17, జనవరి 2013, గురువారం

అమ్మా! నాకో సందేహం.....


ఓం... నమో నారాయణాయ
 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
 దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
 దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
 హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే
 అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
 వంకర కన్నుల మీరు శంకర కింకరులు
 వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు.....

ఉదయం ఈ పాటను మా అమ్మాయి అనూష పాడుతూ - 
అమ్మా! నాకో సందేహం... హరి హరులు వేరు వేరా? భగవంతుడు ఒక్కడే అంటారు కదా. మరి ఇన్ని రూపాలెందుకు? ఇన్ని బేధాలెందుకు? మానవుల మద్య ఈ విబేధాలెందుకు?
అమ్మా! నాకో సందేహం..... అంటూ నాలుగు ప్రశ్నలు సంధించింది. నాకు తెలిసినంతలో జవాబు చెప్పాను ఇలా -
హరి హరులు వేరు కాదమ్మా...
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే /
శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః //
                                                    - స్కందోపనిషత్తు
శివుని యొక్క రూపమే విష్ణువు. విష్ణువు యొక్క రూపమే శివుడు. శివుని హృదయమే విష్ణువు. విష్ణు హృదయమే శివుడు. 

భగవంతుడు ఒక్కడే. 
"ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అన్నది శ్రుతి వాక్యం. 
సత్స్వరూపమైన పరబ్రహ్మ ఒక్కటే అయినను జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులను బట్టి అనేక స్వరూపాలుగా, పలు పేర్లుగా పిలవబడుచున్నది.

పరమాత్ముడు ఒక్కడైనను, ఆ కాలమందున్న జనుల యొక్క మనఃపక్వతను అనుసరించి ఒక్కొక్క కాలమందొక్కొక్క అవతారం వహించెను.
బహునా త్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ /
అనేక భేదాభిన్నస్తు క్రీడతే పరమేశ్వరః //
ఈ జగమంతయూ బ్రహ్మమే. ఆ బ్రహ్మమగు పరమేశ్వరుడు అనేక విధములుగా అవతరించి క్రీడించుచున్నాడు.

సృష్టిస్థిత్యంత కరణీం బ్రహ్మవిష్ణు శివాత్మికామ్ / 
స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దనః //
సృష్టి స్థితి లయ కారణముల కొఱకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేర్లు వహించిన పరమాత్మ ఒకటియే గాని అన్యం లేదు.

నారాయణశ్శివో విష్ణుశ్శంకరః పురుషోత్తమః /
ఏతేషు నామాభిర్బ్రహ్మపరం ప్రోక్తం సనాతనమ్ //
నారాయణ, శివ, విష్ణు, శంకర, పురుషోత్తములను నామములన్నియు సనాతనమైన పరబ్రహ్మము యొక్క పేరులే గానీ వాటి మద్య బేదం లేదు.

మానవుల అజ్ఞానం కొలదే ఈ విబేధాలు. పూర్వం ఈ విబేధాలు ఎక్కువగా ఉండేవి. ( ఈ మద్యనే ఓ పుస్తకం చదివాను. శైవం కంటే వైష్ణవ మతం గొప్పదని ఓ ఆచార్యులవారి ప్రబోధం. తదుపరి టపాలో దీనిని ప్రస్తావిస్తాను) ఈ అజ్ఞానమును వీడమని, అంతా పరబ్రహ్మమయమేనని శాస్త్రవచనం. అంతా ఒకటేనని మహర్షుల మాట. ఏకం సత్ అన్నది గురువుల ప్రబోధం. 
యో సౌ విష్ణుస్స్వయం బ్రహ్మాయో బ్రహ్మా సౌ మహేశ్వరః /
వేదత్రయే చ యజ్ఞే స్మిన్ పండితేష్వేష నిశ్చయః //
ఎవ్వడు విష్ణువో, వాడే స్వయంగా బ్రహ్మదేవుడు. ఎవ్వడు బ్రహ్మదేవుడో, వాడే మహేశ్వరుడు. ఈ రహస్యం మూడువేదముల యొక్క, యజ్ఞాదుల యొక్క, పండితుల యొక్క నిశ్చితాభిప్రాయం. 
గతంలో ఓ పోస్ట్ లో ప్రస్తావించిన పరమానందయ్య అనే గురువుగారు తన శిష్యులకు జ్ఞానోదయం కల్గించిన కధను మరోసారి మా అమ్మాయికి గుర్తుచేశాను.
పరమానందయ్య శిష్యుల కధలు చాలావరకు అందరికీ తెలుసు. శిష్యుల అమాయకత్వం, ఆ అమాయకత్వంలో వారు చేసే పనులు, గురువుగారి బోధలు ...... వీటినీ పరిశీలిస్తే మనల్ని ఉద్ధరించే  సందేశాత్మకమైన ఆధ్యాత్మిక ప్రభోదాలే ఉంటాయి. (పరమానందయ్య శిష్యులు అజ్ఞానపు అమాయక చేష్టలు మన చేష్టలకు ప్రతిబింబాలే)
పూర్వం శివుడే గొప్పయని శైవులు, విష్ణువే గొప్పయని వైష్ణువులు పరస్పర నిందలతో, కొట్లాటలతో అవివేకంగా ప్రవర్తించేవారు. శివుడైనా, విష్ణువైన ఒకే పరబ్రహ్మమునకు చెందినవారని, ఒకే చైతన్య స్వరూపులని, అవివేకంతో ప్రవర్తించక ఈ రెండు రూపాలు మనిషి ఆధ్యాత్మిక జ్ఞానత్వమునకు ముఖ్యమే అని తెలుసుకొని అజ్ఞానమును వీడమని.... తెలియజెప్పే కధనమిది.
ఓ రోజు విశ్రమిస్తున్న పరమానందయ్యగారి కాళ్లు ఇద్దరు శిష్యులు పడుతూ, నేను పడుతున్న కుడికాలు గొప్పని ఒకరు, నేను పడుతున్న ఎడమకాలు గొప్పదని మరొక శిష్యుడు వాగ్వివాదం చేసుకుంటూ, చివరికి గురువుగారి కాళ్ళునే మరచెంబుతో ఒకరు, పానపాత్రతో మరొకరు కొట్టడం మొదలుపెట్టారు. ఆ బాధకి గురువుగారికి మెలుకువ వచ్చి ఆ రెండు కాలు తనవే నని, మీరు చేసిన ఈ అజ్ఞానపుపని నన్నే గాయపరిచిందని, మనిషి మనుగడకు రెండు కాళ్లు ముఖ్యమే కాబట్టి రెండు కాళ్లు గొప్పవేయని, మానవుల మనఃపక్వతను బట్టి వారిని ఉద్ధరించడానికే అనేక రూపాల్లో అవతరించిన భగవంతుడు ఒక్కడే అని, అది గ్రహించి అజ్ఞానమును వీడమని.

హరిం హరం విధాతారం యః పశ్యేదేకరూపిణమ్ /
స యాతి పరమానందం స యోగీ బ్రహ్మ ఉచ్యతే //
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకరూపంగా ఎవరు చూచుచున్నారో, అట్లున్న యోగి శాశ్వతానంద పొందే బ్రహ్మమని చెప్పబడుదురు.

12 కామెంట్‌లు:

  1. చక్కటి విషయాలను తెలియజేసారు.

    రిప్లయితొలగించండి
  2. అమ్మో.... ఎంత జ్ఞానమోనండి మీకు.

    రిప్లయితొలగించండి
  3. భారతి గారు.. శివ విష్ణు బేధం గురించి చక్కగా వివరించారు. చాలా మందిలో ఇప్పుడు కూడా ఇలాంటి దోరణి గమనిస్తూ ఉంటాం. వివరణాత్మకంగా చాలా బాగా తెలిపారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. అనూరాధ గారు!
    మీ ఈ వ్యాఖ్యకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  5. పద్మార్పిత గారు!
    ఆధ్యాత్మిక అభిరుచి, అధ్యాయనం, అవగాహన, అభ్యాసం అలవడడంతో అప్పుడప్పుడూ అనూష అడిగేప్రశ్నలకు ఇలా తెలిసినంతలో బదులివ్వగలుగుతున్నాను. మీ స్పందనకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  6. వనజ గారు!
    మీరన్నది నిజమే. అప్పుడప్పుడూ కొందరిలో ఇలాంటి దోరణి కనబడినా వారిలో కూడా క్రమేపి ఏకత్వభావన అలవడుతుందని నా నమ్మకం. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు ఆనందంగా ఉంది. మీకు నా ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  7. చక్కగా రాశారు .
    ఈశావాస మిదం సర్వం .
    ఈశ్వర శబ్దానికి ఐశ్వర్యమనీ ,
    విష్ణు శబ్దానికి విశ్వమంతా వ్యాపించి ఉండడ మనీ ,
    అంటే ,
    విశ్వ వ్యాపన మైన పరమాత్మ మహాచైతన్యమే ఈశ్వర-విష్ణు శబ్దాల పరమార్థంగా భావించవచ్చు .
    భారతి గారూ ,
    మీ బ్లాగు భగవంతుని ముంగిలి .

    రిప్లయితొలగించండి
  8. మాస్టారు గారు!
    మీ అమూల్య స్పందనకు, మీరిచ్చిన వివరణకు హృదయపూర్వక ధన్యవాదాములండి.

    రిప్లయితొలగించండి
  9. ఈ మధ్య ముఖ పుస్తకంలో(ఫేస్ బుక్ ) బిజీ అయ్యి...పండుగ హడావిడిలో బ్లాగ్స్ చూడలేదసలు...మీ మంచి పోస్టులు మిస్ అయ్యాను...చాలా వివరంగా చెప్పారు భారతి గారూ!...అభినందనలు...@శ్రీ

    రిప్లయితొలగించండి
  10. మీ స్పందన సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు శ్రీ గారు.

    రిప్లయితొలగించండి
  11. నిజమే, ఒకప్పుడు చాల ప్రభలంగా ఉండేది శైవవైష్ణువల భేదం. ఇప్పుడు చాలవరకు సమసిపొయింది.ఈ మధ్యకాలంలో నాకు వాట్సప్ లో వచ్చిన ఈ పద్యం చదవండి...ఎంత బాగుందో...

    ♦గమ్మత్తైన పద్యం♦

    పూర్వం ఒక రామ భక్తుడు.... రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.
    ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.
    ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.
    "విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.
    గవీశపాత్రో నగజార్తిహారీ
    కుమారతాతః శశిఖండమౌళిః।
    లంకేశ సంపూజితపాదపద్మః
    పాయాదనాదిః పరమేశ్వరో నః॥ ఆశ్చర్య పోయాడు చదవగానే.
    అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్ అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి విశేషణాలు. అర్ధం చూడండి...
    గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.
    నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.
    కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.
    శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.
    లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.
    అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,
    అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.
    అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.
    చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.
    ఇది మరో ఆశ్చర్యం.
    అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....
    పరమేశ్వరుడు ఎలాటివాడూ అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.
    ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!
    గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధం. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.
    నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.
    కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.
    శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.
    లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.
    అతడు మనలను కాపాడు గాక ....
    గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .
    ఇప్పటికి అతడు శాంతించాడు.
    సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు శైవుడు. ఇది మన భారతీయ కవితా వైభవము.

    రిప్లయితొలగించండి
  12. సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.

    ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు... మీరు, ఇంకా శివుడిలో ఎవరు గొప్పా అని అడిగారు. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు.

    ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహించడానికి ఏముంది? రాముడే ఈశ్వరుడుగా గలవాడు (రాముడు (విష్ణువు) తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని) అన్నాడు.

    వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు.

    విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
    ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

    అసలు వీళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు.

    శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
    శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

    శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే, అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది.

    శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.

    సేకరణ : బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం
    Whatsapp

    రిప్లయితొలగించండి