28, జనవరి 2017, శనివారం

సూర్యారాధన

చంద్రుడు 'మఖ' నక్షత్రముతో కూడుకున్నమాసం మాఘమాసం. విష్ణువుకు ప్రీతిపదమైన మాసం. ఉత్తరాయన పుణ్యకాలంలో వచ్చే పుణ్యప్రదమైన మాసం. పలు ప్రత్యేకతలతో ప్రశస్తమైనది ఈ మాఘమాసమని పెద్దలు చెప్తుంటారు. 
మఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువుకు ఈ మాసం శ్రేష్టమైనది. మా + అఘం = మాఘం పాపం లేనిది అని మరో అర్ధం. 
మాఘశుద్ధ చతుర్థిని వరగణేశ చతుర్థిగా, మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా, మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగా, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగా, మాఘశుద్ధ ద్వాదశిని భీష్మద్వాదశిగా, మాఘశుద్ధ పూర్ణిమను మహామాఘిగా, మాఘ బహుళ చతుర్థిని సంకష్ట హరచతుర్థిగా, మాఘ బహుళ చతుర్ధశిని మహాశివరాత్రి పర్వదినంగా మాఘ కృష్ణ అమావాస్యను పితృతిధిగా పేర్కొంటారు.
ఈ మాసంలో అరుణోదయస్నానం అత్యంత పవిత్రమైనదని ప్రతీతి. సూర్యుడు మకరంలో ఉండే మాఘమాసంలో,  సూర్యుడు ఉన్నరాశిని బట్టి, ప్రత్యూష సమయంలో సూర్యకిరణాలు పడే కోణాలు బట్టి, ఆ సమయంలో సూర్యకిరణాలలో వుండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రత బట్టి ప్రత్యూషకాలంలో  (సూర్యోదయమునకు ముందు) చేసే స్నానాలు ఆరోగ్యకరం. 
మాఘమాసంలో నదీ స్నానం సర్వశ్రేష్ఠమైనది. ఇది అందరికీ సాధ్యంకాదు కాబట్టి, ఎక్కడ స్నానం చేసినను ముందుగా -
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు||
అని పుణ్యనదులను స్మరించుకొని, ఈ క్రింద శ్లోకాలను చదువుకుంటూ స్నానం చేయాలి.
దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చ |
ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం ||
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ |
స్నానేనానేనమే దేవ యధోక్త ఫలదోభవ ||
మాసమంతా స్నానం ఈరీతిలో చేయలేనివారు కొన్ని ముఖ్య తిధులలోనైనా చేస్తే మంచి ఫలితమును పొందుతారని పెద్దలు చెప్తుంటారు.
మాసపర్యంతం స్నానా సంభవే త్ర్యహమేకాహం వా స్నాయాత్
మహామాఘం పురస్కృత్య సస్నౌ తత్ర దినత్రయమ్
మాఘమాసమంతా స్నానం చేయలేని యెడల మూడు దినాలైన పైరీతిలో స్నానం నియమంగా చేయాలని, తద్వారా వేల యాగాల ఫలం లభిస్తుందని పద్మపురాణం పేర్కొంటోంది.
                                            
                                                ఈ వీడియో వాట్సాప్ ద్వారా సేకరించింది. 
                                                రూపకర్తకు నమస్సులు. 

మాఘశుద్ధ సప్తమి - రధసప్తమి. 
సూర్యుని ఆవిర్భావం. 
సూర్యజయంతి.
సూర్యుణ్ణి ఆరాధించే పర్వదినం.
సప్తాశ్వరధం మీద సంచరించే సూర్యభగవానుడు తన సంచారగతిని మార్చుకునే రోజిది.
ఈనాటి బ్రహ్మీముహూర్తంలో ఆకాశంలోని ప్రముఖ నక్షత్రాలన్నీ రధాకారంలో అమరివుండి సూర్యరథాన్ని తలపింపజేస్తాయని ప్రతీతి.
చలి క్రమంగా తగ్గుతూ సూర్య కిరణాల సంజీవనితో జీవులు నూతనోత్సాహంతో, ఆరోగ్యంతో పుంజుకోవడం ఈరోజు నుండే ప్ర్రారంభమవుతుంది.
ఈరోజు నుండి పూర్తిగా ఉత్తరదిశగా సూర్యుని గమనం సాగుతుంది. ఉత్తరమార్గ గమనంను ఊర్ధ్వ ముఖ గమనంగా చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు. మూలాధారమునుండి సహస్రారం వైపు గమనం మోక్షగమనం. ఈ గమనం జీవుల్ని ఊర్ధ్వముఖులై తరించమన్నదానికి సూచనగా సాధకులు గ్రహించాలి.
ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. సూర్యగ్రహణ తుల్యాతుశుక్లామాఘస్య సప్తమి. ఈ కారణంచే గురువునుండి మంత్రదీక్షలు తీసుకున్నా, కొత్త పుణ్య కార్యక్రమాలు చేపట్టినా, ఉపదేశింపబడ్డ మంత్రాలను అధికసంఖ్యలో అనుష్టించినా, ఆదిత్యహృదయంను పారాయణం చేసినా విశేషఫలముంటుందన్నది శాస్త్ర వచనం.

మాఘశుద్ధ సప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానిస్తూ, జిల్లేడు, రేగు ఆకులను తలపై భుజాలపై పెట్టుకొని స్నానమాచరించాలి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు పఠించాలి -
నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః |
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ||
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు |
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ||
ఏతజ్జన్మ కృతం పాపం యజ్ఞన్మాంత రార్జితమ్ |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ||
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |
సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరీ సప్తమీ ||
జన్మ మొదలుగా చేసినదియూ, జన్మాన్తరాలలో చేయునదియూ అగు శోక రోగ రూపంలోనూ వుండు పాపమంతయూ మకరంలోని సప్తమీ హరించుగాక. ఈ జన్మయందు, జన్మాన్తరమందు మనో వాక్కు ఇంద్రియాలచే తెలిసీ తెలియక చేసిన ఏడు విధాలుగా రోగం రూపంలో వుండే సప్తవిధ పాపమంతయూ ఈ స్నానంచేత నశించాలన్నది ఈ మంత్రార్ధమని ధర్మసింధు తెలుపుతుంది. 
స్నానానంతరం -
సప్తసప్తివహ ప్రీత సప్తలోకప్రదీపన |
సప్తమీసహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||
అంటూ సూర్యునకు ఆర్ఘ్యమివ్వాలి. తదుపరి సూర్యునికి పూజించాలి.
ఎర్రచందనం, ఎర్రని పుష్పాలతో సూర్యభగవానుని అర్చించడం విశిష్టమైనది.
ఈరోజు సూర్యభగవానుణ్ణి ఆరాధించి ఆవుపేడ పిడకల మంటతో వండిన క్షీరాన్నాన్ని చిక్కుడాకులతో నివేదించాలి. చిక్కుడుకాయలతో చేసే రధాన స్వామిని ఆవహింపజేసి పూజించాలి.
మన ఆచారాలలో ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలున్నాయి. సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకునే వృక్షాలలో జిల్లేడు, రేగు ప్రధానమైనవి. ఈ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడంవలన వీటిలోని శక్తి, నీటిలోని విద్యుచ్చ్చక్తి శరీరంపై ప్రభావాన్ని చూపి, ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఈ ఆకుల్లో నిల్వచేయబడిన ప్రాణశక్తి, శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి, నాడుల్ని ఉత్తేజపరుస్తూ మానసిక దృఢత్వం, జ్ఞాపకశక్తిని పెంచి,   శిరస్సంబంధమైన రోగాలను నశింపజేస్తుంది. అందరికీ ఆరోగ్యప్రదాత. అందుకే  'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అని శాస్త్రాలు శ్లాఘిస్తున్నాయి. 
ప్రతిరోజూ ఇలా స్నానం చేయడం ఎంతో శుభకరం. కానీ, నేటి మనం అంతలా నియమంగా చేయలేము కాబట్టి,  సంవత్సరానికి ఒక్కరోజైనా ఇలా ఆచరించి మహాప్రయోజనం పొందవచ్చని మహర్షులు ఈ సూర్య జయంతి రోజైనా ఇలా చేయమని నిర్ధేశించారు. 
[ఇన్ని శ్లోకాలు చదవలేని మాబోటివారి గతేమిటి బాబయ్య అని అడిగిన ఓ రైతుకు, ఓ సూర్యనారాయణ తెలిసీ, తెలియక చేసిన నా పాపములను నశింపజేసి, సద్బుద్ధిని ప్రసాదించు అని అనుకుంటూ, మనసార సూర్యుణ్ణి నమస్కరిస్తూ, సప్త సప్త మహాసప్త, సప్తమీ రధసప్తమి అని ఏడుసార్లు జపిస్తూ స్నానం ముగించాలని, అదీ కష్టమనుకుంటే ఓ సూర్యనారాయణమూర్తీ నీకివే నా హృదయపూర్వక నమస్సులు అని భక్తిపూర్వకంగా పెడితే చాలు, ఆయన నమస్కారప్రియుడు. 'నమస్కార ప్రియో భాను:' భక్తిగా నమస్కరిస్తే చాలు అనుగ్రహిస్తాడు ఆదిత్యుడు, అని  మా తాతయ్యగారు చెప్పినమాటలు లీలగా జ్ఞాపకం]
సూర్యుడు ఓ ఖగోళ గోళం, 
సూర్యుడు ఓ గ్రహం,
సూర్యుడు ఓ మండే గోళం ... 
అటువంటి సూర్యుడు హిందువులకు భగవంతుడు ... నాస్తికుల పరిహాసమిది.
అవును ... 
సూర్యుడు ప్రత్యక్షదైవం. 
సూర్యుడు ఖగోళ గోళం కాదు,
సూర్యుడు  గ్రహం కాదు,
సూర్యుడు మండే గోళం కాదు,
హిందువులకు మాత్రమే కాదు, సకల ప్రాణకోటికి సూర్యుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు.
సూర్యుని కిరణాల వేడికి సముద్రపునీరు ఆవిరై, మబ్బుగా మారి, వానై, ఏరై, నదులై, నేలను సస్యశ్యామలం చేస్తూ, ప్రాణుల దప్పికను తీరుస్తూ, పంటలను పండిస్తూ, అందరికీ అన్నదాతై, ఆరోగ్య ప్రదాతై, జీవదాతై ప్రకాశిస్తున్నాడు సూర్యుడు. భూమి గుండ్రంగా తిరుగుతుండడం వలన రాత్రీపగలు ఏర్పడుతున్నాయి తప్ప, సూర్యుడు ఎప్పుడూ కాంతిమయుడే. చంద్రునిలో తేజస్సు, అగ్నిలో తేజస్సు, జలంలో విద్యుత్తుకాంతి, మన కంటిలో వెలుగూ, మనం స్వీకరించే ఆహారంను జీర్ణం చేసే జఠరాగ్నిలో ఉష్ణశక్తి... అన్నీ సూర్యతేజస్సువే. అంటే సూర్యుడు లేనిదే జగమే లేదు, ప్రాణికోటి లేదు.
సూర్యగతిని అనుసరించే ఋతువులు, అయనాలు ఏర్పడ్డాయి. సూర్యుని ఆధారంగానే కాలగణనను చేస్తారు, పంచాంగం రూపొందిస్తారు.
పగలు చైతన్యవంతంగా, రాత్రుళ్ళు నిద్రిస్తూ ఉంటామంటే అందుకు కారణం సూర్యకాంతి. తన దివ్యకిరణాలతో తేజస్సునూ, చైతన్యశక్తినీ అందిస్తున్నాడు కాబట్టి 
సూర్యకాంతి ఉన్నప్పుడు చైతన్యంగా ఉంటాం. ప్రాణికి ప్రధాన జీవనహేతువు చైతన్యమే అయినప్పుడు, ఆ చైతన్యమును మనకి అందించే సూర్యుడు దేముడు కాడా? 
తన కిరణాలనే చూపులతోనే సమస్త సృష్టిని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా చేసే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. 
సూర్యారాధనమనేది జాతి కుల మతాలకు అతీతంగా అందరూ అలవర్చుకోవడం ఆవశ్యకర్తవ్యం. 
నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే
ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, లయలకు సూర్యుడే కేంద్రమని వేదం కూడా స్తుతించింది. సూర్యుడు త్రిమూర్త్యాత్మకపరమాత్ముడు. 'సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ' జగత్తుకు సూర్యుడే ఆత్మయని యజుర్వేదమంటుంది. 'ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు' శరీరమే రథమని అంటుంది కఠోపనిషత్తు. ఇలా అనేక ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంతరార్ధాలతో పభవిస్తున్నాడు ప్రభాకరుడు. 

సూర్యుని పుత్రుడు యమధర్మరాజు. అందువలన సూర్యారాధన వలన అపమృత్యు భయముండదు. మరో కుమారుడు శనైశ్చరుడు. అందుచే శనిగ్రహపీడ ఉండదు. అసాధారణ కార్యసాధనకు, శత్రువిజయానికి, అన్న సంపాదనకు, ఆత్మరక్షణకు సూర్యుణ్ణి ఆరాధించాలని గ్రహించి, సూర్యోపాసనతో అనేక సత్ఫలితాలు పొందినవారున్నారు. అగస్త్యుడు బోధించిన ఆదిత్య హృదయ ప్రభావంతో శ్రీరాముడు రావణున్ని సంహరించగలిగాడు. అరణ్యవాసంలో ధర్మరాజు సూర్యానుగ్రహంతో అక్షయపాత్రను  పొంది, ఆహారకొరత లేకుండా, అతిధిసత్కారాలతో ధన్యుడైనాడు. విరాటనగరంలో ద్రౌపది సూర్యుణ్ణి ఆరాధించి కీచుకుని మందిరంలో ఆ దుర్మార్గుని బారినుండి రక్షింపబడినది. సూర్యుణ్ణి ఉపాసించి సత్రాజిత్తు శమంతకమణిని సంపాదించాడు. మయూరుడు సూర్యానుగ్రహంతో కుష్టురోగం నుండి విముక్తుడయ్యాడు. 


3/2/2017 న రథసప్తమి. 
ఆదిత్యున్ని ఆరాధించడం వలన ఆరోగ్యం, ఆయుష్షు, తేజస్సు, ఐశ్వర్యం సమృద్ధిగా ప్రాప్తిస్తాయి.