10, జూన్ 2021, గురువారం

గంగానది - స్ధల మాహాత్మ్యం

గంగాది పుణ్యనదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్తుంటారు కదండీ.

ఇలా పాపం పోతే వెళ్ళి మునిగేస్తే సరిపోతుంది...పాపం పోతుంది. సులభంగా పాపాలను ప్రక్షాళన చేసుకొని తరించే సౌలభ్యముంటే ప్రత్యేక పరిహారాలు సాధనలు ఎందుకు? 

అలాగని పాపాలు పోతాయని పెద్దలు శాస్త్రాలు చెప్పే మాటలు అసత్యమని అనలేం కదా. ఇందులో ఏదో రహస్యం ఉంది.

అదేరీతిలో చేసే దుష్కర్మలవలన కలిగే పాపాలు, పుణ్యనదుల్లో స్నానాలతో పోతే, మరి కర్మఫలం అనుభవించక తప్పినట్లే కదండీ. కర్మఫలం అనుభవించక తప్పదంటారు. మరి ఈ స్నానాదుల వలన అది సాధ్యమా? కర్మఫలలు తప్పించుకోగలమా?

అందరూ తమ తమ పాపాలను పుణ్యనదుల్లో వదిలేస్తే, ఆ పాపభారాన్ని నదులు ఎలా భరిస్తున్నాయి? 

మరో సందేహం - స్థల మాహాత్మ్యం గురించి. కొన్ని చోట్ల ధ్యానం బాగా కుదురుతుందని, కొన్ని స్థలాల్లో కుదరదని అంటారు చాలామంది. నిజంగా స్థల బేధాలు,   ఉంటాయా? స్థల మహత్మ్యం ఉంటుందా?

ఇవి మిత్రురాలు పద్మగారి సందేహాలు. పూర్తిగా సమాధానాలు తెలియకున్న తెలిసినంతలో తెలిపే ప్రయత్నం - 

పుణ్యనదుల్లో స్నానం చేస్తే పాపం పోతుందన్న పెద్దల మాట అసత్యం కాదు గానీ, వారు అది మాత్రమే చెప్పలేదు. కొనసాగింపుగా చాలా చెప్పారు. 

ప్రధమమున ఇక త్రికరణశుద్ధిగా దుష్కర్మలను చేయనని సంకల్పం చెప్పుకొని, మౌనంగా దైవస్మరణతో, కేవలం ధ్యేయాకారంలో నుండి మూడుమార్లు మునకలు వేయమంటారు. మొదటిసారి మునుగుట వలన స్థూలదేహ సంబంధ మాలిన్యం, రెండవసారి మునుగుట వలన సూక్ష్మదేహా సంబంధ మాలిన్యం, మూడవసారి మునుగుట వలన కారణదేహా సంబంధ మాలిన్యాలు తొలగును. లేనిచో స్థూల శరీర మాలిన్యమే పోతుందని వారు చెప్పినది గ్రహించాలి.

తపసాకర్మాభిచైవ ప్రదానేన చ భారతా |
పునాతి పాపమ్ పురుషః పూతశ్చేన్న ప్రవర్తతే ||                                 - శాంతిపర్వం.
తపస్సు, యజ్ఞకర్మ, దానం ద్వారా మనిషి
తన పాపకర్మలని కడిగివేసుకోవచ్చుకాని అలాంటి కర్మలని మళ్ళీ చేయకూడదు.

అటులనే నదుల్లో స్నానమాచరించినప్పుడు సంకల్పం ద్వారా భావసిద్ధి పొంది, పిమ్మట శాస్త్రనిషిద్ధకర్మలు ఆచరించక, శాస్త్రవిహిత కర్మలననుష్టిస్తేనే పాపాలు తొలగుతాయి.
                      

మనోవాక్కాయ శుద్ధానాం రాజంస్తీర్ధం పదే పదే |
తధా మలినచిత్తానాం గంగాఽ పి కీకటాధికా ||

మనోవాక్కాయ శుద్ధి గలవారు గొప్ప తీర్ధస్వరూపులు. మనోవాక్కాయ కర్మలు శుద్ధంగా లేనివారు గంగలో స్నానమాచరించినను మాములు జలమున మునిగిన ఫలితమే పొందుదురు.

ఇకకర్మఫలంఎప్పుడుతప్పుతుందంటే -

"కర్మ కర్మణా నశ్యతి" కర్మ కర్మతోనే నశిస్తుంది.

పుణ్యక్షేత్రయాత్రలు, తీర్ధస్నానాలు, ఉపవాసాదివ్రతాలు, దానాలు... మొదలగు సుకర్మలు వలన కొంత పాపం తొలగుతుందన్నమాట వాస్తవమే. 
భగవత్  ధ్యానం వలన మానసిక
పాపం, భజన సంకీర్తనలతో వాచిక పాపం, ఉపాసన,  అర్చన యజ్ఞాదుల వలన శారీరకంగా చేసే పాపాలు, దానాల వలన ధనం కోసం చేసే పాపాలు పోతాయని పెద్దలు చెప్తుంటారు. సత్కర్మల వలన దుష్కర్మల ఫలితం అనుభవించకుండా కొంత తగ్గించుకోవచ్చు. అటులనే దుష్కర్మల వలన ప్రాప్తించే కష్టనష్టాలని దుఃఖాన్ని తట్టుకునేశక్తినో, ఇతరుల చేయూత ద్వారా అధిగమించే ప్రాప్తాన్నో పొందవచ్చు.

మహాత్ముల సద్గురువుల దర్శనం, వీక్షణం, అనుగ్రహం ఉన్నను, ప్రారబ్ధ పాపకర్మలు తొలగుతాయి. అందుకు ఉదాహరణలు ... శ్రీపాద శ్రీవల్లభులవారు, వెంకయ్య స్వామి, సొరకాయ స్వామి, షిర్డి సాయినాధులు, మాతా అమృతానందమయి చరితములో భక్తుల అనుభవాలే. శ్రీపాదులవారు ఓ భక్తునికైతే కలలోనే ప్రారబ్ధఫలం అనుభవించినట్లు చేసి కర్మక్షయం చేసారు. 

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః |
ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే ||

పరమశివుడు పార్వతీదేవికుపదేశించిన శ్లోకమిది. ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?
                   

ఆత్మానదీ సంయమతోయపూర్ణా సత్యహ్రదా శీలతటా దయోర్మిః |
తత్రావగాహం కురు పాండుపుత్ర న హ్యన్యధా శుద్ధ్యతి చాన్తరాత్మా ||
 
భీష్ముడు ధర్మరాజునకు చెప్పినది ఇది ... 

ఓ పాండుపుత్రా! సంయమమను జలముతో నిండినదియు, సత్యమను అగాధము కలదయు, సుశీలమను దరి కలదియు, దయయను అలలు గలదియగు ఆత్మయను నదియందు స్నానమాచరించుము. వేరు ఏ విధములగు తీర్ధములలో స్నానమాచరించినను, అంతరాత్మ శుద్ధి కాజాలదు.

అలాగని తీర్ధక్షేత్రాల దర్శనం వలన మహత్తు ఉండదని కాదు. అచ్చట అనేక మహత్ములుందురు. వారి దర్శనం వలన మనలో మార్పు రావొచ్చు. అలాంటి సత్పురుషులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తారని సందేహం వద్దు. గతంలో పుణ్యనదుల ఒడ్డున అనేక మంది మహర్షులు తపస్సు చేసినట్లు పురాణాది గ్రంధాల ద్వారా తెలుసుకున్నాం కదా. ఆ మహర్షుల తపశ్శక్తి ఇప్పటికీ సూక్ష్మంలో ఉంటుంది. సుగంధం అద్దుకున్న వస్త్రం ఆ సుగంధాన్ని పరిసరాల్లో ఎలా వెదజల్లుతుందో మహాత్ముల తపోమహిమ శక్తి అలానే అచ్చట ప్రకాశిస్తుంది. భక్తి వైరాగ్యములతో అక్కడికి పోవు పరిశుద్ధ హృదయులు ఆ పావన ఫలమందుకోగలరు.   

ఇక నదులు పాపభారాన్ని ఎలా మోస్తున్నాయ్... 
నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మిత్రురాలు విశాలను అడిగాను.

నదీమతల్లులు పాప భారాన్ని మోయలేనప్పుడు, పుణ్యాత్ములు వారి వద్దకు రావాలని కోరుకుంటారట...మహాయోగులు, సాధువులు, సిద్ధపురుషులు వచ్చి ఆయా నదులలో స్నానమాచరించి నపుడు ఆ నదులు ప్రక్షాళన అవుతాయి అని విన్నాను... అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చదువుతూ, 'అవునా' అని యధాలాపంగా బయటకు అన్నాను. ఏమిటి 'అవును' అని ప్రక్కనే ఉన్న మావారు అడగడం...ఈ నదీస్నానాలు గురించి చెప్తూ, ఆ నదీమతల్లులు ఈ పాపభారం ఎలా మోస్తున్నయో... అని అనగానే - 
ఆ...నేను ఎక్కడ చదివానో గుర్తులేదు గానీ, నీలాగే గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఇదే సందేహం వచ్చి గంగానదినే అడిగాడట... అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లీ...అని. అందుకా తల్లి మందహాసంతో - 
'నాయనా! నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను' అని బదులిచ్చిందట. 
వెంటనే, అయ్యో...అన్ని పుణ్యనదులు ఇంతేకదా...పాపాలన్నీ సముద్రంలోనే 
కలిపేస్తే... ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని సముద్రాన్నే అడిగాడు...ఎలా మోస్తున్నావు... ఈ పాపభారాన్ని అని. దానికా సముద్రుడు - 
'నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంటవెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాలోనికి పంపిస్తేస్తున్నాను' అని బదులిచ్చాడట. అరే ... ఎంతో తేకగా కదిలాడే మేఘాలకు ఎంత విపత్తు వచ్చింది... అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు... ఈ పాపభారాన్ని అని అగగా, అవి పకపకా నవ్వి - 
'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా...ఓహో...ఆ పాపలన్నీ మన  మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. కర్మఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట...అని చదివానని చెప్పారు. 'అవునా'... అని అనుకున్నాను మరల.
              

నిజానికి మన సంస్కృతీ సంప్రదాయాలు, ఋషుల వచనాలు, గంగాప్రవాహం లాంటివి. మనోమాలిన్యాలను ఎప్పటికప్పుడు కడిగివేసి అంతరంగాన్ని పరిశుద్ధ చేయగల సమర్ధత గలవి. కానీ, మనం అది గ్రహించక గంగనే కలుషితం చేస్తున్నాం.     

ధ్యానం ఎక్కడ కుదురుతుందని శాస్త్రం చెప్తుందంటే -   

ఏకాంతే విజనే రమ్యే గుహాయాం పుణ్యభూమిషు | 
రహితే మశకైర్దంశై ర్దేవాయతనకే  పివా || సిద్ధక్షేత్రే మహాతీర్ధే ధ్యానసిద్ధిః ప్రజాయతే |
తత్ర సిద్ధాసనం బద్ద్వా ఋజుకాయస్తు || 

ఏకాంతమందును, జనశబ్దంలేని ఇంటియందును, మనోహరమగు స్థలమందును, కొండగుహ యందును, పుణ్యభూమియందును, దోమలాది వాటిచే బాధలేని చోటునను, ​దేవపూజాదులు చేయు స్థలమందును, సిద్ధ క్షేత్రమందును, పుణ్యతీర్ధ తీరమందును ధ్యానం చేయువారికి, నిర్విఘ్నముగా ధ్యానం కుదురుతుంది. ధ్యానసిద్ధి సిద్ధించును.

స్థల భేదాలుంటాయా?

మీ ఈ ప్రశ్న చూడగానే... 
శ్రీ మళయాళ స్వామివారు గుర్తుకు వచ్చారు. ఆ స్వామివారు ఈ విషయంపై కొన్ని ఘటనలను వివరిస్తూ... చక్కటి వివరణ ఇచ్చారు. వారి వివరణే ఇక్కడ తెలియజేస్తాను. 
స్థలకాలభేదములు లేనిచో పుణ్యభూమి, పుణ్యకాలం అని శాస్త్రాలలో ఎట్లు నిర్ధారించారు?
కాలమంతా ఒకేలా ఉంటే, శుభముహుర్తం దుర్ముహుర్తం, అమృతకాలం, రాహుకాలం, యమగండం ...అని జ్యోతిష్య శాస్త్రం ఎందుకు నిశ్చయిస్తుంది?
భూమి అంతటా ఒకటియే యైనను ఒక స్థలంలో శుద్ధజలం, మరియొక స్థలంలో ఉప్పునీరు, మరో చోట నీరే లేకుండుట మనం చూడుటలేదా? ఒక్కొక్క భూసారము ననుసరించి ఒక్కొక్క సస్యం, పైరు ఫలించుట మనమెరిగిన విషయమే కదా. కొన్నిచోట్ల పండ్లు మధురంగా, మరికొన్నిచోట్ల అవే పండ్లు సామాన్యంగా ఉండుట తెలిసిందే కదా. కొన్ని స్థలములలో గల జలము, ఆహారము సరిగ్గా లేనందున అచ్చట వారు రోగగ్రస్తులై యుండుట చూస్తున్నాం కదా.

శ్రీ శంకరాచార్యులవారు తన పరివార శిష్యులతో కలసి ధర్మప్రచారం చేస్తూ... దేశాటన జరుపుతూ, ఓ ప్రాంతానికి చేరిరి. అక్కడ నదిలో స్నానం చేసి కూర్చుండగా, ఒక సర్పం, ఒక కప్పకు నీడ కల్పించే దృశ్యం వారి కంట పడింది. సహజసిద్ధంగా బద్ధ శత్రువులైన పాము, కప్ప మధ్య పరస్పర మైత్రిభావమునకు కారణం ఆ స్థల  మాహాత్మ్యమేనని గ్రహించి, అది శృంగఋషి(ఋష్యశృంగ మహర్షి) తపస్సు చేసిన చోటని తెలుసుకొని, అక్కడే మొదటి మఠం నిర్మింపదలచి, శృంగేరి పీఠాన్ని స్థాపించారు.

విద్యారణ్యస్వాములవారు పూర్వాశ్రమమున మాధవాచార్యులవారుగా ఉన్నకాలమున - హరిహరరాయలు, బుక్కరాయలు కొందరితో కలసి, తుంగభద్రానది దక్షిణప్రాంతారణ్యమున వేటకై వెళ్ళిరి. అక్కడ ఒక చోట కుందేళ్ళు వేటకుక్కలను తరమడం చూసి, ఆశ్చర్యపడి ఆ విషయమును మాధవాచార్యులవారికి తెలపగా, అది సిద్ధి క్షేత్రమని, ఆ స్థల
మాహాత్మ్యం వలనే, కుందేళ్ళకు అంత శక్తి కలిగెననియు, అందుచే అక్కడ రాజధానిని నిర్మింపజేయించారని చెప్తారు. 

ఒక గ్రామ సమీపమున గల అడవిలోనికి, గొల్లపిల్లవారు ఎప్పటిలా ఆవులను మేపుకై తీసుకెళ్తూ, ఎప్పటికంటే కాస్త దూరంగా వెళ్ళిరి. అక్కడ ఓ సరోవరంతో పాటు దట్టమైన నీడగల వృక్షములు బహుళంగా ఉన్నాయి. పశువులకు నీరు త్రాగించి, ఎండ అధికంగా ఉండుటచే గోవులను ఆ వృక్షనీడలో కట్టి ఉంచి, వారూ భోజనం చేసి విశ్రమిస్తున్న సమయమున... ఆ మార్గమున వెళ్తున్న తొండను వారిలో ఒకరు కొట్టి చంపెను. అప్పుడే కాస్త దూరంలో, ఓ చెట్టునీడలో విశ్రమిస్తున్న ఒక గోపబాలుడు, అది చూసి లేచి కూర్చొని, గంభీరంగా ఇద్దరు పిల్లలను పిలిచి - అదిగో అతను అన్యాయంగా తొండను కొట్టి చంపెను. అతనిని బంధించమని చెప్పి, మిగిలిన నలుగురు పిల్లలను పిలిచి, మీరంతా చెంతన కూర్చొని, న్యాయాన్యాయములను
విచారణ చేయవలసిందిగా ఆజ్ఞాపించగా... ఆ నలుగురు ఆశీనులై, తొండను చంపిన హింసా విషయంపై ధర్మశాస్త్రచర్చలు చేసి, ఓ ప్రాణిని హింసించి చంపినందుకు మరణశిక్షే శిక్షయని తెలపడం... ఆ మొదటిబాలుడు, ఆ చెట్టు కొమ్మకు కట్టి ఉరితీయమని చెప్పడం... బంధించిన ఇద్దరూ, తొండను చంపిన బాలుడిని ఉరితీయడం...ఒకదాని వెంబడి ఒకటిగా ఇవన్నీ జరిగాయి. ఆ పిమ్మట వారు చీకటి పడుతుందని అచ్చట నుండి లేచి ముందుకు రావడం తమ మిత్రునిని ఉరివేయగా చనిపోవడం గుర్తించి, భయంతో వణికిపోతూ, బోరున ఏడుస్తూ గోవులను తోలుకొని ఊరిలోనికి వచ్చి విలపిస్తూ, జరిగింది అందరికీ చెప్పడం... ఇది విన్న గ్రామస్థులు ఈ విషయమును న్యాయాధిపతికి చెప్పడం... వెంట వెంటనే జరిగాయి. ఆ న్యాయాధిపతి ధర్మశీలుడు, సత్యవంతుడు, సూక్ష్మగ్రాహి కావడంతో, ఆ గోపబాలురందరూ అమాయకులు అని గ్రహించి, దీనికైదైన అసాధరణమైన కారణం ఉండవచ్చని తలచి, మరురోజున - ఆ పిల్లలు, పెద్దలతో కలసి ముందురోజున జరిగిన ఆ సంఘటనాస్థలికి వెళ్ళి, ఏం జరిగిందో యధాతధంగా వివరించమని చెప్పమనగా - ఆ పిల్లవారంతా పూర్వదినమున ఎచటెచట ఎవరెవరు ఎలా కూర్చున్నారో, అలా కూర్చొవడం, వెన్వెంటనే అంతవరకు ఏడుస్తున్న ఆ పిల్లవాళ్ళు గంభీరంగా మారడం మొదటివాడు రాజుగా, నలుగురు మంత్రులుగా, ఇద్దరు సేనకులుగా వ్యవహరించడం... ధర్మశాస్త్రములు పఠిస్తూ, ప్రాణహింసకు హింసయే ధర్మశాస్త్ర నిర్ణయమని, అనేక ప్రమాణములు ప్రస్తావిస్తూ, మంత్రులు మాట్లాడడం చూసి అందరూ విస్మయులైరి. అక్కడనుండి వారంతా లేవగానే, మాములుగా భయంతో వణకడం గమనించి ఆ స్థలమున ఏదైన మహిమ ఉండవచ్చని న్యాయాధిపతికి అనిపించి, అక్కడ త్రవ్వించగా... భూమియందు కొన్ని శాసన ఫలకలు, విక్రమాదిత్సుని సింహాసనం ఉచితాసనములుతో కూడిన దర్బారు కనబడెనట.

దక్షిణదేశమున పురందరమను పురమునందు దేవశర్మ అను బ్రాహ్మణుడొకరు వేదశాస్త్రముల నభ్యసించి, పంచయజ్ఞములను, అతిధిలను, మహర్షులను పూజించి అందరి అనుగ్రహం పొందినా, ఎన్నో పుణ్యకర్మలాచరించినా, మనఃశాంతిలేక దుఃఖపడుచుండెను.
కొంతకాలం పిదప అతని యింటికి శాంతచిత్తుడగు ఓ సాధువురాగా, ఆహ్వానించి, ఆదరించి, వారికి సత్కారముల నొనరించి, వినమ్రుడై, తన అశాంతి, దుఃఖముల గురించి అడిగెను. అంతటా - ఆ సాధువు, సౌపురనగరమున మిత్రవతుడను గొల్లవానిని కలువు. నీ మనస్సుకు శాంతి, తృప్తి కలుగుతుందని చెప్పగా, ఆ మాట ప్రకారం దేవశర్మ అక్కడికి వెళ్ళెను.
సౌపురనగర నదీతీరమున ఉన్న వనమున శిలాతలముపై మిత్రవతుడు కూర్చొని ఉండెను. ఆ వనమున జంతువులు జన్మసిద్ధమగు వైరం మరచి, ప్రేమతో వ్యవహరించడాన్ని వింతగా చూస్తూ, మిత్రవతున్ని చేరి నమస్కరించి, తన వివరములు వినయంగా తెలిపి, తన అశాంతి దుఃఖముల గురించి చెప్పి, దుఃఖవిమోచనం చేయమని దేవశర్మ కోరెను. ఇంతలో అచటికి ఒక మేకను పెద్దపులి తరుముకుంటూ రావడం వనంలోనికి వచ్చేసరికి భయం వీడి మేక, కడు కోపంగా భక్షింపకోరి వచ్చిన వ్యాఘ్రం శాంతంగా యూరకుండడం చూసిన దేవశర్మ ఆశ్చర్యంగా, ఇచ్చోటకి వచ్చిన తోడనే వైరం వీడి ఇలా శాంతంగా సఖ్యంగా వుండడానికి కారణమేమని అడగగా - 
ఈ వనమున బ్రహ్మదేవునిచే ప్రతిష్టింపబడిన త్ర్యంబక లింగమున్న దేవాలయం ఉంది. పూర్వము ఈ లింగమును సుకర్మయని విద్వాంసుడు ఆరాధిస్తుండెను. ఓసారి ఒక మహాత్ముడు అతిధిగా రాగా, అతనికి అతిధి పూజ చేసాక, ఆ అతిధి కేవలం ఫలహారివై ఇలా ఎందుకు భగవత్సేవ చేయుచున్నావని ప్రశ్నించగా -
అయ్యా! నాకు జ్ఞానం లేక మిగుల దుఃఖమును చెందుతున్నాను. జ్ఞానం పొందాలని తపన పడుతూ, ఎప్పటికైన ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడని విశ్వసిస్తున్నాను. మీరు నన్ను అనుగ్రహించడానికే వచ్చారేమోననిపిస్తుంది. మీరు అనుగ్రహించితిరేని ధన్యుడౌతానని అనెను. అంతటా ఆ అతిధి గీతా ద్వితీయాధ్యాయమును ఒక రాతిపై చెక్కి ఓయీ సుకర్మా! నీవు దీనిని అభ్యసింపుము. నీయభీష్టం నెరవేరునని చెప్పి, ఆశ్వీరదించి వెడలిరి. 
సుకర్మ, ఆ అతిధి చెప్పే విధంగా చేసిన కొలదికాలమునకే, అతని విచారం తొలగి, మనస్సు నైర్మల్యమును పొంది, జ్ఞానవంతులైరి. ఆ జ్ఞానవంతుడు సంచరించిన ఈ స్థలం శాంతితపోవనముగా మారడంతో ఇచ్చట అందరూ ప్రేమగా శాంతంగా ఉందురని మిత్రవతుడు తెలిపెను.
 
దీనిబట్టి మీకు అర్ధమయే ఉంటుంది...
స్థల బేధాలు, స్థల మాహాత్మ్యం ఉంటుందని. 
                 

అటులనే - మన దివ్య క్షేత్రాల స్థలపురాణాలను, అరుణాచలం గురించి శ్రీ రమణులు చెప్పినది... చదవితే, ఈ విషయం మరింత సుస్పష్టమౌతుంది.   

  
 

9 కామెంట్‌లు:

  1. నమో నమః
    ధన్యురాలిని.
    ఎంతో అద్భుతంగా వివరించారు.
    నా సందేహాలు అన్నీ తీరాయి.
    🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మగారు,
      🙏
      మీ సందేహాలు తీరినందుకు సంతోషం.
      ధన్యవాదములండీ.

      తొలగించండి
  2. చాలా అద్భుతంగా రాశారు. ఈ రోజుల్లో మాకు మంచి జ్ఞానం ఉన్న మీలాంటి వ్యక్తులు కావాలి. మీకు ఉన్న జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ ఉండండి. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనుదీప్ గారు,
      నేను చదివింది, విన్నది, అవగాహన మేర తెలుసుకున్నది ఏదో ఇలా వ్రాస్తుంటాను. జ్ఞానం అనేది పెద్దమాట.
      మీ వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  3. మీరు ఏది వ్రాసిన బహు చక్కగా వ్రాస్తారు భారతిగారు.
    ఇటీవల గంగానది మృతదేహాలతో కలుషితం చేసారు.
    ఇది బాధకరం. మన సంస్కృతి సంప్రదాయకాల పవిత్రతను మరచి అపవిత్రత పెంచుతున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసుంధర గారు,
      నిజమేనండి... మీరన్నది.
      మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

      తొలగించండి
  4. *భగవంతునికోసం అడవులలోనూ, ఆకాశంలోనూ, తీర్ధయాత్రలు చేయడంలోనూ తెలుసుకోలేరు. శరీరాన్ని కుదుట పరచుకొని పరమేశ్వరుణ్ణి పరికించాలి. అంటే భగవంతునికై ఎక్కడెక్కడో తిరగనవసరంలేదు, ఉన్నచోటనే మనస్సుని కుదుట పరచుకుంటే పరమాత్ముడుని చూడగలరు.* *బ్రహ్మజ్ఞానం సంపాదించాలని నరుడు తీర్ధయాత్రలు చేయడంవలన శ్రమ మిగులుతుంది గానీ జ్ఞానోదయం కలుగుతుందన్న ఆశ లేదు. అంతరాత్మయందు దృష్టిని నిలిపినపుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అతడే బ్రహ్మ అవుతాడు.*
    సేకరణ: వాట్సప్ప్

    రిప్లయితొలగించండి
  5. శివ రామకృష్ణ26 మార్చి, 2022 11:37 AMకి

    https://fb.watch/b_ptUvCMpd/

    రిప్లయితొలగించండి