19, జూన్ 2015, శుక్రవారం

చక్రశుద్ధి - ఆనందసిద్ధి

ప్రతీ సాధకుడు ముందుగా ఈ విషయాల్ని గ్రహించాలి - 'ప్రాపంచికం, పారమార్ధికం వేరు వేరు కాదు, రెండింటి మేళవింపే జీవితం' అని. 'సానుకూలదృక్పదం, ఏకాత్మతా భావం, శాంతి సహనాలు, భగవత్ స్పృహ ... వీటన్నిటి సమాహారమే ఆధ్యాత్మికత' అని. 'మానసిక కాలుష్యాన్ని తొలగించడమే ఆధ్యాత్మిక సాధన' అని. ఇహ పరంలో దేనిని సాధించాలన్న ఆరోగ్యం చక్కగా ఉండాలి. 
ఇక్కడ మరో విషయం గ్రహించాలి - ఆరోగ్యం  అన్నది శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు, మనస్సుకీ, మనుగడకీ కూడా! ఇక ఈ విషయంలో మన ప్రాపంచిక, పారమార్ధిక జీవన గమనంలో సప్తచక్రాలు ఎలా పనిచేస్తున్నాయో ఓసారి పరిశీలిద్దాం -

ఒకానొక ఆదిశక్తి నుండి సృష్టించే శక్తి, పెంచి పోషించే శక్తి, లయించే శక్తి ఉద్భవించి, అందులో నుండి మరెన్నో కోట్లాది శక్తులు ఆవిర్భవిస్తూ ఈ సృష్టి కొనసాగుతుంది. 
విశ్వమునందు, సౌరమండలమునందు, భూమియందు, మానవదేహమునందు ఏడు ప్రజ్ఞామయ కేంద్రములు పనిచేయుచున్నవి. విశ్వమునందలి ఏడులోకములకు (సత్యలోకం, తపోలోకం, జనోలోకం, మహర్లోకం, సువర్లోకం, భువర్లోకం, భూలోకం)సప్తర్షిమండలం అధ్యక్షత వహించుచుండగా, సౌరమండలమునందలి ఏడులోకములకు ఏడుగ్రహములు (రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని)అధిపతులుగా వున్నవి. మానవదేహమునందు ఏడు ప్రజ్ఞామయకేంద్రాలుగా వెన్నెముక వెంబడి శిరస్సులోనికి వ్యాపించియున్న సప్తచక్రాలకు (మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారచక్రములు) పరాశక్తులు ఏడుగురు (సాకిని, కాకిని, లాకిని, రాకిని, డాకిని, హాకిని, యాకిని) ఆధిపత్యం వహించుచున్నారు. 
ఈ సప్తలోకాలంటే ఏమిటో, శక్తిచక్రాలంటే ఏమిటో, సప్తగ్రహాలంటే ఏమిటో, అవి శారీరక ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక పరిణితికీ ఏ విధంగా దోహదపడతాయో తెలుసుకుందాం. 
మన శరీరంలోని సప్తచక్రాలు సప్తలోకములతో ఏయే స్థానాల్లో ఏయే గ్రహాలతో సంధానింపబడిందంటే - 
7. సహస్రారం - సత్యలోకం - ప్రమాతస్థానం - రవి 
6. ఆజ్ఞాచక్ర - తపోలోకం - జీవాత్మస్థానం - చంద్రగ్రహం 
5. విశుద్ధ చక్రం- జనలోకం - ఆకాశభూతస్థానం - కుజగ్రహం 
4. అనాహతం - మహర్లోకం - వాయుభూతస్థానం - బుధగ్రహం 
3. మణిపూరకం - సువర్లోకం - 
జలభూతస్థానం - గురుగ్రహం 
2. స్వాధిష్ఠానం - భువర్లోకం - అగ్నిభూతస్థానం - శుక్రగ్రహం 
1.  మూలాధారం -  భూలోకం - పృథ్వీభూతస్థానం - శని గ్రహం 

విశ్వచైతన్య శక్తి మానవశరీరములోనికి ఏడుచక్రాలు ద్వారా ప్రవహిస్తుంది. ఈ ఏడు దేవతా శక్తుల ఆధీనంలో పనిచేస్తున్నాయి.  ఒక్కో శక్తిచక్రం ఒక్కోతత్త్వంతో సంబంధం కలిగియుంటుంది. ఈ చక్రాలు శారీరక వ్యవస్థలతోనూ, మానసిక స్థితులతోనూ సంబంధం కలిగియుంటాయి. అలానే ప్రతిచక్రానికీ శారీరక మానసిక లేక ఆధ్యాత్మిక విధులు ఉంటాయి.పూర్వజన్మలలోని పాపపుణ్యాలు(ప్రారబ్దాలు) బట్టి ఈ చక్ర, గ్రహ దేవతలు విశ్వచైతన్యశక్తిని ఆయాచక్రాల ద్వారా శరీరంలోనికి సరఫరా చేయడం జరుగుతుంది. పూర్వజన్మలోని పాపపుణ్యాలకు అనుగుణంగా  జరిగే ఈ శక్తి పంపకంలోని హెచ్చుతగ్గులు వ్యక్తీ మనస్సు పైనా, శరీరం పైనా పనిచేస్తూ జీవితగతిని నిర్దేశిస్తుంది. 



మూలాధారచక్రం :-
ఐం హ్రీం శ్రీం సాం హంసః మూలాధిష్టాన దేవతాయై సాకినీసహిత గణనాధ స్వరూపిణ్యైనమః 
మూలాధారంబుడా రూఢ పంచవక్త్రాస్థి సంస్థితా 
అంకుశాది ప్రహరణా వరదాది నిషేనితా 
ముద్గౌదనా సక్త చిత్తా సాకిన్యం బాస్వరూపిణీ 
ఈ కమలం 4 దళాలు కలది. పృధ్వీతత్త్వం కలది. రక్తవర్ణం కలది. అధిష్టానయోగిని దూమవర్ణం కలిగి పంచవక్రాలు త్రినేత్రాలు కలిగి సృణి,కమలం, పుస్తకం, జ్ఞానముద్ర ధరించి, ఆస్థిధాతువునాకు అధిపతియై యున్నది. ముద్గాన్నప్రీతి కలది. వ శ ష  స అను యోగినీ శక్తులచే సేవించబడే ఈమె సాకినీశక్తిగా ఆరాధించబడుచున్నది. నల్లని ఏనుగు ఈమె వాహనం. 

వెన్నెముక చివరిభాగంలో అంటే మలరంద్రానికి సుమారు రెండు అంగుళాల పైభాగాన విలసిల్లే మూలాధారచక్రం మనలో 7,776నాడులతో సంధానింపబడి వుంటుంది. భౌతిక శరీరానికి శక్తికేంద్రం మూలాధారచక్రం. ఇదే మొదటిచక్రం. కుండలినీ శక్తి దాగి వున్నది ఇందులోనే. ఇతర శక్తులన్నింటికి మూలం ఇదే. మూలమైన ఆధారం ఇదే కనుక మూలాదారకేంద్రమన్నారు. మూలాధారచక్రంకు పంచకోశాలలో అన్నమయకోశంతో సంబంధం. శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం 'ముక్కు'. జన్మకూ, పునర్జన్మకు ఇది మూలస్థానం. ఈ మూలాధారంలోని శక్తి రెండు విధములుగా (సృష్టి, ప్రతిసృష్టి) పనిచేస్తుంది. అంటే మనిషి జన్మించేది ఈ శక్తివల్లనే. జన్మరాహిత్యం కలిగేది ఈ శక్తివల్లనే. ఒకటి జన్మతః కలిగే శక్తి. రెండవది యోగంతో ఆర్జించుకున్న శక్తి. ఇది సరిగ్గా పనిచేయకపోతే పునసృష్టి జరగదు. ఈ చక్రప్రేరణ వలెనే ప్రతిజీవి సృష్టికార్యం చేస్తుంది. రెండవశక్తి జన్మరాహిత్యం కలిగించే శక్తి. ఇది బ్రహ్మచర్యం వలన సాధ్యమౌతుంది. బ్రహ్మచర్యం అంటే సంసారజీవితమును త్యజించడం కాదు, సంభోగేచ్ఛను అణుచుకోవడం కాదు. బ్రహ్మత్వసిద్ధికి అవసరమైన శక్తిని ధ్యానయోగం ద్వారా సాధించడం. ఇందుకు నీతి, నియతి, నిగ్రహం పాటించాలి. బ్రహ్మచర్యం గురించి మరింత వివరణకై  ఇక్కడ చూడండి. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
శారీరకంగా అర్ద్రైటిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, ఎముకల బలహీనత, రక్తంలో మార్పుల వలన జనించే రుగ్మతలు, బోన్ కేన్సర్, లుకేమియా వంటి వ్యాధులు, ఎలర్జీ, రోగనిరోధకశక్తి లోపించడం, గాయాలు సరిగ్గా మానకుండా ఉండడం లాంటి రుగ్మతలకు కారణభూతమౌతుంది.  
ఈ చక్ర మానసిక స్వభావం - 
మూసుకుపోవడం వలన భయం, ఆందోళన, అభద్రతాభావం, ఆక్రమణతత్త్వం, అస్థిరత్వం, ఆత్మహత్య ప్రలోభం, స్వార్ధం. తమోగుణం. ప్రాపంచిక సౌఖ్యాలవైపు మోజు కలిగియుండి పరధ్యానస్థితిలో వుంటుంది. 
తెరుచుకుంటే ధైర్యం, స్థిర సంకల్ఫం, పవిత్రత, నిస్వార్ధం, జీవితం మీద మమకారం, పారమార్ధికజ్ఞానం కల్గుతాయి. 
అలానే ఈ నాడీ కేంద్రం నేను నాది అనే అహంకారానికి వేదిక. 
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే - 
ఈ చక్రమునకు సాకిని దేవత. ఈ పరాశక్తి  ఎముకలపుష్టిని అనుగ్రహిస్తుంది. ఈ దేవత 'ముద్గౌదనా సత్తా చిత్తా' అని వర్ణింపబడింది. అనగా ఈ దేవతకు పులగం ఇష్టమని చెప్పుదురు. దీనికర్ధమేమనగా శరీరం నందు ఎముకల పెరుగుదల చక్కగా లేనివారు ఆహారమందు ఈ పులగంను ప్రధానాహారంగా స్వీకరించినచో సర్దుబాటగును. వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "లం" ధ్యానించువారికి ఈ బాధలు నివారణ కాగలవు. 
శారీరక వ్యాధి కానివ్వండీ, మానసిక వ్యాధి కానివ్వండీ అవన్నీ పుట్టుకొచ్చేవి మన లోపల్నుంచే. మనకు బయటసంఘటనలకంటే మన అపవిత్రత వలెనే దుఃఖం వస్తుంది. మన బాధలన్నింటికీ సృష్టికర్తలం మనమే. బాధలు రెండు రకాలు. ఒకటి సముచితమైనవి. ఇవి ప్రారబ్ధవశాత్తు వచ్చేవి. రెండవది  అసంగతమైనవి. పరిస్థితికి ఎంతమాత్రం పొంతన లేని ఆలోచనలు. ఊహలు ఇవే అసంగతమైన బాధలు.
చాలావరకు మనబాధలకు కారణం - మనలో మనకే తెలియని, తెలుసుకోలేని నెగిటివ్ నెస్. అందుకే మన పూర్వీకులు అంటుంటారు - 'మంచిగా ఆలోచించు, ఆనందంగా వుండు'. 'మన ఆలోచనలే మన జీవితం'. 'శుభాన్ని కోరుకో, సుఖంగా జీవించు'. 'మన ఆలోచనలే మన అనుభవాలు'. 'మతి బట్టే గతి'... అని! అలానే చెడు, కీడుల గురించి మాట్లాడటాన్ని వారెప్పుడూ వారిస్తుంటారు. అలాగే మానవాళి శ్రేయస్సుకై పెద్దలు ఎన్నో సూక్ష్మ సరళ పద్ధతులను బోధించారు. మనిషిని శారీరకంగా, మానసికంగా, సుఖవంతంగా, ప్రశాంతంగా ఉంచడంకోసం ఎన్నో చిట్కాలను ప్రతిపాదించారు. వారు సూచించిన పద్ధతులు ఏమిటంటే - 
మూలాధారచక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నేలపై కూర్చోవడం, భూమిని తాకడం, చెప్పులు లేకుండా నడవడం, మొక్కలు చెట్లును కౌగిలించుకోవడం, కన్నతల్లితో కలసి వుండడం, ధ్యానం చేయడం.  
మూలాధారచక్రంనకు అధిపతి గ్రహం శనిమహాత్ముడు. ఈ దేవతతో సరైన సంబంధం లేకుంటే బ్రతుకుకు ఆధారమే లేదు. కష్టించి పనిచేసే విధానానికి, శ్రమశక్తికి ప్రతినిధి శని. అలానే ముసలివాళ్ళకు రోగులకు ఆకలిగొన్నవాళ్ళకు ఈయనే ప్రతినిధి. బద్ధకస్తులను ముదుసలివారిపట్ల, రోగులపట్ల, ఆకలిగొన్నవారియందు అలక్షంగా వున్నవారిని తీవ్రంగా దండిస్తాడు. కాబట్టి  కష్టించి పనిచేసే తత్త్వం, సేవాతత్వం అలవర్చుకోవడం వలన శనిమహాత్ముని అనుగ్రహం పొందవచ్చు. ఈ చర్యలతో మూలాధారంను జాగృతి పరచవచ్చు. 
ధ్యానం, సేవ అనేవి రెండు శక్తివంతమైన సాధనములు. ధ్యానం లేని సేవ, సేవ లేని ధ్యానం పూర్ణజ్ఞానసిద్ధిని కల్గించలేవు. సేవ, ధ్యానం రెండు కూడా మనోశుద్ధి ప్రక్రియలు, పాపనాశన సాధనములు. (పాప ప్రక్షాళన సాధనములు) సేవ స్థూలంగా మనస్సుని శుద్ధి చేస్తే, ధ్యానం సూక్ష్మంగా మనస్సును శుద్ధి చేస్తుంది. సేవ చేస్తేగాని ధ్యానం చేసే శక్తి కలగదు, ధ్యానం చేస్తేగాని సేవ పవిత్రంగా జరగదు. చక్కగా ధ్యానం చేస్తే, చేసే సేవ పవిత్రంగా వుంటుంది. చక్కగా సేవ చేస్తే చేసే ధ్యానం నిశ్చలంగా వుంటుంది. ప్రశాంతంగా వుంటుంది. 
సేవ వలన చిత్తశుద్ధి చేకూరుతుంది. అహంకార నిర్మూలన జరుగుతుంది. అహంకారాన్ని జయించటమే ఈ చక్రాన్ని జయించటమౌతుంది. 

తదుపరి చక్రం 'స్వాదిష్టానచక్రం' గురించి తదుపరి టపాలో ... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి