6, అక్టోబర్ 2015, మంగళవారం

"పంచభూతాలు"సాక్షిగా...

ఈ మధ్య నాకో సందేహం వచ్చింది, "పంచభూతాలు"సాక్షిగా అని ఎందుకంటారని?

న్యాయస్థానాలు 'భగవంతుని సాక్షిగా' అని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. అగోచరుడయిన భగవంతునికి ప్రతినిధిగా, తనచే చెప్పబడిన గీతను భగవత్ స్వరూపంగా భావిస్తూ ప్రమాణం చేయిస్తారని ఎక్కడో విన్నట్లు జ్ఞాపకం.  ఈ రీతిలోనే భగవంతునిచే సృజింపబడిన పంచభూతాలను భగవత్ స్వరూపంగా భావించి అలా అంటారా??? మరికొంత వివరణగా తెలుసుకోవాలనిపించి, కొందరు బ్లాగ్ మిత్రులను ఈ ప్రశ్నను అడగగా -
వారు వారి అభిప్రాయాలను తెలిపారు. వారి అమూల్య అభిప్రాయాలను  స్మరణలో పదిలపరుచుకునే ముందు, ముందుగా అసలు  ఈ పంచభూతాలు అంటే ఏమిటీ?  వాటి  ప్రాముఖ్యత ఏమిటీ ... అన్నది నేను చదివిన, విన్నదానిబట్టి నాకు తెలిసినది నా అవగాహన మేరకు ఒకింత వివరణ -

పంచభూతాలు :- పృథ్వి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం.
నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, శక్తిమంతుడు, చైతన్యుడు, అతీంద్రియుడు, సర్వాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ ... అని మనం పిలిచే కొలిచే భగవంతుడు నుండే ఈ పంచభూతాలు ఓ క్రమపద్ధతిలో ఉత్పన్నాలైనాయి. ముందుగా శబ్దమయమైన ఆకాశం పుట్టగా, దాని నుండి స్పర్శతత్వం గలవాయువు పుట్టింది. ఈ వాయువు నుండి ఘర్షణ చేత రూపం గల అగ్ని పుట్టింది. అగ్ని నుండి రస స్వరూపమైన జలము పుట్టింది. దీని నుండి వాసన కలిగిన పృథ్వి పుట్టింది.
                                                                   
                                           

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే.
ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.

సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి. ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం. ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం. ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.

మన స్థూల దేహంలోని పంచభూతముల అమరిక ఇలా వుంటుంది -

పృథ్వి :- 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం /వాసన.  

అగ్ని :- 
శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 

జలం :- 
రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  

వాయువు :- 
శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 

ఆకాశం :- 
అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం 
ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 

ఇక సూక్ష్మ దేహంలో పంచభూతాల అమరిక -  

మనలో పంచకోశాలు వున్నాయి మొదటిది అన్నమయకోశం. ఇది భూతత్వం నకు సంబంధించినది. రెండవది జలతత్వంతో కూడిన ప్రాణమయకోశం. మూడవది అగ్నితత్వంనకు సంబంధించిన మనోమయకోశం. నాల్గవది వాయుతత్వంనకు చెందిన విజ్ఞానమయకోశం. ఐదవది ఆకాశతత్వంనకు చెందిన ఆనందమయకోశం. ఈ ఐదు కోశాల మధ్య పరబ్రహ్మతత్వమైన ఆత్మ యున్నది. 

అలానే పంచభూతాలకు ప్రతీకలుగా మనలో ఐదు శక్తి నాడీకేంద్రములున్నాయి. ఇవే శక్తి చక్రాలు.  అవి భూతత్వంనకు చెందిన మూలాధారం, జలతత్వానికి చెందిన స్వాధిష్టానం, 
 అగ్నితత్త్వానికి ప్రతీకగా మణిపూరకచక్రం, వాయువుకు ప్రతీకగా అనాహతం, ఆకాశతత్త్వానికి ప్రతీకగా విశుద్ధిచక్రం. {ఆజ్ఞా, సహస్రారాలు తత్త్వాతీత చక్రాలు}. మన నడవడిక, అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు, ప్రారబ్ధ వాసనలు బట్టి ప్రభావితమౌతూ ఇవి పనిచేస్తుంటాయి. 

ఇక "పంచభూతాల సాక్షిగా" అని ఎందుకంటారన్న నా ప్రశ్నకు నా మిత్రులిచ్చిన వివరణ - 


సరళ స్వభావి, మృదుభాషిణి, 'నా ప్రియనెచ్చలి' విశాలాక్షి గారు (వనితావని వేదిక  బ్లాగర్) వివరణ -

భారతిగారూ! నాకు మంచి పరీక్షే పెట్టారు. అయినా చూద్దాం. నేను రాసింది మీకు సమ్మతమో, కాదో....
పంచభూతాలు:-- పృధివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం...
పంచ ప్రాణాలు :__ ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము...

వసుదేవత- వసువులంటే ప్రాణులు నివసింప యోగ్యమైనవి. భూమి మనకు నివాస యోగ్యము.
మృగాలకు, పశుపక్ష్యాదులకు,క్రిమికీటకాదులకు ఈ భూమే నివాసం. అన్నింటికి ఆశ్రయమిచ్చే ఈ పృధివి దేవత మనం తినే ఆహార పదార్ధాలు - ధాన్యాలు,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, సుగంధంతో పరిమళాలు వెదజల్లే పుష్పాలు ఇవన్నీ భూమి ద్వారా లభ్యమవుతాయి. ఇవేకాక విలువైన ఖనిజాలు,లోహాలు, సువర్ణము, రత్నాలు, వజ్రాలు మొదలైన విశేషమైన ధాతువులు మనకు భూమి నుండే లభిస్తాయి.

జలదేవత:-- మన జీవనానికి నీరు చాలా అవసరం. నీరు లేకుంటే సమస్త ప్రాణులు నిర్జీవంగా ఉంటాయి. నీరు లేకపోతే వృక్షసంపద క్షీణించిపోతుంది. ఎన్నో ప్రాణులు నీటిలోనే నివసిస్తాయి.అందుకే జలం దేవత. 

 వాయుదేవత:-- గాలి లేనిదే సృష్టిలో ఏ ప్రాణి కొన్ని నిమిషాల కంటే ఎక్కువకాలం జీవించలేదు. మనం  తీసుకున్న ఆహారం జీర్ణమవ్వాలంటే జఠరాగ్నికి వాయువు తోడ్పడుతుంది.మన రక్తం శుద్ధి కావాలంటే ప్రాణవాయువు కావాలి. ఈ విశ్వమంతా వివిధరకాల వాయువుతో నిండి వుంది. కేవలం వాయువులో నివసించే ప్రాణులు కూడా కొన్ని ఉన్నాయి. కనుక వాయువు దేవత.

అగ్నిదేవత:-- మన నిత్య జీవితంలో అగ్ని ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారపదార్ధాలు తయారుచేయడానికి, చలినుండి ఉపశమనం పొందడానికి, అగ్ని తోడ్పడుతుంది. "అగ్ని సమస్త దేవతలకు ముఖం- నోరు వంటిది. అగ్నిలో వేసిన పదార్ధాలు సూక్ష్మమై గాలిలో కలసి సమస్తప్రాణులకు ఆరోగ్యాన్ని, సుఖశాంతులను కలిగిస్తాయి.భూమ్యాది పంచ భూతాల వలన, సూర్యాది గోళాల వలన మానవులకు అన్న వస్త్రాలు, ప్రకాశం, వేడి మొదలైన జీవన ఉపయుక్త పదార్ధాలు లభిస్తాయి. అందుకే అవి దేవతలు. ఈ దివ్య పధార్ధాలను  ఉపయోగించుకొని, వాడుకొని వాటిని మరల అగ్నిలో పవిత్రం చేయాల్సిన బాధ్యత మానవులకే ఉంది.అగ్నిలో నేయి, ఓషదులు ఆహుతిగా ఇవ్వడం వలన అపవిత్రమైన వాయు,జలాదులు పరిశుద్ధమై పుష్టికారకమవుతాయి.

ఆకాశదేవత:-- అంటే అవకాశం కల్పించేది. మనం చూసే ఖాళీ ప్రదేశం. దాని ద్వారానే శబ్ద తరంగాలు,ఒకరి నుండి మరొకరికి చేరుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలేవీ లేకపోతే ప్రాణులేవీ జీవించలేవు. అంతరిక్షంలోని గ్రహాలకు గ్రహాలకు మధ్య, గ్రహాలకు ఉపగ్రహాలకు మధ్య, నక్షత్రాలకు నక్షత్రాలకు మధ్య ప్రదేశం ఆకాశం. మానవులు ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాలు 'శాటిలైట్స్ ' అన్నీ అంతరిక్షంలోనే తిరుగుతూ భూమి మీద ఉన్న వార్తలను చిత్రాలను ఒకచోటి నుండి మరొక చోటికి అందిస్తున్నాయి. ఆకాశం లేకపోతే ఇది సాధ్యం కాదు. కనుక ఇది దేవత.

కాబట్టి పంచభూతాల సాక్షిగా.. అంటే దేవతల సాక్షిగా.. మరియు పంచభూతాలే పరమాత్మ..పరమాత్మ సాక్షిగా... సమ్మతమేనా మిత్రమా నా ఈ వివరణ. 

స్పూర్తిమయి, సద్గుణ సంపన్నమయి, సాహిత్య ప్రజ్ఞామయి, 'నా స్నేహమయి' వనజ గారు (వనజవనమాలి  బ్లాగర్) వివరణ - 

భారతి గారు ... 
పంచభూతాలు ... ఆకాశం భూమి వాయువు ,నీరు,  అగ్ని  ఈ సమస్త సృష్టి అంతా వీటితోనే నిర్మితమై ఉంటుంది .. పదునాలుగు లోకాలన్నీ కూడా !  మనం ఏ క్రియ నిర్వహించినా  వీటి సాక్ష్యం ఉంది తీరుతుంది.  అందుకే పంచ భూతాలూ సాక్షిగా అంటారని అనుకుంటున్నాను . శివుడుకు  పంచ ముఖాలు... ఆద్యంతాలు లేనివాడు సమస్త జగత్ ని తనలో నిమ్పుకున్నవాడు ఆది పురుషుడు శివుడు కాబట్టి ఆయన ఈ పంచ భూతాలని అయిదు ముఖాలు చేసుకున్నాడని ఎక్కడో చదివాను . నాకు తెలిసింది ఇదేభారతీ గారు .

స్నేహశీలి, శ్రేయోభిలాషి, సహృదయులు ' నా ఆత్మీయ నేస్తం' రుక్మిణీదేవి గారు ( భారతీయం బ్లాగర్) వివరణ - 

భారతి గారు!
సమస్త ప్రాణికోటి జీవనాధారములైన పృథ్వి, అగ్ని, జలము ,వాయువు , ఆకాశము - పంచ భూతములుగా పేర్కొనబడినవి .. వీటిలో ఎ ఒక్కటి లేకపోయినా జీవి మనుగడ దుర్లభం ..అందుకే సమస్త ప్రాణికోటి అని అనేకన్నా పంచభూతముల సాక్షిగా అని చెప్పబడి వుంటుంది అని నా వుద్దేశ్యం .

ముగ్గురు మిత్రుల అమూల్య వివరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. 

బహుశా అందుకేనేమో ... మన పూజా పద్ధతిలో- గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవిగా పేర్కొంటారు, ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలను భగవత్ స్వరూపములుగా గుర్తించి ఆరాదించే పద్ధతిని పెద్దలు ప్రవేశపెట్టారనుకుంటాను . 

4 కామెంట్‌లు:

  1. మంచి విషయాలు తెలియ చేసారు భారతి గారు ,,, మీకు హృదయపూర్వక అభినందనలు

    రిప్లయితొలగించండి
  2. నిజానికి ఈ టపాకు కారణం మీరు, వనజగారు, విశాలాక్షిగారు. మీ ముగ్గురు నా సందేహంనకు ఇచ్చిన వివరణతో, పఠన, శ్రవణంల ద్వారా తెలుసుకున్న విషయాలు స్పురణకు వచ్చి స్పరణలో పెట్టడం జరిగింది. అందుకు మీ మువ్వురుకు మరోమారు మనసార ధన్యవాదాములు తెలుపుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. అభినందనలు భారతిగారూ! పంచభూతాలు సాక్షిగా చక్కగా విశదీకరించి రాసారు. రుక్మిణీ దేవిగారు, వనజ గారూ కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మంచి టపాను అందించారు....మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. అన్దరకూ ఆత్మీయ సాయిరాం.వీటిలో పోస్ట్ చేసినవి చదివాక అనిపించినది ఏమిటంటే పంచభూతాలకు సాక్షి ఎవరు? "నేను". "నేను" స్ఫురణ లేకుంటే అవిలేవు.సుషిప్తి లో అవిలేవు.సర్వమునకూ "నేనే" సాక్షి.ఈ "నేను స్ఫురణ". అజ్ఞానం వలన ద్వంద్వం.
    ప్రస్తుత అమ్సములో "పంచభూతముల సాక్షిగా" అన్న పదం వ్యావహారికంగా అనుకునే విషయమే కానీ అద్వైత సత్యం కాదేమో అనిపిస్తుంది. మరి కొంత జ్ఞానానికి ఇది పరిప్రశ్నగా ఉపయోగపడి ఈ చర్చ కొనసాగితే బాగుంటుందేమో, ఆలోచించగలరు.

    రిప్లయితొలగించండి