12, అక్టోబర్ 2017, గురువారం

"దాంపత్య జీవన సాఫల్యత"

అమ్మా! 
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ... అంటూ, స్త్రీ ఎలా ఉండాలో చెప్పారు. మరి పురుషుడు ఎలా ఉండాలో చెప్పలేదా? యిదీ కొన్నిరోజుల క్రితం మా అమ్మాయి అడిగిన ప్రశ్న.  
కార్యేషు యోగీ, కరణేషు దక్షః ... అంటూ పురుషుడు ఎలా ఉండాలో చెప్పారమ్మా. కానీ, ఎందుచేతనో యిది ప్రాచుర్యంలో లేదు... అని తనకి బదులిచ్చిన నా మనస్సు గతంలోకి పయనిచ్చింది. 
గతంలో ఇదే సందేహం నాకూ వచ్చింది. అప్పుడే ఓ భార్య ఎలా వుండాలో నన్నదే కాదు, ఓ భర్త ఎలా వుండాలన్నది తెలిసింది. కానీ, ఒకింత కోపం ... స్త్రీని చాకిరీలు చేసే దాసిలా, అన్నింటిని ఓర్చుకుంటూ పడుండే భూమిలా, రంభలా ఉండమని, పురుషుడిని యోగిలా, రామునిలా ... ఇలా చెప్పడం ఏమిటని ఒకింత అసహనంకు మొదటలో లోనయ్యాను. కానీ, పెద్దలు ఏది చెప్పిన అందులో పరమార్ధముంటుందన్న సత్యం అనుభవపూర్వకంగా ఎఱిగి, ఇందులో కూడా ఏదో అంతరార్ధముంటుందని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను. కాస్త కూస్తో తెలుసుకున్నాను. నిజానికి స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా సరిగ్గా సమానంగా చెప్పారు మన పూర్విజులు. 

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. 
    
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః 

స్త్రీ పురుషులు ఎలా ఉండాలో తెలియజెప్పే ఈ శ్లోకాల రెండింటి సారూప్యతలను గమనిస్తే -

కార్యేషు దాసీ - కార్యేషు యోగీ 

స్త్రీ పనులు చెయ్యడంలో దాసి లాగా, పురుషుడుపనులు చెయ్యడంలో ఒక యోగి వలె ఉండాలని అర్ధం.   
ఒకరింట్లో పనిచేసే దాసి, తన యజమాని  ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది. అంతే తప్ప ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులపట్ల, వస్తువుల పట్ల స్వంతమని గాని, ఎలాంటి కోరికాది భావములను గాని కలిగియుండదు. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించుకొని వెళ్ళిపోతుంది. 
అలానే ఓ యోగి ఏ వస్తువు పట్లయినా, ఏ కర్మ పట్లనైనా ఇష్టం అయిష్టం, సంగం అసంగం, రాగం ద్వేషం లాంటి భావాలు ఏర్పరచుకోక, చేసే కార్యాలయందు నిమిత్తుడై, నిర్లిప్తుడై భగవత్కార్యమనే భావనతో, భగవదర్పణ బుద్ధితో నిర్వర్తిస్తాడు. 
ఒకింత యోచిస్తే కర్మల యందు ఓదాసి అయినా, యోగి అయినా ఒకేలా ఉంటారు. పదాలు వేరైనా చక్కటి సారూప్యత. 
కరణేషు మంత్రీ - కరణేషు దక్షః

స్త్రీ - మంచి సలహాలు, సూచనలు, మాటలు చెప్పడంలో మంత్రిలాగా, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించే దక్షత కలవాడై పురుషుండాలి. 
రాజుకు శ్రేయస్సు కల్గించే సరైన సూచనలిస్తూ, అటులనే రాజు తప్పు చేసిన, పొరబడినా, తనకి  తగిన సలహాలిస్తూ, నయాన్నో భయానో  మంచిమార్గములో నడిపించి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడం మంత్రి బాధ్యత. అలానే భార్య మంత్రివలె మంచిపనులను మగనికి దెల్పి, మగనికి మంచి స్పూర్థినిచ్చెడి ఆలోచనా తోడ్పాటు నందివ్వవలెను. సూచనలు, సలహాలనా... మాటే వినని భర్తకు చెప్పేదేముంది అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ, చెప్పే రీతిలో చక్కగా చెప్తే చక్కటి ఫలితమే ఉంటుంది. ఇక్కడ రామాయణంలో సీతారాముల మృదుభాషణమొకటి మదిలో మెదులుతుంది - దండకారణ్యంలో మునులకు రాక్షసబాధ లేకుండా చేస్తానని మాటిచ్చిన రామునితో సీతమ్మ ఇలా అంటుంది - 'రాజా! మోహం వలన మూడు అనర్ధాలున్నాయి. మొదటిది అసత్య భాషణం, రెండవది పరస్త్రీ వ్యామోహం, మూడవది తగిన కారణం లేకుండా వైరం పెట్టుకోవడం. నాకు తెలుసు సత్యసంధుడివయిన నీవు ఎన్నటికీ అసత్యభాషణం చేయవు. అలానే స్వదార నిరతుడివి, ఏకపత్నీవ్రతుడివయిన నీకు పరస్త్రీ వ్యామోహం కలుగదని. కాకపొతే నిష్కారణంగా రాక్షస సంహారం చేస్తానని మాటివ్వడం నన్ను బాధిస్తుంది. ఆర్తులను రక్షించడానికే రాజులు కత్తి పట్టాలి గానీ,  ఎటువంటి శతృత్వం లేకుండా ఎవర్నీ సంహారించడం సరికాదు. ఇప్పుడు మనం వనవాసులం, అడవులకు వచ్చింది తాపస ధర్మాన్ని సేవించడానికి గాని, క్షత్రీయ ధర్మాన్ని నెరవేర్చడానికి కాదుకదా ... అని చెప్తూ ... నేను చెప్పానని కాదు, నీవు ధర్మజ్ఞుడివి, సరిగ్గా ఆలోచించు, అప్పుడు నీకు ఏది సమ్మతనిపిస్తే అది చెయ్యి అని అంది. సీతమ్మ చెప్పిందంతా ఓపిగ్గా విన్న శ్రీరాముడు 'జానకీ! నువ్వు నా ధర్మపత్నివి. నీకు తోచినది చెప్పావు, మంచిమాటలు చెప్పావు, కానీ నువ్వే అన్నావు - ఆర్తుల్ని రక్షించడానికి మాత్రమే క్షత్రీయులు ఆయుధం పట్టాలని. నేనిప్పుడు అదేపని చేస్తున్నాను. వారు తమ తపశ్శక్తితో తమని తాము రక్షించుకోగల తాపసులు, తమ తపఃశక్తిని అధములు కోసం వృధా చేసుకోకూడదని, తమని రాక్షసుల బారినుండి రక్షించమని కోరారు. అందుకే ఎవరికీ ఏ హానీ చేయని వారిని అకారణంగా హింసిస్తున్న రాక్షసులను సంహరిస్తానని మునులకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడం సరికాదు కదా ... అని అనడం ..... ఈ ఘట్టాన్ని ఓసారి పరిశీలిస్తే - సీతమ్మ తనకు తోచిన ధర్మాన్ని నొప్పించక తగుమాటలతో సున్నితంగా, నిర్మొహమాటంగా చెప్పడం, బాగుగా యోచించి తగు నిర్ణయం తీసుకోమనడం ... 
ఆ రీతిలోనే భార్య చెప్పింది అంతా ఓపిగ్గా వినడం, సహృదయతతో అర్ధం చేసుకోవడం, తన మాటలకు తగిన విలువనిస్తూనే తన మనస్సులో మాటను సున్నితంగా చెప్పడం ... నొప్పించక ఒప్పింపజేయడం... 
ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరూ నొచ్చుకోకుండా అర్ధమయ్యేరీతిలో సరళంగా సమస్యలొచ్చినప్పుడు మాట్లాడుకుంటే ఆ దాంపత్యజీవితం అర్ధవంతమూ, ఆదర్శవంతమూ కాదా? 
రూపేచ లక్ష్మీ - రూపేచ కృష్ణః 

 స్త్రీ రూపంలో లక్ష్మీదేవిలాగా, పురుషుడు రూపంలో కృష్ణుని వలె ఉండాలి.

                                                                   
లక్ష్మీదేవి అనగానే ఓ కమలంపై అందంగా ఆనందంగా ఆసీనురాలైన అమ్మవారి రూపం కళ్ళముందు కదలాడుతుంది. 
కమలం - బురదలో వున్నా బురదను నీటిని అంటించుకోక, బురదలో నుండి స్వచ్ఛంగా బయటకొస్తుంది. లక్ష్మీ ... సంపదలొసగే తల్లి ... ఆమె అందరికీ ఒనర్చుతుంది కానీ, తనకై దాచుకోదు, కోరుకోదు. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - సంసారకూపమందు ఉంటూ సంసారమును అంటీముట్టనట్లు ఉండమని. అలానే అందరికీ అన్నీ అమరుస్తూ ఆనందంగా ఉండమని. 
                       


కృష్ణుడు అనగానే ఒకకాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీ అననట్లు, చేతిలో వేణువుతో, వెనుక గోవుతో నిల్చున్న రూపం సాధారణంగా జ్ఞాపకం వస్తుంది.  
కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీ అననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ. కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.
క్షమయా ధరిత్రీ - క్షమయా తు రామః
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో ఓర్పుగా భూదేవిలాగా స్త్రీ, 
జీవితమందు ఎంతో సహనంతో రామునిలా పురుషుడుండాలి. 
భూమికి  సహనం సహజగుణం. గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను, పుష్ప ఫలవృక్షాలను, ప్రసాదిస్తూ, అలానే, మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, తొలిచేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కల్గిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా - క్షమత్వమును, ఓర్పునూ, భూతదయను కల్గివుండాలన్న సందేశం "భూమి"ది. తనని ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్న సహిస్తుంది. అలానే కుటుంబంలో స్త్రీ కూడా సహనంగా, క్షమాగుణంతో మసలుకోవాలి. 
మానవునికి ఆభరణం గుణం, గుణమునకు ఆభరణం జ్ఞానం, జ్ఞానమునకు ఆభరణం క్షమ. ఆ క్షమకు ప్రతిరూపం శ్రీరాముడు. కోపగించుకోవడానికి తగు కారణాలున్నా, తనకు ఎంత దుఃఖం కల్గించిన మనస్సు నందు ఎటువంటి ప్రతీకార బుద్ధి లేకుండా కోపాది వికారాలు లేకుండా సహనంతో, సహృదయతతో, అందరితో సౌజన్యంగా స్నేహాయుతంగా ప్రీతిగా వ్యవహరించడం, శరణువేడిన విభీషణుడునే కాదు, రావణుడు వచ్చిన ఆదరిస్తాననే అభయమిచ్చే సహనమూర్తి శ్రీరాముడు. కుటుంబంలో పురుషుడు కూడా ఎంతో సంయమనంతో క్షమాశీలుడై మెలగగలగాలి. 
భోజ్యేషు మాతా - భోజ్యేషు తృప్తః
భర్తకు భోజనం పెట్టేటప్పుడు స్త్రీ ఓ తల్లిలాగా, 
భార్య వండినదాన్నిభర్త సంతృప్తిగా భుజించాలి. 
కన్నతల్లి తన బిడ్డ సరిగ్గా తినాలని తపిస్తూ, తన బిడ్డకు ఏది ప్రీతికరమో, ఎలా చేస్తే ఇష్టంగా తింటుందో నని ఆలోచిస్తూ, ఆ రీతిలో చక్కగా శ్రద్ధగా వండి ప్రేమతో నెట్లు వడ్డించునో, అట్లేనే భార్య భర్తకు గూడా ప్రీతితో పెట్టవలెను. అలానే భార్య  వండినదాన్ని ఎటువంటి వంకలు పెట్టకుండా, టి.వి చూస్తునో, ఇతరత్రా ఏదో ఆలోచిస్తూనో... భోజనం యాంత్రికంగా చేయకుండా, ఆ వంటకాల్లో రుచినే కాదు, భార్య ప్రేమను కూడా ఆస్వాదిస్తూ భర్త సంతృప్తిగా భుజించాలి. ఒకోసారి వంట సరిగ్గా చేయలేకపోవచ్చు, అప్పుడు కోపగించుకోక సహృదయతతో సర్దుకుపోవాలి. 


శయనేషు రంభ - సుఖదుఃఖ మిత్రం
ఈ రెండే ఒకింత సారూప్యత లేనివి. 
స్త్రీ పడకటింటి లో రంభలాగా ఉండాలి. 
పురుషుడు సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. 
ఓ స్త్రీని పడకింటిలో ఇలా ఉండమని చెప్పడానికి కారణం - ఈ సమయమందు స్త్రీ మనోభావనాలుకు  అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఓ శిశువు అంకురం మొదలు ప్రసవించేంతవరకు... స్త్రీ మనోభావనలు, తీసుకునే ఆహరం, గర్భాలయంలో ఉన్న శిశువుపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఇక్కడ భారతంలో ఓ సన్నివేశంను ఉదహరిస్తాను - శంతనమహారాజుకు, గంగామాతకు భీష్ముడు జన్మించడం, అటుపై దాశకన్య అయిన సత్యవతీ శంతనుల వివాహ నిమిత్తమై భీష్ముని ప్రతిజ్ఞ, శంతన మహారాజుకి సత్యవతి భార్యకాకపూర్వం పరాశరుని వల్ల గర్భవతియై వ్యాసభగవానుని కనడం... శంతనునికి సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించడం, చిత్రాంగదుడు గంధర్వుల చేత హతుడవ్వగా, విచిత్రవీర్యుడికి కాశీరాజు కూతుళ్ళు అంబిక, అంబాలికలను భీష్ముడు బలవంతంగా తెచ్చి పెళ్లి చేయడం, విచిత్రవీర్యుడు క్షయవ్యాధి సోకి చనిపోవడం, వీరికి సంతానం కలగకపోవడం వలన వంశం అంతరించకూడదని, సత్యవతి తన మరో కుమారుడైన వ్యాసుడిని పిలిచి వంశాన్ని నిలపమని కోరడం, వ్యాసుని దరి చేరిన విచిత్రవీర్యుని భార్యలు భయమునకు లోనై, ఒకరు కళ్ళు మూసుకొని సమాయత్తమైనందున పుట్టుగ్రుడ్డి ఐన దృతరాష్ట్రుడును, వణుకుతూ సమాయత్తమైన మరొకరు పాండురోగి ఐన పాండురాజుకు జన్మనివ్వడం, మూడవసారి అంబిక,అంబాలికలు భయముతో వారికి బదులుగా దాసిని పంపగా దాసీ పుతృనిగా విదురుడు జన్మించడం..... అందరికీ విదితమే. దీనిబట్టి భర్తను చేరిన భార్య మనోభావనలు ఎంత ముఖ్యమో ఇక్కడ అర్ధమౌతుంది. ముందుగా  ఆలోచనలు సంగమించాలి, భావాలు శృతి కలవాలి, మనస్సు లేకోన్ముఖం కావాలి. దీనిని విలాసమయ వినోదమయ శృంగారమయ క్రియగా భావించక, యోగ్యవంతమైన సత్సంతానంకై అన్న పవిత్ర భావనతో ఉంటే, ఆయురారోగ్య తేజోవంత సత్సంతానంను పొందుదురు. స్త్రీ మనోభావనలకు ప్రాముఖ్యత ఉండడంచే ఈ మాట చెప్పారని నా భావన. 
భర్త సుఖదుఃఖాలయందు మిత్రునిలా ఉండడం, మంచిచెడ్డలను కలిసి పంచుకోవడం ఎంతో ఉత్తమం. అందుకే వివాహ సమయమందు దంపతుల నడుమ గాఢమైన సఖ్యతకు బాటవేస్తూ - వరుని నోటంటా అద్భుతమైన పలుకులను పలికిస్తుంది వేదం - నాతో ఏడడుగులు కలిసి నడిచి, నా స్నేహితురాలివికా! చిరకాలం స్నేహితులుగా మనం కలిసి జీవిద్దాం అని. ఎంత చక్కటి ప్రమాణం. వీటన్నింటినీ అవగాహన చేసుకున్న ఆలుమగల జీవితమే స్వర్గతుల్యం కదా. 
                                                                         * * * * *

నిజానికి హిందూ వివాహ వ్యవస్థ ఓ ధర్మం. భిన్న దృక్పధములు గల్గిన ఇద్దరిని ఒక్కటి చేసి బంధాలను దృఢం చేసే సంస్కారమే వివాహం. భారతీయ మహోన్నత సంస్కృతీ సాంప్రదాయకాలకు దర్పణం - మన కుటుంబవ్యవస్థ. బలమైన కుటుంబవ్యవస్థకు మూలం - అన్యోన్య దాంపత్యబంధం.
రెండు కుటుంబాలకు వారధిగా మారి, మూడుముళ్ల బంధం ద్వారా భిన్న దృక్పధములు గల్గిన ఇద్దరు ఒక్కటై, విడదీయరాని కొత్తబంధానికి శ్రీకారం చుడుతూ, తమ పవిత్ర కలయిక ద్వారా మరో కొత్తతరానికి నాంది పలుకేటట్లు చేసే సంస్కారమే వివాహం.
అసలు ఈ వివాహం ఎందుకు? 'విశేష విధి ప్రకారం ధర్మానుబద్దంగా ఒకరు మరొకరితో కలిసి పారస్పరిక బాధ్యతను వహించుట'కై అని పెద్దలు చెప్తుంటారు. ఏమిటా పారస్పరిక బాధ్యతలు? స్త్రీ పురుష సుఖజీవనం కొరకు, గృహస్థ కర్తవ్యములైన పంచయజ్ఞములను నిర్వహించుట కొరకు, సత్సంతానం ద్వారా వంశమును నిలబెట్టుట కొరకు.
మన శాస్త్రాలు ఎనిమిది రకముల వివాహముల గురించి తెలిపినను ఆదరణ యోగ్యమైనదీ, అన్నింటిలోనికి విశిష్టమైనదీ, ఆచరణాత్మకంగా కొనసాగుతున్నది "ప్రాజాపత్య వివాహం".
వివాహమంత్రాలను పరిశీలిస్తే -
'ధర్మ పురుషార్థం' ధర్మానుబద్ధంగా గృహస్థులకు బాటవేస్తుంది. కుటుంబ పోషణార్ధం 'అర్ధ పురుషార్థం' ప్రధానమౌతుంది. అటుపై 'కామ పురుషార్థం' ఓ భూమిక వహిస్తుంది.  ఇక ఆపై గృహస్థు ఆశ్రమంలో శాస్త్రానుసారం గురువులను, విప్రులను, అతిధులను భక్తితో సేవిస్తూ, అందరితో ఆత్మీయంగా ప్రవర్తిస్తూ, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించమనే సూచిస్తాయి.

కానీ, నేడు చాలావరకు కుటుంబాల్లో - పరస్పరం అనుకూలముగా అన్యోన్యతగా ఉండటం అంటే ఏమిటో తెలియక అనేక పర్యాయాలు భార్యాభర్తల నడుమ కలతలు రేగుతున్నాయి. చిన్ని చిన్ని విషయాలు కూడా అవగాహనలోపంతో పెద్దవి చేసేసుకుంటారు. మనస్తత్వాలలో తేడా, అభిప్రాయాల్లో తేడా, అహంకారాలు అడ్డం, ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకోవడం, పరస్పరం నిందించుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, పరుషవాక్కులతో దూషించుకోవడం, తేలికభావంతో మాట్లాడడం, నొప్పించే పరిహాసాలు చేయడం, ఆధిక్యతను కనబర్చడం .... ఇవన్నీ సహృదయతను కొరవడేటట్లు చేసి స్పర్ధలు పెంచేవే. అలానే భార్యాభర్తల నడుమ తమ తల్లితండ్రులు, తమవారే, తమ బంధుమిత్రులే గొప్పంటే గొప్పనే ఆధిక్యభావం, ఆర్ధిక వ్యక్తిత్వ వైవిధ్యాలు, బంధుమిత్రుల వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. భర్త వ్యసనాల వలనో, భార్య ప్రవర్తనలోని అవకతవకల వలనో సజావుగా సాగాల్సిన సంసారంలో స్పర్ధలు...  ఇలా కలతలకు కారణాలెన్నో! 
ఇటువంటి భార్యాభర్తలు ముందుగా తెలుసుకోవాల్సినవి తెలుసుకోగలగాలి. నిజమైన బాంధవ్యానికి ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం ముఖ్యం. పెద్దలు కూడా తెలియజెప్పాలి.  
                                           



బంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. సుఖదుఃఖాల సమ్మేళనమే జీవితం. కుటుంబంలో ఉన్న అందరిలో మనకు నచ్చినవి మాత్రమే కాదు, నచ్చనివి అనేకముంటాయి. ఇవి ప్రశాంత, ప్రేమైక సౌఖ్యమైన జీవనగమనంలో ఒకింత అవరోధాలే కావొచ్చు. కానీ, అవి లేకుండా బంధాలు లేవు. గులాబీలమధ్యా ముళ్ళు తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన వైవిధ్య సంఘర్షణలు తప్పవు . ప్రియా అప్రియాలు రెండింటినీ స్వీకరించగలిగినప్పుడే బాంధవ్యాలు బలపడతాయి.
                                                



ఆలుమగల తగాదా అద్దం మీద ఆవగింజ నిలిచినంత సేపే అన్నట్లుండాలి. అరమరికలు లేకుండా మనోభావనలు పంచుకోవడం, అవగాహన, ప్రేమ అన్నవి లేనిచో ఏ బంధమూ నిలవదు. అర్ధవంతం కాదు. 
                                    
లోటుపాట్లును తప్పొప్పులను పరస్పరం ఎత్తి చూపించుకోవడం కంటే మనసువిప్పి మసలుకోవడం ముఖ్యం. మాటలే రెండు మనస్సుల మధ్య వారధి. మనసార మాట్లాడుకోవడం మరింత హాయి. 
ఒకర్ని ఒకరు తమ కోరికలు తీర్చే యంత్రంలా కాకుండా ఒకరికై ఒకరం జీవిస్తున్నామన్న భావనతో మసులుకోగలగాలి. భార్యను భర్త, భర్తను భార్య ...  తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించి ప్రయత్నించినంతకాలం ఆ కాపురంలో కలహాలు, కలతలే చోటు చేసుకుంటాయి. భార్య ఎలా ఉన్నా ఆమె నాభార్య, భర్త ఎలావున్నా అతడు నా భర్త అన్న భావంతో పరస్పరం ప్రేమతో గౌరవించుకోవడం, నాదే కరెక్టు, నేనే గొప్ప, నేను చెప్పిందే వినాలన్న ప్రతికూల అహంభావమును త్యజిస్తూ, అహాన్ని అదుపులో వుంచుకొని ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటూ, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన, ఎన్ని ఇబ్బందులు జనించిన, రుసరుసలు తగ్గించుకొని, మాటలు రువ్వుకోవడం మాని, ఒకరి వ్యక్తిత్వాన్ని, అభిరుచుల్నీ మరొకరు గుర్తించి గౌరవిస్తూ, ఒకరికై ఒకరు అవగాహనతో అనుగుణంగా నడుచుకుంటే, ఇరువురూ కోరుకునే మార్పు ఇరువురులోను సహజంగా చోటు చేసుకుంటుంది... గృహమే స్వర్గసీమౌతుంది. 
సంతుష్టో భార్యయా భర్తా, భర్తా భార్యా తథైవవచ
యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువమ్
ఏ వంశమునందు భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య ప్రసన్నంగా ఉందురో, ఆ వంశమునందు నిశ్చితంగా కళ్యాణం కలుగును. దంపతులు పరస్పరం అప్రసన్నంగా ఉంటె ఆ వంశంలో నిత్యమూ కలహమే.

                                                          


అన్నం లేకపోవడం పేదరికం కాదు...కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే నిజమైన పేదరికం..!
ఎట్టి పరిస్థితులలోను ఒకరి పట్ల ఒకరికి శాంతి దాంతులు సద్భావాలు సడలకుండా, కష్టాల్ని కలిసి ఎదుర్కోవడం, సుఖాల్నీ సమంగా స్వీకరించడం, సమానాశయ సిద్ధికై ఒకరి ద్వారా ఇంకొకరు, ఒకరికి ఒకరుగా జీవించడం ... ఎంత ఆనందమో ఒక్కసారి ఆలోచించండి. అవగాహనతో ఆత్మీయబంధాల్నీ ఆనందంగా ఆస్వాదించండి. 

14 కామెంట్‌లు:

  1. ఎంత అద్భుతంగా వివరించారండీ_/\_. ప్రతి విషయమూ బాగా చెప్పారు
    Chandrika
    Https://sarachandrika.wordpress.com

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రిక గారు,
      మిమ్మల్ని 'స్మరణ' సాదరంగా స్వాగతిస్తుంది.
      మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారు,
      మీ చక్కటి వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  3. ఈ మధ్యకాలంలో ఇంత చక్కని టపా చూడలేదు. బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాబాయ్ గారు,
      నమస్సులు. బాగున్నారా?
      మీ ఈ స్పందన ఎంతో ఆనందమునిచ్చింది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి


  4. బాగుందండి టపా

    శయనేషు రంభ - సుఖదుఃఖ మిత్రం
    ఈ రెండే ఒకింత సారూప్యత లేనివి‌

    శయనేషు కుంభకర్ణః అంటే మరీ బావోదని కవి‌ సుఖ దుఃఖ మిత్రం అని మార్చేసి‌ఉంటాడనుకుంటా :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు,
      మీ చమత్కారం బాగుందండి :-)
      మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  5. మంచి పోష్టు భారతిగారూ ,
    ఆద్యంతం మనోఙ్ఞంగా వివరించారు .
    ' దాంనత్య జీవ సాఫల్యత ' అనే కంటే
    ' దాంపత్య జీవన సాఫల్యత ' అంటే
    బాగుండే దేమో , ఐనా తమ భావనలో
    ఏముందో .....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టారు గారు,
      నమస్తే! మీ సూచన సరైనది. సరిచేశానండి.
      మీ చక్కటి స్పందనకు, సూచనకు నా హృదయపూర్వక ధన్యవాదములు

      తొలగించండి
  6. దంపతుల జీవన విధానం ఎలా ఉంటే సఫలం అవుతుంది అన్నది ఒక్కొక్క వివరణ చాలా బాగా చెప్పావు భారతీ. కరణేషు మంత్రీ - కరణేషు దక్ష: వివరణ చాలా బాగుందోయీ..అద్భుతమైన పోస్ట్...

    రిప్లయితొలగించండి
  7. మీ విశ్లేషణ చాలా అద్భుతముగా ఉంది •కోపాతాపాలకు వెచ్చించే సమయంలో పదోవంతు అర్థంచేసుకోవడానికి వినియోగిస్తే భార్యాభర్తలు ఆనందంగా కాలం గడపొచ్చు అని
    చెప్పడం చాలా గొప్పగా ఉంది •మీకు హృదయపూర్వక ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  8. గృహస్త(వైవాహిక) జీవితంలో ఎలా ఉంటుందో అత్యంత ఉత్తమంగా తెలియజేసారు..
    తమ అమూల్యమైన సందేశం హృదయాన్ని ఆవిష్కరింపచేసింది.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. చాలా చక్కని వివరణ, భారతి గారు.. అలానే ఇల్లాలి కోపం వలన ఇంటికి గాని కుటుంబ వ్యవస్థపై పడే లాభనష్టాలను గూర్చి కూడా మీకు వీలైతే పంచుకోగలరు. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి