12, అక్టోబర్ 2015, సోమవారం

ఆధ్యాత్మిక అభిరుచి గల బ్లాగర్స్ అందరికీ ఓ అభ్యర్ధన ...

                                                                


నాకు రామాంజనేయులంటే అమిత ఆరాధన. ఆధ్యాత్మికతను అర్ధం చేసుకుంటూ, అటు పయనించాలనే అభిలాష. 
ఆధ్యాత్మిక విషయాలు పఠన, శ్రవణముల ద్వారా తెలుసుకున్నవి మర్చిపోకుండా, మననం చేసుకోవడానికి వీలుగా వుంటుందని, మంచివిషయాలు నలుగురితో పంచుకోవడం కూడా అవుతుందని, వాటిని "స్మరణ"లో పదిలపరుస్తున్నాను.

ఈ మధ్య నా అవగాహన మేరకు చక్రాలు గురించి వివరణను పెట్టాను. అయితే, అనాహత చక్రం గురించి టపా పెట్టాక, ఒకరు వ్యాఖ్యకు బదులిచ్చాను గానీ, ఆ సందేహం నన్ను తొలుస్తుంది. దయజేసి ముందుగా ఆ లింక్ ను ఇక్కడ చూడండి.

అనాహతచక్రమునకు అధిదేవత లలితా సహస్ర నామముల యందు ఇలా తెలపబడింది.
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిరసంస్ధితా
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణీ.

ఈ విధంగా చూస్తే ఈ చక్రంనకు అధిదేవత 'రాకిని' గా తెలుస్తుంది. 
అయితే ఓ సత్సంగ మిత్రురాలు ఈ చక్రమునకు అధిదేవత 'కాకిని' అని చెప్తూ, కొన్ని పుస్తకములు ఇచ్చారు. అందులో అధిదేవత 'కాకిని' అనే వివరణే ఉంది. అటుపై కొందరు పెద్దలను అడిగాను. 'రాకిని' కదండీ అని వారిని నేనడిగితే, అన్ని పేర్లూ అమ్మవేనమ్మా, కానీ, అనాహత చక్రమందు యున్న పరాదేవత "కాకిని" అని చెప్తూ, వారు కూడా ఆ టపాకు వచ్చిన వ్యాఖ్యకు నేనిచ్చిన జవాబునే వివరణగా తెలిపారు. కానీ, ఎందుకో ఏదో అశాంతి. లలితలో వున్నది తప్పని అనగలమా? అమ్మో! ఈ భావనే నన్ను వణికిస్తుంది. మనసంతా వేదనమయంగా వుంది. 
ఇక, నేను చదివిన, విన్న వాటిని తప్పని అనుకోవడమా?  ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఆవేదనగా ఉంది.  

ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది. ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది. అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను.  అప్పటినుండి నాలో తెలియని అపరాధభావన. సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన. ఆ తపనతో  ఆర్తిగా మీ ముందుకు వచ్చి అభ్యర్ధిస్తున్నాను. దయజేసి మీ  సమాధానంను వివరంగా తెలిపి నాకు సరైన అవగాహనను కల్పించి, సరైన మార్గంలో నేను పయనించడానికి సహకరించవలసిందిగా మీ అందర్నీ ప్రార్దిస్తున్నాను. 

6, అక్టోబర్ 2015, మంగళవారం

"పంచభూతాలు"సాక్షిగా...

ఈ మధ్య నాకో సందేహం వచ్చింది, "పంచభూతాలు"సాక్షిగా అని ఎందుకంటారని?

న్యాయస్థానాలు 'భగవంతుని సాక్షిగా' అని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. అగోచరుడయిన భగవంతునికి ప్రతినిధిగా, తనచే చెప్పబడిన గీతను భగవత్ స్వరూపంగా భావిస్తూ ప్రమాణం చేయిస్తారని ఎక్కడో విన్నట్లు జ్ఞాపకం.  ఈ రీతిలోనే భగవంతునిచే సృజింపబడిన పంచభూతాలను భగవత్ స్వరూపంగా భావించి అలా అంటారా??? మరికొంత వివరణగా తెలుసుకోవాలనిపించి, కొందరు బ్లాగ్ మిత్రులను ఈ ప్రశ్నను అడగగా -
వారు వారి అభిప్రాయాలను తెలిపారు. వారి అమూల్య అభిప్రాయాలను  స్మరణలో పదిలపరుచుకునే ముందు, ముందుగా అసలు  ఈ పంచభూతాలు అంటే ఏమిటీ?  వాటి  ప్రాముఖ్యత ఏమిటీ ... అన్నది నేను చదివిన, విన్నదానిబట్టి నాకు తెలిసినది నా అవగాహన మేరకు ఒకింత వివరణ -

పంచభూతాలు :- పృథ్వి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం.
నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, శక్తిమంతుడు, చైతన్యుడు, అతీంద్రియుడు, సర్వాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ ... అని మనం పిలిచే కొలిచే భగవంతుడు నుండే ఈ పంచభూతాలు ఓ క్రమపద్ధతిలో ఉత్పన్నాలైనాయి. ముందుగా శబ్దమయమైన ఆకాశం పుట్టగా, దాని నుండి స్పర్శతత్వం గలవాయువు పుట్టింది. ఈ వాయువు నుండి ఘర్షణ చేత రూపం గల అగ్ని పుట్టింది. అగ్ని నుండి రస స్వరూపమైన జలము పుట్టింది. దీని నుండి వాసన కలిగిన పృథ్వి పుట్టింది.
                                                                   
                                           

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే.
ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.

సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి. ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం. ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం. ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.

మన స్థూల దేహంలోని పంచభూతముల అమరిక ఇలా వుంటుంది -

పృథ్వి :- 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం /వాసన.  

అగ్ని :- 
శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 

జలం :- 
రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  

వాయువు :- 
శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 

ఆకాశం :- 
అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం 
ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 

ఇక సూక్ష్మ దేహంలో పంచభూతాల అమరిక -  

మనలో పంచకోశాలు వున్నాయి మొదటిది అన్నమయకోశం. ఇది భూతత్వం నకు సంబంధించినది. రెండవది జలతత్వంతో కూడిన ప్రాణమయకోశం. మూడవది అగ్నితత్వంనకు సంబంధించిన మనోమయకోశం. నాల్గవది వాయుతత్వంనకు చెందిన విజ్ఞానమయకోశం. ఐదవది ఆకాశతత్వంనకు చెందిన ఆనందమయకోశం. ఈ ఐదు కోశాల మధ్య పరబ్రహ్మతత్వమైన ఆత్మ యున్నది. 

అలానే పంచభూతాలకు ప్రతీకలుగా మనలో ఐదు శక్తి నాడీకేంద్రములున్నాయి. ఇవే శక్తి చక్రాలు.  అవి భూతత్వంనకు చెందిన మూలాధారం, జలతత్వానికి చెందిన స్వాధిష్టానం, 
 అగ్నితత్త్వానికి ప్రతీకగా మణిపూరకచక్రం, వాయువుకు ప్రతీకగా అనాహతం, ఆకాశతత్త్వానికి ప్రతీకగా విశుద్ధిచక్రం. {ఆజ్ఞా, సహస్రారాలు తత్త్వాతీత చక్రాలు}. మన నడవడిక, అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు, ప్రారబ్ధ వాసనలు బట్టి ప్రభావితమౌతూ ఇవి పనిచేస్తుంటాయి. 

ఇక "పంచభూతాల సాక్షిగా" అని ఎందుకంటారన్న నా ప్రశ్నకు నా మిత్రులిచ్చిన వివరణ - 


సరళ స్వభావి, మృదుభాషిణి, 'నా ప్రియనెచ్చలి' విశాలాక్షి గారు (వనితావని వేదిక  బ్లాగర్) వివరణ -

భారతిగారూ! నాకు మంచి పరీక్షే పెట్టారు. అయినా చూద్దాం. నేను రాసింది మీకు సమ్మతమో, కాదో....
పంచభూతాలు:-- పృధివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం...
పంచ ప్రాణాలు :__ ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము...

వసుదేవత- వసువులంటే ప్రాణులు నివసింప యోగ్యమైనవి. భూమి మనకు నివాస యోగ్యము.
మృగాలకు, పశుపక్ష్యాదులకు,క్రిమికీటకాదులకు ఈ భూమే నివాసం. అన్నింటికి ఆశ్రయమిచ్చే ఈ పృధివి దేవత మనం తినే ఆహార పదార్ధాలు - ధాన్యాలు,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, సుగంధంతో పరిమళాలు వెదజల్లే పుష్పాలు ఇవన్నీ భూమి ద్వారా లభ్యమవుతాయి. ఇవేకాక విలువైన ఖనిజాలు,లోహాలు, సువర్ణము, రత్నాలు, వజ్రాలు మొదలైన విశేషమైన ధాతువులు మనకు భూమి నుండే లభిస్తాయి.

జలదేవత:-- మన జీవనానికి నీరు చాలా అవసరం. నీరు లేకుంటే సమస్త ప్రాణులు నిర్జీవంగా ఉంటాయి. నీరు లేకపోతే వృక్షసంపద క్షీణించిపోతుంది. ఎన్నో ప్రాణులు నీటిలోనే నివసిస్తాయి.అందుకే జలం దేవత. 

 వాయుదేవత:-- గాలి లేనిదే సృష్టిలో ఏ ప్రాణి కొన్ని నిమిషాల కంటే ఎక్కువకాలం జీవించలేదు. మనం  తీసుకున్న ఆహారం జీర్ణమవ్వాలంటే జఠరాగ్నికి వాయువు తోడ్పడుతుంది.మన రక్తం శుద్ధి కావాలంటే ప్రాణవాయువు కావాలి. ఈ విశ్వమంతా వివిధరకాల వాయువుతో నిండి వుంది. కేవలం వాయువులో నివసించే ప్రాణులు కూడా కొన్ని ఉన్నాయి. కనుక వాయువు దేవత.

అగ్నిదేవత:-- మన నిత్య జీవితంలో అగ్ని ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారపదార్ధాలు తయారుచేయడానికి, చలినుండి ఉపశమనం పొందడానికి, అగ్ని తోడ్పడుతుంది. "అగ్ని సమస్త దేవతలకు ముఖం- నోరు వంటిది. అగ్నిలో వేసిన పదార్ధాలు సూక్ష్మమై గాలిలో కలసి సమస్తప్రాణులకు ఆరోగ్యాన్ని, సుఖశాంతులను కలిగిస్తాయి.భూమ్యాది పంచ భూతాల వలన, సూర్యాది గోళాల వలన మానవులకు అన్న వస్త్రాలు, ప్రకాశం, వేడి మొదలైన జీవన ఉపయుక్త పదార్ధాలు లభిస్తాయి. అందుకే అవి దేవతలు. ఈ దివ్య పధార్ధాలను  ఉపయోగించుకొని, వాడుకొని వాటిని మరల అగ్నిలో పవిత్రం చేయాల్సిన బాధ్యత మానవులకే ఉంది.అగ్నిలో నేయి, ఓషదులు ఆహుతిగా ఇవ్వడం వలన అపవిత్రమైన వాయు,జలాదులు పరిశుద్ధమై పుష్టికారకమవుతాయి.

ఆకాశదేవత:-- అంటే అవకాశం కల్పించేది. మనం చూసే ఖాళీ ప్రదేశం. దాని ద్వారానే శబ్ద తరంగాలు,ఒకరి నుండి మరొకరికి చేరుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలేవీ లేకపోతే ప్రాణులేవీ జీవించలేవు. అంతరిక్షంలోని గ్రహాలకు గ్రహాలకు మధ్య, గ్రహాలకు ఉపగ్రహాలకు మధ్య, నక్షత్రాలకు నక్షత్రాలకు మధ్య ప్రదేశం ఆకాశం. మానవులు ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాలు 'శాటిలైట్స్ ' అన్నీ అంతరిక్షంలోనే తిరుగుతూ భూమి మీద ఉన్న వార్తలను చిత్రాలను ఒకచోటి నుండి మరొక చోటికి అందిస్తున్నాయి. ఆకాశం లేకపోతే ఇది సాధ్యం కాదు. కనుక ఇది దేవత.

కాబట్టి పంచభూతాల సాక్షిగా.. అంటే దేవతల సాక్షిగా.. మరియు పంచభూతాలే పరమాత్మ..పరమాత్మ సాక్షిగా... సమ్మతమేనా మిత్రమా నా ఈ వివరణ. 

స్పూర్తిమయి, సద్గుణ సంపన్నమయి, సాహిత్య ప్రజ్ఞామయి, 'నా స్నేహమయి' వనజ గారు (వనజవనమాలి  బ్లాగర్) వివరణ - 

భారతి గారు ... 
పంచభూతాలు ... ఆకాశం భూమి వాయువు ,నీరు,  అగ్ని  ఈ సమస్త సృష్టి అంతా వీటితోనే నిర్మితమై ఉంటుంది .. పదునాలుగు లోకాలన్నీ కూడా !  మనం ఏ క్రియ నిర్వహించినా  వీటి సాక్ష్యం ఉంది తీరుతుంది.  అందుకే పంచ భూతాలూ సాక్షిగా అంటారని అనుకుంటున్నాను . శివుడుకు  పంచ ముఖాలు... ఆద్యంతాలు లేనివాడు సమస్త జగత్ ని తనలో నిమ్పుకున్నవాడు ఆది పురుషుడు శివుడు కాబట్టి ఆయన ఈ పంచ భూతాలని అయిదు ముఖాలు చేసుకున్నాడని ఎక్కడో చదివాను . నాకు తెలిసింది ఇదేభారతీ గారు .

స్నేహశీలి, శ్రేయోభిలాషి, సహృదయులు ' నా ఆత్మీయ నేస్తం' రుక్మిణీదేవి గారు ( భారతీయం బ్లాగర్) వివరణ - 

భారతి గారు!
సమస్త ప్రాణికోటి జీవనాధారములైన పృథ్వి, అగ్ని, జలము ,వాయువు , ఆకాశము - పంచ భూతములుగా పేర్కొనబడినవి .. వీటిలో ఎ ఒక్కటి లేకపోయినా జీవి మనుగడ దుర్లభం ..అందుకే సమస్త ప్రాణికోటి అని అనేకన్నా పంచభూతముల సాక్షిగా అని చెప్పబడి వుంటుంది అని నా వుద్దేశ్యం .

ముగ్గురు మిత్రుల అమూల్య వివరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. 

బహుశా అందుకేనేమో ... మన పూజా పద్ధతిలో- గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవిగా పేర్కొంటారు, ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలను భగవత్ స్వరూపములుగా గుర్తించి ఆరాదించే పద్ధతిని పెద్దలు ప్రవేశపెట్టారనుకుంటాను . 

28, సెప్టెంబర్ 2015, సోమవారం

స్థూలం నుండి ప్రజ్ఞామయం వరకు - - - చక్రశుద్ధి - ఆనందసిద్ధి (చివరిభాగం)

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి. 

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. 
తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే. 
రజస్సు వలన శరీరం నందలి వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే,  భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా  మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి. 

గత టపాల్లో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు సహస్రారచక్రం గురించి తెలుసుకుందాం. 

సహస్రారచక్రం : -              
                                                   
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ 

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి. 
                                           

                                       
మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. 
ఈ చక్ర మానసిక స్వభావం - 
ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు. 
ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - 
తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతవరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు  ఆనంద నందనవనములు అవుతాయి. 
ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం. 

కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్ధించాలి. {ప్రార్ధన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, పూజగదిలో దేవుని పటాల ముందు దీపారాధన చేసి భగవంతుణ్ణి ఏదో ఒకపేరుతో నుతించడం, స్తుతించడం కాదు,  శ్లోకపూరితమైన అనుష్టానాలు కాదు. దేవుడు అంటే పటమో విగ్రహమో కాదు, దేవుడు అంటే గుడి లోనో, దివిలోనో ఉండేవాడు కాదు, పటమైనా, విగ్రహమైన, శ్లోకమైన, మంత్రమైన, నామమైన ... ఇవన్నియూ మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్ధన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. మనకేం కావాలో, మన గమ్యమేమిటో, ఏమార్గంలో పయనించాలో తెలుసుకుంటూ (శోధిస్తూ) సప్తచక్రాలను చైతన్యపూరితం చేయగలిగే సాధన చేయగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ విధంగా సాధన సాగిస్తున్న కొలది ...  ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. పారమార్ధికంగా పురోగతి సాధించామన్నదానికి గుర్తు - ఆనందంగా ఉండటమే. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. 
ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారం నందు తిరిగి జన్మింపరు. మూడులోకములయందు సయితం బద్ధులు కారు.  

మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో  స్థూలంనుండి  ప్రజ్ఞామయం వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి. 




18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

"అచ్చంగా బాలగోవిందులు"

కొన్నిరోజుల క్రితం తిరుపతి వెళ్ళాం, నా మనవళ్ళు {మా అమ్మాయి సంతానం, మొదటపాప శ్రీమాన్వి (స్మరణ సందర్శులకు సుపరిచితం), రెండవసారి ఇద్దరు బాబులు (కవలలు), అభినవ్ రామ్, అభిజిత్ రామ్} బాబులిద్దరికి పుట్టుజుత్తు తీయించడానికి. 

పుట్టుజుత్తు తీసేసిన తర్వాత దర్శనానికి వెళ్తుండగా ఓ ఆమె వచ్చి నామాలు బాబులకు పెట్టి "అచ్చంగా బాలగోవిందులు"లా వున్నారు అని అనగా, 
                                              అచ్చంగా బాలగోవిందులు                

ఆహా! బాల గోవిందులు నా మనవళ్ళు అని అనుకోగా, మనసంతా ఆనందంతో నిండిపోయింది. 'ఇంతటి అదృష్టాన్ని అనుగ్రహించిన నీకు నేనెమివ్వగలను వేంకటేశా' అని అనుకోగానే నవ్వువచ్చింది. సర్వమూ తనదైన ఆ సర్వేశ్వరునికి  నేనిచ్చేది ఏముంటుందీ? మనసార నమస్కరించడం, పాహిమాం పాహిమామని ప్రార్ధించడం, శరణు శరణని వేడుకోవడం తప్ప... అని అనుకుంటుండగా, నాకెంతో ఇష్టమైన అన్నమయ్య సంకీర్తన గుర్తుకొచ్చింది. ఆ సంకీర్తన మదిలో కదులాడుతుండగా, శరణాగతి భావంతో  దైవాన్ని దర్శించుకోవడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. 

ఇంతకీ నా మదిలో కదిలాడే ఆ సంకీర్తన ఏమిటో చెప్పనే లేదు కదా. ఆ పరమోత్తమ సంకీర్తన ఇదే - 

ఏ దుపాయము యే నిన్ను చేరుటకు / ఆదినంత్యములేని                                                                                                                        అచ్యుతమూరితివి 
వెలయ నీగుణములు వినుతించేనంటే /తెలియ నీవు గుణాతీతుడవు 
చెలరేగి నిన్ను మతి జింతించేనంటే / మలసి నీవచింత్యమహిముడవు
పొదిగి చేతుల నిన్ను బూజించేనంటే / కదసి నీవు విశ్వకాయుడవు 
అదన నేమైన సమర్పించేనంటే / సదరమై అవాప్తసకలకాముడవు 
కన్నులచేత నిన్ను గనుగొనేనంటే / సన్నిధి దొరక నగోచరుడవు
యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవవి / వన్నెల శరణనేవాక్యమే చాలు  

ఆదీ అంత్యమూ లేని అచ్యుతమూర్తివి అయిన నిన్ను ఉపాసించే మార్గం ఏదీ? నిన్ను చేరాడానికి ఉపాయం ఉందా? ఉంటే అది ఏదీ? అని అన్నమయ్య అంటూ ఇలా కీర్తించాడు -

నీ గుణములు కీర్తించుదామంటే నీవు గుణాలకన్నింటికీ అతీతుడవు. మదిలో నిన్ను గూర్చి చింతించుదామనుకుంటే నీకై చింతించుటకు సాధ్యంగాని అనంతమైన మహిమలు కలవాడివి. ఇక నా చేతులతో నిన్ను పూజిద్దామంటే, నీవు అందుకు సాధ్యంగాని విశ్వమయుడవు. మరి ఏదైనా నీకు సమర్పించుదామంటే, నీవు అన్నికోరికలు తీరినవాడివి. నా కన్నులతో నిన్ను చూద్దామంటే, నీవు అగోచరుడవు. అందువల్ల ఓ వేంకటేశా! అన్నింటా మేలైనది, నీకు శరణు అనడమే, నిన్ను శరణుపొందడమే. 
                                                          *****
                      
                                        

                              వావ్ ... బాలగోవిందులు ఇక్కడ బాలకృష్ణులయ్యరే!

నా మనవళ్ళు బాలగోవిందులై గుర్తుచేసిన అన్నమయ్య సంకీర్తన పైనది కాగా, బాలకృష్ణులై  గుర్తుచేసిన మరో సంకీర్తన యిది - 

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు / వాని పట్టితెచ్చి పొట్టనిండా పాలు వోయరే 
గామిడై పారితెంచి కాగెడి వెన్నలలోన / చేమపూవు కడియాల చేయిపెట్టి 
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార / వేమరు వాపొయె వాని వెడ్డువెట్టరే 
ముచ్చువలె వచ్చి తన ముంగిట మురువుల చేయి / తచ్చెడి పెరుగులోన తగవెట్టి 
నొచ్చెనని చేయిదీసి నొరినెల్ల జొల్లుగార / వొచ్చిలి వాపోవువాని నూరడించరే 
ఎప్పుడు వచ్చెనో మా యిల్లుజొచ్చి / పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయిపెట్టి 
అప్పడైన వేంకటేశుడా సపాలకుడు గాన / తప్పకుండా బెట్టె వాని తలకెత్తరే //

కుదురుగా కూర్చోక, ఉన్నచోట వుండక, ఆ వాకిట ఈ వాకిట, చెట్టూపుట్టా, సందూ గొందూ అనక అటూ ఇటు పరుగులు తీసే చిలిపికన్నయ్యను చూస్తూ గోపకాంతలు మురిపంగా ఇలా అనుకుంటున్నారట ... 

ఈ ముద్దులోచ్చే బాలుడు ఎక్కడివాడమ్మా, వాని పట్టితెచ్చి పొట్టనిండా పాలు పోయండే. 
వెన్నను కాజేద్దామని ఆరిందలా పరిగెట్టుకుంటూ వచ్చి కాగుతున్న వెన్నకుండలో తన కడియాల చేయిపెట్టి, చేయి చురుక్కుమని, చెక్కిట కన్నీరు కారుతుండగా, తన నవనీతచోరత్వం బయటపడకూడదని మనల్ని ఏమార్చుతూ చీమకుట్టిందని వాపోతున్న కృష్ణయ్యను ఊరడించరే ... 
దొంగలా వచ్చి తన బుజ్జిచేతిని చిలుకుతున్న పెరుగులోన పెట్టగా, కవ్వం తగలగా, చేయినొచ్చెనని నోరంతా జొల్లుకారెట్లు ఏడుస్తున్న ఈ కన్నయ్యను కాస్తా ఊరడించండ్రా  ... 
బాలకృష్ణుని చిలిపిచేష్టలు, రేపల్లే పడుచుల ముచ్చట్లూ, మురిపాలు ... ఎంతవిన్నా, ఎంతచదివినా ఆ ఆనందం తనివి తీరనిది. 
మొదటంతా తన భక్తులైన గోపకాంతల చెంత నవనీతచోరత్వం గురించి ఆ గోపికలు మురిపంగా చెప్పుకోవడంను అన్నమయ్య కీర్తించాడు. {భక్తుల భవబంధపాశాల విమోచన చేసే ఈ చోరత్వం వెనుక ఓ మర్మముంది. ఆ వివరణ

 ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు}. ఇంతవరకు కృష్ణయ్య బాలలీలలు తెలిపిన అన్నమయ్య చివరి చరణంలో ఇలా కీర్తించాడు  -

