19, ఏప్రిల్ 2021, సోమవారం

సదా స్మరణీయులు | సద్గురువులు (చతుర్ధభాగం)

జన్మతః సంస్కారవంతమైన శ్రీమంతుల ఇంట్లో పుట్టినా, సద్భ్రాహ్మణుడు అయిన, దురదృష్టం కొద్ది చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, అనాధగా మేనమామ దగ్గరకు చేరిన వెంకన్నను, ఆస్తి మీద తప్ప మేనల్లుని మీద ప్రేమలేక నిరక్షరకుక్షిని చేసి, తన పశువుల కాపరిగా చేసుకొన్నాడు, ఆ మేనమామ. ప్రతీరోజు అకారణంగా మేనమామ అగ్రహానికి గురౌతూ, అమాయకత్వం చదువురానితనంతో తోటివారి పరిహాసానికి లోనవుతూ, వెంకన్న భారంగా రోజులు గడుపుతుండగా-  


తమ దిగ్విజయయాత్ర సాగిస్తూ శ్రీ రాఘవేంద్ర స్వామివారు అదోని సమీపంలో కందనాతి అనే గ్రామంలో ప్రవేశించడం...వారి దృష్టిలో ఈ వెంకన్న పడటం...గురువుగారి అనుగ్రహానికి పాత్రులై చదువుకోవాలనే తన కోరికను తెలపటం "నువ్వు ధన్యుడవయ్యా! మాకు, ఆ సర్వేశ్వరుడు శ్రీహరికి ఆప్తుడవయ్యావు, నీకు శ్రేష్ట జీవితం లభిస్తుంది, భవిష్యత్తులో ప్రియమైన దివ్యసేవలొనరించి తరిస్తావు" అని మనసారా దీవించి, స్వామివారు తమ సంచారాన్ని కొనసాగించారు.


కొద్ది రోజుల అనంతరం -  పన్ను వసూళ్ళ నిమిత్తం సైన్యసమేతంగా బయలుదేరిన అదోని నవాబు, ప్రయాణంలో భాగంగా కందనాతి గ్రామ మార్గంలో ప్రవేశిస్తుండగా, ఓ వార్తాహారుడు కలుసుకొని రెండులేఖలు యివ్వటం, చదువురాని కారణాన్న... ఎవరైన బ్రాహ్మణుడుని చూసి తీసుకురమ్మని భటుడుని ఆదేశించటం -
అదే సమయంలో వెంకన్న పశువులను మేపుతూ, ఈ భటునికి కనబడటం...'ఏయ్! బొమ్మాన్! మా హుజార్ రమ్మంటున్నారు రా' అని, ఎందుకు రమ్మంటున్నారో ఏం తప్పు చేసానో అని భయపడుతున్న వెంకన్నను, దగ్గరుండి ఆ భటుడు తీసుకువెళ్ళడం, వెంకన్నను చూసిన నవాబు 'నీవు బ్రాహ్మణుడివే కదా' అని అడగడం, 'అవున'ని వెంకన్న బదులివ్వగా, 'అయితే వెంటనే ఈ రెండు లేఖలు చదువు, ఈనాము ఇస్తామ'ని అనడం, భయపడుతూ 'తనకి చదువు రాద'ని వెంకన్న చెప్పడం, 'అరే దూత్! మా దగ్గర అబద్దాలు చెప్తావ్, నీవు బొమ్మన్ వై వుండి నీకు చదువు రాదంటావ్, మా దగ్గర వేషాలా, మర్యాదగా చదువ్, జల్దీగా చదువ్ లేదంటే ఏనుగుల పాదాల కింద తొక్కి పడేస్తామనగా...
విపరీతంగా భయపడిపోతున్న వెంకన్నకు, శ్రీ రాఘవేంద్రుల వారు ఆశీర్వదిస్తూ "ఆపద సమయంలో మమ్ము, మా మూలరామున్ని తలచుకో" అన్న మాటలు గుర్తుకు వచ్చి, గట్టిగా శ్రీ రాఘవేంద్ర సార్వభౌమా అని, ఆ రెండు లేఖలను గడగడ చదవడం... నవాబుగారికి ఇది ఆశ్చర్యం కల్గించింది. విషయం ఏమిటని అడిగి తెలుసుకొని, అచ్ఛా... అంత మంచి స్వామా, మంచిది... అదోని రా, ఈనాము తీసుకో, లేదో అని గద్దించేసరికి... వస్తానని చెప్పి, స్వామివారిని తలచుకుంటూ ఇంటికి తిరిగివచ్చి, ఎవరికి ఈ విషయం చెప్పినా, నమ్మక పరిహాసం చేస్తూ, వెళ్ళు వెళ్ళు అదోని అని అనడంతో... అదోని వెళ్ళడం, గురువర్యుల కృపను పొందిన వెంకన్న... నవాబుగారి ఆదరాభిమానాలను పొందడం, అనతికాలంలోనే నవాబు సిద్ధీ మాసూద్ ఖాన్ కు ప్రేమపాత్రుడై, అంచలంచెలుగా పదోన్నతి పొందుతూ అతి తక్కువ వ్యవధిలో దివాన్ అయ్యాడు. 

కాలచక్రం తిరుగుతుంది. కొంతకాల మనంతరం - 
శ్రీ రాఘవేంద్ర స్వామివారు అదోనిలో బస చేస్తారని తెలిసి, వెంకన్న తగు కానుకలతో, ఫల పుష్పాదులతో స్వామి వారిని దర్శించి, తన సర్వోన్నతికి కారణమైన గురువుగారికి సాష్టాంగ దండప్రణామములు చేసి, ఒకనాటి వెర్రి వెంకన్న నేడు దివాన్జీ వెంకన్న పంతులుగా ఎలా అయ్యాడో వివరంగా తెలపగా, పరమానందభరితులైన స్వామివారు "అంతా మూలరాముని దయ" అని, మంత్రాక్షతలను నొసగి ఆశీర్వదించారు.  

ఆ తర్వాత మరో సందర్భంలో - 
వెంకన్న, స్వామివారిని దర్శించి, 'మా నవాబు మీ దర్శనాన్ని ఆపేక్షిస్తిన్నారని, మీరు కరుణించి మీ దర్శనాన్ని ప్రసాదించండి' అని విన్నవించుకోగా, శ్రీ గురుతీర్ధులు "నిజముగా మీ నవాబు మమ్మల్ని దర్శించాలని తలిస్తే, తప్పక దర్శించవచ్చు" నన్నారు. ఆ వర్తమానం అందుకున్న నవాబు సిద్ధీ మాసూద్ ఖాన్, తగు కానుకలతో అరుదెంచి, స్వామివారికి నమస్కరించి, 'శ్రీ గురువులకు సలాం. మేము కొన్ని కానుకలు తెచ్చాం. నైవేద్యం తెచ్చాం, మేము తెచ్చిన నైవేద్యం మీరు మీ రాములవారికి నివేదిస్తారా'? ఆసక్తిగా అడిగాడు నవాబు. "తప్పక నివేదిస్తామంటూ, రాముడైన, రహీమైన అంతా ఒక్కటే. మనకే గానీ దేవుళ్ళకు ఆ తేడా లేదు" అని శ్రీ మూలరాముని పూజ అయ్యాక, సంస్థాన నైవేద్యములతో పాటు నవాబు తెచ్చిన నైవేద్యములు కూడా అర్పించబడ్డాయి. సంస్థాన నైవేద్యములపై కప్పిన శాటిని తొలగించి శ్రీ మూలరామునికి నివేదన చేస్తూ శ్రీ గురువర్యులు, "నవాబుగారు, మీరు తెచ్చిన నైవేద్యం పైన ఆ వస్త్రాన్ని తీయించండి" అని చెప్పగా, నవాబు తొట్రుపడుతూ 'మీరే తీయండి' అనగా, చేతిలోని పుష్ప మంత్రాక్షతలను చల్లి, ఎవరైనా వస్త్రాన్ని తొలగించండి అని గురువర్యులు మరల చెప్పగా, పళ్ళెరాలపై నున్న వస్త్రాన్ని తొలగించారు. 
                      
ఆ క్షణం వరకు మాంసపు ముక్కలతో నున్న నవాబు తెచ్చిన నైవేద్యం క్షణాల్లో పూలు పండ్లుగా మారిపోవడంతో... ఖంగుతిన్న నవాబు నన్ను కరుణించండి అని పదే పదే అర్ధించగా, "మానవునిని మాధవుడివి కమ్మన్న దేవుడిని మనం మరీ మూర్ఖులమై, అనునిత్యం పరీక్షిస్తూ, ఆత్మవంచన చేసుకుంటున్నామే తప్ప ఆ దివ్యశక్తిని ధర్మనిరతిని గుర్తించలేకపోతున్నాం" అన్న గురుదేవుల ప్రబోధం ముందు తలవంచి, తన అజ్ఞానముకు సిగ్గుపడ్డాడు. తనకి తెలియకుండా నవాబు చేసిన ఈ పనికి వెంకన్న బాధ పడుతుంటే, ఇందులో నీ తప్పు లేదని... అందరికీ తీర్ధ ప్రసాదములు ఇచ్చి సాగనంపారు శ్రీ గురుతీర్ధులు.

ఈ నవాబుగారే ఏదైన గ్రామాన్ని శ్రీ గురుతీర్ధుల వారికి సమర్పిందామనుకోవడం... దివాన్ వెంకన్న ద్వారా ఈ విషయం గురువర్యులవారికి తెలపడం..... తుంగభద్రానది తీరంలోని మంచాల గ్రామాన్ని సమర్పించుకోమని శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారు చెప్పడంతో, తగు విధాన దానశాసనం చేయించి శ్రీ మూలరాముని సేవలకుగాను మంచాల గ్రామమును సమర్పించిరి.  శ్రీ గురుతీర్ధుల వారు ఆ గ్రామంలో ముందుగా తమ కులదైవమైన శ్రీవేంకటేశుని ప్రతిష్టించుకొని దాని చెంతనే తాము నివసించటానికి వీలుగా ఒక ఆశ్రమమును నిర్మించుకున్నారు. మంచాల గ్రామం పరమ పవిత్ర పుణ్య దివ్యక్షేత్రం. కృతయుగంలో ప్రహ్లాదుడు అనేక యజ్ఞాలు చేసిన స్థలమిది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మను వెదుకుచూ సోదరుడు లక్ష్మణునితో కలసి వచ్చి కొన్ని ఘడియలు పాటు విశ్రాంతి తీసుకోగా, వారి పవిత్ర పాదధూళితో పరమ పవిత్రమైన స్థలమిది. ద్వాపరయుగంలో అనుసాల్వుని రాజధాని ఇది. అశ్వమేధ యాగమప్పుడు శ్రీకృష్ణార్జునులు నడయాడిన స్థలమిది. కలియుగంలో పరమ పూజ్య పరమాచార్యులు శ్రీ విభుదేంద్రతీర్ధులవారు విజయనగరాధీశుల నుండి ఈ గ్రామాన్ని పొంది, తమ దీర్ఘ తపస్సును గావించిన స్థలమిది. వెంకన్నా!  ప్రహ్లాద యజ్ఞదీక్షలతో, రామలక్ష్మణుల కృష్ణార్జునుల పాదధూళితో, శ్రీ విభుదేంద్రతీర్ధుల పుణ్య తపస్సుతో, పునీతమైన ఈ స్థలం భవిష్యత్తులో మాకు బృందావనమై అలరారబోతుంది అని ఈ గ్రామ విశిష్టతను తెలిపారు శ్రీ రాఘవేంద్రుల వారు.

నవలగుంద పర్యటనలో - అపౌరుషములైన వేదములను, సనాతన హిందు ధర్మ శాస్త్రాలను నిరశించే పరమ మూర్ఖుడైన శిరంగి దేశాయి గురించి తెలుసుకొని, అతనిని ఉద్ధరించదలచి పిలిపించి, "నాయనా! శ్రేష్టమైన మానవజన్మ నొందిన నీకు, వేద శాస్త్ర దూషణ, ధర్మ సమ్మతం కాద"ని హితవు చెప్తుండగానే... 'ఈ ధర్మపన్నాలు, కల్లబొల్లి కబుర్లు, శుష్కవేదాంతం, దైవ ప్రలాపములు వద్దని హేళనగా మాట్లాడుతూ...సరే, మీ వేదాలకు, మంత్రాలకు అంతటి మహిమా సంపత్తే కనుక వుంటే, మా యింటి ముందు నిలబెట్టిన రోకలిని చిగిరింప చేయమని, అప్పుడు అస్తికత్వాన్ని, మంత్రశక్తిని నమ్ముతా'నని అనడంతో - "తప్పక నీ మాట ఫలవంత మొనర్చెదము, నిన్ను అనుగ్రహించెదము, మా నిత్యార్చన శ్రీమూలరాముని సాక్షిగా, ఈ రోకలి చిగురిస్తుంద"ని చెప్పి, తమ కమండలోదకమును దానిపై ప్రోక్షించి, నీకీ సత్యం నిత్యమై వరకు మేము ఇక్కడే వుందుము, అంతవరకు అవహేళన చేయడం ఆపమని చెప్పిరి. 
                         
మూడు రోజుల అనంతరం లేత చిగుళ్ళతో రోకలి కళకళలాడటం, శ్రీ రాఘవేంద్రుల తీర్ధులవారి దివ్యశక్తికి, మంత్ర మహిమకు దాసానుదాసుడై, తన అజ్ఞానపూరిత ప్రవర్తనకు క్షమించమని; చరణదాసుడై శరణాగతుడైనాడు శిరంగిదేశాయి.

శ్రీ విజయరాఘవ నాయకుల వారి కాలంలో - తంజావూరు సామ్రాజ్యంలో తీరని క్షామం ఏర్పడి, ధాన్యాగారం ఖాళీ అయ్యి, రాజ్యం అలకల్లోలమయ్యే స్థితిలో, విజయరాఘవ నాయకులు శ్రీ గురుతీర్ధులను దర్శించి రక్షించమని ప్రార్ధించగా, గురువర్యుల వారు కుంభకోణం నుండి తంజావూరు వచ్చి, ధాన్యలక్ష్మి నివాసమైన ధాన్యాగారం సందర్శించి, 
                          
శ్రీ చక్రముంచి "తల్లీ! నీ బిడ్డల ఆకలి బాపు, అక్షయమూర్తివై కరుణించు, ఈ రాజ్యాన్ని సుసంపన్నం చేయు" అని ప్రార్ధించి, పిమ్మట శ్రీ మూలరామున్ని పూజిస్తుండగా, వరుణదేవుడు అనుగ్రహించి వర్షం కురిపింపజేయడం, ఆపై గురుదేవుల సూచన మేరకు సుదర్శన హోమం చేసి అంతా ఆనందభరితులైరి.

ఒకనాడు తుంగభద్రలో స్నానమాచరించి వస్తున్న శ్రీ గురువర్యుల చెంతకు ఓ వ్యక్తి వచ్చి, 'మీ కరుణ ప్రసరిస్తే సర్వం సమకూరుతాయని మీ భక్తులు చెప్తుంటారు, నన్ను కరుణించండి. నాకు డబ్బులివ్వండి, నేను పెళ్ళి చేసుకోవాలి, డబ్బు కావాలి, డబ్బులు లేకుంటే పిల్లనెవరిస్తారు అని అమాయకంగా అడుగుతుంటే... "చూడు నాయనా! మావద్ద మృత్తిక తప్ప డబ్బెందుకుంటుంది" అని స్వామివారు అనడంతో, ఆ మట్టే ఇవ్వండి, మీరు ఏది అనుగ్రహించిన, దాంతో చిత్రాలు జరుగుతాయట. అది మీచేతి మహత్యమట'... అనగానే, "సరే, నీ పై పంచను పట్టు" అని మూడుగుప్పిళ్ళతో తమ పాదాల వద్ద నున్న మృత్తికను పై పంచలో పోశారు. మహాప్రాసదం అని కళ్ళకద్దుకొని జాగ్రత్తగా మూట కట్టుకొని వివాహం చేసుకొని మళ్ళీ వస్తానని చెప్పి, అక్కడ నుండి బయల్దేరెను ఆ వ్యక్తి. చీకట్లు బాగా ముసురుకునే సమయానికి ఓ గ్రామం చేరుకొని, ఆ ఊళ్ళోని ఒక ఇంటి అరుగుమీద కూర్చొని, కాస్త విశ్రాంతి తీసుకుందామని నడ్డి వాల్చాడో లేదో... ఇంట్లోంచి అరుపులు...ఈ బాధ భరించలేను, ప్రతీ మాటు ప్రాణాంతకమే, పుట్టినవాళ్ళు పుట్టినట్లు చస్తుంటే మోడులా బ్రతకాల్సి వస్తుందని అని లోపల ఏడుస్తున్నారెవరో. కాస్త ఓపిక పట్టు, సుఖ ప్రసవం అవుతుందని ఓదారుస్తున్నారు మరెవరో...ఇవన్నీ అరుగుమీద కూర్చొని వింటుండగా - 
అదే క్షణమున దూరంగా ఎవరో నిల్చొని, 'చూడు నాయనా, ఇక్కడ నుండి వెళ్ళిపో లేదా నీ దగ్గరున్న ఆ మూటనైన దూరంగా విసిరేయ్' అని చెప్తుంటే...నేను పారేయను నీవెవరవు అని ఈ వ్యక్తి అడగగా, నేను బ్రహ్మరాక్షసుడును...ఆ మూట పారేయకపోతే నిన్ను మ్రింగుతా అని అరిచాడు. అన్నింటికీ భయపడే వాడైనా, గురువుగారిచ్చిన మృత్తిక మహిమ వలన ధైర్యంగా...  'ఓహో! అలాగా, నా దగ్గర ఉన్న మట్టి మూటనే పారేయ్ అని చెప్పే నీవు, నన్ను ఏం మ్రింగుతావులే అని తాపీగా అంటూ, నన్నెందుకు ఈ ఇంటి దగ్గర నుండి వెళ్ళిపొమ్మంటున్నావు? ఈ ఇంటి వారితో నీకేం పని' అని అడగగా, ఈ ఇంటి వారికి నాకు విరోధం. ఈ ఇంట్లో పుట్టిన ప్రతీ శిశువు నాకాహారం కావాలి, ఇప్పుడు శిశోదయం కాబోతుంది, నేను భక్షించడానికి లోపలికి వెళ్ళాలి. తప్పుకో అని రాక్షసుడు చెప్తుంటే.....
'అయితే నేనేం అడ్డు వెళ్ళు లోపలకి' అన్నాడు వెంకన్న. నీ దగ్గర వున్న మూట అగ్నిగోళమై నన్ను లోపలికి రానీయటం లేదు, అందుకే నీవేనా వెళ్ళిపో, లేదా ఆ మూటను దూరంగా పారేయ్ అని రాక్షసుడు అనడంతో, 'ఇది నా గురుదేవుల మహాప్రాసదం. నేను ఈ మూటను పారేయను, ఆకలి వేస్తుంది, నీరసంగా ఉన్నాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, నాకు డబ్బు కావాలి, పెళ్ళి కావాలి అనడంతో... వెంటనే మాయమైన రాక్షసుడు కాసేపటికి తిరిగి బుట్టనిండా ఆహారం లంకెబిందెలతో ప్రత్యక్షమై, ఇవి తిని, ఈ సంపద తీసుకొని ఇక్కడనుండి త్వరగా వెళ్ళిపో అని బ్రతిమలాడగా, సుష్టుగా తిని నీ మేలు మరచిపోలేను అంటూ మూటలో కొంత మృత్తికను తీసుకొని -
                        
'గురు రాఘవేంద్రా, ఈ రాక్షసుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే సావకాశన్నివ్వండి' అని ప్రార్ధించి, భయంతో పారిపోతున్న బ్రహ్మ రాక్షసుడుపై మట్టిని విసిరాడు. అంతట ఆ రాక్షసుడు పూర్వ స్వరూపమును పొంది, శాపవిముక్తిని కల్గించినందుకు ధన్యవాదములు తెలుపుకుంటూ అంతర్ధాన మవ్వగా, ఇంటి లోపల ప్రసవం జరగడం, బయట జరిగింది తలుపు చాటుగా ఆ ఇంటి యజమాని వినడం, ఆ యజమాని వెలుపలకు వచ్చి వెంకన్నను అన్ని వివరాలు అడగడం, రాక్షసుని బారి నుండి రక్షించి తన వంశమును నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ తన అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం, అంతా కలసి శ్రీ గురుతీర్ధుల వారిని దర్శించుకుని, ఆశీస్సులు పొందడం జరిగింది. ఎన్నెన్ని మహిమలో శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారివి.

తమ ప్రయాణ గమనంలో భాగంగా హుబ్బిళి (హుబ్లి) వచ్చినప్పుడు -
                        
నవనూరు నవాబు ప్రియపుత్రుడు పాముకాటుతో మరణించాడన్న వార్త విన్న తక్షణమే గరుడమంత్ర జపంతో విషహరణం గావించి ప్రాణం పోసి దీవించారు.

శ్రీ రాఘవేంద్రుల వారి చివరిబోధ తదుపరి టపాలో - 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి