25, జూన్ 2012, సోమవారం

సద్గురువు

మాయాజగత్తులో ప్రవేశించి అజ్ఞానంతో ప్రాకృతదారపుత్ర గ్రహదులయందు భవపాశంచే కట్టబడిన మానవుణ్ణి బంధవిమోచనమును చేసి హృదయలోతుల్లో నిక్షిప్తమైన జ్ఞాననిధిని వెలికి తీసుకురాగలవారు, భౌతికమైన స్వరూపాలకు అతీతమైన దైవానుభవం కల్గించేవారు, దేవాలయమనే దేహంలో దైవత్వాన్ని దర్శింపజేసేవారు, ఆత్మను పరమాత్మలో చేర్చగలవారే నిజమైన సద్గురువులు. 'తమసోమా జ్యోతిర్గమయా' అజ్ఞానమనే చీకట్లును పోగొట్టి జ్ఞానమనే వెలుగులను నింపే సమర్ధుడే సద్గురువు. 


'ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే' ఈశ్వరుడు, సద్గురువు, ఆత్మ ఒక్కటే. మూర్తి భేదభావమే తప్ప తేడాలేదు. 

స్వస్వరూపమును తెలియజేప్పేదే నిజమైన విద్య. ఇదే శాశ్వతానంద విద్య, ఆధ్యాత్మిక విద్య. ఇంతటి ఆధ్యాత్మికవిద్య గురుముఖతా రావాలి.
వేదన్తానామనేకత్వాత్ సంశయానాం బహుత్వతః / 
వేదాస్యాప్యతిసూక్ష్మత్వాత్ న జానాతి గురుం వినా //
వేతాంతమార్గములు అనేకములగుటచేతను, సంశయములు అనేకములగుటచేతను, తెలియదగిన బ్రహ్మము మిక్కిలి సూక్ష్మమగుటచేతను గురుదేవుడు వినా ఇది గోచారం కాజాలదు. 
భక్తుల కోరిక వలన  మానుషస్వరూపంలో(స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం) మానవులను తరింపజేయుటకోసం ఆ సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు ప్రియభక్తునిపై కృప కలిగి, భక్తుని పరిపక్వస్థితిని బట్టి, వాని పురోభివృద్ధి కొఱకు తన దివ్యత్వాన్ని గురురూపంలో వ్యక్తపరుస్తాడు.  
మానవులు సృష్టిలో భగవంతున్ని స్వయంగా తమంతట తాముగా  చేరుకోలేరు. స్వప్రయత్నంతో భగవంతుడిని చేరుకోవడం కష్టం కాబట్టి గురువు ఆవశ్యకత తప్పనిసరి. 
గురువు నిశ్చయంగా అవసరం. గురువుతప్ప మరెవ్వరూ, బుద్ధి ఇంద్రియాలకు సంబంధించిన విషయకీకారణ్యం నుంచి మానవుణ్ణి బైటికి తీసి రక్షించలేరని ఉపనిషత్ పేర్కొంటుంది. సాధరణంగా సాధకులు తమ మనస్సులతో ఈశ్వరచింతన చేయుదురు. మనస్సు త్రిగుణాత్మకం. త్రిగుణములకు, మనోబుద్ధులకు అతీతమైన బ్రహ్మమును ఆత్మానుభవంగల ఆచార్యుని వలననే దైవతత్వం తెలుసుకోగలరు. 'తద్విజ్ఞానార్ధం స గురుమేవాభి గచ్చేత్సమిత్పాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్టం' (ముండకోపనిషత్)  
భవబంధాలచే ఆత్మవిస్మృతి కలిగియున్న జీవునకు ఆత్మావభోధమును గలుగజేయువాడే గురుదేవుడు. నిరంతర నిశ్చల ఆత్మనిష్టాగరిష్టులై, అందరి యెడల, అన్నింటి యెడల, సర్వకాల సర్వావస్థల్లో, సర్వచోట్ల సర్వులయందు, స్థిరచిత్తులై సమదృష్టి కలిగియుండినవారే సద్గురువులని శ్రీరమణులు అంటారు. 
   
  

       
         వందే గురుపరంపర                                          
ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ 
కర్త్రుభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః 
అధ్యాత్మవిద్యా సంప్రదాయకులైన ఉపనిషత్కర్తలకును, వంశ ఋషులకును, ఆదిబ్రహ్మ మొదలుకొని సకలమహాపురుషులకును, సద్గురుమూర్తికిని నమస్కారం.  

ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే 
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః 
ఓంకారవాచ్యులును, శుద్ధమైన జ్ఞానమే ఆకారంగాగల వారును, నిర్మలులును, ప్రశాంతులు నగు శ్రీ దక్షిణమూర్తికి నమస్కారం.

ఓం హయాస్యాద్యవతరైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః
కృతార్ధతాం గతాస్తం వై నారాయణ ముపాస్మహే 
హయగ్రీవమూర్తి మొదలైన యెవని అవతారములచే మునీశ్వరులు జ్ఞానసిద్ధులై కృతార్ధులైరో అట్టి శ్రీమన్నారాయణమూర్తిని ఉపాసించుచున్నాం.

ఓం వేదతత్వైర్మహావాక్యె ర్వసిష్టాద్యా మహర్షయః 
చతుర్భిశ్చతురా ఆనన్ తం వై పద్మభువం భజే 
వసిష్టాది బ్రహ్మరుషులు ఎవనియొక్క వేదసారమైనట్టి జీవేబ్రహ్మైక్య ప్రతిపాదకమగు (ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్త్వమసి, ఆయనాత్మ బ్రహ్మ అను) నాలుగు మహావాక్యములచే చతురులై మహాత్పదమును చెందిరో అట్టి పద్మజుడగు చతుర్ముఖబ్రహ్మను భజించుచున్నాను.

బ్రహ్మర్షిర్ర్బహ్మవిద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః 
తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్టం భజే న్వహమ్ 
బ్రహ్మఋషియు, బ్రహ్మవిద్వర్యుడును, బ్రహ్మస్వరుపుడును, బ్రహ్మనిష్టులందు ప్రేమగలవాడును, తపస్వియు, తత్త్వవేత్తయును అయిన వసిష్టభగవానుని ప్రతిదినమును  భజించుచుందును.

యోగజ్ఞం యోగినాం పర్వం బ్రహ్మజ్ఞానవిభూషితమ్ 
శ్రీమద్వసిష్టతనయం శక్తిం వందే మహామునిమ్ 
యోగ మెరిగినవాడను, యోగులలో ఉత్తముడును, బ్రహ్మజ్ఞానం చేత అలంకరింపబడినవాడును, బ్రహ్మవిద్యా సంపన్నుడైన వసిష్టభగవానుని కుమారుడును, మహామునియును అగు శక్తికి నమస్కరించుచున్నాను.

ధర్మజ్ఞం ధార్మికం ధీరం ధర్మాత్మానం దయానిధిమ్ 
ధర్మశాస్త్రప్రవక్తారం పరాశరమునిం భజే
ధర్మం లెరింగినవారును, ధర్మముల నాచరించువారును, నిర్మోహమైన ధైర్యం గలవారును, బుద్ధిని స్వాదీనమందుంచుకొన్నవారును, ధర్మస్వరూపులును, దయాసముద్రులును, ధర్మశాస్త్రమును రచించినవారును అగు పరాశరమునిను భజించుచున్నాను.

కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతమ్ 
వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిమ్ 
వేదములను విభజించినవాడును, అన్నిలోకములవారి మేలును గురించి ఆసక్తి గలవాడును, వేదములనెడి పద్మములను వికసింపజేయుటలో సూర్యునివంటివాడును, శమము దమము మొదలైనవానికి స్థానమైనవాడును అగు కృష్ణద్వైపాయన మహామునికి (వ్యాసుడు) నమస్కరించుచున్నాను.

శ్రీపరాశరపౌత్రం శ్రీవ్యాసపుత్ర మకల్మషమ్ 
నిత్యవైరాగ్యసంపన్నం జీవన్ముక్తం శుకం భజే 
శ్రీపరాశరముని మనుమడును, శ్రీవేదవ్యాసభగవానుని కుమారుడును, ఏ విధమైన కల్మషం లేనివాడును, జీవన్ముక్తుడును అగు శుకమహామునిని భజించుచున్నాను.

ఓం మాండుక్య కారికాకర్తా యో భాతి బ్రహ్మవిద్వరః
శ్రీగౌడపాదాచార్యం తం ప్రణమామి ముహుర్ముహు:
బ్రహ్మజ్ఞానులలో శ్రేష్టుడైన యే మహానుభావుడు మాండుక్య కారికలను రచించినవాడై ప్రకాశించుచున్నాడో అట్టి గౌడపాదాచార్యులకు మాటిమాటికి నమస్కరించుచున్నాను.

ఓం యోగీశ్వరం వేదచూడం వేదాంతార్ధనిధిం మునిమ్ 
గోవిందభగవత్పాదాచార్యవర్య ముపాస్మహే 
యోగీశ్వరుడును, ఉపనిషదర్ధమునకు నిధియును, మననశీలుడును అగు గోవిందభగవత్పాదాచార్యులవారిని ఉపాసించెదను.

హరలీలావతారాయ శంకరాయ వరౌజసే 
కైవల్యకలనాకల్పతరవే గురవే నమః 
ఈశ్వరుని లీలావతారమును, గొప్ప తేజస్సుగలవాడును, మోక్షమను ఫలం నిచ్చుటకు కల్పవృక్షంవంటివాడును, జగద్గురువు నగు శ్రీశంకరభగవత్పాదాచార్యులవారికి నమస్కారం.

ఓం సచ్చిదానందరూపాయ వ్యాపినే పరమాత్మనే 
నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే  
సత్ చిత్ ఆనందం అనునవివే స్వరూపముగా గలవాడును, వ్యాపకుడును, పరమాత్మస్వరూపుడును, వేదవేదాంతములచే తెలియదగినవాడును, దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ఉండువాడు నగు గురువునకు నమస్కారం.


  

9, జూన్ 2012, శనివారం

గురుభక్తి మహిమ

     మహాగురుభక్తియు, గొప్పవిరక్తియు, తీవ్ర ఆధ్యాత్మిక జిజ్ఞాసగల ఒకానొక భక్తుడును ఒక బ్రహ్మనిష్టుల సభలో ఉపన్యసించ వలసినదిగా సభాకార్యనిర్వాహకులు కోరగా, వారికోరికను మన్నించి ఆ గురుభక్తుడు ముందుగా తన గురువర్యున్ని స్మరించుకొని శ్రీ గురుస్తోత్రమును జేయదలచెను. అయితే గురుదేవుడును ఎటుల స్తుతించిన బాగుండునని యోచిస్తూ, ముందుగా సూర్యునితో పోల్చుతూ చెప్పడానికి ప్రయత్నించెను.

                                      సూర్య దృష్టాంతము 


ప్రపంచంలోగల చీకటిని రహితమొనర్చి ప్రకాశమును కలుగజేసిడి సూర్యునితో గురుదేవున్ని పోల్చి వర్ణించిన బాగుండునని తలచెను. కానీ, అది సరికాదని అలా పోల్చడం గురుదేవునుని అవమానపరచడమే అవుతుందని తలచెను. ఏలననగా -
సూర్యుడు తమస్సును రహితంగా చేసి ప్రకాశమును కలుగజేయునది నిజమైనను సూర్యప్రకాశము భూగోళమున ఒకప్రక్క ప్రకాశమును, మరోప్రక్కన చీకటిగా యుండును. తన జ్ఞానప్రకాశంతో అంతటా ఒకేలా ప్రకాశించుచున్న సర్వవ్యాపకుడు అయిన గురుదేవుడును సూర్యునితో పోల్చడం తప్పని భావించెను. అంతేకాదు, సూర్యుడు పగలు మాత్రమే ప్రకాశించి రాత్రియందు ప్రకాశింపజాలడు. అలానే సూర్యుడు బయటప్రదేశమున మాత్రమే ప్రకాశించు శక్తిగలవాడే గానీ, జీవుల హృదయాంతరాళమున నిబిడమై యుండు అజ్ఞానతమస్సును రహితమొనర్చజాలడు. కానీ, గురుదేవుడు మనస్సులో నిబిడమై యుండు అజ్ఞానతమస్సును రహితమొనర్చగలడు. అంతేకాదు, దట్టమైన మబ్బులవలన, గ్రహణకాలంలోనూ సూర్యుడు మరుగునపడిపోవుచున్నాడు. స్వప్రకాశకుడగు గురుదేవుడు సర్వప్రకాశకుడు.కాబట్టి సూర్యునితో గురుదేవుడును పోల్చలేను అని చెప్పి -
అజ్ఞానతిమిరాంధస్య  జ్ఞానాంజనశాలాకయా / చక్షరున్మీలితం యేవ తస్మై శ్రీగురవే నమః //
ఈ రీతిలో గద్గదస్వరంతో స్తుతించి కాసేపు ఉపన్యసించడం ఆపెను.

                                    చంద్ర దృష్టాంతము 
కాసేపటికి మరల ఉపన్యసించ దలచెను. ఈసారి చంద్రునితో పోల్చదలిచెను. కానీ, అదీ సరికాదని భావించెను. ఏలననగా -
చంద్రుడు చల్లనివాడును, ప్రసన్నుడును అయినను చంద్రుడు యొక్క చల్లదనమును, ప్రసన్నత్వం ఎల్లప్పుడును ఉండుటలేదు. కానీ, నా గురుదేవుడు సదా చల్లదనమును, ప్రసన్నత్వమును కల్గియున్నవాడు. అంతేకాక, శుక్లపక్షమున వృద్ధియు, కృష్ణపక్షమున క్షయమున్ను చంద్రునికి కల్గుచున్నది. నా గురుదేవుడో... ఏ హెచ్చుతగ్గులు లేకుండా పరిపూర్ణుడై యున్నాడు. అంతేకాక, చంద్రునియందు కళంకం కలదు. నా గురుదేవుడు నిష్కళంకుడు. పరప్రకాశంతో ప్రకాశించువాడు చంద్రుడు. మరి నా గురుదేవుడో... స్వయంప్రకాశకుడు. సూర్యుని మాదిరిగా మేఘాలువలన, గ్రహణకాలంలో రాహుకేతువులవలన చంద్రుడు మరుగునపడుచున్నాడు. మరియు రాత్రినే చంద్రుని ప్రకాశముండును. కానీ, నా గురుదేవుడు రేయింబవళ్ళు ఒకే విధంగా వెలుగుచున్నవాడు. కావున చంద్రునితో నా గురుదేవుడిని పోల్చడం దోషమని చెప్పి -
అఖండమండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ / తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీగురవే నమః // 
అని స్తుతించి కాసేపు మౌనమయ్యేను.

                                సముద్ర దృష్టాంతము 
కాసేపటికి మరల ఉపన్యసించదలచెను. ఈసారి సముద్రముతో పోల్చదలిచెను. కానీ, ఆ పోలిక కూడా సరికాదని భావించెను. ఏలననగా -
సముద్రం అపారమని చెప్పబడినను సముద్రమునకు కూడా పారం గలదు. కానీ, నా గురుదేవుడు సర్వవ్యాపకత్వం కలిగినవాడు. సముద్రజలమంతయు లవణరసమైనది. త్రాగుటకు ఉపయోగపడదు. కానీ నా గురుదేవుని హృదయం క్షారోదకం కాదు, ఆ హృదయం అమృతమయం. జిజ్ఞాసువులు రేయింబవళ్ళు వచ్చి జ్ఞానామృతమును పానమొనర్చి తృప్తులగుచున్నారు. సముద్రన్తర్భాగమున రత్నాదులు ఉన్నప్పటికిని అనేక క్రూరములగు పాములు, మకరములు, త్రిమింగలాది జలచరజంతువులు కలవు. కానీ, నా గురుదేవుని హృదయాన్తరమున శాంతమనెడు రత్నములను, సహనముత్యములను, వైరాగ్యపగడములను ఉన్నవి. సముద్రంలో జీవులు ఒకదానిని ఒకటి హింసించి తింటుంటాయి. మా గురుదేవుని హృదయం ఏ ప్రాణిని హింసించని అహింసా ధర్మమయమై యున్నది. సముద్ర అంతర్భాగమున బడబాగ్నులున్నాయి, నా గురుదేవుని హ్రుదయాన్తర్భాగమున బ్రహ్మానందము, శాంతం, శివము ఉన్నవి. సముద్రములో ఎన్నో మాలిన్యములు కలిసియుండును. కానీ, గురుదేవుని హృదయంలో వేదసారమగు జ్ఞానం నిలిచియున్నది. కావున సముద్రంతో గురుదేవున్ని పోల్చలేనని చెప్పి -
సంసారవృక్ష మారూడాః పతన్తి నరకార్ణవే / యస్తానుద్ధరతే సర్వాంస్తస్మై శ్రీగురవే నమః // 
ఇలా స్తుతిస్తూ మరల మౌనమయ్యేను.

                      మహా మేరువు దృష్టాంతము 
కాసేపటికి ఆ భక్తపరాయణుడు మరల తన ఉపన్యాసమును ప్రారంభిస్తూ, ఈ సారి మహామేరువుతో పోల్చడానికి ప్రయత్నించెను. కానీ, అది కూడ సరికాదని భావించెను. ఏలననగా -
మేరుపర్వతం అక్కడక్కడ రత్నాలున్నను వట్టి మట్టి రాళ్ళగుట్ట. మేరువు ఏకప్రదేశమునకు పరిమితం. జ్ఞానం లేని జఢవస్తువు. మరి నా గురుదేవుడో.... జ్ఞానరత్నముల రాశిభూతుడై అంతటా  తిరుగాడు చైతన్యమూర్తి.  మేరువుపై పార్వతీపరమేశ్వరులు ఉండడంవలన పుణ్యం ప్రాప్తించింది. కానీ, నా గురుదేవుడు పకృతి పురుషులకు విలక్షణమగు శుద్ధశివస్వరూపుడు. మేరుగిరిపై సింహశార్దులాది భయంకరజంతువులు గలవు. నా గురుదేవుడు యందో, శాంతి, సత్య, కరుణాది అనేక సుగుణములే ఉన్నవి. మేరుగిరిపై అనేకమంది దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు తమ తమ భార్యలతో ఆసక్తితో క్రీడించుచుందురు. కానీ, నా గురువరుని ఆశ్రమమున అనేకమంది స్త్రీ పురుషులున్నను, వారందరునూ ఆత్మారాములై ఆత్మయందు రమించువారే గానీ విషయాసక్తులు కారు. మేరుగిరి యందుండి అనేక ప్రోతస్సులు ప్రవహించుచుండును. అవన్నీ వట్టి నీళ్ళే గానీ మరియొకటి కాదు. నా ప్రభువగు గురువు నుండి సదా జ్ఞానప్రవాహమే జరుగును. దానిని పానం చేసినవారికి మరల జననమరణములే ఉండవు. మేరుపర్వతం నుండి జాలువారు గంగాప్రవాహం కొంతసేపు దాహంను శమింపజేయును. కానీ నా గురుదేవుని ముఖరావిందం నుండి వెలువచుండు జ్ఞానగంగను పానంచేసిన వారికి ఏ కాలమందైనను తాపత్రయాగ్నిచే నేర్పడిన దాహముండదు. ఇత్యాది కారణములచే మేరుపర్వతంతో కూడా నా గురుదేవుడుని పోల్చడం తగదని చెప్పి -
అజ్ఞానేనాహినా గ్రస్తాః ప్రాణినస్తాచ్చికిత్సకః / విద్యాస్వరూపో భగవాంస్తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి కాసేపు మరల మౌనమయ్యేను.

                                   అగ్ని దృష్టాంతము 
మరల తన గురువు మహిమ తెలపడానికి ఉపన్యాసంను ప్రారంభిస్తూ, ఈసారి అగ్నితో పోల్చడానికి ప్రయత్నించెను. కానీ, అది కూడా సరికాదని తలచెను. ఏలననగా -
అగ్ని కట్టెలను కాల్చివేయు శక్తి గలదైనను అజ్ఞానకాష్టమును దహింపజేయుశక్తి అగ్నియందు లేదు. నా గురుదేవుడో....అజ్ఞానేంధనమును భస్మమొనర్చుడు శక్తిమంతుడు. స్థూలమైన కట్టెలను అగ్ని బూడిద చేయగలదు గానీ సూక్ష్మమై జన్మజన్మాంతరములనుండి వచ్చుచుండు కర్మరాశియను కట్టెలను గురుదేవుడు జ్ఞానదృష్టి అనెడు అగ్నిచే భస్మమయముగా చేయును. మహారణ్యమును ఈ అగ్నిహోత్రుడు భస్మమొనర్చినను నొనర్చుగాక, కానీ అంతు కనబడని సంసారారణ్యమును నా గురుదేవుడు జ్ఞానాగ్నిచే భస్మం చేయును. ఎంత శుద్ధమైన యజ్ఞాగ్ని కాని, దక్షిణాగ్ని కాని, గార్హపత్యాగ్ని కాని, ఆహనీయాగ్ని కాని, సమిధలు వేయుచుండువరకు మాత్రమే జ్వలించుచుండును, లేనిచో నింపాదిగా చల్లారిపోవును. జ్ఞానాగ్ని స్వరూపుడగు నా గురుదేవును ప్రజ్ఞానాగ్ని ఎప్పుడూ నశించదు. కావున అగ్నితో నా గురుదేవున్ని పోల్చడం సరికాదని చెప్పి -
తాపత్రయాగ్నితప్తానామశాంతప్రాణినాం భువి / గురురేవ పరా గంగా తస్మై శ్రీగురవే నమః //  
అని స్తుతించి మరల కాసేపు మౌనమయ్యేను. 

                                 బ్రహ్మ దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యచించడం ప్రారంభించెను. ఈసారి  గురుదేవున్ని బ్రహ్మదేవునితో పోల్చడానికి ప్రయత్నించెను. ఇది కూడా సరికాదని భావించెను. ఏలననగా -
బ్రహ్మదేవునికి శ్రీమన్నారాయణమూర్తి గురువని ప్రామాణికం కలదు ('యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, యోవై వేదాంశ్చప్రహిణోతి తస్మై'). తనపై ఓ గురువుండగా ఈ బ్రహ్మను స్వయంప్రకాశుడున్ను, స్వయంభువు అగు నా గురువుతో సమానముచేసి నేను స్తుతించలేను. అదియును గాక, ఎవరుగొప్పవారనే అహం స్పురణతో  అనలస్తంభంగా ఆవిర్భవించిన శివుని అది అంతంలు కనుగొనలేక దేనువుచేతను, మొగలిపువ్వుచేతను అసత్యం పలికించినవాడు, శాపం వున్నవాడు బ్రహ్మయని అందురు. మరి నా గురుదేవుడో... సత్యవంతుడు, అందరి శాపములను పోగొట్టువాడు. అదియునుగాక, సనక సనందన సనత్కుమార, సనత్సుజాతులను నలుగురు తీవ్ర బ్రహ్మజిజ్ఞాస మహాయోగులు జీవబ్రహ్మైక్యసందేహనివృత్తికై బ్రహ్మలోకం వెళ్ళి సరస్వతీదేవితో కూడిఉన్న బ్రహ్మనుకాంచి, తమ సందేహమును తీర్చే గురువు ఇతనుకాదని వెడలిరి. అన్ని సందేహములను తీర్చే నా గురుదేవుడిని బ్రహ్మతో పోల్చలేనని చెప్పి -
అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే / జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి మరల కాసేపు మౌనం వహించెను.

                                        విష్ణు దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యసించ దలచి, ఈసారి గురుదేవున్ని విష్ణువుతో పోల్చడానికి ప్రయత్నించెను. ఈ పోలిక సరికాదని భావించెను. ఏలననగా -
తమ గురువుగా చతుర్ముఖ బ్రహ్మను స్వీకరించక వైకుంఠలోకంకి వెళ్ళిన సనకాది మహర్షులు లక్ష్మీదేవితో కలిసిఉన్న శ్రీమన్నారాయణమూర్తి దరి కూడా తమ సందేహనివృత్తి జరగదని తెలుసుకొని అచ్చటనుండి వెడలిరి. అంతేకాదు, బ్రహ్మ మాదిరిగా అసత్యం చెప్పకపోయినను అనలస్తంభం ఆది అంత్యంలను ఎరగనివాడు కావున సర్వజ్ఞుడైన నా గురుదేవున్ని విష్ణువుతో పోల్చలేనని చెప్పి -
భావారణ్యప్రవిష్టస్య దిజ్మోహభ్రాన్తచేతనః / యేవ సందర్శితః పన్దాస్తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి మరల మౌనమయ్యేను.

                                      శివ దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యసించ దలచి, ఈసారి శివునితో పోల్చడానికి సంకల్పించెను. సనకాదిమునిసత్తములు నలుగురున్ను తమ సందేహనివృత్తికై కైలాసమునకు వస్తున్న విషయమును పరమశివుడు ముందుగానే దివ్యదృష్టితో తెలుసుకొని, వారి సందేహములు తీర్చుటకై సర్వమును త్యాగమొనర్చి, విభూతి  రుద్రాక్షలను ధరించి ఓ వటవృక్షం యొక్క మూలమున వ్యాఘ్రాసనముపై  దక్షిణాభిముఖంగా సిద్ధాసనసీనుడై, చలించని బ్రహ్మదృష్టి గలవాడై, ప్రసన్నముఖారవిందుడై ధ్యానమయుడై కూర్చోండెను. ఇదియే దక్షిణామూర్తి యొక్క అవతార రహస్యం. సనకాది మునివర్యులు నలుగురును సర్వేంద్రియములను నిగ్రహపరచి ప్రత్యక్ చైతన్య బ్రహ్మస్వరూపమందు నిలకడకలిగి యుండునట్టి దక్షిణామూర్తి యొక్క స్థితిని జూచినవారై తమకు సరియైన గురువు ఇతనేనని నిశ్చయించుకొని ప్రణమిల్లిరి. అటుపై తమ సందేహములను తీర్చుకొని సనకాదులు దక్షిణామూర్తి మౌనబోధచే సర్వసంశయరహితులై, శివజీవైక్యస్వరూపులై గురుస్తోత్రం చేసి తమస్థానములకు తృప్తిగా తిరిగి వెళ్ళిరి, అని ఆనందంగా చెప్పి - 
శిష్యానాం జ్ఞానదానాయ లీలయా దేహదారిణే/సదేహేపి విదేహాయ తస్మై శ్రీగురవే నమః //
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే/వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః//
ఓమ్ నమః ప్రణవార్దయ శుద్ధజ్ఞానైకమూర్తయే/నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః//
అని దక్షిణామూర్తిని స్తుతిస్తూ గురుభక్తి మెండుగా గల ఈ పరమభక్తుడు గురుధ్యానం చేసి చేసి బ్రహ్మాకారస్వరూపుడగు గురుస్వరూపుడు అయ్యెను.



                                                                                 

4, జూన్ 2012, సోమవారం

మానసాది తీర్ధములు

 
 
 'ఏతే భౌమామ్మయా యజ్ఞాః తీర్ధ రూపేణ నిర్మితాః'
తీర్ధాలు భూమి మీద జలమయమైన యజ్ఞాలు. అందుచే బ్రహ్మదేవుడు వీటిని సృష్టించాడు. 
ఐతే ఈ తీర్ధస్నానముల వలన లభించేది కాస్తంత పుణ్యం, పరమాత్మునిపై భక్తిభావం. అంతేకాని ఇవి సంపూర్ణముగా మానవుణ్ణి తరింపజేయవన్నది పెద్దల అభిమతం. 
కరములందు నమరు గంగాధరునిబట్టి 
తీర్ధములకుబోయి తిరుగుచుండ్రు
వెన్నబట్టి నెయ్యి వెదికినచందంబు 
విశ్వదాభిరామ వినురవేమ !
చేతిలో వెన్న పెట్టుకొని నేతికోసం వెదుకుచున్నట్లుగా, చేతిలో పరమాత్మను పెట్టుకొని తీర్ధాలకు తిరుగుతూ ఉంటారు. అంటే అంతర్యామి అంతరంగమునే ఉండగా  అది గ్రహించక ఎక్కడో తీర్ధక్షేత్రాలలోనే పరమాత్ముడు ఉన్నాడని భావించడం తగదని అర్ధం.
కాశిబోదు ననుచు గడకట్టగానేల
వాసితీర్ధములను వగవనేల
దోసకారికెట్లు దొరకురా యాకాశి
విశ్వధాబిరామ వినురవేమ !
కాశీకి వెళ్ళాలని తీర్దాలు చూడాలని విచారించటం ఎందుకు? దోషకారికెట్లు పుణ్యం లభిస్తుంది? అంటే మోక్షమనేది పుణ్యకార్యాలు చిత్తశుద్ధితో చేయడంవలన వస్తుంది కానీ తీర్ధయాత్రలు చేయడంవలన కాదు.
నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు కాడు
పూర్ణమైన ముక్తి పొందలేడు
నీరుకోడి యెపుడు నీళ్ళను మున్గదా 
విశ్వదాభిరామ వినురవేమ !
నీళ్ళలో మునిగి స్నానాలు, తపస్సు చేస్తున్నంతమాత్రమున నిర్మలాత్మనుకానీ, పరిపూర్ణ ముక్తినికాని పొందలేరు. నీటికోడి ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటుంది, అంతమాత్రమున అది మోక్షమును పొందినట్లు అవుతుందా?
మానసేష్వపి తీర్దేషు యో నరస్స్నాతి బాహ్యకే 
జలే న హి భవే చ్చుద్దో యధా మాండూక కచ్చపౌ
మనశుద్ధిలేక బాహ్యతీర్ధములయందు స్నానంచేయువారు శరీరమలినమును కడిగివేయుటచేత ఎంతమాత్రమూ పరిశుద్ధులు కారు. నిరంతరం నీటియందు యుండు కప్ప, తాబేలు మొదలగువానివలె శుద్ధులు కాలేరు.
అడవి తిరుగ లేదు అకసమున లేదు
అవని తీర్ధయాత్రలందులే 
ఒడలుకుద్దిచేసి ఒడయని జూడరా 
విశ్వదాభిరామ వినురవేమ !
భగవంతునికోసం అడవులలోనూ, ఆకాశంలోనూ, తీర్ధయాత్రలు చేయడంలోనూ తెలుసుకోలేరు. శరీరాన్ని కుదుట పరచుకొని పరమేశ్వరుణ్ణి పరికించాలి. అంటే భగవంతునికై ఎక్కడెక్కడో తిరగనవసరంలేదు, ఉన్నచోటనే మనస్సుని కుదుట పరచుకుంటే పరమాత్ముడుని చూడగలరు.
తిరిగితిరిగి నరుడు మరులుకొనుటేగాక
అందువలననేమి యాశ గలుగు
నంతరాత్మ నిలుపునతడే పో బ్రహ్మంబు 
విశ్వదాభిరామ వినురవేమ !
బ్రహ్మజ్ఞానం సంపాదించాలని నరుడు తీర్ధయాత్రలు చేయడంవలన శ్రమ మిగులుతుంది గానీ జ్ఞానోదయం కలుగుతుందన్న ఆశ లేదు. అంతరాత్మయందు దృష్టిని నిలిపినపుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అతడే బ్రహ్మ అవుతాడు.

తీర్ధములయందు స్నానమాచరించిన చాలు తరించిదురు అన్న మహర్షుల వాక్యములకు అసలర్ధం ఏమిటంటే -
  
తరింపజేయునదే తీర్ధం. దేనివలన జననమరణ భయంకరమగు భవసాగరం తరింప బడునో, దానికే తీర్ధమని అందురు. అయితే అటువంటి పరమగతిని అందిచ్చే  తీర్ధంలు ఏవీ? ఎక్కడ ఉన్నాయంటే -


 మానసా న్యపి తీర్ధాని వక్ష్యామి శృణు పార్ధివ /
యేషు సంయజ్నరః స్నాత్వా ప్రయాతి పరమాం గతిమ్ //

సత్యం తీర్ధం క్షమా తీర్ధం తీర్ధ మింద్రియ నిగ్రహః /
సర్వభూతదయా తీర్ధం తీర్ధమార్జవ మేవ చ //

దానం తీర్ధం దమస్తీర్ధం సంతోషస్తృప్తి రేవ చ /
బ్రహ్మచర్యం పరం తీర్ధ మక్రోధ స్తీర్ధముచ్యతే //

మనశ్శుద్ది: పరం తీర్ధం తపస్తీర్ధ మనుత్తమమ్ /
ఆచార్యోపాసనం తీర్ధం శౌచం తీర్ధ మనుత్తమమ్ //

వైరాగ్యం పరమం తీర్ధ మసక్తం విషయేషు చ  
సుతీర్ధం సమచిత్తత్వం తీర్ధమాత్మని దర్శనమ్ 
సత్సంగతి: పరం తీర్ధం  తీర్ధాన ముత్తమోత్తమమ్ 
 
(సత్యం పలుకుట, క్షమ, ఇంద్రియ నిగ్రహం, సమస్త ప్రాణులయందు దయకలిగియుండుట, ఆర్జవం, దానం, దమం, సంతోషం, తృప్తి, బ్రహ్మచర్యం, అహింస, అక్రోధం, మనశుద్ధి, తపస్సు, ఆచార్యోపాసనము, శౌచం, వైరాగ్యం, విషయవిరక్తి, సమచిత్తత్వం, ఆత్మనిదర్శనం ఇవన్నియూ సుతీర్ధములు).
ఈ సద్గుణ సంపన్నత సర్వతీర్ధాల స్వరూపములు కావున ఇవియే సుతీర్ధములనబడును. ఈ దైవీగుణ తీర్ధాలకై హిమాలయ గుహల్లోకి వెళ్ళనవసరం లేదు, సప్తసముద్రాలలో ఈదనవసరం లేదు, పర్వతశిఖరాలపైకి పయనించనవసరం లేదు, అరణ్యాలులో తపస్సు చేయనవసరం లేదు.  బాహ్యమున వీటికి అన్వేషించనవసరం లేదు. ఇవన్నీ మన సహజగుణాలు. ఇవన్నీ అంతరంగమున అంతర్లీనంగా ప్రవహిస్తున్న జీవధారలు. దైనందిక వ్యవహారాల్లో సదా దైవచింతనలో ఉండి సాధనద్వార ఈ సద్గుణములను పల్లవింపజేస్తే ఎల్లలూ, ఆనకట్టలు లేని చైతన్యగంగాధారలో మునకలేయవచ్చు, పరమపావనం కావచ్చు.

అతోన్యధా వర్తమానః కోటి సంవత్సరావధి 
గంగాజల నిమగ్నోపి నైవ శుద్ధ్యాత్కదాచన
ఈ తీర్ధములయందు కాక మానవుడు కోటిసంవత్సరములు అనగా అనేక సంవత్సరములు బ్రతికి యుండి గంగాజలమందు ప్రతిదినమును మునకలు వేసినను ఎంతమాత్రమును పరిశుద్దుడు కానేరడు.
 
'చేతస్సు నిర్మలో తీర్ధం'  నిర్మలమైన చిత్తమే తీర్ధస్వరూపం.
ఈ సద్గుణములతో అంతరంగం శుద్ధమైన దశలో హృదయమే నిర్మలమైన పవిత్ర గంగాది పుణ్యతీర్ధములుగా మారి ఆంతర్యంలో ప్రవహించి తరింపజేస్తాయి. 
'జ్ఞానమేవ పరం తీర్ధం' జ్ఞానమే ముఖ్యమైన తీర్ధం. భక్తిశ్రద్ధలుగల భావనాత్మకంబైన సద్గుణధ్యానయోగ సిద్ధంబగు జ్ఞానమే ఫలంకరంబైన తీర్ధంబగును.
ఆత్మానుభవజ్ఞానం అగు తీర్ధంనందు స్నానం చేసినవారే ముక్తిపొందుదురు. (ఉపనిషత్సార రత్నావళి)