ఎప్పుడు వచ్చెనో మాయింట్లోనికి. వచ్చి పెట్టెలో చెయ్యి పెట్టెను. ఇక ఈ పెట్టెను తప్పకుండా అసమానుడైన వేంకటేశ్వరుని తలకెత్తరే ... అని అన్నమయ్య అనడంలో అంతరార్ధం అనంతం. 
ఇంట్లోనికి రావడం, పెట్టెలో చెయ్యి పెట్టడం, ఆ పెట్టెను భగవంతుని తలపై పెట్టమనడం ... కాస్తా ఆలోచిస్తే ఇందులో సూక్ష్మార్ధం అవగతమౌతుంది. 
ఆ సూక్ష్మార్ధం తెలుసుకునే ముందు ఓసారి మనసార అన్నమయ్యను స్మరించుకోవాలని వుంది. 
తాను తరించి, మనలనూ తరింపజేసే వాగ్గేయకారుడు "అన్నమయ్య". ఈయన సంకీర్తనలు వేదాంత భావగర్భితాలు. ప్రతీ కీర్తనలో వేదాంత రహస్యాలు, ఆధ్యాత్మిక సూచనలు వుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ సంకీర్తనలో బ్రహ్మతత్త్వ సారాంశముంటుంది. 

ఆధ్యాత్మిక సాధకుని ప్రయత్నంలో తొలుత ఎంతో అయోమయం, ఎన్నో అర్ధంకాని విషయాలు, అటుపై ఎంతోకొంత అస్థిరత్వం, అంతం అగుపించని అన్వేషణ, తీరం తెలియని పయనం, అంతర్యామిని కనుగొంటానా అన్న ఆవేదన, అనంతున్ని పొందాలన్న ఆరాటం, వీడని వాసనల వలన ఆందోళన, అన్నింటినీ వీడి మనస్సుని అధిగమించాలన్న పోరాటం ... ఇలా ఎంతో సంఘర్షణతో నలిగిపోతున్న మనస్సును చల్లగా తాకి, దారిచూపేవే అన్నమయ్య సంకీర్తనలు. సాధకునికి అన్నమయ్య ప్రతీ సంకీర్తన సదా స్మరణీయం.
అయితే, అన్నమయ్య పాటలు కొన్ని త్వరగా అర్ధం కావు. అందుకు కారణం - ఈయన వాడిన కొన్ని పదాలు నేడు మరుగున పడిపోయాయి. జన వ్యవహారికంలో లేవు. అయినను అవగాహన చేసుకోవడానికి ఒకింత ప్రయత్నం చేస్తే, ఆప్పుడు అవగతమౌతుంది ఈయన పలికిన పలుకెల్ల పదకవితై పరమాత్ముణ్ణి ఎలా మెప్పించ గలిగిందన్నది. 
పదకవితా పితామహుడయిన ఆన్నమయ్య విరచిత సంకీర్తనలు వేనవేలు. 
దాచుకో, నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి 
పూచి నీ కీరితి రూపు పుష్పములివియయ్యా 
ఒక్క సంకీర్తనే చాలు, ఒద్ధికై మము రక్షింపగ
తక్కినవి భండారాన దాచి ఉంచనీ ... అన్న ఆయన భావంలో అతిశయోక్తి లేదు. 
 
ప్రతీ పలుకు పారమార్ధిక పాటైన పదజీవనునికి పాదాభివందనాలు.  

ఇక పై సంకీర్తనలో ఆ చివరి చరణం యొక్క సూక్ష్మార్ధంను పరిశీలిస్తే - 

కర్మ చేయక క్షణమైనను జీవించలేం. ఉన్నస్థితినుండి ఉన్నతస్థితికి చేరుకోవాలనే ప్రయత్నమే ప్రతీ ప్రాణీ చేయు 'కర్మ'.  చేసే ప్రతీ కర్మ యొక్క ఫలితం మనస్సులో సూక్ష్మాతి సూక్ష్మమైన ముద్రను వేస్తుంది. దీనినే 'వాసన' అంటారు. ఈ వాసనలననుసరించే మనలో కోరికలు, తలపులు జనిస్తుంటాయి, పునర్జన్మలకు హేతువవుతుంటాయి. అందుకే ఈ వాసనలుగా పరిణమించే కర్మలు ఉన్నతంగా, అచ్యుతున్ని అందుకునేలా ఉండాలి. ఏ కర్మలాచరిస్తే అది 'వాసన'గా మనల్ని బాధపెట్టాక, బంధీ చేయక వుంటుందో, అటువంటి సత్కర్మలు సద్భావనతో ఆచరించగలగాలి. అటుపై ఆ సత్కర్మ ఫలితాన్ని ఆసక్తితో, ఓ సంపదగా మన మది అనే బోషానంలో దాచుకోక, ఆ బోషానాన్ని అంటే ఆ పెట్టెను ఆ అనంతున్నిపై పెట్టేస్తే ... అంతా ఆయనకే సమర్పించేస్తే ... మనసు వెదురుబొంగులా డొల్లవ్వదా, అది ఆ భగవంతుని చేతిలో పిల్లనగ్రోవి కాదా? ఇలా చేస్తే జీవితం సార్ధకం కాదా? ఈ ప్రయత్నం పరమాత్ముణ్ణి చేర్చదా? 
నిష్కామ కర్మయోగం అంటే ఇదే. దీనిని ఆచరిస్తే జన్మ పావనమౌతుందన్న సత్యాన్ని తెలియచెప్తుంది పై కీర్తనలో చివరి చరణం. 
                                                                                                                                                 అమ్మమ్మా! నేను కూడా కృష్ణునిలా తయారయ్యాను చూడు అని అంటున్న నా  చిట్టితల్లి శ్రీమాన్వి 

ఇంత చక్కటి సంకీర్తనలను స్మరించుకునేటట్లు చేసిన నా చిన్నారి మనవళ్ళుకు శుభాశీస్సులతో ఈ పోస్ట్ ను ప్రేమగా  వారికి అంకితమిస్తున్నా. 






    26, ఆగస్టు 2015, బుధవారం

    జీవాత్మ-పరమాత్మ --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఆరవభాగం]


    గత టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధచక్రాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరవచక్రమైన ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుందాం -
    ఆజ్ఞాచక్రం -
    ఐం హ్రీం శ్రీం హాం హం సశ్శివస్సోహం సోహం, సశ్శివ ఆజ్ఞాదిష్టాన దేవతాయై హాకినీ సహిత పరమాత్మస్వరూపిణ్యై నమః
    ఈ కమలం రెండు దళాలుతో వుంటుంది. మనోతత్త్వం. అధిదేవత హాకీని. ఈమె హ, క్ష అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పులిహార ప్రీతి. ఈమె మజ్జాధాతువునకు అధిపతి.
    భ్రూమధ్యమందు విలసిల్లే ఈ చక్రం మనలో 3,240 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఈ స్థానం మనస్సుకు మనకు సంధానం చేస్తుంది. ఇది ఈ శరీర మనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది. 

    ధ్యానమను స్థితిచేత ప్రకాశించు ఈ చక్ర కమలమందు రెండు దళాలు కలవని తెలుసుకున్నాం. ధ్యానమనగా ధ్యానింపబడు విషయం, ధ్యానించువాడు అను రెండు మాత్రమే కలిగిన స్థితి. 'హ'కారం, 'క్ష'కారం అను రెండు దళాలతో కూడిన ఈ పద్మం అదే స్థితిని సూచిస్తుంది. ద్యానింపబడు పరమాత్మ, ధ్యానించే జీవాత్మ మాత్రమే వుండే స్థితి. ఈ ధ్యానంను సాధన చేస్తే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం. తద్వారా పొందే స్థితి బ్రహ్మత్వపు స్థితి. బ్రహ్మమే తానని తెలుసుకునే స్థితి. ఇక్కడ అన్నింటిని పరిత్యజించి జీవుడు బ్రహ్మభూతుడవుతాడు . సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. 

     'శ్వాస' ప్రక్రియకూ, ఆధ్యాత్మిక శక్తికీ చాలా సంబంధముంది. స్థూలశరీరానికి సంబంధించి లంగ్స్, తద్వారా హార్ట్, బ్లడ్ లో ఆక్సిజన్ సరిపడినంతగా సరఫరా చేయటానికి ఈ శ్వాస ప్రక్రియే ఆధారం. అందులోని  వొడిదుడుకులు సరిచెయ్యటానికి, దాని శక్తి యింకా పెంచటానికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది. ఈ శ్వాస వలన వచ్చేశక్తి స్థూలశరీరానికి ఎంత అవసరమో, సూక్ష్మశరీరానికి కూడా అంతే అవసరం. మనం లోపలకు తీసుకునే గాలి మూలాధారం వరకు వెళ్ళి, తిరిగి పైకి వస్తూ స్వాధిష్టాన చక్రంలో చైతన్యం పొంది ప్రాణశక్తిగా, జీవశక్తిగా మారుతుంది. తద్వారా ఇడా పింగళ సుషుమ్నా నాడుల ద్వారా ఆజ్ఞాచక్రంకు చేరుతుంది. ఈ చక్రమే శ్వాస చంచలగతిని అదుపుచేసి క్రమక్రమంగా నిశ్శలం చేసి కైవల్యానికీ, మోక్షానికీ, జీవన్ముక్తికీ కారణమౌతుంది. ఈ చక్రాన్నే దివ్యనేత్రమనీ, జ్ఞానచక్షువనీ అంటారు. అలానే ఈ స్థానాన్నే త్రివేణీసంగమం అంటారు. 'త్రివేణిసంగమం' గురించి మరికొంత వివరణకై  ఇక్కడ చూడండి.  
    ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని రక్తప్రసరణవ్యవస్థతో సంబంధం.

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
    రక్తక్షీణత, రక్తస్రావం అను వ్యాధులు సంభవించును. వినాళ గ్రంధులవ్యాధులు, అధిక రక్తపోటు, ప్రేగులలో పుండ్లు లాంటి వ్యాధులు కలుగును.  
    ఈ చక్ర మానసిక స్వభావం -
    మూసుకుపోవడం వలన మానసిక స్థిరత్వం లేకపోవటం, కనులలో లోపాలు,క్షమాగుణం లేకపోవటం, నిరాశ నిస్పృహలతో కూడిన అలసట, అన్ని విషయాలయందు సందేహస్పదులు.  
    తెరుచుకుంటే మనసులో, దృష్టిలో స్థిరత్వం, ఏకాగ్రత వుంటుంది. సూక్ష్మ బుద్ధి అలవడుతుంది. వివేకానికి మూలమై సత్యాన్ని గ్రహించమని నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తి, ఆలోచన, అంతరదృష్టిలను  పెంపొందిస్తుంది. నీటియందు మంచుగడ్డ కరిగిపోయినట్లు 'నేన'ను అహం అంతర్యామి యందు కరిగిపోవును. 
    ఈ చక్రమును శుద్ధిచేసుకోవడం ఎలా???
    శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
    ఈ చక్రంనకు హాకీని అధిష్టానదేవత. ఈమెకు పులిహార మందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పులిహారను స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో తగు ఔషదములను ఉపయోగిస్తూ 'ఓం' అను బీజాక్షరమును ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. ఓంకారం వేదమునకు మొట్టమొదటి బీజం. ఈ ఓంకారం వివరణకై ఇక్కడ ఓంకారం - 1&2చూడండి.
    ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
    నియంత్రణతో కూడిన భావనలు చేయడం అవసరం. ధారణ, ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది.
    ఈ చక్రమునకు అధిపతి గ్రహం చంద్రుడు. మనిషి మానసిక స్థితికి, ధన సంపాదనకు చంద్రుడు కారకుడు. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా వుండడు. వృద్ధి క్షయాలు కలిగినవాడు. అందుకే జాతకంనందు చంద్రుడు సరిగ్గా లేకుంటే చంచల స్వభావం కలిగి వుంటారు. చంద్రుడు నీటికి కారకుడు. అందువల్ల మంచినీరు ఎక్కువగా త్రాగాలి. అలాగే చంద్రుడు తెలుపువర్ణమునకు సంకేతం కావున సాధ్యమైనంతవరకు తెలుపురంగు వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు వుండేలా అభ్యాసం చేయడం, మృదువుగా మసులుకోవడం చేస్తే చంద్రానుగ్రహం సాధించినట్లే. తత్ఫలితంగా ఆజ్ఞాచక్రం సానుకూలంగా పనిచేస్తుంది.
    తదుపరి చక్రం 'సహస్రారం' గురించి తదుపరి టపాలో ...

    21, ఆగస్టు 2015, శుక్రవారం

    మాటే మంత్రం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఐదవభాగం]

    అర్ధవంతమైన ఆదర్శవంతమైన జీవితానికి, నైతికవర్తనతో కూడిన జీవనానికి ఆధ్యాత్మిక పురోగామిత్యమే మార్గదర్శకంగా వుంటుంది. ఈ ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధ్యమో తెలియజేస్తున్నాయి మన శాస్త్రములు. శాస్త్రములు అంటే యోగులు, జ్ఞానులు స్వానుభవం బట్టి నిర్ణయించిన సరళధర్మములు. వాటిని అవగాహన చేసుకొని ఆచరిస్తే పారమార్ధికంగా పురోగతి సాధించవచ్చు.

    నా అవగాహన మేరకు మనలో ఉన్న సప్తచక్రములు గురించి, ఆ సప్తచక్రాలలో జాగృతి తీసుకువచ్చే సప్తగ్రహాలు గురించి తెలిపే ప్రయత్నం కొన్ని టపాలా ద్వారా తెలియజేస్తున్నాను. 

    ప్రతీ చక్రానికీ, ప్రతీ గ్రహానికీ  శారీరక, మానసిక, లేక ప్రాపంచిక, పారమార్దికంగా విధులు ఉంటాయి. ప్రతీ చక్రకేంద్రమునకు ఉద్భోదనము, ఉత్తేజం కలిగించు శబ్దములు లేక అక్షరములు కొన్ని కలవు. వీటిని ఓ క్రమమైన పద్ధతిలో ఉచ్చరించుటవలన ఈ కేంద్రముల ప్రవృత్తిల యందు మార్పులు కలిగి ఆ చక్రాలలో తేడాలు సర్దుబాటుయగును. దానివలన వ్యాధులు నిర్మూలనమగును. ఈ బీజాక్షరములను సరైన పద్ధతిలో ధ్యానించడం వలన  అనారోగ్యములు తొలగడమే కాకుండా మానసిక వికారములు కూడా పోయి బుద్ధి వికసించును. అయితే ఈ విధమైన సాధన కష్టమని భావించేవారికి కొన్ని సులభమార్గములను మన యోగులు సూచించారు. గ్రహాలను సానుకూలపర్చుకోవడం ద్వారా, ధ్యానసాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమేనని తెలిపారు. గ్రహాలనుండి అనుగ్రహ ప్రవాహాన్ని స్వీకరించే శక్తి మనలో వున్న చక్రాలుకు వుంది. అందుకే గ్రహాలను సానుకూలంగా పనిచేయాలంటే ఏం చేయాలో సూచించారు. ఆ సూచన సద్గుణాల సాధన. ఈ విధమైన అంటే గ్రహాలను సానుకూలపరుచుకునే సాధన సాగించిన కొలదియు భక్తీ, ధ్యానం, చక్రజాగృతి, ఆత్మార్పణం ... ఇతరసుగుణములు ఒకటొకటిగా అంతరంగం నుండి వికాసం నొందును.  ధ్యానమంటే మనలో వున్న మాలిన్యాన్ని తొలగించుకోవడమే. ధ్యానం ద్వారా మాత్రమే మనస్సుకు వారసత్వంగా సంక్రమించిన స్వభావంనుండి విడుదల కావడం సాధ్యమవుతుంది. 

    గత నాలుగు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదవ చక్రమైన విశుద్ధిచక్రం గురించి తెలుసుకుందాం -

    విశుద్ధిచక్రం - 
     
    ఐం హ్రీం శ్రీం రాం సోహం హంసశ్శివం: విశుధ్యధిష్టానదేవతాయై డాకినీ సహిత జీవేశ్వర స్వరూపిణ్యాంబాయై నమః

    ఈ కమలం 16 దళాలుతో ఉంటుంది. ఆకాశతత్త్వం. అధిదేవత డాకిని. ఈమె అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ , ఓ, ఔ , అం ,అః   అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పాయసాన్నమందు ప్రీతి. తెల్లని ఏనుగు (ఐరావతం) వాహనం.  

    కంఠప్రదేశం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 25,344 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. విశుద్ధి అంటే పవిత్రం (శుద్ధి) చేసేది అని అర్ధం. ఈ చక్రాన్ని సాధిస్తే పరమ పవిత్రులై, ఆత్మదర్శనానికి వున్న అడ్డంకులు తొలగించుకున్నవారై, తాము తెలుసుకున్నదానిని ఇతరులకు చక్కగా బోధించగలరు. ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం.  జ్ఞానేంద్రియం చెవి. 

    ప్రతీ మనిషికి వాక్కు చాలా ముఖ్యమైనది. తనని తాను వ్యక్తపరుచుకోవటానికి వాక్కు చాలా అవసరం. మన సంస్కారమును తెలిపేది వాక్కే. అందుకే పెద్దలంటారు - 'బుర్ర(తల) విలువ నోరు చెప్తుంది' అని! ఊరికే మాట్లాడడం కాదు, చక్కగా మాట్లాడగలగాలి. మృదుభాషణం చక్కటి సంబంధ భాంధవ్యాలను నెలకొల్పుతుంది. పరుషవాక్కులు, వక్రభాషణం ఎన్నో అనర్ధాలను అంటగడుతుంది. మంచి స్నేహాలను, మంచి బంధాలను, సామరస్యవాతవరణం నుంచి దూరం చేస్తుంది. అలానే మాట్లాడకూడని సమయంలో మాట్లాడినా, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోయినా పొందవలసిన జీవితం చేజారిపోయినట్లే. ఇంత ముఖ్యమైన వాక్కుకు కారణం కంఠభాగంలో ఉన్న ఈ విశుద్ధచక్రమే. మాట ఎలా వుండాలంటే  ...  వివరణకై  ఇక్కడ చూడండి 

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
    ముక్కు, నోరు, గొంతు, చెవులు మున్నగు భాగములకు సంబంధించిన వ్యాధులన్నియూ ఈ చక్రం పరిధిలోనికే వచ్చును. థైరాయిడ్ సమస్యలు వచ్చును. మాటలు సరిగ్గా రాకపోవడం, ఎలర్జీ, ఆస్తమ, టాన్సిల్స్ మొదలైన వ్యాధులు కలుగుతాయి. సంతానలేమికి కూడా ఈ చక్రం కొంత కారణం. 

    ఈ చక్ర మానసిక స్వభావం:-
    మూసుకుపోవడం వలన భావవ్యక్తీకరణలో లోపం. వాక్కులో అనేక అపసవ్యాలు. ఊహాశక్తి లోపిస్తుంది. 

    తెరుచుకుంటే వాక్సుద్ధి. కవితాశక్తి, స్వర విజ్ఞానం, శాంతచిత్తం, శోకం లేకపోవడం, దీర్ఘాయువు. 

     విజ్ఞానమయకోశంతో సంబంధం ఉన్న ఈ విశుద్ధచక్రం ద్వంద్వాతీత చక్రం. చైతన్యపూరిత చక్రం. ఇక్కడకు చేరిన సాధకుడు ఆనందస్థితిని పొందుతాడు. ఈ ఆనందపారవశ్యంలో తదుపరి గమ్యాన్ని మరిచిపోకుండా ముందుకు సాగాలి. ఇక్కడే ఆత్మజ్ఞానం కల్గుతుంది. అహం నశిస్తుంది. నేను అనే తత్త్వం పూర్తిగా నశించి, నేను 'ఆత్మ'పరమై నా ఆత్మ అన్న భావం నుండి విశ్వాత్మ భావన లోనికి మారి, సాధకుడు కవి, వాగ్మి, బ్రహ్మజ్ఞాని అవుతాడు. భూత, భవిష్యత్తు, వర్తమానములను దర్శింపగలుగుతారు. జీవించుట తనకోసంకాక సృష్టి యందలి సకల జీవుల రూపంలలో నున్న పరమాత్మకొరకని తెలుసుకొని తదనుగుణంగా జీవిస్తాడు. విశ్వశ్రేయస్సును సాధించువాడగుటచే శోకం గానీ, రోగంగాని లేక చిరంజీవియై యుందురు. ఈ చక్రం శుభమును కోరువారికి, ఇంద్రియనిగ్రహం గలవారికి మోక్షద్వారం. 

    ఈ చక్రమందు పదహారు దళాల యందు అ నుండి అః వరకు గల పదహారు అక్షరములు పదహారు కళలు. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల చంద్రుని పదహారు కళలే ఈ పదహారు రూపములు. చంద్రుడు మాతృత్వమునకు, గర్భధారణకు అధిపతి. అమావాస్య సృష్టి లయమై యున్న స్థితిని, పౌర్ణమి సృష్టి పూర్తిగా వ్యక్తమైయున్న స్థితిని తెలియజేయును. 

    మరి ఈ చక్రమును ఎలా శుద్ధిచేసుకోవడం???
    శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
    ఈ చక్రంనకు డాకిని అధిష్టానదేవత. ఈమెకు పాయసాన్నం నందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పాయసాన్నం స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, 'హం' అను బీజాక్షరంను ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. 

    ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 

    నిర్మలమైన నీలాకాశాన్ని చూడాలి. ఈ చక్రంపై మనస్సును నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు ఆకాశంవలె పరిశుద్ధం అవుతుంది. నిర్మలమౌతుంది. 
    ఈ చక్రంనకు అధిపతి కుజుడు. ధైర్య సాహసాలకు సంబంధించిన గ్రహమిది. కుజుడు బాగా వేగం వున్నవాడు. పటుత్వం వున్నవాడు. అగ్నికి, ఆయుధాలకు సంబంధించినవాడు. ఎక్కడ స్థిరత్వముందో, ఎక్కడ కాళ్ళ క్రింద భూమి కృంగిపోతున్నా చలించని ఆత్మవిశ్వాసముందో, ఎక్కడ సూటిదనముందో, ఎక్కడ సమానత్వముందో అక్కడ కుజుని శక్తి అపారంగా వున్నట్లు అర్ధం. మనలో ఈ లక్షణములను అభివృద్ధి పరుచుకుంటే ఈ చక్రం సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా విశుద్ధి చక్రం సానుకూలం. 

    తదుపరిచక్రం 'ఆజ్ఞాచక్రం' గురించి తదుపరి టపాలో ... 


    23, జులై 2015, గురువారం

    ప్రేమమయం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [నాల్గవభాగం]

    గత మూడు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాల్గవ చక్రమైన అనాహతచక్రం గురించి తెలుసుకుందాం -

    అనాహతచక్రం :-
    ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్శోహం అనాహతాదిష్టాన దేవతాయై రాకినీ సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః 

    ఈ కమలం 12 దళాలు కలది. వాయుతత్త్వం. అధిదేవత రాకిని. ఈమె క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ  అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలది. జింక వాహనం. 

    హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం. ఆగని శబ్దబ్రహ్మం ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం. ఓంకార శబ్దం. ఈ చక్రాన్ని జయిస్తే సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు. దిగువనున్న మూలాధారాది మూడుచక్రాలకు, ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం చేస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం చర్మం. 

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
    చర్మవ్యాధులు, రక్తంనకు సంబంధిన వ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండెజబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. 

    ఈ చక్ర మానసిక స్వభావం :-
    మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు. 

    తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత వికసించటం. 

    మనోమయకోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందే ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్) పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది. 

    మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???
    శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
    ఈ చక్రంనకు రాకినిఅధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి. స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు  ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు. 

    ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 
    ఇతరులకు హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి. 
    ఇక  ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలును, అతి తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాబ్యాసం చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ గ్రహం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది. 

    తదుపరి చక్రం 'విశుద్ధచక్రం' గురించి తదుపరి టపాలో ...