http://www.sodhini.com

20, ఫిబ్రవరి 2014, గురువారం

ఆధ్యాత్మికఆచార్యుడు ఆంజనేయుడు

తాత్త్వికదృష్టితో రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది. 
ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి. ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతీకార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే. 

శ్రీ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు 

మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు. 
'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ'మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ ఆంజనేయుడు. 

పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం 

వానరరూపం - వాయుతత్త్వం. 
గరుడరూపం - ఆకాశతత్త్వం. 
నరసింహరూపం - అగ్నితత్త్వం. 
వరాహరూపం - భూమితత్త్వం. 
హయగ్రీవరూపం - జలతత్త్వం. 




ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు 

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.  

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ / 
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 
నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'. తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'. 
సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదానారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు. 

అఖిలలోకోపకారి ఆంజనేయుడు 

యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు. 

{అష్టసిద్ధులు - వివరణ :-
అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'. 
పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును, ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.  

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి.  
అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి.  
పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి.  
ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి.  
లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి. 
భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం". 
అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట "ఈశత్వం"} 

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా / 
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //
తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?
ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి. 
గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //
భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. 
అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును. 




రామ - హనుమల బంధం ఏమిటంటే - ప్రభు - సేవకుడు;భగవానుడు - భక్తుడు; గురువు - శిష్యుడు 
అటుపై వీరి బంధం "ఏకత్వం". 
ఓసారి రామునితో హనుమ ఇలా అంటాడు -
దేహదృష్ట్యా తు దాస్యోహం జీవదృష్ట్యా త్వదంశకః /
ఆత్మదృష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి: //
ఈ శ్లోకం పరిశీలిస్తే సాధకునికి అన్నీ అవగతమౌతాయి. 

బలం ధైర్యం నేర్పు ఓర్పు బుద్ధి శక్తి సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన 'కర్మయోగి' ఆంజనేయుడు. రామభక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న 'భక్తియోగి' ఆంజనేయుడు. సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న 'జ్ఞానయోగి' ఆంజనేయుడు. 
భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి, జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గ్రహించి, నిష్కామ కర్మాచరణలతో "భవిష్యద్బ్రహ్మ" అయినాడు ఆంజనేయుడు. 

మరిన్ని వివరణలు తదుపరి టపాలో ... 


   

1, ఫిబ్రవరి 2014, శనివారం

నా నెచ్చలితో నా కబుర్లు ... 'భక్తుని అంతరంగభావపరంపరలు'

భారతీ! పాండురంగ శతకంలో పద్యాలు చదువుతూ ఆశ్చర్యానందములతో పులకించిపొయాను. ఓ భక్తుని భావపరంపరలు ఏమని చెప్పను? నేను చదివిన ఆ కొన్ని పద్యాలు నీకోసమని వ్రాసుకొచ్చానని నా నెచ్చలి ఇచ్చిన అమూల్యపద్యాలు చదివి పరవశమయ్యాను. ఆ పద్యాలను 'స్మరణ'లో పదిలపరచుకుంటున్నాన్నిలా -

భగవంతుడు నిరాకారుడు అయినా సాకారుడుగా, నిర్గుణుడు అయినా సగుణుడుగా భక్తులకై అవతరించు ఆత్మీయుడు. అటువంటి సర్వాంతర్యామిని త్రికరణశుద్ధిగా ఆరాదించే భక్తుని మనోభావనలు అనంతం, అద్భుతం. 
అట్టి సర్వేశ్వరునిని ముందు ఓ భక్తుడు జోలె సాచి అర్ధిస్తున్నాడిలా -

భక్తితో నొసగిన పత్రమైనను గొని 
     తినలేదే? దృపదుని తనయ కొరకు,
ఆర్తితో కుసుమమ్ము నర్పించి మొరలిడ 
     రాలేదే? వే కరిరాజు కొరకు,
పండుదినుటె గాదు పై పొట్టు సైతం 
     మ్రింగలేదే? విదురాంగనకయి,
నోరూర బుడిశెడు నీరమున్ గైకొని 
     త్రావలేదే? రంతిదేవు కొరకు,

ఏమిగని యారగించితో శ్యామలాంగ 
అట్టి ప్రేమను భిక్షగా బెట్టుమయ్య 
జోలెసాచితి నీ ముందు జాలితోడ 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 



భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు, భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే. భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. భక్తునికై పరుగులు తీస్తాడు. భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు. తనని సేవించే భక్తులకై పరుగులు తీసే పరమాత్మను సేద తీరమంటాడిలా -

ఏకనాధుని యింట పాకాది కార్యముల్ 
     జేసి కావడి నీళ్ళు మోసి మోసి, 
ప్రేమన్ జనాబాయి పిలిచిన నటకేగి 
     వేడుకతో పిండి విసిరి విసిరి,
శ్వేతవాహను పైన ప్రీతితో రణమున 
     లీలగా రధమును తోలి తోలి,
ఆర్త జిజ్ఞాసువు లర్ధార్ధులెందరో 
     మొరలిడ వారికై తిరిగి తిరిగి, 

ఎంత శ్రమనొంది యుంటివో యే మొరమ్ము 
దాచు కొందును హృదయాన తాల్మితోడ 
విశ్రమింపుము క్షణమైన విమల చరిత 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 



భగవంతుడు నిష్క్రియుడు, నిర్విశేషుడు, నిర్లిప్తుడు అయినను సృష్టి స్థితి లయ కారకుడు. సర్వవ్యాపకుడు, పరిపూర్ణుడు, మహిమాన్వితుడు. అటువంటి పరమాత్మను తనకు తానుగా తెలుసుకోలేనని, తనపై కరుణతో తనకు తానుగా(భగవంతుడు) తానే తెలియబడాలన్న సత్యాన్ని గ్రహించి, ప్రార్ధిస్తాడిలా -

నిన్నెరుంగగ మాకు కొన్ని గుర్తులు జెప్పి 
     మూగదై శ్రుతి మౌనమును వహించె, 
వేనోళ్ళ బొగిడిన విభవాదియే గాక
     శేషింప తానాదిశేషుడయ్యె,
నిన్నెరింగిన వారలన్న తెల్పుచు తత్త్వ 
     మిదమిద్ధమని నిరూపించరైరి,
అంతరంగములోన నెంత యోచించిన 
     తెలిసినట్లౌ నేమి తెలియకుండు,

నీవు కరుణించినంగాని నిన్నుగాంచ 
నలవి గాదయ్య బహు జన్మములకునైన 
వేగ కృపతోడ బ్రోవుమో వేదవేద్య 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 





29, జనవరి 2014, బుధవారం

నా నెచ్చలితో నా కబుర్లు ... "పంచేంద్రియాలు - పంచోపచారాలు"

నిన్న ఎప్పటిలా మా ఇంటికి వచ్చిన నెచ్చలి 'హరిప్రియ' ఓ సందేహం వెలిబుచ్చింది. భారతీ! నేను చేసే పూజావిధానం సరైనదేనా? షోడశోపచారాలు చేయడం లేదు కదా అని అడిగింది. 
షోడశోపచారాలు చేయకున్నను భక్తిపూర్వకంగా పంచోపచారాలు చేస్తున్నావు కదా, అని నేననగా, అంతేనంటావా అన్న తనకి ఇలా చెప్పాను -

ఈ సృష్టిలో పంచభూతలున్నాయి.
పంచభూతములు :-
                          పృథ్వి, అగ్ని జలము, వాయువు ఆకాశం. 

ఈ పంచభూతాలే మనలో ఉన్నాయి. 
మనలో పంచభూతముల అమరిక -

అగ్ని :- 
శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 
పృథ్వి :- 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం. 
వాయువు :- 
శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. ఈ పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం,                       ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 
ఆకాశం :- 
అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 
జలం :- 
రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  

మన ఈ దేహం పంచభౌతికమైనది. వివిధ విషయాలను అనుభవించడానికి పంచేంద్రియాలు ఉన్నాయి. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే విషయసుఖాలను అనుభవిస్తూ ఇష్టానుసారంగా భోగిస్తున్నాయి. అందుకే మనిషిని అధోగతి పాలుచేసే ఈ పంచేంద్రియాలను పూజలో పంచోపచారాలు ద్వారనైనను పరమాత్మునివైపు త్రిప్పగలిగితే జీవన పరమార్ధం సార్ధకమౌతుందని పెద్దలంటారు. మన సదాచరణలు, సాంప్రదాయకలు, సంస్కృతి పరమాత్ముణ్ణి తెలియజెప్పడానికే. 

పూజా పద్ధతిలో షోడశోపచారాలున్నప్పటికిని గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవి. ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలు పంచోపచారాలలో నిబిడికృతమై ఉన్నాయి కాబట్టే; "పంచేంద్రియాలు - పంచోపచారాలు" అని పెద్దలన్నారు. అయితే, ఈ పూజను ఓ క్రియలా కాకుండా భావయుక్తంగా సంపూర్ణ సమర్పణాభావంతో చేయాలి. అప్పుడే ఆరాధన అంతర్లీనంగా అంతరంగంలో దృఢపడి అనుక్షణం అంతర్యామిని పూజిస్తుంది. చిత్తశుద్ధికి, జ్ఞానప్రాప్తికి ఈ పవిత్రభక్తిపూర్వక కర్మలే ఆధారం. సర్వభూతాలలో తనను, తనలో సర్వభూతాలను తెలుసుకుంటూ, పంచేంద్రియాలను తన స్వాధీనం చేసుకొని, పరమాత్మ పరంచేస్తూ వాటిని వినియోగించుకున్నవాడే నిజమైన భక్తుడు.
అని నాకు తెలిసింది చెప్పగా -
బాగుంది బాగుంది, సంక్రాంతికి ఊరెళ్ళానా, అక్కడ శ్రీ పాండురంగ శతకం లో కొన్ని పద్యాలు ఓ పుస్తకంలో చదివాను. అందులో ఓ పద్యం గుర్తుకొస్తుంది అంటూ నెచ్చలి హరిప్రియ చెప్పిన చక్కటి పద్యమిదే ... 
  
చిత్తమా! శ్రీకృష్ణు చింతించు మెప్పుడు 
     నాలుకా! చవిజూడు నామ సుధల 
కరములారా! మీరు హరిని పూజింపుడు 
     వీనులార! వినుడు విష్ణు కధలు 
కనులార! రాధికా కాంతుని గాంచుడీ 
     గుడిలోని కరుగుడో యడుగులార!
ఘ్రాణమా! తులసీ సుగంధ మాఘ్రాణించు 
     మస్తకమా! మ్రొక్కు మాధవునకు 


                           అనుచు లోలోన సకలేంద్రియముల నిన్ను 
                                  గొలవగా వేడు కొందును గోపబాల
                                  సేవ గొనుమయ్య నిరతము శ్రీ ముకుంద!
                                  పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 

ఓ ... మంచిపద్యం. పూజ ఎన్ని ఉపచారాలతో చేసినను అందులో మనసా, వాచా, కర్మణా దృఢమైన భక్తి శ్రద్ధలను కలిగియుండడం అత్యంత కీలకం. నిత్య వ్యవహారమంతయూ భగవత్పూజయే అన్న భావన మనలో దృఢపడాలి ... అని నేను చెప్తుండగా నెచ్చలి వినిపించిన మరో ఆణిముత్యం లాంటి పద్యమిదే -
                                  
ఆత్మాత్వం గిరిజా మతి: చరాచరాః ప్రాణాః శరీరం గృహం 
పూజతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి:
సంచారః పదయో: ప్రదక్షిణ విధి: స్తోత్రాణి సర్వాగిరో 
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ 
                                         - శ్రీ శంకరాచార్యకృత శివమానసపూజ 
ఓ శంభుదేవా! నా ఆత్మయే నీ స్వరూపము. నా బుద్ధియే పార్వతీదేవి. నా ప్రాణములే నీ సహచరులు, లీలా పరికరములు. నా దేహమే నీ దేవళం. విషయభోగములను అనుభవించుటయే నీ పూజ. నా నిద్రయే ధ్యాననిష్ఠ, సమాధిస్థితి. నా రెండు చరణములు సంచరించునదంతయూ నీ ప్రదక్షిణయే. నా నోటి ద్వారా మాట్లాడు మాటలన్నియూ నీ స్తోత్రములే. ఒకటని ఏముందీ, ఎల్లప్పుడూ నేను ఏమేమి కర్మలు చేసెదనో, అవన్నియూ నా ఆరాధనయే అవుతుంది. 



ఇలా సాగిన మా సంభాషణ తనివి తీరనిది. తనతో నాకబుర్లు మరిన్ని మరో టపా లో ... 

19, నవంబర్ 2013, మంగళవారం

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానం ఏమిటంటే ...

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానమిదే -
భారతీ! నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేముందు ఓ పుస్తకంలో చదివిన కబీరుగారి ప్రబోధకీర్తన గురించి చెప్తాను. " సద్గురుకీ భిక్షా మాంగాయిరే బాల" అన్న కీర్తన పూర్తిగా నాకు గుర్తులేదు, కానీ, అందులో వివరించిన అర్ధం, అంతరార్ధం గుర్తుంది. సద్గురుకీ ప్రేమభిక్ష వేడుకోమని, చెప్తూ ఆ భిక్షకు అంగభూతములుగా నాలుగు భిక్షలను కబీరు నిర్వచించెను. మొదటిది గోధుమపిండి. ఇది అంగడికి గాని, పిండిమరకు గాని పోకుండా జోలెనిండ తేవలెను. రెండవది జలము. బావికి గాని, నదీతటాలములకు గాని పోకుండానే ఆనపబుర్ర నిండా తేవయును. మూడవది కట్టెలు. అంగడికి గాని, అడవికి గాని పోకుండా మోపెడు కట్టెలు తేవలయును. నాల్గవది దర్శనభిక్ష. మసీదు, దేవళములకు గాని, సాధు ఫకీర్ల వద్దకు గాని పోకుండా, ఉన్నచోటనే దర్శనం పొందవలెనని, అందుకై సద్గురుకి ప్రేమభిక్ష వేడమనే ప్రబోధం ఆ కీర్తనలో ఉంది. ఇప్పుడు ఈ కీర్తనలో అంతరార్ధం తెలుసుకుందాం. మొదట మూడు అంటే, పిండి, జలము, కట్టెలు రొట్టెను తయారుచేయుటను సూచించును. ఆ రొట్టెను తినినచో దర్శనం, దాని ఫలితంగా ప్రేమ లబింపవలయును. రొట్టెను తయారుచేయుటకు పిండి ముఖ్యపదార్ధం. కాని పొడిపిండిని తినలేం. అందుకే నీరు కావలయును, ఆ నీటితో పిండిని తడిపి, ముద్ద చేసి రొట్టెగా ఒత్తవలెను. అలా పచ్చిరొట్టెను తినలేం, దానిని కాల్చాలి. కాల్చడానికి కట్టెలు కావాలి. ఇలా సక్రమముగా తయారైన రొట్టెను తింటే ఆకలి తీరుతుంది. ఇక్కడ పిండి జ్ఞానం. దానిని భక్తి రసముచే (జలముచే) తడిపి మృదువుగా నొనర్చిన పిమ్మట నిష్కామ కర్మలను కట్టెలతో పక్వమొనర్చి  సక్రమముగా తయారైన ధ్యానమను రొట్టె ఆరగిస్తే ఆధ్యాత్మికక్షున్నివారణమగును. అప్పుడు ఉన్నచోటనే తత్క్షణమునే పరమాత్మ దర్శనమగును. అటుపిమ్మట అంతా పరమాత్మ ప్రేమతత్త్వమే. దానిని సద్గురువునివ్వమని వేడుకో... ఈ కీర్తనబట్టి ఆత్మసాక్షాత్కారానికి భక్తి, ధ్యాన, కర్మ, జ్ఞానమనే నాలుగూ అవసరమేనని అర్ధమౌతుంది. కాకపోతే ఈ నాలుగు యోగాలు అనుష్టించగలిగే శక్తి కారణజన్ములయిన మహాత్ములకే ఉంటుంది. మనలాంటివారికి ఇది అసాధ్యము కావున, ఏ యోగమార్గం ద్వారైన నను పొందవచ్చని గీతలో సూచించాడు. 

జీవకోట్ల సంస్కారములు అనేకవిధములు. జీవుల యొక్క పరిపక్వతా భేదములున్ను అనేక రకములు. వారి వారి భావనలబట్టి ఒక్కొకరికిని ఒక్కొక్కదానిలో ప్రవేశం కల్గుచుండును. కావున నిష్కామ కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం మొదలగు మార్గములు ఏర్పడినవి. దేహాంతరాలయములోనికి ప్రవేశించి ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి ఈ నాలుగుమార్గాలు గోపురద్వారాలుగా ఉన్నాయి. ఈ మార్గాలలో ఏ మార్గం ద్వారైనను నిర్మలబుద్ధితో, నిష్కపట ప్రయత్నముతో ప్రవేశించి గమ్యస్థానమును చేరవచ్చును. అయితే, ఏ యోగమార్గములో ప్రవేశించినను, మిగిలిన మూడు మార్గాలు అందు అంతర్భూతమయ్యే యుండును. ఆంటే అంగభూతములుగా యుండును. ఈ నాలుగున్ను ఒకదానికి ఒకటి అన్యోన్య సంబంధం కల్గియే యుండును. జ్ఞానికి భక్తి, కర్మ, ధ్యానములు అంగభూతములుగా నుండును. అట్లే భక్తునికి కర్మ, ధ్యాన, జ్ఞానములూ; ధ్యానికి భక్తి, కర్మ, జ్ఞానములూ; కర్మయోగికి భక్తి, ధ్యాన, జ్ఞానములూ అంతరభాగములై యుండును. ఎలాగంటే, చీకటి నశించి ప్రకాశము కలుగుటకు దీపమే ప్రధానమైనను, దానికి ప్రమిద, తైలము, వత్తి ఎలాగున అవసరమో, అదేరీతిగా జ్ఞానజ్యోతి అయిన ఆత్మను దర్శించడానికి తక్కిన సాధనములు అవసరమే.
దైవోపాసనచే విక్షేపశాంతియు, శుద్ధమగు కర్మానుష్టానంచే అంతఃకరణశుద్ధియు, ధారణాధ్యానబలంచే సంయమనమును, జ్ఞాననిష్టచే ఆవరణరాహిత్యమును కలుగును. కనుక ఏ యోగమార్గమందైనను ఒకదానికి ఒకటి అనుసంధానింపబడే ఉంటాయి. 
భోజనం చేస్తున్నామంటే, దాని తయారికి బియ్యము మొదలగు పదార్దములు, అగ్ని, జలము, పాత్ర, కట్టెలు మొదలునవి ఎలా ఉన్నాయో, ఏ యోగం అనుసరించినను ఆ యోగంలో తక్కినవి అంగభూతములై ఉంటాయి. ఈ సూక్ష్మం అర్ధమైతే ఏది శ్రేష్టమన్న సందేహం ఉండదు ... అని నా నేస్తం 'హరిప్రియ' చెప్పింది.

17, నవంబర్ 2013, ఆదివారం

హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.

క్రిందటివారం తిరుపతి కంచి వెళ్లి, తిరుగు ప్రయాణం అయినప్పుడు ట్రైన్లో ఇద్దరు సాధకులు తాము అనుసరిస్తున్న 'సుషుమ్న నాడీ' ధ్యానవిధానమును తెలిపారు.
పతంజలి యోగసాధన, బుద్ధుని అనాపాన సతి, మాస్టర్ సి. వి. వి. ధ్యానయోగం, పరమహంస యోగానంద క్రియాయోగం, మహేష్ యోగి భావాతీత ధ్యానయోగం, శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీరమణుల నేనెవరిని అన్న విచారణయోగం, స్వామి శివానంద సగుణ నిర్గుణ ధ్యానపద్ధతి, బ్రహ్మకుమారీల రాజయోగం, మాతా అమృతానందమయి ఐ యామ్ టెక్నిక్, అరవిందుని ఇంటిగ్రల్ యోగం, ఋషి ప్రభాకర్ గారి యస్. యస్. వై ధ్యానపద్ధతి, శ్రీ భిక్షుమయ్య గారి యమ్. యమ్. వై ధ్యానపద్ధతి, పత్రీజీ పిరమిడ్ ధ్యానం ... ఇలా ... ఒక్కొక్కరు ఒక్కోలా ఈ ధ్యానయోగాన్ని అనుభూతిస్తూ, నిర్వచిస్తూ, సూచిస్తూ, తెలియజేస్తున్నను, ఈ ధ్యానప్రక్రియలన్నీ స్వస్వరూపస్థితిని తెలుసుకోవడానికే కదా, అని నాకన్పించింది.
ఇంతలో ఆ సాధకులు చెప్పినదంతా విన్న సహప్రయాణికుడు కొందరు ధ్యానయోగం గొప్పదని, మరికొందరు భక్తియోగమని, మరికొందరు జ్ఞానయోగమని, మరికొందరు కర్మయోగమని చెప్తుంటారు. నిజానికి ఏది గొప్పదని వారిని అడగగా, వారు ధ్యానయోగమే గొప్పదని బదులిచ్చారు.
ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ రావడంతో దిగిపోయాను. కానీ, ఏ యోగం గొప్పదన్న ఆలోచన నన్ను వీడలేదు. గీతలో భక్తియోగంలో అనేక మార్గాలను సూచిస్తూ కృష్ణపరమాత్మ ఇలా అంటారు -
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః||

నాలోనే మనస్సును, బుద్ధిని నిలుపుము. అటుపిమ్మట నీవు నిస్సందేహంగా నాలోనే వసింతువు. అంటే ఇది భక్తియోగం.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనుంజయ||

స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు. ఇది ధ్యానయోగం.

అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి||

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం చేసే పుణ్యకర్మలు వలన నన్ను పొందుతావు. ఇది కర్మయోగం.

అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్||

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీవు చేసే
కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.
ఇలా సాధకులకు అనేక యోగామార్గాలు ఉన్నాయి కదా, మరి ఇందులో ఏది శ్రేష్టమైనది అన్న నా సందేహాన్ని తీర్చుకోవడానికై మూడురోజుల క్రితం నా మిత్రురాలు 'హరిప్రియ'కు ఫోన్ చేసి అడిగాను. తను నవ్వి, మంచి సందేహమే, ఈ ఆదివారం కార్తీకపౌర్ణమి కదా, ఆరోజు ఉపవాసముంటాం కదా, ఉపవాసమంటే దేవునికి దగ్గరగా ఉండడం అంటే దైవస్మరణ, దైవప్రార్ధన ... ఇత్యాదులతో గడపడం కదా, ఆరోజు వస్తాను, నీ సందేహాన్ని తీరుస్తాను, సరేనా ... అన్నప్పటినుండి ఈ కార్తీకపౌర్ణమి కై నిరీక్షణ .....
 
హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.
నా సందేహం ఎలా తీరిందో, నా నేస్తం ఏం చెప్పిందో తదుపరి టపా లో -

30, అక్టోబర్ 2013, బుధవారం

అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం

శరీరం లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం. అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.
మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.
బుద్ధి :- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్ధ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.
చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.
అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.
ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.



28, అక్టోబర్ 2013, సోమవారం

"మౌనం"


మౌనం -
              దైవభాష.
              సనాతనం.
              లిపి లేని విశ్వభాష.
              ధార్మిక దివ్యత్వానికి ద్వారం.
              సనాతన భాషాస్రవంతి.
మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.

మౌనమంటే -
                   నిరంతర భాషణ.
                   చింత, చింతన లేని తపస్సు.
                   అఖండ ఆనందపు ఆత్మస్థితి.
                   విషయ శూన్యావస్థ.
యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం  ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.
1. వాజ్మౌనం :-



                   వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన పరుషవచనాలు పలుకుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.


2. అక్షమౌనం :-
                
కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.


3. కాష్ఠమౌనం :-
      
 
దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.




దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.

మౌనం -
                      దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.
                      గురువు మౌనం జ్ఞానానుగ్రహం.
                      జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.
                      భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.
ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.
మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.
పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం
బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే
తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని
ర్మలమగు మౌనము మారుతనందన! మానక దీవి భజింపదగున్.
                                          - శ్రీ సీతారామాంజనేయ సంవాదం.
ఓ వాయుపుత్రా! అవాజ్మనసగోచరమైన బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి, యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే వుండవు. ఇట్టిస్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం. 

'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.