25, జూన్ 2012, సోమవారం

సద్గురువు

మాయాజగత్తులో ప్రవేశించి అజ్ఞానంతో ప్రాకృతదారపుత్ర గ్రహదులయందు భవపాశంచే కట్టబడిన మానవుణ్ణి బంధవిమోచనమును చేసి హృదయలోతుల్లో నిక్షిప్తమైన జ్ఞాననిధిని వెలికి తీసుకురాగలవారు, భౌతికమైన స్వరూపాలకు అతీతమైన దైవానుభవం కల్గించేవారు, దేవాలయమనే దేహంలో దైవత్వాన్ని దర్శింపజేసేవారు, ఆత్మను పరమాత్మలో చేర్చగలవారే నిజమైన సద్గురువులు. 'తమసోమా జ్యోతిర్గమయా' అజ్ఞానమనే చీకట్లును పోగొట్టి జ్ఞానమనే వెలుగులను నింపే సమర్ధుడే సద్గురువు. 


'ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే' ఈశ్వరుడు, సద్గురువు, ఆత్మ ఒక్కటే. మూర్తి భేదభావమే తప్ప తేడాలేదు. 

స్వస్వరూపమును తెలియజేప్పేదే నిజమైన విద్య. ఇదే శాశ్వతానంద విద్య, ఆధ్యాత్మిక విద్య. ఇంతటి ఆధ్యాత్మికవిద్య గురుముఖతా రావాలి.
వేదన్తానామనేకత్వాత్ సంశయానాం బహుత్వతః / 
వేదాస్యాప్యతిసూక్ష్మత్వాత్ న జానాతి గురుం వినా //
వేతాంతమార్గములు అనేకములగుటచేతను, సంశయములు అనేకములగుటచేతను, తెలియదగిన బ్రహ్మము మిక్కిలి సూక్ష్మమగుటచేతను గురుదేవుడు వినా ఇది గోచారం కాజాలదు. 
భక్తుల కోరిక వలన  మానుషస్వరూపంలో(స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం) మానవులను తరింపజేయుటకోసం ఆ సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు ప్రియభక్తునిపై కృప కలిగి, భక్తుని పరిపక్వస్థితిని బట్టి, వాని పురోభివృద్ధి కొఱకు తన దివ్యత్వాన్ని గురురూపంలో వ్యక్తపరుస్తాడు.  
మానవులు సృష్టిలో భగవంతున్ని స్వయంగా తమంతట తాముగా  చేరుకోలేరు. స్వప్రయత్నంతో భగవంతుడిని చేరుకోవడం కష్టం కాబట్టి గురువు ఆవశ్యకత తప్పనిసరి. 
గురువు నిశ్చయంగా అవసరం. గురువుతప్ప మరెవ్వరూ, బుద్ధి ఇంద్రియాలకు సంబంధించిన విషయకీకారణ్యం నుంచి మానవుణ్ణి బైటికి తీసి రక్షించలేరని ఉపనిషత్ పేర్కొంటుంది. సాధరణంగా సాధకులు తమ మనస్సులతో ఈశ్వరచింతన చేయుదురు. మనస్సు త్రిగుణాత్మకం. త్రిగుణములకు, మనోబుద్ధులకు అతీతమైన బ్రహ్మమును ఆత్మానుభవంగల ఆచార్యుని వలననే దైవతత్వం తెలుసుకోగలరు. 'తద్విజ్ఞానార్ధం స గురుమేవాభి గచ్చేత్సమిత్పాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్టం' (ముండకోపనిషత్)  
భవబంధాలచే ఆత్మవిస్మృతి కలిగియున్న జీవునకు ఆత్మావభోధమును గలుగజేయువాడే గురుదేవుడు. నిరంతర నిశ్చల ఆత్మనిష్టాగరిష్టులై, అందరి యెడల, అన్నింటి యెడల, సర్వకాల సర్వావస్థల్లో, సర్వచోట్ల సర్వులయందు, స్థిరచిత్తులై సమదృష్టి కలిగియుండినవారే సద్గురువులని శ్రీరమణులు అంటారు. 
   
  

       
         వందే గురుపరంపర                                          
ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ 
కర్త్రుభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః 
అధ్యాత్మవిద్యా సంప్రదాయకులైన ఉపనిషత్కర్తలకును, వంశ ఋషులకును, ఆదిబ్రహ్మ మొదలుకొని సకలమహాపురుషులకును, సద్గురుమూర్తికిని నమస్కారం.  

ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే 
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః 
ఓంకారవాచ్యులును, శుద్ధమైన జ్ఞానమే ఆకారంగాగల వారును, నిర్మలులును, ప్రశాంతులు నగు శ్రీ దక్షిణమూర్తికి నమస్కారం.

ఓం హయాస్యాద్యవతరైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః
కృతార్ధతాం గతాస్తం వై నారాయణ ముపాస్మహే 
హయగ్రీవమూర్తి మొదలైన యెవని అవతారములచే మునీశ్వరులు జ్ఞానసిద్ధులై కృతార్ధులైరో అట్టి శ్రీమన్నారాయణమూర్తిని ఉపాసించుచున్నాం.

ఓం వేదతత్వైర్మహావాక్యె ర్వసిష్టాద్యా మహర్షయః 
చతుర్భిశ్చతురా ఆనన్ తం వై పద్మభువం భజే 
వసిష్టాది బ్రహ్మరుషులు ఎవనియొక్క వేదసారమైనట్టి జీవేబ్రహ్మైక్య ప్రతిపాదకమగు (ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్త్వమసి, ఆయనాత్మ బ్రహ్మ అను) నాలుగు మహావాక్యములచే చతురులై మహాత్పదమును చెందిరో అట్టి పద్మజుడగు చతుర్ముఖబ్రహ్మను భజించుచున్నాను.

బ్రహ్మర్షిర్ర్బహ్మవిద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః 
తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్టం భజే న్వహమ్ 
బ్రహ్మఋషియు, బ్రహ్మవిద్వర్యుడును, బ్రహ్మస్వరుపుడును, బ్రహ్మనిష్టులందు ప్రేమగలవాడును, తపస్వియు, తత్త్వవేత్తయును అయిన వసిష్టభగవానుని ప్రతిదినమును  భజించుచుందును.

యోగజ్ఞం యోగినాం పర్వం బ్రహ్మజ్ఞానవిభూషితమ్ 
శ్రీమద్వసిష్టతనయం శక్తిం వందే మహామునిమ్ 
యోగ మెరిగినవాడను, యోగులలో ఉత్తముడును, బ్రహ్మజ్ఞానం చేత అలంకరింపబడినవాడును, బ్రహ్మవిద్యా సంపన్నుడైన వసిష్టభగవానుని కుమారుడును, మహామునియును అగు శక్తికి నమస్కరించుచున్నాను.

ధర్మజ్ఞం ధార్మికం ధీరం ధర్మాత్మానం దయానిధిమ్ 
ధర్మశాస్త్రప్రవక్తారం పరాశరమునిం భజే
ధర్మం లెరింగినవారును, ధర్మముల నాచరించువారును, నిర్మోహమైన ధైర్యం గలవారును, బుద్ధిని స్వాదీనమందుంచుకొన్నవారును, ధర్మస్వరూపులును, దయాసముద్రులును, ధర్మశాస్త్రమును రచించినవారును అగు పరాశరమునిను భజించుచున్నాను.

కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతమ్ 
వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిమ్ 
వేదములను విభజించినవాడును, అన్నిలోకములవారి మేలును గురించి ఆసక్తి గలవాడును, వేదములనెడి పద్మములను వికసింపజేయుటలో సూర్యునివంటివాడును, శమము దమము మొదలైనవానికి స్థానమైనవాడును అగు కృష్ణద్వైపాయన మహామునికి (వ్యాసుడు) నమస్కరించుచున్నాను.

శ్రీపరాశరపౌత్రం శ్రీవ్యాసపుత్ర మకల్మషమ్ 
నిత్యవైరాగ్యసంపన్నం జీవన్ముక్తం శుకం భజే 
శ్రీపరాశరముని మనుమడును, శ్రీవేదవ్యాసభగవానుని కుమారుడును, ఏ విధమైన కల్మషం లేనివాడును, జీవన్ముక్తుడును అగు శుకమహామునిని భజించుచున్నాను.

ఓం మాండుక్య కారికాకర్తా యో భాతి బ్రహ్మవిద్వరః
శ్రీగౌడపాదాచార్యం తం ప్రణమామి ముహుర్ముహు:
బ్రహ్మజ్ఞానులలో శ్రేష్టుడైన యే మహానుభావుడు మాండుక్య కారికలను రచించినవాడై ప్రకాశించుచున్నాడో అట్టి గౌడపాదాచార్యులకు మాటిమాటికి నమస్కరించుచున్నాను.

ఓం యోగీశ్వరం వేదచూడం వేదాంతార్ధనిధిం మునిమ్ 
గోవిందభగవత్పాదాచార్యవర్య ముపాస్మహే 
యోగీశ్వరుడును, ఉపనిషదర్ధమునకు నిధియును, మననశీలుడును అగు గోవిందభగవత్పాదాచార్యులవారిని ఉపాసించెదను.

హరలీలావతారాయ శంకరాయ వరౌజసే 
కైవల్యకలనాకల్పతరవే గురవే నమః 
ఈశ్వరుని లీలావతారమును, గొప్ప తేజస్సుగలవాడును, మోక్షమను ఫలం నిచ్చుటకు కల్పవృక్షంవంటివాడును, జగద్గురువు నగు శ్రీశంకరభగవత్పాదాచార్యులవారికి నమస్కారం.

ఓం సచ్చిదానందరూపాయ వ్యాపినే పరమాత్మనే 
నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే  
సత్ చిత్ ఆనందం అనునవివే స్వరూపముగా గలవాడును, వ్యాపకుడును, పరమాత్మస్వరూపుడును, వేదవేదాంతములచే తెలియదగినవాడును, దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ఉండువాడు నగు గురువునకు నమస్కారం.


  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి