10, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఇదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి.


రాత్రంతా చాలాసార్లు మెలుకువ వచ్చేసేది. మెలుకువ రావడం చెప్పుకోదగ్గ విషయం కాదు. కానీ, ఆ మెలుకువ అంతరాన అప్రయత్నంగా "రామ"నామం జరుగుతుండగా రావడం విశేషం. ఇదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి. 

ఇదిలా ఉండగా తెల్లవారుఝామున లతీష్ బాబు (అల్లుడుగారు)నుండి ఫోన్ -
ఆదివారం కదా, అప్పుడే లేచారేమ్మా అన్న నా ప్రశ్నకు ...
అత్తమ్మా! నేను ఇప్పుడు భద్రాచలంలో గుడి ముందు ఉన్నాను. రామదర్శనంకు వెళ్తున్నాను... అని నవ్వుతూ బదులిచ్చారు.
ఓహో..... ఏమని చెప్పను? నా ఆనందం ద్విగుణీకృతమైంది. ఈ ఆనందసమయంలో గతంలో పోస్ట్ చేసిన రెండు టపాలను మరల పోస్ట్ చేస్తున్నాను.


          పరమపావనం 
          రామనామం 





భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ వుంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహరతత్వంబు కలిసిన మహామంత్రం. 
'ఓం నమోనారాయణాయ' అనెడి ఆష్టాక్షరి మంత్రములో "రా" అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో  ఓం నమో నాయణాయ  అన్నది అర్ధం లేనిదవుతుంది) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రంబులో "మ" అనునది జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే  శివుడే లేడని అర్ధం) ఈ రెండు జీవాక్షరముల సమాహారమే "రామ". శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం. అందుచే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మికిచే రచింపబడినది. అది త్రైలోక్యవాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికి పంచెను. 33 లక్షల 33 వేల 333 శ్లోకముల వంతున పంచగ 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆ శ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కధనం. ఆ రెండక్షరములే "రామ".
                                                                                                
                                                రామనామ ప్రభావం
"రామ" అను రెండక్షరములు మనోహరమైనవి. మధురమైనవి. అమృత సమానం. ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతమును ఇచ్చును. సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుంది.
రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి / మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి //  (ఉమాసంహిత)
('రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనమునుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును)
రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ / యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః //  (ఉమాసంహిత)
(రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు)
కృశాను (అగ్ని) 'ర'అక్షరం అగ్నిబీజాక్షరం. భాను (సూర్యుడు) 'అ'అక్షరం సూర్యబీజాక్షరం. హిమారక (చంద్రుడు) 'మ'అక్షరం చంద్రబీజాక్షరం. ఈ మూడు బీజాక్షరములు కలసి "రామ" శబ్దమయ్యెను. అగ్నిగుణం దహించుట. అగ్నిబీజాక్షరమగు  'ర' శుభాశుభ కర్మలను దహించి మోక్షమును ఇచ్చును. సూర్యుని వలన అంధకారం నశించును. అటులనే సూర్య బీజాక్షరం 'అ' మోహాందకారమును పోగొట్టును. చంద్రుడు తాపమును హరించును. అటులనే చంద్రుని బీజాక్షరం 'మ' తాపత్రయమును హరించును.
ఉత్పత్తి కర్తయగు బ్రహ్మవంటివాడు చంద్రుడు. పోషణ కర్తయగు విష్ణువువంటివాడు సూర్యుడు. సంహార కర్తయగు శివునివంటివాడు అగ్నిదేవుడు. ఈ త్రిమూర్తిస్వరూపుడు శ్రీరాముడు. 
రామ మంత్రము ఎటువంటిదంటే - పుట్టుట, గిట్టుట అనెడి అలలు గల సంసారమను సముద్రం దాటించునదియును, బ్రహ్మవిష్ణురుద్రాదుల చేత పొగడదగినదియును, బ్రహ్మహత్యాది మహాపాపములను నశింపజేయునదియును, కామక్రోధలోభ మోహమదమాత్సర్యాలాది దుర్గుణములను సంహరించునదియును, నేను జీవుడనేడి అజ్ఞానం తొలగించునదియును, పరబ్రహ్మం (చైతన్యం) నేననెడు దివ్యజ్ఞానం వలన కలిగిన నిరాతిశయానందమును వర్ధిల్లుజేయునదియును, వేదముల కడపటిభాగమైన జ్ఞానకాండం చేత విచారింపదగినదియుయగును.  ( శ్రీ సీతారామాంజనేయ సంవాదం)
రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః / పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ //
(నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటినుండి బయటికి వెళ్లిపోవుచున్నవి. మరల అవి లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించుచున్నది)
"రా" అక్షరం ఉచ్చరించుటవలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుటవలన నోరు మూతపడి సంతోషం కలుగును.
"రా" అక్షరం బ్రహ్మస్వరూపుడునగు ఆదికూర్మముతో సమానం. "మ" అక్షరం జీవస్వరూపుడగు ఆదిశేషువుతో సమానం. 
"రా" అక్షరం ఛత్రం వలెను, "మ" అక్షరం కిరీటం వలెను సర్వ వర్ణములకంటే అధికముగా ప్రకాశించును. ఇటువంటి రామనామమును జపించిన సిద్ధత్వమును పొందుదురు.
"రా" అగ్నిబీజాక్షరం కావున దానిని స్మరించిన మాత్రమున సకలపాపములు భస్మము కావించుననియు, "మ" అమృతబీజాక్షరం కావున దానిని స్మరించిన యెడల సత్యముగా మోక్షం ఇచ్చుననియు ఋషులు తెలిపారు.
"రా" అనగా పరబ్రహ్మం, "మ" అనగా చిచ్ఛక్తి. "రా" అనగా క్షేత్రజ్ఞుడు, "మ" అనగా జీవుడు. "రా" అనగా శివుడు, "మ" అనగా శక్తి. "రా" అనగా విష్ణువు, "మ" అనగా  లక్ష్మి. "రా" అనగా బ్రహ్మం, "మ" అనగా సరస్వతి. "రా" అన్న మాత్రమున యముడు గజ గజ వణుకును, "మ" అన్న మాత్రమున అతని పాశం తెగిపోవును. రామ అన్న భవబంధములు నశించును. రామ అన్న సమస్త సంపదలు కల్గును. రామ అన్న సర్వార్ధములు సిద్ధించును. రామ అన్న బ్రహ్మహత్యాదిపాతకములెల్ల నివర్తియగును. రామ అన్న సకల సంశయములు నివృత్తియగును. రామనామం స్మరణం చేసేవారికి మోక్షం కరస్థమై రామమయమై ఉన్నది. రామ మంత్రముకంటే అధికమైన యజ్ఞంగాని, తపంగాని, వ్రతంగాని, మంత్రంగాని, మరియొకటి లేదు. 
                                  
                         తారక మంత్రం

తారకం సర్వవిషయం సర్వధా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం // (పతంజలి యోగం)
(వివేక జన్య జ్ఞానం తారకం. ఆత్మానాత్మ వివేకజ్ఞానముచే కలిగెడు శుద్ధమైన ఆత్మజ్ఞానమునకు తారకమని పేరు. (సంసార సాగరమునుండి తరింపజేసేది కాబట్టి ఇట్టి వివేకజ్ఞానమునకు తారకం అంటారు)
రామ మంత్రం ఒక్కటియే తారకమంత్రమైనది.
తా, రకం - తన యొక్క స్వరూపం. తన స్వరూపం తాను తెలిసికొనినచో ఏ చింతయు లేక మనస్సు నెమ్మది పొందును. పరమాత్ముడైన శ్రీరామునితో ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను వియ్యమగుటయే యోగమనబడును. 
రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తపః రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం//

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే / సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే //
(నేను సదా రామనామమును ధ్యానించెదను, అది విష్ణు సహస్రనామములకు సమానమైనది. నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను)
తారక మంత్రమునే శివుడు సదా జపించెను. జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రం స్వయముగా జీవుల దక్షిణ చెవియందు ఉపదేశించును. రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడిదొంగ రత్నాకరుడు వాల్మికి మహాముని అయ్యెను. సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను. తన వచనములయందామెకు గల విశ్వాసం జూచి, సంతచించి ప్రసన్నుడై పార్వతికి శివుడు తన శరీరములో ఎడమభాగమును ఇచ్చెను. రామనామ స్మరణతో రాయిరూపంలోఉన్న అహల్య రామస్పర్శకు నోచుకొని పునీతురాలైనది.
రామ అను తారకమంత్రము చేత సకల పాతకములు నశించును. పార్వతీదేవికి పరమేశ్వరుడు, వాల్మికికీ నారదుడు, భరద్వాజునకు వాల్మికి, వ్యాసులకు పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారక మంత్రమే.
తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు. ఈ మంత్రమును త్రికరణశుద్ధిగా అనుష్టించినవారు భవసాగరమును నిస్సంశయమముగా తరింపగలరు. నిరంతంను ప్రాణావాయువు లోపల వెలుపల సంచరించు నప్పుడెల్లను తదేకధ్యానముతో తారకమంత్రమును మననింపుచు ఉన్నను కాలక్రమేణ ఈ మహామంత్ర ప్రభావంచే ముక్తిని పొందుదురు. (మహాభక్త విజయం)
రామ అన్నది ఒక్క నామమే కాదు, మంత్రం కూడా. రామ మంత్రం మనిషిని తరింపజేసేది కావునా అది తారకమంత్రమైంది. ఇందుకు ఉదాహరణముగా ఓ కధని కంచి పీఠమునకు అధిపతి అయిన శ్రీ చంద్రశేఖరసరస్వతివారు ఓసారి చెప్పారు. ఓ అడవిలో కొందరు దొంగలు తాము చేద్దామనుకుంటున్న దొంగతనం గురించి ఇలా మాట్లాడుకొని ముక్తిని పొందినట్లు ఓ కవి చమత్కారముగా చెప్పింది చెప్పారు. 
వనే చ రామః వసు చాహరామః 
నదీం స్తరామః నభయం స్మరామః 
వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే
అంటే - వనే చ రామః (అడవిలో నివశిద్దాం), వసు చాహరామః (ఈ దారిలో వెళ్ళే ప్రయాణికులనుండి సంపదను దొంగలిద్దాం), నదీం స్తరామః (దొంగాలించాక నదిని దాటేద్దాం), నభయం స్మరామః (నదిని దాటేస్తే పట్టుబడతామనే భయం వుండదు) అని అనుకున్నారు. వారు దొంగలైనప్పటికి వారి మాటలలో రామః అను శబ్దం వుండడం వలన వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే .... ఆ అడవిలో కిరాతకులు మరణించినతర్వాత ముక్తిని పొందారు. రామ అన్న పదమహిమ తెలియకున్నా ఆ కిరాతకులు వారివారి మాటలమద్య అసంకల్పితముగా రామ అని పలికినందులకే ముక్తి లభిస్తే, భక్తితో శ్రద్ధతో స్మరిస్తే ఇహపరములందు ఎంతలా తరిస్తమో గుర్తించండి.
శ్రీరామప్రాతిపదికమవశేనాపి సంగృణన్ / ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం పునర్బుద్ధిపూర్వకమ్ // (ఉమా సంహిత)
(శ్రీరామ అను ప్రాతిపదికమును తెలియక ఉచ్చరించినను మనుజుడు ముక్తినొందుననగా తెలిసి ఉచ్చరించిన ముక్తినొందుననుటలో సందేహం ఏముంటుంది?)
                                                                             
                    నామము గొప్పదా - రూపం గొప్పదా

రూపం నామమునకు ఆధీనం. నామం లేక రూపం యొక్క జ్ఞానం కలుగదు. రూపంగల పదార్ధం చేతిలో వున్నను నామం తెలుసుకొనని యెడల ఆ పదార్ధం గుర్తెరుంగం. నామమును ధ్యానిస్తే రూపం స్వయముగా హృదయంలో వ్యక్తమగును. మనస్సునకు ఆనందం కలుగును. సగుణ, నిర్గుణ బ్రహ్మములకు నామమే సాక్షి. ఈ రెండింటిని తెలుసుకొనుటకు నామమే ప్రధానము.వానిని చేరుటకు నామం మార్గం చూపును. (మహాభక్తవిజయం)
బ్రహ్మం సగుణమనియు, నిర్గుణమనియు చెప్పవచ్చును. సగుణ నిర్గుణములకంటే నామమే శ్రేష్టం. ఎందుకంటే - నామం యొక్క ప్రభావంవలన సగుణ నిర్గుణములు రెండును స్వాదీనమగును. అగ్ని దారువులో కలదు, ఆ అగ్నియే ప్రకటమై ప్రజ్వరిల్లును. మొదటిది అవ్యక్తం, రెండవది వ్యక్తం. అటులనే నిర్గుణబ్రహ్మం  అవ్యక్తం, సగుణబ్రహ్మం వ్యక్తం. రెండును అగమ్యములు. నామం మాత్రం గమ్యం. అందుచేత బ్రహ్మం కంటెను, రాముని కంటెను నామం శ్రేష్టమైనదని చెప్పుదురు. సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మం జీవుని హృదయములలో ప్రకాశిస్తున్ననను లోకములో సమస్తజీవులను అది గ్రహించలేక దుఃఖితులై అగచాట్లు పడుచున్నారు. ఆ కారణంచే ఆ బ్రహ్మం రూపమును ధరించి పేరు పెట్టుకొని లోకమునకు వ్యక్తమగుచున్నాడు. ఆ సగుణబ్రహ్మమునకు నామం లేనిచో స్మరించలేముకాబట్టి సగుణనిర్గుణబ్రహ్మములకంటే నామం యొక్క ప్రభావము శ్రేష్టమైయున్నది. సగుణబ్రహ్మం మాధుర్యమూర్తి, నామం మాధుర్య మహిమాశక్తి దీప్తి. రాముని వలన తరించినవారు కొందరే, రామనామం వలన తరించువారు అనంతమంది.
రామనామ్ మణిదీప్ ధయ జొహ్ రే హరంద్వార్
తులసి భీతర్ ఛాహే రహు జాం బహం ఉజ ఆర్ (తులసీదాసు)
(నీకు లోపల బయట వెలుగు కావాలని కోరుకుంటే, జిహ్వ అనే ద్వారం దగ్గర రామనామం అనే దీపాన్ని వెలిగించండి)

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే / రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః //
శ్రీరామున్ని కౌసల్యాదేవి రామా అనియు, దశరధుడు రామభద్ర యనియు, వసిష్టమహర్షి రామచంద్ర యనియు, రాజులు రఘునాధ యనియు, సీతాదేవి నాధ యనియు, భక్తులు సీతాపతి యనియు, సంబోధింతురు. అట్టి సీతారామునకు నమస్కారం.

              ఆధ్యాత్మికపరంగా రామాయణ అంతరార్ధం 

ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో రామాయణ అంతరార్ధమిది. మన ఇంట బయట జరుగుతున్నదే రామాయణం. ఎలాగంటే -

                                అయోధ్య నగరం

ఏ విధమైన సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు ఏవీ లేనటువంటి; సామాన్య జనునిచే జయింప వీలులేనటువంటి నగరం అయోధ్య. అనగా ఏ వాసనలు అంటని ఆనంద హృదయమే అయోధ్య.
ఆ అయోధ్య అధిపతి దశరధుడు. దశరధుడు అంటే దశేంద్రియములను (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) జయించినవాడు. ఆ దశరధమహారాజుకు సత్వ, రజో, తమో గుణములనే కౌసల్య, సుమిత్ర, కైకయి అనే ముగ్గురు భార్యలు. రాముడు (ధర్మం) భరతుడు (శ్రద్ధ) లక్ష్మణుడు (భక్తి) శత్రుఘ్నుడు(శక్తి) అనే నలుగురు పుత్రులు.
భగవత్ తత్వాన్ని మానవాళికి అందించడానికి మాధవుడే మానవరూపములో వచ్చిన ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరిలో వున్నా ఆత్మారాముడు. 
ఆత్మారాముడైన శ్రీరాముడు వ్యక్తమై అర్ధంకావాలంటే దానికి సంకల్పమనెడి మనస్సు అవసరం. ఆ మనస్సే సీత.
సీతారాములకు వివాహం జరిగింది. అటుపై కొంతకాలమునకు కైకయి కారణముగా శ్రీరాముడు అయోధ్యను విడిచి సీతతో కల్సి, లక్ష్మణుడు వెంటరాగా అరణ్యములకు వెడలెను. అనగా ఆనందముగా అయోధ్యలో వున్న ఆత్మరాముడు మనస్సనెడి సీతతో కూడి సుఖదుఃఖాలుతో కూడిన జీవితమనే అరణ్యములో ప్రవేశించాడు. వీడి వుండలేని భక్తి (లక్ష్మణుడు) ఆత్మను (రామున్ని) అనుసరించింది.
సీత రామున్నే చూస్తూ, రామున్నే తలస్తూ, రామున్నే జపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ - అంతా రాముడే అన్న భావనతో వున్నంతకాలం రామునితోనే కూడి ఆనందముగా ఉంది. అయోధ్య, అరణ్యము రెండునూ ఆమెకు ఒకేలా ఆనందమును ఇచ్చాయి. అంటే మనస్సు(సీత) ఆత్మతో(రామునితో) కూడి అంతర్ముఖురాలై వున్నంతకాలం అయోధ్యలోనూ, అరణ్యములోను ఆనందస్థితిలోనే వుంది.
ఒకరోజు సీత బంగారులేడిని చూసింది. ఆ లేడి కావాలని రామున్ని కోరింది. బంగారులేడి ఏమిటీ? ఇది రాక్షసమాయల వుందని రాముడు వారించినను వినక ఆ లేడిపై ఆశపడి తీసుకురమ్మని రామున్ని పంపింది. అనగా అంతవరకు అంతర్ముఖమై ఆత్మారామున్ని కూడి ఆనందముగా వున్న మనస్సుదృష్టి బహిర్ముఖమై బంగారులేడి రూపములో వున్న మాయలో పడి, ముందు ఆత్మని వదిలేసింది. రాముడు వెళ్ళాకా తన దగ్గరే వున్న లక్ష్మణుడుని కూడా వెళ్ళమని దుర్భాషలాడి పంపేసింది. బహిర్ముఖమైన మనస్సు మంచిని, విచక్షణను మరిచి ప్రవర్తిస్తుందని అనడానికి ఈ ఘటనో దర్పణం. లక్ష్మణుడు వెళ్తూ గీసిన లక్ష్మణరేఖనూ దాటేసింది. దశకంఠుడు చేతికి చిక్కింది. పరమ దుఃఖితురాలైంది. లంకకు చేరింది. అంటే ఆత్మనెడి రామున్ని మొదట వదులుకున్న మనస్సు తర్వాత భక్తిత్వమనే లక్ష్మణుని విడిచిపెట్టింది. దశకంఠుడుకి బందీ అయి తీవ్ర బాధకు లోనైంది. కోరికలకు, రాగద్వేషాలకు, కోపతాపాలకు మనస్సులో స్థానం ఏర్పడితే బాధలు తప్పవు.
                                 
                                 లంకా పట్టణం

సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు... ఇత్యాదులకు నిలయం లంకాపట్టణం. అన్ని వాసనలను అంటిపెట్టుకున్న పట్టణం లంకా. దీనికి తొమ్మిది ద్వారములు. ఈ లంకాపట్టణం మానవ శరీరం. మానవ శరీరమునకు కూడా నవద్వారలున్నాయి. లంకకు రాజు  దశకంఠుడు.  దశకంఠుడు అంటే దశేంద్రియములకు (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) లోబడినవాడు. లంక చుట్టూ సాగరము అనగా మానవుని చుట్టూ వున్న ఈ  మాయాసంసారసాగరమే. 
లంకలో వున్న సీత తన దుఃఖమునకు కారణం గ్రహించి, ఏకవస్త్రముతో వుంటూ రామునికై తపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ, రాముడు వచ్చి తనని రక్షిస్తాడనే నమ్మకముతో వుంటుంది. అనగా తను బహిర్ముఖమై మాయలేడిపై ఆశపడి ఆత్మానందమును కోల్పోయి, దైవానుగ్రహం లక్ష్మణుని రూపేణ వున్న, దానిని వదులుకున్నందుకే తనకింత దుర్గతి పట్టిందని, తన దుఃఖమునకు కారణం తనేనని గ్రహించి తిరిగి రామున్ని చేరాలని ఏకధ్యాసతో అంతర్ముఖురాలైంది. 
ఇక ఇక్కడ రాముడు సీతకై విలపిస్తూ (రాముడు భగవంతుడు అయినప్పటికీ పూర్తిగా మానవుడిగానే జీవించాడు), సీతను అన్వేషించడం ప్రారంభించాడు. అంటే భక్తుడు దారితప్పి తిరిగి తనకై పరితపిస్తుంటే భగవంతుడు కూడా అంతలానే ఆ భక్తునికై పరితపిస్తాడని ఇక్కడ అర్ధమోతుంది.
                                              ఆంజనేయుడు 
ఆంజనేయుడు పవనతనయుడు. అంటే ఉచ్చ్వాస నిశ్శ్వాస స్వరూపమైన ప్రాణాయామ స్వరూపుడు. 
మనస్సువేగం వాయువేగమునకు సమానం (మనోజవం మారుతతుల్య వేగం). అలా పరుగులు తీసే మనస్సుని నియంత్రించగలగడం శ్వాసతోనే సాధ్యం. ప్రాణాయామమే మనోనియంత్రనకు ఔషదం. ఈ ప్రాణాయామం ఎలా సాధ్యమౌతుందంటే ఇంద్రియములను జయించినప్పుడు (జితేంద్రియం) చక్కగా సాధ్యమౌతుంది. ఈ ఇంద్రియములను ఎలా జయించగలమంటే బుద్ధితో (బుద్ధిమతాం) జయించాలి. అప్పుడే ప్రాణాయామం చక్కగా జరుగుతుంది. ఈ ప్రాణాయామం స్వరూపుడు ఆంజనేయుడు. అంటే మూలాధారచక్రం మొదలుకొని సహస్రారం వరకు వ్యాపించగలిగినవాడు ఆంజనేయుడు. కుండలినీజాగృతి చేసి ఆత్మను పరమాత్మ దరికి చేర్చగల శక్తిమంతుడు ఆంజనేయుడు. భక్తునికి భగవంతునికి మద్య వారధి నిర్మాణకర్త ఆంజనేయుడే.
ఇక కధ లోనికి వస్తే -
సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు ఆంజనేయుడు. అనగా సంసారసాగరమనే మాయను దాటి లంక అనెడి శరీరం లోనికి ప్రవేశించాడు. సీతను దర్శించి రాముని అంగుళీయకం ఇచ్చి, త్వరలోనే రాముడు వచ్చి నిను రక్షిస్తాడని చెప్పి ఆనందపరుస్తాడు. అంటే  ప్రాణాయామం శుద్దమనస్సును చూసి పరమాత్మ అనుగ్రహం నీకు కల్గుతుందన్న అభయమిచ్చి పరమాత్మదర్శన యోగ్యత నీకు త్వరలోనే కల్గుతుందని చెప్పి ఆనందపరుస్తాడు. అనగా ప్రాణాయామం వలన సాధకుని మనస్సుకు తెలుస్తుంది ఆత్మసాక్షాత్కారం కలగబోతుందన్న అనుభూతి కల్గి ఆనందస్థితిలో వుంటుంది. ఆంజనేయుడు కొంతవరకు లంకాదహనం చేశాడు. అనగా లోపలున్న దుర్గుణాలు, వాసనలను కొంతవరకు దహనం చేశాడు. అయినా 'నేను' అనే అహంకారంతో రావణుడు హుంకరిస్తూనే వున్నాడు. అప్పుడు ఆంజనేయుడు మరింతగా తన తోకని పెంచి చుట్టలుచుట్టిన తోకనే ఆసనముగా చేసుకొని రావణుని ఎదుట కూర్చొని రామసందేశం వినిపించాడు. అనగా ప్రాణాయామ స్వరూపుడు అయిన ఆంజనేయుడు మరింతగా తన శక్తిని జాగృతి చేసి సహస్రారంవరకు ఎదిగి అక్కడ కూర్చొని లౌకికమైన కోరికలు, స్వార్ధం, అహంకారం విడిచి స్వస్థానంనకు మనస్సుని పంపేస్తావా, మరణిస్తావా అని సందేశం వినిపించాడు. 
ఇటుపై కధ అందరికీ తెల్సిందే. 
భగవత్ తత్వం అర్ధంకాక రావణుడు పతనమౌతాడు.
అగ్నిప్రవేశం చేసిన సీత రామున్ని చేరింది. అనగా సంపూర్ణముగా వాసనలన్నీ హరించబడి శుద్ధమనస్సు ఆత్మారామున్ని చేరింది.
తిరిగి అయోధ్యకి రావడం, పట్టాభిషేకం జరగడం అంటే అంతర్యామి అయిన రామునితో శుద్ధమనస్సనెడి సీత అయోధ్య అనెడి హృదయంలో కలిసివుండడమే పట్టాభిషేకం. 
కొంతకాలమనంతరం సీతను అడవిలో విడిచిపెట్టేయడంలో ఆంతర్యం ఏమిటంటే -
శుద్ధమనస్సు అలానే హృదయంలోనే ఆత్మారామున్ని చూసుకుంటూ వుండిపోతే శుద్ధమనస్సు స్థాయిలోనే వుంటుంది. భగవంతుడు శుద్దమనస్సులను ఉద్ధరించి తనస్థాయిలో (చైతన్యంలో) పూర్తిగా లయం చేయాలని భావిస్తాడు కాబట్టి, ఎక్కడనుండి వచ్చిందో అక్కడ లయమౌతానే చైతన్యంలో కలుస్తుంది కాబట్టి సీత అనెడి శుద్ధమనస్సును విడిచిపెట్టడం జరిగింది. అప్పుడుకూడా సీత అంతర్ముఖురాలై దైవధ్యానంలో వుండి కొంతకాలం తర్వాత ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే లయమైంది. పుడమి నుండి వచ్చి పుడమిలోనే లయమై చైతన్యస్వరూపిని అయింది.
                            మనోజవం మారుతతుల్యవేగమ్ 
                            జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
                            వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
                            శ్రీరామ దూతం శరణం ప్రపద్యే// 
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై  శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను. 
                            శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి 
                            శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి
                            శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి 
                            శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే//
శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమష్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను. 




9 కామెంట్‌లు:

  1. ఓ౦ సాయిరా౦

    విపదో నైవ విపద:, స౦పదో నైవ స౦పద:

    విపద్వి స్మరణ౦ విష్ణో:, స౦పన్నారాయణ స్మృతి:

    "జగత్తు లోని విపత్తు విపత్తు కాబోదు; జగత్తు లోని స౦పదా స౦పద కాబోదు.భగవ౦తుణ్ణి మరచిపోవడమే విపత్తు; భగవ౦తుడి స్మరణే స౦పత్తు.
    ఒక్కసారి ఆ ఆపద్భా౦ధవుని పాదాలను ఆశ్రయిస్తే ఎలా౦టి ఆవేదన మన దరి చేరదు."
    ’స్మరణ’ అనేది ’నవవిధభక్తి’లో ఒకటి. నా బ్లాగు చూసి, స్మరణ బ్లాగు చూసే అదృష్ట౦ కలిగి౦చిన౦దుకు ధన్యవాదాలు భారతిగారూ! ’రామ’ మ౦త్రాన్నిచాలా హృద్య౦గా,చక్కగా వివరి౦చారు అభిన౦దనలు. జై సాయిరా౦.

    రిప్లయితొలగించండి
  2. స్మరణ బ్లాగ్ని చూసి, చక్కటి వ్యాఖ్యతో మీ స్పందనను తెలిపినందుకు ధన్యవాదాలు వేద (విశాలాక్షి)గారు!

    రిప్లయితొలగించండి
  3. భగవత్ నామజపం చేయువారు పాపములన్నియు అగ్నియందు కట్టెలు భస్మమగునట్లు అగునని అంటారు. అలానే శ్రీరామ నామజపం చేయువారు ఎంతపాపం చేసినను ఆ పాపమునుండి విముక్తులగుదురని అంటారు కదా. అలానే 'జపతో నాస్తి పాతకం' అన్న శాస్త్రవచనం కూడా ఉంది కదండీ. అంటే ఏ పాపం చేసిన పర్వాలేదు కదండీ. భగవత్ నామధ్యానాలతో ఆ పాపం పోగొట్టుకోవచ్చు కదండీ?

    రిప్లయితొలగించండి
  4. రామ నామ మధుర రస ధార సేవనా

    నంద మహిమ లెన్న నాతరంబె

    సాయి రాము డనగ సర్వోన్నతుడ వీవె

    శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !


    శ్రీ రాము పత్ని , జనకజ ,

    గారాముల భూమి పుత్రి , కమనీయ ,దయా

    వారాశి , సీత నీవయి

    కారుణ్య రసాబ్ధి దేల్చి కావర సాయీ !


    శ్రీరాము బంటు , అంజని

    గారాముల కూర్మి సుతుడు , కరుణాంబుధి , మా

    కారాధ్యు డైన మారుతి

    నీరూపున గాంచు వరము నియ్యర సాయీ !

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత గారు,
    మీ ప్రశ్నకు జవాబు నాకు తెలిసినంతవరకు తదుపరి టపాలో పెట్టాను. చూడగలరు.

    రిప్లయితొలగించండి
  6. నామరూపాలు ఎన్నైనను అన్నింటా ఆరాధ్యమూర్తిని దర్శించడం ...
    ఇదో అనిర్వచనీయమైన భక్తానుభూతి.
    చక్కటి పద్యాలతో స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టారు గారు!

    రిప్లయితొలగించండి
  7. భారతి గారు, చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదములండి.


    రిప్లయితొలగించండి
  8. అనూరాధ గారు,
    ప్రతీ పోస్ట్ ను చదివి మీ స్పందన తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి