వేదం "ఏకం సత్" అని చెపుతుంటే, ఇందరు దేవుళ్ళు ఏమిటి? ఇన్ని రకాల దేవాలయాలు ఏమిటి? శైవ వైష్ణవ శాక్తేయ వైషమ్యాలు ఏమిటి?
ఇలా ప్రశ్నలు ఎన్నో... ఇలా అడిగిన వారికి తగు సమాధానాలు మన శాస్త్రాలు, ప్రవచనకారులు, పెద్దలు చెప్తున్నప్పటికీ సందేహాలు వస్తూనే ఉన్నాయి. నేను చదివిన, విన్న వాటి ద్వారా నా అవగాహన మేరకు కొందరి ప్రశ్నలకు కొంత సమాచారం ఈ టపాలో -
"ఏకం సత్" అని వేదం చెప్పిన మాట నిజం. ఉన్నదొక్కటే. అదే సత్యం. అదే నిత్యం. అదే పరమాత్మ. అదే నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్యం.
పరమాత్మ నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్య శక్తిగా ఏకత్వం గానే ఉంటే, ఈ సృష్టే లేదు, ఈ జగత్తే లేదు. దేవుడు లేడు, జీవుడు లేడు. కానీ, పరమాత్మ సంకల్పించాడు.
ఆ సంకల్పానుసారమే ఈ సృష్టి స్థితి లయలు... ఈ సగుణ సాకారాలు.
ఆ సంకల్పానుసారమే ఈ సృష్టి స్థితి లయలు... ఈ సగుణ సాకారాలు.
అందుకే వేదం పరమాత్మను "త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం .... ప్రజాపతిః" "స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సో క్షరః పరమః స్వరాట్" అని కూడా ప్రవచించింది. అంతియే కాదు, "త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం, త్వం బ్రహ్మ భూర్భువస్స్వరోమ్" (నువ్వే బ్రహ్మవి, విష్ణువివి, రుద్రుడవు, అగ్నివి, వాయువువి, సూర్యుడవు, చంద్రుడవు, భూమి ఆకాశం అంతటా ఉన్న పరబ్రహ్మవి...అని ఈ శ్లోకం భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, అన్ని రూపాలలోనూ ఆయన ఉనికిని తెలియజేస్తుంది)అని అభివర్ణించింది.
ఏకో విష్ణుః మహద్భూతం ప్రుదాగ్భూతా న్యనే కశః ...ఇత్యాది వాక్యాలన్నీ ఏకత్వం పొందిన అనేకత్వాన్ని తెలియజేస్తున్నాయి. మరి వేదం చెప్పిన ఆ ఒక్క వాక్యాన్నే కాదు, ఈ వాక్యాలను పరిగణలోనికి తీసుకోవాలి కదా.
దేశ వ్యవస్థ సవ్యంగా నడపడానికి దేశాధినేత, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు... ఇలా ఎలా అవసరమో, సృష్టి క్రమంలో కూడా అనేక రూపాలు అంతే అవసరం.
ఒకసారి వివేకానందులవారిని ఒకరు అడిగారట, భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? ఇన్ని రకాల విగ్రహాలు ఎందుకని...
బంగారం ఒక్కటే గానీ, ఆభరణాలు అనేకం. ఎవరి అభిరుచి బట్టి ఆయా ఆభరణాలు ఉంటాయి. అలాగే భగవంతుడు ఒక్కడే అయినా, మేం మాకు కావలసిన రూపులో తలచుకొని ఆరాధిస్తుంటాం. భక్తుల భావాలు బట్టే భగవంతుడు రూపాలు ధరిస్తాడు అని చెప్పారట.
భగవంతుడు సర్వవ్యాపి కదా. సర్వత్రా ఉన్న భగవంతునికి ఆలయాలు ఎందుకు?
నిజమే. పరమాత్మ సర్వవ్యాపి అనేది సత్యం. కానీ, ఆ పరమాత్మను మనం ఎలా గుర్తించగలం?
నిర్గుణుడు, నిరాకారుడు, విశ్వవ్యాపి అయిన పరమాత్మను కారణజన్ములైన మహాయోగులు, ఋషులు, మహర్షులు దర్శించగలరేమోగాని, సామాన్యులు తమ భౌతికదృష్టితో దర్శించలేరు. వారు అర్చించి తరించగలరేమేగాని, సామాన్యులకు ఇది అసాధ్యం. మరి మనం తరించేది ఎలా? ముక్తి పొందేది ఎలా? ఈ జన్మపరంపరలో చిక్కుకొని జీవితం సుఖ దుఃఖాలతో సాగించవలసిందేనా? అలాంటప్పుడు పశు పక్షాదులకు మనకి తేడా ఏముంది? మానవజన్మ నిరర్ధకమే కదా. మనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికశక్తిని జాగృతం అయ్యేదెలా? ఆత్మ సాక్షాత్కారం అయ్యేదెలా? సత్యాన్ని తెలుసుకోవడం ఎలా? అందుకనే మహాద్రష్టలైన మన మహర్షులు మనం తరించడానికి వేదానుసారం అనేక మార్గాలను సూచించారు. అందులో భాగంగానే ఆలయ నిర్మాణాలు, సాకారార్చనలు.
ఆలయాలు గురించి మరింత వివరణ ఈ లింక్ లో - ఆలయాల ఆవశ్యకత
అంతర్యామి ఆత్మ రూపేణా హృదయంలోనే ఉంటాడు కదా. హృదిలో ఉన్న హరిని దర్శించక ఆలయాలకు వెళ్ళడం ఎందుకు? విగ్రహారాధన ఎందుకు?
ఇక విగ్రహారాధన ఎందుకంటే - భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక ఆకారం అవసరం. విశ్వాసంతో ఓ విగ్రహాన్ని దైవంగా ఆరాధించడం ద్వారా మనలో ఆరాధన భావం పెంపొంది, క్రమేణా మనోబుద్ధులు సంస్కరింపబడి, విచారణతో ముందుకు సాగుతూ నిజాన్ని ఆవిష్కరించుకోమని హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకాదు, ఒక రూపాన్ని పెట్టి, ఆ రూపాన్ని ధ్యానం చేయమంటేనే, మనస్సు మర్కటంలా పది చోట్లకు పరుగులు తీస్తుంది. అలాంటిది ఏ ఆలంబన లేకుండా అదృశ్యమైన, అత్యున్నతమైన దానిని ధ్యానించాలంటే... అది మనకు సాధ్యమేనా? నిరంతరం చలించడం మనస్సు స్వభావం. ఒక పట్టాన ఒకదానిపై నిలవదు. అందుకే సాకార ఆరాధన. మన హైందవ ధర్మం ఇలా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళే మార్గాలన్నింటినీ సూచిస్తుంది. ఈ విగ్రహ ఆరాధనే క్రమేపి రూపానికి అతీతమైన తత్త్వానికి తీసుకెళ్తుంది. ముందు సాకారం, సగుణం. ఆ తర్వాత నిరాకారం, నిర్గుణం.
దారు లోహ రాయి... విగ్రహాల్లో భగవంతుడు వ్యక్తమౌతాడా? అంతటి శక్తి ఎలా వస్తుంది? ప్రాణ ప్రతిష్ట అంటారు కదా. నిజంగా విగ్రహాల్లో ప్రాణం ఉంటుందా?
విద్యుత్ శక్తి ఒకచోట బల్బ్ లో, మరోచోట ఫ్యాన్ లో, ఏసీ, మిక్సీ..... ఇలా పలు ఉపకరణాలు ద్వారా వ్యక్తమైనప్పుడు, అంతటా ఉన్న విశ్వశక్తి విగ్రహాల్లో వ్యక్తమవ్వదా?
ఒక వంద రూపాయల నోటును చూడండి. అది మొదట ఒక కాగితం. దానిపై వంద రూపాయల విలువను సాధికారంగా ముద్రించినప్పుడు దానికి ఆ విలువ వచ్చింది. ఒక విలువ వ్యక్తమవాలంటే ఒక సాధికార ముద్ర కావాలి. అలానే విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు మహత్తరమైన బీజాక్షరాలతో ఆయా దేవతల శక్తిని ఆవాహన చేసి, చేస్తారు. మానవ నిర్మిత ముద్రలకే విలువ ఉన్నప్పుడు మన మహర్షులు తెలిపిన మంత్రాల్లో విశ్వశక్తి ఉండదా? అంతటి మహత్తర బీజాక్షరాలతో ప్రతిష్ట చేసిన విగ్రహాల్లో ప్రాణ శక్తి ఉండదా? అంతటా ఉన్న భగవంతుడు విగ్రహంలో ఉండడా? చూసే భక్తి, విశ్వాసం మనకుంటే తప్పక కనిపిస్తాడు. అందుకు నిదర్శనాలు అనేకం.
మచ్చుకు ఓ రెండు -
రాజస్థాన్ లోని ఉదయపూర్ దగ్గర శ్రీరూప్ చతుర్భుజ్ స్వామి పేరిట విష్ణుమూర్తి ఆలయం ఉన్నది. ప్రతిరోజూ ఉదయం అప్పటి ఉదయపూర్ మహారాజు రాణా వారు ఈ స్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చేవారు. అప్పటి ఆ ఆలయ అర్చకులు దేవాజీ పండా గారు భగవంతునికి అలంకరించిన పూలమాల తీసి రాజుగారి మెడలో వేసేవారు. ఒకరోజు మహారాజు ఆలయానికి ఉదయం రాలేదు. రాత్రి ఆలయ తలుపులు మూసివేసే సమయం అవడంతో, ఇక మహారాజు రారని భావించి, ఆ పూజారి పూలమాలను తన మెడలో వేసుకొనెను. ఇంతలో మహారాజు వారు వస్తున్నట్లు కబురు రావడంతో, మెడలో వేసుకున్న మాలను తీసి పళ్ళెంలో పెట్టి, రాజుగారు రాగానే ఆయన మెడలో వేసెను. అయితే, పూజారి తన మెడలో వేసుకొని తీసినప్పుడు అతని తెల్లని వెంట్రుక ఆ మాలలో ఉండిపోవడం గమనించలేదు గానీ, అది చూసిన మహారాజు, ఆ వెంట్రుకను చూపిస్తూ, ' ఏమిటీ భగవంతునికి జుట్టు కూడా ఉందా? అదీ పండిపోయిందా?' అని అడుగగా, ఆ...అవును అన్న మాటలు అనుకోకుండా పూజారి అనడం జరిగింది. వెంటనే మహారాజు ' నేను రేపు ఉదయాన్నే వచ్చి విగ్రహాన్ని చూస్తాను' అని చెప్పి వెడలిరి. ఇక పూజారికి భయం మొదలయింది. భగవంతుని విగ్రహానికి తల వెంట్రుకలు ఎలా వస్తాయి? అవి కూడా తెల్లనివి. అబద్ధం చెప్పినందుకు కఠిన దండన తప్పదు. నా కుటుంబంకు ఇక ఏ ఆధారం ఉండదు, ఆ దీనజన రక్షకుడైన విష్ణుమూర్తే తనని రక్షించాలని తెల్లవార్లు ప్రార్థిస్తూ, శరణువేడుకున్నారు. మరునాడు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి చూడగా, స్వామి వారు తెల్లటి జుట్టుతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి, స్వామి తన ప్రార్థన విన్నందుకు అమితానందం పొందుతూ, భగవంతుని కరుణకు కన్నీటి పర్యాంతమైన సమయంలో, రాజుగారు ఆలయానికి వేంచేసి, తెల్లటి జుట్టుతో ఉన్న భగవంతుని విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. ఇది నిజమా కాదా అని పరీక్షించడానికి ఒక వెంట్రుకను లాగగా, వెంటనే అక్కడ నుండి రక్తం స్రవించింది. అది చూసి మహారాజు మూర్చపోయారు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన మహారాజు భగవంతుని ఉనికిని సందేహించినందుకు పశ్చాత్తాపం పడి, స్వామి ముందు సాష్టాంగ పడి క్షమాపణ కోరెను. అంతట స్వామి ప్రత్యక్షమై, మహారాజా నీవు నా ఉనికిని సందేహించావు. విశ్వాసం లేని నీలాంటి వారు నన్ను దర్శించడానికి అర్హులు కారు. అందువల్ల నేటి నుండి ఈ ఉదయ పూర్ సింహాసనాన్ని అధిరోహించే ఏ మహారాజుకైనా ఆలయ ప్రవేశం నిషిద్ధం అని ఆజ్ఞాపించెను. అందువల్లనే ఆనాటి నుండి ఉదయపూర్ మహారాజుకు ఈ దేవాలయంలోనికి ప్రవేశం లేదు. నేటికీ ఇది అమలులోనే ఉంది.
ఇలాగే, సాక్షి గోపాల్ కథ. ఒడిశాలోని పూరీ సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆలయం, సాక్షి గోపాల్ ఆలయ కథ ప్రకారం, యాత్రా సమయంలో అస్వస్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఆ సమయంలో తనకు సేవ చేసిన ఒక పేద బ్రాహ్మణ యువకుడుకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మధురలోని బృందావనంలో ఉన్న గోపాలుని గుడిలో వాగ్దానం చేస్తాడు. అయితే, స్వగ్రామం చేరాక, ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అతని కుటుంబం వారి అమ్మాయిని ఆ యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోరు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు వాగ్దానం చేశాడనడానికి సాక్ష్యం ఎవరున్నారని అడగగా, ఆ యువకుడు సాక్షిగా ఉండమని బృందావనం వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించగా, ఆ విగ్రహం బృందావనం నుండి పూరీ వరకు నడిచి వచ్చి సాక్ష్యం చెప్పి, సాక్షి గోపాల్ గా అక్కడే నిలిచెను.
విగ్రహాలలో భగవంతుడు ఉన్నాడనడానికి ఇలాంటి నిదర్శనాలు చాలవా?
ఏకేశ్వరోపాసన, బహు దేవతారాధనలలో ఏది ఉత్తమం? అయినా ఒక్క రూపం చాలదా? ఇన్ని రూపాలు ఎందుకు?
ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే, భగవంతుడు ఒక్కడే కాని, రూపాలు నామాలు అనేకం.
ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే కాబట్టి, మనం ఈశ్వరుడిని అభిషేకించినా, విష్ణువుని అర్చించినా, అమ్మని ఆరాధించిన మనకు లభించిన అనుగ్రహంలో ఎటువంటి తేడా ఉండదు. ఆకాశాత్పతితం తోయం యధాగచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి...అంటారు శంకర భగవత్పాదులవారు. ఆకాశం నుంచి జాలువారే ప్రతి చిన్న నీటి బిందువూ అంతిమంగా సముద్రాన్ని చేరి లేనమైనట్లే, మనం ఏ దేవుడికి నమస్కరించినా, ఆరాధించినా, అవన్నీ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకే చేరతాయి.
ఒక వ్యక్తి ఒకరికి కొడుకు, మరొకరికి సోదరుడు, మరొకరికి స్నేహితుడు, మరొకరికి భర్త, మరొకరికి తండ్రి, ఇంకొకరికి తాత...ఇలా పలు బంధాల్లో వ్యక్తమై, పలు పేర్లతో అభిమానింపబడినప్పుడు;
పరమాత్మ పలు రూపాల్లో వ్యక్తమై, పలు పేర్లతో ఆరాధింపబడడంలో అభ్యంతరమేముంది?
సాధకుడిని అనుగ్రహించడానికి భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపాల్లో వస్తాడన్నది ఆది శంకరులవారి మాట. ఈ ఉపాసనలు అన్నీ, ఆరాధనలు అన్నీ, రూపాలు అన్నీ, నామాలు అన్నీ అద్వైతం లోనికి చేరడం కోసమే. మనలో ఆత్మశక్తికి ఒక కొనసాగింపే ఈ ఆరాధనలు. ఈ ఆరాధనల కొనసాగింపే ఏకత్వం...అద్వైతం!
ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడుగుతారు గానీ, ఎప్పుడైనా ఇన్ని రకల పండ్లు ఎందుకని, ఇన్ని రకాల కూరగాయలు ఎందుకని ఇన్ని రకాల రుచులెందుకని ఎవరైనా ఎందుకు ప్రశ్నించుకోరు?
అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం ... అన్న శ్లోకం తదుపరి టపాలో ...
చాలా చక్కగా చెప్పారు భారతి గారు.. ప్రతి అక్షరం ఏదో చెపుతుంది.. అంత చక్కని, సులభతరం అయిన వివరణ.. అన్ని రుచులు ఎందుకు? ఇది ఒక మంచి ప్రశ్న.. జవాబు ఇవ్వండి మరి..
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదాలు రుక్మిణి జీ!
తొలగించండిమిమ్మల్ని ఇందుకే అడుగుతాను భారతీగారు. ఏదైనా ఇంత వివరంగా చెప్తారని. మీకు నా 🙏
రిప్లయితొలగించండిమీ స్పందనకు ధన్యవాదాలు పద్మ గారు.
తొలగించండి"Wah wonderful"
రిప్లయితొలగించండిధన్యవాదాలు శ్రీనివాసరావు గారు.
తొలగించండిగరికపాటి నరసింహారావుగారు, సామవేదం షణ్ముఖశర్మ గారు అప్పుడప్పుడు చెప్పడం కొంత విన్నా, ఇంత సమగ్రంగా సవివరంగా స్పష్టంగా చదువుతుంటే అవ్యక్త భావంతో మనస్సు నిండిపోయింది. మీరు చెప్పిన కథల మాదిరే ఒక కథను వాట్సప్ లో వస్తే చదివాను.
రిప్లయితొలగించండిమనసెరిగిన మాధవుడు!
గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ? నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. మెల్లగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి? దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు. అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం.
ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయున్ని. నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు.
తెల్లారింది. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!
కుమారుడు బిగ్గరగా అరుస్తూ," నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా!. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!.
ఇది వాస్తవంగా జరిగిన సంఘటన అని చదివాను భారతీ గారు. కానీ ఎక్కడో తెలియదు. మీకు తెలిస్తే చెప్పరా? తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది.
మీ చక్కటి వ్యాఖ్యకు ధన్యవాదాలు వసుంధర గారు.
రిప్లయితొలగించండిఈ కథ ఇదే మొదటిసారి చదవడం. ఈ అద్భుత సంఘటన ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. మీ వ్యాఖ్య చదివిన వారెవరైనా తెలిస్తే చెప్తారేమో...చూద్దాం.