21, ఆగస్టు 2015, శుక్రవారం

మాటే మంత్రం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఐదవభాగం]

అర్ధవంతమైన ఆదర్శవంతమైన జీవితానికి, నైతికవర్తనతో కూడిన జీవనానికి ఆధ్యాత్మిక పురోగామిత్యమే మార్గదర్శకంగా వుంటుంది. ఈ ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధ్యమో తెలియజేస్తున్నాయి మన శాస్త్రములు. శాస్త్రములు అంటే యోగులు, జ్ఞానులు స్వానుభవం బట్టి నిర్ణయించిన సరళధర్మములు. వాటిని అవగాహన చేసుకొని ఆచరిస్తే పారమార్ధికంగా పురోగతి సాధించవచ్చు.

నా అవగాహన మేరకు మనలో ఉన్న సప్తచక్రములు గురించి, ఆ సప్తచక్రాలలో జాగృతి తీసుకువచ్చే సప్తగ్రహాలు గురించి తెలిపే ప్రయత్నం కొన్ని టపాలా ద్వారా తెలియజేస్తున్నాను. 

ప్రతీ చక్రానికీ, ప్రతీ గ్రహానికీ  శారీరక, మానసిక, లేక ప్రాపంచిక, పారమార్దికంగా విధులు ఉంటాయి. ప్రతీ చక్రకేంద్రమునకు ఉద్భోదనము, ఉత్తేజం కలిగించు శబ్దములు లేక అక్షరములు కొన్ని కలవు. వీటిని ఓ క్రమమైన పద్ధతిలో ఉచ్చరించుటవలన ఈ కేంద్రముల ప్రవృత్తిల యందు మార్పులు కలిగి ఆ చక్రాలలో తేడాలు సర్దుబాటుయగును. దానివలన వ్యాధులు నిర్మూలనమగును. ఈ బీజాక్షరములను సరైన పద్ధతిలో ధ్యానించడం వలన  అనారోగ్యములు తొలగడమే కాకుండా మానసిక వికారములు కూడా పోయి బుద్ధి వికసించును. అయితే ఈ విధమైన సాధన కష్టమని భావించేవారికి కొన్ని సులభమార్గములను మన యోగులు సూచించారు. గ్రహాలను సానుకూలపర్చుకోవడం ద్వారా, ధ్యానసాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమేనని తెలిపారు. గ్రహాలనుండి అనుగ్రహ ప్రవాహాన్ని స్వీకరించే శక్తి మనలో వున్న చక్రాలుకు వుంది. అందుకే గ్రహాలను సానుకూలంగా పనిచేయాలంటే ఏం చేయాలో సూచించారు. ఆ సూచన సద్గుణాల సాధన. ఈ విధమైన అంటే గ్రహాలను సానుకూలపరుచుకునే సాధన సాగించిన కొలదియు భక్తీ, ధ్యానం, చక్రజాగృతి, ఆత్మార్పణం ... ఇతరసుగుణములు ఒకటొకటిగా అంతరంగం నుండి వికాసం నొందును.  ధ్యానమంటే మనలో వున్న మాలిన్యాన్ని తొలగించుకోవడమే. ధ్యానం ద్వారా మాత్రమే మనస్సుకు వారసత్వంగా సంక్రమించిన స్వభావంనుండి విడుదల కావడం సాధ్యమవుతుంది. 

గత నాలుగు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదవ చక్రమైన విశుద్ధిచక్రం గురించి తెలుసుకుందాం -

విశుద్ధిచక్రం - 
 
ఐం హ్రీం శ్రీం రాం సోహం హంసశ్శివం: విశుధ్యధిష్టానదేవతాయై డాకినీ సహిత జీవేశ్వర స్వరూపిణ్యాంబాయై నమః

ఈ కమలం 16 దళాలుతో ఉంటుంది. ఆకాశతత్త్వం. అధిదేవత డాకిని. ఈమె అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ , ఓ, ఔ , అం ,అః   అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పాయసాన్నమందు ప్రీతి. తెల్లని ఏనుగు (ఐరావతం) వాహనం.  

కంఠప్రదేశం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 25,344 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. విశుద్ధి అంటే పవిత్రం (శుద్ధి) చేసేది అని అర్ధం. ఈ చక్రాన్ని సాధిస్తే పరమ పవిత్రులై, ఆత్మదర్శనానికి వున్న అడ్డంకులు తొలగించుకున్నవారై, తాము తెలుసుకున్నదానిని ఇతరులకు చక్కగా బోధించగలరు. ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం.  జ్ఞానేంద్రియం చెవి. 

ప్రతీ మనిషికి వాక్కు చాలా ముఖ్యమైనది. తనని తాను వ్యక్తపరుచుకోవటానికి వాక్కు చాలా అవసరం. మన సంస్కారమును తెలిపేది వాక్కే. అందుకే పెద్దలంటారు - 'బుర్ర(తల) విలువ నోరు చెప్తుంది' అని! ఊరికే మాట్లాడడం కాదు, చక్కగా మాట్లాడగలగాలి. మృదుభాషణం చక్కటి సంబంధ భాంధవ్యాలను నెలకొల్పుతుంది. పరుషవాక్కులు, వక్రభాషణం ఎన్నో అనర్ధాలను అంటగడుతుంది. మంచి స్నేహాలను, మంచి బంధాలను, సామరస్యవాతవరణం నుంచి దూరం చేస్తుంది. అలానే మాట్లాడకూడని సమయంలో మాట్లాడినా, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోయినా పొందవలసిన జీవితం చేజారిపోయినట్లే. ఇంత ముఖ్యమైన వాక్కుకు కారణం కంఠభాగంలో ఉన్న ఈ విశుద్ధచక్రమే. మాట ఎలా వుండాలంటే  ...  వివరణకై  ఇక్కడ చూడండి 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
ముక్కు, నోరు, గొంతు, చెవులు మున్నగు భాగములకు సంబంధించిన వ్యాధులన్నియూ ఈ చక్రం పరిధిలోనికే వచ్చును. థైరాయిడ్ సమస్యలు వచ్చును. మాటలు సరిగ్గా రాకపోవడం, ఎలర్జీ, ఆస్తమ, టాన్సిల్స్ మొదలైన వ్యాధులు కలుగుతాయి. సంతానలేమికి కూడా ఈ చక్రం కొంత కారణం. 

ఈ చక్ర మానసిక స్వభావం:-
మూసుకుపోవడం వలన భావవ్యక్తీకరణలో లోపం. వాక్కులో అనేక అపసవ్యాలు. ఊహాశక్తి లోపిస్తుంది. 

తెరుచుకుంటే వాక్సుద్ధి. కవితాశక్తి, స్వర విజ్ఞానం, శాంతచిత్తం, శోకం లేకపోవడం, దీర్ఘాయువు. 

 విజ్ఞానమయకోశంతో సంబంధం ఉన్న ఈ విశుద్ధచక్రం ద్వంద్వాతీత చక్రం. చైతన్యపూరిత చక్రం. ఇక్కడకు చేరిన సాధకుడు ఆనందస్థితిని పొందుతాడు. ఈ ఆనందపారవశ్యంలో తదుపరి గమ్యాన్ని మరిచిపోకుండా ముందుకు సాగాలి. ఇక్కడే ఆత్మజ్ఞానం కల్గుతుంది. అహం నశిస్తుంది. నేను అనే తత్త్వం పూర్తిగా నశించి, నేను 'ఆత్మ'పరమై నా ఆత్మ అన్న భావం నుండి విశ్వాత్మ భావన లోనికి మారి, సాధకుడు కవి, వాగ్మి, బ్రహ్మజ్ఞాని అవుతాడు. భూత, భవిష్యత్తు, వర్తమానములను దర్శింపగలుగుతారు. జీవించుట తనకోసంకాక సృష్టి యందలి సకల జీవుల రూపంలలో నున్న పరమాత్మకొరకని తెలుసుకొని తదనుగుణంగా జీవిస్తాడు. విశ్వశ్రేయస్సును సాధించువాడగుటచే శోకం గానీ, రోగంగాని లేక చిరంజీవియై యుందురు. ఈ చక్రం శుభమును కోరువారికి, ఇంద్రియనిగ్రహం గలవారికి మోక్షద్వారం. 

ఈ చక్రమందు పదహారు దళాల యందు అ నుండి అః వరకు గల పదహారు అక్షరములు పదహారు కళలు. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల చంద్రుని పదహారు కళలే ఈ పదహారు రూపములు. చంద్రుడు మాతృత్వమునకు, గర్భధారణకు అధిపతి. అమావాస్య సృష్టి లయమై యున్న స్థితిని, పౌర్ణమి సృష్టి పూర్తిగా వ్యక్తమైయున్న స్థితిని తెలియజేయును. 

మరి ఈ చక్రమును ఎలా శుద్ధిచేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు డాకిని అధిష్టానదేవత. ఈమెకు పాయసాన్నం నందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పాయసాన్నం స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, 'హం' అను బీజాక్షరంను ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. 

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 

నిర్మలమైన నీలాకాశాన్ని చూడాలి. ఈ చక్రంపై మనస్సును నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు ఆకాశంవలె పరిశుద్ధం అవుతుంది. నిర్మలమౌతుంది. 
ఈ చక్రంనకు అధిపతి కుజుడు. ధైర్య సాహసాలకు సంబంధించిన గ్రహమిది. కుజుడు బాగా వేగం వున్నవాడు. పటుత్వం వున్నవాడు. అగ్నికి, ఆయుధాలకు సంబంధించినవాడు. ఎక్కడ స్థిరత్వముందో, ఎక్కడ కాళ్ళ క్రింద భూమి కృంగిపోతున్నా చలించని ఆత్మవిశ్వాసముందో, ఎక్కడ సూటిదనముందో, ఎక్కడ సమానత్వముందో అక్కడ కుజుని శక్తి అపారంగా వున్నట్లు అర్ధం. మనలో ఈ లక్షణములను అభివృద్ధి పరుచుకుంటే ఈ చక్రం సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా విశుద్ధి చక్రం సానుకూలం. 

తదుపరిచక్రం 'ఆజ్ఞాచక్రం' గురించి తదుపరి టపాలో ... 


23, జులై 2015, గురువారం

ప్రేమమయం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [నాల్గవభాగం]

గత మూడు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాల్గవ చక్రమైన అనాహతచక్రం గురించి తెలుసుకుందాం -

అనాహతచక్రం :-
ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్శోహం అనాహతాదిష్టాన దేవతాయై రాకినీ సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః 

ఈ కమలం 12 దళాలు కలది. వాయుతత్త్వం. అధిదేవత రాకిని. ఈమె క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ  అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలది. జింక వాహనం. 

హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం. ఆగని శబ్దబ్రహ్మం ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం. ఓంకార శబ్దం. ఈ చక్రాన్ని జయిస్తే సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు. దిగువనున్న మూలాధారాది మూడుచక్రాలకు, ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం చేస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం చర్మం. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
చర్మవ్యాధులు, రక్తంనకు సంబంధిన వ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండెజబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. 

ఈ చక్ర మానసిక స్వభావం :-
మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు. 

తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత వికసించటం. 

మనోమయకోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందే ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్) పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది. 

మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు రాకినిఅధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి. స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు  ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు. 

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 
ఇతరులకు హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి. 
ఇక  ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలును, అతి తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాబ్యాసం చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ గ్రహం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది. 

తదుపరి చక్రం 'విశుద్ధచక్రం' గురించి తదుపరి టపాలో ... 


15, జులై 2015, బుధవారం

సాధనా లక్ష్యం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి {మూడవభాగం}

గత రెండు టపాల్లో మూలాధారం మరియు స్వాధిష్టాన చక్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ చక్రమైన మణిపూరక చక్రం గురించి తెలుసుకుందాం -


మణిపూరకచక్రం :-
ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః 

ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు.  'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి. 

బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాదులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి. 
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు.  తనను గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం. 

తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు. 
ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే. 

లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.   

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగంను స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 
అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. 
అలాగే ఈ చక్రంకు అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. బ్యాంక్ బాలెన్సు నుండి మెంటల్ బాలెన్సు వరకూ ఆధిపత్యం ఈ గురుగ్రహనిదే. 
చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వంను అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి. 

