http://www.sodhini.com

13, సెప్టెంబర్ 2012, గురువారం

*శుద్ధ ఆహారము*


భగవంతుడు, ప్రారబ్ధం వదిలించుకొని పరమాత్మ యందు ఐక్యం కావడానికే మానవ దేహం ప్రసాదిస్తాడు. కానీ; మన ఇంద్రియాలద్వారా వివిధ అపవిత్రమైనకార్యాలు చేస్తూ, అశుద్ధఆహారాన్ని స్వీకరిస్తూ, చివరికి ఈ పవిత్రమైన దేహాన్ని మట్టికే అంకితమిచ్చి, ప్రారబ్ధాన్ని పోగొట్టుకోలేక, మరింత పోగుచేసుకొని మరిన్ని దేహాల్నీ మరల మరల పొందుతూ జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, శ్రమిస్తూ దుఃఖితులమౌతున్నాం. 
అందుకే అలా కాకుండా 
ఈ దేహం యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం,
సత్కర్మలు ఆచరిస్తూ, సద్భావనతో చరిద్దాం,
ఆరోగ్యకరమైన శుద్దాహారమునే స్వీకరిద్దాం,
తద్వారా తరిద్దాం.

మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని. 
దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: / 
దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ //
బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.

మరి ఈ శుద్ధఆహారం అంటే ఏమిటీ?
ఆహరవిషయములో వస్తుశుద్ధి (తీసుకునే పదార్ధము శుభ్రతగా ఉన్న మాత్రమే చాలదు, అది ఎటువంటి ధనముచేత, లేక యే విధంగా వచ్చిందో ఆ మార్గము శుద్ధముగా ఉండవలెను), పాత్రశుద్ధి ( వండే, తినే పాత్రలశుద్ధి), వాహక శుద్ధి (వండేవారు, వడ్డించేవారు శుద్ధత కలవారై) ఉండాలి. పాపపు సొమ్ముచే గానీ, పాపపు పనులచే గానీ వచ్చిన వస్తువు మంచిదైనను అది పాపాహారమే యగును. అలాగునే ఇతరులు కష్టపడి మనకై చేసినపనికి తగిన ప్రతిఫలం ఇవ్వక సంపాదించిన సొమ్ముచే భుజించెడు అన్నం పాపాన్నమే యగును. ఇట్టి ఆహారమును తీసుకున్నవారి మనస్సు నిర్మలముగా ఉండదు. శాంతి, దయ, వైరాగ్యాదులు వీరికి కలగవు. 
అటులనే ప్రతిఒక్కరూ వారు స్వభావములు అనుసరించి తీసుకునే ఆహారములో సాత్త్వికం, రాజసము, తామసము అను భేదములు కలవు.
సాత్త్వికాహారము సత్త్వగుణమును వృద్ధి చేయును. సత్త్వశుద్ధిచే చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధిచే ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగును. 
శ్రీ మద్భగవద్గీత యందు పదిహేడవ అధ్యాయంలో తెలిపింది ఇదే -
ఆయుస్సత్వ్త్వ బలారోగ్యసుఖప్రీతివివర్ధనాః /
రస్యాస్స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్వికప్రియాః 
ఆయుస్సును, మనోబలమును, శరీరబలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిగా బాగుగా అభివృద్ధి నొందించునదియు, రసము గలదియు, చమురుతో కూడినదియు, దేహమందు చాలాకాలమునుండి సత్తువ నిచ్చునదియు, మనోహరమైనదియు సాత్త్వికాహార మనబడును. ఈ ఆహారమును సాత్త్వికులు ఇష్టపడుదురు. 
కావున విజ్ఞులు ఇట్టి ఆహారమును స్వీకరించవలెను.
కట్వామ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః /
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకా మయప్రదాః //
అమితముగా చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, దాహము కలుగజేయునవిగాను, మనఃక్లేశం కలుగజేయునట్టి ఆహరం రాజసాహారం అనబడును. ఈ ఆహారమును రాజసులు ఇష్టపడుదురు. ఈ విధమైన ఆహారం దుఃఖశోకరోగములను కలిగించును. 
ఇటువంటి ఆహారమును త్యజించవలెను.
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ /
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ //
సారం నశించి పాచిపోయినట్టి పదార్ధమును, ఒకరు తినగా మిగిలిపోయినదియును, అశుద్ధముగా ఉన్నటియు (భగవంతునికి నివేదనచేయనటువంటివి) ఆహారము తమోగుణమును పెంచును. ఈ విధమైన ఆహారమును తామసులు ఇష్టపడుదురు. 
ఇటువంటి ఆహారమును స్వీకరించరాదు. 
అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృత చిత్తానాం ధర్మస్సమ్యక్ న భాసతే //
అన్నదోషముచేత మనస్సు కలుషితం అయి చిత్తమునందు ధర్మరహస్యం ప్రకాశింపదు.  కావున ఆహరవిషయమును సామాన్యమని తలంచరాదు. ఆహారశుద్ధి తప్పనిసరి.
ఇక భగవంతునికి నివేదన చేసి భగవంతున్ని స్తుతిస్తూ ఎందుకు భోజనం చేయాలంటే - మనం తీసుకున్న మిశ్రమాహారమందలి నిరుపయోగమైనదానిని మలమూత్రస్వేదములుగా బహిర్గతమొనర్చి, సారమును మాత్రమే గ్రహించి, అందలి పిండిపదార్ధములను విడగొట్టి గ్లూకోజ్ గా  మార్చి దేహములోని సూక్ష్మాణువులకు అందించి, కొవ్వుపదార్ధములను వేరుచేసి చర్మమునకు, కీళ్ళ సందువులకు అందించి, అందలి కాల్షియమును ఎముకలకు అందిస్తూ...... ఇలా సప్తధాతువులకు ఆహారం అందడానికి కారణం -
 
మనం భుజించే ఆహారంను జీర్ణమయ్యేటట్లు చేస్తున్న "జఠరాగ్ని". ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి, ఆహరపదార్ధములను జీర్ణమయ్యేటట్లు చేస్తుంది ఈ జఠరాగ్నే!
ఈ విధంగా మనం తీసుకున్న ఆహరం,
 జఠరాగ్ని
 
చే పక్వంకానిచో, రక్తాదులద్వారా శరీరమంతటను వ్యాపింపలేదు. కావున జఠరాగ్ని శరీరమున కీలకస్థానం ఆక్రమించుకొని యున్నది. అంతటి కీలకమైన జఠరాగ్నిరూపమున భగవానుడే ఉండి, శరీరమునకు పుష్టిని చేకూర్చుతున్నట్లు గీత యందు పదిహేనేవ అధ్యాయమున పద్నాలుగవ శ్లోకం ద్వారా తెలుస్తుంది.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః /
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //
(నేను వైశ్వనరుడను జఠరాగ్నిగానయి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో కూడుకొని నాలుగువిధములగు అన్నమును వచనము చేయుచున్నాను.
నాలుగు విధములగు అన్నము :- 1) భక్ష్యమనగా దంతములచే కొరికి తినెడు గారెలు మొదలగు ఘనపదార్ధములు. 2) భోజ్యమనగా దంతములతో కాస్తా నమిలి  భుజించెడు క్షీరాన్నాదులు లాంటివి. 3) లేహ్యమనగా నాలుకచే చప్పరించి తినెడు పచ్చడి లాంటి పదార్ధములు 4) చోష్యమనగా నాలుకచే చప్పరించకనే ఆహారముగా తీసుకొనెడు క్షీరం లాంటి పానాదులు).
అందుకే భోజనంకు ముందు ఈ శ్లోకమును మరియు  బ్రహ్మార్పణం బ్రహ్మ....... క్రింద వివరించిన ఈ శ్లోకమును కూడా పఠించి, 
జీవులకు ఇంతటి మహోపకృతి నొనర్చుచున్న ఆ పరమాత్ముణ్ణి స్తుతిస్తూ, భగవంతునికి నివేదన చేసిన ఆహరమునే దైవభావముతో భుజించడం పరమోత్తమం. 
{ఇందుకే పూర్వం ఆహారమును భుజించుటకు ముందు  భగవంతునికి నివేదన చేసిన పిమ్మట దేహమును క్షేత్రముగాను, ఆత్మను క్షేత్రమందు గల సర్వేశ్వరునిగాను భావన చేయుచు, ఆ ఆహారమును స్వీకరించే ఆచారముండేది. ఇటువంటి ఆచారములవలన క్రమేపి శివ జీవైక్య జ్ఞానం కలుగుతుంది. 
ఇక్కడ నా చిన్నప్పటి విషయం ఒక్కటి జ్ఞాపకం వస్తుంది. మా చిన్నతనంలో మా అమ్మమ్మ మాకు అన్నం తినిపిస్తూ ఇది మనూరి బంగారమ్మతల్లి ముద్ద అనీ, ఇది బెజవాడ కనకదుర్గ ముద్ద అనీ, ఇది రాయగడ మజ్జిగౌరమ్మ ముద్ద అనీ, ఇది కంచి కామాక్షిది, ఇది కాశీ విశాలాక్షిది, ఇది తిరుపతి వెంకన్నది, ఇది భద్రాది రామన్నది, ఇది శ్రీశైలం మల్లన్నది, ఇది సింహాద్రి అప్పన్నది........అంటూ ఒకొక భగవన్నామముతో అన్నం ముద్దలను పెట్టడం బాగా జ్ఞాపకం. కానీ అలా తినిపించడంలో పరమార్ధం కొంతకాలం క్రితం వరకు నాకు తెలియలేదు. చిన్నప్పటినుండి దైవ స్మరణ చేయిస్తూ పెద్దలు ఈ రీతిలో మనకు అన్నం తినిపించడంలో ఓ మంచి ఆధ్యాత్మిక బోధ ఉన్నదని తెలియక నా పిల్లలకు నేనలా చేయలేకపోయాను. నా పిల్లలు అన్నం తినమని మారాం చేసినప్పుడు, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్నది, ఇది అక్కది, ఇది అమ్మమ్మది, ఇది నానమ్మది, ఇది తాతయ్యది,  ఇది పిన్నది, ఇది అత్తది.......... అనీ సన్నిహిత బంధువుల పేర్లు చెప్తూ తినిపించేదానిని. నాలా తెలియని తల్లులు ఎందఱో ఉండవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను - అప్పటి ఆచారవ్యవహారాల్లో ఉన్న గొప్పతనమునూ మరియు మన పూర్వీకులు, పెద్దవారు వారి వారి పనులద్వారా ఉగ్గుపాలనుండియే తత్త్వబోధ చేసేవారని. అది గ్రహించక అజ్ఞానంలో నేనున్నానని. ఇక్కడ మరొక అనుభవపూర్వక విషయమును కూడా నేను చెప్పాలనుకుంటున్నాను - ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా ఏర్పడిన అవగాహన వలన మన ఆచారవ్యవహారాల్లో ఉన్న అంతరార్ధం అర్ధమై, వాటిని ఆచరణలో పెట్టడంతో గతంలో కంటే  నాదిప్పుడు ఎంతో సరళమైన ప్రశాంతకర జీవనమైంది}
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ /
బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
హోమసాధనములు {సృక్ (సృక్ అనగా హోమములో, కొయ్యతో చేయబడిన గరిటివంటి యే పాత్రచే హవిస్సు అన్నాదులు హోమింపబడునో దాని పేరు), స్రువం (స్రువమనగా హోమములో, కొయ్యతో చేయబడిన యే పాత్రచే ఘ్రుతమును ఎత్తి హోమింతురో దానియొక్క పేరు) మున్నగునవి}, హోమద్రవ్యములు (అన్నం, నెయ్యి మొదలగునవి), హోమాగ్ని, హోమం చేయువారు, హోమం చేయబడింది....అన్నియును బ్రహ్మస్వరూపములే అన్న బ్రహ్మభావమును కలిగి బ్రహ్మార్పణ భావంతో ఈ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు..... క్రమేపి బ్రహ్మస్వరూపమును పొందగలడు.
ఈ శ్లోకమందు హోమం గురించి చెప్పబడినప్పటికిని సమస్త కార్యములందు ఈ ప్రకారమే, అంటే సమస్తమూ బ్రహ్మమయమే అన్న భావనతో చేసినచో - ప్రతీ కార్యమందునూ చేయువారు, చేయబడింది బ్రహ్మస్వరూపములే యగును. 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని చాందోగ్యోపనిషత్ తెలిపిన విధంగా ఈ సమస్తమూ బ్రహ్మమే అను భావమును దృఢపరచుకొని సర్వకార్యాలు నిర్వర్తించువాడు బ్రహ్మస్వరూపమే పొందును. ఈ ప్రపంచమున సమస్తమూ బ్రహ్మస్వరూపమేకానీ, అన్యం కాదు. ఈ విషయం సదా జ్ఞప్తియందు ఉంచుకొని, చిత్తమందు బ్రహ్మభావన, దైవభావన కలిగియుండి అన్నాదులు స్వీకరించినచో, ఈ స్వీకరించనెడి ప్రక్రియ ఓ యజ్ఞమే యగును, భుజించు పదార్ధము అమృతమే యగును. 
పూజితం హ్యశనం నిత్యం బలమూర్జం చ యచ్ఛతి /
అపూజితాం తు తద్భుక్తముభయం నాశయేదిదమ్ //
దైవభావముతో భుజించెడు అన్నం సత్త్వగుణమును, బలమును, దివ్యమైన ఓజస్సును కలుగజేయును. అట్లుకాక భుజించెడు ఏ పదార్ధమైనను ఆత్మబలమును, తేజస్సును నశింపజేయును.
బ్రహ్మభావనతో భుజింప అభ్యసించువారికి ఈ దేహం దేవాలయముగాను, ఆత్మ పరబ్రహ్మ స్వరూపముగాను బోధపడును. 
అటులనే భోజనం చేయునప్పుడు ఇట్టి భావంతో మౌనంగా భుజించువారు ఉత్తమ సాత్త్వికులు. భోజనం చేయునప్పుడు వ్యర్ధ విషయములు మాట్లాడుచు భుజించువారు రజోతామసతత్త్వం కలవారగుదురు. 

మానేన భోజయిత్వా తు స్వర్గం ప్రాప్తో న సంశయః /
ప్రజల్పన్ భుజంతే యస్తు తేనాన్న మశుచిర్భవేత్ //
పాపం న కేవలం భుంక్తే తస్మాన్మౌనం సమాచరేత్ /
ఉపవాసనమం భోజ్యం జ్ఞేయం మౌనేన నారద! //
మౌనంతో భుజించువారు స్వర్గమును పొందగలరు. దీనియందు సందేహం లేదు. మాట్లాడుతూ భుజించిన అన్నము అశుచి అగుతున్నది. వ్యర్ధవిషయాలు మాట్లాడుచు భుజించు అన్నం అన్నమే కాదు, పాపరూపమే యగును. మౌనంతో భుజించిన భోజనం ఉపవాస సమానమే అగుచున్నది. ఉపవాసం వలన ఎంత ఆత్మశుద్ధి కలుగునో అంత పుణ్యం మౌనంగా భుజించడం వలన కలుగును.

ఈ రీతిలో సాత్త్వికమైన ఆహారమును మౌనముగా దైవానికి నివేదనచేసి, దైవమును స్తుతిస్తూ తీసుకున్న ఆహారం శుద్ధాహారం అవుతుంది. 
శుద్ధ ఆహరముచే మనస్సు నిర్మలమవును. శాంతి, దయ, వైరాగ్యం, దైవచింతన, బ్రహ్మభావన కలిగి పరబ్రహ్మప్రాప్తి పొందవచ్చును. 
పుత్రోత్పత్తికి హేతువగు శుక్లశోణితం ఏ అన్నపానీయములచే స్త్రీపురుషులకు ఏర్పడునో అట్టి అన్నము శుద్ధముగా ఉన్నచో - దైవ, మాతాపితరులయందు, గురువులయందు, వేదశాస్త్రాలయందు, సాదు సత్పురుషులయందు విశ్వాసం గల ధర్మాతులైన వంశోద్ధారక సంతానం కలుగుదురని శాస్త్రవచనం. 

3, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆ నాలుగు ఏమిటంటే.........

మొన్న మా అమ్మాయి (అనుషా) ఓ ప్రశ్న అడిగింది. 
అమ్మా! సత్యయుగం(కృతయుగం)లో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది అని అంటారు కదా. ఆ నాలుగు పాదాలు ఏమిటమ్మా?
ఆ నాలుగు ఏమిటంటే.........
కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్తజ్జ నైర్ధ్రతః /
సత్యం దయా తపో దానమితి పాదాని భోనృప //
(ఈ శ్లోకం మహాభారతం లోనిదని జ్ఞాపకం)
కృతయుగమందు ౧.సత్యం ౨.దయ ౩.తపస్సు ౪.దానం అనునవి నాలుగు పాదములు. 
మా అమ్మాయి అడిగిన ఈ ప్రశ్నతో మరో జ్ఞాపకం నా మదిలో కదలాడుతుంది. అది -
ఓ మూడు నాలుగు సంవత్సరముల క్రితమనుకుంటాను (సరిగ్గా జ్ఞాపకం లేదు), తెలుగుచలనచిత్రరంగ ఉత్సావాలప్పుడు ప్రముఖనటుడు రాజేంద్రప్రసాద్ గారు ఇలా అన్నారు -
కృతయుగంలో మంచే తప్ప చెడు అనేదే లేదు, త్రేతాయుగంలో మంచి సముద్రానికి ఇవతల, చెడు సముద్రానికి అవతల ఉండేవి, ద్వాపరయుగంలో మంచి చెడు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట ఉండగా, కలియుగంలో ఈ రెండూ ప్రతీ ఒక్కరిలో ఉన్నాయి అని! ఈ కార్యక్రమం టి.వి లో చూస్తూ 'ప్చ్..... కృతయుగంలో పుట్టిన బాగుండును, దురదృష్టం కొలది ఈ కలియుగమందు పుట్టాను కదా' అని నేను అంటుండగా, ప్రక్కనే ఉన్న మావారు  "అలా ఎందుకనుకోవడం? ఈ యుగమందైన సత్యయుగంలో ఉన్నట్లు ఉండవచ్చు. ఏ యుగమందు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందిన ధర్మం ప్రకారం మన ప్రవర్తన మార్చుకుంటే సరిపోతుందని" అన్నారు.
నాకు అర్ధం కాలేదు మావారి మాటలు. కాస్త వివరంగా చెప్పండి అని అడగగా -
కృతయుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సు, దానం అను పాదాలపై నడిచేది. ఈ నాలుగు గుణములు కలవారు ఏ యుగమందున్నను సత్యయుగంలో ఉన్నట్లే.
త్రేతాయుగమందు ధర్మం - సత్యం లోపించి దయ, తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ మూడు గుణములు కలవారు ఏ యుగమందున్నను త్రేతాయుగంలో ఉన్నట్లే.
ద్వాపరయుగమందు ధర్మం -సత్యం, దయ లోపించి తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ  రెండు గుణములు పరిపూర్ణముగా కలవారు ఏ యుగమందున్నను ద్వాపరయుగమందు ఉన్నట్లే.
ఇక కలియుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సులు లోపించి కాస్తంత దానగుణం పైనే నడుస్తుంది. 
ఏ యుగమునందు నీవు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందినట్లు నీ గుణసంపత్తిని పెంచుకో... 
అని వివరంగా మావారు చెప్తూ ఈ విషయాలన్నీ భారతంలో ఉంటాయి చదువు అని భారతమును నా చేతిలో పెట్టడం ఓ మధురమైన జ్ఞాపకం.

భారతంలో అనుశాసనికపర్వంలో ధర్మరాజు యుగములను గూర్చి అడిగిన ప్రశ్నకు భీష్ముడిట్లు సమాధానమిచ్చెను -
'మానవుల అంతఃకరణలను బట్టియే యుగములు మారును గానీ యుగమునుబట్టి మానవుల అంతఃకరణములు మారవు'.

1, సెప్టెంబర్ 2012, శనివారం

దేహమే దేవాలయం; జీవుడే దేవుడు!

దేహస్తాః సర్వవిద్యా శ్చ దేహస్తా స్స ర్వదేవాతః
దేహస్తాః సర్వతీర్ధాని, గురువాక్యేన లభ్యతే 
బ్రహ్మాండలక్షణం సర్వం దేహమధ్యే వ్యవస్థితమ్ (జ్ఞానసంకలినీతంత్రం) 
                                * * *
దేహమే దేవాలయం; ఆత్మయే దైవం. (వేదాంతుల వాక్కు)
                                * * *
దేహమే దేవాలయం; జీవుడే దేవుడు. (మహర్షుల మాట)
                                 * * *
ఈ దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం; దీని లోపల ఆత్మయే దైవం. (శాస్త్ర వచనం)
                                 * * *
మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది. (శ్రీ రమణమహర్షి)
                                  * * *
భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు కదా...
దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే -
భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ, మనకి కానరావడం లేదు... ఎందుకనీ?
మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన!
మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు! మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.
మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి... ఎలా?
ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని - ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి, పుజాసామగ్రిని, పూజగదిని శుభ్రపరిచి, అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో, అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి). మనలో ఉన్న అజ్ఞాననిర్మాల్యలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి  ఆరు అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించాలి. సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. అందుకే చెడు ఎవరైనా చెబితే చెవిటివాడులా ఉండు, చెడు మాట్లాడే సంభాషణ సంభవిస్తే మూగవాడిలా వుండు, చెడు చూసే పరిస్థితి తారసపడితే గుడ్డివానిలా వుండు అని 'బాబా' అంటారు. మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి, అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. (ఆలోచనలతో నిండి ఉన్న భాగాన్ని మనస్సు అనియు, విచక్షణతో నిర్ణయం తీసుకునే భాగాన్ని బుద్ధి అని అంటారు). రామకృష్ణ పరమహంస చెప్పేది ఇదే - 'ఆకర్షణల మధ్య ఆకర్షణ లేకుండా ఉండగలగడమే వివేకం' అని! ఏది మంచో, ఏది చెడో బుద్ధిద్వారా గ్రహించాలి. మనబుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి, మన మనస్సు చేతిలో బుద్ధి ఉంటే మనకు తిరోగతి. శ్రీ రమణులు అన్నట్లు, మనస్సు బయటికి వెళితే బంధం, లోపలి వెళితే మోక్షం!  
ప్రాపంచిక మార్గమైన, పారమార్ధిక మార్గమైన సరే, మన జీవన గమనంలో బయట లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవి సహజం. ఇవన్నీ ఓర్పు, దైర్యం, నమ్మకం, ఏకాగ్రత లాంటి సద్గుణములతో ఎదుర్కొని పయనించినప్పుడే గమ్యమును చేరుకోగలం. జీవితంలో కష్టాలు, దుఃఖం, ఆవేదన..... ఇత్యాదులు అనుభవిస్తేనే ఆనందములోని పరిపూర్ణత, అమృతత్వం అర్ధమౌతాయి. ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి మనస్సును అదిగమించే ధైర్యవంతుడు కాగలడు. ఇవన్నీ అనుభవించి అనుభవించి చివరికి ఆత్మజ్ఞానియై ప్రాజ్ఞుడౌతాడు. 
హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ, ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం!  ప్రేమ, జ్ఞానం ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది. 
మానవుని నడత నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండింటిమీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనల్లోగానీ, మాటల్లోగానీ, పనిలోగానీ రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మనస్సులో మాలిన్యాలు తగ్గి మనస్సు పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. 
ఒకోసారి అన్పిస్తుంది - భగవంతున్నే నమ్ముకున్నాను, ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను, ఎంతగానో ప్రార్ధిస్తున్నాను, మంచిగా జీవనగమనం సాగిస్తున్నాను, ఎంతో సాధన చేస్తున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి? ఏమిటీ బాధలు....అని! 
అసలు పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి? 
దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ. 
దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.
అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.
అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన.
సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.
సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.
భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో (మిషన్లో) పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదని బాబా అంటారు. 
'నీకు కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు' అని జిన్నూరు నాన్నగారు చెప్తుంటారు.
చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా.
దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం.......ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనలయందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం. శవబుద్ధి (దేహాత్మబుద్ధి) వలన ఈశ్వరుడు జీవుడిలా కన్పిస్తున్నాడు. శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది. 


అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.

30, ఆగస్టు 2012, గురువారం

సార్ధకత

దేహమను క్షేత్రంలో -
భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు; 
ప్రేమ అను జలాభిషేకమును; 
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను; 
సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత! 
లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు               

25, ఆగస్టు 2012, శనివారం

అమ్మా! గుర్తుకొచ్చిందీ......

సమయం : ఉదయం 6 గంటలు 
మా అమ్మాయి (అనూష) నుండి ఫోన్ -
శుభోదయమమ్మా! 
శుభోదయం నాన్నా! 
కొన్ని మాటలననంతరం, 'అమ్మా! నీకేదో చెప్పాలని ఫోన్ చేశానమ్మ. కానీ, గుర్తు రావడం లేదు, గుర్తు వచ్చినప్పుడు చేస్తానమ్మా అంటూ ఫోన్ కట్ చేసింది.

సమయం: ఉదయం సుమారుగా 9 గంటలు 
మరల మా అమ్మాయి నుండే ఫోన్ -
చెప్పరా నాన్నా...
అమ్మా! గుర్తుకొచ్చిందీ......
సరే, చెప్పమ్మా...
ఓ కదమ్మా...
కధా? వంట చేస్తున్నాను, పనయ్యాక ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్పు...
లేదమ్మా, ఇది జరిగిన కధ, వంట తర్వాత చేయవచ్చు, ముందు వినమ్మా...
తన గొంతులో ఉత్సాహం గమనించి, పని ఆపి, సరే చెప్పు అనక తప్పలేదు నాకు.
అమ్మా! పూర్వం శ్రీ మధ్వాచార్యులవారి కాలంలో జరిగిన సంఘటనటమ్మా... 
ఓర్నీ! అప్పటి సంఘటనా నీవు చెప్పాలనుకుంటున్నదీ?
అబ్బా! మద్యలో మాట్లాడకుండా విను. 

ఆ వాస్తవకధ తన మాటలోనే -
మధ్వాచార్యులవారి కాలంలో 'కనకదాసు' అనే పేరుగల మహాభక్తుడు ఉండేవాడట. ఇతను శూద్రుడు. ఈ కనకదాసు భగవంతున్ని కీర్తిస్తూ అనేక కీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఇతనంటే మధ్వాచార్యులవారికి చాలా ఇష్టమట. అందుకే మొదట ఈ కనకదాసుకే తీర్ధప్రసాదాలు ఇచ్చి, తర్వాత తక్కిన బ్రాహ్మనాదులకు ఇచ్చేవారట. ఆ కాలమునందు మధ్వాచార్యులవారి సన్నిధానమునందు శాస్త్రాలను చదివినవారు, వేదములను చదివినవారు, యజ్ఞయాగాదులు, హోమాలు చేయువారు ఉండేవారట. ఈ పండితులయందరికి తమకంటే ముందు తీర్ధప్రసాదాలు కనకదాసుకు మధ్వాచార్యులవారు ఇవ్వడం నచ్చలేదు. వీరికి ఈ పని కోపం కల్గించేది. ఓరోజు, వీరందరూ మధ్వాచార్యులవారిని అడిగారు -
'ఓ మహాత్మా! మీకు తెలియని ధర్మం ఏది గలదు? తాము వర్ణాశ్రమములను ఉద్ధరించుటకు అవతరించినవారు. మీకు తెలియదా, మాలో కొందరు వేదపండితులు, కొందరు ట్చాస్త్రములలో ప్రావీణ్యులు, మరికొందరు అనేక యజ్ఞములు చేసినవారు, మహా నైష్టిక బ్రాహ్మణులు. ఇట్టివారిని కాదని, కనదాసు భక్తుడైనను శూద్రవంశ సంజాతుడగు అతనికి ముందుగా తీర్ధప్రసాదాలు ఇచ్చి, తర్వాత మాకు ఇవ్వడంలో సందేహం కల్గుతుంది, తాము సర్వజ్ఞులు, ఇది సరికాదు కదా' అని అడిగారటమ్మా. అందుకు ఆ గురువుగారు 'కనకాదాసు పరమభక్తుడు, ఎప్పుడు తీర్ధప్రసాదములు దొరుకునా, ప్రసాదము తీసుకొని ఎప్పుడు కీర్తనలు పాడుకుందునా, అని ఆత్రంగా నిరీక్షించువాడు. అందుకే ముందుగా అతనికి ఇస్తున్నాను, సరే, ఈ విషయమై రేపటిదినం మాట్లాడుకుందాం, అని అందరికీ ఒక్కొక్క అరటిపండునిచ్చి ఇది రెండవవాడు చూడని స్థలములో భుజించి, ఆ సంగతి రేపు మరల చెప్పండి' అని ఆజ్ఞాపించిరట. ఆ అరటిపండుని ఒకరు తమ గదిలో, ఇంకొకరు చెట్టు చాటున, మరియొకరు గట్టు చాటున, మరియొకరు నిర్జన ప్రదేశమున, వేరొకరు కంబళితో మూసుకొని తిన్నారటమ్మా. కనకదాసు మాత్రం ఆ దినమంతా అనేక నిర్జన ప్రదేశములు, కొండలు, గుహలలో తిరిగి తిరిగి, ఎచట చూసినను భగవంతుడు లేని స్థలం కన్పించక చరాచర సృష్టిలోనూ, అణువణువులోను, పరమాణువులతో సహ కన్నురెప్పలార్పక శ్రీమన్నారాయణుడు చూచుచున్నట్లు కన్పించడంతో ఆ పండుని తినక, ఆ రోజంతా ఉపవాసముండి మరుసటిరోజు పూజసమయమున ఆ పండుని చేతపట్టుకొని మధ్వాచార్యులవారి దగ్గరికి వెళ్ళెనట. మధ్వాచార్యులవారు ముందుగా పండితులందరినీ 'ఎవ్వరును చూడని స్థలములో పండుని భుజించారా?' అని అడగగా - ఎవ్వరూ చూడనిచోటే భుజించామని, ఎక్కడెక్కడ భుజించారో చెప్పారు ఆ పండితులు. తర్వాత కనకదాసుని అడిగారు, 'ఏమి కనకదాసు! మన ఆచార్యులవారందరూ ఎవరు చూడని స్థలములలో పండ్లు భుజించినారట, నీవేల తినలే'దని అడుగగా -
"మహాత్మా! ఏకాంత ప్రదేశమున, కొండలలో, గుహలలో పగలంతయు, రాత్రి యందు తిరిగితిని. ఎచ్చోట చూసినను భగవంతుడు లేని స్థలం కనిపించలేదు. అణువులో అణుస్వరూపముగాను, విభువులో విభుస్వరూపముగాను పరిపూర్ణుడై నిండియుండుటచే నాకు వేరుస్థలం కనిపించలేదు" అని కనకదాసు చెప్పింది విని, మధ్వాచార్యులవారు, ఆచార్యులారా! 'అణోరణీయాన్మహతో మహీయాన్' అను శ్రుతియు, 'సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్' అని గీతయు మీరు అనేకమార్లు చదివినారు కదా! మీలో ఈ భావం కల్గిందా? ఇతను శూద్రజాతిలో పుట్టినను అపరోక్షజ్ఞానం కలవాడు. ఇతడు గుణముచే బ్రాహ్మణుడు. అందుకే ఇతనికి ముందుగా తీర్ధప్రసాదములు ఇచ్చుచుంటిని, అని చెప్పగా అందరూ వారి వారి అవివేకమునకు సిగ్గుపడ్డారటమ్మ...
అమ్మా! గుర్తుకొచ్చిందీ......అని అంటూనే చెప్పాలనుకున్నది చెప్పేసి, హమ్మయ్య! ఇక వంట చేసుకో, నాకూ పనుందని తను ఫోన్ పెట్టేసినను మదిలో ఆ కధే కదలాడుతుంది. 


నిజమే -
భగవంతుడు లేని చోటు ఎక్కడ?
సకల సృష్టి, సమస్త చరాచరం అంతయూ ఆ సర్వాంతర్యామియే.
సర్వులయందు, సమస్తము నందు సర్వవ్యాపకుడు.
అంతయూ భగవత్ స్వరూపమే......
ఇక భగవంతుడు లేనిది ఎక్కడ????? 

కలడంబోధి, కలండుగాలి, కలడాకాశంబునన్
కుంభినింకలడగ్నిన్ దిశలం పగళ్ళనిశలన్ ఖద్యోతచంద్రాత్మలన్ 
కలడోంకారమునన్ త్రిమూర్తులత్రిలింగవ్యక్తులందంతటన్ 
కలడీశుండు కలండూ తండ్రీ వెదుకంగానేల ఈయాయెడన్ 
              
నిజమే -
జన్మతః కులం ఏదైతేనేం? 
శూద్రోపి శీలసంపన్నో గుణవాన్ బ్రాహ్మణో భవేత్ (శూద్రజాతి యందు జన్మించినవారైనను, సద్గుణ సంపన్నులై ఉన్నచో వారు బ్రాహ్మణులే)
దీనినే శివుడు పార్వతీదేవికి ఇలా తెలిపెను -
సత్కర్మాభి: శుచిర్దేవి! శుద్ధాత్మా విజితేంద్రియః 
శూద్రోపి ద్విజవత్సేవ్య ఇతి బ్రహ్మానుశాసనమ్ //
ఓ పార్వతీదేవీ! శుద్ధములగు సాత్త్విక కర్మలతో గూడినవాడై, పరిశుద్ధాత్ముడై, జితేంద్రియుడైనవాడు శూద్రకులములో జన్మించినను బ్రాహ్మణునివలె సేవింపదగినవాడు.
బ్రాహ్మణత్వమునకు బ్రహ్మజ్ఞానమే గుర్తు అని మన శాస్త్రాలు, ఉపనిషత్తులు తెలియజెప్తున్నాయి.
న చర్మాణో న రక్తస్య మాంసస్య చ న చాస్థినః 
న జాతి రాత్మనో జాతి ర్వ్యవహార ప్రకల్పితా// (తేజోబిందూపనిషత్)
సర్వభూతస్థమగు ఆత్మకు జాతిభేదము లేదు. మరి చర్మమునకును, రక్తమునకును, మాంసమునకును, అస్థికిని లేదు. జాతి సాధారణ వ్యవహార కల్పితమే.
జన్మనా జాయతే జంతు: సంస్కారా ద్ద్విజ ఉచ్చ్యతే 
వేదపారాయణా ద్విప్రో బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః //
జన్మముచే  అందరును జంతుసమానులే. సంస్కారముచే ద్విజుడౌను, వేదపారాయణం వలన విప్రత్వము కలుగును. బ్రహ్మజ్ఞానము కలిగినప్పుడు బ్రాహ్మణుడు అగును.
సుఖం దేహస్య శూద్రాణాం ధనం శ్రేష్టం విశాం భవేత్ 
యశో నిత్యం క్షత్రియాణాం విప్రాణాం జ్ఞానమేవ హి //
దేహసౌఖ్యమును మాత్రమే చూసే స్వభావంగల స్థితి శూద్రత్వ మగును. ధనమే గొప్పదని తలంపు గలవాడు వైశ్యత్వస్థితిలో ఉండువాడు. ధనముగాని, ప్రాణంగాని పోయినను, లక్ష్యం చేయక యశస్సును నిలబెట్టువాడు క్షత్రియత్వమునకు వచ్చును. దేహమునుగాని, ధనమునుగాని, కీర్తినిగాని, లక్ష్యమందుంచక బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం కొఱకు యత్నంచేయు జీవుడు బ్రాహ్మణత్వస్థితికి వచ్చినవాడు.
ఇక జన్మతః కులం ఏదైతేనేం?????
న జాతి: కారణం తాత! గుణాః కల్యాణకారణమ్ 
వృత్తిస్థ మాపి చండాలం తం దేవా బ్రాహ్మణం విదు:  

22, ఆగస్టు 2012, బుధవారం

భక్తుడు - బద్ధుడు

పరమహంస :-
                    అనగా హంసకు పరమై ఉండువారని అర్ధం. 
                    హంస అనగా జీవుడు, పరమమనగా పరబ్రహ్మం (పరమాత్మ). జీవునికి పరమగు శివత్వమును పొందినవారు పరమహంస.
                    హంస అనగా ఓ పక్షి పేరు. ఇది క్షీరనీరములు (పాలు,నీరు) కలిసియుండిన నీరమును (నీటిని) వదిలి క్షీరమును మాత్రమే పానముచేయును. అలాగునే ప్రకృతి, పురుషులు కలిసియుండు ఈ సృష్టి నుండి లేక ఈ దేహమునుండి ఆత్మానాత్మ విచారణచే ప్రకృతిని త్యజించి పురుషున్ని, అనగా ఆత్మను గ్రహించినవారిని పరమహంస అందురు.

అటువంటి పరమహంస అయిన శ్రీరామకృష్ణులవారిని ఓ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు -
'ఈశ్వరుడు అన్నిటిలోనూ సమానముగా ఉండగా ఒకరు యోగ్యుడగుటకు, మరియొకరు యోగ్యుడు కాకపోవుటకు కారణమేమీ?'
అప్పుడు శ్రీరామకృష్ణపరమహంస వారు ఇలా బదులిచ్చారు -
"ఈశ్వరుడు అందరిలోనూ సమముగానే ఉన్నాడుగాని, ఈశ్వరునియందు అందరును సమానముగా ఉండుటలేదు. అందుచేతనే ఒకరు భక్తుడుగాను, మరియొకరు బద్ధుడుగాను ఉండుట జరుగుచున్నది.


19, ఆగస్టు 2012, ఆదివారం

ధ్యానం - నీ లోనికి నీ పయనం


ధ్యానం - 
నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం. 
ధ్యానం -
మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.
ధ్యానం -
ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.
ధ్యానం -
వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.
ధ్యానం -
మనస్సు యొక్క నిశ్చలత్వం.
ధ్యానం -
మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.
ధ్యానం -
ఇతరభావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.
ధ్యానం -
అంతరంగ చైతన్యముకు చేరువకావడం.
ధ్యానం -
హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.

ఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం. ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.
                                       
ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.
పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు; అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ. ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం. వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి  ధ్యానంవలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావసమతుల్యత అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం  జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది. అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయవాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది. పరమాత్మ ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి. హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయవాసనలుండకూడదు. ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటే ఉపాధి.
ధ్యానం చేస్తున్నప్పుడు  ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇదేరీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి.  ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.
ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.

ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను. 

మహర్షులనుండి ఇంద్రాది దేవతలవరకు; మహాయోగులనుండి ముముక్షువులవరకు; సద్గురువులనుండి సత్ సాధకులవరకు.........
ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే. 

ఆత్మధ్యానం యొక్క మహిమత్వమును శుక మహర్షి ఇలా తెలియజేసెను -
ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః 
ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణస్సదా
సమస్తమైన వేదశాస్త్రములును మరల మరల పరిశోధింప ఒకటే గోచరిస్తుంది. అది, సర్వదా నారాయణ స్వరూపమైన ఆత్మను ధ్యానించుటయే గొప్పది.
ధ్యానయోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి -
బ్రహ్మహత్యసహస్రాణి భ్రూణహత్య శతాని చ
ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్ని రివేంధనమ్ 
బ్రహ్మహత్యలును, నూరు గర్భిణీ హననములైన పాపాలన్నియున్ను ఒక ధ్యానయోగంచే, కట్టెలన్ని అగ్నిచే భస్మమగునట్లు భస్మమగుచున్నవి.
ముహుర్తమపి యో గచ్చే న్నాసాగ్రే మనసా సహ 
సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్జితమ్ 
భ్రూమధ్యమందు ప్రణవమంత్రములతో మనస్సును ఐక్య పరచి ఒక ముహుర్తమాత్రం ఎవరు ధ్యానింతురో, వారియొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు.
నిమిషం నిమిషార్ధం వా ప్రాణినో ధ్యాత్మచింతకాః
క్రతుకోటిసహస్రాణాం ధ్యానమేకం విశిష్యతే (ఉత్తరగీత)
నిముషముగానీ, అర్ధనిముషముగానీ ఆత్మధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వమేధాది యాగములకంటే ఎక్కువ ఫలితముంటుంది.

                                     నాస్తి ధ్యానసమం తీర్ధం నాస్తి ధ్యానసమం తపః
                                     నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్