http://www.sodhini.com

11, ఆగస్టు 2013, ఆదివారం

ఒకప్పుడు నేను విన్న కధను గుర్తుచేసిన 'శ్రీ శ్యామలీయం గారి భాగవతం'

పరమ భాగవతోత్తముడైన బమ్మెర పోతానామాత్యులవారు తన సహజపాండిత్యంతో అనితరభక్తితో మానవాళికి ఆత్మోన్నతిని అందించే శ్రీ మద్భాగవతాన్ని తెలుగులోనికి అనువదించగా,
దానిని తిరిగి ధారావాహికంగా భక్తజన హృదయాలను రంజింపజేస్తూ, ఎంతో భక్తితో తను చేస్తున్న ఈ పనిని ఓ తపస్సులా భావిస్తూ శ్రీమదాంధ్రమహాభాగవతంను సరళముగా అందిస్తున్న శ్రీ శ్యామలీయంగారికి నమస్సులు. వారి శ్యామలీయం భాగవతం చదువుతుండగా ఒకప్పుడు నేను విన్న ఈ కధ జ్ఞాపకం వచ్చింది.
శుకమహర్షి భాగవతమును ఏడురోజులలో పరీక్షిత్తు మహారాజునకు తెలిపి ముక్తిని కలుగజేసినట్లు తెలుసుకున్న ఓ మహారాజు తన ఆస్థాన పురోహితున్ని పిలిచి, ఆ భాగవతమును తనకి విశదపరచమని, తనకు అలానే ఏడురోజుల్లో మోక్షమును కలుగజేయమని, లేనిచో నీ పౌరాణికత్వం రద్దుచేసి, దేశబహిష్కరణ చేస్తానని శాసించెను. అంతట ఆ పౌరాణికుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చెప్పినను ఆరాజు మనస్సు భగవద్వీలీనం చేయక ఏడవరోజు ముక్తికై ఎదురుచూస్తుండడంతోనే ఆరురోజులూ గడిచిపోయాయి. మరుసటిదినం ఏడవరోజు అగుటచే పౌరాణికుడు మహావ్యాకులతతో వుండగా, ఆ పండితుని సేవకుడు తన యజమాని విచారమునకు కారణం అడిగితెలుసుకొని, ఈ పనికి నన్ను నియమించండి, మీ బదులుగా నేను వెళ్లి ఈ పనిని పూర్తిచేస్తానని చెప్పి, తానే రాజభవనానికి వెళ్ళి, ప్రభూ! ఈ చిన్నివిషయానికి తానేల రావలయునని తలచి, మోక్షము యొక్క రహస్యమును తమకు తెలిపి రమ్మని నా యజమాని ఆదేశించగా నేను వచ్చితిని అని చెప్పి, ఓ రాజా! ఈ రోజు పురాణం ప్రారంభించుటకు ముందు మీరు బంధీకృతులు కావలసియున్నది అని చెప్పగా ... మోక్షం వచ్చుటకు ఇదికూడా అవసరం కాబోలు అని రాజు అంగీకరించగా, రాజును ఒకస్తంభమునకు కాలుచేతులు కట్టి బంధించి, ఆ పిమ్మట ఆ సేవకుడు అనేకరకముల ఫలహారములు తెప్పించి రాజుముందు పెట్టి,
మహారాజా! శుభముహూర్తం దగ్గరకు వచ్చింది, ఈలోపునే మీముందున్న ఫలహారములను స్వీకరించాలి కావున వెంటనే భుజించమని చెప్పెను. ఇదెలా సాధ్యం? బంధీకృతమైన నేను ఎలా భుజించగలనని రాజు ప్రశ్నించగా, ఓ రాజా! పరీక్షన్మహారాజు వలే మీకు తగిన వైరాగ్యం లేదు, మీ బంధనములు తెగలేదు. ఇట్టిస్థితిలో ఏడురోజుల్లో మీకు మోక్షమిప్పించుట ఎట్లా సాధ్యమౌతుంది?
ఓ రాజా! 
జనమేజయులకు రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునను తప్పించి, చిత్తంబు హరికి అర్పించి, ప్రాయోపవిష్టుండైన పరమభాగవతుడైన పాండవపౌత్రుండు
పరీక్షిత్తు మహారాజుకున్న వైరాగ్యం మీలో లేదు. మీరింకనూ ఆశాపాశములతో ఈ మాయాప్రపంచంన కట్టుబడే యున్నందున మోక్షం సాధ్యం కాదు. రాజా! ప్రీతితో, ఆసక్తితో, ఫలాభిలాషతో, కర్తృత్వబుద్ధితో గడుపుజీవితం బంధమును కలిగిస్తాయి. బంధమెంతవరకుండునో అంతవరకు మోక్షం లేదు. ముక్తి పొందడానికి యోగ్యత, సాధన, ఆచరణ కావలసియున్నది. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికి మాత్రమే ముక్తి సాధ్యమగును.
ఓ మహారాజా! దేహపుత్రకళత్రాది వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఏకాంతప్రదేశమున అకార ఉకార మకారాలనే మూడక్షరాలతో కూడిన బ్రహ్మబీజమైన *ఓంకారము*ను మనస్సులో స్మరిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్శ్వాశాలను వశపరుచుకోవాలి. విషయాల వెంబడి పరుగిడే ఇంద్రియాలను బుద్ధి అనే సారధితోను, మనస్సనే పగ్గంతోను బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిపై నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమముగా ధ్యానించాలి. రజో, తమో గుణాలచే ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సునూ, ఆ గుణాలవలన కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చెయ్యాలి. అలా చేసిననాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతారని, వారే మోక్షం పొందుతారని శుకమహర్షి చెప్పినట్లుగా,  అప్పటికే సర్వమూ పరిత్యజించి, హృదయాంతరమున హరిని నిలిపి, మనస్సును భగవద్విలీనం చేయుటచే పరీక్షిత్తు మహారాజు మోక్షం పొందాడు మహారాజా, అని భక్తుడైన ఆ సేవకుడు చెప్పగా, తన తప్పుని రాజు గ్రహించి పశ్చత్తాపపడెను. సేవకుడు తిరిగి తన యజమాని ఇంటికి వెళ్ళగా, అప్పటికే జరిగిన విషయాలన్నీ జనుల ద్వారా తెలుసుకున్న ఆ పండితుడు ఈ భక్తోత్తముడిని సాదరంగా ఆహ్వానించి, 'నాయనా! ఈ దినమునుండి నేనే నీకు సేవకుడిని, మీరే నేటి నుండి నా గురువులు' అని రెండు చేతులను ముకుళించి నమస్కరించెను.

*ఓంకారం* గురించి మరింత వివరణ ఈ లింక్స్ నందు -
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post.html
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post_29.html)
 

ఎప్పుడో విన్న స్మరించుకోదగ్గ ఈ కధ మరుపున పడకూడదని స్మరణ లో పోస్ట్ చేస్తున్నాను.

9, ఆగస్టు 2013, శుక్రవారం

గీతాకల్పతరువు

గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం
వేదవ్యాసవివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్ /
నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతి
ప్రవాళాంకితం
కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభి
ం మోక్షప్రదం జ్ఞానినామ్ //

భగవద్గీత ఓ కల్పవృక్షం. దానిని నాటినది శ్రీకృష్ణపరమాత్మ. పోషించి పెంచినది వ్యాసభగవానుడు. ఉపనిషత్తులే గీతకు బీజం. వైరాగ్య సహనములే గీతాకల్పతరువు యొక్క చిగురుటాకులు. నానాశాస్త్రములు దాని శాఖలు. శ్రీకృష్ణ పాదపద్మమునందలి పూర్ణభక్తియే దాని పుష్పం. జాతి లింగ ఆశ్రమ భేదములేక యెవ్వరు దానిని భక్తితో ఆశ్రయింతురో వారు తప్పక ముక్తులగుదురు.

ఇటువంటి కల్పతరువును ఏ ఫలం ఆశించి ఆశ్రయిస్తే ఆ ఫలం మాత్రమే సిద్ధిస్తుంది. కామ్యఫలం ఆశిస్తామో, జ్ఞానఫలం ఆశిస్తామో మన అభిమతంపై ఆధారపడి ఉంటుంది.

6, ఆగస్టు 2013, మంగళవారం

"నా ఆ ఆనందం అందరితో ....."


చిట్టితల్లి 'శ్రీ మాన్వి' కారణముగా మరోసారి (క్రిందటి టపాలో మొదటిసారి తెలుసుకున్నది తెలిపాను) కృష్ణతత్త్వం తెలుసుకోగల్గినందుకు నా ఆనందం మరింత అధికమైంది. "నా ఆ ఆనందం అందరితో" పంచుకోవాలని ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని టపాగా పెడుతున్నాను.

ఉదయం హరిప్రియతో ముచ్చటిస్తూ, ఓ ప్రక్కకు తిరిగి నోటిలో బొటనవ్రేలు పెట్టుకుంటూ ఊ ఊ లు కొడుతున్న శ్రీ మాన్విని చూసి -
అరే, ఈమధ్య బొటనవ్రేలు నోటిలో పెట్టేసుకుంటుంది, ఇప్పుడే దీనిని మాన్పించాలి, అలవాటైతే కష్టం కదా, అయినా పిల్లలు ఎందుకు నోటిలో వ్రేలు పెట్టుకుంటారో ఏమిటో ... అన్న నా మాటలకు నవ్వి, దానికీ ఓ కధ వుంది అని, చెప్పిందిలా -
పూర్వకాలంలో సూర్యవంశంలో మాంధాత అనే రాజు తండ్రి నుండే తిన్నగా ప్రభవించాడు. మన శరీరంలో ప్రతి అవయంలో ఒక్కొక్క దేవత అధిదేవతగా ఉన్నట్లే చేతికి అధిపతిగా ఉన్న ఇంద్రుడు, పాలిచ్చేతల్లి లేనికారణముగా ఆ బిడ్డను నేను పోషిస్తానని వచ్చి, బొటనవ్రేలు ద్వారా అమృతం పిల్లవానికి చేరాలని,  'మాం - దాతా' పిల్లవాని బొటనవ్రేలును పిల్లవాని నోట్లో పెట్టాడట. అందుకేనేమో, చాలామంది పిల్లలు బొటనవ్రేలును చీకుతుంటారని అంది.
ఓహో ... కధ బాగుంది కానీ; మరి శ్రీకృష్ణుడు వటపత్రం పై శయనిస్తూ కాలిబొటనవ్రేలును నోట్లో పెట్టుకుంటూ ఓ లీలను ప్రదర్శిస్తాడు కదా, దానిలో ఏమైనా అంతరార్ధం వుందా అన్న నాప్రశ్నకు -
ఆ ... పరమాత్మ లీలలకు పరమార్ధం తప్పకుండా ఉంటుంది. మనల్ని మాయనుండి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రసాదించే దివ్యరూపమిదని, తాతయ్యగారు చెప్పింది లీలగా జ్ఞాపకం ఉంది. 

                                                    
శ్రీకృష్ణపరమాత్మ తన యోగమాయను మార్కండేయునకు చూపించడానికి వటపత్రంపై ఎడమకాలి బొటనవ్రేలును నోటిలో పెట్టుకొని శయనిస్తున్నట్లు దర్శనమిచ్చాడు. ముందుగా వటపత్రంపైనే ఎందుకు శయనించాడో చెప్పారు. జంతువులలో గోవు ఎంత శ్రేష్టమో, చెట్లలో మఱ్ఱిచెట్టు అంత శ్రేష్ఠమైనది. మఱ్ఱిచెట్టునే వటవృక్షమని, న్యగ్రోధమని అంటారు. ఈ వృక్షముది కనీకనబడని విత్తనమట. మిగతా మొక్కల్ని నాటినట్ట్లుగా ఈ మఱ్ఱిమొక్కను ఎవరూ నాటరు. ఇది స్వయంభువంగా వెలుస్తుంది. దీనికి ఎన్నో కొమ్మలు, ఊడలు ఉండి అనేక చెట్లగుంపులా విస్తారముగా ఉంటుంది. ఈ చెట్టును చూస్తే ఈశ్వరసాదృశ్యం తేటతెల్లమౌతుంది. ఎలాగంటే అంతచెట్టు చిరువిత్తనంలో ఉన్నట్లే పరమాత్మ కూడా అణువణువులోనూ ఉన్నాడని, ఆ చెట్టు విస్తారంగా వ్యాపించినట్లే పరమాత్మ కూడా బ్రహ్మాండమంతా తానే వ్యాపించి ఉన్నాడని, ఇది స్వయంభువంగా మొలకెత్తినట్లే పరమాత్ముడు కూడా స్వయంభువుడుగా అవతరించాడని, ఈ చెట్టుని గమనిస్తే అర్ధమౌతుంది. అందుకే దక్షిణామూర్తి మౌనంతో ఆత్మతత్త్వాన్ని వెల్లడించింది ఈ చెట్టు క్రిందనేనని అంటారు. 
అదియును కాక,  గోవు యొక్క సారం నవనీతం అయినట్లుగా, దానిని కృష్ణపరమాత్మ గ్రహించినట్లుగా వెన్నదొంగతనంలో కృష్ణతత్త్వం అర్ధం చేసుకున్నాం కదా.  చిట్టచివర వచ్చే నవనీతదశలో మాత్రమే కాదు,వటపత్రంపై ఉండండం ద్వారా,  ప్రాధమికదశయైన పత్రదశలోనూ (ఏ చెట్టుకైనా ముందు ఆకులే కదా చిగురిస్తాయి) తానున్నాని తెలియజేస్తున్నాడు. అలానే, మన శరీరంలో ఇడానాడి (దీనినే చంద్రనాడి అని అంటారు) ఎడమవైపున ఉంటుంది. ఇది జీవస్థానంకు, భౌతికప్రవృత్తికి సంకేతం. యోగులు ఈ నాడి నుండే అమృతస్రావాన్ని అనుభవిస్తారని, కృష్ణుడు తన ఎడమకాలి బొటనవ్రేలు నోటిలో పెట్టుకోవడం ద్వారా ఆ యోగస్థితిని సూచించాడని అంటారు. అలానే ప్రళయకాలంలో మార్కండేయునకు ఈ లీల చూపడంలో సమస్త సృష్టి మాయేనని, చిట్టచివరికి అంతా తనయందే లయమౌతుందని, అది గ్రహించమని జ్ఞానమార్గమును చూపించాడు. ఈ లీల ద్వారా తాను అమృతం త్రాగుతున్నట్లు కనబడినా, అతడు నిజంగా మనకు జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తూ జనన మరణ ప్రవాహమునుండి మనల్ని ఒడ్డున పడేస్తున్నాడు. అందువల్లనే "ముకుంద", ముక్తిప్రదాత అని స్తుతింపబడుతున్నాడు. అంతే కాకుండా బాలరూపంలో దర్శనం ఇవ్వడం ద్వారా పిల్లల హృదయంలాంటి హృదయాన్ని కల్గియుండి, మనస్సును పాలమాదిరిగా స్వచ్ఛంగా ఉంచుకుంటే, మన మనస్సనే పాలసముద్రంపై భక్తిత్వం అనే వటపత్రం తేలగా, దానిపై క్షీరాబ్ధిసాయిలా శయనిస్తూ మనల్ని తనలో లీనం చేసుకుంటాడన్న సంకేతముందని తనకి జ్ఞాపకం వున్నంతవరకు వటపత్రశాయి గురించి వివరించిన
నా స్నేహితురాలు 'హరిప్రియ'కు కృతజ్ఞతలు.
తన చిరుచేష్టల ద్వారా ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.

కరారవిందేన పదారవిందం
ముఖారేవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసా స్మరామి
వటపత్రంపై శాయనిస్తున్న, పద్మంవంటి కాలిబొటనవ్రేలును, పద్మంవంటి చేతితో పట్టుకొని, పద్మంవంటి ముఖంలో పెట్టుకున్న ముకుందున్ని మనసార స్మరిస్తున్నాను.


29, జులై 2013, సోమవారం

మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.


చిట్టితల్లి 'శ్రీ మాన్వి' తో కాసేపు కబుర్లు చెప్పడానికి ఎప్పటిలానే ఈరోజు కూడా నా స్నేహితురాలు హరిప్రియ విచ్చేసింది.
ఓ ... అసలు విషయం చెప్పడం మరిచా -
చిట్టితల్లి 'శ్రీ మాన్వి' నా ప్రియమైన మనుమరాలు. మే నెల పంతొమ్మిదవ తారీఖున జననం. అమ్మని అయినప్పటికంటే అమ్మమ్మని అయినప్పుడానందం అధికంగా అద్భుతంగా  ఉంది. అదేమిటో గానీ, అన్ని బందాలకంటే ఈ అనుబంధం అపురూపంగా అద్వితీయంగా అనిర్వచనీయంగా ఉంది. 
రోజూ వచ్చి, శ్రీ మాన్వితో కాసేపు గడిపే నా స్నేహితురాలు ఈరోజూ వచ్చింది. తను వచ్చిన కాసేపటికి చిట్టితల్లికి వెక్కిళ్ళు రాగా -
'ఓహో! శ్రీ మాన్వి! దొంగతనంగా వెన్న తిన్నావా? ఏం తిన్నవురా మాన్వీ ... వెక్కిళ్ళు వస్తున్నాయి?' అని అంటుంటే -
ఎందుకలా అంటుందో అర్ధంకాక, తనని అదేమిటట అని ప్రశ్నించగా -
సరైన కారణం తెలియదు గానీ, పిల్లలకు వెక్కిళ్ళు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఇలా అనేవారు, అని చెప్తూ ... భారతీ! నీ చిట్టితల్లి ఎవరింటికెళ్ళి "చిన్నికృష్ణు"నిలా వెన్న దొంగతనం చేసిందంటావ్? అని అడుగుతూ ... నీకు తెలుసా ... చిన్నికృష్ణుని చోరత్వంలో అంతరార్ధం? అని ప్రశ్నించింది. 

                              


     నవనీత చోరత్వం - అంతరార్ధం
 








ఏమిటేమిటీ ... చోరత్వంలో కూడా ఆధ్యాత్మిక అంతరార్ధం ఉందా? తెలియదు, చెప్పమని నేనడగగా; తనకి తెలిసింది చెప్పిందిలా -
శ్రీకృష్ణుడు గీత ద్వారా జ్ఞానాన్ని ప్రబోధించడమే కాదు, తన బాల్యచేష్టలద్వారా వేదాంత రహస్యాలను ప్రదర్శించేవాడని మా తాతయ్యగారు చెప్తుండేవారు. ఓసారి ఈ నవనీత చోరత్వం గురించి చెప్పారు. 

                      
నవనీతం అంటే వెన్న. ముందుగా ఈ వెన్న ఎలా తయారౌతుందో గమనించమన్నారు. గోవు నుండి ఓ కుండలోనికి పాలు తీసి, బాగా కాచి, పొంగినపాలను చల్లార్చి, అందులో కాస్తా మజ్జిగ లేదా పెరుగును చేర్చి, పెరుగయ్యాక దానిని కవ్వంతో చిలకగా వెన్న వస్తుంది కదా. అలా వచ్చిన వెన్నను కృష్ణ పరమాత్మ దొంగలించాడు అంటే, అందులో ఓ పరమార్ధం ఉంది.
గోవు సత్త్వబుద్ధికి ప్రతీక. సాధకుడు గోవులాంటివాడు. కుండ సాధకుని హృదయం. సాధకుని మనస్సు స్వచ్ఛమైన తెల్లని పాలవంటిది. భక్తిత్వ తపనతో సాధకుని పాలవంటి శుద్ధమనస్సు వేడి ఎక్కగా, పాలమాదిరిగా పొంగిన మనస్సు తీవ్రసాధనతో చల్లబడి(అణిగి)నప్పుడు  కాస్తంత ధ్యానమును తోడుగా చేర్చితే, ప్రవాహశీలం లేని పెరుగులా గట్టిగా ముద్దగా తయారౌతుంది. ఇప్పుడు ఆ పెరుగు ఉన్న కుండ(హృదయం)లో కవ్వం పెట్టి చిలకడానికి కవ్వం కావాలి. కవ్వం, కవ్వంకు కట్టిన త్రాడు సాధనాలు. కవ్వం అంటే విచారణ. {అంటే శోధన, జ్ఞానవిచారణ (శ్రీరమణులు చెప్పినట్లు), తత్త్వవిచారణ}. త్రాడు అంటే ఏకాగ్రత. ఈ రెండింటి సాయంతో చిలకగా, చిలకగా {మధించగా మధించగా(అంతర్మధనం)
}, అప్పుడు పూర్ణత్వం అనేది వెన్న వస్తుంది. అదే నవనీతం. అలా నవనీతంతో మన హృదయం పూర్ణత్వం నింపుకున్నప్పుడు మనకు తెలియకుండనే శ్రీకృష్ణుడు వచ్చి అపహరిస్తాడు. ఇక్కడ ఓ సందేహం రావచ్చు. శ్రీకృష్ణుడుకి వెన్న కరువా? అయినను గోపికలకి కృష్ణుడంటే అమితప్రేమ కదా, వెన్నని అడిగితే గోపికలు ఇవ్వరా?  దానికి దొంగతనం చేయడం ఎందుకు? ఇప్పటికీ వెన్నదొంగ అని అనిపించుకోవడం ఎందుకు? అన్న  సందేహం రావచ్చు. కృష్ణుడు అడగడం, మనమివ్వడం అంటే అడుగేవాడు ఒకడు, ఇచ్చేవాడు ఒకడు ఉన్నట్లే. మనమివ్వడం అంటే ఇవ్వడానికి 'నేను' అన్న ఒకరున్నట్లే. 'నేను' అన్న భావన ఉంటె అది పూర్ణత్వం కాదు. ద్వైతం లేనిస్థితే పూర్ణత్వస్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండనే పరమాత్మ మనలో ప్రవేశించి తనలో ఐక్యం చేసుకుంటాడు. అపహరించడం అంటే ఇదే.
అటువంటి పూర్ణత్వస్థితికి మనం రాగలగాలి. అప్పుడు మనం సంసారంలో వున్నను పూర్ణత్వస్థితిలో ఉన్నట్లే. ఎలాగంటే, పాలు నీళ్ళలో కలుస్తుంది. కానీ; వెన్న నీటిలో తేలుతుంది. అట్లాగే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం సంసారంలో ఉన్నా, దాన్ని అంటక పూర్ణత్వస్థితిలో ఉన్నట్లే.
అలానే ప్రతీ ఇంటికి వెళ్లి కుండలు బ్రద్ధలు కొట్టడం అంటే దానికీ ఓ అంతరార్ధం వుంది. మనకున్నది దాచుకోవడానికి కాదు, ఉన్నది తీసి లేనివారికి సహాయం చేయాలనే సామాన్య సందేశంతో పాటు, పూర్ణత్వస్థితిలో పొందిన జ్ఞానాన్ని కుండలాంటి హృదయంలోనే దాచుకోకుండా అందరికీ పంచిపెట్టాలనే ధార్మిక అర్ధముందని తాతయ్యగారు చెప్పారు అని తను వివరించింది.
ఇంత మంచి విషయం వివరించిన నా స్నేహితురాలు 'హరిప్రియ'కు కృతజ్ఞతలు.
ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన నా ముద్దుల మనుమరాలికి శుభాశీస్సులు.


13, ఏప్రిల్ 2013, శనివారం

నా రామయ్య జననం ... కళ్యాణం!

                                  శ్రీరామ జయరామ జయజయ రామ 
రామజననం

మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే /
పునర్వస్వ్రక్షసహితే  క్షసహితే ఉచ్ఛస్థే గ్రహపంచకే //

చైత్రమాసం శుక్లపక్షమున నవమినాడు, శుభకరమగు కర్కాటక లగ్నమందు, పునర్వసు నక్షత్రమున ఐదుగ్రహములు ఉచ్ఛస్థానములో యుండగా, సూర్యుడు మేషరాశి యందుండగా మధ్యానకాలమందు సనాతనుడగు పరమాత్మ కౌసల్యకు ఆవిర్భవించెను.


యస్మిన్ రమంతే మునయో విద్యయా జ్ఞానవిప్లవే /
తం గురు: ప్రాహ రామేతి రమణాద్రామ ఇత్యపి //
                                                                                   
జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించిపోయిన తరువాత, మునులు ఎవరియందు రమింతురో, ఎవరు తన సౌందర్యంచే భక్తజనుల చిత్తములను ఆనందింపచేయునో అతనికి "రాముడ"ని గురువు వశిష్టుడు పేరు పెట్టెను.

భరణాద్భరతో నామ లక్ష్మణం లక్షణాన్వితమ్ /

శత్రుఘ్నం శత్రుహన్తారమేవం గురురభాషత //


జగత్తును భరించినవాడు కావున రెండవ పుత్రునకు (కైకయి కి పుట్టినవానికి) "భరతుడ"ని, (ఇక సుమిత్రకు పుట్టిన ఇద్దరికి) సమస్త శుభలక్షణ సంపన్నుడు కావున మూడవ వానికి "లక్ష్మణుడ"ని, శత్రుహంత యగుటచే నాల్గవ వానికి "శత్రుఘ్ననుడ"ని వశిష్టులవారు పేర్లు పెట్టిరి. 




 రామకళ్యాణం
తమ రాజ్యమునకు వచ్చిన విశ్వామిత్రుడును, రామలక్ష్మణులును జనకుడు సాదరముగా స్వాగతించగా -
జనక మహారాజా! నీ వద్దనున్న శివధనస్సును చూడాలని రామలక్ష్మణులు అభిలాషించుచున్నారు. ఓసారి ఆ ధనస్సును వారికి చూపమని విశ్వామిత్రుడు అనగా -
అంతట జనక మహారాజు, జనక వంశీయులకు దేవతలు ప్రసాదించిన శివధనస్సును ఎవరు ఎక్కిపెడితే వారికే సీతనిచ్చి వివాహం చేయాలన్న తన సంకల్పమును విశ్వామిత్రునికి తెలిపి,  ధనస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపించగా -
జనకుని ఆదేశంతో బలిష్టులైన ఐదువేలమంది పురుషులు ధనుస్సు ఉంచిన పెట్టెను లాక్కొని రాగా -
గురువాజ్ఞ తీసుకొని, అందరూ ఉత్కంఠతో చూస్తుండగా, ధనస్సును శ్రీరాముడు ఎక్కుపెట్టగా, విరిగిపోయిన ధనస్సును సర్వులూ ఆశ్చర్యానందాలతో వీక్షించగా -



 
తన ప్రతిజ్ఞ మేరకు తన ప్రాణతుల్యమైన పుత్రికను రామునికి ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు అనగా-
విశ్వామిత్రుని సూచన మేరకు జరిగిన విషయలాను వివరిస్తూ ఆహ్వానపత్రికను దూత ద్వారా అయోధ్యరాజు దశరధునికి పంపగా -
అంతట దశరధుడు ఎంతో సంతోషంతో వసిష్ఠ వామదేవాదులతో, మంత్రులతో, చతురంగబలసైన్యంతో విదేహరాజ్యమును చేరగా -
దశరధుని కులగురువు వశిష్టుడు దశరధుని వంశవృక్షమును జనకునికి తెలపగా, జనకుడు తన వంశవృక్షమును దశరధునికి వివరించగా -
అనంతరం సీతారాముల కళ్యాణమునకు అంతా సన్నద్ధమవ్వగా -
అంగరంగవైభవముగా సీతారాముల వివాహం జరిగినది.




సీతారాముల వివాహం జరిగినరోజు సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, కర్కాటక లగ్నం అని పౌరాణిక కధనం. అయితే భగవంతుడు ఏ అవతారం ఏరోజున దాల్చితే, ఆ రోజునే ఆయన కళ్యాణం జరిపించాలన్న ఆగమశాస్త్రవచనం ప్రకారం; శ్రీరామనవమి నాడే రాముని జన్మదిన వేడుకలతోపాటు సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా, భక్తి పారవశ్యాలతో జరుపుకుంటున్నాం.

ఈ నెల 19 న "శ్రీరామ నవమి". 

 

7, ఏప్రిల్ 2013, ఆదివారం

'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత!

"అచంద్రార్కం యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్ఠతి మేదిని" అని వాల్మికి మహర్షి అన్నట్లు సూర్యచంద్రులు వున్నంతకాలం రామాయణం మానవాళిని తరింపజేస్తుంది.

రామాయణం అనే మహాకావ్యాన్ని ఎవరు ఎన్నివిధాల చెప్పినా, ఎవరు ఎన్నిసార్లు రామకధను కొనియాడినా, ఎవరు ఎన్నిసార్లు రామనామ మహత్యమును కీర్తించిన, ఎవరు ఎన్నిసార్లు రామతత్వాన్ని ప్రవచించిన, ఎవరు ఎన్నివిధాల మధించి అమృతరసాన్ని గ్రోలిన, ఎవరు ఎంతగా రామామృతాన్ని ఆస్వాదించిన, ఎవరు దీని సారాన్ని గ్రహించి శ్లాఘించిన .....  తనివి తీరని తపన రామభక్తులది.

రామాయణంలో బయటకు కనిపించనటువంటి ఆధ్యాత్మికమైన నిగూఢసత్యాలు అనేకం వున్నాయి. అందులో ఒకటి - జనకుడు సీతారాములకళ్యాణఘట్టమందు కన్యాదానం చేస్తూ చెప్పిన ధర్మాచరణ ఉపదేశం.
ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవ |

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయే వానుగతా సదా ||

ఈ శ్లోకం, జనకుడు రాముని చేతిలో మంత్రజలం విడుస్తూ చెప్పింది.
పై శ్లోకమునకు అర్ధం -
'ఇయం సీతా' ఇదిగో సీత. నా పుత్రిక. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీ ధర్మపత్ని. ఈమె పతివ్రతయై, ఎల్లవేళలా సహధర్మచారిణిలా నిన్ను అనుసరిస్తుంది.

అయితే; ఈ శ్లోకం గురించి కొందరు చలోక్తులతో వివరిస్తూ చెప్పినవి ... అక్కడక్కడ, అప్పుడప్పుడూ విన్నవీ, చదివినవీ ... నాకు అర్ధమయినంతవరకు ఈ టపాలో పెడుతున్నాను.

రామా! ఈమె ఎవరో కాదు, 'ఇయం సీతా' ఈమె సీత, నీ భార్యయే, నీవు ఏ ధర్మస్థాపన నిమిత్తం మానవజన్మ తీసుకున్నావో, ఆ ధర్మస్థాపనలో నీకు సహకరించడానికే ఈమె అవతరించినది. ఈమెను నీవిప్పుడు స్వీకరిస్తేనే తప్ప, లోకానికి మంచి జరగదు.  కావున నీవిప్పుడు ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరించు, నీ ధర్మాచరణలో నీ నీడవలె అనువర్తిస్తుంది.

ఎటు చూసిన దివ్యప్రకాశంతో శోబిల్లుచున్న సీతే కనబడడంతో విభ్రాంతికి లోనయి అటుఇటు చూస్తున్న రాముని అవస్థను గమనించిన జనకుడు, రామా!  నీవే 'పుంసాం మోహనరూపాయ' అని, నీవే సుందరుడివి అని అనుకుంటున్నావేమో... 'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. నా కుమార్తె. ఈమె పాణిని గ్రహించి, ధర్మపత్నిని చేసుకో. ధర్మాచరణలో నిను అనువర్తిస్తుంది.

రామచంద్రా! 'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. మీరు లక్ష్మీనారాయణులు. లోక కళ్యాణార్ధమై ఈ మానవజన్మ మీరు ఎత్తడానికి ఇలా విడివడినారు. ఈమె చేతిని అందుకొని, ఈమెని నీ ధర్మపత్నిని చేసుకొని, ఇక ధర్మస్థాపన చేయు రామా. నీవు ఏ కారణంచే ఈ రూపంలో అవతరించావో ఆ పని పూర్తిచేయు. నీవు చేసే ఆ ధర్మస్థాపనలో నీ నీడవలె నిను అనుకరించి, సహకరిస్తుంది.

సీత సిగ్గుతో తనచేతిని పట్టుకోమని తనకు తానుగా చెయ్యి చాపలేక సిగ్గుపడడం, అలానే రామచంద్రమూర్తి కూడా, తనకు తానుగా చెయ్యి చాచి సీత చేతిని పట్టుకోవడానికి, పెండ్లికాకముందే ఇంత తొందరా? ఎంత రసికుడయ్యా రామచంద్రుడు అని ఎదురుగా కూర్చొని కల్యాణం తిలకిస్తున్నవారు భావింతురని బిడియపడడం గమనించిన జనకుడు, తానే సీత చేతిని రాముని వైపుకు త్రోస్తూ, 'ఇయం సీతా' ఈమె సీత, నా కుమార్తె, ఈమె చేతిని గ్రహించి నీ ధర్మపత్నిని చేసుకో, నిను నీడలా అనుకరిస్తుంది.

రామయ్యా! ఎదురుగా ఉన్న సీత నీకు కానరాలేదని కాదయ్యా... 'ఇయం సీతా' ఈమె సీత అని చెప్తున్నది; నీవు శివధనస్సును ఎక్కిపెట్టినప్పుడే అర్ధమైంది - నీవు విష్ణువే అని! నీ ధర్మపత్నియైన లక్ష్మీదేవియే ఈ సీత అని నీవు గ్రహించాలనే 'ఇయం సీతా' అని చెప్తున్నానయ్యా. ఈమె చేతిని అందుకొని నీ ధర్మపత్నిని చేసుకో, నిన్ను నీడలా అనుగమిస్తుంది.

'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. సీతా ... ఇదేం పేరు అని యెంచకు. ఈమె నాగటిచాలుకి తగిలి, తనకు తానుగా పైకి లేచిన బాలిక. ఈమె అయోనిజ. ఈమె సీత అని, నాకు కూతురు అవుతుందని అశరీరవాణి చెప్పింది.  ఏ ఫలాపేక్ష లేక, కర్షకునికి భూమాత ఎట్లు ఫలములను కలిగించునో, అట్లే; నా సీత కూడా ఏ ఫలాపేక్ష ఆశించక, నీ ధర్మస్థాపనలో నీకు సహకరిస్తుంది. తల్లి భూదేవి వలెనె సహనంతో నీకు సహకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవీమెను నీ ధర్మపత్నిగా గ్రహించు.

'ఇయం సీతా' ఈమె సీత, నా కుమార్తె. నీకు సహధర్మచారిణి. నీతో కలసి ధర్మమూ ఆచరిస్తుంది. నీవు చేసే ధర్మస్థాపనలో నీకు తోడై యుండి, నీ ధర్మకార్యం సఫలమగునట్లు చూస్తుంది. నీవు ఎట్లు నీ తండ్రి వాక్యం శిరసావహించి పాలించుచున్నావో, ఈమెయూ నీ వాక్యం పాలించి, నీవు నిర్వహించు ధర్మకార్యములన్నింటిలో నీకు తోడై యుండును.

'ఇయం సీతా' ఈమె సీత. పరమాత్మవైన నీకు సహధర్మచారిణి. నీ సహధర్మచారిత్వమీమెకు సహజసిద్ధం. ధర్మఉద్ధరణకై నీవు చేయు కార్యములయందు సహధర్మచారిణియై నీకు సహకరించడానికి 'సీత'లా అవతరించిన ఈమె పరమాత్మానుగ్రహంతో నా కుమార్తె. నీ ధర్మచారణలో తోడై వుండే ఈమెను నీవు స్వీకరించి, ధర్మస్థాపన చేయు.

మన హిందూ వివాహపద్ధతిలో వధూవరులిద్దరూ గృహస్థాశ్రమంలో ఆచరించవలసిన ధర్మములలో ధర్మానికే ప్రముఖత్వం ఉంది. వివాహమనేది ప్రధానంగా ధర్మాచరణకొరకై నియమింపబడినది. అర్ధకామాలకంటే ధర్మమే ప్రధానమైనది కావున భార్యను ధర్మపత్ని అంటారు.
వివాహఘట్టమందు -
'నాయనా! ఈమె నా కుమార్తె. ఈమెను నీ భార్యగా స్వీకరించు. నీవు చేసే సకల ధర్మాచరణలయందు సహధర్మచారిణిలా నిన్ను అనువర్తిస్తుంది. ఇక నా కుమార్తె చేతిని అందుకుని, ప్రేమగా చూసుకో' అని వరునికీ,
అలానే వధువునకు - 'తల్లీ! నీవు నీ భర్తని ఛాయలా వెంబడించు. నీ భర్తకు నీడలా వెన్నంటే ఉండు, అతని పనుల యందు సహకరించు' .....
అన్న సందేశం జనకునిది. జనకుడు అంటే తండ్రి అని అర్ధం. జనకుడు సీతకు మాత్రమే తండ్రిగా కాదు, సర్వులకు తండ్రే, ముఖ్యంగా వధువులందరకు ఆయన తండ్రే. ఆయన కన్యాదానం చేస్తూ చెప్పిన పై శ్లోకంలో సందేశం అందరు వధూవరులకు ఆచరణీయం.

25, మార్చి 2013, సోమవారం

"ఆహా ... నా నెచ్చలి బహు బుద్ధిశాలి" !




రెండురోజుల క్రితం - 
హరిప్రియ (స్నేహితురాలు) నుండి ఫోన్ ... 'నేనిప్పుడు ట్రైన్లో ఉన్నాను, చిన్నమ్మ (పిన్ని) దగ్గరకు వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతాను. ఓకే నా' !
నిన్న ఉదయం -
తననుండి మరల ఫోన్ ... 'ఇప్పుడే ఇంటికి వచ్చాను, వీలైతే రా, నీతో ఓ విషయం చెప్పాలి.....'!
నిన్న సాయంత్రం తనింటికి వెళ్లగా, తను చెప్పిన విషయం ఏమిటంటే -
ఈ మధ్యనే తన మరదలకి పాప పుట్టింది. పేరు సన్వి. పెద్దపాప పేరు సమన్వి. రెండుసార్లు సిజేరియన్ కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అదే వారి చిన్నమ్మకు కోపకారణమైంది. ఎంతో సఖ్యతగా ఉండే అత్తాకోడళ్ళ మధ్య ఈ కారణంగా చిరు స్పర్ధ. ఎవరికైన ఒక్కపుత్ర సంతానమైన ఉండాలని, పాపని చూడడానికి ఎవరు వచ్చినా, నా మాట వినలేదు, పున్నామ నరకంనుండి రక్షించే పుత్ర సంతానం లేదని అనడం ... ఆ మాటలకు బాధపడి మరదలు ఫోన్ చేస్తే ఊరు వెళ్లి, చిన్నమ్మకు కౌన్సిలింగ్ చేసి వచ్చాను అని!
ఓహో ... ఏమని కౌన్సిలింగ్ ఇచ్చావో చెప్పుమరి, అని అడగగా -
ఏముందీ, నాతో కూడా చిన్నమ్మ అవే మాటలంది. ప్రియమ్మా! నీవైనా చెప్పు, తల్లితండ్రులను ఉద్ధరించేది కొడుకే కదమ్మా, పుత్రుడే కదా పున్నామ నరకంనుండి రక్షించేది, కొడుకు వలనే కదమ్మా మోక్షమని శాస్త్రం చెప్తుంది, ఇదే నేనంటున్నానని మీ తమ్ముడు, మరదలు నన్ను తప్పు పడుతున్నారు, నేను అన్నదాంట్లో తప్పేం ఉంది? అని అమాయకంగా ప్రశ్నిస్తున్న చిన్నమ్మ మీద కొంచెం కోపం, జాలి కలగగా, ఓపిగ్గా చెప్పాను, అమ్మ ఆలోచన తప్పని!
తనేం చెప్పిందో తన మాటల్లోనే -
"అపుత్రస్య గతిర్నాస్తి' అన్న మాట శాస్త్రంలో ఉన్నమాట నిజమే గానీ, అమ్మా! ఆ మాట ఈ కాలానికి చెందినది కాదు. కొన్నివేల సంవత్సారాలు క్రితం, అప్పటి రాజులు తమ రాజ్యాన్ని పరిపాలించినంతకాలం పరిపాలించి, అటుపై పుత్రునికి రాజ్యాధికారమును అప్పగించి, తమ తమ జన్మలను తామే ఉద్ధరించుకోవాలని అన్నింటిని పరిత్యజించి వానప్రస్థం స్వీకరించేవారు. అటువంటివారు పుత్రుడు జన్మిస్తే కొంతకాలానికి వారికి రాజ్యపరిపాలన అప్పగించి, నిశ్చింతగా తపస్సు చేసుకోవాలని పుత్రున్ని కోరుకునేవారు. అప్పటి కాలధర్మప్రకారం పుత్రుడు ఆవశ్యకమై శాస్త్రంలో చెప్పిన మాట అది. అమ్మా! పుత్రులు లేనివారికి మోక్షం లేనిచో, అసలు భార్యాబిడ్డలే లేని నారద, శుక, సనక, సనందనాది మహర్షులు, శంకరాచార్యులు, షిర్డీ బాబా, రమణులు మొదలగువారికి మోక్షసిద్ధి ఉండకూడదు కదా! అమ్మా! నీకు షుగర్ ఉందని నీవు మందు వేసుకోకుండా తమ్ముడు వేసుకుంటే నీకు షుగర్ తగ్గుతుందా? నీకు ఆకలి వేసినప్పుడు తమ్ముడు భోజనం చేస్తే నీ ఆకలి తీరిపోతుందా? అలానే నీ ప్రారబ్ధకర్మలను నీవే క్షయం చేసుకొని, మోక్షసిద్ధిని పొందాలే తప్ప, పుత్రుడిని కన్నంతమాత్రమున రాదమ్మా. అయితే అమ్మా, ఎంత దుష్టులైన పుత్రున్ని కంటే చాలు, మోక్షాన్ని పొందేస్తారా? మోక్షానికి అర్హత పుత్రున్ని కనడమేనా? "అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం" ఎవరు చేసిన కర్మఫలితం వారికే సిద్ధిస్తుందని శాస్త్రవచనం ఉంది కదా. మనం చేసుకున్న పుణ్యకర్మలు, సాధన బట్టే మోక్షసిద్ధి వస్తుందమ్మా. తల్లితండ్రులను ప్రేమతో చూసుకున్న బిడ్డలు, తాముచేసిన ఈ పుణ్యకర్మవలన తాము ఉద్ధరింపబడతారు. అలానే, తమను ఆత్మీయంగా చూసుకుంటూ, తాముచేయు పుణ్యకర్మలకు సహకరించిన సంతానం వలన తల్లితండ్రులు కొంత ఉద్ధరింపబడతారన్న మాట వాస్తవమే అయినను, అంతమాత్రమునే మోక్షం రాదు. ఇక, పితరుల సౌఖ్యం కొరకు ఆచరించే పితృకర్మలు (శ్రాద్ధములు మొ...) ద్వారా పితరులకు కొంత సౌఖ్యం, పిల్లలకు పితృదేవతలనుగ్రహం దొరుకుతుందే తప్ప, అంతమాత్రమున మోక్షం రాదని చెప్పా!

అబ్బా ... ఇంత చక్కగా ఎలా చెప్పావ్ అని అనగా, 'నీ సాంగత్యంలో అలవడిన పుస్తక పరిజ్ఞానంతో' అన్న తన మాటలింటూ, హృదయపూర్వకంగా ఇలా అనుకున్నాను -

"ఆహా ... నా నెచ్చలి బహు బుద్ధిశాలి" !