15, మార్చి 2014, శనివారం

ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అందేది ???


ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అందేది ఏమిటో తెలుసుకునే ముందు అప్పుడప్పుడు నేను విన్న రామనామ మహత్తును ఓసారి  ఇక్కడ ప్రస్తావిస్తాను. 

పూర్వం ఓ రాజు తన వృద్దాప్యదశలో తాను ఎన్నో పాపాలను చేసినట్లుగా గ్రహించి, పశ్చాత్తాపం చెంది, ఏం చేస్తే తనకి నివృత్తి అవుతుందో తెలుసుకోవడానికి సమీప అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఓ ఋషి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఋషి కుమారుడు ఆశ్రమంలో ఉన్నాడు. రాజుగారి వేదన, తపన, ప్రార్ధన విని, ఆ ఋషి కుమారుడు "మూడుసార్లు రామనామం జపించు, నీ పాపాలన్నీ తొలగిపోతాయి" అని చెప్తుండగా; ఆశ్రమంకు వచ్చిన ఋషి తన తనయుడు చెప్పిన మాటలు విని, కోపంతో "రామనామాన్ని కించపరుస్తావా? ఒక్కసారి రామా  అంటేనే జన్మజన్మపాపాలు నశిస్తాయి కదా, మరి మూడుసార్లు జపించామంటవా? ఈ నేరానికి నువ్వు మరుజన్మలో ఆటవికుడుగా పుడతావు" అని శపించాడు. 
ఈ శాపాన్ని పొందిన ఋషితనయుడే రామాయణకాలంలో గుహుడుగా జన్మించినట్లు పెద్దలు చెప్తుంటారు. 

ఓ స్త్రీ తన భర్త మరణించడంతో ఎంతగానో విలపిస్తూ, శవయాత్ర వెంటే వెళుతూ అదే దారిలో ఉన్న తులసీదాసు ఆశ్రమం లోనికి ప్రవేశించి, ఆయనపాదాలపై పడి శోకించగా, జాలితో ఆమె భర్త శవమును సమీపించి, రామనామాన్ని జపించి కమండలంలోని జలాన్ని శవం మీద జల్లి జీవం పోశారు.  
అటులనే మరోసారి ఒక తులసిఆకుపై రామనామాన్ని వ్రాసి, ఆ ఆకును నీటిలోవేసి, ఆ తీర్ధంతో ఐదువందలమంది కుష్టురోగుల వ్యాధిని నయం చేసిన మహాత్ముడు తులసిదాసువారు. ఇటువంటి రామనామమహిమను తెలిపే మరో ఘటనను కూడా పెద్దలు ద్వారా విన్నాను. ఓ నదిలో కొట్టుకుపోతున్న ఓ శవం చెవిలో రామనామం లోని 'ర'కారాన్ని మాత్రమే ఓ సంతు జపించగా ఆ శవంలో జీవం వచ్చినట్లుగా విన్నాను.
రామనామమహత్యం గురించి మరింత వివరణ ఈ లింక్ లో - పరమపావనం - రామనామం 

అయితే ఇంతటి శక్తివంతమైన ముక్తిదాయకమైన నామధారి అయిన "శ్రీరామచంద్రుని అనుగ్రహం" అందుతుంది ఆంజనేయున్ని ఆశ్రయిస్తే. 
అందుకు నిదర్శనంగా కొన్ని ఘటనలు పరిశీలిద్దాం -

సీతాన్వేషణకై లంకకు వెళ్ళిన ఆంజనేయునికి విభీషణుడు పరిచయమయ్యేను. ఆంజనేయునితో సంభాషణమువలన ఎంతయో ప్రభావితుడై, రావణుని కొలువులో హనుమపక్షమున మాట్లాడి, ధర్మహితం పలికి, తిరస్కరింపబడి అన్నయైన రావణుని వీడి, శ్రీరామచంద్రున్ని శరణుజొచ్చెను. విభీషణుడుని తమ పక్షమున చేర్చుకొనువిషయమందు సుగ్రీవుడు ప్రతిఘటించిన శరణాగతరక్షణుడు రాముడు నిర్ణయం విని అమితానందంతో విభీషణుడుని రామునిసన్నిధికి చేర్చింది ఆంజనేయుడే. 

సముద్రంపై సేతునిర్మాణము గావించుచున్నప్పుడు హనుమ అసంఖ్యాకములైన పర్వతములను పెకిలించి తెచ్చెను. ఆ క్రమంలో ఉత్తరమున ఉన్న మరియొక పర్వతమును పెకిలించి తీసుకొస్తుండగా,  సేతునిర్మాణము పూర్తియయ్యెను అన్న సమాచారం అందుకోవడంతో ఆ పర్వతమును అక్కడే వదిలివేచెను. కానీ, ఆ పర్వతం హనుమను ఇట్లు ప్రార్ధించెను - 'హనుమా! నీ కరకమల స్పర్శను పొందియు కూడా భగవానుని సేవకు దూరము అయిపోవుటకు నేను ఏమి అపరాధము చేసితిని? నన్ను ఇక్కడ విడనాడవలదు. నన్ను కొనిపోయి భగవానుని చరణారవింద సన్నిధియందే పడవేయుము, అప్పుడే నాకు సార్ధకత' అని వేదనతో వేడుకోగా; ఆ మాటలను విన్న హనుమా ఇలా అనెను ... 'గిరిరాజా! నీ నిష్టను చూడగా నిను కొనిపోవాలని నాకున్నను ఇక పర్వతములు తేవలదని రాముని ఆదేశం వచ్చినది. కానీ, నీ కోరికను స్వామికి విన్నవించెదను' అని చెప్పి వెడలి, రాముని సన్నిధికి చేరి ఆ గిరివరుని కోరికను తెలపగా, రామప్రభువిట్లనెను - 'హనుమా! నీ చేతిస్పర్శచే పునీతుడైన ఆ గిరివరుడు నాకు అత్యంత ప్రేమపాత్రమైనవాడు. నేను ద్వాపరయుగమందు శ్రీకృష్ణుడనై యవతరించి సప్తదినముల పర్యంతము ఆ గిరివరుని నా చిటికినవ్రేలిపై నిలిపి నాకార్యమునకు వినియోగించుకొందునని పోయి అతనికి తెలుపుము' అని పలుకగా, హనుమ మరల ఆ గిరివంతుని దరికి కేగి స్వామి సందేశమును తెలిపెను. హనుమంతుని కృపవలన ఈ విధంగా పరమాత్మానుగ్రహంకు పాత్రమైన ఆ గిరియే గోవర్ధనగిరి. 

మహాభక్తుడు గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసేవారు. ఆయన ప్రతిదినము కాలకృత్యములకొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదట్లో పోసెడివారు. ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై, 'నాకు విమోచనం కల్గించినందుకు ప్రతిఫలంగా ఏమైనా అడుగు ఇస్తాన'ని అనగా; మహాభక్తుడు తులసీదాసు "శ్రీరామ దర్శనం" కోరారు. 'ఆపని తనవల్లకాదని, ఓ ఉపాయం చెప్పిందాభూతం. నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు. (యత్ర యత్ర రఘునాధ కీర్తనం / తత్ర తత్ర కృత మస్తకాంజలిం)కన్నులనీరు కారుతూవుండగా (భాష్పవారి పరిపూర్ణ లోచనం)నందంగా రామాయణం వింటూ వుంటాడు. అతన్ని పట్టుకో, నీకు రామదర్శనం అవుతుందని చెప్పింది  భూతం. తన ప్రవచనాన్ని విని చివరిగా వెనక్కి మరలిన హనుమను వెంబడించి ఆయన పాదాలను పట్టుకొని ప్రార్ధింఛి, హనుమ సాయంతో శ్రీరామదర్శనం చేసుకొనెను తులసీదాసు. 

ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అపారమైన ఆంజనేయుని అనుగ్రహంతో పాటు ముక్తిదాయకమైన రామానుగ్రహం కూడా అందుతుందని పై ఘటనల ద్వారా తెలుస్తుంది. 



మరిన్ని వివరణలు మరోటపాలో ...  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి