17, జూన్ 2025, మంగళవారం

విగ్రహం అంటే మృణ్మయమూర్తి కాదు, చిన్మయమూర్తి!

 వేదం "ఏకం సత్" అని చెపుతుంటే, ఇందరు దేవుళ్ళు ఏమిటి? ఇన్ని రకాల దేవాలయాలు ఏమిటి? శైవ వైష్ణవ శాక్తేయ వైషమ్యాలు ఏమిటి? 

ఇలా ప్రశ్నలు ఎన్నో... ఇలా అడిగిన వారికి తగు సమాధానాలు మన శాస్త్రాలు, ప్రవచనకారులు, పెద్దలు చెప్తున్నప్పటికీ సందేహాలు వస్తూనే ఉన్నాయి. నేను చదివిన, విన్న వాటి ద్వారా నా అవగాహన మేరకు కొందరి ప్రశ్నలకు కొంత సమాచారం ఈ టపాలో -

"ఏకం సత్" అని వేదం చెప్పిన మాట నిజం. ఉన్నదొక్కటే. అదే సత్యం. అదే నిత్యం. అదే పరమాత్మ. అదే నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్యం. 
పరమాత్మ  నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్య శక్తిగా ఏకత్వం గానే ఉంటే, ఈ సృష్టే లేదు, ఈ జగత్తే లేదు. దేవుడు లేడు, జీవుడు లేడు. కానీ, పరమాత్మ సంకల్పించాడు. 

ఆ సంకల్పానుసారమే ఈ సృష్టి స్థితి లయలు... ఈ సగుణ సాకారాలు. 

అందుకే వేదం పరమాత్మను "త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం .... ప్రజాపతిః" "స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సో క్షరః పరమః స్వరాట్" అని కూడా ప్రవచించింది. అంతియే కాదు,  "త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం, త్వం బ్రహ్మ భూర్భువస్స్వరోమ్" (నువ్వే బ్రహ్మవి, విష్ణువివి, రుద్రుడవు, అగ్నివి, వాయువువి, సూర్యుడవు, చంద్రుడవు, భూమి ఆకాశం అంతటా ఉన్న పరబ్రహ్మవి...అని ఈ శ్లోకం భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, అన్ని రూపాలలోనూ ఆయన ఉనికిని తెలియజేస్తుంది)అని అభివర్ణించింది. 
ఏకో విష్ణుః మహద్భూతం ప్రుదాగ్భూతా న్యనే కశః ...ఇత్యాది వాక్యాలన్నీ ఏకత్వం పొందిన అనేకత్వాన్ని తెలియజేస్తున్నాయి. మరి వేదం చెప్పిన ఆ ఒక్క వాక్యాన్నే కాదు, ఈ వాక్యాలను పరిగణలోనికి తీసుకోవాలి కదా.

దేశ వ్యవస్థ సవ్యంగా నడపడానికి దేశాధినేత, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు... ఇలా ఎలా అవసరమో, సృష్టి క్రమంలో కూడా అనేక రూపాలు అంతే అవసరం. 

ఒకసారి వివేకానందులవారిని ఒకరు అడిగారట, భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? ఇన్ని రకాల విగ్రహాలు ఎందుకని...
బంగారం ఒక్కటే గానీ, ఆభరణాలు అనేకం. ఎవరి అభిరుచి బట్టి ఆయా ఆభరణాలు ఉంటాయి. అలాగే భగవంతుడు ఒక్కడే అయినా, మేం మాకు కావలసిన రూపులో తలచుకొని ఆరాధిస్తుంటాం. భక్తుల భావాలు బట్టే భగవంతుడు రూపాలు ధరిస్తాడు అని చెప్పారట. 


భగవంతుడు సర్వవ్యాపి కదా. సర్వత్రా ఉన్న భగవంతునికి ఆలయాలు ఎందుకు?

నిజమే. పరమాత్మ సర్వవ్యాపి అనేది సత్యం. కానీ, ఆ పరమాత్మను మనం ఎలా గుర్తించగలం? 
నిర్గుణుడు, నిరాకారుడు, విశ్వవ్యాపి అయిన పరమాత్మను కారణజన్ములైన మహాయోగులు, ఋషులు, మహర్షులు దర్శించగలరేమోగాని, సామాన్యులు తమ భౌతికదృష్టితో దర్శించలేరు. వారు అర్చించి తరించగలరేమేగాని, సామాన్యులకు ఇది అసాధ్యం. మరి మనం తరించేది ఎలా? ముక్తి పొందేది ఎలా? ఈ జన్మపరంపరలో చిక్కుకొని జీవితం సుఖ దుఃఖాలతో సాగించవలసిందేనా? అలాంటప్పుడు పశు పక్షాదులకు మనకి తేడా ఏముంది? మానవజన్మ నిరర్ధకమే కదా. మనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికశక్తిని జాగృతం అయ్యేదెలా? ఆత్మ సాక్షాత్కారం అయ్యేదెలా? సత్యాన్ని తెలుసుకోవడం ఎలా? అందుకనే మహాద్రష్టలైన  మన మహర్షులు మనం తరించడానికి వేదానుసారం అనేక మార్గాలను సూచించారు. అందులో భాగంగానే ఆలయ నిర్మాణాలు, సాకారార్చనలు.
ఆలయాలు గురించి మరింత వివరణ ఈ లింక్ లో - ఆలయాల ఆవశ్యకత
అంతర్యామి ఆత్మ రూపేణా హృదయంలోనే ఉంటాడు కదా. హృదిలో ఉన్న హరిని దర్శించక ఆలయాలకు వెళ్ళడం ఎందుకు? విగ్రహారాధన ఎందుకు?


ఇక విగ్రహారాధన ఎందుకంటే - భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక ఆకారం అవసరం. విశ్వాసంతో ఓ విగ్రహాన్ని దైవంగా ఆరాధించడం ద్వారా మనలో ఆరాధన భావం పెంపొంది, క్రమేణా మనోబుద్ధులు సంస్కరింపబడి, విచారణతో ముందుకు సాగుతూ నిజాన్ని ఆవిష్కరించుకోమని హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకాదు, ఒక రూపాన్ని పెట్టి, ఆ రూపాన్ని ధ్యానం చేయమంటేనే, మనస్సు మర్కటంలా పది చోట్లకు పరుగులు తీస్తుంది. అలాంటిది ఏ ఆలంబన లేకుండా అదృశ్యమైన, అత్యున్నతమైన దానిని ధ్యానించాలంటే... అది మనకు సాధ్యమేనా? నిరంతరం చలించడం మనస్సు స్వభావం. ఒక పట్టాన ఒకదానిపై నిలవదు. అందుకే సాకార ఆరాధన. మన హైందవ ధర్మం ఇలా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళే మార్గాలన్నింటినీ సూచిస్తుంది. ఈ విగ్రహ ఆరాధనే క్రమేపి రూపానికి అతీతమైన తత్త్వానికి తీసుకెళ్తుంది. ముందు సాకారం, సగుణం. ఆ తర్వాత నిరాకారం, నిర్గుణం.

దారు లోహ రాయి... విగ్రహాల్లో భగవంతుడు వ్యక్తమౌతాడా? అంతటి శక్తి ఎలా వస్తుంది? ప్రాణ ప్రతిష్ట అంటారు కదా. నిజంగా విగ్రహాల్లో ప్రాణం ఉంటుందా?

విద్యుత్ శక్తి ఒకచోట బల్బ్ లో, మరోచోట ఫ్యాన్ లో, ఏసీ, మిక్సీ..... ఇలా పలు ఉపకరణాలు ద్వారా వ్యక్తమైనప్పుడు, అంతటా ఉన్న విశ్వశక్తి విగ్రహాల్లో వ్యక్తమవ్వదా?

ఒక వంద రూపాయల నోటును చూడండి. అది మొదట ఒక కాగితం. దానిపై వంద రూపాయల విలువను సాధికారంగా ముద్రించినప్పుడు దానికి ఆ విలువ వచ్చింది. ఒక విలువ వ్యక్తమవాలంటే  ఒక సాధికార ముద్ర కావాలి. అలానే విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు మహత్తరమైన బీజాక్షరాలతో ఆయా దేవతల శక్తిని ఆవాహన చేసి, చేస్తారు. మానవ నిర్మిత ముద్రలకే విలువ ఉన్నప్పుడు మన మహర్షులు తెలిపిన మంత్రాల్లో విశ్వశక్తి ఉండదా? అంతటి మహత్తర బీజాక్షరాలతో ప్రతిష్ట చేసిన విగ్రహాల్లో ప్రాణ శక్తి ఉండదా? అంతటా ఉన్న భగవంతుడు విగ్రహంలో ఉండడా?  చూసే భక్తి, విశ్వాసం మనకుంటే తప్పక కనిపిస్తాడు. అందుకు నిదర్శనాలు అనేకం.

మచ్చుకు ఓ రెండు - 
రాజస్థాన్ లోని ఉదయపూర్ దగ్గర శ్రీరూప్ చతుర్భుజ్ స్వామి పేరిట విష్ణుమూర్తి ఆలయం ఉన్నది. ప్రతిరోజూ ఉదయం అప్పటి ఉదయపూర్ మహారాజు రాణా వారు ఈ స్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చేవారు. అప్పటి ఆ ఆలయ అర్చకులు దేవాజీ పండా గారు భగవంతునికి అలంకరించిన పూలమాల తీసి రాజుగారి మెడలో వేసేవారు. ఒకరోజు మహారాజు ఆలయానికి ఉదయం రాలేదు. రాత్రి ఆలయ తలుపులు మూసివేసే సమయం అవడంతో, ఇక మహారాజు రారని భావించి, ఆ పూజారి పూలమాలను తన మెడలో వేసుకొనెను. ఇంతలో మహారాజు వారు వస్తున్నట్లు కబురు రావడంతో, మెడలో వేసుకున్న మాలను తీసి పళ్ళెంలో పెట్టి, రాజుగారు రాగానే ఆయన మెడలో వేసెను. అయితే, పూజారి తన మెడలో వేసుకొని తీసినప్పుడు అతని తెల్లని వెంట్రుక ఆ మాలలో ఉండిపోవడం గమనించలేదు గానీ, అది చూసిన మహారాజు, ఆ వెంట్రుకను చూపిస్తూ, ' ఏమిటీ భగవంతునికి జుట్టు కూడా ఉందా? అదీ పండిపోయిందా?' అని అడుగగా, ఆ...అవును అన్న మాటలు అనుకోకుండా పూజారి అనడం జరిగింది. వెంటనే మహారాజు ' నేను రేపు ఉదయాన్నే వచ్చి విగ్రహాన్ని చూస్తాను' అని చెప్పి వెడలిరి. ఇక పూజారికి భయం మొదలయింది. భగవంతుని విగ్రహానికి తల వెంట్రుకలు ఎలా వస్తాయి? అవి కూడా తెల్లనివి. అబద్ధం చెప్పినందుకు కఠిన దండన తప్పదు. నా కుటుంబంకు ఇక ఏ ఆధారం ఉండదు, ఆ దీనజన రక్షకుడైన విష్ణుమూర్తే తనని రక్షించాలని తెల్లవార్లు ప్రార్థిస్తూ, శరణువేడుకున్నారు. మరునాడు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి చూడగా, స్వామి వారు తెల్లటి జుట్టుతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి, స్వామి తన ప్రార్థన విన్నందుకు అమితానందం పొందుతూ, భగవంతుని కరుణకు కన్నీటి పర్యాంతమైన సమయంలో, రాజుగారు ఆలయానికి వేంచేసి, తెల్లటి జుట్టుతో ఉన్న భగవంతుని విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. ఇది నిజమా కాదా అని పరీక్షించడానికి ఒక వెంట్రుకను లాగగా, వెంటనే అక్కడ నుండి రక్తం స్రవించింది. అది చూసి మహారాజు మూర్చపోయారు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన మహారాజు భగవంతుని ఉనికిని సందేహించినందుకు పశ్చాత్తాపం పడి, స్వామి ముందు సాష్టాంగ పడి క్షమాపణ కోరెను. అంతట స్వామి ప్రత్యక్షమై, మహారాజా నీవు నా ఉనికిని సందేహించావు. విశ్వాసం లేని నీలాంటి వారు నన్ను దర్శించడానికి అర్హులు కారు. అందువల్ల నేటి నుండి ఈ ఉదయ పూర్ సింహాసనాన్ని అధిరోహించే ఏ మహారాజుకైనా ఆలయ ప్రవేశం నిషిద్ధం అని ఆజ్ఞాపించెను.  అందువల్లనే ఆనాటి నుండి ఉదయపూర్ మహారాజుకు ఈ దేవాలయంలోనికి ప్రవేశం లేదు. నేటికీ ఇది అమలులోనే ఉంది. 


ఇలాగే, సాక్షి గోపాల్ కథ. ఒడిశాలోని పూరీ సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆలయం, సాక్షి గోపాల్ ఆలయ కథ ప్రకారం, యాత్రా సమయంలో అస్వస్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఆ సమయంలో తనకు సేవ చేసిన ఒక పేద బ్రాహ్మణ యువకుడుకు  తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మధురలోని బృందావనంలో ఉన్న గోపాలుని గుడిలో వాగ్దానం చేస్తాడు. అయితే, స్వగ్రామం చేరాక, ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అతని కుటుంబం వారి అమ్మాయిని ఆ యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోరు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు వాగ్దానం చేశాడనడానికి సాక్ష్యం ఎవరున్నారని అడగగా, ఆ యువకుడు సాక్షిగా ఉండమని బృందావనం వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించగా, ఆ విగ్రహం బృందావనం నుండి పూరీ వరకు నడిచి వచ్చి సాక్ష్యం చెప్పి, సాక్షి గోపాల్ గా అక్కడే నిలిచెను.
విగ్రహాలలో భగవంతుడు ఉన్నాడనడానికి ఇలాంటి నిదర్శనాలు చాలవా?

ఏకేశ్వరోపాసన, బహు దేవతారాధనలలో ఏది ఉత్తమం? అయినా ఒక్క రూపం చాలదా? ఇన్ని రూపాలు ఎందుకు?

ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే, భగవంతుడు ఒక్కడే కాని, రూపాలు నామాలు అనేకం. 


ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే కాబట్టి, మనం ఈశ్వరుడిని అభిషేకించినా, విష్ణువుని అర్చించినా, అమ్మని ఆరాధించిన మనకు లభించిన అనుగ్రహంలో ఎటువంటి తేడా ఉండదు. ఆకాశాత్పతితం తోయం యధాగచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి...అంటారు శంకర భగవత్పాదులవారు. ఆకాశం నుంచి జాలువారే ప్రతి చిన్న నీటి బిందువూ అంతిమంగా సముద్రాన్ని చేరి లేనమైనట్లే, మనం ఏ దేవుడికి నమస్కరించినా, ఆరాధించినా, అవన్నీ  అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకే చేరతాయి. 

ఒక వ్యక్తి ఒకరికి కొడుకు, మరొకరికి సోదరుడు, మరొకరికి స్నేహితుడు, మరొకరికి భర్త, మరొకరికి తండ్రి, ఇంకొకరికి తాత...ఇలా పలు బంధాల్లో వ్యక్తమై, పలు పేర్లతో అభిమానింపబడినప్పుడు;
పరమాత్మ పలు రూపాల్లో వ్యక్తమై, పలు పేర్లతో ఆరాధింపబడడంలో అభ్యంతరమేముంది?
సాధకుడిని అనుగ్రహించడానికి భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపాల్లో వస్తాడన్నది ఆది శంకరులవారి మాట. ఈ ఉపాసనలు అన్నీ, ఆరాధనలు అన్నీ, రూపాలు అన్నీ, నామాలు అన్నీ అద్వైతం లోనికి చేరడం కోసమే. మనలో ఆత్మశక్తికి ఒక కొనసాగింపే ఈ ఆరాధనలు. ఈ ఆరాధనల కొనసాగింపే ఏకత్వం...అద్వైతం!


ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడుగుతారు గానీ, ఎప్పుడైనా ఇన్ని రకల పండ్లు ఎందుకని, ఇన్ని రకాల కూరగాయలు ఎందుకని ఇన్ని రకాల రుచులెందుకని ఎవరైనా ఎందుకు ప్రశ్నించుకోరు? 

అనాయాసేన మరణం  వినాదైన్యేన జీవనం ... అన్న శ్లోకం తదుపరి టపాలో ...

7, జూన్ 2025, శనివారం

నేస్తం మాటలు...మదిలో మెదిలే కథలు

అదేమిటో...ఎన్నిసార్లు కొట్టించిన మూడునాళ్ళ ముచ్చటే. మూడు నెలల క్రితమే కొట్టించి, యు ఎస్ వెళ్ళి వచ్చేసరికి, గుంపులు గుంపులుగా పుట్టుకొచ్చాయి. అయినా వీటిని అనుకొని ఏం ప్రయోజనం? నాలుగు తలలేసుకొన్న ఆ పెద్దాయనను అనాలి. ఆ క్షణంలో వారి కార్యం నెరవేర్చుకోవడానికి దీనిని సృష్టించి, మనల్ని అవస్థల పాలుచేయడం బ్రహ్మకు తగునా? పైగా వీటికి ఓ పెద్ద వరమివ్వడం ఒకటి. అక్కడే ఉన్న ఇంద్రాది దేవతలు మా పని పూర్తయితే చాలనుకొని వీటి సృష్టిని తిలకించారే గానీ, భూలోక వాసులకు కష్టమౌతుందననే తలపే లేదు. పైగా వారి మాట, చేత, లోక కళ్యాణార్థమేనని ముక్తాయింపు ఒకటి..... 

శ్రీమతి ఈ దండకం ఎందుకో అర్ధం కాక, ఏమిటోయ్... ఎప్పుడూ నన్నూ, పిల్లల్ని దులిపేసే నీవు, ఇప్పుడు ఆ భగవంతునిపై దాడి చేస్తున్నావు. ఏమిటి కత? కాస్త ఆ దండకం ఆపి, అసలు సంగతి చెప్పు అని అడుగుతున్న శ్రీవారిని పట్టించుకోకుండా, తన ధోరణిలో తనుంటూ, 
ఆ విష్ణుమూర్తికి నిద్ర ముంచుకురావడం ఏమిటో, ధనస్సునే శేషపాన్పుగా చేసుకోవడం ఏమిటో... ధనస్సు కొసపై గెడ్డం పెట్టుకొని పడుకోవడం ఏమిటో... ఆయనను లేపడానికి ఈ బ్రహ్మ గారు దీనిని సృష్టించడం ఏమిటో... ఏమిటో ఆ మహామాయ, పెనుమాయ... మనకు పెను బాధలు...
ఇంతలో లోపలున్న అత్తగారు సోధ్యం కాకపోతే,
ఏ చిన్న పొరపాటు చేసినా క్షమించు దేవుడా అంటూ లెంపలేసుకుంటూ, గుంజీలతో నీ బారీకాయాన్ని కష్టపెట్టే నీవు,  పొద్దస్తమాను ఆరాధించే దేవుళ్ళను ఆడిపోసుకోవడమేమిటే...తప్పు తప్పు...అని అనడంతో, 
ఆరాధించేవారికే ఆక్షేపించే అర్హత ఉంటుంది అత్తయ్యా... భక్తులు నిందాస్తుతి చేయడం సహజమే కదా! అయినా... నా గోడు వెళ్ళబోసుకుంటున్నానే తప్పా, ఆడిపోసుకుంటున్నానా... తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అంటూ, అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మాయా| దాసో యమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర| అంటూ చెంపలు వాయించుకుంటున్న మిత్రురాలిని చూసి, అంతవరకు ఈ సన్నివేశానికి మౌన వీక్షకురాల్ని అయిన నేను, ఇక నవ్వు ఆపుకోలేకపోయాను. అంతవరకూ నా రాకను గమనించని తను, కాస్త ఉలిక్కిపడి దరిచేరింది. మా ముచ్చట్లు అయి ఇంటికి వచ్చినా, అదే సన్నివేశం మదిలో మెదలడం, తన దండకంలో కథా, భగవత్ లీలలను, హయగ్రీవ వృత్తాంతంను స్మరించుకున్నాను ఆనందంగా.

ఎవరీ హయగ్రీవస్వామి?
ఎప్పుడు ఎందుకు ఎలా అవతరించారు?
సకల విద్యలకు, జ్ఞానానికి ఆధారం ఈయనే అని ఎందుకు కీర్తిస్తున్నారు?
తొలుత శ్రీమహావిష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించి, ఓరోజు ఆయనకు శబ్ద తేజోరూపంగా (హయగ్రీవునిరూపం) దర్శనమిచ్చి, వేదాలను అనుగ్రహించెను. వాటి సహాయంతో బ్రహ్మ సృష్టిని ప్రారంభించెను. మొదటగా బ్రహ్మకు వేదములు ఇచ్చిన శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం హయగ్రీవఅవతారం.  
ఇదే మొదట అవతారమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కథనం బట్టి విష్ణువే స్వయంగా హయగ్రీవుడయినది ఒక పార్శమైతే, ఇతర కారణాలచే ఆయనకు హయశీర్షం తగిలించినట్లు మరికొన్ని కథనాలు ఉండడం మరొక పార్శం. ప్రతీ కథనం వెనుక అంతరార్థం అద్భుతం అద్వితీయం. 
హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు. లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకుని, తెల్లని పద్మంపై ఆసీనులై ఉంటారు. కుడిచేతిలో చక్రం, పై ఎడమచేతిలో శంఖం, కింది ఎడమచేతిలో పుస్తకం, కింది కుడి చేయి చిన్ముద్ర ధరించి ఉంటారు. 
శ్వేతపద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికి, పుస్తకం సకల విద్యలకు, శంఖం సకల సృష్టికి కారణభూతమైన నాదానికి, చక్రం అజ్ఞాన సంహారానికి చిహ్నాలు.
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీమన్నారాయణుడు దాల్చిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. అయితే ప్రముఖంగా పేర్కొన్న దశావతారాల్లో ఈ అవతారం గురించి చెప్పకపోయినా, భాగవతంలో, మహాభారతంలో ఈ స్వామి గురించి వర్ణింపబడినది.

ఒకానొక శ్రావణ పౌర్ణమినాడు వేదోద్ధరణకై, గుర్రపుముఖంతో నరశరీరంతో చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి, వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హయగ్రీవస్వామి.

పూర్వం మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను అపహరించి, పాతాళలోకానికి వెళ్ళిపోవడంతో, బ్రహ్మకు అజ్ఞానం ఆవహించి మందుడై, కర్తవ్యతామూఢుడు కావడం వలన, విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, మధుకైటభులను వధించి, వేదాలను తిరిగి బ్రహ్మకు ఇవ్వడం, బ్రహ్మదేవుడి బుద్ధి చైతన్యవంతమై వికసించడం, సృష్టికార్యం యథావిధిగా కొనసాగించడం జరిగింది. శుక మహర్షి హయగ్రీవుని గురించి వర్ణిస్తూ అనంతమైన వేదరాశి ఆయన యొక్క ఊర్పులు అని చెప్తారు. ఇందువల్లనే హయగ్రీవ స్వామిని జ్ఞానానందమూర్తిగా, వేదాది సకలవిద్యారక్షకుడుగా, విద్యా ప్రదాతగా కొలుస్తారు.

'హయ' అనగా విజ్ఞానం. 'గ్రీవ' అనగా కంఠం. అన్ని విద్యలూ కంఠస్థమై ఉన్న సర్వ విద్యారూపమే హయగ్రీవ మూర్తి.  

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||

ఇకపోతే, ఈ హయగ్రీవ అవతారం గురించి మరికొన్ని కథనాలు - 

ముందుగా దేవి భాగవతంలో ఉన్న కథ - 
కొన్ని సంవత్సరాలు (పదివేల సంవత్సరాలు)
ఏకధాటిగా రాక్షససంహారం చేసిన శ్రీ మహావిష్ణువు అలసటతో ఓ చోట, అల్లెత్రాడు గట్టిగా బిగించి ఉన్న ధనుస్సును నేలమీద నిలబెట్టి, దాని కోపు మీద గడ్డాన్ని ఆనించి, విశ్రాంతిగా కనులు మూసుకొని యోగ నిద్రలోనికి జారుకొనెను. ఇదో యోగమాయ. 
ఇదిలా ఉండగా - 
తాము చేస్తున్న యజ్ఞ హవిస్సులు అందుకోవడానికి విష్ణువును ఆహ్వానించడానికి(వేదవాఙ్మయంలో యజ్ఞోవైవిష్ణుః... విష్ణువే యజ్ఞస్వరూపుడు అని స్తుతింపబడింది) బ్రహ్మాది దేవతలు  వైకుంఠంకు వెళ్ళి, అక్కడ విష్ణువు లేకపోవడంతో, దివ్యదృష్టితో విష్ణువును గాంచి, యోగనిద్రలో ఉన్న విష్ణువు దరిచేరి, లేపడానికి సందేహిస్తూ, ఎలా అని యోచిస్తుండగా, బ్రహ్మ వమ్రి (చెదపురుగు)అనే కీటకాన్ని సృష్టిస్తాడు. ఈ వమ్రి నన్ను ఎందుకు సృష్టించారని ప్రశ్నించగా, ధనుస్సు నారిని తెంపితే ధనస్సు కదిలి విష్ణువు మేల్కొంటాడు కాబట్టి, వింటి నారిని కొరకమని చెప్పగా, నిద్రా భంగం చేయడం, కథా ప్రవచనాలను మధ్యలో ఆపడం, దంపతుల నడుమ అన్యోన్యతకు భంగం కలిగించడం, తల్లీ బిడ్డలను విడదీయడం... బ్రహ్మహత్యాపాతకంతో సమానమంటారే. ఈ మహాపాపం నేను చేయలేను, అని అనగా, లేదు లేదు, ఇది దైవ కార్యం. నీకు ఏ పాపమూ అంటదు, మేము చేసే యజ్ఞంలో హోమగుండం వెలుపల పడిన హవిస్సులు నీకే ప్రసాదిస్తాం అని వరమిచ్చాడు బ్రహ్మ. పవిత్ర హవిస్సు దొరుకుతుందనే సంతోషంతో వింటినారిని చెద పురుగు కొరకడం, నారి తెగి విష్ణువు తలకు తగిలి, తల తెగిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. ఈ ఊహించని పరిణామానికి మ్రాన్పడిపోయి, అపరిమిత వేదనకు అందరూ లోనయ్యారు. 
ఏదైనా కష్టం వచ్చినా, బాధ కలిగిన, భయం వేసినా ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మే. శ్రీ మహావిష్ణువు తల తెగి ఎక్కడ పడిందో తెలియక భయభ్రాంతులైన వీరికి కూడా ఆ జగన్మాతే గుర్తుకు వచ్చి, ఈ విపత్తు నుండి రక్షించమని ఆమెను ప్రార్ధించగా, ఆ పరాత్పరి ప్రత్యక్షమై, ఇదంతా దైవ ఘటన. ఇలా జరగడం నా సంకల్పములో  భాగమే, ఈ లోకంలో ప్రతికార్యమూ కారణ సహితమే. విష్ణువు శిరస్సు ఇలా తెగిపడడంలో కూడా కారణం ఉన్నదని  జగన్మాత ఇలా చెప్పెను -
ఒకానొక రోజు వైకుంఠంలో శేషపాన్పుపై పవళిస్తున్న శ్రీ మహావిష్ణువు ఏదో ఆలోచిస్తూ, తనకి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవిని చూస్తూ, వంకరగా నవ్వడం, అంతట ఆ నవ్వుకు అర్ధం తెలియక మదిలో కదిలాడే అనేక ఆలోచనలతో అసహనంకు లోనై, కుపితురాలై, 'స్వామి!నన్ను గేలి చేస్తూ నవ్విన మీ తల తెగిపడును గాక!' అని ఆవేశంతో అన్నది లక్ష్మీదేవి. ఈ హఠాత్సంఘటనకు ఉలిక్కిపడి, ఈ సంఘటన యాదృచ్చికం కాదు, భవిష్యత్తులో జగత్కల్యాణం కోసమే అయి వుంటుందని భావించారు ఇరువురు.
ఇదియే కాదు, ఈఘటనకు మరో కారణం కూడా ఉంది...
పూర్వం గుర్రం తలతో ఉండే హయగ్రీవుడనే లోక కంటకుడైన రాక్షసుడొకడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. నేను అతనికి ప్రత్యక్షం కాగా, 'మరణంలేని జీవితం కావాల'ని వరం కోరుకున్నాడు. అది అసంభవమని, పుట్టినవారు మరణించక తప్పదని నచ్చజెప్పి, మరో వరం కోరుకోమన్నాను. తనలాగే గుర్రంతల ఉన్నవాని చేతిలోనే మరణం సంభవించాలనే వరం కోరడంతో నేను అతనికి ఆ వరం అనుగ్రహించాను. తనలా గుర్రం తలతో మరొకరు పుట్టడం అసంభవం కనుక, తనకి చావే ఉండదని మరింత అహంతో కొంతకాలంగా విజృంభిస్తున్నాడు ఆ రాక్షసుడు. ఇపుడు ఆ హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి హయగ్రీవ అవతారం విష్ణువుకు అవసరం. అందుకే విష్ణువు శిరస్సును అదృశ్యం చేశాను. మీరు విచారించకండి. గుఱ్ఱపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి అతికించండి. విష్ణువు హయగ్రీవుడై అవతరిస్తాడు. రాక్షస సంహారం సాగిస్తాడు. నేను హయగ్రీవుడనే రాక్షసుని కిచ్చిన వరమూ, లక్ష్మీదేవి శ్రీహరికి ఇచ్చిన శాపం రెండూ ఈ రీతిలో నెరవేరతాయని పలుకగా, అమ్మ ఆదేశం మేరకు గుర్రపు తలను విష్ణువు మొండేనికి అతికించారు. విష్ణువు హయగ్రీవుడై కనులు తెరచి, జగన్మాత మాయా విలాసాన్ని, జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి, హయగ్రీవ రాక్షసుణ్ణి సంహరించి, లోక కల్యాణం కలిగించాడు.

ఇక బ్రహ్మాండపురాణంలో శ్రీ లలితా పరాభట్టారిక యొక్క దివ్య సహస్రనామ స్తోత్రాన్ని, సాక్షాత్తు చతుర్భుజుడై శంఖచక్రాలతో లక్ష్మీదేవితో కూడి ఉన్న శ్రీ హయగ్రీవ స్వామియే అగస్త్య మహర్షికి ఉపదేశించిన దివ్య కథనం ఉంది. 
శ్రీలక్ష్మీ హయగ్రీవస్వామిని ఉపాసించిన అగస్త్య మహర్షిని అనుగ్రహిస్తూ ప్రత్యక్షమైన హయగ్రీవస్వామిని మహర్షి ప్రార్థిస్తూ, స్వామీ! జగన్మాత అయిన లలితా పరాభట్టారిక యొక్క అవతార విశేషాలను, ఆమె చేసిన భండాసుర వధలను లోగడ తెలిపారు. శ్రీచక్ర మహత్యాన్ని, పంచాక్షరీ మహిమను, విధివిధానాలను  చక్కగా వివరించారు కానీ, లలితాదేవి సహస్ర నామాలను, వాటి విశిష్టతను ఉపదేశించలేదు. వాటిని వినే అర్హత నాకు లేదా స్వామీ... అని ఆసక్తితో ఆర్తిగా అడుగగా, 
అగస్త్యా! మహిమాన్వితమైన ఈ నామాలు అందరికీ ఉపదేశించరానివి. అతి రహస్యమైనవి. అయినా ఎంతో ఆర్తిగా నీవు అర్థిస్తున్నావు కనుక, ఆ పరమేశ్వరి సంకల్పంతో లోక క్షేమం కోసం లలితా సహస్ర నామస్తోత్రాన్ని ఉపదేశిస్తున్నాను. 

శ్రీమాతా శ్రీమహారాజ్జీ శ్రీమత్సింహాసనేశ్వరీ | చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || 
............................................................
............................................................

శ్రీ శివా శివశక్త్యాక్య రూపిణీ లలితాంబికా | 
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్రకథనం ...

ఈ విధంగా శ్రీ హయగ్రీవ స్వామి అగస్త్యుల సంవాదం వల్ల మహిమాన్వితమైన ఈ స్తోత్రం మనకి అందింది. పరిపూర్ణ వేదమూర్తి స్వరూపుడైన హయగ్రీవ స్వామిచే 
ఈ లోకానికి లలితా సహస్రనామం, దుర్గా త్రిశతి మొదలైన విద్యలు అందాయి. అంతేకాదు, సకల మంత్రతంత్రాలకు సైతం హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండాది పురాణాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. మహోన్నత అవతారమూర్తి అయిన హయగ్రీవస్వామిని అర్చించిన ఎందరో రుషులు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన ఆదిశంకరులు, విశిష్టాద్వైత మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవ ఉపాసనతో సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారని చెబుతారు. హయగ్రీవ ఉపాసన పుణ్యఫలితం వల్ల శ్రీపాద రాజతీర్థులనే పండితుడు రాజాస్థానంలో జరిగిన పండిత సభలో విజయం సాధించాడు. దుష్టమంత్ర ప్రభావం వల్ల శ్రీపాదుడికి కలిగిన వాగ్బంధనం కూడా హయగ్రీవ ఉపాసన వల్ల తొలగిపోయింది. సూర్యుడు సహా దేవతలందరూ హయగ్రీవుడి ఉపాసన చేసినట్లు హయగ్రీవ ఉపనిషత్ చెబుతున్నది.

శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం - 

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ | నరం ముంచన్తి పాపాని దరిద్రమివ యోషితః ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ | తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః | విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ||

శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదమ్ ||

ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచితం హయగ్రీవసంపదాస్తోత్రం సంపూర్ణమ్ ||

హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు, పాపాలన్నీ పోయి, దరిద్రం తొలగుతుంది.

హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా సర్వవిద్యలూ ప్రాప్తిస్తాయి. 

హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకొని వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది.

హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు దివ్యమైన శ్లోకములను ఎవరైతే స్మరిస్తారో, వారికి సంపదలు కలుగుతాయి.

హయగ్రీవస్వామి శీఘ్ర అనుగ్రహప్రదాత అని స్వామి ఉపాసుకుల మాట. హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం. అందుకే పిల్లలకు హయగ్రీవ స్తోత్రంను గానీ, మంత్రమును గానీ నేర్పించమని పెద్దలు చెప్తుంటారు.

ఓం నమో భగవతే హయగ్రీవాయ
                               [ద్వాదశాక్షర మంత్రం]

విశ్వోతీర్ణ స్వరూపాయ చిన్మయానంద రూపిణే, 
తుభ్యం నమో హయగ్రీవాయ విద్యారాజాయ విష్ణవే
                                    [హయగ్రీవ మంత్రం]

హయగ్రీవాయ విద్మహే విద్యానాథాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్
        [కపింజల సంహితలోని హయగ్రీవ గాయత్రి]


15, ఫిబ్రవరి 2025, శనివారం

అవగాహన - ఆచరణ

మా సత్సంగంలో ఒకామె -
సర్వం ఆత్మగా దర్శించినప్పుడు, సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు, శోకం మటుమాయమవుతుందని తెలిపే ఉపనిషత్ ఈశావాస్యోపనిషత్ అని,

అంతా ఏకత్వమే అని గ్రహించాక, నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని, ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనని, ఒక్కమాటలో చెప్పాలంటే 'తత్వమసి' సారం చాందోగ్యం అని,

మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు, సాధన అంతరంలో చేయాలని తెలిపేది, 'అహం బ్రహ్మాస్మి' అనే సిద్ధాంతం ప్రతిపాదించేది బృహదారణ్యక ఉపనిషత్ అని...
ఈ మూడు ఉపనిషత్తుల గురించి అనర్గళంగా మాట్లాడగలరు.

భగవద్గీత, కపిల గీత, ఋభు గీత... వీటిలో ఏ సందేహం అడిగినా, అడిగిందే తడవుగా, తడబడకుండా తడుముకోకుండా చెప్పగలరు.

రామాయణం, భారతం, భాగవతం, యోగ వాసిష్టం ల గురించి విపులంగా వివరించగలరు. నాకు ఏ సందేహం వచ్చిన ముందుగా కాల్ చేసేది తనకే. అలాంటి ఆమెలో ఏదో నిరాశ, బాధ, నిర్లిప్తత. ఉత్సాహమనేది కనిపించదు. కొంతకాలం తర్వాత ఒకానొక సందర్భంలో వ్యక్తమయ్యారు.

నేను ఈ సత్సంగముకు రాకముందు ధ్యాన తరగతులకు వెళ్ళేదానిని. అక్కడ ఓ అరగంట ధ్యానం గురించి చెప్పి, ఆ తర్వాత ఓ గంట నిటారుగా కూర్చొని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమనేవారు. ఆలోచనలు వస్తే, ఆ ఆలోచనలు వెంబడే వెళ్ళిపోకుండా, ఆ ఆలోచనలను కట్ చేసి వెనక్కి వచ్చి శ్వాస మీదే దృష్టి పెట్టండని చెప్పేవారు. ఆ తర్వాత మరో గంట ధ్యాన అనుభవాలు చెప్పమనేవారు. సప్త ఋషులు కనిపించారని, నీటి ప్రవాహం నెత్తి మీద పడి ప్రవాహంతో సాగిపోతున్నానని, గాలిలొ తేలిపోతున్నానని... ఒకటని ఏముందీ... ఎన్నో అనుభూతులు... అక్కడి సాధకులవి. 
ఒకరోజు మాష్టారు గారు నన్ను అడిగారు...ఎప్పుడూ మీ అనుభూతులు చెప్పరేమని? 'కదలకుండా కూర్చోవడమే కష్టంగా ఉంది. వీపు నొప్పి వస్తుంది. ఆలోచనల వెంబడి పరుగులు తీస్తున్న మనస్సును శ్వాస మీద పెట్టడం... మరల ఆలోచనలు... వెనక్కి రావడం... ఇదో ఆటలా ఉంది తప్ప, ఏ అనుభూతి లేద'ని చెప్పేను. దాంతో అందరూ నన్ను ఏదోలా చూసారు. మీరు ధ్యానంకు పనికిరారు. నిటారుగా కూర్చోలేరు. మీకు గూని ఉంది. ధ్యానం ద్వారానే ముక్తి వస్తుంది. ఈ జన్మలో మీకు ముక్తి రాదు. మరు జన్మలోనైనా ఈ వైకల్యం లేకుండా పుట్టించమని దైవాన్ని వేడుకోండి. రేపటి నుండి క్లాస్ కు రాకండి అని చెప్పేసారు. నాకు ముక్తి రాదు, ధ్యానం కుదరడం లేదు. నా గూనే నాకు అవరోధం. నా వైకల్యమే నాకు శాపం...అంటూ ఏడ్వడం ప్రారంభించారు.


ఆశ్చర్యం....ఒక ప్రతికూల భావం అన్నీ తెలిసిన ఆమెను మాయలా కమ్మేసింది కదా.

ఏదైనా చదివిన, విన్నా... దానిని ఒక విజ్ఞానంగా మెదడులో నిక్షిప్తం చేసుకుని అక్కడే ఆగిపోతే, అది ఓ జ్ఞాపకంలా మాత్రమే నిలిచిపోతే...మాటలు నేర్చిన చిలుకలా పలకడానికే ఆ విజ్ఞానం పనికి వస్తుందని జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలు ఉదహరిస్తూ ఒకరు చెప్పిన చిలుక కథ చెప్పనా -

ఒకానొక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక తన పిల్లలతో వుండేది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోననీ, భయపడి, ఒకరోజు రెపరెపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్నిచూసి, పిల్లల్లారా! రండి, మీకొక సత్యాన్ని పాటగా నేర్పిస్తాను అంది సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు...

వేటగాడొస్తున్నాడు జాగ్రత్త.
గింజలు ఎరగా విసురుతాడు జాగ్రత్త.
వలవేస్తాడు జాగ్రత్త.
పట్టుకుంటాడు జాగ్రత్త.
మెడ విరిచేస్తాడు జాగ్రత్త.

అనే పాటనేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు రమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు, అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఒకనాడు ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త... అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చాటున నక్కి, పోనీ గింజలు విసిరి చూద్దామనుకొని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త... అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త... అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు ........ అంటూనే చచ్చిపోయాయి.

చూసారా... ఆ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని అవగాహన చేసుకోలేదు, ఆచరణలో పెట్టలేదు.

మనమందరము కూడా, అలానే వున్నాము. తెలుసుకున్న సత్యాన్ని జీవితంలో ప్రవేశపెట్టడమే ఆచరణ. తెలుసుకున్న సత్యాలను ఆచరణలో పెట్టకపోతే, తెలుసుకొని ప్రయోజనం ఏముంది? ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృథాయే కదా!

ఇక ధ్యానమంటారా... కొందరు నిటారుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతారు. కొందరు పద్మాసనం వేసుకొని చేస్తారు. సుఖాసనం అని పంతజలి చెప్పారు. ఆటంకం కలిగించని, ఎవరి సౌలభ్యం కొద్దీ వారు కూర్చోవచ్చు. ఒత్తిడికి గురైన భంగిమలో ధ్యానం చేయడం వల్ల శరీరం యొక్క అసౌకర్యంపై మనస్సు నిలిచిపోతుంది. ఏకాగ్రత కుదరదు. కూర్చోవడం ధ్యాన ముద్ర. శ్వాస మీద ధ్యాస పెట్టడం ధ్యాన నిష్ఠ. ఇవి ధ్యాన ప్రక్రియలు. అయితే ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చొని, రోజంతా మనకు నచ్చేలా ఉండడం ధ్యానం కాదు.


నిరంతరం ఎరుక లో ఉండడం ధ్యానం. చేస్తున్న ప్రతీ పనినీ ఎరుకతో చేయడం ధ్యానం. ధ్యానం యొక్క అంతిమ గమ్యం సాక్షితత్వమే.

గూని... ఇది ఓ చిరు శారీరక లోపం మాత్రమే. ఒకటి గుర్తించండి... శారీరక వైకల్యాలు ఎప్పుడూ ప్రాపంచికంగానైనా, పారమార్ధికంగానైనా మన లక్ష్యాలకు అడ్డు కావు. ప్రాపంచిక పరంగా ఉదాహరణలు చూస్తే -

అరుదైన వ్యాధితో వచ్చిన పూర్తి పక్షవాతం చక్రాల కుర్చీలో కుదేసినా, మాట పెదవి దాటలేనంతగా వైకల్యం కుదిపేసినా, కృత్రిమ పరికరంతోనే విశ్వాంతరాలను శోధించి, కృష్ణబిలాలు, వర్క్హోల్స్, క్వాంటమ్ మెకానిక్స్, టైమ్ ట్రావెల్... అంటూ, శాస్త్ర ప్రపంచాన్ని కుదిపేసే సిద్ధాంతాన్ని వెలువరించిన మహా శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ గురించి విన్నాం కదా.

పుట్టుకతోనే చేతులు లేని జర్సికా, కాళ్లతో విమానం నడిపిన ఏకైక పైలెట్ గా గిన్నిస్ రికార్డు సాధించారు కదా.

1981 జూన్ నెలలో తమిళనాడులోని త్రీచీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినా, కృత్రిమ కాలితో నాట్య ప్రదర్శనలు ఇచ్చి, వందలాది అవార్డులను అందుకున్న నాట్య మయూరి సుధాచంద్రన్ గురించి అందరికీ తెలుసు కదా.

వాలీబాల్, ఫుట్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఉత్తరప్రదేశ్ అంబెద్కర్ నగర్ కు చెందిన అరుణిమా సిన్హా, 2011 ఏప్రిల్ లో జరిగిన ఓ ఘటన కారణంగా తన కాళ్లను కోల్పోయినా, కృత్రిమ కాళ్ళు అమర్చుకుని, ఎవరెస్టు శిఖరం ఎక్కాలని నిశ్చయించుకుని, 2013 లో పట్టుదలతో 52 రోజులపాటు ఎముకలను కొరికేసే చలిలో సైతం ప్రయాణించి, శిఖరాగ్రాన్ని చేరారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన వికలాంగ మహిళగా అరుణిమ చరిత్రకెక్కారు కదా.

3 సంవత్సరాల వయస్సులో అంధుడిగా మారిన లూయిస్ బ్రెయిలీ అంధులు చదవగలిగే వ్రాయగలిగే లిపిని కనుగొనలేదా?

పారమార్థిక పరంగా చూస్తే -
ఏడు గుర్రాలున్న రథంపై నిరంతరం సంచరిస్తూ, అఖిల జగాలకూ వెలుగునిచ్చే మహత్కర్యాం నిర్వర్తిస్తున్న సూర్యుని రథ సారథి ఎవరు? కాళ్ళు, తొడలు లేని సమర్ధుడైన అనూరుడు కాదా?

అంధత్వం కలిగిన భక్తిపూర్వక కీర్తనలతో సూరదాసు కృష్ణ పరమాత్మను సాక్షాత్కారింప జేసుకోలేదా?

కాళ్ళు చేతులు లేని కూర్మదాసు అనే పాండురంగ విఠల భక్తుడు పండరీపూర్ సందర్శించాలని తలచి, దృఢ చిత్తంతో నాలుగు నెలలు రోడ్డుపై పాకుకుంటూ బహుల ప్రాంతం చేరుకొని, ఇక కదలలేక విఠలునే ప్రార్ధించగా, భక్తునికై విఠలుడే కదిలి రాలేదా? భక్తుని కోరిక మేరకు అక్కడ విగ్రహంలా వెలియలేదా?

ఎనిమిది అంగ వంకరలు కలిగిన అష్టావక్రుడు బ్రహ్మర్షి కాలేదా?


ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం శరీరానికే గానీ; మనసుకు కాదంటూ చాటిచెప్పిన మహర్షులు, మహా భక్తులు, మహానుభావులు ఎందరో కదా🙏
నిజం చెప్పాలంటే, ఆలోచనా వైఫల్యమే వైకల్యం. ఆచరణా వైఫల్యమే వైకల్యం.

ఆఁ అన్నట్లు అష్టావక్రుడు అంటే గుర్తుకు వస్తుంది. ఒకనాడు మా తాతయ్య గారు (నాలో ఆధ్యాత్మికత పట్ల అభిరుచి, అవగాహనలకు బీజం వేసిన గురువర్యులు) చెప్పిన విషయం -

ఒకసారి ఎందరో పండితులు, వేదాంతవేత్తలు, తత్వవేత్తలుతో జనక మహారాజు ఏర్పాటు చేసిన పండిత మహాసభకు వచ్చిన అష్టావక్రుడును చూసి సభలో వారంతా నవ్వగా, వారందర్నీ చూస్తూ, అష్టావక్రుడు కూడా బిగ్గరగా నవ్వెను. కొంతసేపటికి నవ్వులు సర్ధుమణిగాక, "మిమ్మల్ని చూసి సభలో వారంతా నవ్వినందుకు అందరి తరుపున క్షమాపణలు చెప్పుకుంటున్నాను. వారంతా ఎందుకు నవ్వారో అర్థమైంది కానీ, మీరు అంత బిగ్గరగా ఎందుకు నవ్వారో అర్థం కావడం లేదు. మీ నవ్వుకు కారణం తెలియజేయగలరా" అని వినయంగా జనక మహారాజు అడిగెను. అంతటా అష్టావక్రుడు జనకుడితో, "ఈ సమావేశం జ్ఞాన కోవిదులు, వేద పండితులు మరియు తత్వవేత్తల కోసం అని నేను అనుకున్నాను. వారిని దర్శించుకుని తరిద్దామని వచ్చాను కానీ; వీరందరూ అజ్ఞానులు. వీరికి భౌతిక దృష్టే తప్పా, ఆత్మ దృష్టి లేదు. వీరంతా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ శరీరం లోపల వెలుగులీనుతున్న ఆత్మను దర్శించలేకపోతున్నారు. ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన అందులోని ప్రతిమ వంకర తిరిగి ఉంటుందా? వీరంతా దేహాత్మ భావనలోనే ఉన్నారు. బాహ్యదృష్టే తప్ప అంతర దృష్టి అలవడలేదు. వారికి పైకి కనిపించే చర్మమే తప్ప, దాని వెనక ఉన్న తేజోమయమైన ఆత్మతత్వం అవగతం కాలేదని అర్థమైంది. పుస్తక పాండిత్యమే తప్ప, అనుభవ జ్ఞానం లేని అజ్ఞానులను చూసి అందుకే నవ్వెన"నెను.



శాస్త్ర జ్ఞానంతో వెలుతురు పుట్టించవచ్చు. అనుభవ జ్ఞానమే నీలో అంధకారాన్ని తొలగిస్తుందని అంటారు స్వామి మైత్రేయ.

ఆధ్యాత్మిక ఆకాంక్షలు, శాస్త్రపరిజ్ఞానం ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి. మనం తెలుసుకున్న వాటిని మన జీవితంలో ఆచరించగల్గినప్పుడే అందులో మహా సత్యాన్ని అనుభూతి చెందగలం.

ఇక ముక్తి -
అన్నింటి నుంచి విముక్తం చేసేదే ముక్తి. ఇది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతుంది. ఎవరి యోగ మార్గం వారిది. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి సాధనా విధానం వారికి సరైనది. ఇది తప్పు కాదు. ఒక గమ్యానికి వెళ్ళినప్పుడు అన్ని దిశల నుండీ ఎన్నో దారులుంటాయి. ఏ దారిలో వెళ్ళినా, గమ్యస్థానం చేరగలం. ఎన్నో వాహనాలు... ఏ వాహనం మీద వెళ్ళినా, గమ్యం చేరుకోగలము. అల్లోపతీ, ఆయుర్వేదం, హోమియోపతీ, మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం, ఆక్యుపంచర్, ఫిజియోథెరఫీ... వైద్యవిధానాలు ఏవైనా, రోగికి స్వస్థత చేకూర్చేందుకే. వారి వారి శరీరతత్వం బట్టి, విశ్వాసం బట్టి వైద్య మార్గం అనుసరిస్తారు. ఒక వైద్య విధానముతో లొంగని రోగం మరొక విధానముతో తగ్గవచ్చును.

అలానే ముక్తే గమ్యమైనప్పుడు, అక్కడికి చేరడానికి ఎన్నో మార్గాలను కృష్ణ పరమాత్మ, ఋషులు తెలిపారు. కొందరు వేద మార్గంలో, కొందరు క్రియాయోగ మార్గంలో, కొందరు ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో..... ఇలా పలు మార్గాలు. ఎవరి విశ్వాసం బట్టి వారు ఆ మార్గంలో వెళ్తారు. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.

మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. మన ప్రవర్తన మన ఆలోచన విధానాలే మనం వ్యక్తి నుండి శక్తిగా ఎదగడానికి దోహదపడుతాయి. కొన్నిసార్లు ఎక్కడా దొరకని ప్రశాంతత, మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. అంతేగానీ, చిత్తాన్ని చంచలం చేసుకుంటే దాని ఫలితంగా లక్ష్య సాధన సిద్ధించదు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే.

దృఢసంకల్పానికి ఏకాగ్రత, విశ్వసనీయత తోడైనప్పుడు, ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింప జేయాలన్న లక్ష్యం భగీరథుడిది. అకుంఠిత దీక్షతో దివి నుంచి భువికి గంగ దిగి వచ్చేలా చేశాడు.


ఎవరు ఏమైనా చేయనీ, ఎన్నైనా చెప్పనీ, మనదృష్టి మన లక్ష్యంపై మాత్రమే వుంటే, మనం మనతోనే విశ్వాసంగా వుంటే, మనం సాధించాలనుకున్నదాన్ని ఎవ్వరూ ఆపలేరు! తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తిమార్గాన్ని వీడలేదు.

దారిలో నది అడొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు - నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులోస్తే ఆపాల్సింది పని కాదు - ప్రయత్నించే పద్ధతి.

బాహ్య సంఘటనలకి ఉద్రేక పడకుండా నిలకడగా మనసును జాగ్రత్తగా ఉంచుకోవడమే సాధన. అలానే మనం చేసే సాధనలన్నీ ఆత్మను పొందటానికి కాదు, శరీరం నేను కాదు అని తెలుసుకోవటానికే.


శరీరం దైవదత్తం - మనసు మానవ కల్పితం
బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్ష సిద్ధి తధ్యం.
                                                   - స్వామి మైత్రేయ


తను గురించి, తనలా ఆలోచించేవారి గురించి మీరు మాట్లాడుకున్నది బాగుంది. కానీ, నాకు ధ్యానం కుదరదు, జ్ఞానం నా ఊహకు అందని పదం. కర్మ చేయడమే తప్ప, కర్మ ఫలత్యాగం అంటే అర్థం కాదు. నాకు తెలుసిందంతా ఒకటే...ఉదయం దైవ స్మరణతో లేవడం, స్నానాదికాలు అయ్యాక దైవాన్ని పూజించడం,  పనులు చేసుకుంటూ, మధ్య మధ్యలో నేను నమ్మిన దైవాన్ని తలుచుకోవడం, రోజు చివరలో అంటే పడుకునేముందు, నేను ఈరోజు నా మాట చేతలతో చేసే పనులలో తప్పున్నా, ఒప్పున్నా నన్ను మన్నించు అని మనస్సులో దైవం ముందు సాగిలపడడం తప్పా, ఏ శాస్త్ర పరిజ్ఞానం లేని నాకోసం ఏం చెప్తారని అడిగిన మరొకామెకు నా సమాధానమిదే -


31, డిసెంబర్ 2024, మంగళవారం

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏



క్రిందటి టపాలో ఓ అజ్ఞాత గారు చేసిన అనేక వ్యాఖ్యలలో ఇది ఒకటి.



అజ్ఞాత గారు,
మీరు చేసిన అనేక వ్యాఖ్యలను ప్రచురించలేదు గానీ, మీరడిగిన వాటికి కాస్త వివరంగా సమాధానం ఇవ్వాలి. అందుకు సమయం లేక కుటుంబ వ్యవహారాలు నడుమ తీరిక కుదరక బదులివ్వడం ఆలస్యమైంది. మన్నించగలరు. ఈ క్రింద వివరణ అంతా మీ పలు ప్రశ్నలను, మీ ఆలోచన సరళిని దృష్టిలో పెట్టుకొని సమాధానం ఇస్తున్నాను.

ఈ యుగంలో ఎవరు గొప్పవారు?

అజ్ఞాత గారు, ఈ యుగంలో గొప్పవారే లేరనా మీ అభిప్రాయం? మరి వీరంతా ఎవరు? గొప్పవారు కాదా?

శంకర భగవత్పాదులు వారు (సా.శ. 788–820)

ఊహూ..... వీరు సాక్షాత్ శివాంశ సంభూతులు. గొప్పోరు కాక, ఏమౌతారు? వీరు కాకుండా చెప్పమని అడుగుతారా? సరిసరే...

రామానుజాచార్యులు (సా.శ.1017 - 1137)
మధ్వాచార్యులు (సా.శ.1238 - 1278)

అబ్బే...రామానుజాచార్యుల వారిని ఆదిశేషుని అవతారంగా చెప్తుంటారు. అలాగే మధ్వాచార్యులు వారిని హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయాంశ అవతారం అని కొందరు, భీముని మరుజన్మ అని కొందరు చెప్తుంటారు. కాబట్టి వీరు కాక ఇంకెవ్వరైనా ఉన్నారా...అని మరల ప్రశ్నిస్తారేమో...

శ్రీపాద శ్రీవల్లభులు (1323-1344)
వేమన (1550-1650)
సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి (1560-1750)
నారాయణ తీర్థులు (1580-1680)
మంత్రాలయం రాఘవేంద్రస్వామి (1596-1671)
త్రైలింగ స్వామి (1607-1887)
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (1608-1693)
సమర్ధ రామదాసు(1608 - 1682)
సొరకాయ స్వామి(1700-1902)
పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి (1710– 1800)
తరిగొండ వెంగమాంబ (1730-1817)
ఆదోని లక్ష్మమ్మ (1815-1933)
లాహిరి మహాశయులు (1828 - 1895)
స్వామి యుక్తేశ్వర్ (1855 - 1936)
బ్రహ్మానంద సరస్వతీ స్వామి (1863-1938)
కుర్తాళం మౌనస్వామి (1868-1943)
నార్పల తిక్కయ్యస్వామి (1870-1924)
కురుముద్దాలి పిచ్చయ్య అవధూత (1870-1951)
కదిరిమంగళం మునీంద్రస్వామి (1876-1961)

ఇలా ఎందరో గొప్పవారు ఉన్నారు కదండీ.

నిజమే కానీయండీ, వీరంతా అవధూతలు, యోగులు, కారణజన్ములు అయి ఉంటారు కదండీ... అని అంటారేమో...

రామకృష్ణ పరమహంస(1836 -1886)
వివేకానంద స్వామి (1863 - 1902)
కావ్యకంఠ వాసిష్ఠగణపతి ముని(1878 - 1936)
శ్రీ అరవింద యోగి (1872 - 1950)
మలయాళ స్వామి (1885 - 1962)
జిడ్డు కృష్ణమూర్తి (1895 -1986) గురువు
మాష్టర్ సి వి వి (1868 - 1922) యోగులు
పరమహంస యోగానంద (1893-1952)
శ్రీ రమణ మహర్షి (1879 - 1953)
పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (1894 - 1994)
వీరంతా గొప్పవారే కదండీ...

ఊ...కానీ, వీరిలో కొందరు తాత్వికులు, పరమగురువులు ఉన్నారు. పరమ గురువులంతా పరమాత్మ ప్రతినిధులే, పరబ్రహ్మాంశలో జన్మించిన వారే అని పెద్దలు అంటుంటారు. ఇంకనూ వీరిలో కొందరు అసామాన్య భక్త మహాశయులు...వీరు గొప్పవారేనండీ నిస్సందేహంగా. కానీ, సామాన్యులు గొప్పవారు కాదు కదా...

ఇది సరైన మాట కాదు అజ్ఞాత గారు. సామాన్యులు తమ అసామాన్యమైన భక్తితో ఎంతో గొప్పవారైనవారు చాలామంది వీరిలో ఉన్నారు. నిజానికి అందరి కంటే గొప్పవాడు భక్తుడే. ఎప్పుడో విన్న ఓ కథ గుర్తుకు వస్తుంది.
'భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమనే పంచభూతాలలో ఏది గొప్ప'దని అడిగాడు శ్రీ మహావిష్ణువు, నారదుల వారిని. 'భూమి గొప్పద'న్నాడు నారదుడు. 'భూమండలంలో ఒక వంతే భూమి, మూడొంతులు నీరు కదా, భూమి గొప్పదెలా అవుతుంద'న్నాడు విష్ణువు. 'అయితే జలం గొప్పద'న్నాడు నారదుడు. 'అంతటి జలాన్ని అగస్త్యుడు తాగేశాడు కదా' అన్నాడు విష్ణువు. 'అయితే అగస్త్యుడు గొప్పవాడ'న్నాడు నారదుడు. 'అంత పెద్ద ఆకాశంలో అగస్త్యుడు ఒక చిన్న నక్షత్రమే కదా' అన్నాడు విష్ణువు. 'అయితే ఆకాశమే గొప్పద'న్నాడు నారదుడు. 'అంతటి ఆకాశాన్ని భగవంతుడు వామనరూపంలో తన పాదంతో కప్పేశాడు కదా' అన్నాడు విష్ణువు. 'అయితే భగవంతుడు పాదం గొప్పద'న్నాడు నారదుడు. భగవంతుని పాదమే అంత గొప్పదైనప్పుడు మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయంలో బంధిస్తున్నాడు కదా అన్నాడు విష్ణువు. 'అయితే భక్తుడే గొప్పవాడ'న్నాడు నారదుడు.

సుదీర్ఘమైన కాలవాహినిలోఎందరో భక్తులు పూజాపుష్పాల్లా తేలియాడి పరమాత్మలో లయించి పోయారు. వారు ఇప్పుడు లేరు కానీ, వారి జీవిత గాథలు ఎందరో సాధకులకు ప్రేరణగా నిలిచి ఉన్నాయి.

అలాంటి గొప్ప భక్తులు ఎందరో.... ఉదాహరణకు -



"తుమ్ భయే సరోవర్, మై బనీ మఛియా
తుమ్ భయే చందా, మై బనీ చకోరా
తుమ్ భయే తరూవర్ మై బనీ ఫఖియా"

"నీవనే సరస్సులో చేపవై నేను సంచరిస్తాను. నీవనే చంద్రుడికై తపించే చకోరాన్నై జీవిస్తాను. నీవనే చెట్టుపై నేను పక్షినై మనుగడ సాగిస్తాను"

"జో తుమ్ తో డో పియా మైనహీ తోడోరే
తోరీ ప్రీత్ తోడో కృష్ణ కౌన్ సంగ్ జోడో...జో తుమ్"

"నీకు దూరమై నేను జీవించలేను. నిన్ను వదిలి నేను మరెవరినీ ఆశ్రయించలేను. మన చిరకాల బంధాన్ని నీవు త్రెంచుకున్నా, కృష్ణా! నేను నిన్ను విడిచిపెట్టను".

తన సర్వస్వమయిన గిరిధర గోపాలుని కోసం ఇంతలా పరితపిస్తూ అకుంఠిత భక్తితో ధన్యత పొందిన మీరాబాయి గొప్పది కాదా?

సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలి పురందరదాసు గొప్పవాడు కాదా?

అవివేకం, దుర్జనమిత్రుల సాంగత్యం కామాంధకారంతో ఉండే ఓ వ్యక్తి పరివర్తునుడై, ఇక తన జీవితంలో మళ్ళీ బాహ్య ఆనందాలపై మనసు మరలకుండా తన కళ్ళను తానే పొడుచుకొని, మనో నేత్రాల ముందు శ్రీకృష్ణుడే కదలాడేటట్లు ప్రార్థిస్తూ, కృష్ణ భక్తుడై పరితపిస్తూ ఆకలిదప్పులు లేకుండా తిరుగాడుతుండగా, ఆ సమయంలో బాల గోపాలుడుగా వచ్చి తనకు ఆహారం అందిస్తున్నది కృష్ణుడే అని గ్రహించి, కృష్ణ సాక్షాత్కారం పొంది ధన్యుడైన బిల్వమంగళుడు గొప్పవాడు కాదా?

సూరదాసు పాడుతుంటే శ్యామనాథుడు కూర్చుని చేతులు కట్టుకొని మరీ వినేవాడట. మరి సూరదాసు గొప్పవాడు కాదా?

అలనాడు యశోదమ్మ త్రాడుకు కట్టుబడినట్లు, భక్తురాలి రూపం దాల్చి, తనకు తానే త్రాడుతో బంధీ అయి, సక్కుబాయిని అనుగ్రహించిన విధం జగత్తుకు విధితమే. సక్కుబాయి గొప్ప భక్తురాలు కాదా?

శివుడును అభిషేకించడానికి చందనం దొరకక, తన మోచేతిని చందనానికి బదులుగా అరగదీసి అభిషేకించాలని తలచి, చర్మం రగిలి, ఎముకలు కనిపించేతగా మోచేతిని అరగదీసుకొని, శివయ్య దర్శనం పొందిన మూర్తి నాయనార్ గొప్పవారు కాదా?

హనుమంతుడి గుండెల్లో సీతారాములు కొలువైనట్లు తన గుండెల్లో కోదండరాముడును దర్శింపజేసిన బూర్లె రంగన్న బాబు (1895 - 1979) గొప్పవారు కాదా?

అమ్మవార్నే తన ఇంటిలో తిరుగాడునట్లు చేసుకున్న మహాభక్తుడు, చితిలో కూడా దేవత దర్శనం అయిన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (1897 - 1990) గారు గొప్పవారు కాదా?

భద్రాచలంలో రామదర్శనంకై వచ్చే భక్తులకు ఏదైన సహాయం చేయాలన్న సంకల్పం పమిడిఘంటం వెంకటరమణ దాసుది. కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని ఆయన యాయవార వృత్తి ద్వారా సంపాదించిన దానితోనే, అన్నదానం చేసేవారు. ఒకనాడు దాసు గారి ప్రయత్నంకు విఘాతం రాకుండా రామలక్ష్మణులే స్వయంగా వచ్చి వండి వార్చేరంటే ఈయన ఎంతటి గొప్పవారో కదా.





సంకీర్తనలతో అన్నమయ్య త్యాగయ్యలు దైవాన్ని మెప్పించి తమ సన్నిధికి రప్పించుకొన్నారు. తులసీదాసు తన రామచరితమానస్‌ ద్వారా శ్రీరాముడి మనసు దోచాడు. మూఢభక్తితో కన్నప్ప తన రెండునేత్రాలను శివుడికి సమర్పించి దివ్య సాక్షత్కారం పొందాడు. పోలి తన భక్తితో శివయ్యను మెప్పించి, కార్తీక మాస చివరాఖన బొందితో స్వర్గానికి వెళ్ళింది.

కష్టాల్లో ఉన్నప్పుడు సీతారామ సమేతంగా వారి పరివారమంతా వచ్చి, త్యాగరాజును ఆదుకోవడం, అలానే వెంకటాద్రి నాథుడే బోయిలా అన్నమయ్య పల్లకిని మోయడం, తులసీదాసు వాకిట రామలక్ష్మణులు కాపలాదారులై నిలవడం, శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారు తినడానికి ఏమీ లేక నీరసించి సొమ్మసిల్లగా ఆ జగన్మాతే స్వయంగా అన్నం తినిపించడం..... ఇలాంటి భక్తుల కథలు వింటున్నప్పుడు వారి అసామాన్యమైన భక్తితో ఎంత గొప్పవారు అయ్యారో అని అనిపిస్తుంది కదా.

మీ మరో ప్రశ్న 'ఇప్పుడు ఎవరున్నారు గొప్పవారు'?

ఎందుకు లేరు?

భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వామి వారిలాంటి పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వామి, మాతా అమృతానందమయి, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు..... ఇలా మనకి తెలిసిన వారు కొందరు... తెలియని వారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

అజ్ఞాత గారు!
అన్ని సంబంధాల కన్నా అపురూపమైనది అద్భుతమైనది భగవత్ సంబంధమే. జన్మించక ముందు, జన్మించిన తరువాత, జన్మ చాలించిన అనంతరం, నిరంతరం వెన్నంటి ఉండే బంధం దైవానుబందం మాత్రమే. పై గొప్పవారినంతా పరిశీలిస్తే భగవంతునితో అనుసంధానం చేసేది భక్తి మాత్రమేనని తెలుస్తుంది.

భక్తి అంటే -


ఇది నా మనమరాలు చిట్టితల్లి శ్రీమాన్వి 5th std లో వేసిన చిత్రం.

భక్తి అంటే -


భగవంతుణ్ణి మనసార స్మరిస్తూ, 'అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అని మనల్ని మనం పరమాత్మకు అర్పించుకోవడం. అందుకే కదా, నారద మహర్షులవారు 'అన్యస్మాత్ సౌలభ్యం భక్తా' భక్తికి మించిన సాధన లేదని అన్నది.

ఇలా వీరు గొప్పవారని, వారు గొప్పవారని ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు. తమ భక్తి ప్రపత్తులతో పై వారంతా ఉదాహరణగా నిలబడటం చాలా గొప్ప విషయం. మరి అలా ఉదాహరణగా నిలబడే ప్రయత్నం మనమెందుకు చేయకూడదూ ....

అత్యాశ అంటారేమో...
కానే కాదు,
ప్రయత్నం చేద్దాం.
ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి లేదా ఆ మరుసటి రోజు...
ఈజన్మ కాకపోతే వచ్చేజన్మ, వచ్చేజన్మ కాకపోతే ఆ మరుజన్మ లేదా ఆ పైజన్మ...
ఏదో ఒకరోజునా...
ఏదో ఒక జన్మనా...
మన ప్రయత్నముకు ఫలితం రాక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం.

అందుకే దైవాన్ని భక్తిగా నిత్యం ప్రార్ధిద్దాం. ప్రార్థన అంటే అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం కాదు. అంతా నువ్వే అంతా నీదే అంటూ, మనల్ని మనం అర్పణ చేసుకోవడం. సంపూర్ణ శరణాగతి చెందడం.

ఈ భ్రమా భరిత జీవిత నాటకం నుండి ముందుగా మనం బయటపడదాం. అంతులేని ఆశలతో, అర్థంకాని ఆవేదనతో రగిలిపోయే మనస్సుకు కళ్లెంవేసి కుదురుగా కూర్చోపెడదాం. నిలువుదోపిడి ఇచ్చినట్లు మనసునంతా శూన్యం చేసి ఆయన పాదాలముందు ఒరిగిపోదాం. హృదయాన్ని ఖాళీ చేసి వేణువులా ఆయన హస్తాల్లో ఒదిగిపోదాం. ఆరంభంలో అసాధ్యంగా అన్పిస్తుంది కానీ, ప్రయత్నిస్తూ పోతే, ఏదో ఒకనాటికి సాధ్యంకాక తప్పదు. ప్రయత్నించడం మన వంతు, ఫలితాన్ని ఇవ్వడం పరమాత్మ వంతు.

నిజమే గానీ, ఇదంతా కష్టం, కొంచెం సులువైన మార్గం లేదా?

ఎందుకు లేదండీ...

మన శాస్త్రాలు పట్ల వివేచన, మన మహర్షులు యోగులు తాత్వికులు జీవన విధానం పట్ల ఓ పరిశీలన, సదవగాహన అలవడితే, మనలాంటి సాధకులకు తత్వచింతన, దైవం పట్ల అనురక్తి, భగవత్ నామం పై ప్రీతి కల్గుతాయి. అప్పుడు అర్థమౌతుంది...
నామ స్మరణ, దైవ చింతన అని రెండు మార్గాలు ఉన్నాయని.
అమ్మా లలితాదేవి...
రామ రామా...
కృష్ణ కృష్ణా...
అని జపించటం స్మరణ.
ఆ జగన్మాత కథలను, రామకథను, కృష్ణుడు చేసిన లీలలను మహిమలను మననం చేసుకోవటం చింతన. కలియుగంలో నామస్మరణను మించింది లేదని శాస్త్ర వచనం. భక్తి ప్రేమలను అంతరంగంలో నింపి, చేసే నామస్మరణకు మించిన యోగం లేదు.

రామమంత్రం యో జపేత్ స రామో భవతీతి రామేణోక్తాః
"రామమంత్రమును జపించువాడు రాముడే యగునని రాముడే వచించినాడు" రామరహస్యోపనిషత్తు తెలిపినది. అటులనే,

యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్

"ఎవరు నన్ను భక్తితో భజింతురో వారు నాయందు ఉందురు. నేను వారి యందు ఉందును" అని భగవద్గీత తెలిపింది.

భగవంతుడు భక్తసులభుడు. ఇక, ఇంతకంటే సులువైన మార్గం, సున్నిత మార్గం, సురక్షిత మార్గం, సుశిక్షిత మార్గం వేరొకటి ఏముంటుంది? ఆ నామాన్ని సదా స్మరిద్దాం... నమ్మే నామాన్ని మనసార భజిద్దాం. పెదవుల నుండి కాక, హృదయం లోంచి ఉచ్చరిద్దాం. నామాన్ని (భగవత్ నామాన్ని) నామికి ( భగవంతునికి) వినిపిస్తుందనే నమ్మకంతో కీర్తించుదాం. భగవంతుడు వింటున్నాడనే అకుంఠిత విశ్వాసంతో పలుకుదాం. నామాన్ని మించింది ఏముంది? అందుకే కదా ... మోక్షాన్ని వద్దని, నిరంతరం నీ నామం నా నాలుక మీద నర్తించగలిగేటట్లు చేయు రామా, అది చాలు నాకు అని కోరుకున్నాడు రామదాసు.



ఈ సాధన త్రికరణ శుద్ధిగా సాగితే, హృదయమనే సరస్సులో నామం ఓ తామరపూవులా వికసిస్తుంది. తామరపూవు లోని మకరందాన్ని త్రాగడానికి మనస్సు ఐహికభావనలు వదిలి తుమ్మెద వలె పరుగుతీస్తుంది.
అప్పుడే, పరిపక్వత చెందిన మనసే ఫలంగా, కోరికలులేని సమర్పణా భావాలు సుగంధపుష్పాలుగా, సర్వుల క్షేమమే మహత్వాకాంక్షగా, నిర్మల నివేదనగా హృదయాన్ని సమర్పించ గలుగుతాం. ఇప్పుడు మన సాధనకు సఫలత లభించగలదు. పరిపూర్ణ ప్రేమతో, ఆర్తిగా ఆరాధిస్తే భగవత్సాక్షాత్కారం లభిస్తుంది.



అలా భగవత్ సాక్షాత్కారాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తశ్రేష్ఠులు ఎందరో ... వీరంతా సజీవ సాక్ష్యంగా కాలవాహినిలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి చాటి చెప్పినవారే.



హృదయపూర్వకంగా మనం దైవ స్మరణ చేస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు. తులసీదాసు విషయంలో ఇది నిజమే కదా.

నిజమే సుమండీ...కానీ, అలా అతికొద్దిమంది మాత్రమే చేయగలరు.

ఆ కొద్దిమందిలో మనం ఎందుకుండకూడదు?

ఓ ఇనుపముక్కను ఓ రాయి మీద రాస్తూ రాస్తూ పోతే, వేడి పుడుతుంది. భగవన్నామం అనే ఇనుపముక్కతో రాయిలాంటి మనసుని అటు ఇటు అనంతంగా అఖండంగా రాస్తూ పోతే, భక్తి అనే వేడిపుడుతుంది. పుట్టిన భక్తి అనే వేడి పరమాత్మునికి ఉండే వెన్నలాంటి హృదయాన్ని కరిగిస్తుంది, కదిలిస్తుంది. కరుణింపజేస్తుంది.

అంతటి భక్తితో ఆర్తిగా వెన్నలాంటి హృదయమున్న భగవంతుణ్ణి కరిగించాలంటే చాలా ఏళ్ళు పడుతుందేమో కదండీ...

పడుతుంది. నిరీక్షించాలి!
కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేయకూడదు. విశ్వాసంతో నిలబడాలి.



నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది.బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి 'నారాయణా! నారాయణా!' అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది. అప్పుడు దైవం అనుభవం అవుతుంది.

 

ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పని చేస్తున్నా,
భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో పాలలో కాస్త చక్కెరనో, తేనెనో కలుపుకొన్నట్లు, జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. పరమాత్మ నామ ధ్యానంలో మునిగిపోవాలి. నిరంతర భగవన్నామ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట.


31, అక్టోబర్ 2024, గురువారం

కాదేదీ కబుర్లకనర్హం - 2




అనే టపాలో చెప్పినట్లుగా కర్మల బట్టే జన్మ ఉంటుందని, కర్మల ఫలితం అనుభవించక తప్పదని, ఎవరి కర్మలకు వారే బాధ్యులని...ఇత్యాది విషయాలు గురించి మాట్లాడుకుంటుండగా...

రాముడు ఎక్కువ కష్టాలు పడ్డాడా? కృష్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డాడా...అకస్మాత్తుగా అడిగిన పద్మగారి ప్రశ్నతో, అంతా ఒక్కసారిగా మౌనమవ్వగా, అదే దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయా అనే పాటలో "నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా" అని విన్నప్పుడంతా, నాకీ సందేహం వస్తుంది. మరల మనమంతా ఎప్పుడు కలుస్తామోనని అష్టావధానంలో అప్రస్తుత పృచ్చకునిలా అడిగేసాను... ఏమనుకోకండి అని అన్నారు పద్మగారు కాస్త తడబాటుతో.

శ్రీరాముని గురించి చెప్పాలంటే - 
శ్రీరాముని జననం, తన తల్లితండ్రులతో సహా అందరూ ఆనందకరంగా ఎదురుచూస్తున్న సమయంలో అంతఃపురంలో జరిగింది. అందరి ఆలనాపాలనలో అల్లారుముద్దుగా పెరిగిన బాల్యం. చక్కటి విద్యాభ్యాసం. సుమారుగా పదహారవ యేట మొదటిసారి రాక్షస సంహారం చేసి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని పూర్తి చేయించడం, ఆపై మిథిలానగరానికి వెళ్ళి శివధనస్సు విరిచి, అందరి ఆమోదయోగ్యంతో సీతాదేవిని వివాహమాడడం... ఇప్పటివరకు అంతా ఆనందకరమే. అటుపై పట్టాభిషేకం అనుకున్న సమయంలో పినతల్లి స్వార్థానికి ఆ ముహూర్తానికే అడవుల బాటపట్టాడు. తోడుగా భార్య, తమ్ముడు లక్ష్మణుడు. తండ్రిని పోగొట్టుకున్నాడు. అరణ్యవాసం తన తండ్రికి ఇచ్చిన గౌరవంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. మొదట పదమూడేళ్ళు ఋషి నియమాలను పాటిస్తూ, ప్రకృతిలో మమేకమై చెట్లను పుట్లను చూస్తూ, వన్య ప్రాణులతో చెలిమి చేస్తూ, సెలయేర్లు సవ్వళ్లును ఆస్వాదిస్తూ, ఎంతో ఆనందంగా హాయిగా గడిపారు. చివరి ఏడాది తోడుగా ఊరటగా నిలిచిన భార్యకు దూరమయ్యాడు. కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెలో మోస్తూనే రాక్షసవధ చేశాడు. తిరిగి అయోధ్య వచ్చి ఎన్నో వేల సంవత్సరాలు ఆనందంగా అద్భుతంగా పరిపాలన చేశాడు. రాముని జీవితకాలం 11000 సంవత్సరాలు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ...దశవర్ష శతానిచ అని విడిగా చెప్పడానికి కారణం సీతమ్మ భూమి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అని పెద్దవారు చెప్పగా విన్నాను. అంటే వివాహ అనంతరం ఒక్క యేడాది మినహా ఇద్దరు కల్సి ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నారు. 1001 సంవత్సరాలు సీతమ్మతో ఎడబాటు...దుఃఖ భారం. ఇక  లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా, తాను మాత్రం అహం దశరథాత్మజః... దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమేనని ప్రకటించాడు. మాయలు మంత్రాలు చూపించలేదు. విశ్వరూపం ప్రకటించలేదు. అందరిలాగే ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. సాధారణ మనిషి ఎన్ని ఇబ్బందులు పడతాడో అన్ని యిబ్బందులు పడ్డాడు కానీ, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. నరుడు నారాయణుడు ఎలా కాగలడో జీవించి చూపాడు.

ఇక కృష్ణుడు విషయానికి వస్తే - 
తల్లితండ్రుల ఆవేదన నడుమ జననం. పుట్టక ముందే సంహరించాలనే మేనమామ పథక రచన. కారాగారమే జన్మస్థలం. ఆదినుండి అడుగడుగునా గండాలే. ఏ పసివాడూ అనుభవించనన్ని కష్టాలు. పుట్టిన క్షణాల్లోనే తల్లితండ్రులకు దూరం. పెరిగింది ప్రమాదకర పరిస్థితులలో. అనుక్షణం గడిపింది ప్రాణాపాయకర విపత్తులలో. హతమార్చాలని నలుదిక్కుల నుండి అసుర గణాలచే దాడి చేయిస్తున్న మేనమామ. పాలుత్రాగే ప్రాయంలోనే  పూతన, ఆపై శకటాసురుడు, తృణావర్తుడు... ఒకరని ఏముంది... ముప్పైకి పైగా అసురదాడులు... బాల్యమంతా జీవన్మరణ పోరాటమే. ఆపై మధురకు వెళ్ళడం, కంసున్ని సంహరించడం. ప్రతీ వివాహం అనేక యుద్ధ సంఘర్షణల నడుమే జరగడం. కష్టాలతో కూడిన ఎన్నో ఘట్టాలు, ఎన్నో గండాలు, ఎన్నో నిందలు, ఎన్నో కుట్రలను ఎదుర్కోవడం, తప్పు లేకున్నా గాంధారి శాపం స్వీకరించడం, జీవితం మొత్తం విషాదమయం. చరమఘట్టంలో తనవారంతా ఒక్కొక్కరుగా కొట్టుకొని దుర్మరణం పాలవుతుంటే, కళ్ళారా చూస్తూ, నిర్వికారంగా కదిలివెళ్ళి సాధారణ వేటగాని బాణం దెబ్బకు అవతార పరిసమాప్తం చేయడం. జీవితంలో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని, దేనికీ ఎవరికీ అంకితమవ్వక సాగించిన జీవితం.  ఒక్కమాటలో చెప్పాలంటే, కుదురుగా ఉండనివ్వని పరుగు పందెంలా సాగే జీవనం కృష్ణుడిది. అయినా ఏ క్షణంలోనూ సమ్మోహనకరమైన చిరునవ్వు వీడని చిద్విలాసుడు. లీలామానుష విగ్రహుడు. దార్శనికుడుగా యుద్ధవీరుడిగా, తాత్వికుడిగా, రాజనీతిజ్ఞుడిగా  వ్యూహకర్తగా కనబడతాడు. 
ఈ రెండు అవతారాలను పరిశీలిస్తే, శ్రీరాముడు కంటే శ్రీకృష్ణుడే ఎక్కువ కష్టాలు పడినట్లు నాకు అనిపిస్తుందని అన్నాను.

అయితే రాముని కంటే కృష్ణుడే గొప్ప అన్నమాట... ఇది పద్మగారి ఉవాచ. 
వెంటనే అలా ఎలా చెప్పగలరు పద్మగారు? శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడే గొప్పయని కొందరు... లేదు లేదు శ్రీకృష్ణుడే గొప్పయని మరి కొందరు. అక్కడున్న వారంతా రెండు వర్గాలుగా విడిపోయి చమత్కారంగా వాగ్వివాదంకు దిగారు.

కృష్ణ వర్గం : నేటికీ భగవద్గీత అంతటా అందరిచే ఆదరింపబడుతుందంటే, ఆదర్శవంతంగా నిలబడిందంటే అది మా కృష్ణుని గొప్పతనం.

రామ వర్గం : ఆహా...ఇప్పటికీ రామరాజ్యం కావాలని, వస్తుందా...మనం చూడగలమా... అని కోరుకుంటున్నామంటే, అదీ మా రాముని గొప్పతనం. 

కృష్ణ వర్గం : ఓహో... మా కిట్టయ్య పసిప్రాయం నుండే పూతనాది రాక్షసులను సంహరించాడు. మరి మీ రాముడో, యుక్తప్రాయం అంటే పదహారు ఏళ్ళు వచ్చేక తాటకిని సంహరించాడు. పుట్టినప్పటి నుండే దుష్టశిక్షణ చేయనారభించిన మా కిట్టయ్య మీ రాముని కంటే గొప్పవాడమ్మా.

రామ వర్గం : అబ్బో... బాల్యం నుండే వెన్న దొంగలించడం, అత్తా కోడళ్ళు మధ్య తగాదాలు పెట్టడం, మాయలు చేయడం...అన్నీ తుంటరి చేష్టలే. ఇత్యాదివి మీ మాయావికి చేతనయినట్లు మా మర్యాద పురుషోత్తమునికి రావు లేమ్మా.  అయినా దరిజేరిన పూతనను స్త్రీ అని ఆలోచనైన లేకుండా వెన్వెంటనే సంహరించాడు. అదే మా రామయ్యో ... తాటకిని చూడగానే ఒక్కక్షణం తటపటాయిస్తూ ఆగేడు. గురువుగారు చెప్తే తప్ప, తాటకి మీద బాణాలు వేయలేదు. స్త్రీ అని జాలి చూపాడమ్మా... ఇదీ మా రాముడంటే. 

కృష్ణ వర్గం : మీ చోద్యం బంగారం కానూ... మీ రామునిలా తటపటాయింపులు తగ్గడాలు మాకృష్ణునికి తెలియవమ్మా...అంతా స్ట్రెయిట్ ఫార్వర్డ్... అవతరించిందే దుష్టశిక్షణ కోసం. అందుకే ఏ అవకాశం ఇవ్వకుండా చిన్ననాటి నుంచే రాక్షసవధ కావిస్తూ, భూభారాన్ని తగ్గించాడు. ఇప్పుడు చెప్పండి, మా కిట్టయ్యా గొప్పా? మీ రామయ్య గొప్పా? 

రామ వర్గం : చాలమ్మా సంబడం... కొన్ని క్షణాల్లోనే ఖర దూషణాది పద్నాలుగు వేల రాక్షసులను చంపిన పరాక్రమవంతుడు మా రాముడు. అయినా
మా రాముని ఔదార్యం మీ కృష్ణునికి ఎక్కడ? ఒకరోజు యుద్ధంలో రావణాసురుని అస్త్రాలను నిర్వీర్యం చేసి, రథాన్ని కూల్చి, నేల మీద నిలబెట్టాడు గానీ, సంహరించలేదు. "రావణా!  వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకొని, బలాన్ని సమకూర్చుకుని, ఆయుధాల్ని సిద్ధం చేసుకొని రేపు రా" అని, అవకాశం ఇచ్చిన ధర్మ ప్రభువు మా రాముడు. నిస్సహాయ స్థితిలో వున్న శత్రువు పట్ల దయ జాలి చూపించడం, అవకాశం వచ్చినా, శత్రువు అధర్మంగా ప్రవర్తించినా తను నిగ్రహం కొల్పోక, ధర్మానికే విలువనిచ్చి, సంయమనంతో వ్యవహరించడం రామునికే చెల్లింది. ధర్మమే పాటించని మీ కృష్ణునికంటే మా రాముడే గొప్పవాడు. 

కృష్ణ వర్గం : అవునవును...అందుకే కదా...రావణాసురుడిని చంపకుండా అవకాశమిచ్చి పంపడం వలన మరిన్ని ఉపద్రవాల్ని తెచ్చుకున్నది. రావణుడు సంధించిన ఓ అస్త్రానికి లక్ష్మణుడు  మూర్చల్లగా, హనుమంతుడు ఔషది పర్వతాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అవకాశం ఇవ్వకుండా ఉంటే అప్పుడే అంతా అయిపోయేది. అదే మా కృష్ణుడైతే అవకాశం ఇవ్వకుండా దుర్మార్గులను సంహరించడమే.  శిష్టరక్షణ చేయడమే మా కన్నయ్య ధ్యేయం. ఇక ధర్మ ప్రభువు అయిన మీ రామయ్య సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించడం, గర్భవతిగా ఉన్న తనని అడవిలో విడిచిపెట్టడం తగునా? 
రామ వర్గం : చాలు చాలు... చాలించండి మీ మాటలు. వాల్మీకి రామాయణంలో ఏముందో ముందు తెలుసుకోండి. రావణ వధ అనంతరం దగ్గరకు వచ్చిన సీతమ్మను చూసి, అనేకం మాట్లాడుతూ, చివరగా నీవు ఇప్పుడు స్వతంత్రురాలివి. నీవు నీకు నచ్చిన చోట ఉండవచ్చు. నీవు ఇక్కడ ఉన్న  విభీషణుడు దగ్గరగానీ, సుగ్రీవుడు దగ్గరకు గానీ, లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు దగ్గరకు గాని...నీకు నచ్చిన చోటకు వెళ్ళి ఉండమని అనగా, కోపంతో సీతమ్మ, ఒక పామరుడు ఒక పామర స్త్రీతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని.....అని అనేక మాటలు పలుకగా, ఊ...నేత్రరోగికి దీపంలా నాకంటికి ఇబ్బంది కల్గిస్తున్నావు ..... అని అనెను మా రామయ్యతండ్రి. 
రాముని మాటల్లో ఎంత ఔన్నత్యం ఉందో సూక్ష్మ రహస్యముందో గ్రహించండి. అక్కడ రామ లక్ష్మణులు తప్ప ఉన్నవారంతా వానరులు, రాక్షసులు. వాలి సుగ్రీవుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు, రాక్షసుల పద్ధతి అంతే... రాక్షసుల వానరుల నీతి అలా ఉండేది. వారు గానీ, లేదా మున్ముందు మానవజాతి గానీ సీతమ్మపై ఎటువంటి అపవాదం చేయకూడదని, సీతమ్మ పాతివ్రత్యం అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత తనపై ఉండడంతో అలా నర్మగర్భంగా మాట్లాడెను. పైగా ఏ కారణం చేతనైనా భర్త దగ్గర లేనప్పుడు ఆ స్త్రీ తన బిడ్డల చెంత గానీ, పుట్టింట గానీ, అత్తింట గానీ ఏదైనా తనకి సురక్షిత ప్రాంతంలో ఉండడం మంచిది. అందుకే పరమ భక్తులైన తండ్రి సమానులైన సుగ్రీవ విభీషణుల దగ్గర గానీ, పుత్ర సమానులైన లక్ష్మణ భరత శతృఘ్నల దగ్గరగాని సురక్షితంగా ఉండమని సూచన చేసేను. ఆపై మాట్లాడుతూ నీవు దీపం లాంటిదానివి, స్వచ్చమైనదానివి కానీ, లోకాపవాదం అనే నేత్రరోగం నాకు వచ్చింది. అందుకే నేను నిన్ను చూడలేకపోతున్నాను అనెను. అంతట సీతమ్మ భర్త మనసెరిగి, పరాయివాని చెరలో కొంతకాలం ఉండి వచ్చిన నన్ను రాముడెలా స్వీకరించాడన్న లోకాపవాదు రాకూడదని, రాక్షస చెరలో పది మాసాలు ఉన్నప్పటికీ, కొందరికి మాత్రమే తెలిసిన (సుందరకాండలో హనుమంతుని తోకకు నిప్పు పెడితే, అది తెలిసిన సీతమ్మ, “ఓ అగ్నిహోత్రుడా! నేను పతిసేవ చేసి ఉన్నట్లయితే, నేను తపస్సు చేసి నిరంతరం రామ ధ్యానం చేసింది నిజమైతే, నేను పతివ్రతను అయివున్నట్లయితే, నేను భాగ్యవంతురాలను అయి ఉన్నట్లయితే రాముడు నన్ను కలుసుకోవలెను అనుకుంటున్నట్టయితే  హనుమంతుడి తోకను దహించక చల్లగా చూడు" అని ప్రార్ధించగా... తోకపై మంచు రాసినట్లు మంట చల్లబడిన ఘటనలో ఆమె ఎంత పవిత్రురాలో హనుమకు, హనుమ ద్వారా రామ లక్ష్మణ సుగ్రీవ తదితర కొద్ది మందికి తెలుసు) తన పవిత్రతను అందరికీ నిరూపించాల్సిన బాధ్యత తనదేనని గ్రహించి, 'లక్ష్మణా! చితిపేర్చు అని అగ్నిప్రవేశానికి తనకి తాను సిద్ధమయ్యేను. అంతేగానీ, రాముడు అగ్నిప్రవేశం చేయమనలేదు. అయితే రాముడు ఆపకుండా, ఆమె చెప్పినట్లు చేయమని లక్ష్మణుడికి సంకేతమివ్వడమేమిటి అని మీరు అనవచ్చు. కానీ, సీతారాముల ఇరువురికీ తెలుసు... సత్యవంతురాలు పవిత్రమయి అయిన సీతను అగ్ని కాల్చలేదని. లోక అపవాదు లేకుండా నిరూపించుకోవడానికి ఇదే సరైనదని.

అయినా చాలా ఏళ్ళ తర్వాత అయోధ్య ప్రజలు అపవాదు తప్పలేదు. సీతమ్మ గర్భవతి అయ్యాక ఆమె ఋష్యాశ్రమంకు వెళ్ళాలని ఉందని కోరుకోవడం, అదే సమయంలో ప్రజల అపవాదు... తత్ఫలితంగా ప్రజా రక్షణ, ప్రజాభిప్రాయం గౌరవించడం, వ్యక్తి ధర్మం కంటే రాజ ధర్మం ముఖ్యం అనే ధర్మానుసారం సీతమ్మను వాల్మీకి ఆశ్రమం దగ్గరలో విడిచిపెట్టమని ఆజ్ఞాపించెను. ఇక్కడ ఓ విషయం గుర్తించండి. ప్రజలు ధర్మమార్గంలో ప్రవర్తించడం గురించి ఎంత ఆలోచించాడో, సీతమ్మ కోరిక మేరకు ఆమెకు ఋష్యాశ్రమం ప్రాప్తమయ్యేటట్లు చూసాడు. అంటే మా రాములోరు అటు రాజా రామునిగా, ఇటు సీతారామునిగా ధర్మమార్గంలో నడిచారు. 

లోతైన ధర్మగతిని లౌకిక దృష్టి గ్రహించలేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ; ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తియని లోకమంతా ఇన్ని యుగాలు తర్వాత కూడా గొప్పగా చెప్పుకుంటుంది.
ఇక మీ కృష్ణులవారో...ధర్మాన్ని తప్పి ద్రోణాచార్యుడుని, కర్ణుడిని సంహరించేలా చేయలేదా? ఇప్పుడు చెప్పండి సఖులారా! ఎవరు గొప్పో? 

కృష్ణ వర్గం : ఓహో.....ధర్మ సూక్ష్మాలు మీకూ, మీ రాములోరికేనా... మాకూ ఎఱుకే. మీ ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి. నగలు సొమ్ము మూట కట్టుకుని పారిపోతున్నారు. వారిని పట్టుకోవడానికి మీరు  తరుముకుని వెళ్తున్నారు. దొంగలు సందుల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వారిని పట్టుకోవాలని వెంబడిస్తున్న మీరు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగలను పట్టుకోవాలంటే వారిని అనుసరిస్తూ, వారు వెళ్ళిన మార్గంలోనే మీరూ వెళ్ళాలి కదా.
సరిగ్గా ద్వాపరయుగంలో ఇదే జరిగింది. ధర్మవిరుద్ధంగా వెళ్ళేవారిని అదే మార్గంలో వెళ్ళి శిక్షించడం జరిగింది.
ద్రోణాచార్యుడు గురువు అయి వున్నందున యుద్ధం
చేయరాదు. రెండు వైపులా న్యాయం చెప్పాలి. మంచి చెడులను వివరించాలి. అంతే గానీ ఆయుధాలు పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం. అలానే బ్రాహ్మణుడు అయివుండి సాత్త్విక గుణం కంటే మెండుగా రజోగుణం కలిగి ఉండడం, స్నేహితుడు ద్రుపదుడుపై ప్రతీకారం, దృతరాష్ట్రుడు మాదిరిగా కాస్త పుత్రప్రేమతో అధర్మవర్తనం, ద్రౌపది వస్త్రాపహరణ సమయమందు అధర్మాన్ని నిలువరించకపోవడం... ఇవి ద్రోణాచార్యునికి తగునా? ఇది అధర్మం కాదా? అందుకే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు "అశ్వత్థామ హతః" అని పెద్దగా చెప్పి, "కుంజరహః" అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతోనే జయించాలి, తప్పదు. ఏ కార్యమైనా లోక కళ్యాణానికే చేయించాడు.
ఇక కర్ణుడు - 
కర్ణుడి రథచక్రం భూమిలో దిగిపోవడంతో, రథం దిగి దాన్ని సరిచేస్తున్న సమయంలో, శ్రీకృష్ణుడు వెంటనే కర్ణున్ని చంపమన్న ఆదేశం ఇవ్వడంతో అర్జునుడు కర్ణునిపై బాణాలు సంధిస్తుండగా, నిరాయుధుడుపై బాణాలు సంధించడం ధర్మమేనా... ఇత్యాది ప్రశ్నలతో కృష్ణా! నీవే ఆజ్ఞాపిస్తున్నావా..... ధర్మం నన్నెందుకు రక్షించడం లేదని ప్రశ్నించగా - 

 

కర్ణా! ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మం వదిలిపెట్టడం వలనే నేడు ఈ పరిస్థితి వచ్చింది. నిన్ను అంగరాజు చేశాడన్న ఒకే ఒక కారణంతో ధర్మహీనుడైన దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి ఏదైనా చేస్తాను, మాట్లాడతాను అన్నట్లు ప్రవర్తించావు. ఎన్ని తప్పు పనులు చేశావో, తప్పు పనులు చేయడానికి ప్రోత్సహించావో గుర్తుతెచ్చుకో. దురాభిమానంతో గర్వంతో ఉండేవాడివి. లక్క ఇంటిని కాల్చేస్తున్నప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా? కపట జూదంతో నీ మిత్రుడు దుర్యోధనుడు ధర్మరాజును ఓడిస్తున్నప్పుడు ధర్మం జ్ఞాపకం రాలేదా? మిత్రుడు అధర్మ మార్గంలో నడిస్తే  మిత్రుడుగా మంచిమార్గంలో పెట్టడం నీ ధర్మం కాదా? నిండుసభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తున్నప్పుడు నీవు అన్న మాటలు ధర్మబద్ధమైనవా? చక్రవ్యూహంలో బాలుడైన అభిమన్యుడు వీపుపై బాణాలు సంధించి, నిరాయుధుడైన సమయంలో, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు, ధర్మం తెలియరాలేదా? ఇది నీ కర్మ ప్రతిఫలం. ఇదే న్యాయమని ఆనాడే కృష్ణుడు చెప్పింది మీరు మరిచారా? అధర్మ ఆశయం ధర్మం నిలబెట్టడమే అయితే, ఆ అధర్మం కూడా ధర్మమే అవుతుంది. ఇప్పటికైనా మా కృష్ణ తత్త్వం గ్రహించి ఒప్పుకొండి కన్నయ్యే గొప్పవాడని. మీకో కథ చెప్పమా...విని మీరే చెప్తారు మా కిట్టయ్యే గొప్పయని. 
ఒకానొక రోజు గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్ళు తోడుతోంది. కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తి పెడతారేమో అని ఇటూ అటూ చూసింది. అటుగా వెళుతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. "కృష్ణా కృష్ణా" అని పిలిచింది. కృష్ణుడు వినిపించనట్టు వెళ్ళిపోయాడు. కృష్ణకు ఏమైంది ఈరోజు అని అనుకుంటూ, ఎలాగోలా కుండ ఎత్తుకొని ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె ఇంటికి ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. "రా! కుండ దించి పెడతాను," అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో అడిగింది. "అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావో... నాకేం అర్ధం కావడం లేదు, కృష్ణా!" అంది. కృష్ణుడు నవ్వి, "నేను భారం దించేవాడిని, భారం ఎక్కించడం నా పని కాదు" అని వెళ్ళిపోయాడు. ఇదీ మా కృష్ణుని గొప్పతనం. కృష్ణా కృష్ణా అని పిలిస్తే చాలూ, మన భారాల్ని ఆయనే దించుతాడు. ఇప్పుడు చెప్పండి మా కన్నయ్యే గ్రేట్ అని.
ఓసోసి... మేమూ ఇలాంటి బోలెడు కథలు విన్నాం, చదివాం. మేమూ కథలు చెప్పగలం. 
ఒకానొకరోజు ఒకచోట రామనామ భజన జరుగుతుండడం చూసి, ఒకతను అపహాస్యం చేస్తూ మాట్లాడం గమనించిన ఒక జ్ఞాని, అతనని వారించి, నీకు తెలుసివస్తుందిలే త్వరలో రామ నామ మహిమ అని చెప్పి, అతనికి రామనామాన్ని ఉపదేశించి, 'దీన్నెప్పుడూ ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు, నీకు వీలున్నప్పుడల్లా చెప్పుకో' అన్నాడు. కాలక్రమంలో అతను చనిపోయాడు. యమదూతలు అతని ఆత్మను తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. యమధర్మరాజు అతని పాపపుణ్యాల లెక్కలను పరిశీలించి, 'ఓమారు రామ నామాన్ని ఉచ్ఛరించావు. అందుకు నీకు ఏం కావాలో అడుగు?' అన్నాడు. అయితే అతనికి జ్ఞాని చెప్పిన 'ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు' అన్నమాట గుర్తుకు వచ్చింది. కనుక అతను యమధర్మరాజుతో 'మీరు ఏమి ఇవ్వదలచుకున్నారో అది మీరే ఇవ్వండి. నేనుగా ఏదీ అడగను' అన్నాడు. అతని మాటలకు యమధర్మరాజు విస్తుపోయాడు. రామనామానికి తాను ఎలా వెల కట్టగలనని అనుకున్నాడు. ఎందుకైనా మంచిది ఈ విషయమై ఇంద్రుడిని కలిసి ఆయననే ఓ నిర్ణయం తీసుకోమంటే సరిపోతుందనుకున్నాడు. అతనితోపాటు యమధర్మరాజు ఇంద్రుడి వద్దకు బయలుదేరబోయాడు. అయితే అతను ఓ షరతు విధించాడు. 'నేను మీతో రావాలంటే నన్ను పల్లకీలో తీసుకుపోవాలి. పైగా ఆ పల్లకీని మోసేవారిలో మీరొకరై ఉండాలి' అన్నాడు. ఇందుకు సమ్మతమైతే వస్తానన్నాడు. ఇతను నన్నూ ఓ బోయిగా చూడాలనుకుంటున్నాడంటే రామనామ మహిమ ఘనంగానే ఉందన్న మాట అని అనుకున్నాడు యమధర్మరాజు. అందుకే అతను ఇలా షరతు విధిస్తున్నాడని భావించాడు. అందుకు సమ్మతించాడు. పల్లకీ మోసే బోయీలలో యమధర్మరాజు ఒకడయ్యాడు. ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు. యమధర్మరాజుకు తన రాక కారణం చెప్పాడు. అయితే ఇంద్రుడు రామనామ మహిమకు నేను వెలకట్టలేనన్నాడు. మనమందరం కలిసి బ్రహ్మ దగ్గరకు పోదామన్నాడు. యమధర్మరాజుతోపాటు ఇంద్రుడు కూడా పల్లకీ మోస్తేనే తాను బ్రహ్మ వద్దకు వస్తానన్నాడతను. చేసేది లేక ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించాడు. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అయితే బ్రహ్మ కూడా తాను రామనామ మహిమకు వెలకట్టలేననీ, వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదామనీ అన్నాడు. యమధర్మరాజు, ఇంద్రుడితోపాటు బ్రహ్మ కూడా పల్లకీ మోసే బోయీలలో ఒకడయ్యారు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు. విష్ణువుతో తామెందుకు వచ్చామో చెప్పారు. 'ఇతను ఒక్కసారి రామనామాన్ని ఉచ్ఛరించాడు, అందువల్ల అతనికి ఏ పుణ్యం దక్కుతుందో మీరే చెప్పా'లన్నారు యమధర్మరాజాదులు. 'ఈ జీవిని మీరందరూ కలిసి పల్లకీలో కూర్చోపెట్టి మోసుకువచ్చారు కదా, దీని బట్టి ఇంకా మీకు రామనామ మహిమ అర్థం కాలేదా?' అని ప్రశ్నిస్తూ ఆ ఆత్మను తనలో కలుపుకొన్నాడు విష్ణుమూర్తి. ఇప్పుడు చెప్పండి కృష్ణ భక్తమహాశయులారా! మీ అభిప్రాయాన్ని...

బాబోయ్...ఇక ఆపండీ...మనందరికీ తెలుసు. ఇద్దరూ శ్రీమన్నారాయణుని అవతారములే. 


రాముడు పూర్ణ మానవవతారం. కృష్ణుడిది పరమాత్మ అవతారం. ఒకరు మాయామానుష విగ్రహులు, మరొకరు లీలామానుష విగ్రహులు.

ఒకరిది త్రేతాయుగం, మరొకరిది ద్వాపరయుగం. రామునిలా ధర్మంగా ఉంటానంటే ద్వాపరయుగంలో కుదరదు. ఇక్కడ ధర్మానికి ధర్మమే సమాధానం, అలాగే మోసానికి మోసమే సమాధానం. ధర్మ రక్షణ యుగయుగానికి భిన్నం. యుగధర్మాలు, అవతార బేధాలు గమనిస్తే ఈ ధర్మ సూక్ష్మాలు అవగతమౌతాయి. 
త్రేతాయుగంలో అప్పటి ధర్మశాసనాలు, ఆనాటి కాలానుగుణంగా రాముడు గొప్పవాడు. ద్వాపరయుగంలో అప్పటి కాలపరిస్థితులను బట్టి కృష్ణుడు గొప్పవాడు. త్రేతాయుగంలో రాముడు చేసిన పనిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పి చేయించాడు. 
రాముడు చేసి చూపించినది ఆచరణీయ ధర్మమార్గం.
కృష్ణుడు చెప్పి చేయించింది ఉపదేశ ధర్మమార్గం. అందుకే పెద్దలు అంటుంటారు 'రాముడు చేసింది చేయరా, కృష్ణుడు చెప్పింది వినురా' అని.
రాముడుని అనుసరించాలి, రాముని పనులను అనుకరించాలి. 
కృష్ణుడిని ఆశ్రయించాలి, కృష్ణుడు చెప్పినదానిని ఆచరించాలి. 

ధర్మాన్ని అనుసరించిన దేవుడు శ్రీరాముడు కాగా, ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు.
కాబట్టి ఇద్దరూ ఇద్దరే. ఇక ఈ చర్చ ఇంతటితో ఆపి ఇళ్ళకు వెళ్ళకపోతే భగవంతుని అనుగ్రహం ఉన్నా లేకున్నా, భర్త ఆగ్రహం తప్పక చవి చూడాల్సి వుంటుంది. ఇక  నడవండి అంటూ ముగించింది ప్రియంవద.