http://www.sodhini.com

15, ఆగస్టు 2014, శుక్రవారం

జయహో ... ఈ రోజుకి ఈ బ్లాగ్ కు నేనే నాయకిని.

హాయ్ ... 

ఈ రోజుకి ఈ బ్లాగ్ కు నేనే నాయకిని. 
నా పేరు "శ్రీ మాన్వి". 
వయస్సు ఒక సంవత్సర రెండు నెలల ఇరవైఏడు రోజులు. 

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలనిపించి మా అమ్మమ్మ బ్లాగ్ కు వచ్చేసాను. 


                                             "భారతదేశం నా మాతృభూమి" 

రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం 
బ్రహ్మరాజర్షిరత్నాడ్యాం వందేభారతమాతరం 

(రత్నాకరుడైన సముద్రుడు ఎవరి పాదములను కడుగుతున్నాడో, ఎవరికీ హిమాలయము కిరీటమై ప్రకాశిస్తుందో, బ్రహ్మర్షి రాజర్షులనెడి పుత్రరత్నములతో ఎవరు ప్రకాశిస్తూ ఉన్నారో ... అట్టి పవిత్ర భారత నా మాతృభూమికి వందనం)

భారతభూమి జగన్మాత యొక్క సాక్షాద్రూపమే. అది ఎలాగంటే తండ్రి అయిన దక్షునిచే అవమానింపబడి అగ్నికాహుతి అయిన సతీదేవి దేహాన్ని ఎత్తి పరమశివుడు ప్రళయతాండవం చేస్తే, ఆ దేవి శరీరావయవాలు ఏబైరెండు చోట్ల పడ్డాయి. అవి మన భారతదేశంలోనే ఎబైరెండు శక్తిపీఠాలుగా విలసిల్లుతూ మన భూమి ఘనతను వెల్లడిస్తుంది. సముద్రమును వస్త్రముగా, పర్వతములను స్తనమండలముగా గలిగిన విష్ణుపత్నిగా భారతమాతను మన ఋషులు శ్లాఘిస్తున్నారు. మన మాతృదేశం కేవలం ఒక మట్టిముద్దకాదు, ఆమె భవాని, మహిషాసురమర్ధిని, భారతి. ఆమె కోటి కోటి జనమనో హృదయాలలోని ఇచ్ఛాశక్తుల సజీవ సాక్షాత్కారం. ఆమె సాక్షాజ్జగజ్జనని. పరాశక్తి యొక్క సజీవావిష్క్రుతి అని అరవిందులు వారుకీర్తించారట. ఈ విషయాలు అన్నీ మా అమ్మమ్మ చెప్తుంటుంది. అందుకే - 
                   
                    "నేను భారతీయురాలిగా జన్మించినందుకు గర్విస్తున్నాను"

ఏ ప్రపుల్ల పుష్పముల నీశ్వరునకు 
పూజ సల్పితినో యిందు పుట్టినాడ 

ఇంతటి మహనీయగడ్డ పై నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్న (అనూష, లతీష్) లకు వందనములు. 


ఈ టపా ఇప్పుడు నాకు అర్ధం కాకపోయినను భవిష్యత్తులో నాకు స్ఫూర్తినిస్తుందనే ఆకాంక్షతో నా పేరిట మా అమ్మమ్మ ఈ పోస్ట్ ను పెట్టింది. 

మరోసారి -

అందరికీ 

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!


                                                                                         - మీ  శ్రీ మాన్వి 


5, జూన్ 2014, గురువారం

ఇది నా అంతరంగమధనం - భగవంతుడు ఉన్నాడా?

సాధారణంగా కొందరు కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు లేనే లేడు, దేవుడే ఉంటే నాకిలా ఎందుకు జరుగుతుంది... అని అనుకోవడం జరుగుతుంది. ఇలా అనుకునేవారిలో నేనూ వున్నాను. కొద్దినెలల ముందు కొన్ని విపత్కర పరిస్థితులలో భగవంతుడు ఉన్నాడా అని అనుకున్నాను. 
జీవితంలో సుఖదుఃఖాలు, లాభనష్టాలు, గౌరవవమానాలు ... ఇటువంటివి సహజం. నా జీవితంలో కూడా ఇవన్నీ వున్నాయి. కానీ, దేనికీ పొంగని కృంగని సరళమైన జీవనగమనం నాది. మా నాన్నగారి నుండి ఇది నాకు అలవడింది. ఏ స్థితిలో ఉన్నను, ఏనాడు 'రామ'నామం మరువలేదు. భగవంతునిపై విశ్వాసం వీడలేదు. కానీ; గత కొద్దిమాసాలుగా కొనసాగుతున్న సమస్యల పరంపర, ఊహించని సంఘటనలు, నమ్మకద్రోహాలు మనస్సుని కల్లోలపరుస్తుంటే - భగవంతుడే లేడని, దేవుడన్నది ఒక ఊహేనని కొంతసమయం ఆవేదనతో అనుకున్నాను. 

