2, జులై 2023, ఆదివారం

శ్రీ దత్తుని వైభవం - ఇరవై నలుగురు గురువులు



మూడుస్థితులు దాటి దోషాలు వెదకని తత్వం లోకి వెళ్ళినవారికి పరమాత్మ సాకారం అవుతాడని, గురువు దైవమూ దత్తుడే అని, తనను స్మరించిన వారికి వెంటనే అనుగ్రహించే సిద్ధుడు దత్తుడు అని...క్రిందటి టపాలో స్మరించుకున్నాం.


దత్త వైభవం

యోగమే దత్తుని మార్గం.
నిస్సంగత్వమే దత్తుని ఉపదేశం.
జ్ఞానమే దత్తుని ఉపాసన.

దత్త ప్రపంచం లోని వారు ఎల్లప్పుడూ దత్తోహం అని ధ్యానిస్తూ ఉంటే, దత్త స్వరూపులుగా అవదూతలుగా మారిపోతారని ప్రతీతి. 

దత్తాత్రేయుడు ప్రతిరోజు స్నానం కాశిలో, ధ్యానం మాహురీపురములో, భిక్ష కొల్హాపురిలో, నిద్ర సహ్య పర్వతం దగ్గర చేయుదురని గురుచరిత్రలో తెలుపబడింది.

దత్తుని ఇరవై నలుగురు గురువులు

సృష్టిలో ప్రతీ అంశం నుండి మానవుడు జ్ఞాన సముపార్జన చేయవచ్చును. అలా ప్రకృతిలోని పంచభూతాలు, పశు పక్ష్యాదులు తనకి గురువులని దత్తాత్రేయుల వారు తెలిపిన ఇరవై నలుగురు గురువుల వివరణ -

1) పృథ్వి (భూమి):
జీవులు కాళ్ళతో తొక్కుతున్నా,  తనపై మలమూత్రాదులను విసర్జిస్తున్నా, త్రవ్విన, దున్నిన అన్నిటినీ భరించి ద్వేషభావం లేకుండా సస్యాలు ఆశ్రయము ఇచ్చి, పోషిస్తున్న భూమి నుండి సహనాన్ని నేర్చుకున్నాను.

2) వాయువు: 
వాయువు వివిధ వస్తువుల బట్టి శీతల ఉష్ణ, సుగంధ దుర్గంధాలపై సంచరించిన, తాత్కాలికంగా వాటిచేత ప్రభావితుడైనట్లు అనిపించినా, దేనితోనూ సంగత్వమేర్పరచుకోక, తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా వుండే వాయువును చూసి, వేటి నడుమ వుండాల్సివచ్చిన వాటికి చిక్కకుండా నిర్మలంగా నిస్సంగుడనై ఉండడం నేర్చుకున్నాను.

3) ఆకాశం: 
గాలి, మేఘం, సూర్యచంద్ర నక్షత్రాదులతో నిండివున్నట్లు కనిపించిన, దేనితోనూ ఎలాంటి సంబంధం లేకుండా సర్వత్రా వ్యాపించి ఉండే ఆకాశాన్ని చూసి, ఆత్మ కూడా ఆకాశం వలె సర్వవ్యాపి అని, శరీరాదులతో ఈ నశ్వర జగత్తు ఆత్మ యందే ఉన్ననూ దేనితో సంగత్వం లేకుండా ఉందనే సత్యాన్ని గ్రహించాను. అలానే త్రిగుణాల వికారరూపమైన దేహానికి దానివలన కలిగిన మనోవికారాలకు అంటనివాడై ఆకాశం మాదిరిగా స్వచ్ఛంగా వుండాలని గ్రహించాను.

4) జలం: 
ప్రాణికోటికి దాహం తీర్చి, అందరికీ ఆరోగ్యం చల్లదనం కల్గించి, వృక్షములను సస్యములను పోషించి, తనను తాకిన అన్నిటినీ శుద్ది చేసి, శుభ్రతను, పవిత్రతను ఇస్తుంది జలం. పరిశుద్ధ జలం మురికిని పోగొట్టే విధంగా మహాత్ములు పరిశుద్ద అంతఃకరణ కలిగియుండి ప్రాపంచిక మానవుల మనోమాలిన్యం శుభ్రపరచాలని గ్రహించాను.

5) అగ్ని: 
ఒకసారి నివురుగప్పిన నిప్పులా, ఒకప్పుడు విశేషాగ్నిలా ప్రజ్వరిల్లుతూ వెల్లడవుతుంది. రాపిడివల్ల ప్రకటతమయ్యే అగ్నితత్వం వస్తువులలో సూక్ష్మంగా దాగియుండును. మథనం చేత విశేషాగ్నిగా ప్రకటతమై యజ్ఞం చేసేవారి పూర్వపాపాలను హరించి, రానున్న కర్మదోషాలను నివారించడం కోసం ఎవరినుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు కానీ, తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడుగాకనే, వారి పాపాల్ని దహిస్తాడు. అలాగే జ్ఞాని కూడా తన తపశ్శక్తిని గుప్తంగా వుంచుకుంటూ, మానవులను పావన మొనర్చడానికే సర్వులనుండి బిక్షనుగొని వారిని అనుగ్రహించాలని, దీనివలన తాను అపవిత్రుడు కాడని తెలుసుకున్నాను.
తనకి ఆహుతి ఇచ్చిన దేనినైనా దోషమెంచక స్వీకరించి నిర్మలముగా ప్రకాశించే అగ్నిలా, పదార్థములను యెంచక ఆహారంగా ఎవరేం సమర్పించినా స్వీకరించి, నిర్మలముగా తపో జ్ఞానాలతో యతి ప్రకాశించాలని గ్రహించాను. అగ్ని వివిధ వస్తువుల గుణ బేధాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారి యున్నట్లు, తత్వజ్ఞానమనే అగ్నితో వివిధమైన వస్తువుల గుణాలను నిరసించి, సర్వగతమైన సర్వేశ్వరుని తత్వాన్ని గ్రహించి, తనలో తాను అణిగియుండాలని తెలుసుకున్నాను. అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టెను చేరినప్పుడు ఆ రూపంలో భాసిస్తుంది. అలాగే ఆత్మగూడ వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాల్లో గోచరిస్తుందని తెలుసుకున్నాను.

6) చంద్రుడు:
చంద్రుడు సదా పూర్ణుడే యున్నను, భూమితో పరిభ్రమించుట వలన వృద్ధి క్షయములు పొందినట్లు కనిపించేలాగున, జనన మరణములు శరీరంనకే గాని, ఆత్మకు లేవని గ్రహించాను. అలానే ఆత్మ అనంతం, సంపూర్ణం అయినను శరీర మనో బుద్ధుల ఛాయా ప్రసరణచే ఆత్మ పరిమితమనే భ్రాంతి కలుగుచుందని తెలుసుకున్నాను.

7) సూర్యుడు: 
సూర్యుడు ఒకడే అయినను అనేక నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కనబడినట్లు, ఆత్మ ఒకటే అయినను దేహాది ఉపాధి భేదముచే వివిధమూ భిన్నమూ అయినట్లు కనబడుతుందని గ్రహించాను. సూర్యుడేవిధంగా నీటిని తన కిరణాలతో స్వీకరించి మరలా ఎలా విసర్జించునో అట్లే జ్ఞాని కూడా తాను సేకరించిన జ్ఞానాన్ని బోధ రూపంలో జీవులకు ప్రసాదించాలని గ్రహించాను. ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి. కలువలు ముకుళించుకుంటాయి. అలానే జీవులు వారి వారి పరిపాకాన్ననుసరించి ఆ బోధను గ్రహించగలుగుతారు కానీ,
సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును ఉష్ణశక్తిని అంతటా సమానంగా ప్రసాదించడంలో జీవుల గుణ దోషాలను యెంచనట్లే, యతులు తమ అనుగ్రహమును గుణ దోషాలు యెంచక అందరికీ ప్రసాదించాలని గ్రహించాను. సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్యరూపాలను సర్వులకూ గోచరింపజేసినట్లే, జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసువులకు తెలియజేయాలని గ్రహించాను.

8) కపోతం (పావురం):
ఒకచెట్టుపై పావురముల జంట తమ పిల్లలతో వున్నవి. ఒకరోజు ఒక వేటగాడు పన్నిన వలలో పిల్ల పావురాలు చిక్కుకున్నవి. బయటకు వెళ్ళి వీటికి ఆహారం తెచ్చిన తల్లిపావురం పిల్లలు వలలో చిక్కుకోవడం చూసి, ప్రేమపాశంతో వాటి వద్దకు వెళ్ళి అదీ చిక్కుకుంది. అప్పుడే వచ్చిన మగపావురం వచ్చి తన భార్య పిల్లలు వలలో పడుట చూసి, వాటిమీదున్న మమకారంతో ఆ వల వద్దకు వెళ్ళి, అందులో చిక్కుకుపోవడం చూసి వ్యామోహ మమకారాలే బంధాలకు కారణమని గ్రహించాను.

9) అజగరం (కొండచిలువ):
కొండచిలువ తన ఆహారం కోసం అలమటించి తిరుగాడక, యాదృచ్చికంగా లభించిన ఆహారంను రుచికరమైన కాకపోయినా స్వీకరించినట్లు, ఇహపర సుఖాలకోసం ప్రాకులాడక, దైవికంగా లభించిన దానితో సంతుష్టి చెందవలెనని, కొండచిలువ జన సంచారమునకు దూరంగా నివసిస్తున్నట్లే మునియైన వాడు అందరకు దూరంగా యుండి నిరంతర ఆత్మనిష్ఠతో యుండవలెనని తెలుసుకున్నాను.

10) సముద్రం:
వర్షాకాలంలో నిండుగా పొంగి ఎన్ని నదుల నీరు తనలో కలిసిన పొంగుటగానీ, వేసవిలో నీరు తగ్గిన కృంగుటగాని చేయదు. చెలియలి కట్టను దాటదు. తనలో ఉన్న ముత్యాలు బయటకు నెట్టుటగానీ, బయటనుండి వచ్చు అపరిశుద్ధ వస్తువులను తనయందు ఉంచుకొనుటగాని చేయదు. అట్లే జ్ఞాని పరిపూర్ణుడై సుఖాలకు పొంగక, దుఃఖాలకు కృంగక, ధర్మమనే చెలియలి కట్టను అతిక్రమించకుండా ఉండాలని, అలానే తనలోని సద్గుణాలను వదలక, దుర్గుణాలను తనలోనికి రానీయక మెలగవలెనని గ్రహించాను.

11) మిడుత:
దీపకాంతిని చూసి భ్రాంతితో దానికి ఆకర్షింపబడి మిడుత నశించును. ఆ విధంగనే మానవులు దుఃఖ నిలయాలైన విషయాలును సుఖాలని భ్రమించి, రూపలావణ్య మోహముచే భ్రాంతిలో పడి ప్రశస్తమైన జీవితాన్ని వృథా చేసుకుంటూ దుఃఖమయ విషయాలలో చిక్కి నశిస్తున్నారు. అందుకే మనస్సును విషయమోహములకు గురికానివ్వకూడదని గ్రహించాను.

12) భ్రమరము:
భ్రమరము ఒక కీటకమును తెచ్చి ఒక గూడునందుంచి ఆ గూడు చుట్టు తిరుగాడుతూ ఎక్కువ ఝాంకారం చేయును. ఆ కీటకం భయంతో ఎల్లప్పుడు ఆ ఝాంకారం చేయుచున్న భ్రమరము పైననే దృష్టిని నిలిపి, దానినే చింతించుట వలన కొంతకాలమునకు ఈ కీటకం తానే భ్రమరమగును. అటులనే శిష్యుడు నిరంతరం తన గురువుపై దృష్టిని నిలిపి ధ్యానించినచో తానే గురువైనట్లు, ఆత్మనే ద్యానించినచో ఆత్మ స్వరూపమై భాసిల్లుతారని తెలుసుకున్నాను.

13) ఏనుగు:
మగ ఏనుగు తన ఎదుట ఉంచబడిన బొమ్మ ఏనుగును చూసి కామోద్రకానికి లోనై, గడ్డి ఆకులు కొమ్మలతో కప్పిన గోతిలో పడి బంధింపబడుతుంది. ఆ రీతిలో స్త్రీ సంబంధ వ్యామోహ ప్రలోభాలకు బంధింపబడి పతనం కారాదని మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను.

14) లేడి:
మధుర సంగీతమునకు లేడీ పరవశమగును. వేటగాడు పొదలో దాక్కొని, శ్రావ్యంగా వాద్య సంగీతాన్ని వినిపించి దగ్గరకు వచ్చిన లేడిని వలపన్ని పట్టుకొనెను. అలాగే ప్రాపంచిక విషయముల చేత ఆకర్షింపబడి లౌకికమైన వాటికి హరిణమువలె చిక్కి విషయవలయంలో పట్టుబడకూడదని గ్రహించాను.

15) చేప:
జిహ్వేంద్రియానికి బానిసయైన చేప గాలానికి ఉన్న ఎరని మ్రింగాలని ప్రయత్నించి, తానే బలి అయిపోతుంది. దేహరక్షణ నిమిత్తం తగు ఆహారాన్ని స్వీకరించాలి తప్ప, జిహ్వ చాపల్యంతో చేపవలె రుచికరమైన ఆహారములకు ఆకర్షితులై అనర్ధాన్ని తెచ్చుకోక,  రుచులపట్ల అనాసక్తి వహించవలెనని తెలుసుకున్నాను.

16) తేనెటీగ:
(కొందరు తేనె సేకరించిన వ్యక్తి అని చెప్తారు)
తేనెటీగలు ఎంతో శ్రమించి తేనెను సేకరించి, ఆ తేనెను అనుభవించక ఒకచోట నిల్వచేస్తాయి. ఆ తేనెను తేనె సేకరించువాడు అపహరించి అనుభవిస్తాడు. అధికంగా ధనమును సంపాదించి అనుభవించక దాచుకొని పరులుపాలు చేయడం మంచిది కాదని గ్రహించాను. అలాగే తామరపువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగ రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధింపబడి మరణిస్తుంది. అలాగే యతి కూడా సుగంధ పదార్థాల పట్ల ఆసక్తుడై వాటిని సమర్పించే గృహస్థుని యింట చిక్కి పతితుడు కారాదని తెలుసుకున్నాను.

17) పింగళ అనే వేశ్య: 
పింగళ అనే వేశ్య ధనవంతులగు విటులకై గుమ్మం వద్ద అర్ధరాత్రి వరకు వేచియుండి,  ఎవరూ రాకపోవడంతో మోహం వీడి ఇంటిలోనికి పోయి స్వీయ పరిశీలన చేసుకొని, ఆనందమయుడైన ఆత్మారాముని వదిలి బుద్ధిహీనురాలినై మోహముకు లోనై తప్పు చేస్తున్నానని గ్రహించి, ఇక నుండి భగవంతుని ధ్యానములో తరించాలని తలచి, సర్వం త్యజించి పరమాత్మ పైన మనస్సు లగ్నం చేసి ముక్తురాలైంది . క్షణికమైన ఇంద్రియ సుఖంలకై దాసులై పరితపించుటకంటే  అంతర్యానం చేసి ఆత్మానందం పొందుట అసలైన సుఖమని గ్రహించాను.

18) లకుముకి పిట్ట :
(కొందరు గ్రద్ద అంటారు)
ఒక చేప/ మాంసపు ముక్కను నోటకరచుకొని పోవుచుండగా, ఇతర పక్షులు కొన్ని ఆ మాంసపు ముక్క కొరకు వెంబడించి పొడుస్తుంటే, ఆ బాధ భరించలేక ఆ మాంసపు ముక్కను జారవిడిచి ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది. అంతవరకు వెంబడించిన పక్షులు ఆ మాంసపు ముక్క పడినవైపు పోయినవి. త్యాగం పరమ సుఖం నిచ్చును. పామరు లాశించు లౌకిక సుఖాలు ఆశించుట దుఃఖహేతువని, వాటిని త్యజించుటయే శాంతికి మార్గమని తెలుసుకున్నాను.

19) బాలుడు -
చిన్న పిల్లలకు మానాభిమానములు ఉండవు. నిందాస్తుతులు వారికి సమానమే. చింతలుండవు. ఆడుతూ పాడుతూ ఆనందంగా నుందురు. అదే విధంగా యోగి చింతలు, మానాభిమానములు విడిచి, అన్నిటికీ అతీతుడై ఆత్మానందంలో నుండవలెనని తెలుసుకున్నాను.

20) కన్య -
ఒక యుక్త వయస్సు వచ్చిన కన్య యింటికి ఆమె  తల్లితండ్రులు ఇంటలేని సమయమున వివాహ నిమిత్తమై బంధువులు వచ్చిరి. వారి భోజనమునకు ఇంట బియ్యం లేనందున, ఆ కన్య వడ్లు దంచుట ప్రారంభించింది. ఆమె చేతిగాజుల సవ్వడి విని, ఈ ఇంట్లో వడ్లు దంచుటకు కూలీలను వినియోగించే శక్తి కూడా లేదని తెలుసుకొని, తమ పేదరికాన్ని గ్రహించి ఏం భావిస్తారోనని భయపడి ఒక్కొక్క గాజు మాత్రమే ఉంచుకొని మెల్లగా వడ్లు దంచింది. పలువురు ఒకచోట చేరితే ముచ్చట్లు కబుర్లు తప్పవని,  కావున ఆధ్యాత్మిక చింతనాపరులు ఒంటరిగా కూర్చుండి సాధన చేయవలెనని, జన సంసర్గం మంచిది కాదని తెలుసుకున్నాను.

21) శరాకారుడు -
బాణములను తయారుచేయు శరాకారుడు ప్రక్కన ఎవరున్నారు, ఏమి జరుగుతున్నది గమనించక ఏకాగ్రచిత్తముతో బాణం మొనలను పదును పెట్టడం చూసి, అలానే యోగి ఆత్మచింతన యందు ఏకాగ్రచిత్తుడై ఉండవలెనని తెలుసుకున్నాను.

22) పాము -
పాము తనకై ఇల్లు నిర్మించుకొనక, చీమలు/చెదలు నిర్మించుకున్న పుట్టలలోనే నివాసముంటుంది. యోగి కూడా తనకై గృహాదులు ఏర్పరుచుకొనక, ఇతరులు నిర్మించిన మఠాల యందు శిధిలాలయాలలోను జీవించాలని, అంతేగాక పాము తన జీవకృత్యాలను యే యితర జీవులకు తెలియనివ్వనట్లే, యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలని, సదా ఒకేచోట వుండక పాము తిరుగుతున్నట్లే, యోగి కూడా ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండక ఏకాంతంగా గడుపుచూ, పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు అంత్యకాలంలో తన దేహాన్ని నిశ్చింతగా విడువవలెనని తెలుసుకున్నాను.

23) సాలెపురుగు -
సాలెపురుగు తాను నిర్మించుకున్న సాలెగూటిలో తాను చిక్కి గతించిపోతుంది. అలానే మనిషి తన మనోభావాలనే విష వలయంలో చిక్కి నశించిపోతున్నాడు. యోగి ప్రాపంచిక విషయ వాసనలతో కూడిన మనస్సుకు చిక్కి పతనం కారాదని తెలుసుకున్నాను. అలాగే, సాలెపురుగు తన నోటి నుండి వెలువడే పదార్థమును దారములా మలిచి గూడును అల్లును. కొంత కాలానికి ఆ సాలెపురుగే ఆ గూడును పాడుచేసి మ్రింగివేయును. సాలీడు వలె పరబ్రహ్మ తన నుండియే జగత్తును సృష్టించును, తానే అంతయు లయింపజేయును. కనుక ఈ జగత్తంతా బ్రహ్మమయమని గుర్తించుకొనవలెనని తెలుసుకున్నాను.

24) తుమ్మెద:
తుమ్మెద ఒక పుష్పము నుండిగాక అనేక పుష్పాల నుండి మకరందమును గ్రహించు విధముగా యతి ఒకే ఇంటి నుండిగాక కొన్ని ఇళ్ళకు భిక్షకు వెళ్ళి గ్రహించినదానితో తృప్తి జెంది జీవించాలని గ్రహించాను. అలాగే తుమ్మెద వివిధ రంగులుగల పువ్వుల నుండి తేనె గ్రహించినట్లు సాధకుడు సకల శాస్త్రాల నుండి సారం గ్రహించాలని తెలుసుకున్నాను.

ఈ విధంగా దత్తులవారు తన గురువుల గురించి చెప్పి, మానవుడు తన దేహమే అత్యంత ప్రియమని భావిస్తూ, ధనమును ఆర్జిస్తూ, చివరికి తనువు చాలించును. ఎవరి కొరకైతే తాపత్రయ పడుతూ సంపాదిస్తాడో, వారే ఆ మృత దేహాన్ని కాల్చి బూడిద చేయుదురు. తిరిగి తాను ఆర్జించిన కర్మఫలముననుసరించి మరలా జన్మించును. కనుక శ్రేష్టుడైన వాడు సంసార మోహమందు పడక, ఈ మానవ దేహం పతనం కాకముందే సద్గతి పొందుటకు ప్రయత్నం చేయుటే ధ్యేయంగా యుండవలెనని తెలిపెను. 

దత్తుని రూపం - నామం 




ఈయన రూపం లోకంలో కనిపించే నాలుగు ఆశ్రమాలకూ అతీతమైనది.
తనది ఐదవ ఆశ్రమమని దత్తాత్రేయుడు పింగళనాగుడనే మునికి చెప్పెను. లోకంలో తన కన్నా వేరైనది ఇంకేది లేదనే సత్యాన్ని తెలిసిన వైరాగ్యవంతుడికి సంబంధించిన ఆశ్రమము ఈ ఐదవ ఆశ్రమము.
దత్తోపనిషత్తులో ఆయన ఈ ఆశ్రమంలోని వారు చరాచర జగత్తును తమ ఆత్మపరంగా సందర్శించి, త్రిగుణాతీతులుగా నిస్సంగులుగా ఉంటారనీ, వారికి ఎటువంటి కర్మ కలాపాలతో పనిలేదని తెలిపెను.

సకల ప్రాణులను తరింపచేయు మంత్రమేదైనా ఉన్నదా ప్రభూ అని శుకమహర్షి పరమేశ్వరుని అడిగినపుడు ఆ మహాదేవుడు చెప్పిన మాట "దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం".





తెలిసో తెలియకో మన పూర్వీకులు (ముందు తరాల వారు) సరిగ్గా సంప్రదాయకంగా పితృ కర్మలు చేయక పోవడం వలన, మరణించినవారి కర్మకాండలు సరిగ్గా నిర్వర్తించక పోవడం వలన పితృ దోషాలు సంక్రమిస్తాయి. పితృ శాప ఫలితంగా ఇంట్లో కలహాలు, వివాహ ఆటంకాలు, అనారోగ్యాలు, మనస్థాపం, కుటుంబ అభివృద్ధి లేకపోవడం, సంతానం లేకపోవడం... ఇత్యాది అనేక బాధాకర సమస్యలు ఉత్పన్నమౌతాయి. 
ఈ పితృ దోషం చిన్నగా ఉంటే - బిడ్డల వివాహం ఆలస్యం, గర్భస్రావం, కుటుంబ సభ్యులకు ఇ ఎన్ టి సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయని,
మధ్యమముగా ఉంటే - బుద్ధి మాంద్యం, విడాకులు, తీవ్ర కలహాలు, మనశ్శాంతి లేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని,
తీవ్రంగా ఉంటే - అగమ్యగోచర జీవితం, అకాల మరణాలు తదితరం ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. దీనికి ఏకైక సులభ పరిష్కార మార్గం దత్తుని పాదాలు పట్టుకోవడం. వీలైనంతవరకు దత్తుని నామస్మరణ చేస్తే, ఎంతటి పితృ దోషమైన తొలగిపోతుంది. 

దత్తుని అనుగ్రహం చేత ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. గ్రహబాధలు తొలగుతాయి. పితృ శాపం నుండి విముక్తి కలుగుతుంది. అన్నింటికి మించి జ్ఞానం లభిస్తుంది. ఇహ పరానికి దత్తోపసన ప్రధానం. దత్త నామ స్మరణ ఇంతటి దివ్యమైనది. 

అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః
స్మర్తృగామి స్వభక్తాన ముద్ధార్ధ భవసంకటాత్

ఆస్తికుడైనా, నాస్తికుడైనా దత్తా అని తలచినంత మాత్రముననే వారిని అనుగ్రహించుదురు అన్న మాట కొందరికి అసత్యంగా ఉండవచ్చు. ఎన్నిసార్లు పిలిచినా పలకడేం... అన్న పరిహాసం కొందరిది.
దత్తుని దర్శనమో, అనుగ్రహమో గుర్తించడానికి మహర్షులం కాకున్నా, నిర్మలమైన భక్తులమై యుండాలి. కానీ, సంశాయాత్ములైన తమలో భక్తి, నిర్మలత్వం, విశ్వాసం కొరవడినదన్న సత్యాన్ని గ్రహించరు. బహుశా కలి ప్రభావవేమో!
ఎవరు గ్రహించిన, గ్రహించకపోయినా మానవులను ఉద్ధరించుటకు తాను తన ధర్మరక్షణ కార్యమును నేటికీ కొనసాగించుచూ ఉన్నారన్నది యదార్థం. గుర్తించినా, గుర్తించకపోయినా తనని తలచిన వారికి ఏదో రూపేణా అనుగ్రహ ఫలితం అందుతుంది.
ఇక్కడ ఓ కథ చెప్పాలనిపిస్తుంది -
ఒకానొకప్పుడు ఓ రాజుగారికి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే కనిపించడేం? అన్న సందేహం వచ్చి, సమాధానం చెప్పమని సభాసదులను ప్రశ్నించగా, భక్తుడగు ఒక సేవకుడు నేను సమాధానం చెప్పెదనని, ఒక కడవ నిండా పాలు తెప్పించి, అదే పనిగా కలియబెడుతుండగా, కొంత సమయం వేచి చూసి అసహనంతో ఆ రాజు ఏం చేస్తున్నావు, భగవంతుడు ఎక్కడ అని అగ్రహించగా, కోపం వద్దు ప్రభూ, ఈ పాలులో నెయ్యి ఎక్కడ ఉందో వెతుకుతున్నాను అని సేవకుడు చెప్పెను. దానికి రాజు నవ్వి, ఓయీ! అజ్ఞాని! పాలు కాచాలి, తోడుపెట్టి పెరుగు అయ్యాక, చిలికి చిలికి వెన్న తీసి కాస్తే, అప్పుడు నెయ్యి కనిపిస్తుంది అని అనగా, ప్రభూ! ఇదే మీ సందేహానికి సమాధానం. నెయ్యి పాలంతటను వ్యాపించియున్నను, జలాంశముచే క్షీరం గలసి యున్నందువలన కనిపింపక యున్నట్లే, భగవంతుడు చరాచరమంతా నిండియున్నా మాయ అను ఆవరణమువలన కనిపించడం లేదని, చిలికి చిలికి నెయ్యిని కాంచినట్లే, హృదయమందు ఆత్మానాత్మమధనము చేయువారికి భగవానుడు కనిపించునని చెప్పెను. 
ఇది అర్థమైన వారికి అర్థమైనంత🙏

ఏ చోట చదివానో, ఏ నోట విన్నానో గానీ...మనస్సు పట్టిన నాలుగు మాటలు -

ఎక్కడ దత్త దత్త దత్త అని స్మరించబడుతోందో,
ఎక్కడ దత్త నామసంకీర్తన జరుగుతోందో, 
ఎక్కడ దత్త నామము భజింపబడుతోందో
అటువంటి ఇల్లు, సిధ్ధుల ఆశ్రమం.
అక్కడ సకల దేవీదేవతలు  కొలువై ఉంటారు.

ఎవరి హృదయం నిరంతరం దత్త దత్త దత్త అని స్పందిస్తుందో, అట్టి హృదయమే మాలాపురం. (మాలాపురం దత్తుని ఆవిర్భవ స్థానం)

ఎవరి మనసు "అనసూయ"
ఎవరి బుధ్ధి "అత్రి" అవుతుందో,
వారి హృదయంలోకి దత్తమై వచ్చేవాడే దత్తుడు.

దత్తుని వైభవం అనంతం. నాకు తెలిసింది అణుమాత్రం.

              🙏శ్రీ దత్త శరణం మమ🙏