14, జనవరి 2024, ఆదివారం

కాదేదీ కబర్లకనర్హం.....

కొన్ని నెలల క్రితం మిత్రురాలు రుక్మిణి జీ (రుక్మిణీదేవి | భారతీయం బ్లాగర్) వాట్సప్ లో పంపిన ఈ క్రింద వీడియో నచ్చి, మరి కొందరు స్నేహితులకు ఫార్వర్డ్ చేసాను.



{तूने जो कमाया है दूसरा ही खायेगा
खाली हाथ आया था खाली हाथ जाएगा
जब तलक ये सांसे हैं तब तलक ये रिश्ता है
सांस जिस घड़ी टूटी तो रिश्ता टूट जायेगा
जीते जी तू माया में राम नाम को भुला
मौत का समय आया तो राम याद आएगा

మీరు సంపాదించినది ఇతరులు తింటారు లేదా  అనుభవించుతారు
ఖాళీ చేతితో వచ్చావు ఖాళీ చేతితో పోతావు
ఈ శ్వాస ఉన్నంత కాలం ఈ సంబంధ అనుబంధాలు ఉంటాయి 
శ్వాస విడిపోయిన  మరు క్షణం సంబంధ అనుబంధాలు విచ్చిన్నమవుతాయి
జీవించి ఉండగా మీరు మాయలో పడి రాముని నామమును మరచి పోతారు
మరణ సమయం వస్తే ఆ రామ నామం  గుర్తు వస్తుంది}

ఈ వీడియో చూసి ఇది సత్యం అని కొందరు, నైస్ వీడియో అని కొందరు బదులివ్వగా, కొన్ని కొన్ని తరచి చూసి చర్చించే సత్సంగ మిత్రులు ఎప్పటిలా చర్చకు తెర తీసారు. 

మిత్రురాలు శారద మాట్లాడుతూ -
భౌతికంగా ఖాళీ చేతులతో రావడం, పోవడం కన్పిస్తుంది గానీ, పాప పుణ్య కర్మ మూటలు మరణించినప్పుడు తీసుకొని వెళ్తాం, అవి అనుభవించడానికి మరల పుడతాం. 


కర్మలు చేయకుండా ఉండలేం, కర్మ ఫలితాలు అనుభవించకుండా తప్పించుకోలేం. ఈ కర్మ వలయాన్ని భేదించుట అంత సులువు కాదు. అలానే మరణ సమయంలో భగవంతుని నామం గుర్తు రావాలంటే, అందుకు తగ్గ అభ్యాసం ముందు మనం చేస్తేనే గుర్తుకు వస్తుంది. లేదంటే మన ప్రారబ్దంలో ఏదైనా పుణ్య ఫలం ఉంటేనే సాధ్యమౌతుందనగా,

నిజమే, ఎవరూ వట్టిగా పుట్టలేదు, ప్రారబ్ధం అనే మూటలను నెత్తిన పెట్టుకుని మరీ పుడతాం. కర్మ ఫలం బట్టే జన్మలు. ఇక జన్మించాక కర్మలు చేయాల్సిందే. ఆ కర్మ ఫలితాలు ఇప్పుడో (ఈ జన్మలోనో) మరెప్పుడో (మరు జన్మలలోనో) అనుభవించక తప్పదు. అవతార పురుషులకైనా తప్పదు. రాముడు వాలిని చెట్టు చాటు నుండి ఒక్క బాణం వేటుతో హతమార్చిన ఫలితంగా, మరు జన్మలో కృష్ణ నిర్యాణం ఓ వేటగానిచే ఒక బాణం దెబ్బతో అనుభవించాల్సి వచ్చింది.  వెళ్ళి పోయేటప్పుడు ప్రాణవాయువు కర్మ వాసనలను తీసుకెళ్తుంది. ఏ వాసనలతో పోతామో అది మరుజన్మకు నాంది అవుతుంది. ఆ కర్మ వాసనల వలనే కదా, శ్రీకృష్ణ పరమాత్మ సాంగత్యం పొందినా సరే, అర్జునుడు కన్నప్పగా, భీముడు మధ్వాచార్యులుగా పుట్టారని పెద్దలు చెప్తుంటారు. మరి ఈ కర్మ వలయాన్ని చేధించడం ఎలా భారతీ గారు? ఇది పద్మగారి ప్రశ్న.

చెప్పారుగా గీతాచార్యుడు... "కర్మయోగం".
కర్మయోగమే మనకున్న ఏకైక అవకాశం.  కర్మని ఓ యోగంలా చేయడమే. మన దైనందిక కర్మలను, బాధ్యతలను కర్తవ్యమును ధర్మబద్దంగా నిర్వహిస్తూ, దైవస్మరణ విడువకుండా సాధనా మార్గంలో సాగిపోవాలి. మనకోసం, మన కుటుంబం కోసం కర్మలు చేయక తప్పదు! అంటే పనులు చేయడం ఎలాగూ తప్పదు. ఆ పనులేవో భగవంతుడుని స్మరిస్తూ చేస్తే, అది ఉపాసన అవుతుంది. ఏ ఉపాసనా చేయకున్నా మన రోజులు గడిచిపోతాయి. నిస్సారంగా జీవితం ముగిసిపోతుంది. పుట్టాం...గిట్టాం... అంతే! అదే మన జీవనవిధానం ఉపాసనతో అనుసంధానం చేస్తే జీవితం సారవంతమై అర్థవంతంగా పూర్తి అవుతుంది. 


కర్మని భగవత్ స్మరణతో చేస్తే, ఆ కర్మ యోగమౌతుందని నేను చెప్తుండగా...

ఏమిటో... ఈ కర్మ బంధనాలు...
ప్రారబ్ధ మూటలను భారంగామోస్తూ, ఇది నా తలరాత, విధిరాత అనుకుంటూ మరిన్ని కర్మలు మూట కట్టుకుంటూ...కర్మత్రయానికి లోబడి చావు పుట్టుకల చక్ర భ్రమణంలో పడి బ్రతుకుతున్నవారు కొందరు.
నిండు గుండెతో, మెండైన నమ్మికతో దైవాన్ని ఆశ్రయించి  మోసేది ఆయన, చూసేది నేను అనుకుని భక్తి మార్గంలో జీవిస్తూ జన్మ పరంపరను తగ్గించుకునేవారు మరికొందరు.
మోసేది ఎవరు? చూసేది ఎవరు? ఉన్నది ఒక్కటే... చావు పుట్టుకలు శరీరానికే అని ధ్యానమార్గంలో నడిచేవారు మరికొందరు.
పై మూడు సిద్ధాంతాలు గురించి ఔనని చెప్పిన, కాదని చెప్పినా, అవి ఎఱుకలో లేని మాటలే.  అన్నీ భ్రమ, భ్రాంతి లోవే... అన్నీ స్వప్న సదృశ్యమే... అని కొట్టిపారేస్తూ జ్ఞానమార్గంలో ఇంకొందరూ...
హూ... ఈ కర్మల గురించి ఎంతని చెప్పగలం? ఎంతని తెలుసుకోగలం? భగవాన్ గీతలో చెప్పారుగా... అభ్యాస జ్ఞాన ధ్యానాలకంటే కర్మఫల త్యాగమే గొప్పదని.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ||

కర్మఫల త్యాగం మనం చేయలేం. అంతటి పరిణితి రాలేదు కాబట్టి. నన్నడిగితే కర్మలను భగన్నామస్మరణతో కలిపి సాధన చేయడమే ఒకింత సులభం అన్పిస్తుందని రజినీ గారు చెప్తుండగా...

మనతో పాటు మన కర్మ మూటలు మోసుకుపోవడం తప్పనప్పుడు, ఆ కర్మ మూటలేవో సుకర్మ అంటే పుణ్య మూటలైతే బాగుంటుంది కదా... నాకో కథ గుర్తుకొస్తుందంటూ -
ఒకానొక ధనవంతునికి ఓ సందేహం వచ్చింది. మరణించినప్పుడు మనతో ఈ సంపద రాదంటారే...ఊహు ...ఈ సంపద అంతా నాతోనే వుండాలి, నేను మరణించాక కూడా నాతో పాటే వుండాలి...ఎలా మరి...ఎన్నో విధాల యోచించిన సరైన ఆలోచన తట్టక, ఓ ప్రకటన చేస్తాడు. నేను మరణించాక కూడా నా సంపదనంతా నేను తీసుకెళ్ళడానికి సరైన సలహా ఇచ్చిన వార్కి లక్ష బంగారు వరహలిస్తానని.
ఈ ధనికునికి డబ్బు పిచ్చి కాకపోతే, ఇదెలా సాధ్యమని అందరూ అనుకుంటున్న తరుణంలో ఓ యువకుడు వచ్చి, నేను మీకో సలహా ఇస్తాను. మీరు నా సలహా అమలు చేస్తే, మీ సంపద అంతా మీతో తీసుకు వెళ్ళవచ్చునని చెప్పగా, ఎంతో ఆతృతగా, 'ఎలా' అని ప్రశ్నిస్తాడు కోటీశ్వరుడు. మీరు అమెరికా వెళ్ళారనుకొండి, అక్కడ ఈ ఇండియా రుపీ చెల్లుతుందా? చెల్లదు కదా. మరి అక్కడ చెల్లాలంటే మీకు కావల్సిన డబ్బు మొత్తం బ్యాంక్ లో ఎక్సేంజ్ చేసుకొని డాలర్లుగా మార్చుకొని తీసుకువెళ్ళి ఉపయోగించుకుంటారు. అదే రష్యా వెళ్తే రూబుల్ గా, జపాన్ వెళ్తే యెన్ గా మార్చుకొని వెళ్తాం. అదే రీతిలో మీ డబ్బు / సంపద స్వర్గానికి తీసుకు వెళ్ళాలంటే మార్చుకొని తీసుకు వెళ్ళాలి. 
'అవునా! ఏ బ్యాంక్ లో ఎక్సేంజ్ చేయాలి? ఆ బ్యాంక్ ఎక్కడుంది? ఆ బ్యాంక్ లోనికి నా డబ్బును ఎలా ట్రాన్స్ఫర్ చెయ్యాలి'? 


మీ దగ్గర ఉన్న సంపదను సేవా కార్యక్రమాలకు, సత్కర్మలకు వినియోగించి పుణ్యంగా మార్చుకుంటే, మీతో పాటు మీ పుణ్య సంపదను తీసుకువెళ్ళవచ్చు..... అని చెప్పిన యువకుడిని ఎంతో సంతోషంతో సత్కరించి, ఆ సూచననుసరించి తరించెను ఆ ధనికుడు.
నిజమేకదా...మానవసేవే మాధవసేవని పార్వతి గారు చెప్పారు.

నామ స్మరణ చేయువారికి పాపాలు పోతాయన్నది నిజమేనా? నాకు తెలిసిన కొందరు నామ స్మరణ చేస్తునో, స్తోత్రాలో మంత్రాలో పఠిస్తునో, వంట చేస్తుంటారు. పూజలు, ఆలయ దర్శనాలు, అర్చనలు చేస్తుంటారు. మరి వారికి పాపాలు పోయినట్లేనా? పాప ఫలితం వారికి ఉండదా? ముక్తస్థితిలో వారున్నట్లా? వారనే కాదు, మిమ్మల్నే తీసుకొండి...రామ స్మరణంలో ఉంటారు. మరి మీకు ఇక ఏ పాప కర్మ ఫలితాలు లేనట్లేనా...
ఆగండి వాణిగారు, మీ మనోభావం నాకు అర్థమైంది. 
నామ స్మరణ చేస్తే పాపాలు పోతాయన్నది సత్యం. ఇది శాస్త్ర వచనం. అయితే కుంజర శౌచం మాదిరిగా చేస్తే, కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు. అంటే, నామజపం చేస్తున్నా, పాప కర్మలు మరల మరల చేస్తే ఆ కర్మ ఫలాలు అనుభవించాల్సిందే. 
ఇక నా గురించి అంటారా... ప్రాపంచిక బంధపాశముకు కట్టుబడి, కాలానుగుణంగా ఎవర్నీ నొప్పించక నొవ్వక సాగుతున్న నేపథ్యంలో చిరు చిరు తప్పులు తప్పవు. నా దృష్టిలో ఒప్పైన కర్మ, మీ దృష్టిలో తప్పు కావచ్చు.  మా తాతయ్య గారు ఓ మాట చెప్పేవారు...కర్మ అంటే, మనం చేతులతో చేస్తున్నదే కాదు, మనో వాక్కులతో చేసేది కూడా కర్మే. అలానే ప్రస్తుతం మనకు ఏం జరుగుతుందో అది మాత్రమే కాదు, మనకు ఏదైతే జరుగుతోందో, దానికి మనం ఎలా అనుభూతి చెందుతున్నామో, ఎలా స్పందిస్తున్నామో అనేది కూడా మన కర్మే. మనం చెడు చేయకపోవచ్చు కానీ; మన కళ్ళెదుట జరిగే చెడును చూస్తూ అడ్డుకోక పోవడం కూడా తప్పే. అది కూడా మన కర్మల ఖాతాలో జమవుతుంది. ఉదాహరణకు మహాభారతంలో భీష్మ, ద్రోణులు పెద్దలైనా, ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకోలేకపోతారు. రాజుకు విధేయులై ఉండాలన్న ధర్మం పాటించినా, కళ్ళముందు జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డుకోరు. జీవితమంతా మంచిగా బ్రతికినా, కళ్లెదుటి అధర్మ కార్యాన్ని అడ్డుకోలేని ఫలితానికి శిక్షగా యుద్ధంలో చంపబడతారు. నాది సర్ధుబాటు మనస్థత్వం. తటస్థ వైఖరి. వెంటనే దేనిని ఖండించలేను. కానీ, ఆ క్షణాల్లో నాలో రామ స్మరణం రెట్టింపు అవుతుంది. కొంతసేపటికి ప్రశాంతత... అలాగని మనస్సులో దేనిని మోయను... ఏదీ నిలవదు. నా ఈ వైఖరి కొంత తప్పే... కావున, నా కర్మ ఫలాలు నేను అనుభవించక తప్పదు. ఐతే రామ స్మరణ నడుమ పాపపుణ్యాల గురించి చింతన, చింత లేనే లేదు. కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడం స్థితప్రజ్ఞత. అంతటి ప్రజ్ఞ నాలో రాలేదింకా వృద్ద పక్షిలా. ఇక రామ నామ స్మరణం భక్తిగా అలవర్చుకున్నది... శ్రీరాముడు అంటే అమిత ప్రేమ, నా అంత్యకాలంలో రామ ధ్యాసలోనే తుదిశ్వాస విడవాలని. ఓ గృహిణిలా నా కర్మలు నేను సరిగ్గా నిర్వర్తిస్తూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, అప్పుడప్పుడు మీలాంటి వారితో సద్గోష్టిలో పాల్గొంటూ, మాయలో పడి గాడి తప్పుతున్న మనస్సును రామ స్మరణతో తిరిగి గూటిలో పెడుతూ సరళమైన జీవనం సాగిస్తున్నాను వాణి గారు. ఇదే నా కర్మలన్నింటిలో ప్రధాన కర్మ. ఇంతకు మించి నాకేమీ తెలియదని చెప్పగా, బాగుంది బాగుంది కానీ, ఆ వృద్ధ పక్షి ఊసేమిటి మధ్యలో...అని అడిగిన మిత్రులకు ఎప్పుడో చదివిన ఈ కథను చెప్పాను.
అనగనగా ఓ ఎడారి ప్రాంతంలో నివాసముండే ఓ పక్షి వృద్ధాప్య దశకు చేరుకున్నాక, జవసత్వాలు తగ్గి బక్క చిక్కేక, తన దీనావస్థకు దుఃఖిస్తూ,
అయ్యో! యవ్వనంలో వున్నప్పుడు ఎట్లా వుండేదానిని, ఇప్పుడు ఇలా వున్నాను...ఆహా... ఏమి నా తలవ్రాత అని అనుదినం చింతుస్తూ  కృంగిపోసాగింది. 
అలాంటి తరుణంలో ఆ పక్షి మసకబారిన కంటి చూపుకి, 
ఒక దేవదూత పక్షి అటుగా వెళ్ళడం కనిపించింది. వెంటనే కాస్తా సత్తువ కూడబెట్టుకొని, ఆ పక్షిని పిలుస్తూ, 
ఓ దైవ కపోతమా! నీవు ఎటు వెళ్ళుచున్నావు? అని అడుగగా...
ఆ దేవదూత పక్షి "నేను దైవం వద్దకు వెళ్తున్నానని" బదులిస్తుంది.
అంతట ఈ వృద్ధపక్షి, ఓ దేవదూత! నా ఈ దీన స్థితిని నీవు చూసితివి గదా, నాయందు దయపూని, నాకీ దైన్యత ఇంకెంతకాలమో దైవాన్ని అడిగి బదులీయరాదా? అంటూ వినమ్ర పూర్వకంగా, ఆర్తిగా అడిగింది.
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ద పక్షి ఎంతో ప్రాదేయపూర్వకంగా, దేవుని సమాధానం తెలుసుకోవాలనే తపనతో దేవదూత కపోతమును హృదయపూర్వకంగా వేడుకోగా,  ఆ పక్షి దైన్యతను చూసిన, ఈ దేవదూత పక్షికి కళ్ళు చెమర్చగా, 'నీకేం భయంలేదు, నీ తరఫున నేనడుగుతా, దైవం నుంచీ సమాధానం తప్పకుండా తీసుకుని వస్తాను అంటూ బయలుదేరిన ఆ దేవదూత పక్షి భక్తితో దైవం వద్దకు వెళ్ళి, సమయాసమయాలు చూసుకుని, మంచి తరుణంలో ఈ వృద్ధపక్షి ఉదంతం అంతా చెప్పి, హే! పరమ దయాళు! స్వామి! ఆ వృద్ధ పక్షి దైన్య స్థితి పోవడానికి ఎంత కాలం పడుతుందోనని తెలుసుకుని రమ్మని చెప్పిందని విన్నవించుకోగా -
అంతట దైవం, "ఆ వృద్ధ పక్షి రూపంలో వున్న జీవుడికి "వినాదైన్యేన జీవితం, అనాయాసేన మరణం" సంప్రాప్తమవ్వాలంటే, ఇంకా ఏడు జన్మలు పడుతుంద"ని పలికెను.

అప్పుడు ఆ దేవదూత పక్షికి ఆ వృద్ధ పక్షి దైన్య రూపం, హృదయపూర్వక ప్రార్థన గుర్తుకువచ్చి, 'అలా కాదు... స్వామి! ఏదైనా తరుణోపాయం వుంటే సెలవీయండి' అని వేడుకోగా, అంతట ఆ పరందాముడు దయామృత వదనుడై, కృపా రసార్ద్ర హృదయుడై, చిరు మందహాసంతో, "దైన్య స్థితినుంచీ దైవ స్థితికి చేరేందుకు మార్గమొక్కటి వున్నది, ఏది జరిగినా, ఏది ప్రాప్తించినా, ఏది ఏమైనా, అంతా ఈశ్వరేచ్ఛ మేరకే, అంతా భగవదనుగ్రహం మేరకే జరుగుతుందని, నేను చేసింది ఏమీ లేదని, పరిపూర్ణ విశ్వాసంతో, బలీయమైన నమ్మికతో, దృఢమైన చిత్తంతో... ఎదురౌతున్న ప్రతీదీ ఈశ్వర ప్రసాదమనే భావించి, 'సర్వకారణమీశ్వరం' అనెడి వాక్యాన్ని ఆశ్రయించి వున్నట్లయితే, అప్పుడు పరిస్థితి మారవచ్చును" అని సూచన చేసెను.
అంతట ఆ దేవదూత పక్షి శీఘ్రగతిన వృద్ధ పక్షి వద్దకు వచ్చి, పరమాత్ముని మాటలు వినిపించి, ధైర్యాన్ని ఆనందాన్ని నింపి, సంతోషంగా వెడలిపోతుంది.


ఇక ఈ వృద్ధపక్షి దేవ కపోతం మాటలను శ్రద్ధగా విని, విశ్వాసంతో ఆచరణ లోనికి తెచ్చుకుంది. 
ఎంతలా అంటే - ఇవాళ ఆహారంగా కాసిన్ని రెక్కల పురుగులు దొరిగాయి... సంతోషం, ఈశ్వర ప్రసాదం... ఈశ్వరా! నీకు కృతజ్ఞతలు.
మరోరోజు ఆహారంగా పప్పు ధాన్యాలు లభించాయి... ఇది ఈశ్వర అనుగ్రహం... ఈశ్వరా! నీకు ప్రణతులు. 
ఇంకో రోజు ఆహార అన్వేషణ గావిస్తుంటే, కంట్లో నలుసుపడి తీవ్రంగా బాధించింది, అప్పుడు కూడా, ఇదీ ఈశ్వర ప్రసాదమే, ఈశ్వరా! నీకు కన్నీటితో నమస్సులు..
వేరొక రోజు ఆహారంకై వెళ్తుండగా... ముళ్ళకంప గీరుకుంది... మరీ సంతోషం... ఇదీ ఈశ్వరానుగ్రహమే... ఈశ్వరా! నమోనమః ఇలా... ఆహారం దొరికినా, దొరకున్నా, ఎక్కువైనా, తక్కువైనా, భుక్తాయాసమైన, కడుపుమాడిన... ఏది ఏమైనా సరే, ప్రతీసారి, ప్రతీ చోట... ఈశ్వర, ఈశ్వర, ఈశ్వరా నీవే సర్వమూ, అంతా నీ అనుగ్రహమే... నీకు మనసా, వాచా, కర్మణా మ్రోకరిల్లుతున్నాను తండ్రీ... అని శరణాగతి భావంతో జీవించ సాగింది.
కొన్ని నెలలు అనంతరం అటుగా మరల వచ్చిన దేవపక్షి ఈ వృద్ధపక్షి కేసి ఆకాశం నుంచే చూస్తూ, ఆహా! ఎంతటి మార్పు... మచ్చుకైనా మునుపటి దైన్యత, వృద్దచాయలు లేవే... అని ఆశ్చర్యానందాలకు లోనై, వెంటనే దైవం వద్దకు వెళ్ళి విషయం చెప్పి, ఏమిటి ఆ వృద్ద పక్షిలో ఇంత మార్పు? ఏడు జన్మల వరకూ దుఃఖ ఛాయలు కూడా పోవు అని మీరు నాకు సెలవిచ్చారు... ఇప్పుడు ఏడు నెలలలోనే ఇంత మార్పా? అని అడుగగా, అప్పుడు పరమాత్ముడు చెబుతాడు... ఇదంతా నేను అన్న అహాన్ని వీడిన ఔన్నత్యమని. శరణాగత సమర్పణ ఫలితమని. ఈ కథ విన్నాక,

భారతీ గారు, మీరు భక్తితో రామ నామస్మరణం ఎందుకు అలవర్చుకున్నారోనన్న మాటలు వింటుంటే -

అంతకాలే చ మావేవ స్మరన్ ముక్త్వా కలేబరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః||

మరణసమయంలో ఎవరైతే నన్నే స్మరించుచు దేహమును వీడుదురో వారు నన్నే చేరుదురు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరమ్|
తం తమేవైతి కౌంతేయః సదా తద్భావభావితః||

ఓ కుంతీపుత్రా! ఎవరేయే భావమును స్మరించుచు తుదకు దేహత్యాగ మొనర్చునో వారు ఆ భావమునే పొందుదురు. అంటే మన ఉత్తరజన్మ మన కట్టకడపటి భావముపై ఆధారపడి ఉంటుందన్నది యదార్థం... అన్న గీతాచార్యుని మాటలతో పాటు ఎక్కడో చదివిన ఓ కథ కూడా గుర్తుకు వస్తుంది.

ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి మరు జన్మకు కారణమవుతాయి.

ఒకసారి ఒక రాజ్య కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చి, రాజు వద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వుంది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొనగా, రాజు అందుకు సమ్మతించాడు.
రాత్రి అయింది. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే తలంపుతో, ఆ రాజు మారువేషంలో చాటుగా మూగవాన్ని గమనిస్తూ బయల్దేరాడు.
 
అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ కాపలాదారుని కొడుకు కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు -

కామం క్రోధంచ, లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః.

(మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని, జ్ఞానమనే రత్నాన్ని అపహరించడానికి పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త)

ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. మూగవానిగా నటిస్తున్నాడు. ఇతణ్ణి వెంబడించి, గమనించాలి' అని రాజు భావించాడు. 

రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు -

జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః

(పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, ఇవి మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త)

ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది.

మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః 

(తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు [ఇదంతా మిథ్య అని అర్థం] జాగ్రత్త! జాగ్రత్త) అని చాటాడు. 

ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ యువకుడు
 
ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః

(ఆశాపాశంచేత కట్టుబడి తిరుగుతూ, లోక కర్మల చేత బహుచింతలకు లోనై, ఆయువు క్షీణించడం ఎరుగలేరే... జాగ్రత్త జాగ్రత్త) అని చాటాడు...

ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మ గల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతణ్ణి తన రాజప్రాసాదానికి రప్పించి, అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకొని రాజు తన కోటకు వెళ్ళి పోయాడు.

మర్నాడు ఆ యువకుని తండ్రిని పిలిపించి,
అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగవాడు కాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు... అని. తండ్రి ఆశ్చర్యానందంకు లోనై, తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక, ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.
అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. 
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ యువకుడు. ఈ కోరిక విని రాజు అమితాశ్చర్యపోయి, ఇచ్చిన మాట ప్రకారం అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ యువకుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించగా,
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి, “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని, ఇప్పుడు ఎందుచేతనో ఒక దేశం నుండి చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, ఆ దేశంలో పాపాత్ములే లేరా! లేదా పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం”... అని చెప్పగా, బ్రహ్మకీ ఇది విచిత్రంగా తోచి, అసలు విషయం పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. 
ఇక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు ఈ జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతున్నారు. 
ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి ఈ జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా, బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది.

అదేమంటే - మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా, ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది.

మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింప చేసి, వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, భక్తితో తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి, వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు భక్తి మైకంలో గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.

ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై, ఈ జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.

"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో 
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. 
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు -
"ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా?నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు. కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం నాకు ఒక పాఠమైనది” అని తెలపగా...

అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి, సత్యలోకం చేరుకొన్నాడు. 
మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేదా ముక్తి లభిస్తుంది. 
సత్ చింతన కాక, వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తున్నది.
నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక! కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా అలవర్చుకోవాలని ఎప్పటిలా ప్రియంగా చెప్పింది ప్రియంవద.

జహా జహా చలూ కరూ పరిక్రమా, జో జో కరూ సో సేవా
జబ సోవూ కరూ దండవత్, జానూ దేవ న దూజా 
                          - సంత్ కబీర్
నేను నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది చేసినా, అది భగవత్ సేవ గానే భావిస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను... 
సంత్ కబీర్ లా కర్మలను భగవత్ తలపుతో జత చేసే భావన మనలో ధృఢమౌతే ధన్యులమే కదా... కానీ, అంత ధృఢ సంకల్పం లేదే... నిట్టూర్పుతో నెమ్మదిగా అన్నారు నిర్మల గారు.

గత మూడు దశాబ్దాలుగా మీకు నేను తెలుసు. నేను తెలిసి తెలిసీ ఏ తప్పులు చేయలేదు, భగవత్ ఆరాధన మానలేదు. నా జీవితం ఓ సుడిగుండం. అయినా ఈ ఆధ్యాత్మిక చింతన అలవడేకా మునుపటిలా దుఃఖం లేదంది నీరజ.

అసలు ఎందుకీ కష్టాలు? కొందరికి బ్రహ్మరాత ఇలా ఉంటాదేమిటి? ఇది వారి ప్రారబ్దం అంటారు...
 అసలు ఈ ప్రారబ్ధం ఏమిటి? ఈరోజు చేసిన వంట ఈరోజే తింటున్నాం కదా. అలాగే ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవించేయాలి కదా... మరు జన్మలకు ఎందుకు? 
హైమ గారి ఈ ప్రశ్నలకు, ఈరోజు వంట ప్రిజ్ లో దాచుకొని దాచుకొని తింటారు కదా, ఈరోజు చేతికి అందిన పంట ఫలాదులను ఈరోజే తినేయరు కదా,  గర్భంలో పడిన బిడ్డను వెంటనే కనేయలేరు కదా. దేనికైనా సమయం రావాలి. విత్తనాలు చల్లగానే అవి అంకురించవు. నియమిత కాలంలోనే మొలకెత్తుతాయి కదా! ఈ ఏడాది పండిన ధాన్యం కొన్ని మరుసటి సంవత్సరపు పంటకు కారణమయినట్లే, కొన్ని మన కర్మలు మరుజన్మకు కారణమవుతాయి. 


మనం చేసిన సత్కర్మలైనా, దుష్కర్మలైనా కొన్ని వెంటనే ఫలితాన్ని ఇస్తే, కొన్ని కొన్ని వెను వెంటనే తమ ప్రభావాన్ని చూపవు, కాలానుగుణంగా తమ ఫలితాన్ని చూపుతాయి. 
ఇక బ్రహ్మ కాదు, మన తలరాతలు మనమే వ్రాసుకుంటాం.
కర్మ ఎలా ఉంటుందో ఒక దగ్గర చదివాను. కృష్ణుడు కంసుని సంహరించి, తన తల్లిదండ్రులను కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూడగానే "నాయనా! నీవే పరమాత్మవి కదా. నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. ఎందుకు 14 ఏళ్ళు ఆగావు... కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి" అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు "అమ్మా! నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? విన్న దేవకి ఆశ్చర్య చకితురాలయింది.
"కృష్ణా ఇదెలా సాధ్యము? ఎందుకిలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ, గత జన్మలో నీవు " కైకేయివి", నీ భర్త "దశరథుడు". 
ఇక ప్రారబ్ధం అంటారా... కర్త, కర్మ, క్రియ మూడూ భగవంతునివే. కానీ; ఈ మూడు మనవే అని మన నెత్తిన వేసుకుని మోయడమే ప్రారబ్దం... ఝాన్సీగారు ఈ వివరణ ఇస్తూ, ఈమధ్య నేనో పాట విన్నాను, చాలా బాగుంది... వినడంటూ పార్వర్డ్ చేసిన వీడియో -


పైన ఉదాహరించిన కథా రచయితలకు హృదయపూర్వక నమస్సులు.

                ఈ కబుర్లు కొనసాగుతునే ఉన్నాయి...