అయితే అదే సమయంలో మా మాస్టారుగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యుడు, మందులు ఎలా అవసరమో అలానే కష్టస్థితిలో భగవంతుని స్మరణ అంతే అవసరం. అలాగని ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందులు అవసరం లేదని, సుఖాల్లో భగవంతున్ని విస్మరించడం కూడా తప్పే. కష్టాలు వచ్చేసరికి భగవంతుని కృప లేదనుకోవడం చాలా పొరపాటు. భగవంతుని కృప నిరంతరం వుంటుంది. అనుకూలతలో వుందని, ప్రతికూలతలో లేదని అనుకోవడం మనోదుర్భలత్వము. మన నమ్మకాలే మన వాస్తవాన్ని సృష్టించుతాయి. లౌకిక ప్రపంచం ఆపదలతో కూడుకున్నదే. ఆ ఆపదలకు ఆవేదన పడేకంటే ఓర్చుకొని పారమార్ధిక జ్ఞానం వైపు పురోగమించడమే మన పని. 
మాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది అని అంటుంటారు. ఏమీ రాకపోతే ఈ శరీరం భూమి మీదకు ఎందుకు వస్తుంది? ఆ అనుభవాలు పొందింప జేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతుల్ని చేస్తాడు. చెరకుగెడ గెడలాగే వుంటే రసం రాదు, దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే రసం వస్తుంది. అనేక కష్టనష్టాలకు గురి అయితే గాని దానిలో నుండి అమృతత్వం రాదు అన్న బాబా మాటలు మరువకండి. 
శ్రీమద్భాగవతము లో చెప్పినట్లుగా -
యస్యాహమనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనైః అన్నది శ్రీభగవానువాచ. (నేను ఎవరిని అనుగ్రహించదలచుకున్నానోవారి సంపదలను, గౌరవాదులను మెల మెల్లగా హరిస్తాను). 

లౌకికమునందు మునిగిపోయినప్పుడు భగవానుడు మనయందు తన అనుగ్రహంను ప్రసరింపజేయ తలచి మనకు మోహం కల్గించే వాటిని, అహం పెంచేవాటిని హరించి మనల్ని తనవైపుకి త్రిప్పుకుంటాడు. 
నిజానికి ఈ ఆపదలు మనకు ఎంతగానో మేలు చేస్తున్నాయి, భగవంతున్ని స్మరించుటకు వీలు కల్పిస్తున్నాయి. 
మోక్షమును ప్రసాదించే నీ దర్శనం కలుగునట్లుగా ఈ విపత్తులన్నియూ మరల మరల కలుగవలెనని (విపదః సన్తు తాః శశ్వత్తత్ర తత్ర జగద్గురో. భవతో దర్శనం యత్స్యాదపునర్భవదర్శనమ్కోరుకున్న అనన్యభక్తి కుంతీ మాతది. 
బాల్యం నుండియే అనేక ఆపదలను ఎదురైనను ఆవేదన చెందక అచంచల భక్తితో హరినామ స్మరణం ద్వారా ప్రహ్లాదుడు ఏం పొందాడో గమనించండి. 

తత్తేऽనుకమ్పాం సుసమీక్షమాణో భుఞ్జాన ఏవాత్మకృతం విపాకమ్
హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేత యో ముక్తిపదే స దాయభాక్ //
(కర్మ పరిపాకాన్ని అనుభవిస్తూ, నీ దయ ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ, శరీర మనో వాక్కులతో నీకు నమస్కారం చేస్తూ ఎవరు బతుకుతారో అటువంటి వారు నీ దయను పొంది ముక్తిని పొందుతారు) భక్తుని యొక్క దృక్పదం ఈరీతిలో ఉండాలని చెప్తూ చివరగా ఓ మాట చెప్పారు - "పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సాధన చేసుకోండి, ప్రతికూలంగా వున్నప్పుడు వైరాగ్యం పెంచుకోండి". 
పై మాటలు గుర్తుకురావడంతోనే నా అవివేకంకు ఆవేదన కల్గింది. 

అలానే భగవంతుడు ఉన్నాడా అన్న సందేహం కల్గగానే నా ఆత్మీయురాలికి ఈ సందేహాన్ని తెలిపాను.  
దానికి తను ఏమందంటే - తప్పు, తప్పు ఎప్పటికీ ఈ భావన నీలో రానీయకు... పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా వున్నా భగవంతుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ఆ సంఘటనలతో మనోస్థైర్యంను పెంచుకోవాలని చెప్తూ, ఇలా అంది - మనం ఈ జన్మలో ఏ పాపాలు చేయకు పోవచ్చు, గతజన్మల ప్రారబ్ధం కావొచ్చు కదా, తప్పదు ... జీవితంలో కష్టసుఖాలాను సరళంగా సహజంగా స్వీకరిస్తూ గమ్యం వైపు సాగిపోవడమే...  తన ఈ మాటలతో నా భావన ఎంత హేయమైనదో గ్రహించాను. 
పై ఇరువురి మాటలు నా తప్పిదాన్ని తెలుసుకునేటట్లు చేశాయి. పూజ్యులు మాస్టారు గారికి, నేను ఎంతగానో అభిమానించే నా ఆత్మీయురాలికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 


అటుపై భగవంతుడు లేడని అనుకున్నందుకు నేను పొందిన ఆవేదన నేను ఎదుర్కుంటున్న విపత్కర పరిస్థితుల కంటే అధికమైనది. ఆ సమయంలో నాలో జరిగిన ఆ అంతర్మధనమే ఈ టపా - 
ఆ సమయంలోనే నాలో స్వీయపరిశీలన జరిగింది. 
నిజమే నా మనస్సు విషయత్వం నందు చిక్కుకుంది. ఈ విషయత్వం విషం కంటే దారుణమైనదని శాస్త్రమంటుంది. (ఉపభుజ్య విషం హంతి విషయా స్స్మరణాదపి) విషం తినినచో చంపును. కాని విషయం తన్ను స్మరించిన మాత్రమునే హననం చేయును.  
ఇక ప్రారబ్ధంను తప్పించుకోవడం ఎలా? ప్రారబ్ధం భోగతో నశ్యే అన్నారు పెద్దలు. వీటిని సహనంగా అనుభవించి అధిగమించాల్సిందే. ఇటువంటి స్థితిలో ఆవేదన కలగకూడదంటే ఆపదలను ఆపదలుగా కాకుండా భగవంతున్ని అనుగ్రహంగా భావించాలి. ఈ సమస్యలు నాలో తగినంత వివేకం, వైరాగ్యం, అభ్యాసం లేవని తెలియజెప్పడానికే కల్గి వుండవచ్చు.
మంచి చెడుల సమ్మేళనములతో, ఆశానిరాశల సమాహారములతో, ఆనందవిషాదభాష్పాల సంగమములతో, ఎన్నెన్నో సంక్లిష్టతలతో కూడిన ఈ లౌకిక ప్రపంచంలో చలించని భక్తివిశ్వాసాలతోనే పారమార్ధిక పధంలో పయనించగలగాలి. జీవితము పట్ల ఓ చక్కటి అవగాహన కల్గి వుండాలి. గీతలో చెప్పినట్లుగా అందుకు తగ్గ అభ్యాస వైరాగ్యంలను సాధన చేయాలి. (మనస్సుని లౌకిక విషయాలనుండి మళ్ళించడం వైరాగ్యం. మనస్సుని ఆత్మయందు నిలపడం అభ్యాసం). 

ఇప్పటికీ సమస్యల నడుమే వున్నను నాలో ఇప్పుడు దుఃఖం లేదు. కాలగమనంలో ఈ సమస్యలు వీడవచ్చు, వీడకపోవచ్చు. కానీ; ఇక నాలో ఎప్పటికీ భగవంతునిపై విశ్వాసం వీడదు. 

త్వయి మేऽనన్యవిషయా మతిర్మధుపతేऽసకృత్
రతిముద్వహతాదద్ధా గఙ్గేవౌఘముదన్వతి //


ఓ మధుపతీ! నా బుధ్ధి అంతా నీ మీదే ఉంచు. గంగ ఎంత వేగంగా తిరిగినా చివరకి సముద్రం వైపునకు ప్రవహించురీతిన, నా బుధ్ధి ఎంత చంచలంగా ఉన్నా ఇతరముల వైపునకు మరలక,
నిన్నే కలిసేటట్లు నీయందే ఉండాలి.
 



 

15, మార్చి 2014, శనివారం

ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అందేది ???


ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అందేది ఏమిటో తెలుసుకునే ముందు అప్పుడప్పుడు నేను విన్న రామనామ మహత్తును ఓసారి  ఇక్కడ ప్రస్తావిస్తాను. 

పూర్వం ఓ రాజు తన వృద్దాప్యదశలో తాను ఎన్నో పాపాలను చేసినట్లుగా గ్రహించి, పశ్చాత్తాపం చెంది, ఏం చేస్తే తనకి నివృత్తి అవుతుందో తెలుసుకోవడానికి సమీప అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఓ ఋషి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఋషి కుమారుడు ఆశ్రమంలో ఉన్నాడు. రాజుగారి వేదన, తపన, ప్రార్ధన విని, ఆ ఋషి కుమారుడు "మూడుసార్లు రామనామం జపించు, నీ పాపాలన్నీ తొలగిపోతాయి" అని చెప్తుండగా; ఆశ్రమంకు వచ్చిన ఋషి తన తనయుడు చెప్పిన మాటలు విని, కోపంతో "రామనామాన్ని కించపరుస్తావా? ఒక్కసారి రామా  అంటేనే జన్మజన్మపాపాలు నశిస్తాయి కదా, మరి మూడుసార్లు జపించామంటవా? ఈ నేరానికి నువ్వు మరుజన్మలో ఆటవికుడుగా పుడతావు" అని శపించాడు. 
ఈ శాపాన్ని పొందిన ఋషితనయుడే రామాయణకాలంలో గుహుడుగా జన్మించినట్లు పెద్దలు చెప్తుంటారు. 

ఓ స్త్రీ తన భర్త మరణించడంతో ఎంతగానో విలపిస్తూ, శవయాత్ర వెంటే వెళుతూ అదే దారిలో ఉన్న తులసీదాసు ఆశ్రమం లోనికి ప్రవేశించి, ఆయనపాదాలపై పడి శోకించగా, జాలితో ఆమె భర్త శవమును సమీపించి, రామనామాన్ని జపించి కమండలంలోని జలాన్ని శవం మీద జల్లి జీవం పోశారు.  
అటులనే మరోసారి ఒక తులసిఆకుపై రామనామాన్ని వ్రాసి, ఆ ఆకును నీటిలోవేసి, ఆ తీర్ధంతో ఐదువందలమంది కుష్టురోగుల వ్యాధిని నయం చేసిన మహాత్ముడు తులసిదాసువారు. ఇటువంటి రామనామమహిమను తెలిపే మరో ఘటనను కూడా పెద్దలు ద్వారా విన్నాను. ఓ నదిలో కొట్టుకుపోతున్న ఓ శవం చెవిలో రామనామం లోని 'ర'కారాన్ని మాత్రమే ఓ సంతు జపించగా ఆ శవంలో జీవం వచ్చినట్లుగా విన్నాను.
రామనామమహత్యం గురించి మరింత వివరణ ఈ లింక్ లో - పరమపావనం - రామనామం 

అయితే ఇంతటి శక్తివంతమైన ముక్తిదాయకమైన నామధారి అయిన "శ్రీరామచంద్రుని అనుగ్రహం" అందుతుంది ఆంజనేయున్ని ఆశ్రయిస్తే. 
అందుకు నిదర్శనంగా కొన్ని ఘటనలు పరిశీలిద్దాం -

సీతాన్వేషణకై లంకకు వెళ్ళిన ఆంజనేయునికి విభీషణుడు పరిచయమయ్యేను. ఆంజనేయునితో సంభాషణమువలన ఎంతయో ప్రభావితుడై, రావణుని కొలువులో హనుమపక్షమున మాట్లాడి, ధర్మహితం పలికి, తిరస్కరింపబడి అన్నయైన రావణుని వీడి, శ్రీరామచంద్రున్ని శరణుజొచ్చెను. విభీషణుడుని తమ పక్షమున చేర్చుకొనువిషయమందు సుగ్రీవుడు ప్రతిఘటించిన శరణాగతరక్షణుడు రాముడు నిర్ణయం విని అమితానందంతో విభీషణుడుని రామునిసన్నిధికి చేర్చింది ఆంజనేయుడే. 

సముద్రంపై సేతునిర్మాణము గావించుచున్నప్పుడు హనుమ అసంఖ్యాకములైన పర్వతములను పెకిలించి తెచ్చెను. ఆ క్రమంలో ఉత్తరమున ఉన్న మరియొక పర్వతమును పెకిలించి తీసుకొస్తుండగా,  సేతునిర్మాణము పూర్తియయ్యెను అన్న సమాచారం అందుకోవడంతో ఆ పర్వతమును అక్కడే వదిలివేచెను. కానీ, ఆ పర్వతం హనుమను ఇట్లు ప్రార్ధించెను - 'హనుమా! నీ కరకమల స్పర్శను పొందియు కూడా భగవానుని సేవకు దూరము అయిపోవుటకు నేను ఏమి అపరాధము చేసితిని? నన్ను ఇక్కడ విడనాడవలదు. నన్ను కొనిపోయి భగవానుని చరణారవింద సన్నిధియందే పడవేయుము, అప్పుడే నాకు సార్ధకత' అని వేదనతో వేడుకోగా; ఆ మాటలను విన్న హనుమా ఇలా అనెను ... 'గిరిరాజా! నీ నిష్టను చూడగా నిను కొనిపోవాలని నాకున్నను ఇక పర్వతములు తేవలదని రాముని ఆదేశం వచ్చినది. కానీ, నీ కోరికను స్వామికి విన్నవించెదను' అని చెప్పి వెడలి, రాముని సన్నిధికి చేరి ఆ గిరివరుని కోరికను తెలపగా, రామప్రభువిట్లనెను - 'హనుమా! నీ చేతిస్పర్శచే పునీతుడైన ఆ గిరివరుడు నాకు అత్యంత ప్రేమపాత్రమైనవాడు. నేను ద్వాపరయుగమందు శ్రీకృష్ణుడనై యవతరించి సప్తదినముల పర్యంతము ఆ గిరివరుని నా చిటికినవ్రేలిపై నిలిపి నాకార్యమునకు వినియోగించుకొందునని పోయి అతనికి తెలుపుము' అని పలుకగా, హనుమ మరల ఆ గిరివంతుని దరికి కేగి స్వామి సందేశమును తెలిపెను. హనుమంతుని కృపవలన ఈ విధంగా పరమాత్మానుగ్రహంకు పాత్రమైన ఆ గిరియే గోవర్ధనగిరి. 

మహాభక్తుడు గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసేవారు. ఆయన ప్రతిదినము కాలకృత్యములకొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదట్లో పోసెడివారు. ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై, 'నాకు విమోచనం కల్గించినందుకు ప్రతిఫలంగా ఏమైనా అడుగు ఇస్తాన'ని అనగా; మహాభక్తుడు తులసీదాసు "శ్రీరామ దర్శనం" కోరారు. 'ఆపని తనవల్లకాదని, ఓ ఉపాయం చెప్పిందాభూతం. నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు. (యత్ర యత్ర రఘునాధ కీర్తనం / తత్ర తత్ర కృత మస్తకాంజలిం)కన్నులనీరు కారుతూవుండగా (భాష్పవారి పరిపూర్ణ లోచనం)నందంగా రామాయణం వింటూ వుంటాడు. అతన్ని పట్టుకో, నీకు రామదర్శనం అవుతుందని చెప్పింది  భూతం. తన ప్రవచనాన్ని విని చివరిగా వెనక్కి మరలిన హనుమను వెంబడించి ఆయన పాదాలను పట్టుకొని ప్రార్ధింఛి, హనుమ సాయంతో శ్రీరామదర్శనం చేసుకొనెను తులసీదాసు. 

ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అపారమైన ఆంజనేయుని అనుగ్రహంతో పాటు ముక్తిదాయకమైన రామానుగ్రహం కూడా అందుతుందని పై ఘటనల ద్వారా తెలుస్తుంది. 



మరిన్ని వివరణలు మరోటపాలో ...  

20, ఫిబ్రవరి 2014, గురువారం

ఆధ్యాత్మికఆచార్యుడు ఆంజనేయుడు

తాత్త్వికదృష్టితో రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది. 
ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి. ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతీకార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే. 

శ్రీ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు 

మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు. 
'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ'మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ ఆంజనేయుడు. 

పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం 

వానరరూపం - వాయుతత్త్వం. 
గరుడరూపం - ఆకాశతత్త్వం. 
నరసింహరూపం - అగ్నితత్త్వం. 
వరాహరూపం - భూమితత్త్వం. 
హయగ్రీవరూపం - జలతత్త్వం. 




ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు 

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.  

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ / 
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 
నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'. తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'. 
సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదానారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు. 

అఖిలలోకోపకారి ఆంజనేయుడు 

యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు. 

{అష్టసిద్ధులు - వివరణ :-
అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'. 
పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును, ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.  

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి.  
అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి.  
పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి.  
ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి.  
లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి. 
భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం". 
అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట "ఈశత్వం"} 

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా / 
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //
తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?
ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి. 
గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //
భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. 
అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును. 




రామ - హనుమల బంధం ఏమిటంటే - ప్రభు - సేవకుడు;భగవానుడు - భక్తుడు; గురువు - శిష్యుడు 
అటుపై వీరి బంధం "ఏకత్వం". 
ఓసారి రామునితో హనుమ ఇలా అంటాడు -
దేహదృష్ట్యా తు దాస్యోహం జీవదృష్ట్యా త్వదంశకః /
ఆత్మదృష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి: //
ఈ శ్లోకం పరిశీలిస్తే సాధకునికి అన్నీ అవగతమౌతాయి. 

బలం ధైర్యం నేర్పు ఓర్పు బుద్ధి శక్తి సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన 'కర్మయోగి' ఆంజనేయుడు. రామభక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న 'భక్తియోగి' ఆంజనేయుడు. సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న 'జ్ఞానయోగి' ఆంజనేయుడు. 
భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి, జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గ్రహించి, నిష్కామ కర్మాచరణలతో "భవిష్యద్బ్రహ్మ" అయినాడు ఆంజనేయుడు. 

మరిన్ని వివరణలు తదుపరి టపాలో ... 


   

1, ఫిబ్రవరి 2014, శనివారం

నా నెచ్చలితో నా కబుర్లు ... 'భక్తుని అంతరంగభావపరంపరలు'

భారతీ! పాండురంగ శతకంలో పద్యాలు చదువుతూ ఆశ్చర్యానందములతో పులకించిపొయాను. ఓ భక్తుని భావపరంపరలు ఏమని చెప్పను? నేను చదివిన ఆ కొన్ని పద్యాలు నీకోసమని వ్రాసుకొచ్చానని నా నెచ్చలి ఇచ్చిన అమూల్యపద్యాలు చదివి పరవశమయ్యాను. ఆ పద్యాలను 'స్మరణ'లో పదిలపరచుకుంటున్నాన్నిలా -

భగవంతుడు నిరాకారుడు అయినా సాకారుడుగా, నిర్గుణుడు అయినా సగుణుడుగా భక్తులకై అవతరించు ఆత్మీయుడు. అటువంటి సర్వాంతర్యామిని త్రికరణశుద్ధిగా ఆరాదించే భక్తుని మనోభావనలు అనంతం, అద్భుతం. 
అట్టి సర్వేశ్వరునిని ముందు ఓ భక్తుడు జోలె సాచి అర్ధిస్తున్నాడిలా -

భక్తితో నొసగిన పత్రమైనను గొని 
     తినలేదే? దృపదుని తనయ కొరకు,
ఆర్తితో కుసుమమ్ము నర్పించి మొరలిడ 
     రాలేదే? వే కరిరాజు కొరకు,
పండుదినుటె గాదు పై పొట్టు సైతం 
     మ్రింగలేదే? విదురాంగనకయి,
నోరూర బుడిశెడు నీరమున్ గైకొని 
     త్రావలేదే? రంతిదేవు కొరకు,

ఏమిగని యారగించితో శ్యామలాంగ 
అట్టి ప్రేమను భిక్షగా బెట్టుమయ్య 
జోలెసాచితి నీ ముందు జాలితోడ 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 



భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు, భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే. భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. భక్తునికై పరుగులు తీస్తాడు. భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు. తనని సేవించే భక్తులకై పరుగులు తీసే పరమాత్మను సేద తీరమంటాడిలా -

ఏకనాధుని యింట పాకాది కార్యముల్ 
     జేసి కావడి నీళ్ళు మోసి మోసి, 
ప్రేమన్ జనాబాయి పిలిచిన నటకేగి 
     వేడుకతో పిండి విసిరి విసిరి,
శ్వేతవాహను పైన ప్రీతితో రణమున 
     లీలగా రధమును తోలి తోలి,
ఆర్త జిజ్ఞాసువు లర్ధార్ధులెందరో 
     మొరలిడ వారికై తిరిగి తిరిగి, 

ఎంత శ్రమనొంది యుంటివో యే మొరమ్ము 
దాచు కొందును హృదయాన తాల్మితోడ 
విశ్రమింపుము క్షణమైన విమల చరిత 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 



భగవంతుడు నిష్క్రియుడు, నిర్విశేషుడు, నిర్లిప్తుడు అయినను సృష్టి స్థితి లయ కారకుడు. సర్వవ్యాపకుడు, పరిపూర్ణుడు, మహిమాన్వితుడు. అటువంటి పరమాత్మను తనకు తానుగా తెలుసుకోలేనని, తనపై కరుణతో తనకు తానుగా(భగవంతుడు) తానే తెలియబడాలన్న సత్యాన్ని గ్రహించి, ప్రార్ధిస్తాడిలా -

నిన్నెరుంగగ మాకు కొన్ని గుర్తులు జెప్పి 
     మూగదై శ్రుతి మౌనమును వహించె, 
వేనోళ్ళ బొగిడిన విభవాదియే గాక
     శేషింప తానాదిశేషుడయ్యె,
నిన్నెరింగిన వారలన్న తెల్పుచు తత్త్వ 
     మిదమిద్ధమని నిరూపించరైరి,
అంతరంగములోన నెంత యోచించిన 
     తెలిసినట్లౌ నేమి తెలియకుండు,

నీవు కరుణించినంగాని నిన్నుగాంచ 
నలవి గాదయ్య బహు జన్మములకునైన 
వేగ కృపతోడ బ్రోవుమో వేదవేద్య 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 





29, జనవరి 2014, బుధవారం

నా నెచ్చలితో నా కబుర్లు ... "పంచేంద్రియాలు - పంచోపచారాలు"

నిన్న ఎప్పటిలా మా ఇంటికి వచ్చిన నెచ్చలి 'హరిప్రియ' ఓ సందేహం వెలిబుచ్చింది. భారతీ! నేను చేసే పూజావిధానం సరైనదేనా? షోడశోపచారాలు చేయడం లేదు కదా అని అడిగింది. 
షోడశోపచారాలు చేయకున్నను భక్తిపూర్వకంగా పంచోపచారాలు చేస్తున్నావు కదా, అని నేననగా, అంతేనంటావా అన్న తనకి ఇలా చెప్పాను -

ఈ సృష్టిలో పంచభూతలున్నాయి.
పంచభూతములు :-
                          పృథ్వి, అగ్ని జలము, వాయువు ఆకాశం. 

ఈ పంచభూతాలే మనలో ఉన్నాయి. 
మనలో పంచభూతముల అమరిక -

అగ్ని :- 
శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 
పృథ్వి :- 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం. 
వాయువు :- 
శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. ఈ పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం,                       ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 
ఆకాశం :- 
అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 
జలం :- 
రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  

మన ఈ దేహం పంచభౌతికమైనది. వివిధ విషయాలను అనుభవించడానికి పంచేంద్రియాలు ఉన్నాయి. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే విషయసుఖాలను అనుభవిస్తూ ఇష్టానుసారంగా భోగిస్తున్నాయి. అందుకే మనిషిని అధోగతి పాలుచేసే ఈ పంచేంద్రియాలను పూజలో పంచోపచారాలు ద్వారనైనను పరమాత్మునివైపు త్రిప్పగలిగితే జీవన పరమార్ధం సార్ధకమౌతుందని పెద్దలంటారు. మన సదాచరణలు, సాంప్రదాయకలు, సంస్కృతి పరమాత్ముణ్ణి తెలియజెప్పడానికే. 

పూజా పద్ధతిలో షోడశోపచారాలున్నప్పటికిని గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవి. ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలు పంచోపచారాలలో నిబిడికృతమై ఉన్నాయి కాబట్టే; "పంచేంద్రియాలు - పంచోపచారాలు" అని పెద్దలన్నారు. అయితే, ఈ పూజను ఓ క్రియలా కాకుండా భావయుక్తంగా సంపూర్ణ సమర్పణాభావంతో చేయాలి. అప్పుడే ఆరాధన అంతర్లీనంగా అంతరంగంలో దృఢపడి అనుక్షణం అంతర్యామిని పూజిస్తుంది. చిత్తశుద్ధికి, జ్ఞానప్రాప్తికి ఈ పవిత్రభక్తిపూర్వక కర్మలే ఆధారం. సర్వభూతాలలో తనను, తనలో సర్వభూతాలను తెలుసుకుంటూ, పంచేంద్రియాలను తన స్వాధీనం చేసుకొని, పరమాత్మ పరంచేస్తూ వాటిని వినియోగించుకున్నవాడే నిజమైన భక్తుడు.
అని నాకు తెలిసింది చెప్పగా -
బాగుంది బాగుంది, సంక్రాంతికి ఊరెళ్ళానా, అక్కడ శ్రీ పాండురంగ శతకం లో కొన్ని పద్యాలు ఓ పుస్తకంలో చదివాను. అందులో ఓ పద్యం గుర్తుకొస్తుంది అంటూ నెచ్చలి హరిప్రియ చెప్పిన చక్కటి పద్యమిదే ... 
  
చిత్తమా! శ్రీకృష్ణు చింతించు మెప్పుడు 
     నాలుకా! చవిజూడు నామ సుధల 
కరములారా! మీరు హరిని పూజింపుడు 
     వీనులార! వినుడు విష్ణు కధలు 
కనులార! రాధికా కాంతుని గాంచుడీ 
     గుడిలోని కరుగుడో యడుగులార!
ఘ్రాణమా! తులసీ సుగంధ మాఘ్రాణించు 
     మస్తకమా! మ్రొక్కు మాధవునకు 


                           అనుచు లోలోన సకలేంద్రియముల నిన్ను 
                                  గొలవగా వేడు కొందును గోపబాల
                                  సేవ గొనుమయ్య నిరతము శ్రీ ముకుంద!
                                  పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 

ఓ ... మంచిపద్యం. పూజ ఎన్ని ఉపచారాలతో చేసినను అందులో మనసా, వాచా, కర్మణా దృఢమైన భక్తి శ్రద్ధలను కలిగియుండడం అత్యంత కీలకం. నిత్య వ్యవహారమంతయూ భగవత్పూజయే అన్న భావన మనలో దృఢపడాలి ... అని నేను చెప్తుండగా నెచ్చలి వినిపించిన మరో ఆణిముత్యం లాంటి పద్యమిదే -
                                  
ఆత్మాత్వం గిరిజా మతి: చరాచరాః ప్రాణాః శరీరం గృహం 
పూజతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి:
సంచారః పదయో: ప్రదక్షిణ విధి: స్తోత్రాణి సర్వాగిరో 
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ 
                                         - శ్రీ శంకరాచార్యకృత శివమానసపూజ 
ఓ శంభుదేవా! నా ఆత్మయే నీ స్వరూపము. నా బుద్ధియే పార్వతీదేవి. నా ప్రాణములే నీ సహచరులు, లీలా పరికరములు. నా దేహమే నీ దేవళం. విషయభోగములను అనుభవించుటయే నీ పూజ. నా నిద్రయే ధ్యాననిష్ఠ, సమాధిస్థితి. నా రెండు చరణములు సంచరించునదంతయూ నీ ప్రదక్షిణయే. నా నోటి ద్వారా మాట్లాడు మాటలన్నియూ నీ స్తోత్రములే. ఒకటని ఏముందీ, ఎల్లప్పుడూ నేను ఏమేమి కర్మలు చేసెదనో, అవన్నియూ నా ఆరాధనయే అవుతుంది. 



ఇలా సాగిన మా సంభాషణ తనివి తీరనిది. తనతో నాకబుర్లు మరిన్ని మరో టపా లో ... 

19, నవంబర్ 2013, మంగళవారం

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానం ఏమిటంటే ...

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానమిదే -
భారతీ! నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేముందు ఓ పుస్తకంలో చదివిన కబీరుగారి ప్రబోధకీర్తన గురించి చెప్తాను. " సద్గురుకీ భిక్షా మాంగాయిరే బాల" అన్న కీర్తన పూర్తిగా నాకు గుర్తులేదు, కానీ, అందులో వివరించిన అర్ధం, అంతరార్ధం గుర్తుంది. సద్గురుకీ ప్రేమభిక్ష వేడుకోమని, చెప్తూ ఆ భిక్షకు అంగభూతములుగా నాలుగు భిక్షలను కబీరు నిర్వచించెను. మొదటిది గోధుమపిండి. ఇది అంగడికి గాని, పిండిమరకు గాని పోకుండా జోలెనిండ తేవలెను. రెండవది జలము. బావికి గాని, నదీతటాలములకు గాని పోకుండానే ఆనపబుర్ర నిండా తేవయును. మూడవది కట్టెలు. అంగడికి గాని, అడవికి గాని పోకుండా మోపెడు కట్టెలు తేవలయును. నాల్గవది దర్శనభిక్ష. మసీదు, దేవళములకు గాని, సాధు ఫకీర్ల వద్దకు గాని పోకుండా, ఉన్నచోటనే దర్శనం పొందవలెనని, అందుకై సద్గురుకి ప్రేమభిక్ష వేడమనే ప్రబోధం ఆ కీర్తనలో ఉంది. ఇప్పుడు ఈ కీర్తనలో అంతరార్ధం తెలుసుకుందాం. మొదట మూడు అంటే, పిండి, జలము, కట్టెలు రొట్టెను తయారుచేయుటను సూచించును. ఆ రొట్టెను తినినచో దర్శనం, దాని ఫలితంగా ప్రేమ లబింపవలయును. రొట్టెను తయారుచేయుటకు పిండి ముఖ్యపదార్ధం. కాని పొడిపిండిని తినలేం. అందుకే నీరు కావలయును, ఆ నీటితో పిండిని తడిపి, ముద్ద చేసి రొట్టెగా ఒత్తవలెను. అలా పచ్చిరొట్టెను తినలేం, దానిని కాల్చాలి. కాల్చడానికి కట్టెలు కావాలి. ఇలా సక్రమముగా తయారైన రొట్టెను తింటే ఆకలి తీరుతుంది. ఇక్కడ పిండి జ్ఞానం. దానిని భక్తి రసముచే (జలముచే) తడిపి మృదువుగా నొనర్చిన పిమ్మట నిష్కామ కర్మలను కట్టెలతో పక్వమొనర్చి  సక్రమముగా తయారైన ధ్యానమను రొట్టె ఆరగిస్తే ఆధ్యాత్మికక్షున్నివారణమగును. అప్పుడు ఉన్నచోటనే తత్క్షణమునే పరమాత్మ దర్శనమగును. అటుపిమ్మట అంతా పరమాత్మ ప్రేమతత్త్వమే. దానిని సద్గురువునివ్వమని వేడుకో... ఈ కీర్తనబట్టి ఆత్మసాక్షాత్కారానికి భక్తి, ధ్యాన, కర్మ, జ్ఞానమనే నాలుగూ అవసరమేనని అర్ధమౌతుంది. కాకపోతే ఈ నాలుగు యోగాలు అనుష్టించగలిగే శక్తి కారణజన్ములయిన మహాత్ములకే ఉంటుంది. మనలాంటివారికి ఇది అసాధ్యము కావున, ఏ యోగమార్గం ద్వారైన నను పొందవచ్చని గీతలో సూచించాడు. 

జీవకోట్ల సంస్కారములు అనేకవిధములు. జీవుల యొక్క పరిపక్వతా భేదములున్ను అనేక రకములు. వారి వారి భావనలబట్టి ఒక్కొకరికిని ఒక్కొక్కదానిలో ప్రవేశం కల్గుచుండును. కావున నిష్కామ కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం మొదలగు మార్గములు ఏర్పడినవి. దేహాంతరాలయములోనికి ప్రవేశించి ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి ఈ నాలుగుమార్గాలు గోపురద్వారాలుగా ఉన్నాయి. ఈ మార్గాలలో ఏ మార్గం ద్వారైనను నిర్మలబుద్ధితో, నిష్కపట ప్రయత్నముతో ప్రవేశించి గమ్యస్థానమును చేరవచ్చును. అయితే, ఏ యోగమార్గములో ప్రవేశించినను, మిగిలిన మూడు మార్గాలు అందు అంతర్భూతమయ్యే యుండును. ఆంటే అంగభూతములుగా యుండును. ఈ నాలుగున్ను ఒకదానికి ఒకటి అన్యోన్య సంబంధం కల్గియే యుండును. జ్ఞానికి భక్తి, కర్మ, ధ్యానములు అంగభూతములుగా నుండును. అట్లే భక్తునికి కర్మ, ధ్యాన, జ్ఞానములూ; ధ్యానికి భక్తి, కర్మ, జ్ఞానములూ; కర్మయోగికి భక్తి, ధ్యాన, జ్ఞానములూ అంతరభాగములై యుండును. ఎలాగంటే, చీకటి నశించి ప్రకాశము కలుగుటకు దీపమే ప్రధానమైనను, దానికి ప్రమిద, తైలము, వత్తి ఎలాగున అవసరమో, అదేరీతిగా జ్ఞానజ్యోతి అయిన ఆత్మను దర్శించడానికి తక్కిన సాధనములు అవసరమే.
దైవోపాసనచే విక్షేపశాంతియు, శుద్ధమగు కర్మానుష్టానంచే అంతఃకరణశుద్ధియు, ధారణాధ్యానబలంచే సంయమనమును, జ్ఞాననిష్టచే ఆవరణరాహిత్యమును కలుగును. కనుక ఏ యోగమార్గమందైనను ఒకదానికి ఒకటి అనుసంధానింపబడే ఉంటాయి. 
భోజనం చేస్తున్నామంటే, దాని తయారికి బియ్యము మొదలగు పదార్దములు, అగ్ని, జలము, పాత్ర, కట్టెలు మొదలునవి ఎలా ఉన్నాయో, ఏ యోగం అనుసరించినను ఆ యోగంలో తక్కినవి అంగభూతములై ఉంటాయి. ఈ సూక్ష్మం అర్ధమైతే ఏది శ్రేష్టమన్న సందేహం ఉండదు ... అని నా నేస్తం 'హరిప్రియ' చెప్పింది.