, అనఘాదేవిని బ్రహ్మ ప్రార్థించగా, మరిచిన వేదములు, గాయత్రీ మంత్రం స్ఫురణకు వచ్చెను. ఈ విధంగా బ్రహ్మకు దత్త ప్రభువు గురువై భాసిల్లెను.

దత్తాత్రేయ స్వామి తనని దర్శించగోరువారిని అనేక విధాలుగా పరీక్షించేవారు. భయబ్రాంతులు గొలిపెడివారు. బాలోన్మత్త పిశాచ రూపములలో సంచరించేవారు. అంగనతో కూడి యుండి మద్యం సేవిస్తున్నట్లు కన్పించి, తన దరి చేరేవారిని పరీక్షించేవారు.
ఒకపరి దత్తాత్రేయ స్వామి ఏకాంత నిష్టలో తపస్సు చేయుటకై వెళ్ళుచుండగా, ముని కుమారులు వారి వెంటపడగా, దత్త ప్రభువు ఒక మడుగులో దిగి అదృశ్యుడయ్యెను. ముని కుమారులు చాలాకాలం ఆ మడుగు వద్దే వేచియుండిరి. దత్తుడు వందేళ్లు తర్వాత వారిని పరీక్షించుటకై, ఒక అంగనతో కలసి నీటి నుండి బయటకు వచ్చి, ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకొనగా, అది చూసి కూడా ముని కుమారులు కదలలేదు. అప్పుడు దత్తుడు మద్యం సేవిస్తూ, ఆమెతో సరసములాడుచు కొంత అసభ్యంగా ప్రవర్తించడంతో, కొందరు మునికుమారులు ఇతను దురాచారపరుడు, స్త్రీలోలుడు అని భావించి, దత్తుని విడిచి వెడలిరి. ఇది దత్తలీల అని గ్రహించి నిలిచిన వారికి తన నిజ స్వరూపం చూపించి అనుగ్రహించారు.

శ్రీ దత్తుని రూపం -




మాలా కమండలు ధరః కర పద్మ యుగ్మే 
మధ్యస్థ పాణి యుగళే ఢమరు త్రిశూలే
యన్యస్త ఊర్ధ్వకరయో శుభ శంఖ చక్రే 
వందే తమత్రి వరదం భుజషట్కయుక్తం

బ్రహ్మ సంకేతం -
క్రింద చేతులలో అక్షరమాల, కమండలం. తపో జ్ఞాన మార్గాలకు గుర్తు. 
విష్ణు సంకేతం -
పై చేతులలో శంఖం, చక్రం. 
శివ సంకేతం -
మధ్య చేతులలో త్రిశూలం, ఢమరుకం 

శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం -

శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. 

మూడు శిరస్సులు :
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ ల త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.

నాలుగు కుక్కలు :
నాలుగు వేదములకు సంకేతం.

ఆవు :
సమస్త భూమండలానికి సంకేతం. వేద స్వరూపం. జ్ఞానానికి గుర్తు.

మాల :
అక్షరమాల, సర్వమంత్రమయము, సర్వ వ్యవహారములకు మూలము.

త్రిశూలము :
ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల త్రిపుటి.

శంఖం :
నాదం. 

చక్రము :
అవిద్యా నాశకము, ఆత్మావలోకన సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.

ఢమరుకం :
సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.

కమండలము :
కర్మఫలదాయకం. కష్టాలను తప్పించునది. శుభములను నొసగునది.




ఒకానొకసారి నైమిశారణ్యములో యతులు నారాయణుని ధ్యానించుచుండగా, త్రిమూర్త్యాత్మకముగా శంఖము చక్రము గద పద్మము ఢమరుకం జపమాల మొదలగు ఆయుధములు ధరించి సర్వము తనలో చూపు దత్త భగవానుని విశ్వరూపమును దర్శించి, మహానుభావా! త్రిమూర్తి స్వరూపా! దేవాధిదేవా! దత్తా! దత్తా! అని జపించుచుండగా, దత్త ప్రభువు అదృశ్యమైరి. అంతవరకు ముండ్ల పొదలు, క్రూరమృగాల మయమై యున్న ఆ అరణ్యమంతా పూలు పండ్లతోటలతో ఫలభరితమై పక్షుల కిల కిలా రావములతో మార్పు చెందడంతో, ఇదంతా దత్త భగవానుని అనుగ్రహం అని గ్రహించి అందరూ, దత్తా! గురుదత్తా! అని కీర్తించిరి.

త్రేతాయుగ ప్రారంభమున - మహిష్మతీపురమును హైహయ వంశస్తుడైన కృతవీర్యుడను రాజు పరిపాలిస్తుండెను. అతని భార్య శీలధారాదేవి. వారికి కలిగిన సంతానం పుట్టిన వెంటనే చనిపోవుచుండిరి. వంశోద్దరణ పుత్రులకై ఎన్నో నోములు, యాగములు చేస్తుండిరి. ఒకసారి శీలధారాదేవి యాజ్ఞవల్కుని ఆశ్రమము మీదుగా వెళ్ళుచు, మహర్షి సతీమణియగు మైత్రేయిని దర్శించి, తన బాధ చెప్పుకొనగా, ఆమె సూచన మేరకు భర్తతో కలిసి అనంతవ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. బృహస్పతి ఆదేశానుసారం కృతవీర్యుడు సూర్యోపాసన కూడా చేసెను. వారికి చొట్ట చేతుల పుత్ర సంతతి కలిగెను. ఆ బాలునికి అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుని కుమారుడు అగుట వలన కార్తవీరార్జునుడని పిలవసాగిరి. కొంతకాలమునకు మహారాజు మరణించడం, బుద్ధి కుశలత కలవాడైన, హస్తవైకల్యం వలన రాజ్యపాలన చేయలేనని, రాజుకు భుజబలం ఉండవలెనని, తాను తపస్సు చేసి శక్తులను సంపాదించిన తర్వాత వచ్చి, రాజ్యపాలన చేస్తానని కార్తవీరార్జునుడు అనగా, అయితే నీవు దత్తాత్రేయుని ఆశ్రయించు, వారు అనేక రీతుల్లో పరీక్షించెదరు కాబట్టి, జాగ్రత్తగా మెలగమని గర్గమహర్షి చెప్తూ, జంభాసుర వధ తెలిపెను.
జంభాసుర వధ - 
పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి, అనేక వరములు పొంది, స్వర్గంపై దాడి చేయగా, దేవేంద్రుడు ఎదుర్కోలేక, దేవగురువైన బృహస్పతిని వేడుకోగా, ఈ రాక్షసుడు అజేయమైన బలం కలవాడగుట వలన సహ్యాద్రి పర్వతం పైనున్న దత్తాత్రేయుని ఆశ్రయించమని, ఆయన అనేక పరీక్షలు పెట్టుదురని, వారి అనుగ్రహం పొందమని దేవ గురువు చెప్పెను.

గందర్వాంగనలు చుట్టూ నృత్య మొనర్చుచుచుండగా, మధుపానమును సేవిస్తూ మత్తుడై ఉన్న దత్తుని, దేవేంద్రుడు దర్శించి ప్రార్థించి, జంభాసురుడు తమపై దండెత్తి తమను జయించిన విషయమంతయూ చెప్పి, స్వర్గంపై ఆధిపత్యం తనకు తిరిగి వచ్చునట్లు చేయమని కోరగా, మగువ మధ్యములతో మునిగియున్న వానిని, నన్ను వదిలి వేరెవరినైనా చూసుకొనమని దత్తుడనగా, దత్తుని పాదములు పట్టుకొని, మీరు అభయమియ్యనిదే ఈ పాదములు విడవనని మొరపెట్టుకుంటున్న దేవేంద్రుని పరిపూర్ణ విశ్వాసమును గమనించి అనుగ్రహించి, జంభాసురుని అతని పరివారమును ఇక్కడకు వచ్చునట్లు చేయుమని చెప్పెను. దేవేంద్రుడు ఆ రాక్షసునితో తిరిగి యుద్ధం చేయుచూ, సహ్యాద్రి వరకు తీసుకురాగా, జంభాసురుడు దత్త ప్రభువు అంకమందున్న అనఘాదేవి అందచందాలకు మైమరచి, ఆమెను పొందగోరి ఆమెను బలవంతంగా పల్లకిపై కూర్చుండబెట్టి బోయిలై మోయగా, దత్తాత్రేయుడు చిరునవ్వుతో ఇంద్రా! లక్ష్మి వీరి నెత్తిపైకెక్కినది, ఇక ఆమె వారిని విడుచును, వారి బలం క్షీణించి ఐశ్వర్యం తొలగను. ఇదే సమయం...రాక్షసులను చంపుము అని చెప్పగా, జంభాసురునితో సహా రాక్షసులందరూ దేవతుల చేతుల్లో మృతులైరి. లక్ష్మి పల్లకి నుండి అదృశ్యమై, దత్తస్వామిని చేరెను. అనఘాదేవియే లక్ష్మీదేవియనియు, లక్ష్మీ - పాదముల యందుండిన విలువగల భవనములు ఏర్పడుననియు, మోకాళ్ళ యందుండిన ఐశ్వర్యం కలుగుననియు, వక్షస్థలము నందుండిన సర్వ విధములైన కోరికలు తీరుననియు, శిరముపై యుండిన వానిని ఒంటరివానినిగా విగత జీవునిగా చేసి విడిచివెళ్ళునని, అందువలనే జంభాసురుని శిరముపై ఎక్కి అతనిని నాశనం చేసినదని, మద్యం మగువను చూపుట తన లీలయని దేవేంద్రునికి దత్తాత్రేయులు చెప్పిరి. 
దేవేంద్రుడు తిరిగి స్వర్గాదిపత్యమును పొందిన ఈ కధనమును విన్న కార్తవీరార్జునుడు, దత్తాత్రేయుని ఆశ్రమముకు వెళ్ళి, అపార భక్తి శ్రద్ధలతో దత్తుని సేవించెను. కఠోర పరీక్షలకు నిలబడి స్వామి అనుగ్రహంకు పాత్రుడయ్యను. ఒక సమయమున దత్తుని నుండి వెలువడిన అగ్నిచే కార్తవీరార్జునుని చేతులు భస్మమయ్యను. 'రాకుమారా! ఉన్న చేతులు కూడా ఊడిపోయినవి. మదిరను త్రాగుచూ, మగువలతో ఆటలాడు నేను నీకు సహాయం చేయజాలను. నీవు పొమ్ము' అని దత్తప్రభువు అన్నను, గర్గముని చెప్పింది గుర్తుంచుకొని, దత్తాత్రేయుని వదలక సేవించడంతో, దత్తుడు ప్రసన్నమై, 'ఏమి నీ కోరిక' అని అడిగెను. అంతట కార్తవీరార్జునుడు ప్రభూ! నాకు వేయి చేతులు కావలెను. భూమి నీరు గాలి యందు సంచరించగలవాడనై, ఎచ్చటికైనను నేను తలచినంతనే పోగలగాలి. సర్వదా నా దగ్గర ధనరాసులుండాలి. యుద్ధములయందు అజేయుడనై యుండాలి. నా రాజ్యంలో సుఖశాంతులుండాలి. ఎంతటి శక్తి కలవాడైనా నేను శిక్షించే శక్తి నాకుండవలెను. సదా నీ భక్తుడనై యుండవలెను. ఎన్నడైనను నేను సన్మార్గం తప్పినచో సత్పురుషులు నాకు దారి చూపవలెను. నాకంటే గొప్పవాడైన నరుడే నన్ను వధింపవలెనని కోరెను. కార్తవీరార్జునుడు కోరిన వరములన్నియు అనుగ్రహిస్తూ, భూమి ఆకాశములయందు సంచరించుటకు ఒక విమానం కూడా దత్తప్రభువు ప్రసాదించగా, కార్తవీరార్జునుడు స్వామికి నమస్కరించి, మహిష్మతీపురం తిరిగి వచ్చి, రాజ్యాన్ని చేపట్టి, మంచి కీర్తి ప్రతిష్ఠలను సంపాదించెను.

అహం ఎటువంటి స్థితిని కల్పిస్తోందో 
కార్తవీరార్జునుడు జన్మ వృత్తాంతము పరిశీలిస్తే అర్థమవుతుంది  - 
సుదర్శన చక్రముకు, తాను విష్ణు భగవానుని ఆయుధమునని, ఎందరో రాక్షసుల సంహారం తానే చేశాననే గర్వం, తాను అధికుడనని అహం ఉండడం గమనించిన విష్ణు భగవాన్ సుదర్శన చక్రమును అంగవైకల్యం కలవాడవై భూలోకమున జన్మించమని శపించెను. అలా శాపముచే జన్మించిన కార్తవీరార్జునుడు దత్తత్రేయస్వామి అనుగ్రహంతో సహస్ర బాహువులు పొంది రాజ్యాధిపత్యం వహించెను. దత్తాత్రేయుడు ప్రసాదించిన విమానంపై లోకములన్నియు సంచరిస్తూ, పదునాలుగు భువనములలో సాటిలేని మేటి చక్రవర్తిననే అహంకారముతో ఋషులను దేవతలను తృణీకరించగా, వాయుదేవుడు మందలించగా, తన తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపం పొందెను. అలా కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసాక, ఈ భోగభాగ్యాలకు విసుగుచెంది, తిరిగి దత్తాత్రేయుని ఆశ్రయించెను. 

భక్తి జ్ఞాన వైరాగ్య విజ్ఞాన సహితమగు ఆత్మజ్ఞానమును ఉపదేశింపమని ప్రార్థించి,  దత్త స్వామి చెప్పిన కొన్ని కథల ద్వారా జ్ఞానం పొంది, ముముక్షత్వమును గురించి తెలుసుకొనెను. అలా తెలుసుకున్న విషయములు స్థిరంగా మనస్సునందు నిలిచేటట్లు, ధ్యానం చక్కగా కుదిరేటట్లు అనుగ్రహించమని వేడుకోగా, దత్తుడు కార్తవీర్యునితో "మాయ దాటుటకు నీవు చేయు కర్మలు నాకు అర్పణ చేయు, అట్లు చేసినచో నీ చిత్తము ఏకాగ్రత పొందును" అని చెప్పి, ఆత్మ సాక్షాత్కారం, సమాధి స్థితి కలిగింపతలచి, ఒక గుహలోనికి తీసుకొని వెళ్ళి, నిటారుగా స్థిరంగా కూర్చుండబెట్టి, "నీ గురువుకు నమస్కరించి, నీకు తెలిపిన ఆత్మతత్త్వమును మననం చేయు" అని చెప్పి, కార్తవీర్యుని శిరంపై తన చేయి వుంచి ఆశీర్వదించెను. 




దత్తుని కృపచే సమాధిస్థితి త్వరగా కలిగి, ఏడాది పాటు ఆ స్థితిలోనే ఉండి, క్రమేణా బాహ్యస్మృతి పొంది, కొంతకాలం పాటు ఆ ఆశ్రమము యందుండి, మరల మరోసారి సమాధి స్థితి అనుభవమును పొందిన పిమ్మట గురుదేవుని అనుమతితో, తిరిగి రాజ్యానికి వచ్చెను. 

ఇలా కొన్నేళ్ల కాలం కార్తవీరార్జునుడు పాలన సాగేక, ఒకరోజు మధ్యాహ్నపూట అతిథి పూజకై ఎదురు చూస్తున్న తరుణంలో అగ్నిదేవుడు చిత్రభానుడను పేరుతో వచ్చి, రాజా! ఆకలిబాధతో ఉన్నాను. నాకు భిక్ష పెట్టి క్షుద్బాధ తీర్చమని కోరగా, మీకు కావల్సినంత ఏదైనా తీసుకొనమని అనుజ్ఞ ఇవ్వగా, చిత్రభానుడు తన నిజరూపమైన అగ్నిరూపుడై పల్లెలు పట్టణాలు అడవులు దహింపసాగెను. ప్రజలు ప్రాణ భయంతో హాహాకారములు చేస్తున్నా, చూసీ చూడనట్లు మిన్నకుండెను. సరయూ నదీతీరంలో ధ్యాననిష్టలో యున్న వశిష్ట మహర్షికి ప్రజల ఆక్రందనలు వినిపించి, ప్రజాక్షేమం మరిచిన కార్తవీరార్జునుడును పరశురాముడు చేతిలోని గండ్రగొడ్డలిచే మరణించుగాక అని శాపమివ్వగా, మహర్షికి నమస్కారము చేసి, ఒకప్పుడు దత్తుని 
నాకన్నా పరాక్రమవంతుని చేతిలో మరణం కలుగునట్లు కోరితిని. ఇప్పుడు తమ శాపం దానికి తగియున్నది అని, దత్తుని స్మరించుకొనెను. 

ఆ పిమ్మట ఒకానొక రోజు కార్తవీరార్జునుడు  సామంతరాజును జయించి విజయవంతంగా వచ్చుచూ, దారిలో జమదగ్నిముని ఆశ్రమము చూసి, ఆశీర్వాదము పొందుటకు ఆశ్రమము లోనికి వెళ్ళి, మునికి ప్రణమిల్లగా, ముని ఆతిథ్యం స్వీకరించమని కోరెను. కామధేనువు సురభి, రాజుకు వారి పరివారమునకు తృటిలో సమస్త ఆహార పదార్థములతో విందు సమకూర్చగా, ఆ ఆవును తనకిమ్మని మునిని కోరెను. ముని అంగీకరించకపోవడంతో సైనికులచే బంధించి బలవంతంగా కామధేనువును తన నగరానికి తోడ్కొని వెళ్ళెను. ముని చిన్న కుమారుడు పరశురాముడు ఆశ్రమముకు వచ్చి, జరిగింది తెలుసుకొని, రాజును, సైన్యాన్ని సంహరించెను. ఈ విధంగా కార్తవీరార్జునుడు పరశురాముడి చేతిలో కైవల్యం పొందెను.

కార్తవీర్యార్జునుని పుత్రులు తమ తండ్రి మరణమునకు జమదగ్ని మునియే కారణమని జమదగ్ని ఆశ్రమానికి వచ్చి, ఆశ్రమమును ధ్వంసం చేసి జమదగ్ని శిరమును ఖండించిరి. జమదగ్ని భార్య రేణుకాదేవి దుఃఖితురాలై రామా, రామా... అంటూ పరశురాముడిని పిలుస్తూ మూర్చిల్లింది. తల్లి పిలుపు విన్న పరశురాముడు పరుగున వచ్చి, క్రోధావేశమున మహిష్మతీపురం వెళ్ళి, కనిపించిన క్షత్రియులనెల్లా సంహరించి, తిరిగి ఆశ్రమముకు వచ్చెను. అతనిని తల్లి రేణుకాదేవి శాంతపరచి, తండ్రి అంత్యక్రియలకు ఏర్పాటు చేయమని చెప్పి, ఒక కావడిని తెచ్చి అందు ఒక వైపు తండ్రి శవమును, రెండవ వైపు తనను ఉంచి తీసుకొని వెళ్ళమని, అట్లు వెళ్ళుచుండగా ఎచట ఆకాశవాణి 'తిష్ఠ తిష్ఠ' అని పలుకునో, అచట దహన సంస్కారాలు చేయమని కోరింది. తల్లి చెప్పిన ప్రకారం పరశురాముడు వారిని కావడిలో ఉంచుకొని పల్లెలు పట్టణాలు దాటుతూ సహ్యాద్రి వద్ద అమలకి అను గ్రామమున దత్తాత్రేయ ఆశ్రమము దగ్గరకు రాగా, తిష్ఠ తిష్ఠ అని ఆకాశవాణి పలుకుట విని అక్కడ కావడిని దించెను. పరశురామా! దత్తాత్రేయుని దర్శించి, దహన క్రియలకు సహాయపడవలసినదిగా ప్రార్థించమని రేణుకాదేవి చెప్పగా - 
దిగంబరుడై మద్యం సేవిస్తూ, అంగనలతో నాట్యమాడుచుండు దత్తుని దర్శించి నమస్కరించి, మా అమ్మ రేణుకాదేవి మీకై వేచి యున్నదని చెప్పగా, దత్త ప్రభువు నిజరూపధారై రేణుకాదేవి వద్దకు వచ్చి, ఆమెను స్తుతించి, జమదగ్ని నిర్జీవ దేహమునకు వందనం చేసెను. దత్తుని ఆదేశముతో పుణ్యనదీ తీర్థములను పరశురాముడు సహ్యాద్రి యందే ఉండి తెప్పించి, స్నానం చేసి తండ్రి శవమునకు దహన సంస్కారాలు చేసి చితిని వెలిగించెను. రేణుకాదేవి భర్త చితిలో తాను సహగమనం చేసెను. దత్త ప్రభువు పరశురామునిచే అతని మాతాపితరులకు అన్ని కర్మలు శాస్త్ర ప్రకారము నిర్వహింపజేసి, ఆకాశమున దివ్యకాంతులతో విహరించుచున్న పితృదేవతలను పరశురామునకు  చూపెను. 




పరశురాముడు ఇరువది ఒక్కమారు భూ ప్రదక్షణ చేసి క్షత్రియులందరిని సంహరించాక, ఆవేశం తగ్గి ఆశ్రమముకు వచ్చి దత్తాత్రేయుని దర్శించి నమస్కరించెను. పరశురాముని తల్లితండ్రులు దర్శనమిచ్చి, ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు అభినందించి, పాప పరిహారమునకు యజ్ఞం చేయమని చెప్పి, పుత్రుని ఆశీర్వదించి అంతర్ధానమైరి. పరశురాముడు దత్తస్వామి దగ్గరే ఉండిపోగా, సంతోషించిన గురుదేవ దత్తుడు వినిన మాత్రముననే మోక్షమొసంగడి "త్రిపుర రహస్య జ్ఞాన ఖండసారము"ను బోధించెను.

నహుషుడి పుత్రుడు యయాతి మహారాజుకు శుక్రచార్యుని శాపము వలన వార్ధక్యం రాగా, ఆ వార్ధక్యాన్ని కనిష్ఠపుత్రుడు పూరుని సమ్మతంతో తనకి ఇచ్చి, పూరుని యవ్వనం తాను స్వీకరించి, రాజ్యపాలన చాలాకాలం చేసిన పిదప, ఒకనాడు తన వార్థక్యం తాను తీసుకొని రాజ్యాధికారం పెద్దకుమారుడు యదువుకు కాక, చిన్నకుమారుడు పూరునకు ఇవ్వడంతో యదువు అవమానితుడై, రాజ్యం వదిలి అరణ్యముకు పోయెను. ఆ నిర్జనారణ్యములో నేలపై దుమ్మూధూళిలో పరుండి బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్న దత్తుని దర్శించి, వినయంగా ఇలా ప్రశ్నిస్తారు - మహాత్మా! మీముఖంలో కోటి సూర్యుల వెలుగు కనబడుతుంది, ఇంద్రియ అలజడి కనబడడం లేదు, తృప్తిగా వున్నారు, ఆహార సముపార్జన కోరిక లేదు, మానవులు సాధారణముగా సుఖభోగాలు, అధికారం, ధనం, కీర్తి... ఇలాంటి ఎన్నోవాటికై ఆసక్తులై ఉంటారు. కానీ; మీరు అనాసక్తులై ఒంటరిగా ఈ కారడవిలో మహదానందమును ఎలా సొంతం చేసుకోగలిగారు? ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ గురువు ఎవరు? అని ప్రశ్నించగా -
దానికి దత్తాత్రేయులవారు "నా ఆత్మయే నా గురువు. ఆపై నేను ఈ పరమానందస్థితిలో జీవించడమెలాగో ఇరవై నలుగురు గురువుల నుండి నేర్చుకున్నా"నని బదులివ్వగా, వారెవరో తెలియజేయమని యదురాజు కోరగా, దత్తాత్రేయులవారు వివరిస్తున్నారిలా -

ఇరవై నలుగురు గురువుల గురించి తదుపరి టపాలో -