http://www.sodhini.com

28, ఫిబ్రవరి 2015, శనివారం

ఒకప్పటి మధురజ్ఞాపకం 'త్రివేణీ సంగమం'

గతపోస్ట్ చదివిన శైలజగారు అడిగిన ప్రశ్నతో నా మనసులో మరుగునపడిన విషయం మరుపుకురాకుండా మరల జ్ఞాపకం వచ్చేటట్లు చేసిన తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ -
కాశీయాత్ర ( ఈ టపా వివరములకై  ఇక్కడ  క్లిక్ చేయండి) గురించి మాస్టారుగారు చెప్పిన మరుసటిదినమే ఈ త్రివేణీసంగమం గురించి కూడా ఆయన వివరించారు. 
మా అత్తయ్యగారు (మాస్టారుగారి భార్య) త్రివేణీ సంగమంలో మూడుసార్లు మునకలేస్తే చాలట కదండీ, ముక్తిపొందడానికి అని మాస్తారుగార్ని అడిగినప్పుడు - 
మూడుసార్లు ఎందుకు ఒక్కసారి మునక వేస్తే చాలు ముక్తి పొందవచ్చు అని నవ్వుతూ ఇలా వివరించారు. 
నాకు గుర్తున్నంతవరకు ఆ పద్యాలు, వివరణ చెప్తాను కానీ, పద్యాలలో ఒకటిరెండు అక్షరదోషాలు, వివరణలో చిరులోపం వుండవచ్చు. మన్నించాలి మరి.

మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేష్కోస్తి పర్ణాశనః 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః 
భస్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూడో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్ 

గంగాది తీర్దములలో మత్స్యకచ్చపాదులు సదా నివచించుచుండును. నాగసర్పం వాయుభక్షణం గలిగియుండును. మేకలు ఆకులనే తినుచుండును. చాతకపక్షికి జలమే ఆహరం. ఎలుకలు కొండగుహలలో నివచించియుండును. శునకం దిగంబరియై బూడిదలో పడియుండును. కొంగ మౌనంతో ధ్యానాధిష్టానముతో నుండును. వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును లేదు. కావున బాహ్యచేష్టలతో భ్రమనొందక పై జెప్పిన వాటియొక్క గుణములతో కూడియుండు అంతరంగనిష్ఠ సంపూర్ణముగా కలిగియున్డవలయును. ఎట్లున్డినను జ్ఞానమొకటి చేతనే జీవుడు తరిస్తాడు. 

మనం ఈ విషయాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. గతంలో చెప్పినట్లుగా పుణ్యక్షేత్ర దర్శనాలతో భక్తి పెరిగి , భగవంతున్ని స్మరిస్తూ చేసే తీర్ధస్నానాలతో పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యఫలం ప్రారబ్ధంలోనికి వచ్చిన తర్వత జననమరణాలు తప్పవు. అంతే తప్ప ముక్తి రాదు అని అంటూ ఇంకా ఇలా వివరించారు -

మన దేహంలో మూడు ప్రధాన నాడులున్నాయి. అవి ఇడా పింగళ సుషుమ్నాలు. ఈ మూడింటి సంయోగస్థలం భ్రూమధ్యం. అందుకే ఈ స్థానమును త్రివేణీ సంగమనియు, మేరు స్థానమనియు యోగులు చెప్పుదురు. కాబట్టే భ్రూమధ్యమున మనస్సును స్థిరంగా నిలిపి చేయు ధ్యానం శ్రేష్ఠం. ధ్యానంచే ఈ త్రివేణీ సంగమందు ఒక్క మునకవేసిన చాలును, ముక్తిపొందడానికి. 

ఇడా భాగీరధీగంగా పింగళా యమునానదీ 
తయోర్మధ్య గతా నాడీ సుషుమ్నాఖ్యా సరస్వతీ  
త్రివేణీ సంగమో యాత్ర తీర్ధ రాజ స ఉచ్యతే 
తత్ర స్నానం ప్రకుర్వీత సర్వ పాపై ప్రముచ్యతే 

ఇడానాడే గంగానది. పింగళనాడి యమునానది. ఈ రెండింటి మధ్యలో ఉన్న సుషుమ్నానాడి సరస్వతీనది. ఈ మూడు నాడులు భ్రూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రంలో సంగమిస్తాయి. దీనినే త్రివేణిసంగమం అని అంటారు. దీంట్లో స్నానం చేస్తే జీవుడు అనేక జన్మలలో తాను చేసిన పాపములనుండి, ప్రారబ్ధములనుండి ఒక్కమాటలో చెప్పాలంటే క్రియలనుండి విముక్తి పొంది ముక్తుడౌతాడు. 
బాగుందండీ, మీరు చెప్తున్న దానిబట్టి నాకు అర్ధమౌతుంది .... బాహ్యముగా ఏమైతే ఉన్నాయో, ఏం చేస్తే తరిస్తామో, అవి అన్నీ మనలోనే ఉన్నాయని, మనలోనే చూసుకొంటే తరిస్తామని. కానీ, కోడికూయక ముందే లేస్తాను, గొడ్లచావిడికి వెళ్లి లక్ష్మిని (ఆత్తయ్యగారు ప్రేమగా పెంచుకుంటున్న ఆవుని) పలకరించి, కాస్త పేడను తీసుకొని వాకిట్లో కల్లాపి జల్లి, పొయ్యి అలికి ముగ్గులెట్టి, కసుపు తుడిచి, స్నానపూజాదికాలు పూర్తయ్యాక పొయ్యి రాజేస్తానా ... అప్పుడు అంటించిన పొయ్యి నడినెత్తిన సూర్యుడొచ్చేంతవరకు వెలుగుతునేవుంటుంది. కాసేపైన స్థిమితంగా కూర్చొనే సమయముండదు. మధ్యాన్నం మీరందరి భోజనాలు అయ్యాక, కాస్త తిని, వత్తులు చేసుకుంటునో, పప్పు విసురుకుంటునో, బియ్యం ఏరుకుంటునో, ఈనో పేనో చూసుకుంటునో ...  ఆ సమయంలో కష్టసుఖాలు చెప్పుకోవడానికో, కాలక్షేప కబుర్లు చెప్పుకోవడానికో వచ్చే ఇరుగుపొరుగువారితో మాట్లాడుతూ చిన్న చితక పనులు చక్కబెట్టుకునేసరికి సాయంత్రమైపోతుంది. ఇక మరల మొదలు ఇల్లు ఊడ్చడం, వంటావార్పులు, వడ్డనలు. మీరందరూ పడుకున్న తర్వాతే నా నిద్ర. అంతవరకు పట్టుమని పదినిముషములైన నడుం చేరేయడానికి లేదు. మరి నాలాంటిదానికి కుదురుగా కూర్చోవడం, జపమో తపమో ధ్యానమో ఎలా అవుతుంది చెప్పండి... 
మరి నాలాంటి వారు తరించే మార్గమే లేదా? అని అత్తయ్యగారు అనగా -
ఓహో ... ఎందుకు లేదూ,  నన్ను చక్కగా అర్ధం చేసుకొని నాకు అనుగుణంగా మసులుకుంటున్నావు. అలుపు తెలవనివ్వని చిరునవ్వుతో ఓర్మితో అందరితో ఆత్మీయంగా, అందరికీ ఆసరాగా వుంటున్నావు. నీకు సాధ్యమయ్యేంతలో బీదవార్ని ఆదరిస్తున్నావు. ఓ ఇల్లాలిగా గృహస్థుధర్మమును చక్కగా నిర్వర్తిస్తున్నావు. నీ ఈ ధర్మవర్తనంకు మరింత భక్తివిశ్వాసములు జతైతే ఈ జన్మలోనో, మరుజన్మలోనో తప్పక తరిస్తావు... అని మాస్టారుగారు చెప్తుండగా -
అది కాదండీ, మరి త్రివేణీసంగమంలో మునకలేస్తే ముక్తివస్తుందన్న పెద్దలమాట అసత్యమా అన్న ఆమె ప్రశ్నకు... 
లేదు లేదు, పెద్దలమాటలు, శాస్త్రవచనాలు ఎప్పటికీ అసత్యం కాదు. కాకపోతే వాటి అంతరార్ధమును గ్రహించి పాటించాలి. లేదా వాటిపై అణుమాత్రమైన అనుమానం లేకుండా అపారమైన భక్తివిశ్వాసములుంటే, దానికి పూర్వజన్మసుకృతం తోడైతే తప్పకుండా ఈజన్మలోనే తరిస్తాం. అది ఎలాగంటే ... 
అంటూ ఓ చక్కటి కధను, అంతరార్ధమును వివరించారు. ఆ వివరాలు తదుపరి టపాలో ... 

15, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఈ మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైందీ ???

మహా మృత్యుంజయ మంత్రం:
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
 ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //

అర్ధం :-
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక! 

ఉదయం తెలిసినామె మా యింటికి వచ్చారు. మాటల మద్యలో...  ఈ మద్య ఒకరి సూచన ప్రకారం 'మహా మృత్యుంజయ మంత్రం' రోజూ పదకొండుసార్లు చదువుతున్నానండి. కానీ, కొన్ని సందేహాలున్నాయండి. ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదండీ... మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియడం లేదు. అది అడుగుదామనే వచ్చానండీ ... అన్న ఆమెకు, నా అవగాహన మేరకు నేనిచ్చిన బదులిది - 

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదండీ, పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా? 
ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ. 
ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది. 
ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన  ఎలాగుండాలంటే  - 
జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం. 
మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం.  ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -
పంచభూతాత్మకుడు :- శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.  
త్రయంబకుడు :- శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు. 
నామము :- శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు. 
విభూతిదారుడు :- సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం. 
త్రిశూలం :- సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక  శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.  
నాగాభరణుడు :- సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు. 

శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి  ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం. 
  
 శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.  
తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది. 
మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను. 
ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం. 

విన్నపం :- ఆమె ప్రశ్నలకు నేను విన్న, చదివిన వాటివలన నా అవగాహన మేరకు నాకు అన్పించినది ఇలా చెప్పాను. ఈ టపా చదివినవారు ఇందులో ఏమైనా సవరణలు గానీ, ఇంకా ఏమైనా సూచనలు గాని ఉంటే తెలపగలరని ఆశిస్తున్నాను. 


16, డిసెంబర్ 2014, మంగళవారం

శివయ్యకు చలా?????

నిన్న ప్రక్కింటావిడ, వాళ్ళ అమ్మాయి హారిక మా ఇంటికి వచ్చారు. ఈరోజు హారిక పుట్టినరోజండి, అందుకే తెల్లవారుఝామునే శివాలయంకు వెళ్లి అభిషేకం చేశామండి ... అని చెప్తూ, తెల్లవారక ముందే లేచి, చన్నీళ్ళు స్నానం స్వాములు ఎలా చేస్తారో గానీ, ట్యాంక్ లో నీళ్ళతో స్నానం చేసేసరికి వణికిపోయానండి చలితో, అని ఆవిడ చెప్తుండగా ... హారిక నవ్వుతూ, మరి నీళ్ళను , ఫ్రిడ్జ్ లో పాలును శివలింగం మీద పోస్తున్నప్పుడు శివునికి చలెయ్యదా ఏమిటీ? అని ఆ అమ్మాయి అంటే, శివయ్యకు చలా????? అని నేను అనుకుంటుండగా చాలా సంవత్సారాల క్రితం ఓ మాసపత్రికలో చదివిన ఓ భక్తుని చమత్కారపు భావన గుర్తుకొచ్చింది.
ఆ భక్తుని చమత్కార భావన ఇదే -
ఇదెక్కడి విపరీతమయ్యా స్వామీ! నెత్తిమీద చల్లని చంద్రుణ్ణి పెట్టుకున్నావ్. అక్కడితో ఆగావా? అంతకన్నా చల్లనైన గంగమ్మను నెత్తికెక్కించుకున్నావు. ఆపైన తాకితే జివ్వుమనిపించే చల్లని పాముల్ని నగల్లా అలకరించుకున్నావు. అవన్నీ చాలవన్నట్లు మంచుకొండ కూతుర్ని ప్రక్కన కూర్చోబెట్టుకున్నావు. నీ చోద్యపు చిన్నెలకు అంతెక్కడ? గజగజలాడించే కార్తిక మార్గశిరమాసాలలో బ్రహ్మీ ముహూర్తము నుంచే ధారపాత్ర కింద తిష్టవేస్తావు. అభిషేకం పేరుతో ఎప్పుడూ నీళ్ళక్రింద నానుతుంటావు. నీ భక్తులూ నీకు తగినవారే, ఈ శీతలోపచారాలకు తోడు నీ ఒళ్ళంతా చల్లని విభూది చందనాలను పూస్తూ ఉంటారు. అయినా నీకు చలెయ్యదా మహానుభావా? అని ఓ భక్తకవి శివున్ని ప్రశ్నించాడు. అంతలోనే ఆయనకే సమాధానం తట్టి, 'నా అమాయకత్వంకానీ, నీకు చలేమిటయ్యా? తాపత్రయాలతో సలసల కాగిపోతున్న నా హృదయంలోనే కదా నీవున్నావు' అన్నాడట. 

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

గృహస్థులకు బ్రహ్మచర్యమా ???

గత టపాను చదివిన శైలజగారు, గృహస్థులకు బ్రహ్మచర్యం వర్తించదేమో, గృహస్థులకు బ్రహ్మచర్యం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. 
ఆ ప్రశ్నకై నేను విని, చదివి తెలుసుకున్నంతలో ఈ చిరు వివరణ - 

ముందుగా బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం -

బ్రహ్మభావే మనశ్చారో బ్రహ్మచర్యం పరం తధా 
బ్రహ్మ భావనమందు మనస్సును సర్వదా చరింప జేయుటయే బ్రహ్మచర్యం. 

బ్రహ్మణీ చరతీతి బ్రహ్మచారీ, తస్యభావః బ్రహ్మచర్యం
పరబ్రహ్మయందు చరించువాడు బ్రహ్మచారి, వానిభావం బ్రహ్మచర్యం. 

ఇక సామాన్యముగా ఆలోచిస్తే -

మైధునస్యాప్రవృత్తిర్హి మనోవాక్కాయకర్మణా /
బ్రహ్మచర్యమితిప్రోక్తం యతీనాం బ్రహ్మచారిణామ్ //
మనోవాక్కాయకర్మలచే స్త్రీ సంబంధ విషయములనుండి నివృత్తి యేది కలదో అదే బ్రహ్మచర్యం. ఇది యతులకును బ్రహ్మచారులకును వర్తిస్తుంది. 

అయితే -

మానవునికి త్రివిధ దేహములు (స్థూల సూక్ష్మ కారణ) యున్నట్లే బ్రహ్మచర్యం కూడా మూడు విధములై యున్నది. 

తద్భేదం త్రివిధం వక్ద్యే స్థూలం సూక్ష్మం చ కారణమ్ /
వ్యాయామః ప్రధమః ప్రోక్తః మనోనైర్మల్యకం తధా //
ఆత్మశుద్ధిన్త్రుతీయా చ మోక్షస్సిద్ధ్యతి తే నఘ /
త్రివిధం బ్రహ్మచర్యం చ సాధనీయం సదా జనై: //

బ్రహ్మచర్యం కూడా స్థూలం, సూక్ష్మం కారణం అని మూడు విధములై ఉంది. స్థూలబ్రహ్మచర్యమును వ్యాయామముద్వారా, సూక్ష్మబ్రహ్మచర్యమును మనోనిర్మలత ద్వారా, కారణబ్రహ్మచర్యమును ఆత్మశుద్ధి ద్వారా పరిశుద్ధత గాంచును. 

పైన చెప్పిన వ్యాయామ, మనోనిర్మలత, ఆత్మశుద్ధులు ఎలా కల్గుతాయంటే -

యోగాసనం చ వ్యాయామే ప్రాణాయామశ్చ మానసే /
పరమాత్మ స్వరూపస్య విదుర్జ్జ్ఞానం తృతీయకే //

వ్యాయామ బ్రహ్మచర్యంలో యోగాసానాదులున్ను, మానస బ్రహ్మచర్యంలో ప్రాణాయామాదులున్ను, ఆత్మశుద్ధి బ్రహ్మచర్యంలో పరమాత్మ స్వరూపజ్ఞానమును కల్గుతాయి. 

మరల ఈ బ్రహ్మచర్యమును మూడువిధములుగా పేర్కొంటారు. అదేమిటంటే -

1. మానసికం :-  మనస్సున ఎలాంటి విషయ సంకల్పములు లేకుండుట. 
2. వాచికం :- వాక్కుతోను విషయాభిలాష ప్రయుక్తాలాపములు లేకుండుట. 
3. కాయికం :- క్రియారూపేణా శరీరముతో సంబంధం లేకుండుట. 

అటులనే ఈ బ్రహ్మచర్యమును మరో మూడువిధములుగా శాస్త్రము చెప్పుచున్నది. అవి ఏమిటంటే - 

1. నైష్టికము :- 
                    జన్మించిన మొదలుగు మరణపర్యంతం ఎలాంటి విషయ దోషములు లేకుండా ఆచరింపబడు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - శుకమహర్షి, సనకాదులు, ఆంజనేయుడు, గార్గి మరియు సులభాయోగినులు భీష్ముడు, మొదలగువారు. కలియుగమున రమణమహర్షి, అరవిందులవారు తదితరులు. 
2. గార్హస్థ్యం :- 
                   ఋతుకాలమునందు మాత్రమే విషయములయందు ప్రవర్తించి ధర్మబద్ధుడై అనుష్టించు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - జనకుడు, చూడాలా, శిఖిధ్వజ, మదాలస మొదలగువారు. 
3. వైదురము :- 
                      భార్యవియోగము లేక భర్తవియోగం కల్గిగాని, లేక భార్యాభర్తలకు ఆత్మశుద్ధి గలిగి విషయములలో విరక్తి కలిగి బ్రహ్మచర్యము ఆచరించురో అది విధురబ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - యాజ్ఞవల్క్య మైత్రేయీ, విశ్వామిత్రుడు మొదలగువారు. కలియుగమున గురునానక్, శ్రీకృష్ణచైతన్యాదులు కలరు. 

అసలు బ్రహ్మచర్యమునకు ఆహరమునకు సంబంధం ఏమిటంటే -

ఆహరస్సత్త్వజనకం కరుణా భక్తివర్ధినీ /
బ్రహ్మభావనయా స్వస్మిన్ స్వయం బ్రహ్మాత్మనిశ్చయః //

సత్త్వగుణాభివర్ధకమగు సాత్త్వికాహారం సేవించుటయు బ్రహ్మచర్యమే యగును. భక్తిని వృద్ధి చేయు కరుణయు బ్రహ్మచర్యమే. స్వాత్మయందు బ్రహ్మభావనయు బ్రహ్మచర్యమే. 

మరి గృహస్థుల విషయంలో ఈ బ్రహ్మచర్యమును పరిశీలిస్తే - 

ఏ విధమైన వ్రతములు గాని, యజ్ఞాదిక్రియలుగాని, మండలం రోజుల పూజాదీక్షలుగాని చేసినప్పుడు బ్రహ్మచర్యం గృహస్థులు పాటించడం ఓ నియమంగా పెట్టుకుంటారు. 
కానీ, గృహస్థు బ్రహ్మచర్యమంటే - 

కాయేన మనసా వాచా నారీణాం పరివర్జనమ్ /
ఋతౌ భార్యాం వినా స్వస్య బ్రహ్మచర్యం తదుచ్యతే //
మనోవాక్కాయ కర్మాదులచే పరస్త్రీలతో సంసర్గం లేకుండుట, ఋతుకాలంలో మాత్రమే స్వపత్నితో జేరుటను గృహస్థ బ్రహ్మచర్యమనబడును. అటులనే మనోవాక్కాయ కర్మాదులచే పరపురుషచింతన లేనిదై, ఋతుకాలమందు మాత్రమే సంతానాభిలాషగలదై పతితో చేరు స్త్రీయు బ్రహ్మచారిణియే యగును.  

ఋతుకాలాభిగామీ యః స్వదారనిరతశ్చయః /
స సదా బ్రహ్మచారీ హి విజ్జ్ఞెయస్స గృహశ్రమీ //
ఋతుకాలమందు మాత్రం స్వభార్యయందు చేరు గృహస్థుడు ఎల్లప్పుడును బ్రహ్మచారియే అగును. అలాంటి నారీమణియు బ్రహ్మచారిణియే యగును.  

ఇక శాస్త్రము తెలుపుతున్న ఋతుకాల వివరణ -

ఋతుస్స్వాభావికః స్త్రీణాం రాత్రయః షోడశస్మృతాః /
చతుర్భిరితరైస్సార్ధమహోభిస్సద్విగర్హితై: //
స్త్రీలకు స్వాభావికముగా పదునారు దినముల వరకు ఋతుకాలము. అందు మొదటి నాలుగు దినములు వర్జనీయములు. 

తాసామాద్యాశ్చతస్రస్తు నిందితైకాదశీచ యా /
త్రయోదశీ చ శేషాస్తు ప్రశస్తా దశ రాత్రయః //
ఈ ఋతుకాలదినములలో మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ రాత్రియు నిందితములు. మిగిలిన పదిరాత్రులు ప్రశస్తములు. 

నింద్యాస్వష్టాసు చాన్యాసు స్త్రీయో రాత్రిషు వర్జయన్ /
బ్రహ్మచార్యేవ భవతి యత్ర తత్రాశ్రమే పసన్ //
పైన చెప్పిన నిషిద్ధములైన మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ దినములను, అమావాస్య పున్నమ వ్రత దినములను వదిలిపెట్టి తక్కిన రాత్రుల పత్నితో కూడినవాడు గృహస్థాశ్రమము నందున్నను బ్రహ్మచారియే యగును. అలాంటి స్త్రీయును బ్రహ్మచారిణియే యగును.  

బ్రహ్మచర్యం అవలంబించడం వలన ప్రయోజనమేమిటంటే - 

ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞా శ్రీశ్చ మహద్యశః /
పుణ్యం చ మత్ప్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా //
బ్రహ్మచర్యముచే పూర్ణాయువు, తేజస్సు, దేహేన్ద్రియములకు బలం, ఓజస్సు, ప్రజ్ఞా, జ్ఞానసంపద, యశస్సు, పుణ్యం, భగవత్ప్రీతియు కలుగును. 

శాన్తిం కాన్తిం స్మృతిం జ్ఞానమారోగ్యం చాపి సన్తతిమ్ /
య ఇచ్ఛతి మహద్ధర్మం బ్రహ్మచర్యం చరేదిహ //
ఈ జగత్తున శాంతి, కాంతి, స్మృతి, జ్ఞానం, ఉత్తమ సంతానం కోరువారెల్లరు సర్వోత్కృష్ట ధర్మమైన బ్రహ్మచర్యవ్రతమును తప్పక పాటించవలెను.


8, సెప్టెంబర్ 2014, సోమవారం

శుద్ధ ఆహారం (ద్వితీయ భాగం)





ఆహారశుద్ధి గురించి, వాని నియమములు గురించి, అలానే మాంసాహారం హింసాపూర్వక ఆహారమయినచో, శాకాహారంలో కూడా జీవముంటుంది కదా, మరి అది ఎందుకు హింసాపూర్వక ఆహరం కాదు? అలానే సాత్త్విక ఆహారం భుజించిన వారంతా ఎందుకు ధ్యానులు, జ్ఞానులు కాలేదని శైలజగారు గతంలో నేను పోస్ట్ చేసిన "శుద్ధ ఆహరం"  చదివి తన సందేహాలను అడిగారు. 


నాకు తెలిసినంతవరకు ఆ సందేహాలకు వివరణ ఇక్కడ ఇస్తున్నాను. 

అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృతచిత్తానాం ధర్మస్సమ్యజ్న భాసతే //
ఆహారదోషంచే సర్వదా చిత్తమునకు కల్మషం కలుగును. కల్మషచిత్తం కలవారికి ధర్మరహస్యమైన జ్ఞానం ప్రకాశింపదు. 

అందుకే ఆధ్యాత్మిక సాధకులకు ఆహరశుద్ధి, ఆహారనియమములు తప్పనిసరి. 

మాంసాహారమునకు శాకాహరమునకు గల భేదం -

శాకాదులయందు జీవశక్తి యున్నప్పటికీ అవి జడములు. వాటికి ఇంద్రియములు లేవు. ఇంద్రియములు లేకపోవడం వలన వాటికి సుఖదుఃఖములు కలుగుటకు అవకాశం లేదు. 
జంతువులు మనుష్యులవలె స్త్రీపురుష సంయోగంచే నుత్పత్తి యగును గాని, సస్యముల వలె నుద్భిజ్జములు కావు. సస్యవర్గములు భూమి, నీరు మొదలగువాటి సహాయముతో పాటు, ఎక్కువగా సూర్యశక్తిని గ్రహించి, సూర్యశక్తిచే వృద్ధి అగుచున్నందున సూర్యుని యందున్న శక్తి సస్యాదులయందధికముగా యున్న కారణంచే వాటిని భుజించువారికి శుద్ధత్త్వం కలుగును. సత్త్వగుణం అలవడును. సూర్యుడు తమస్సును నాశము జేయునట్లు, శాకాహారంచే తమోగుణం నాశన మగును. 

ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధి: సత్త్వశుద్ధౌ ధ్రువా స్మృతి: /
స్మృతిలాభే సర్వగ్రంధీనాం విప్రమోక్షః //
సాత్త్వికమైన శుద్ధాహారంచే మనఃశుద్ధియు, మనఃశుద్ధిచే దృఢమైన ప్రజ్ఞయు గల్గును. దృఢప్రజ్ఞచే సర్వగ్రంధులు నిశ్శేషముగా నాశంపొందును. 

ద్యానమూ, జ్ఞానమూ ఎప్పుడు అలవడతాయంటే - 

మానవునికి స్థూల, సూక్ష్మ, కారణలనెడి దేహములు కలవు. శుద్ధమైన సాత్త్వికాహారముచే స్థూలదేహము ఇంద్రియములు మాత్రమే శుద్ధములగును. సూక్ష్మ దేహానికి ఈ ఆహారం కొంతమాత్రమే సహాయపడును. కరుణ, శాంతం, సత్యం, అధ్యయనం, ప్రేమ, దైవభావం, సమత్వం, ఏకాత్మభావనం, దేవోపాసన  బ్రహ్మచర్యం గురు, దేవ, పూజయుక్తమైన సాత్త్వికాహారం ప్రాణాయామాది యోగములచే స్థూలదేహ శుద్ధి గలుగును. అటుపై కారణదేహశుద్ధతకు పై రెండు శుద్ధతవలన జ్ఞానం అలవడి పవిత్రమగును.  

సాత్త్వికాహారులందరూ ఎందుకు జ్ఞానులు కాలేకపోతున్నారంటే - 

ఆహరశుద్ధి అంటే తీసుకున్న ఆహరం సాత్త్వికముగా ఉంటే చాలదు. ఆ ఆహారం వచ్చిన మార్గము కూడా సత్యముగా ఉండవలయును. సత్యముగా సంపాదించిన ఆహారమును యుక్తముగా, నియమముగా దైవారాధన చేసి భుజించవలెను. 
శ్రీశంకరభగవత్పాదుల వారు చెప్పినట్లు -
జిహ్వతో భుజించెడు ఆహారమే ఆహరం కాదు. కర్ణ, త్వక్, చక్షు, ఘ్రాణముల ద్వారా స్వీకరించేది కూడా ఆహారమే అవుతుంది.
ఇక ఆహారశుద్ధి యొక్కటే చాలదు, ఆత్మశుద్ధియు కలిగి యుండవలయును. అలానే ఆత్మశుద్ధి గలిగిన చాలదు, ఆహారశుద్ధియు కలిగి యుండవలయును. పైన చెప్పినట్లు స్థూల సూక్ష్మ దేహాలలో శుద్ధతా లోపము వలననే కొందరికి శుద్దాహారము కలిగియుండినను ఆత్మజ్ఞానం కలుగకపోవుటకును, అలానే ఆత్మ శుద్ధమైనది జ్ఞానమైనదని విచారణచేత తెలుసుకొనినను ఆత్మజ్ఞానం అనుభవమునకు రాకపోవుటకున్ను కారణమని గ్రహించాలి. కావుననే "శుద్ధిద్వయం మహత్కార్యం దేవానామపి దుర్లభం" అని శాస్త్రం వక్కాణిస్తుంది. 
 
ఈ సూక్ష్మ కారణ దేహములను శుద్ధపరుచుట తెలియకపోవుటచేతనే స్థూలమైన సాత్త్వికాహారమును భుజించువారందరిలో ధ్యానం, జ్ఞానం అలవడడం లేదు. 

ఇక గృహస్థులు ఎంత హింసారహితముగా ఉందామనుకున్నను అనివార్యమైన ఐదు విధములైన హింసలు వచ్చుచుండును. 

అవి - 

పంచసూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యుపస్కరః /
కండనీ చోదకుంభశ్చ బధ్యతే యాస్తు వాహయన్ //

1. చుల్లీ :- కట్టెలు మొదలగువాని వలన వండునప్పుడు కట్టెలలో గల చెదలు మొదలగు క్రిములు నాశం. 
2. పేషణి :- విసరుచున్నప్పుడును, నూరుచున్నప్పుడును కలిగెడు ప్రాణహింస. 
3. ఉపస్కరః :- ఇతర గృహకృత్యములు చేయునప్పుడు కలిగెడు ప్రాణహింస. (బూజులు దులుపుట, తుడుచుట, చిమ్ముట, అలుకుట మొదలగు గృహ శుభ్రత పనులు, అలానే సస్యములలో నాగలితో దున్నుతున్నప్పుడు, పారతో చెక్కుతున్నప్పుడు కొన్ని క్రిములకు కలుగు ప్రాణహింస)
4. కండనీ :- ధాన్యాదులు దంచుతున్నప్పుడు కలుగు హింస. 
5. ఉదకుంభః :- నీరు మరిగించినప్పుడు కలుగు ప్రాణహింస. 

అందుకే ప్రతిదినం పంచయజ్ఞపరాయణులై యుండవలయునని మనుస్మృతి చెప్తుంది. 
పైన తెలిపినవి లేకపోతే మానవునికి మనుగడ కష్టం కాబట్టి,  ఇటువంటి అనివార్యమైన హింసల నివృత్తి కొరకు పంచయజ్ఞములు విధింపబడినవి. 

అవి - 

అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణమ్ /
హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో తిధిపూజనమ్ // 

1. బ్రహ్మయజ్ఞము :- వేదోపనిషద్భగవద్గీత పారాయణము లేదా ప్రణవాది మంత్రజప భగవత్కీర్తన పూజాదులలో ఏదో ఒకటి ఆచరిస్తూ భోజనం చేయడం. 
2. పితృయజ్ఞము :- తర్పణాదులచే పితరులను తృప్తి పరచుట. 
3. దైవయజ్ఞము :- అగ్ని యందు వ్రేల్చుహోమము (వైశ్వదేవము). 
4. భూతయజ్ఞము :- కుక్క, పిల్లి, కాకి మొదలగు చిరుప్రాణులకు ఆహారమిడుట. 
5. మనుష్యయజ్ఞము :- అతిధిసత్కారం (బ్రహ్మచారులకు, సన్యాసులకు, సాధువులకు, తీర్ధయాత్రికులకు పూజ్యభావంతో భోజనం పెట్టుట, రోగులు, అంగహీనులు, నిస్సహాయులకు కరుణతో అన్నదానం చేయుట. 

ఆహార నియమములు -

హితం మితం సదాశ్నీయాద్యత్సుఖే నైవ జీర్యతే /
దాతు: ప్రకుప్యతే యేవ తదన్నం వర్జయేద్యతి: /
ఎల్లప్పుడూ ఆహరం మితంగాను, శుద్ధమైనదిగాను, ప్రీతికరమైనదిగాను ఉండవలెను. సుఖముగాను త్వరితముగాను జీర్ణమగునట్టి ఆహారమునే భుజించవలయును. ధాతుప్రకోపం కల్గించునట్టి అన్నమును భుజించరాదు. 

అన్నమని చెప్పుటచే బియ్యపు అన్నము అని అనుకోకూడదు. 'అద భక్షణే' అన్న దాతువునుండి అన్న శబ్ధమేర్పడినది. కనుక భక్షించున దంతయు అన్నమనియే భావించవలెను. 

ద్వౌ భాగౌ పూరయేదన్నైస్తోయేనైకం ప్రపూరయేత్ /
మారుతస్య ప్రచారార్ధం చతుర్ధమవశేషయేత్ //
సాధకులు అందరూ ఉదరమును సగభాగము అన్నము చేతను, పాతికభాగము జలము చేతను నింపి, మిగిలిన పాతిక భాగము గాలి సంచారార్ధముగా నుంచువారు బ్రహ్మనిష్ఠ యందు సర్వదా యుండగలరు. వీరికి వ్యాధులు రావు. 

సాయం ప్రాతర్మనుష్యాణామశనం దేవనిర్మితమ్ / 
నాన్తరం భోజనం దృష్టముపవాసీ తధా భవేత్ //
మనుష్యులకు దైవనిర్మితమగు భోజనము - ఉదయము, సాయంకాలము రెండుసార్లు మాత్రమే యేర్పడినది. అనగా మధ్యాహ్నం లోపల ఒకసారియు, సాయంకాలమున ఒక పర్యాయము మాత్రమె యుండవలయును. అట్టివారికి ఎలాంటి వ్యాదియు ఉండదు. ఈ రెండువేళల తప్ప ఇతర సమయములలో నేమియూ భుజింపనివారు ఉపవాసఫలమును పొందుదురు. 

మోక్షధర్మేషు నియతో లఘ్వాహారో జితేన్ద్రియః /
ప్రాప్నోతి బ్రాహ్మణః స్థానం తత్పరం ప్రకృతేర్ధ్రువమ్ //
మోక్షమార్గమందు ప్రవర్తించువారు నియమశీలులై, యుక్తాహారులై జితేన్ద్రియులై యుండినచో ప్రకృతికి పరమై, శాశ్వతమై యుండు పరబ్రహ్మస్థానమును పొందుదురు. 

ఆహారశుద్ధౌ చిత్తస్య విశుద్ధిర్భవతి స్వతః /
చిత్తశుద్ధౌ క్రమాత్ జ్ఞానం త్రుట్యన్తి గ్రంధయస్పుటమ్ //

15, ఆగస్టు 2014, శుక్రవారం

జయహో ... ఈ రోజుకి ఈ బ్లాగ్ కు నేనే నాయకిని.

హాయ్ ... 

ఈ రోజుకి ఈ బ్లాగ్ కు నేనే నాయకిని. 
నా పేరు "శ్రీ మాన్వి". 
వయస్సు ఒక సంవత్సర రెండు నెలల ఇరవైఏడు రోజులు. 

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలనిపించి మా అమ్మమ్మ బ్లాగ్ కు వచ్చేసాను. 


                                             "భారతదేశం నా మాతృభూమి" 

రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం 
బ్రహ్మరాజర్షిరత్నాడ్యాం వందేభారతమాతరం 

(రత్నాకరుడైన సముద్రుడు ఎవరి పాదములను కడుగుతున్నాడో, ఎవరికీ హిమాలయము కిరీటమై ప్రకాశిస్తుందో, బ్రహ్మర్షి రాజర్షులనెడి పుత్రరత్నములతో ఎవరు ప్రకాశిస్తూ ఉన్నారో ... అట్టి పవిత్ర భారత నా మాతృభూమికి వందనం)

భారతభూమి జగన్మాత యొక్క సాక్షాద్రూపమే. అది ఎలాగంటే తండ్రి అయిన దక్షునిచే అవమానింపబడి అగ్నికాహుతి అయిన సతీదేవి దేహాన్ని ఎత్తి పరమశివుడు ప్రళయతాండవం చేస్తే, ఆ దేవి శరీరావయవాలు ఏబైరెండు చోట్ల పడ్డాయి. అవి మన భారతదేశంలోనే ఎబైరెండు శక్తిపీఠాలుగా విలసిల్లుతూ మన భూమి ఘనతను వెల్లడిస్తుంది. సముద్రమును వస్త్రముగా, పర్వతములను స్తనమండలముగా గలిగిన విష్ణుపత్నిగా భారతమాతను మన ఋషులు శ్లాఘిస్తున్నారు. మన మాతృదేశం కేవలం ఒక మట్టిముద్దకాదు, ఆమె భవాని, మహిషాసురమర్ధిని, భారతి. ఆమె కోటి కోటి జనమనో హృదయాలలోని ఇచ్ఛాశక్తుల సజీవ సాక్షాత్కారం. ఆమె సాక్షాజ్జగజ్జనని. పరాశక్తి యొక్క సజీవావిష్క్రుతి అని అరవిందులు వారుకీర్తించారట. ఈ విషయాలు అన్నీ మా అమ్మమ్మ చెప్తుంటుంది. అందుకే - 
                   
                    "నేను భారతీయురాలిగా జన్మించినందుకు గర్విస్తున్నాను"

ఏ ప్రపుల్ల పుష్పముల నీశ్వరునకు 
పూజ సల్పితినో యిందు పుట్టినాడ 

ఇంతటి మహనీయగడ్డ పై నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్న (అనూష, లతీష్) లకు వందనములు. 


ఈ టపా ఇప్పుడు నాకు అర్ధం కాకపోయినను భవిష్యత్తులో నాకు స్ఫూర్తినిస్తుందనే ఆకాంక్షతో నా పేరిట మా అమ్మమ్మ ఈ పోస్ట్ ను పెట్టింది. 

మరోసారి -

అందరికీ 

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!


                                                                                         - మీ  శ్రీ మాన్వి 


5, జూన్ 2014, గురువారం

ఇది నా అంతరంగమధనం - భగవంతుడు ఉన్నాడా?

సాధారణంగా కొందరు కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు లేనే లేడు, దేవుడే ఉంటే నాకిలా ఎందుకు జరుగుతుంది... అని అనుకోవడం జరుగుతుంది. ఇలా అనుకునేవారిలో నేనూ వున్నాను. కొద్దినెలల ముందు కొన్ని విపత్కర పరిస్థితులలో భగవంతుడు ఉన్నాడా అని అనుకున్నాను. 
జీవితంలో సుఖదుఃఖాలు, లాభనష్టాలు, గౌరవవమానాలు ... ఇటువంటివి సహజం. నా జీవితంలో కూడా ఇవన్నీ వున్నాయి. కానీ, దేనికీ పొంగని కృంగని సరళమైన జీవనగమనం నాది. మా నాన్నగారి నుండి ఇది నాకు అలవడింది. ఏ స్థితిలో ఉన్నను, ఏనాడు 'రామ'నామం మరువలేదు. భగవంతునిపై విశ్వాసం వీడలేదు. కానీ; గత కొద్దిమాసాలుగా కొనసాగుతున్న సమస్యల పరంపర, ఊహించని సంఘటనలు, నమ్మకద్రోహాలు మనస్సుని కల్లోలపరుస్తుంటే - భగవంతుడే లేడని, దేవుడన్నది ఒక ఊహేనని కొంతసమయం ఆవేదనతో అనుకున్నాను. 

అయితే అదే సమయంలో మా మాస్టారుగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యుడు, మందులు ఎలా అవసరమో అలానే కష్టస్థితిలో భగవంతుని స్మరణ అంతే అవసరం. అలాగని ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందులు అవసరం లేదని, సుఖాల్లో భగవంతున్ని విస్మరించడం కూడా తప్పే. కష్టాలు వచ్చేసరికి భగవంతుని కృప లేదనుకోవడం చాలా పొరపాటు. భగవంతుని కృప నిరంతరం వుంటుంది. అనుకూలతలో వుందని, ప్రతికూలతలో లేదని అనుకోవడం మనోదుర్భలత్వము. మన నమ్మకాలే మన వాస్తవాన్ని సృష్టించుతాయి. లౌకిక ప్రపంచం ఆపదలతో కూడుకున్నదే. ఆ ఆపదలకు ఆవేదన పడేకంటే ఓర్చుకొని పారమార్ధిక జ్ఞానం వైపు పురోగమించడమే మన పని. 
మాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది అని అంటుంటారు. ఏమీ రాకపోతే ఈ శరీరం భూమి మీదకు ఎందుకు వస్తుంది? ఆ అనుభవాలు పొందింప జేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతుల్ని చేస్తాడు. చెరకుగెడ గెడలాగే వుంటే రసం రాదు, దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే రసం వస్తుంది. అనేక కష్టనష్టాలకు గురి అయితే గాని దానిలో నుండి అమృతత్వం రాదు అన్న బాబా మాటలు మరువకండి. 
శ్రీమద్భాగవతము లో చెప్పినట్లుగా -
యస్యాహమనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనైః అన్నది శ్రీభగవానువాచ. (నేను ఎవరిని అనుగ్రహించదలచుకున్నానోవారి సంపదలను, గౌరవాదులను మెల మెల్లగా హరిస్తాను). 

లౌకికమునందు మునిగిపోయినప్పుడు భగవానుడు మనయందు తన అనుగ్రహంను ప్రసరింపజేయ తలచి మనకు మోహం కల్గించే వాటిని, అహం పెంచేవాటిని హరించి మనల్ని తనవైపుకి త్రిప్పుకుంటాడు. 
నిజానికి ఈ ఆపదలు మనకు ఎంతగానో మేలు చేస్తున్నాయి, భగవంతున్ని స్మరించుటకు వీలు కల్పిస్తున్నాయి. 
మోక్షమును ప్రసాదించే నీ దర్శనం కలుగునట్లుగా ఈ విపత్తులన్నియూ మరల మరల కలుగవలెనని (విపదః సన్తు తాః శశ్వత్తత్ర తత్ర జగద్గురో. భవతో దర్శనం యత్స్యాదపునర్భవదర్శనమ్కోరుకున్న అనన్యభక్తి కుంతీ మాతది. 
బాల్యం నుండియే అనేక ఆపదలను ఎదురైనను ఆవేదన చెందక అచంచల భక్తితో హరినామ స్మరణం ద్వారా ప్రహ్లాదుడు ఏం పొందాడో గమనించండి. 

తత్తేऽనుకమ్పాం సుసమీక్షమాణో భుఞ్జాన ఏవాత్మకృతం విపాకమ్
హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేత యో ముక్తిపదే స దాయభాక్ //
(కర్మ పరిపాకాన్ని అనుభవిస్తూ, నీ దయ ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ, శరీర మనో వాక్కులతో నీకు నమస్కారం చేస్తూ ఎవరు బతుకుతారో అటువంటి వారు నీ దయను పొంది ముక్తిని పొందుతారు) భక్తుని యొక్క దృక్పదం ఈరీతిలో ఉండాలని చెప్తూ చివరగా ఓ మాట చెప్పారు - "పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సాధన చేసుకోండి, ప్రతికూలంగా వున్నప్పుడు వైరాగ్యం పెంచుకోండి". 
పై మాటలు గుర్తుకురావడంతోనే నా అవివేకంకు ఆవేదన కల్గింది. 

అలానే భగవంతుడు ఉన్నాడా అన్న సందేహం కల్గగానే నా ఆత్మీయురాలికి ఈ సందేహాన్ని తెలిపాను.  
దానికి తను ఏమందంటే - తప్పు, తప్పు ఎప్పటికీ ఈ భావన నీలో రానీయకు... పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా వున్నా భగవంతుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ఆ సంఘటనలతో మనోస్థైర్యంను పెంచుకోవాలని చెప్తూ, ఇలా అంది - మనం ఈ జన్మలో ఏ పాపాలు చేయకు పోవచ్చు, గతజన్మల ప్రారబ్ధం కావొచ్చు కదా, తప్పదు ... జీవితంలో కష్టసుఖాలాను సరళంగా సహజంగా స్వీకరిస్తూ గమ్యం వైపు సాగిపోవడమే...  తన ఈ మాటలతో నా భావన ఎంత హేయమైనదో గ్రహించాను. 
పై ఇరువురి మాటలు నా తప్పిదాన్ని తెలుసుకునేటట్లు చేశాయి. పూజ్యులు మాస్టారు గారికి, నేను ఎంతగానో అభిమానించే నా ఆత్మీయురాలికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 


అటుపై భగవంతుడు లేడని అనుకున్నందుకు నేను పొందిన ఆవేదన నేను ఎదుర్కుంటున్న విపత్కర పరిస్థితుల కంటే అధికమైనది. ఆ సమయంలో నాలో జరిగిన ఆ అంతర్మధనమే ఈ టపా - 
ఆ సమయంలోనే నాలో స్వీయపరిశీలన జరిగింది. 
నిజమే నా మనస్సు విషయత్వం నందు చిక్కుకుంది. ఈ విషయత్వం విషం కంటే దారుణమైనదని శాస్త్రమంటుంది. (ఉపభుజ్య విషం హంతి విషయా స్స్మరణాదపి) విషం తినినచో చంపును. కాని విషయం తన్ను స్మరించిన మాత్రమునే హననం చేయును.  
ఇక ప్రారబ్ధంను తప్పించుకోవడం ఎలా? ప్రారబ్ధం భోగతో నశ్యే అన్నారు పెద్దలు. వీటిని సహనంగా అనుభవించి అధిగమించాల్సిందే. ఇటువంటి స్థితిలో ఆవేదన కలగకూడదంటే ఆపదలను ఆపదలుగా కాకుండా భగవంతున్ని అనుగ్రహంగా భావించాలి. ఈ సమస్యలు నాలో తగినంత వివేకం, వైరాగ్యం, అభ్యాసం లేవని తెలియజెప్పడానికే కల్గి వుండవచ్చు.
మంచి చెడుల సమ్మేళనములతో, ఆశానిరాశల సమాహారములతో, ఆనందవిషాదభాష్పాల సంగమములతో, ఎన్నెన్నో సంక్లిష్టతలతో కూడిన ఈ లౌకిక ప్రపంచంలో చలించని భక్తివిశ్వాసాలతోనే పారమార్ధిక పధంలో పయనించగలగాలి. జీవితము పట్ల ఓ చక్కటి అవగాహన కల్గి వుండాలి. గీతలో చెప్పినట్లుగా అందుకు తగ్గ అభ్యాస వైరాగ్యంలను సాధన చేయాలి. (మనస్సుని లౌకిక విషయాలనుండి మళ్ళించడం వైరాగ్యం. మనస్సుని ఆత్మయందు నిలపడం అభ్యాసం). 

ఇప్పటికీ సమస్యల నడుమే వున్నను నాలో ఇప్పుడు దుఃఖం లేదు. కాలగమనంలో ఈ సమస్యలు వీడవచ్చు, వీడకపోవచ్చు. కానీ; ఇక నాలో ఎప్పటికీ భగవంతునిపై విశ్వాసం వీడదు. 

త్వయి మేऽనన్యవిషయా మతిర్మధుపతేऽసకృత్
రతిముద్వహతాదద్ధా గఙ్గేవౌఘముదన్వతి //


ఓ మధుపతీ! నా బుధ్ధి అంతా నీ మీదే ఉంచు. గంగ ఎంత వేగంగా తిరిగినా చివరకి సముద్రం వైపునకు ప్రవహించురీతిన, నా బుధ్ధి ఎంత చంచలంగా ఉన్నా ఇతరముల వైపునకు మరలక,
నిన్నే కలిసేటట్లు నీయందే ఉండాలి.