ముఖ్యగమనిక :-
కొందరు ఈ చక్రం అగ్నితత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం జలతత్త్వంనకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలదిగా నిర్ధారణ చేసుకోవచ్చు. 

తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా 
స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్ 
తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్ 
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ 

మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారంను పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును. 

తదుపరి చక్రం 'అనాహతం' గురించి తదుపరి టపాలో ... 


6, జులై 2015, సోమవారం

సాధనాసోపనం --- చక్రశుద్ధి -ఆనందసిద్ధి{రెండవభాగం}

క్రిందటి టపాలో మొదటిచక్రమైన మూలాధారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవచక్రమైన స్వాధిష్టానం గురించి తెలుసుకుందాం -

స్వాధిష్టానచక్రం :-



ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యైనమః 

ఈ కమలం ఆరు దళాలుగల అగ్నితత్త్వం కలది. అధిదేవత కాకిని. ఈమె బ, భ, మ, య, ర, ల అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి. 'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా / దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ // మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  
స్వాధిష్టానం (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవంనకు తీసుకొచ్చే చక్రమిది. 

జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే.  జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది. 
ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కు సహాయకారి.  దీనిలోశక్తి  చైతన్యరూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
శారీరకంగా పాండురోగం, కంటిజబ్బులు, గర్భకోశ వ్యాదులు, జ్వరాలు లాంటి రుగ్మతలకు కారణమౌతుంది. 

ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన మితిమీరిన కామవాంఛ. విషయసుఖాలపై ఆసక్తి, అపరాధభావన, దురాశ, క్రోధం, అనుమానం, ఉద్రేకం జూదరితనం, వివాదాస్పదతత్త్వం, నిరాశనిస్పృహలు.  
స్వాధిష్టానం తెరుచుకుంటే సత్యం అవగాహన అవుతుంది.  జీవియందలి 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. అట్టి అహంకారంవలన జీవుడు తనను తానూ పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేనున్నాను అను సంకల్పంగా పనిచేయుచున్నది. తానేమిటో మర్చిపోయిన మనిషి ఆ మరిచిపోయిన సత్యానికై బయట దొరుకుతుందని వెదుకులాడుతూ తపన చెందుతున్నాడు, బాహ్యంగా గోచరిస్తుందని భ్రమిస్తున్నాడు, బయట నుండి సంపాదించవచ్చని ఆరాటపడుతున్నాడు, బాహ్యంగా దర్శించవచ్చని తాపత్రయపడుతున్నాడు. ఓ చర్యలో, సంఘటనలో, సన్నివేశంలో, పరిచయంలో ఈ సత్యం లేదని, అది బయటనుండి రాదనీ, మనలోనుండే రావాలని, అంటే తనలో తానై ఈ సత్యం వుందన్న అవగాహనయ్యేది  ఈ చక్రశుద్ధి వలనే .  
ప్రాణశక్తి చక్కగా ఆవిర్భవిస్తుంది. ఈ చక్రాన్నిఅధిగమిస్తే ఇంద్రియాలన్నింటిపైన నియంత్రణ కల్గుతుంది. 
అలానే ఈ నాడీకేంద్రం  అంతర్గత సంస్కారానికి వేదిక. 

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం ???
శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే - 
ఈ చక్రంనకు కాకిని దేవత.  మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  ఈ చక్రం బలహీనంగా ఉంటే పెరుగన్నంను బలం కలుగుటకు స్వీకరించాలి. కాచిన పాలలో అన్నం వేసి తోడుపెట్టి ఉదయముననే ఆ పెరుగన్నం తినవలెను.వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "వం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 

ఈ  చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 

కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, మైత్రిల్లాంటి సద్గుణాలను అలవర్చుకోవాలి. అలాగే అహింసా వ్రతం(ఏ ఒక్కర్నీ మాటలతోగానీ, చేతలతోగాని నొప్పించి,బాధించే ప్రవృత్తి లేకుండా వుండడమే అహింస) ఆచరించాలి. 
అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రుడు. ఉల్లాసనికీ, మర్మాంగలకు, కామప్రకోపానికీ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు విశేషించి స్త్రీల జబ్బులకు కారణభూతుడు. ఈ గ్రహం సానుకూలంగా వుండాలంటే - 
హాయిగా నవ్వాలి. ఆనందంగా సంతోషంగా వుండాలి. సంగీతం, నాట్యం, రచన, హాస్యచతురత ఈ గ్రహపరిధిలోనివే. అందుచే యాంత్రికతకు భిన్నంగా మనస్సును రంజింపజేసే వినోదకార్యక్రమాలు, లలిత కళలలో పాల్గొంటూ, ఒకింత కళాపోషణ అలవర్చుకోవాలి. గాయత్రీ మంత్రాన్ని జపించడం, తాను నొవ్వక ఎదుటివార్ని నొప్పించక జీవించడం, మన భావాలు మరొకరికి భారం కాకుండా, బాధ కల్గించకుండా చూసుకోవడం లాంటివి ఆచరించగలిగితే శుక్రగ్రహం అనుగ్రహంతో స్వాధిష్టానం అనుకూలించి జాగృతి అవుతుంది. 




ముఖ్య గమనిక :-
కొందరు ఈ చక్రం జలతత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం అగ్ని తత్త్వంకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరి లో తెలిపిన  పద్యం ఓసారి గమనిస్తే ఇది అగ్నితత్త్వం గలదిగా నిర్ధారణ చేసుకోవచ్చు. 
తవస్వాదిష్టానే హుతవహ మధిష్టాయ నిరతం 
తమిళేసంవర్తం జనని మహతీంతాం చ సమయాం 
యదాలోకేలోకాన్ దహతి మహతి క్రోధకలితే 
దయార్ద్ర యాదృష్టి: శిశిర ముపచారం రచయితి 
అగ్ని తత్వానికి ఉత్పత్తి స్థానమగు స్వాదిష్టాన కమలమున ప్రళయాగ్ని జ్వాలారూపమైన శక్తి ద్యానింప తగినది. ప్రళయాగ్ని శక్తుల వలన జగములు భస్మమగును. భస్మములైన లోకములు మణిపూరక కమలమునందున్న భగవతి కృపచేత నిలుచుచున్నవి.

తదుపరి మణిపూరక చక్రం గురించి తదుపరి టపాలో ...

19, జూన్ 2015, శుక్రవారం

చక్రశుద్ధి - ఆనందసిద్ధి

ప్రతీ సాధకుడు ముందుగా ఈ విషయాల్ని గ్రహించాలి - 'ప్రాపంచికం, పారమార్ధికం వేరు వేరు కాదు, రెండింటి మేళవింపే జీవితం' అని. 'సానుకూలదృక్పదం, ఏకాత్మతా భావం, శాంతి సహనాలు, భగవత్ స్పృహ ... వీటన్నిటి సమాహారమే ఆధ్యాత్మికత' అని. 'మానసిక కాలుష్యాన్ని తొలగించడమే ఆధ్యాత్మిక సాధన' అని. ఇహ పరంలో దేనిని సాధించాలన్న ఆరోగ్యం చక్కగా ఉండాలి. 
ఇక్కడ మరో విషయం గ్రహించాలి - ఆరోగ్యం  అన్నది శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు, మనస్సుకీ, మనుగడకీ కూడా! ఇక ఈ విషయంలో మన ప్రాపంచిక, పారమార్ధిక జీవన గమనంలో సప్తచక్రాలు ఎలా పనిచేస్తున్నాయో ఓసారి పరిశీలిద్దాం -

ఒకానొక ఆదిశక్తి నుండి సృష్టించే శక్తి, పెంచి పోషించే శక్తి, లయించే శక్తి ఉద్భవించి, అందులో నుండి మరెన్నో కోట్లాది శక్తులు ఆవిర్భవిస్తూ ఈ సృష్టి కొనసాగుతుంది. 
విశ్వమునందు, సౌరమండలమునందు, భూమియందు, మానవదేహమునందు ఏడు ప్రజ్ఞామయ కేంద్రములు పనిచేయుచున్నవి. విశ్వమునందలి ఏడులోకములకు (సత్యలోకం, తపోలోకం, జనోలోకం, మహర్లోకం, సువర్లోకం, భువర్లోకం, భూలోకం)సప్తర్షిమండలం అధ్యక్షత వహించుచుండగా, సౌరమండలమునందలి ఏడులోకములకు ఏడుగ్రహములు (రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని)అధిపతులుగా వున్నవి. మానవదేహమునందు ఏడు ప్రజ్ఞామయకేంద్రాలుగా వెన్నెముక వెంబడి శిరస్సులోనికి వ్యాపించియున్న సప్తచక్రాలకు (మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారచక్రములు) పరాశక్తులు ఏడుగురు (సాకిని, కాకిని, లాకిని, రాకిని, డాకిని, హాకిని, యాకిని) ఆధిపత్యం వహించుచున్నారు. 
ఈ సప్తలోకాలంటే ఏమిటో, శక్తిచక్రాలంటే ఏమిటో, సప్తగ్రహాలంటే ఏమిటో, అవి శారీరక ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక పరిణితికీ ఏ విధంగా దోహదపడతాయో తెలుసుకుందాం. 
మన శరీరంలోని సప్తచక్రాలు సప్తలోకములతో ఏయే స్థానాల్లో ఏయే గ్రహాలతో సంధానింపబడిందంటే - 
7. సహస్రారం - సత్యలోకం - ప్రమాతస్థానం - రవి 
6. ఆజ్ఞాచక్ర - తపోలోకం - జీవాత్మస్థానం - చంద్రగ్రహం 
5. విశుద్ధ చక్రం- జనలోకం - ఆకాశభూతస్థానం - కుజగ్రహం 
4. అనాహతం - మహర్లోకం - వాయుభూతస్థానం - బుధగ్రహం 
3. మణిపూరకం - సువర్లోకం - 
జలభూతస్థానం - గురుగ్రహం 
2. స్వాధిష్ఠానం - భువర్లోకం - అగ్నిభూతస్థానం - శుక్రగ్రహం 
1.  మూలాధారం -  భూలోకం - పృథ్వీభూతస్థానం - శని గ్రహం 

విశ్వచైతన్య శక్తి మానవశరీరములోనికి ఏడుచక్రాలు ద్వారా ప్రవహిస్తుంది. ఈ ఏడు దేవతా శక్తుల ఆధీనంలో పనిచేస్తున్నాయి.  ఒక్కో శక్తిచక్రం ఒక్కోతత్త్వంతో సంబంధం కలిగియుంటుంది. ఈ చక్రాలు శారీరక వ్యవస్థలతోనూ, మానసిక స్థితులతోనూ సంబంధం కలిగియుంటాయి. అలానే ప్రతిచక్రానికీ శారీరక మానసిక లేక ఆధ్యాత్మిక విధులు ఉంటాయి.పూర్వజన్మలలోని పాపపుణ్యాలు(ప్రారబ్దాలు) బట్టి ఈ చక్ర, గ్రహ దేవతలు విశ్వచైతన్యశక్తిని ఆయాచక్రాల ద్వారా శరీరంలోనికి సరఫరా చేయడం జరుగుతుంది. పూర్వజన్మలోని పాపపుణ్యాలకు అనుగుణంగా  జరిగే ఈ శక్తి పంపకంలోని హెచ్చుతగ్గులు వ్యక్తీ మనస్సు పైనా, శరీరం పైనా పనిచేస్తూ జీవితగతిని నిర్దేశిస్తుంది. 



మూలాధారచక్రం :-
ఐం హ్రీం శ్రీం సాం హంసః మూలాధిష్టాన దేవతాయై సాకినీసహిత గణనాధ స్వరూపిణ్యైనమః 
మూలాధారంబుడా రూఢ పంచవక్త్రాస్థి సంస్థితా 
అంకుశాది ప్రహరణా వరదాది నిషేనితా 
ముద్గౌదనా సక్త చిత్తా సాకిన్యం బాస్వరూపిణీ 
ఈ కమలం 4 దళాలు కలది. పృధ్వీతత్త్వం కలది. రక్తవర్ణం కలది. అధిష్టానయోగిని దూమవర్ణం కలిగి పంచవక్రాలు త్రినేత్రాలు కలిగి సృణి,కమలం, పుస్తకం, జ్ఞానముద్ర ధరించి, ఆస్థిధాతువునాకు అధిపతియై యున్నది. ముద్గాన్నప్రీతి కలది. వ శ ష  స అను యోగినీ శక్తులచే సేవించబడే ఈమె సాకినీశక్తిగా ఆరాధించబడుచున్నది. నల్లని ఏనుగు ఈమె వాహనం. 

వెన్నెముక చివరిభాగంలో అంటే మలరంద్రానికి సుమారు రెండు అంగుళాల పైభాగాన విలసిల్లే మూలాధారచక్రం మనలో 7,776నాడులతో సంధానింపబడి వుంటుంది. భౌతిక శరీరానికి శక్తికేంద్రం మూలాధారచక్రం. ఇదే మొదటిచక్రం. కుండలినీ శక్తి దాగి వున్నది ఇందులోనే. ఇతర శక్తులన్నింటికి మూలం ఇదే. మూలమైన ఆధారం ఇదే కనుక మూలాదారకేంద్రమన్నారు. మూలాధారచక్రంకు పంచకోశాలలో అన్నమయకోశంతో సంబంధం. శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం 'ముక్కు'. జన్మకూ, పునర్జన్మకు ఇది మూలస్థానం. ఈ మూలాధారంలోని శక్తి రెండు విధములుగా (సృష్టి, ప్రతిసృష్టి) పనిచేస్తుంది. అంటే మనిషి జన్మించేది ఈ శక్తివల్లనే. జన్మరాహిత్యం కలిగేది ఈ శక్తివల్లనే. ఒకటి జన్మతః కలిగే శక్తి. రెండవది యోగంతో ఆర్జించుకున్న శక్తి. ఇది సరిగ్గా పనిచేయకపోతే పునసృష్టి జరగదు. ఈ చక్రప్రేరణ వలెనే ప్రతిజీవి సృష్టికార్యం చేస్తుంది. రెండవశక్తి జన్మరాహిత్యం కలిగించే శక్తి. ఇది బ్రహ్మచర్యం వలన సాధ్యమౌతుంది. బ్రహ్మచర్యం అంటే సంసారజీవితమును త్యజించడం కాదు, సంభోగేచ్ఛను అణుచుకోవడం కాదు. బ్రహ్మత్వసిద్ధికి అవసరమైన శక్తిని ధ్యానయోగం ద్వారా సాధించడం. ఇందుకు నీతి, నియతి, నిగ్రహం పాటించాలి. బ్రహ్మచర్యం గురించి మరింత వివరణకై  ఇక్కడ చూడండి. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
శారీరకంగా అర్ద్రైటిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, ఎముకల బలహీనత, రక్తంలో మార్పుల వలన జనించే రుగ్మతలు, బోన్ కేన్సర్, లుకేమియా వంటి వ్యాధులు, ఎలర్జీ, రోగనిరోధకశక్తి లోపించడం, గాయాలు సరిగ్గా మానకుండా ఉండడం లాంటి రుగ్మతలకు కారణభూతమౌతుంది.  
ఈ చక్ర మానసిక స్వభావం - 
మూసుకుపోవడం వలన భయం, ఆందోళన, అభద్రతాభావం, ఆక్రమణతత్త్వం, అస్థిరత్వం, ఆత్మహత్య ప్రలోభం, స్వార్ధం. తమోగుణం. ప్రాపంచిక సౌఖ్యాలవైపు మోజు కలిగియుండి పరధ్యానస్థితిలో వుంటుంది. 
తెరుచుకుంటే ధైర్యం, స్థిర సంకల్ఫం, పవిత్రత, నిస్వార్ధం, జీవితం మీద మమకారం, పారమార్ధికజ్ఞానం కల్గుతాయి. 
అలానే ఈ నాడీ కేంద్రం నేను నాది అనే అహంకారానికి వేదిక. 
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే - 
ఈ చక్రమునకు సాకిని దేవత. ఈ పరాశక్తి  ఎముకలపుష్టిని అనుగ్రహిస్తుంది. ఈ దేవత 'ముద్గౌదనా సత్తా చిత్తా' అని వర్ణింపబడింది. అనగా ఈ దేవతకు పులగం ఇష్టమని చెప్పుదురు. దీనికర్ధమేమనగా శరీరం నందు ఎముకల పెరుగుదల చక్కగా లేనివారు ఆహారమందు ఈ పులగంను ప్రధానాహారంగా స్వీకరించినచో సర్దుబాటగును. వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "లం" ధ్యానించువారికి ఈ బాధలు నివారణ కాగలవు. 
శారీరక వ్యాధి కానివ్వండీ, మానసిక వ్యాధి కానివ్వండీ అవన్నీ పుట్టుకొచ్చేవి మన లోపల్నుంచే. మనకు బయటసంఘటనలకంటే మన అపవిత్రత వలెనే దుఃఖం వస్తుంది. మన బాధలన్నింటికీ సృష్టికర్తలం మనమే. బాధలు రెండు రకాలు. ఒకటి సముచితమైనవి. ఇవి ప్రారబ్ధవశాత్తు వచ్చేవి. రెండవది  అసంగతమైనవి. పరిస్థితికి ఎంతమాత్రం పొంతన లేని ఆలోచనలు. ఊహలు ఇవే అసంగతమైన బాధలు.
చాలావరకు మనబాధలకు కారణం - మనలో మనకే తెలియని, తెలుసుకోలేని నెగిటివ్ నెస్. అందుకే మన పూర్వీకులు అంటుంటారు - 'మంచిగా ఆలోచించు, ఆనందంగా వుండు'. 'మన ఆలోచనలే మన జీవితం'. 'శుభాన్ని కోరుకో, సుఖంగా జీవించు'. 'మన ఆలోచనలే మన అనుభవాలు'. 'మతి బట్టే గతి'... అని! అలానే చెడు, కీడుల గురించి మాట్లాడటాన్ని వారెప్పుడూ వారిస్తుంటారు. అలాగే మానవాళి శ్రేయస్సుకై పెద్దలు ఎన్నో సూక్ష్మ సరళ పద్ధతులను బోధించారు. మనిషిని శారీరకంగా, మానసికంగా, సుఖవంతంగా, ప్రశాంతంగా ఉంచడంకోసం ఎన్నో చిట్కాలను ప్రతిపాదించారు. వారు సూచించిన పద్ధతులు ఏమిటంటే - 
మూలాధారచక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నేలపై కూర్చోవడం, భూమిని తాకడం, చెప్పులు లేకుండా నడవడం, మొక్కలు చెట్లును కౌగిలించుకోవడం, కన్నతల్లితో కలసి వుండడం, ధ్యానం చేయడం.  
మూలాధారచక్రంనకు అధిపతి గ్రహం శనిమహాత్ముడు. ఈ దేవతతో సరైన సంబంధం లేకుంటే బ్రతుకుకు ఆధారమే లేదు. కష్టించి పనిచేసే విధానానికి, శ్రమశక్తికి ప్రతినిధి శని. అలానే ముసలివాళ్ళకు రోగులకు ఆకలిగొన్నవాళ్ళకు ఈయనే ప్రతినిధి. బద్ధకస్తులను ముదుసలివారిపట్ల, రోగులపట్ల, ఆకలిగొన్నవారియందు అలక్షంగా వున్నవారిని తీవ్రంగా దండిస్తాడు. కాబట్టి  కష్టించి పనిచేసే తత్త్వం, సేవాతత్వం అలవర్చుకోవడం వలన శనిమహాత్ముని అనుగ్రహం పొందవచ్చు. ఈ చర్యలతో మూలాధారంను జాగృతి పరచవచ్చు. 
ధ్యానం, సేవ అనేవి రెండు శక్తివంతమైన సాధనములు. ధ్యానం లేని సేవ, సేవ లేని ధ్యానం పూర్ణజ్ఞానసిద్ధిని కల్గించలేవు. సేవ, ధ్యానం రెండు కూడా మనోశుద్ధి ప్రక్రియలు, పాపనాశన సాధనములు. (పాప ప్రక్షాళన సాధనములు) సేవ స్థూలంగా మనస్సుని శుద్ధి చేస్తే, ధ్యానం సూక్ష్మంగా మనస్సును శుద్ధి చేస్తుంది. సేవ చేస్తేగాని ధ్యానం చేసే శక్తి కలగదు, ధ్యానం చేస్తేగాని సేవ పవిత్రంగా జరగదు. చక్కగా ధ్యానం చేస్తే, చేసే సేవ పవిత్రంగా వుంటుంది. చక్కగా సేవ చేస్తే చేసే ధ్యానం నిశ్చలంగా వుంటుంది. ప్రశాంతంగా వుంటుంది. 
సేవ వలన చిత్తశుద్ధి చేకూరుతుంది. అహంకార నిర్మూలన జరుగుతుంది. అహంకారాన్ని జయించటమే ఈ చక్రాన్ని జయించటమౌతుంది. 

తదుపరి చక్రం 'స్వాదిష్టానచక్రం' గురించి తదుపరి టపాలో ... 

24, మార్చి 2015, మంగళవారం

ఒకప్పటి మధురజ్ఞాపకం "శ్రీశైల శిఖరదర్శనం"లో అంతరార్ధం

క్రిందటి టపాకు కొనసాగింపు ... 

అపారమైన భక్తివిశ్వాసాలుంటే తప్పకుండా తరిస్తాం ... అని అంటూ, అందుకు ఉదాహరణగా మాస్టారుగారు  చెప్పిన కధ ఇది -

మహాశివరాత్రి రోజున పార్వతిదేవి పరమశివుణ్ణి ఇట్లడిగెను - సర్వేశ్వరా! 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే' అను శాస్త్రవాక్యమొకటి కలదు కదా. శ్రీశైలశిఖరమును దర్శించినవానికి పునర్జన్మ లేదని చెప్పినది నిజమైనచో, ఈ  దినం ఎన్నియో  వేలమంది జనులు శ్రీశైలపర్వతంనకు వచ్చియున్నారు. వీరందరికీ శిఖరదర్శనం అయినది. మరి వీరందరూ ముక్తులయ్యెదరా? అని ప్రశ్నించగా -
సంపూర్ణ విశ్వాసం వుండిన అట్లగును. ఈ విషయమై రేపటిదినం నీకు చూపెదను. నేను మిక్కిలి ముదుసలి బ్రాహ్మణ రూపమును ధరించెదను. నీవు అతి వృద్ధురాలగు బ్రాహ్మణి వేషమును పూనవలసినది. ఈ రాత్రి శిఖరదర్శనం చేసి ఈ జనులు వెళ్ళుచుండెడు దారిలో బురదమయమగు నొక కోనేటిలో నేను పడియుండి ప్రాణం పోయేలాగున నటించెదను. వచ్చిన వారందరినీ పతిభిక్ష పెట్టవలసినది, వేదములు కడవరకు చదివి, వేదార్ధమును చక్కగా నెరిగిన ఈ వృద్ధబ్రాహ్మణుడు నా పతిదేవుడు. ఈయన లోతైన ఈ గుంటలో స్నానార్ధమై వెళ్ళి పడిపోయెను. ఈయనను రక్షించండి అని ప్రార్ధించు. ఎవరైనా నన్ను బయటకు తీయుటకై దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యలారా! ఆయన పాపం నశించినవారు. పాపం గలవారెవరైనా ఆయనను తాకినచో వారపుడే మరణించెదరని చెప్పవలసిందిగా పరమశివుడు తెలిపెను. 
మరునాడు ఉదయం గుంపులు గుంపులుగా వచ్చుచుండు జనసమూహమును జూచి, భవానిదేవి రోదిస్తూ, తన భర్తను రక్షించి, పతిభిక్ష పెట్టమని  వేడుకుంటుండగా, కొందరు ఆ వృద్ధబ్రాహ్మణుని రక్షించుటకై దగ్గరకు వెళ్ళునప్పుడు, ఈయన పాపం నశించిన పుణ్యాత్ముడు, పాపం గలవారు తాకినచో అప్పుడే చనిపోవుదురని చెప్పగా, దగ్గరకు వెళ్ళినవారు మనకి ఎందుకులే అనుకుంటూ, తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆ సమయంలో కళావంతులలో చేరిన పరిశుద్ధాత్మరాలగు నొక నారీమణి వృద్ధురాలగు ఆ బ్రాహ్మణస్త్రీతో 'నీవు దుఃఖపడవలదు, నాకు ఈత వచ్చును, నేను మీ పతిని దరిచేర్చేదను' అని చెప్పి రక్షించుటకు వెళ్ళబోవునప్పుడు, ఈ బ్రాహ్మణి పై చెప్పిన మాటలను చెప్పగా, ఛ ఛ, నీకు శాస్త్రవచనాలు యందు విశ్వాసం లేదు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అను శాస్త్రవాక్యం పట్ల నీకున్న నమ్మకం ఇదేనా? నాకు ఇక పాపమెచట? నేను నిన్నటిరోజున శివరాత్రి ఉపవాసముండి, జాగరం చేసి, శివపూజ చేసి, శ్రీశైల శిఖరదర్శనం చేసి, పాపరహితురాలినై వచ్చుచున్నానని చెప్పి, ఆ గుంటలో దుమికెను. దూకి వృద్ధబ్రాహ్మణుని రక్షించాలని పరమశివుణ్ణి తాకగానే, ఆయన సాక్షాత్తు శంకరరూపమున దర్శనమిచ్చి, ఆ యువతిని విమానం నెక్కించుకొని కైలాసమునకు తీసుకుపోవునట్లు కధ చెప్పిరి. 
ఏమిటీ, కళావంతుల స్త్రీకి అంతటి యోగమా? అని అత్తయ్యగారు ప్రశ్నించగా -
వృత్తిని కాదు చూడవలసినది, ఆమె భక్తిని, శాస్త్రవచనాలు పట్ల అణుమాత్రమైన అపనమ్మకం లేని అపారమైన నమ్మకాన్ని. అందుకే అంటారు, భగవంతుడు విత్తం కాదు చిత్తంను చూస్తాడని. మనిషిని కాదు మనస్సుని గమనించు. బహుశా ఆమె పూర్వజన్మ సుకృతం వలన ఆమెలో అపారమైన భక్తివిశ్వాసములు ఏర్పడ్డాయి. అందుకే ఇంతటి యోగం ప్రాప్తించింది అని మాస్టారుగారు చెప్పగా ... 
బాగుందండీ, మరి ఆన్నిటికీ అంతరార్ధం ఉందంటారే, మరి ఈ శిఖర దర్శనంకు అంతరార్ధం కూడా చెప్పండి అని మరల అత్తయ్యగారు ప్రశ్నించగా -
ఆ... వుంది, ఉందనే పెద్దలు చెప్తుంటారు. శ్రీశైలశిఖరం దర్శన మాత్రంచే జన్మరాహిత్యం కల్గితే ఇన్ని సాధనలు ఎందుకు? వెళ్లి చూసిస్తే సరిపోతుంది కదా, అది కాదు అసలు నిజం. యదార్ధం ఏమిటంటే, శిఖరమంటే గుడిగోపురం కాదు. శిరశ్శిఖర ముచ్యతే అన్న మాటను ప్రామాణికంగా పరిశీలిస్తే, శిరస్సే శిఖరం. ఎవరైతే తన శిరస్సునందు శ్రీశైలున్ని దర్శిస్తారో వారికి పునర్జన్మ వుండదని ఆ వాక్యానికి అర్ధం. ఇది నిజమైన సాధన. ఇది నిజమైన యోగం. మనస్సునూ, మనో ప్రక్రియలను కట్టి వేస్తే యోగసాధన సాధ్యమై పరమేశ్వరుణ్ణి దర్శనమై జన్మరాహిత్యం కల్గుతుంది అని చెప్పారు. చక్కటి విషయాలు తెలిపిన మాస్టారుగారికి నమస్సులు. 




28, ఫిబ్రవరి 2015, శనివారం

ఒకప్పటి మధురజ్ఞాపకం 'త్రివేణీ సంగమం'

గతపోస్ట్ చదివిన శైలజగారు అడిగిన ప్రశ్నతో నా మనసులో మరుగునపడిన విషయం మరుపుకురాకుండా మరల జ్ఞాపకం వచ్చేటట్లు చేసిన తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ -
కాశీయాత్ర ( ఈ టపా వివరములకై  ఇక్కడ  క్లిక్ చేయండి) గురించి మాస్టారుగారు చెప్పిన మరుసటిదినమే ఈ త్రివేణీసంగమం గురించి కూడా ఆయన వివరించారు. 
మా అత్తయ్యగారు (మాస్టారుగారి భార్య) త్రివేణీ సంగమంలో మూడుసార్లు మునకలేస్తే చాలట కదండీ, ముక్తిపొందడానికి అని మాస్తారుగార్ని అడిగినప్పుడు - 
మూడుసార్లు ఎందుకు ఒక్కసారి మునక వేస్తే చాలు ముక్తి పొందవచ్చు అని నవ్వుతూ ఇలా వివరించారు. 
నాకు గుర్తున్నంతవరకు ఆ పద్యాలు, వివరణ చెప్తాను కానీ, పద్యాలలో ఒకటిరెండు అక్షరదోషాలు, వివరణలో చిరులోపం వుండవచ్చు. మన్నించాలి మరి.

మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేష్కోస్తి పర్ణాశనః 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః 
భస్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూడో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్ 

గంగాది తీర్దములలో మత్స్యకచ్చపాదులు సదా నివచించుచుండును. నాగసర్పం వాయుభక్షణం గలిగియుండును. మేకలు ఆకులనే తినుచుండును. చాతకపక్షికి జలమే ఆహరం. ఎలుకలు కొండగుహలలో నివచించియుండును. శునకం దిగంబరియై బూడిదలో పడియుండును. కొంగ మౌనంతో ధ్యానాధిష్టానముతో నుండును. వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును లేదు. కావున బాహ్యచేష్టలతో భ్రమనొందక పై జెప్పిన వాటియొక్క గుణములతో కూడియుండు అంతరంగనిష్ఠ సంపూర్ణముగా కలిగియున్డవలయును. ఎట్లున్డినను జ్ఞానమొకటి చేతనే జీవుడు తరిస్తాడు. 

మనం ఈ విషయాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. గతంలో చెప్పినట్లుగా పుణ్యక్షేత్ర దర్శనాలతో భక్తి పెరిగి , భగవంతున్ని స్మరిస్తూ చేసే తీర్ధస్నానాలతో పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యఫలం ప్రారబ్ధంలోనికి వచ్చిన తర్వత జననమరణాలు తప్పవు. అంతే తప్ప ముక్తి రాదు అని అంటూ ఇంకా ఇలా వివరించారు -

మన దేహంలో మూడు ప్రధాన నాడులున్నాయి. అవి ఇడా పింగళ సుషుమ్నాలు. ఈ మూడింటి సంయోగస్థలం భ్రూమధ్యం. అందుకే ఈ స్థానమును త్రివేణీ సంగమనియు, మేరు స్థానమనియు యోగులు చెప్పుదురు. కాబట్టే భ్రూమధ్యమున మనస్సును స్థిరంగా నిలిపి చేయు ధ్యానం శ్రేష్ఠం. ధ్యానంచే ఈ త్రివేణీ సంగమందు ఒక్క మునకవేసిన చాలును, ముక్తిపొందడానికి. 

ఇడా భాగీరధీగంగా పింగళా యమునానదీ 
తయోర్మధ్య గతా నాడీ సుషుమ్నాఖ్యా సరస్వతీ  
త్రివేణీ సంగమో యాత్ర తీర్ధ రాజ స ఉచ్యతే 
తత్ర స్నానం ప్రకుర్వీత సర్వ పాపై ప్రముచ్యతే 

ఇడానాడే గంగానది. పింగళనాడి యమునానది. ఈ రెండింటి మధ్యలో ఉన్న సుషుమ్నానాడి సరస్వతీనది. ఈ మూడు నాడులు భ్రూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రంలో సంగమిస్తాయి. దీనినే త్రివేణిసంగమం అని అంటారు. దీంట్లో స్నానం చేస్తే జీవుడు అనేక జన్మలలో తాను చేసిన పాపములనుండి, ప్రారబ్ధములనుండి ఒక్కమాటలో చెప్పాలంటే క్రియలనుండి విముక్తి పొంది ముక్తుడౌతాడు. 
బాగుందండీ, మీరు చెప్తున్న దానిబట్టి నాకు అర్ధమౌతుంది .... బాహ్యముగా ఏమైతే ఉన్నాయో, ఏం చేస్తే తరిస్తామో, అవి అన్నీ మనలోనే ఉన్నాయని, మనలోనే చూసుకొంటే తరిస్తామని. కానీ, కోడికూయక ముందే లేస్తాను, గొడ్లచావిడికి వెళ్లి లక్ష్మిని (ఆత్తయ్యగారు ప్రేమగా పెంచుకుంటున్న ఆవుని) పలకరించి, కాస్త పేడను తీసుకొని వాకిట్లో కల్లాపి జల్లి, పొయ్యి అలికి ముగ్గులెట్టి, కసుపు తుడిచి, స్నానపూజాదికాలు పూర్తయ్యాక పొయ్యి రాజేస్తానా ... అప్పుడు అంటించిన పొయ్యి నడినెత్తిన సూర్యుడొచ్చేంతవరకు వెలుగుతునేవుంటుంది. కాసేపైన స్థిమితంగా కూర్చొనే సమయముండదు. మధ్యాన్నం మీరందరి భోజనాలు అయ్యాక, కాస్త తిని, వత్తులు చేసుకుంటునో, పప్పు విసురుకుంటునో, బియ్యం ఏరుకుంటునో, ఈనో పేనో చూసుకుంటునో ...  ఆ సమయంలో కష్టసుఖాలు చెప్పుకోవడానికో, కాలక్షేప కబుర్లు చెప్పుకోవడానికో వచ్చే ఇరుగుపొరుగువారితో మాట్లాడుతూ చిన్న చితక పనులు చక్కబెట్టుకునేసరికి సాయంత్రమైపోతుంది. ఇక మరల మొదలు ఇల్లు ఊడ్చడం, వంటావార్పులు, వడ్డనలు. మీరందరూ పడుకున్న తర్వాతే నా నిద్ర. అంతవరకు పట్టుమని పదినిముషములైన నడుం చేరేయడానికి లేదు. మరి నాలాంటిదానికి కుదురుగా కూర్చోవడం, జపమో తపమో ధ్యానమో ఎలా అవుతుంది చెప్పండి... 
మరి నాలాంటి వారు తరించే మార్గమే లేదా? అని అత్తయ్యగారు అనగా -
ఓహో ... ఎందుకు లేదూ,  నన్ను చక్కగా అర్ధం చేసుకొని నాకు అనుగుణంగా మసులుకుంటున్నావు. అలుపు తెలవనివ్వని చిరునవ్వుతో ఓర్మితో అందరితో ఆత్మీయంగా, అందరికీ ఆసరాగా వుంటున్నావు. నీకు సాధ్యమయ్యేంతలో బీదవార్ని ఆదరిస్తున్నావు. ఓ ఇల్లాలిగా గృహస్థుధర్మమును చక్కగా నిర్వర్తిస్తున్నావు. నీ ఈ ధర్మవర్తనంకు మరింత భక్తివిశ్వాసములు జతైతే ఈ జన్మలోనో, మరుజన్మలోనో తప్పక తరిస్తావు... అని మాస్టారుగారు చెప్తుండగా -
అది కాదండీ, మరి త్రివేణీసంగమంలో మునకలేస్తే ముక్తివస్తుందన్న పెద్దలమాట అసత్యమా అన్న ఆమె ప్రశ్నకు... 
లేదు లేదు, పెద్దలమాటలు, శాస్త్రవచనాలు ఎప్పటికీ అసత్యం కాదు. కాకపోతే వాటి అంతరార్ధమును గ్రహించి పాటించాలి. లేదా వాటిపై అణుమాత్రమైన అనుమానం లేకుండా అపారమైన భక్తివిశ్వాసములుంటే, దానికి పూర్వజన్మసుకృతం తోడైతే తప్పకుండా ఈజన్మలోనే తరిస్తాం. అది ఎలాగంటే ... 
అంటూ ఓ చక్కటి కధను, అంతరార్ధమును వివరించారు. ఆ వివరాలు తదుపరి టపాలో ...