http://www.sodhini.com

19, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రయత్నిస్తేనే ప్రగతిపధం.

ఉదయం పద్మ (చాకలామె) బట్టలు ఉతుకుతూ- అమ్మా! దగ్గర సంబంధమని, నేనేదో సుఖపడిపోతానని పెళ్లి చేశారమ్మ మా అమ్మా నాన్నలు. కానీ, పొద్దు కుంకితే చాలమ్మా, తాగేసి వచ్చి నానా రగడ చేస్తాడమ్మ. తాగనంతసేపు మంచోడే, తాగితేనే రాక్షసుడు, ఉట్టి అధముడమ్మ............అని బాధగా చెప్పగా -
నీవే మంచిగా, నెమ్మదిగా, ప్రేమగా చెప్తుండు, త్రాగుడు మానేయమని. మారేంతవరకు సహనంగా ప్రయత్నించు....... తప్పకుండా మారతాడు అని కాస్తంత దైర్యం చెప్తూ అన్నాను.

నిజమే! మనిషి యొక్క స్వాభావిక గుణకర్మల బట్టి పెద్దలు మానవులును మూడు విధములుగా పేర్కొన్నారు -
ఉత్తములు, మధ్యమములు, అధమములుగా!

ఉత్తములు:-  లోకహితార్ధమే నిష్కామభావంతో వేదవిహిత స్వధర్మ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ, నిశ్చయాత్మక బుద్ధితో స్థితప్రజ్ఞులై, విషయాసక్తి లేనివారై, అహంకార మమకార రహితులై, సకలభూతములయందు సర్వేశ్వరున్నే కాంచుచూ, నిత్య ఆనందమయులై ఉంటారు.
మధ్యములు:- సంసార బద్ధులై, స్వభావము బట్టి కర్మలను ఆచరిస్తూ, ప్రాపంచిక వ్యవహారంలతో బంధనములు ఏర్పరచుకొని కొంతకాలం గడిపినను క్రమేపి సంస్కార ఫలితంగా దైవమునందు భక్తి కలిగి, సకల భూతములయెడ స్నేహం, ప్రేమ, దయను కలిగియుండి అహంకార రహితులై, క్షమాశీలురై, సుఖదుఃఖముల ప్రాప్తియందు సమత్వం కలవారై, రాగద్వేషాలకు లోనుకాకుండా మోహరహితులై,
పరమాత్మయందు భక్తిప్రపత్తులతో దాన యజ్ఞయాగాది వంటి శుభకర్మలను ఆచరిస్తూ, సజ్జనులతో సద్గోష్టి జరుపుతూ సంతుష్టులై ఉంటారు.
 అధమములు:- అహంకారం, మూర్ఖం, గర్వం, దర్పం కలిగి కామ క్రోధ లోభ పరాయణులై, దయారహితులై, అన్యాయధనార్జనాపరులై, మోహజాలమందు చిక్కుకొని అపవిత్రులై ఉందురు. డాంభికమైన ఆడంబరాలు కొరకై  దానయజ్ఞాది కర్మలు ఆచరిస్తూ, స్వార్ధపరులై ఉంటారు.
ఎవరైనా సరే, త్రికరణశు
ద్ధితో ప్రయత్నిస్తే ప్రగతిపధంవైపు పయనించగలరు.
 

ఇక పారమార్ధిక కోణంలో వీరిని నిత్యులు, ముక్తులు, బద్ధులని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నిత్యులు:- జన్మతః మహాత్ములుగా పుట్టి, బాల్యంలో కూడా యే అపరాధములు నెరుగక, స్వాచార్యుని వలె సత్యము నెరిగి, ఎల్లప్పుడూ ఆత్మభావమున ఉండువారు నిత్యులు. వీరు పరమానందమయులు. నిత్య భక్తమయులు. ఇందుకు ఉదాహరణము ప్రహ్లాదుడు.
ముక్తులు:- పుట్టుకతో సామాన్యుడిగా యుండి, సంస్కారఫలితంగా తన స్వంత ఆలోచన వలననో, లేక ఇతరుల ప్రభావం వలననో, ఆచార్యుని వాత్సల్యముననో, భక్తి ప్రపత్తులవలననో సంసార వ్యసన బంధములనుండి మానసికంగా బయటపడి, అరిషడ్వర్గముల నుండి విముక్తుడై, అన్నింటా సంస్కరింపబడినవాడై దేహాత్మభావనను వీడి సత్పురుషుడిగా మారి, ఆత్మభావమునకు వచ్చువారు ముక్తులు. ఇందుకు వాల్మీకి ఉదాహరణ.
బద్ధులు:- సంసారమున చిక్కుకొని, వ్యసనాలు, అరిషడ్వర్గములకు లొంగిపోయి, వానినుండి బయటపడలేక, పరమాత్మ విషయం పూర్తిగా నెరుగక, పాపులుగానే కడపటివరకు జీవించువారు బద్ధులు. మహిరావణుడు ఉదాహరణ.
ఎవరైనా సరే, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పరమాత్మను కాంచగలరు.

16, అక్టోబర్ 2012, మంగళవారం

లేవండి! మేల్కోండి! గమ్యాన్ని చేరుకోండి! (స్వామి వివేకానందుని ప్రబోధాలు)

సమస్త విశ్వంలోను ఉత్తమోత్తమైన శరీరం ఈ మానవదేహమే. మానవుడే సర్వోత్తమ జీవి. సర్వోత్తమ జీవితం విజయవంతంగా గడపగలిగే శక్తి మానవునికే ఉంది. అందుకే మనం ఎలా జీవించాలో మనమే నిర్ధేసించుకోవాలి. 
ముందుగా ఒక ఆదర్శవంతమైన లక్ష్యాన్ని తీసుకోండి.ఆ లక్ష్యాన్నే జీవితంగా గడపండి. ఆ లక్ష్యాన్నే సదా భావించండి, ధ్యానించండి, జీవనాడిగా చేసుకోండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతిభాగాన్ని ఆ లక్ష్యంతో మమేకం అయ్యేటట్లు చేయండి. ఇదే విజయరహస్యం. దేనినైన మనం సాదించగలం. ముందుగా ఆత్మవిశ్వాసం కలిగియుండాలి. ఇదే పరిపూర్ణ వికాస మంత్రం. ఆత్మవిశ్వాసమే వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. శక్తి అంతా నీలోనే ఉంది. అది తెలుసుకొని ఆ శక్తిని బయటికి తీసుకురా. ప్రతీపనినీ, ఏ కార్యానైన నేను సాదించగలనన్న సంకల్పబలాన్ని పెంచుకో. నీ సంకల్పం గట్టిదైతే పాము విషం కూడా నిన్నేమి చేయలేదు.
ఒకటి ముందుగా గుర్తించండి - 

మనమున్న ప్రస్తుతస్థితికి మనమే బాధ్యులం. ఏం కావాలని మనం అభిలాషిస్తామో ఆ ప్రకారంగా మనల్ని మనం రూపుదిద్దుకోగలం. ఆ సామర్ధ్యం మనకుంది. ఇప్పుడు మనమున్న వర్తమానస్థితికి మన పూర్వ కర్మలు కారణమైతే, అదే కారణాన్ని బట్టి, మనం కోరిన విధంగా మన భవిష్యత్తును ప్రస్తుత కర్మల ఫలితంగా మనం రూపొందిన్చుకోవచ్చును. అందుచేత మనం ఏ తీరుగా నడుచుకోవాలో మనమే నిర్ణయించుకొని ప్రవర్తించాలి. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చుదిద్దుకుంటారో, ఆ విధంగా ఎదుగుతారు. బలహీనులుగా భావించుకుంటే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులని భావించుకుంటే బలవంతులే అవుతారు. బలహీనతకు పరిష్కారం బలహీనతను చింతించటం కాదు; బలాన్ని గురించి ఆలోచించటమే! మీలో నిబిడీకృతమై ఉన్న బలాన్ని గుర్తించండి.బలమే ప్రాణం. బలహీనతే మరణం. బలమే ఆనందం, శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఃఖం, నరక సదృశ్యం.
అపజయాలకు వెనకంజు వేయకండి. లక్ష్యసాదనను అంటిపెట్టుకొనే ఉండండి. ప్రయత్నంలో వెయ్యిసార్లు అపజయం ఎదురైనా పట్టువదలక మరోమారు ప్రయత్నించండి. విజయాన్ని సాధించలంటే అద్భతమైన పట్టుదల, సంకల్పశక్తిని కల్గియుండి పనిచేయాలి.అప్పుడే మీ గమ్యాన్ని మీరు తప్పకుండ చేరుతారు. పవిత్రత సహనం పట్టుదల వీటన్నిటికి మించిన ప్రేమ విజయసాధనకు అత్యంతావసరం. సంపూర్ణ ప్రేమభావం కలిగియుండాలి. ప్రతిజీవిలోను భగవంతుడు ఉన్నాడనే పరమసత్యాన్ని అవగాహన చేసుకోవాలి. ఎవరు జీవారాధకులో వారే నిజమైన దైవారాధకులు. పవిత్రంగా, ప్రేమగా ఉండటం, పరులకు మంచి చేయడం - ఇదే పూజలన్నింటి సారాంశం.
ధనార్జనలోగాని, దైవార్చనలోగానీ లేక ఏ ఇతర కార్యాచరణలోగాని ఏకాగ్రతాశక్తి  ఎంత బలవత్తరంగా వుంటుందో కార్యసిద్ధి అంత బాగా సమకూరుతుంది. ఈ ఏకాగ్రత ద్వారానే సత్త్వరజస్తమో గుణాత్మకమైన మనస్సు జయింపబడి, అవలయున్న జ్ఞానకాంతి వెల్లువలా ప్రసరిస్తుంది. మంచి చెడు ఆలోచనల సముదాయమే మనస్సు. మనం పవిత్రులమై మంచి ఆలోచనలకు తగిన ఉపకరణాలుగా మారితే అవి మనలో ప్రవేశించి ఘనకార్యాలను సాధిస్తాయి. ఒక్క క్షణమైనా లేదా ఏ ఒక్క విషయంపైనైనా మనస్సును నిగ్రహించలేని మనం స్వతంత్రులమా??? స్వేచ్ఛాజీవులమా........ఆలోచిం
చండి. 
నిగ్రహం లేని మనస్సు పతనదిశగా పయనింపజేసి వినాశనానికి దారి తీస్తుంది. నిగ్రహించబడ్డ మనస్సు మనల్ని సంరక్షిస్తుంది. సర్వస్వతంత్రులను చేస్తుంది. మనిషి మనస్సు యొక్క శక్తి అపారం. అది ఎంత ఏకాగ్రత నొందితే, అంత శక్తివంతమౌతుంది. ఇదే మనస్సు మర్మం. సంకల్పశక్తితో మనస్సుని తుచ్చమైన ప్రాపంచిక సుఖాలకోసం కాకుండా, అంతరంగిక వికాశానికి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వినియోగించాలి. ఈ ప్రపంచం మనకు కనబడేతీరు మన మానసిక పరిస్థితి మీద ఆధారపడియుంటుంది. ఈ ప్రపంచం మనపట్ల ఎలా వుందని భావిస్తామో, ఆ భావాన్ని రూపొందించేది మన స్వకీయ మానసిక దృక్పధం మాత్రమే. పచ్చకామెర్లు వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. వస్తువులను అందంగా, అందవికారంగా కనిపింపజేసేవి మనభావనలే. ఈ ప్రపంచమంతా మన మనస్సులోనే ఇమిడివుంది. అందువల్ల సమ్యక్ దృష్టిని అలవర్చుకోవాలి. స్వప్రయత్నంతో మన ఔనత్యం కోసం మనమే సచ్చీరులుగా మారాలి. అటులనే లక్ష్యంపై ఉండే శ్రద్ధ సాధనపైన ఉండాలి. గమ్యంపై మనకు ఎంత శ్రద్ధ వుంటుందో, దాని గమనం పై అంతే శ్రద్ధ ఉండాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్'.
నీవు గతంలో పొరపాట్లు చేయవచ్చు. నీలో దోషాలు ఉండవచ్చు. ఐతే ఏం? ఇకపై ఆ పొరపాట్లు మరల చేయకుండా నీ దోషాల్ని నీవు సంపూర్ణంగా సరిదిద్దుకోగల్గితే భవిష్యత్తులో నీవే భగవత్సరూపంగా పరిణమించవచ్చు. మానవులు సాధారణంగా తమ దోషాలను సాటివారి మీద మోపుతారు. అలా ఇతరుల మీద నెట్టడానికి వీలుకాకపోతే ఆ నెపాన్ని దైవం మీద కానీ, తాము సృష్టించిన విధివ్రాత అనే భూతం మీద కానీ నెట్టేస్తారు. విధి అనేది ఎక్కడ ఉంది? విధి అంటే ఎవరు? ఎవరు చేసుకునే కర్మ వారు అనుభవించక తప్పదు. మన విధిని మనమే రూపొందించుకుంటున్నాం. పిరికివారు, పనికిమాలిన మూర్ఖులు మాత్రమే 'ఇది విధి వ్రాత' అంటారు. "నా కర్మకు నేనే కర్తను" అనేవాడే ధీశాలి, విజయశీలి! ఈ దుఃఖమంతా నా కర్మఫలితమే. అందుచే దీన్ని తొలగించటం కూడా నా చేత మాత్రమే జరగాలని(సాధ్యమని) గ్రహించిన వారే బలవంతులు. మనకు కావాల్సిన బలం, సహాయం, సమస్తమూ మనలోనే ఉన్నాయి.
నీవు మోక్షం పొందకపోయినంతన మాత్రాన మునిగిపోయినదేమిటి? పవిత్రతాపూర్ణులై, మనసా వాచా కర్మేణా త్రికరణశుద్ధిగా తమ పరోపకార్యాలద్వారా పరులను సంతోషపరచడం, ఇతరులలోని సౌశీల్యాన్ని పరమాణువంతటి దాన్నైనా పర్వతమంతగా పెంచి శ్లాఘించడం....... ఇత్యాది మంచి లక్షణాలు ద్వారా తమ హృదయాలను వికసింపజేసుకునే వారే మహాత్ములు. భగవంతుడుపై నమ్మకం లేనివాడు నాస్తికుడు కాడు; తనపై తనకి నమ్మకం లేనివాడే నాస్తికుడు.
నా ప్రియమైన సోదరీ సోదరులారా!
లేవండి!
మేల్కోండి!
గమ్యాన్ని చేరుకోండి!
  

12, అక్టోబర్ 2012, శుక్రవారం

చిత్తుకాగితమే అనుకున్నా........ కానీ, చిరు కధనే తెలిపింది

ఉదయం ప్రక్కింటి ఆమె ఓ కాగితంలో కొన్ని పువ్వులు పంపారు. ఆ కాగితంను డస్ట్బిన్లో పడేయబోతు చూశాను. చిత్తుకాగితమే అనుకున్నా........ కానీ, చిరు కధనే తెలిపింది.
ఆ కధ ఏమిటంటే -

పూర్వం ఓ మహారాజుగారికి ఓ సందేహం వచ్చింది. అది ఏమిటంటే - మహత్వపూర్ణమైన సమయమేదీ? మహత్వపూర్ణమైన పని ఏమిటీ? మహత్వపూర్ణమైన వ్యక్తి ఎవరు? రాజుగారికి సందేహం రావడంతోనే వెంటనే సభని ఏర్పర్చమని ఆదేశించించడం జరిగింది. మంత్రులు, పండితులు, ఆస్థాన విద్వాంసులు....... తదితరులతో సభ కొలువై వుండగా, రాజుగారు పై మూడు ప్రశ్నలడిగారు. ఎవ్వరు ఎన్నివిధాలుగా సమాధానలిచ్చిన రాజుగారు వాటితో ఏకీభవించక అసంతృప్తి వ్యక్తం చేయగా, అప్పుడు మహామంత్రివర్యులు లేచి, రాజా! మన రాజ్యం బయట ఓ యోగిపుంగవుడు ఉన్నాడు. అతను మీ సందేహాలను తీర్చగలని నా నమ్మకం అని చెప్పగా -
మరునాటి ఉదయమునే ఆ యోగి ఉన్న ఆశ్రమానికి కొంతమంది అంగరక్షకులతో కల్సి బయలుదేరాడు. ఆశ్రమం కొంతదూరంలో ఉండగానే, తను మాత్రమే వెళ్తానని, మీరంతా ఇక్కడే ఉండండీ అని అంగరక్షకులను ఆదేశించి ఆశ్రమమును చేరతాడు. ఆశ్రమమునందు ఆ యోగి రాజుగారు వెళ్ళే సమయానికి పలుగుపారలతో చెట్ల మొదలు తవ్వుతూ చదును చేస్తున్నాడు. రాజు ఆ యోగికి నమస్కరించి తన సందేహాలను తెలిపి సమాధానం చెప్పమని కోరుతాడు. కానీ, ఆ యోగి మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటున్నాడు. అంతట రాజు యోగి చేతిలోని పలుగు తీసుకొని చదును చేయనారంభిస్తూ మరల పై ప్రశ్నలు అడుగుతుండగా... శరీరం నిండా గాయాలతో, రక్తం కారుతుండగా, భయంతో ఓ వ్యక్తి ఆశ్రమంలో ప్రవేశించి సృహతప్పి పడిపోతాడు. వెంటనే ఆ యోగితో పాటు ఈ రాజు కూడా ఆ పడిపోయినవ్యక్తికి సపర్యలు చేయడం ప్రారంభిస్తారు. రాజు నీటిని తెచ్చి, తన తలపాగా చించి రక్తం కారకుండా గాయాలను శుభ్రపరుస్తూ కట్లు కడుతుండగా ఆ పడిపోయిన వ్యక్తికి సృహ రాగా, తనకి సేవలు చేస్తున్న రాజుని గుర్తించి, తనని క్షమించవలసిందిగా కోరాతాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియని రాజు నీవెవరవు అని ప్రశ్నిస్తాడు. అప్పుడా వ్యక్తి మీరెప్పుడూ నన్ను చూడలేదు. కొంతకాలం క్రితం జరిగిన యుద్ధంలో నా సోదరుడు మీ చేతిలో చంపబడ్డాడు. అందుకు నేను ప్రతీకారం తీర్చుకోవడానికై మిమ్మల్ని వెంబడించాను. మీ అంగరక్షకులు నన్ను పసిగట్టి చుట్టుముట్టి గాయపరచగా తప్పించుకొని ఈ ప్రదేశమునకు చేరుకున్నాను. నాకు మీరిప్పుడు సపర్యలు చేస్తున్నారు. మీరు ఎంత ఉత్తములో, ఎంత దయగలవారో అర్ధమైంది. నా అపరాధాన్ని క్షమించండి అని అనగా, అతనిని క్షమించి విడిచిపెట్టేస్తాడు. కాసేపటికి మరల ఆ రాజు తన సందేహాలను తీర్చమని ఆ యోగిని కోరగా -
రాజా! ఈ సంఘటనల ద్వారా నీకు సమాధానం దొరికింది, గ్రహించు. నీవు మొదట ఈ ప్రశ్నలు అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నానని నీవు వెళ్ళిపోకుండా పాదులు తీశావు. అలా కాకుండా వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తి నిను వధించడానికి ప్రయత్నించేవాడు. కాబట్టి ఇది నీకు మహత్వపూర్ణమైన సమయం. ఇక ఆ వ్యక్తికి నీవు సేవ చేయడమే మహత్వపూర్ణమైన పని. ఎందుచేతనంటే సేవ చేసి ఇతనిని బ్రతికించక పోయినట్లయితే నీ మీద శత్రుత్వంతో మరణిస్తాడు. మీ మధ్య అప్పుడు జన్మజన్మల శత్రుత్వం సాగుతుంది. ఇప్పుడు నీ సేవలవలన అతను పశ్చాత్తాపపడి, తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఇక మహత్వపూర్ణ వ్యక్తిని నేనే. ఎందువల్లనంటే నావలన నీ ప్రశ్నలకు జవాబు లభించి నీవు శాంతచిత్తంతో తిరిగి వెళ్తావు. మహారాజా! ఇప్పుడు దీనిని సరిగ్గా అర్ధం చేసుకో. మహత్వపూర్ణ సమయమంటే వర్తమాన సమయం. దాన్ని చక్కగా ఉపయోగించడం నేర్చుకోవాలి. మహత్వపూర్ణమైన పని అంటే వర్తమానంలో నీవు చేయవలసిన సత్కర్మ. ఆ పనిని ఏకాగ్రతతో, సావధానంగా చేయాలి. మహత్వపూర్ణమైన వ్యక్తి అంటే వర్తమానంలో నిను సన్మార్గంలో నడిపించేవాడు. అతనితో సముచితంగా వ్యవహరించాలి. దీనినే ఆధ్యాత్మికపరంగా అవగాహన చేసుకో. 
'అధాతో బ్రహ్మ జిజ్ఞాస' అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే మహత్వపూర్ణమైన సమయం. అంటే మనల్ని మనం తెలుసుకోవాలనే సంకల్పం చేసిన సమయమే మహత్వపూర్ణమైన సమయం.
నీలోనికి నీవు పయనించు యోగమే మహత్వపూర్ణమైన పని.
అది ఉపదేశించే సద్గురువే మహత్వపూర్ణమైన వ్యక్తి.

13, సెప్టెంబర్ 2012, గురువారం

*శుద్ధ ఆహారము*


భగవంతుడు, ప్రారబ్ధం వదిలించుకొని పరమాత్మ యందు ఐక్యం కావడానికే మానవ దేహం ప్రసాదిస్తాడు. కానీ; మన ఇంద్రియాలద్వారా వివిధ అపవిత్రమైనకార్యాలు చేస్తూ, అశుద్ధఆహారాన్ని స్వీకరిస్తూ, చివరికి ఈ పవిత్రమైన దేహాన్ని మట్టికే అంకితమిచ్చి, ప్రారబ్ధాన్ని పోగొట్టుకోలేక, మరింత పోగుచేసుకొని మరిన్ని దేహాల్నీ మరల మరల పొందుతూ జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, శ్రమిస్తూ దుఃఖితులమౌతున్నాం. 
అందుకే అలా కాకుండా 
ఈ దేహం యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం,
సత్కర్మలు ఆచరిస్తూ, సద్భావనతో చరిద్దాం,
ఆరోగ్యకరమైన శుద్దాహారమునే స్వీకరిద్దాం,
తద్వారా తరిద్దాం.

మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని. 
దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: / 
దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ //
బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.

మరి ఈ శుద్ధఆహారం అంటే ఏమిటీ?
ఆహరవిషయములో వస్తుశుద్ధి (తీసుకునే పదార్ధము శుభ్రతగా ఉన్న మాత్రమే చాలదు, అది ఎటువంటి ధనముచేత, లేక యే విధంగా వచ్చిందో ఆ మార్గము శుద్ధముగా ఉండవలెను), పాత్రశుద్ధి ( వండే, తినే పాత్రలశుద్ధి), వాహక శుద్ధి (వండేవారు, వడ్డించేవారు శుద్ధత కలవారై) ఉండాలి. పాపపు సొమ్ముచే గానీ, పాపపు పనులచే గానీ వచ్చిన వస్తువు మంచిదైనను అది పాపాహారమే యగును. అలాగునే ఇతరులు కష్టపడి మనకై చేసినపనికి తగిన ప్రతిఫలం ఇవ్వక సంపాదించిన సొమ్ముచే భుజించెడు అన్నం పాపాన్నమే యగును. ఇట్టి ఆహారమును తీసుకున్నవారి మనస్సు నిర్మలముగా ఉండదు. శాంతి, దయ, వైరాగ్యాదులు వీరికి కలగవు. 
అటులనే ప్రతిఒక్కరూ వారు స్వభావములు అనుసరించి తీసుకునే ఆహారములో సాత్త్వికం, రాజసము, తామసము అను భేదములు కలవు.
సాత్త్వికాహారము సత్త్వగుణమును వృద్ధి చేయును. సత్త్వశుద్ధిచే చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధిచే ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగును. 
శ్రీ మద్భగవద్గీత యందు పదిహేడవ అధ్యాయంలో తెలిపింది ఇదే -
ఆయుస్సత్వ్త్వ బలారోగ్యసుఖప్రీతివివర్ధనాః /
రస్యాస్స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్వికప్రియాః 
ఆయుస్సును, మనోబలమును, శరీరబలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిగా బాగుగా అభివృద్ధి నొందించునదియు, రసము గలదియు, చమురుతో కూడినదియు, దేహమందు చాలాకాలమునుండి సత్తువ నిచ్చునదియు, మనోహరమైనదియు సాత్త్వికాహార మనబడును. ఈ ఆహారమును సాత్త్వికులు ఇష్టపడుదురు. 
కావున విజ్ఞులు ఇట్టి ఆహారమును స్వీకరించవలెను.
కట్వామ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః /
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకా మయప్రదాః //
అమితముగా చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, దాహము కలుగజేయునవిగాను, మనఃక్లేశం కలుగజేయునట్టి ఆహరం రాజసాహారం అనబడును. ఈ ఆహారమును రాజసులు ఇష్టపడుదురు. ఈ విధమైన ఆహారం దుఃఖశోకరోగములను కలిగించును. 
ఇటువంటి ఆహారమును త్యజించవలెను.
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ /
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ //
సారం నశించి పాచిపోయినట్టి పదార్ధమును, ఒకరు తినగా మిగిలిపోయినదియును, అశుద్ధముగా ఉన్నటియు (భగవంతునికి నివేదనచేయనటువంటివి) ఆహారము తమోగుణమును పెంచును. ఈ విధమైన ఆహారమును తామసులు ఇష్టపడుదురు. 
ఇటువంటి ఆహారమును స్వీకరించరాదు. 
అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృత చిత్తానాం ధర్మస్సమ్యక్ న భాసతే //
అన్నదోషముచేత మనస్సు కలుషితం అయి చిత్తమునందు ధర్మరహస్యం ప్రకాశింపదు.  కావున ఆహరవిషయమును సామాన్యమని తలంచరాదు. ఆహారశుద్ధి తప్పనిసరి.
ఇక భగవంతునికి నివేదన చేసి భగవంతున్ని స్తుతిస్తూ ఎందుకు భోజనం చేయాలంటే - మనం తీసుకున్న మిశ్రమాహారమందలి నిరుపయోగమైనదానిని మలమూత్రస్వేదములుగా బహిర్గతమొనర్చి, సారమును మాత్రమే గ్రహించి, అందలి పిండిపదార్ధములను విడగొట్టి గ్లూకోజ్ గా  మార్చి దేహములోని సూక్ష్మాణువులకు అందించి, కొవ్వుపదార్ధములను వేరుచేసి చర్మమునకు, కీళ్ళ సందువులకు అందించి, అందలి కాల్షియమును ఎముకలకు అందిస్తూ...... ఇలా సప్తధాతువులకు ఆహారం అందడానికి కారణం -
 
మనం భుజించే ఆహారంను జీర్ణమయ్యేటట్లు చేస్తున్న "జఠరాగ్ని". ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి, ఆహరపదార్ధములను జీర్ణమయ్యేటట్లు చేస్తుంది ఈ జఠరాగ్నే!
ఈ విధంగా మనం తీసుకున్న ఆహరం,
 జఠరాగ్ని
 
చే పక్వంకానిచో, రక్తాదులద్వారా శరీరమంతటను వ్యాపింపలేదు. కావున జఠరాగ్ని శరీరమున కీలకస్థానం ఆక్రమించుకొని యున్నది. అంతటి కీలకమైన జఠరాగ్నిరూపమున భగవానుడే ఉండి, శరీరమునకు పుష్టిని చేకూర్చుతున్నట్లు గీత యందు పదిహేనేవ అధ్యాయమున పద్నాలుగవ శ్లోకం ద్వారా తెలుస్తుంది.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః /
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //
(నేను వైశ్వనరుడను జఠరాగ్నిగానయి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో కూడుకొని నాలుగువిధములగు అన్నమును వచనము చేయుచున్నాను.
నాలుగు విధములగు అన్నము :- 1) భక్ష్యమనగా దంతములచే కొరికి తినెడు గారెలు మొదలగు ఘనపదార్ధములు. 2) భోజ్యమనగా దంతములతో కాస్తా నమిలి  భుజించెడు క్షీరాన్నాదులు లాంటివి. 3) లేహ్యమనగా నాలుకచే చప్పరించి తినెడు పచ్చడి లాంటి పదార్ధములు 4) చోష్యమనగా నాలుకచే చప్పరించకనే ఆహారముగా తీసుకొనెడు క్షీరం లాంటి పానాదులు).
అందుకే భోజనంకు ముందు ఈ శ్లోకమును మరియు  బ్రహ్మార్పణం బ్రహ్మ....... క్రింద వివరించిన ఈ శ్లోకమును కూడా పఠించి, 
జీవులకు ఇంతటి మహోపకృతి నొనర్చుచున్న ఆ పరమాత్ముణ్ణి స్తుతిస్తూ, భగవంతునికి నివేదన చేసిన ఆహరమునే దైవభావముతో భుజించడం పరమోత్తమం. 
{ఇందుకే పూర్వం ఆహారమును భుజించుటకు ముందు  భగవంతునికి నివేదన చేసిన పిమ్మట దేహమును క్షేత్రముగాను, ఆత్మను క్షేత్రమందు గల సర్వేశ్వరునిగాను భావన చేయుచు, ఆ ఆహారమును స్వీకరించే ఆచారముండేది. ఇటువంటి ఆచారములవలన క్రమేపి శివ జీవైక్య జ్ఞానం కలుగుతుంది. 
ఇక్కడ నా చిన్నప్పటి విషయం ఒక్కటి జ్ఞాపకం వస్తుంది. మా చిన్నతనంలో మా అమ్మమ్మ మాకు అన్నం తినిపిస్తూ ఇది మనూరి బంగారమ్మతల్లి ముద్ద అనీ, ఇది బెజవాడ కనకదుర్గ ముద్ద అనీ, ఇది రాయగడ మజ్జిగౌరమ్మ ముద్ద అనీ, ఇది కంచి కామాక్షిది, ఇది కాశీ విశాలాక్షిది, ఇది తిరుపతి వెంకన్నది, ఇది భద్రాది రామన్నది, ఇది శ్రీశైలం మల్లన్నది, ఇది సింహాద్రి అప్పన్నది........అంటూ ఒకొక భగవన్నామముతో అన్నం ముద్దలను పెట్టడం బాగా జ్ఞాపకం. కానీ అలా తినిపించడంలో పరమార్ధం కొంతకాలం క్రితం వరకు నాకు తెలియలేదు. చిన్నప్పటినుండి దైవ స్మరణ చేయిస్తూ పెద్దలు ఈ రీతిలో మనకు అన్నం తినిపించడంలో ఓ మంచి ఆధ్యాత్మిక బోధ ఉన్నదని తెలియక నా పిల్లలకు నేనలా చేయలేకపోయాను. నా పిల్లలు అన్నం తినమని మారాం చేసినప్పుడు, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్నది, ఇది అక్కది, ఇది అమ్మమ్మది, ఇది నానమ్మది, ఇది తాతయ్యది,  ఇది పిన్నది, ఇది అత్తది.......... అనీ సన్నిహిత బంధువుల పేర్లు చెప్తూ తినిపించేదానిని. నాలా తెలియని తల్లులు ఎందఱో ఉండవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను - అప్పటి ఆచారవ్యవహారాల్లో ఉన్న గొప్పతనమునూ మరియు మన పూర్వీకులు, పెద్దవారు వారి వారి పనులద్వారా ఉగ్గుపాలనుండియే తత్త్వబోధ చేసేవారని. అది గ్రహించక అజ్ఞానంలో నేనున్నానని. ఇక్కడ మరొక అనుభవపూర్వక విషయమును కూడా నేను చెప్పాలనుకుంటున్నాను - ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా ఏర్పడిన అవగాహన వలన మన ఆచారవ్యవహారాల్లో ఉన్న అంతరార్ధం అర్ధమై, వాటిని ఆచరణలో పెట్టడంతో గతంలో కంటే  నాదిప్పుడు ఎంతో సరళమైన ప్రశాంతకర జీవనమైంది}
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ /
బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
హోమసాధనములు {సృక్ (సృక్ అనగా హోమములో, కొయ్యతో చేయబడిన గరిటివంటి యే పాత్రచే హవిస్సు అన్నాదులు హోమింపబడునో దాని పేరు), స్రువం (స్రువమనగా హోమములో, కొయ్యతో చేయబడిన యే పాత్రచే ఘ్రుతమును ఎత్తి హోమింతురో దానియొక్క పేరు) మున్నగునవి}, హోమద్రవ్యములు (అన్నం, నెయ్యి మొదలగునవి), హోమాగ్ని, హోమం చేయువారు, హోమం చేయబడింది....అన్నియును బ్రహ్మస్వరూపములే అన్న బ్రహ్మభావమును కలిగి బ్రహ్మార్పణ భావంతో ఈ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు..... క్రమేపి బ్రహ్మస్వరూపమును పొందగలడు.
ఈ శ్లోకమందు హోమం గురించి చెప్పబడినప్పటికిని సమస్త కార్యములందు ఈ ప్రకారమే, అంటే సమస్తమూ బ్రహ్మమయమే అన్న భావనతో చేసినచో - ప్రతీ కార్యమందునూ చేయువారు, చేయబడింది బ్రహ్మస్వరూపములే యగును. 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని చాందోగ్యోపనిషత్ తెలిపిన విధంగా ఈ సమస్తమూ బ్రహ్మమే అను భావమును దృఢపరచుకొని సర్వకార్యాలు నిర్వర్తించువాడు బ్రహ్మస్వరూపమే పొందును. ఈ ప్రపంచమున సమస్తమూ బ్రహ్మస్వరూపమేకానీ, అన్యం కాదు. ఈ విషయం సదా జ్ఞప్తియందు ఉంచుకొని, చిత్తమందు బ్రహ్మభావన, దైవభావన కలిగియుండి అన్నాదులు స్వీకరించినచో, ఈ స్వీకరించనెడి ప్రక్రియ ఓ యజ్ఞమే యగును, భుజించు పదార్ధము అమృతమే యగును. 
పూజితం హ్యశనం నిత్యం బలమూర్జం చ యచ్ఛతి /
అపూజితాం తు తద్భుక్తముభయం నాశయేదిదమ్ //
దైవభావముతో భుజించెడు అన్నం సత్త్వగుణమును, బలమును, దివ్యమైన ఓజస్సును కలుగజేయును. అట్లుకాక భుజించెడు ఏ పదార్ధమైనను ఆత్మబలమును, తేజస్సును నశింపజేయును.
బ్రహ్మభావనతో భుజింప అభ్యసించువారికి ఈ దేహం దేవాలయముగాను, ఆత్మ పరబ్రహ్మ స్వరూపముగాను బోధపడును. 
అటులనే భోజనం చేయునప్పుడు ఇట్టి భావంతో మౌనంగా భుజించువారు ఉత్తమ సాత్త్వికులు. భోజనం చేయునప్పుడు వ్యర్ధ విషయములు మాట్లాడుచు భుజించువారు రజోతామసతత్త్వం కలవారగుదురు. 

మానేన భోజయిత్వా తు స్వర్గం ప్రాప్తో న సంశయః /
ప్రజల్పన్ భుజంతే యస్తు తేనాన్న మశుచిర్భవేత్ //
పాపం న కేవలం భుంక్తే తస్మాన్మౌనం సమాచరేత్ /
ఉపవాసనమం భోజ్యం జ్ఞేయం మౌనేన నారద! //
మౌనంతో భుజించువారు స్వర్గమును పొందగలరు. దీనియందు సందేహం లేదు. మాట్లాడుతూ భుజించిన అన్నము అశుచి అగుతున్నది. వ్యర్ధవిషయాలు మాట్లాడుచు భుజించు అన్నం అన్నమే కాదు, పాపరూపమే యగును. మౌనంతో భుజించిన భోజనం ఉపవాస సమానమే అగుచున్నది. ఉపవాసం వలన ఎంత ఆత్మశుద్ధి కలుగునో అంత పుణ్యం మౌనంగా భుజించడం వలన కలుగును.

ఈ రీతిలో సాత్త్వికమైన ఆహారమును మౌనముగా దైవానికి నివేదనచేసి, దైవమును స్తుతిస్తూ తీసుకున్న ఆహారం శుద్ధాహారం అవుతుంది. 
శుద్ధ ఆహరముచే మనస్సు నిర్మలమవును. శాంతి, దయ, వైరాగ్యం, దైవచింతన, బ్రహ్మభావన కలిగి పరబ్రహ్మప్రాప్తి పొందవచ్చును. 
పుత్రోత్పత్తికి హేతువగు శుక్లశోణితం ఏ అన్నపానీయములచే స్త్రీపురుషులకు ఏర్పడునో అట్టి అన్నము శుద్ధముగా ఉన్నచో - దైవ, మాతాపితరులయందు, గురువులయందు, వేదశాస్త్రాలయందు, సాదు సత్పురుషులయందు విశ్వాసం గల ధర్మాతులైన వంశోద్ధారక సంతానం కలుగుదురని శాస్త్రవచనం. 

3, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆ నాలుగు ఏమిటంటే.........

మొన్న మా అమ్మాయి (అనుషా) ఓ ప్రశ్న అడిగింది. 
అమ్మా! సత్యయుగం(కృతయుగం)లో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది అని అంటారు కదా. ఆ నాలుగు పాదాలు ఏమిటమ్మా?
ఆ నాలుగు ఏమిటంటే.........
కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్తజ్జ నైర్ధ్రతః /
సత్యం దయా తపో దానమితి పాదాని భోనృప //
(ఈ శ్లోకం మహాభారతం లోనిదని జ్ఞాపకం)
కృతయుగమందు ౧.సత్యం ౨.దయ ౩.తపస్సు ౪.దానం అనునవి నాలుగు పాదములు. 
మా అమ్మాయి అడిగిన ఈ ప్రశ్నతో మరో జ్ఞాపకం నా మదిలో కదలాడుతుంది. అది -
ఓ మూడు నాలుగు సంవత్సరముల క్రితమనుకుంటాను (సరిగ్గా జ్ఞాపకం లేదు), తెలుగుచలనచిత్రరంగ ఉత్సావాలప్పుడు ప్రముఖనటుడు రాజేంద్రప్రసాద్ గారు ఇలా అన్నారు -
కృతయుగంలో మంచే తప్ప చెడు అనేదే లేదు, త్రేతాయుగంలో మంచి సముద్రానికి ఇవతల, చెడు సముద్రానికి అవతల ఉండేవి, ద్వాపరయుగంలో మంచి చెడు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట ఉండగా, కలియుగంలో ఈ రెండూ ప్రతీ ఒక్కరిలో ఉన్నాయి అని! ఈ కార్యక్రమం టి.వి లో చూస్తూ 'ప్చ్..... కృతయుగంలో పుట్టిన బాగుండును, దురదృష్టం కొలది ఈ కలియుగమందు పుట్టాను కదా' అని నేను అంటుండగా, ప్రక్కనే ఉన్న మావారు  "అలా ఎందుకనుకోవడం? ఈ యుగమందైన సత్యయుగంలో ఉన్నట్లు ఉండవచ్చు. ఏ యుగమందు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందిన ధర్మం ప్రకారం మన ప్రవర్తన మార్చుకుంటే సరిపోతుందని" అన్నారు.
నాకు అర్ధం కాలేదు మావారి మాటలు. కాస్త వివరంగా చెప్పండి అని అడగగా -
కృతయుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సు, దానం అను పాదాలపై నడిచేది. ఈ నాలుగు గుణములు కలవారు ఏ యుగమందున్నను సత్యయుగంలో ఉన్నట్లే.
త్రేతాయుగమందు ధర్మం - సత్యం లోపించి దయ, తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ మూడు గుణములు కలవారు ఏ యుగమందున్నను త్రేతాయుగంలో ఉన్నట్లే.
ద్వాపరయుగమందు ధర్మం -సత్యం, దయ లోపించి తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ  రెండు గుణములు పరిపూర్ణముగా కలవారు ఏ యుగమందున్నను ద్వాపరయుగమందు ఉన్నట్లే.
ఇక కలియుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సులు లోపించి కాస్తంత దానగుణం పైనే నడుస్తుంది. 
ఏ యుగమునందు నీవు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందినట్లు నీ గుణసంపత్తిని పెంచుకో... 
అని వివరంగా మావారు చెప్తూ ఈ విషయాలన్నీ భారతంలో ఉంటాయి చదువు అని భారతమును నా చేతిలో పెట్టడం ఓ మధురమైన జ్ఞాపకం.

భారతంలో అనుశాసనికపర్వంలో ధర్మరాజు యుగములను గూర్చి అడిగిన ప్రశ్నకు భీష్ముడిట్లు సమాధానమిచ్చెను -
'మానవుల అంతఃకరణలను బట్టియే యుగములు మారును గానీ యుగమునుబట్టి మానవుల అంతఃకరణములు మారవు'.

1, సెప్టెంబర్ 2012, శనివారం

దేహమే దేవాలయం; జీవుడే దేవుడు!

దేహస్తాః సర్వవిద్యా శ్చ దేహస్తా స్స ర్వదేవాతః
దేహస్తాః సర్వతీర్ధాని, గురువాక్యేన లభ్యతే 
బ్రహ్మాండలక్షణం సర్వం దేహమధ్యే వ్యవస్థితమ్ (జ్ఞానసంకలినీతంత్రం) 
                                * * *
దేహమే దేవాలయం; ఆత్మయే దైవం. (వేదాంతుల వాక్కు)
                                * * *
దేహమే దేవాలయం; జీవుడే దేవుడు. (మహర్షుల మాట)
                                 * * *
ఈ దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం; దీని లోపల ఆత్మయే దైవం. (శాస్త్ర వచనం)
                                 * * *
మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది. (శ్రీ రమణమహర్షి)
                                  * * *
భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు కదా...
దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే -
భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ, మనకి కానరావడం లేదు... ఎందుకనీ?
మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన!
మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు! మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.
మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి... ఎలా?
ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని - ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి, పుజాసామగ్రిని, పూజగదిని శుభ్రపరిచి, అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో, అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి). మనలో ఉన్న అజ్ఞాననిర్మాల్యలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి  ఆరు అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించాలి. సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. అందుకే చెడు ఎవరైనా చెబితే చెవిటివాడులా ఉండు, చెడు మాట్లాడే సంభాషణ సంభవిస్తే మూగవాడిలా వుండు, చెడు చూసే పరిస్థితి తారసపడితే గుడ్డివానిలా వుండు అని 'బాబా' అంటారు. మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి, అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. (ఆలోచనలతో నిండి ఉన్న భాగాన్ని మనస్సు అనియు, విచక్షణతో నిర్ణయం తీసుకునే భాగాన్ని బుద్ధి అని అంటారు). రామకృష్ణ పరమహంస చెప్పేది ఇదే - 'ఆకర్షణల మధ్య ఆకర్షణ లేకుండా ఉండగలగడమే వివేకం' అని! ఏది మంచో, ఏది చెడో బుద్ధిద్వారా గ్రహించాలి. మనబుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి, మన మనస్సు చేతిలో బుద్ధి ఉంటే మనకు తిరోగతి. శ్రీ రమణులు అన్నట్లు, మనస్సు బయటికి వెళితే బంధం, లోపలి వెళితే మోక్షం!  
ప్రాపంచిక మార్గమైన, పారమార్ధిక మార్గమైన సరే, మన జీవన గమనంలో బయట లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవి సహజం. ఇవన్నీ ఓర్పు, దైర్యం, నమ్మకం, ఏకాగ్రత లాంటి సద్గుణములతో ఎదుర్కొని పయనించినప్పుడే గమ్యమును చేరుకోగలం. జీవితంలో కష్టాలు, దుఃఖం, ఆవేదన..... ఇత్యాదులు అనుభవిస్తేనే ఆనందములోని పరిపూర్ణత, అమృతత్వం అర్ధమౌతాయి. ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి మనస్సును అదిగమించే ధైర్యవంతుడు కాగలడు. ఇవన్నీ అనుభవించి అనుభవించి చివరికి ఆత్మజ్ఞానియై ప్రాజ్ఞుడౌతాడు. 
హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ, ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం!  ప్రేమ, జ్ఞానం ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది. 
మానవుని నడత నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండింటిమీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనల్లోగానీ, మాటల్లోగానీ, పనిలోగానీ రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మనస్సులో మాలిన్యాలు తగ్గి మనస్సు పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. 
ఒకోసారి అన్పిస్తుంది - భగవంతున్నే నమ్ముకున్నాను, ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను, ఎంతగానో ప్రార్ధిస్తున్నాను, మంచిగా జీవనగమనం సాగిస్తున్నాను, ఎంతో సాధన చేస్తున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి? ఏమిటీ బాధలు....అని! 
అసలు పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి? 
దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ. 
దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.
అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.
అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన.
సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.
సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.
భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో (మిషన్లో) పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదని బాబా అంటారు. 
'నీకు కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు' అని జిన్నూరు నాన్నగారు చెప్తుంటారు.
చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా.
దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం.......ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనలయందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం. శవబుద్ధి (దేహాత్మబుద్ధి) వలన ఈశ్వరుడు జీవుడిలా కన్పిస్తున్నాడు. శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది. 


అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.

30, ఆగస్టు 2012, గురువారం

సార్ధకత

దేహమను క్షేత్రంలో -
భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు; 
ప్రేమ అను జలాభిషేకమును; 
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను; 
సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత! 
లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు