9, ఆగస్టు 2019, శుక్రవారం

నా జీవన గమనంలో కొన్ని దివ్యక్షణాలు - శ్రీ సొరకాయలస్వామి సమాధి చెంత


చాలాసార్లు తిరుపతి వెళ్ళాను. కానీ, ఏనాడు నారాయణవనం వెళ్ళలేదు. నారాయణవనం తొండమాన్ చక్రవర్తుల రాజధాని. తిరుమలకు సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
 నారాయణవనం - 
ఆకాశరాజు పుత్రిక 'పద్మావతి'గా శ్రీమహాలక్ష్మి బంగారుపద్మంలో ఆవిర్భవించిన  దివ్యధామం. 
సప్తగిరివాసుడు 'ఎరుకులసాని'గా తిరువీధుల్లో తిరుగాడిన పుణ్యక్షేత్రం.   
శ్రీనువాసుడు అక్కడే ఆమెను పరిణయమాడి, మామగారి కోరికమేరకు శ్రీ కళ్యాణ వేంకటేశ్వరునిగా కొలువైయున్న దివ్యక్షేత్రము నారాయణవన(ర)మని తెలిసినా ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ, క్రిందటినెల తిరుపతి వెళ్ళడం, అనుకోకుండా నారాయణవనం వెళ్ళి శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామివారిని దర్శించించుకోవడం జరిగింది. అయితే నారాయణవనం వెల్దామని అనుకున్నప్పుడు యాదృచ్చికంగా శ్రీ సొరకాయల స్వామివారి సమాధి అక్కడ ఉందని తెలిసింది. వారి పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్లో, చదివినట్లో లీలగా గుర్తుంది కానీ, వారి గురించి ఏ వివరణ తెలియదు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం తర్వాత అక్కడ వారిని అడిగి, రాజగోపురంనకు ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయున్ని దర్శించించుకొని, ఆ ప్రక్కనే యున్న సొరకాయస్వామి సమాధి చెంతకు చేరాం. చేరాక అదో దివ్యానుభూతి. మేం వెళ్ళింది గురుపౌర్ణమి నాడు. మేం వెళ్లే సమయంలో అభిషేకం జరుగుతుంది. సిద్ధపురుషుల సన్నిధి మనోశుద్ధి చేసి స్వభావ  ప్రభావం నుండి బయట పడవేసి మనసును అంతర్ముఖం చేస్తుందని వీరి సమాధి చెంత నా స్వీయానుభవం. అభిషేకం హారతి అయిన తర్వాత, మావారు తట్టి  పిలవడంతో తిరుగుప్రయాణంకై చాలా కష్టపడ్డాను. మనస్సులో అక్కడే ఉందామన్న భావన. ఒకవిధమైన పరితపన. తిరుగుపయనమప్పుడు సొరకాయస్వామివారి అనుగ్రహ కటాక్షం. ఓ దివ్యానుభవం. ఆ అనుభవం అనిర్వచనీయం. ఆ దివ్యానుభూతి అవ్యక్తం, అక్షరీకరించలేను. కానీ, వారి గురించి చిరు మాత్రమేనా స్మరణలో స్మరించుకోవాలనే ఈ టపా -   

సొరకాయ స్వామి ఎక్కడివారో, ఎప్పుడు ఎక్కడ పుట్టారో, ఎవరికీ సరిగ్గా తెలియదు. 1902 లో ఈ స్వామివారు మద్రాసులో వియతిరాజు నాయుడు ఇంట్లో ఒకరు అడిగిన ప్రశ్నకు తన వయస్సు 500 సం|| అని తెలిపారట. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళే పుత్తూరులో 12వ శతాబ్దం మధ్యభాగంలో కట్టించిన సత్రంలో స్వామివారి ప్రస్తావన ఉన్నట్లు కధనం. దీనిని బట్టి స్వామిగారు 1700 లో జన్మించినట్లు చారిత్రక నిర్ణయం.  

తలపైన పెద్ద తలపాగా, మోకాలివరకు చిరుగులపంచ, నొసటన తెల్లని నామాల నడుమ ఎర్రనినామంతో, భుజాన ఖాళీ సొరకాయల బుర్రలు తగిలించుకొన్న ఓ కావడి వేసుకొని తిరుగుతుంటే, మామూలువారు మొదట పిచ్చివాడన్నారు (అవధూతలను గుర్తించే సామర్ధ్యం సామాన్యులకుండదు). మహిమలు ప్రకటితమౌతుంటే సొరకాయస్వామి అని కొలవడం ప్రారంభించారు. ఎప్పుడూ భుజంపైన వేలాడే సొరకాయలతో ఉండే స్వామి కనుక భక్తులు ఆయనకు సొరకాయస్వామి అని పిలుస్తుండేవారు. వీరి వెంట రెండు కుక్కలు ఉండేవి. అలానే వీరి చెంత చిన్నగొడ్డలి ఉండేది. దానితో ఎండుకట్టెలు కొట్టి తెచ్చి అగ్నిగుండం (ధుని) వెలిగించేవారు. ఆ ధునిలోని విభూదే భక్తులకు దివ్యౌషధం. శుకమహర్షి అంశగా అవతరించినాయన అని ఆయనను ఆశ్రయించినవారి అభిమతం. 

తిరిగి వచ్చాక వారి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో శ్రీ నండూరి శ్రీనివాస్ గారి విడియోలు యూట్యూబ్ లో చూడడం జరిగింది.  వారికి మనసార నమస్సులు. 




అటుపై ఇంకా తెలుసుకోవాలన్న ప్రయత్నంలో పూజ్యులు డా. వేదవ్యాసగారి పుస్తకం చదివాను. అందులో వేదవ్యాసవారు,  
"ఇహలోక స్పర్శలేని అంతఃపరిశుద్ధితో సదా బ్రహ్మయందే లగ్నంమయ్యే యోగస్థితిలో ఉండే శుకబ్రహ్మ అంతటివారు ఈ సొరకాయస్వామి" అని చెప్తూ -  
తన విచారణలో తెలుసుకున్న లీల గురించి వారు ప్రస్తావించారు. అదేమిటంటే - తిరుపతి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో సొరకాయలస్వాములవారు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి మాయమయ్యారట. సొరకాయలస్వామి అలా అదృశ్యమవ్వగా, ఆయనకై తపించే భక్తులు  కొందరు గుడికి ఎదురుగా కూర్చొని విలపిస్తూ పిలవగా పిలవగా "ఓ" అంటూ లోపలనుండి బయటకొచ్చారట. లోపల స్వామివారు పట్టుకొని ఆపేశారు. అందుకని ఉండిపోయాను అన్నారట. 

'స్వభక్తేఛ్చయా మానుషం దర్శయంతం' అంటే భక్తుల కోరికవలన మానుషరూపంలో కనబడతారు సద్గురువులు, అవధూతలు. నిరంతరం ఆత్మానందంలో ఉండేటటువంటి బ్రహ్మస్వరూపులు. సదా ఆత్మస్థితిలో ఉండే నిత్యానందపరులు. దయాస్వభావులు, సర్వోపకారులు, వాక్శుద్ధి, సంకల్పశక్తి, దివ్యదృష్టి కలవారు. ఆత్మయే తానని దృఢ ప్రజ్ఞతో నిశ్చలంగా తాను తానై నిలచియుండువారే అవధూతలు.    

స్వామి వారి మహిమలు తెలిశాక నాకు అర్ధమయ్యింది - మానవులు తరించటం కోసం తాను పరబ్రహ్మ స్థితిలో ఉంటూనే, మానుషస్వరూపంలో భూలోకంలో తిరుగాడిన అవధూతలలో ఒకరు ఈ సొరకాయస్వామి వారని.    
అనాధలను, దీనులను, హీనులను, రోగులను ఆదుకునే సంఘటనలు అనేకం. సాధ్యంకాని రోగబాధితులకు ఆకులు అలములు విభూదినిచ్చి బాగుచేసేవారు. అయితే ఈ అద్భుతాలు మహిమలు సామాన్య జనోద్ధరణకు. ఒకోసారి వీరి మానవాతీత శక్తిని ప్రసరించే మాటలు నర్మగర్భమై ఎవరికీ అర్ధమయ్యేవి కావట. యోగవిద్యారహస్యాలను యోగ్యులకు బోధించేవారట. సద్గతిని చూపేవారట. బ్రహ్మజ్ఞానాన్ని కోరినవారు కొద్దిమందే. సర్వస్య శరణాగతి చేసి సాధన చేసేవారు కొందరే. మహిమల మహత్యం కంటే వారు సూచించే మార్గం మీద దృష్టి పెట్టిన గట్టివారు కొందరున్నారు. ఆ కొందరిలో కొందరు సాదు సంతులు వీరే... 
శ్రీ ముంత పరదేశి అనే వారికి దృష్టిపాతంతో చక్షుదీక్షద్వారా బ్రహ్మజ్ఞానంను ప్రసాదించిరి.   
తిరుత్తణి నకు కొద్దిదూరంలో కుమారకుప్పం అనే గ్రామంలో గోవిందరెడ్డి గారికి ఇచ్చిన మంత్రదీక్ష ద్వారా యోగవిద్యను అనుగ్రహించి తనంతట వారిలా తయారుచేశారు. ఈయనే క్రమేణా కుమారకుప్పం స్వామిగా ప్రసిద్ధులైనారు. యోగమార్గంలో ఉన్నతోన్నత స్థాయిలధిగమించి గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు. దీన దుఃఖితులకు ఆసరై నిలిచారు.  
ఆపై మాటలమ్మమడుగుస్వామి, చట్టిపరదేశి, మంగమ్మ, నందనారు స్వామి తదితరులెందరకో దివ్యత్వాన్ని అనుగ్రహించిన అవధూత శ్రీ సొరకాయల స్వామివారు.  
రత్నసభాపతిపిళ్ళే, నారాయణ స్వామినాయుడు, చెంగల్వరాయ మొదలియార్, సుందరాసుబ్బారాయుడు మొదలియార్ తదితరులు స్వామిభక్తులై తరించినవారు. 

సొరకాయలస్వామి ప్రతీరోజూ, అరుణానది (ఆరణీ నది) నుండి ఒక గులకరాయిని తెచ్చి, శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయమునకు ఎదురుగా కాస్త కుడివైపున ఒక స్థలంలో వేసేవారట. చిన్న రాళ్లగుట్టగా తయారయిన ఆ స్థలమే తనను సమాధి చేయవలసిన చోటు అని అందరితో చెప్పేవారు. ఆ చోటనే 1902 ఆగష్టు నెల 9వ తేదీ శ్రావణ శుద్ధ పంచమి (గరుడపంచమి) శనివారం రోజున సమాదిగతులైనారు. శ్రీ పద్మావతి అమ్మవారు బంగారుపద్మంలో ఆవిర్భవించిన పవిత్రస్థలంలోనే ఆయన సమాధి వెలిసిందని కొందరు చెప్తుంటారు. 

ఆ సమాధి పైనే మందిరం నిర్మించారు. సమాధికి ఎదురుగా సొరకాయస్వామి వెలిగించిన ధుని ఉంది. సమాధిమందిరం చుట్టూ సొరకాయల్ని భక్తులు వేలాడదీస్తుంటారు.
ఇక్కడ అభిషేకార్చనలతో పాటు పౌర్ణమి అమావాస్యలనాడు విశేషపూజలుంటాయి. సమాధిగతులైన ఈరోజున విశేష ఆరాధనోత్సవం ఉంటుందట. 

శ్రీకల్యాణవెంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రధాన రాజగోపురం ఎదురుగావున్న వీధి చివర్న శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం ప్రక్కన మహనీయుడైన సొరకాయస్వామి అవధూత సమాధి అవశ్యం దర్శనీయమైన దివ్యమందిరం.


నారాయణవనంలో  శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారిని సందర్శించే భక్తులకు, అవధూత శ్రీ సొరకాయలస్వామి మందిరం కూడా దర్శనీయ స్థలం. స్వీయానుభవంతో చెప్తున్నా - శక్తివంతమైన మహిమాన్విత స్థలమిది. తప్పక దర్శించి తీరవలసిన పవిత్ర గురుసన్నిధి.





13 కామెంట్‌లు:

  1. మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. అవధూతలంతా సామాన్యుఅకు పిచ్చివాళ్ళలాగే కనపడతారు.
    మంఇ పరిచయం చేసారు. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారమండి.
      బాగున్నారా?
      మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు

      తొలగించండి
  3. అనుభూతిలో మమైక్యం చెందటమే దైవ దర్శనం. మంచి సమాచారం. ఈసారి వెళ్ళినప్పుడు తప్పక దర్శనం చేయాలని వుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మహిమాన్విత ప్రదేశం. తప్పకుండా దర్శించండి వనజగారు.

      తొలగించండి
  4. ఓం సొరకాయ స్వామి నమః

    రిప్లయితొలగించండి
  5. "భగవత్కధా శ్రవణమనే నావనెక్కి జనన మరణ రూపమైన సంసార సముద్రమును దాటి తరించు. సత్సంగమనే గంగలో మునకవేసి పవిత్రుడవు కమ్ము. సత్పురుషుల సన్నిధిలో, సంత్ పురుషుల పాదాలచెంత నా మనస్సుకు ప్రశాంతత దొరికినదని" మీరాబాయి గానం చేసింది. ఆ అనుభూతి కలిగింది స్వామి గురించి చదివి ,వీడియో చూస్తుంటే ....నారాయణవనం వెళ్ళి కూడా ఆ ఆశ్రమం గురించి తెలియక దర్శించుకోలేకపోయాము. అంటే స్వామి ఇలా అనుగ్రహించి తెలియజేసారనుకుంటా...అవధూతస్వామికి నమస్సులు. ఆధ్యాత్మిక అనుభవాన్ని అందరితో పంచినందుకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.
      మీ పేరు తెలిపియుంటే బాగుండేది.

      తొలగించండి
  7. నమస్సులు ధన్యవాదాలు . బస్సు లో ఎలా వెళ్తాము . ట్రైన్ సౌకర్యం అందుబాటులో ఉంటే తెలియచేయగలరు

    రిప్లయితొలగించండి