http://www.sodhini.com
అంతర్వాణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంతర్వాణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఫిబ్రవరి 2023, శనివారం

బ్రోచేవారెవరురా .....

డిసెంబర్ ఇరవై ఒకటిన ఓ సత్సంగ మిత్రురాలు నుండి మెసేజ్... క్షేమమేనా మీరు? కుటుంబ వ్యవహారాల్లో బిజీనా...ఈ మధ్య వాట్సప్ సత్సంగ గ్రూప్ లో గానీ, బ్లాగ్లో గానీ అస్సలు కనిపించడం లేదెందుకని... నిజమే...కొన్ని నెలలుగా బాధ్యతల నిర్వహణల వలన కొంత ఒత్తిడి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఒకింత నిస్సత్తువ....వెరసి గ్రూప్ లకు, బ్లాగ్ కు కాస్త దూరం. పై మిత్రురాలు మెసేజ్ తో బ్లాగ్ చూడాలనిపించి, నా బ్లాగ్ ఓపెన్ చేసి, కొన్ని టపాలు చదివాను. అలా చదువుతుంటే కొన్ని కొన్ని క్రొత్తగా, అప్పుడే తెలుసుకుంటున్నట్లు... ఈ టపాలు పెట్టింది నేనేనా అన్న సందేహం కలిగింది...నాకు వచ్చిన మరుపు వలన! కరోనా తగ్గిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగానో, వయస్సు (56) రీత్యనో చెప్పలేను గానీ, నిస్సత్తువ తదితరాలతో పాటుగా చిరు మరపు కూడా జతైంది. అప్పుడప్పుడు నా కుటుంబ సభ్యులు మర్చిపోతున్నావని, కొన్ని కొన్ని సందర్భాలలో అంటున్నా, పట్టించుకోలేదు కానీ, ఆధ్యాత్మిక విషయాలను, విశ్లేషణలను మర్చిపోతుండడం చాలా బాధని కల్గించింది.
ఇలా అయితే క్రమేణా రామ స్మరణ కూడా మర్చిపోతానేమో... ఈ భావన మరింత బాధగా మారింది. అన్నీ మర్చిపోయే స్థితి వస్తే, నన్ను అమ్మా అని కాకుండా రామా అని పిలవమని, నాతో ఏది మాట్లాడినా రామ నామాన్ని జోడించి చెప్పండని నా కుటుంబసభ్యులకు కోరుదామని అనుకున్న, వారు బాధ పడతారేమోనన్న వెరపు. ఏడుస్తూ రామున్నే శరణు కోరాను చాలా రోజులు.
నీ అనుగ్రహంతో, అలవడిన నీ నామ స్మరణతో నా జీవనగమనం సాఫీగా సాగిపోతుంది. ఇలానే శేష జీవితం నీ స్మరణంతోనే ముగించవయ్యా...రామయ్య.
ఒకరోజు నా ఈ బాధను నా మిత్రులకు చెప్పగా, ప్రియంవద అనే మిత్రురాలు అన్నదిలా - ఇదేం పెద్ద సమస్య కాదు, అలాగని చిన్నది కాదు, నిన్ను నీవు ఒత్తిడికి గురి చేసుకోక, కొంచెం ప్రయత్నించు...
నేను ఎక్కడో చదివిన ఓ కథను చెప్తాను...ఆ రీతిలో ప్రయత్నించమని ఈ క్రింద కథను ప్రియా చెప్పింది. ఒక ఊర్లో ఓసారి ఎప్పుడూ వచ్చిన కాపరి కాకుండా, కాపరి కొడుకు గోపి రెండురోజులుగా తమని మేతకు తీసుకువెళ్లడం గమనించిన ఓ ఆవు, "ఏంటి రా గోపి, బడికి వెళ్లకుండా గేదలు కాయటానికి వచ్చావ్" అని అడిగింది గేదలు ఆవుల మందలో వెనకనున్న ఆవు. "నాకు ఇక చదువు రాదని మానాన్న మరియు మా సర్ మొన్న ఈ నిర్ణయనికి వచ్చారు" బాధగా చెప్పాడు గోపి. "చదువేముందిరా, నేను గడ్డి తిన్నంత సులువు" అంది ఆవు. "అలానా, ఎలా?" ఆశగా అడిగాడు గోపి. అప్పటికే పొలం వచ్చింది. "ముందు నన్ను కాస్త తిననివ్వు, తరువాత చదువు మర్మం చెపుతా" అని మేతలో మునిగి పోయింది ఆవు. కాసేపు ఓపిక పట్టిన గోపి, "ఏం చేస్తున్నావ్? నాకు ఏదో చెపుతానని, నీవు తింటూ ఉన్నావ్" అని అడిగాడు. "నేను ఏకాగ్రతగా అంతర గ్రహణం చేస్తున్నా.... కదిలించకు" అంది ఆవు. "అదేమిటి? అంతర గ్రహణమా? కొత్తగా ఉందే ఈ మాట" అని గోపి అనగా, "ఆహారాన్ని లోపలకు తీసుకోవడాన్ని అంతర గ్రహణం అంటారు. అంటే క్లాస్ లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినటం లాంటిది. ఇక్కడ శ్రద్ధ అవసరం. అర్ధమైన, కాకున్నా ముందు ఆలకించాలి. ఇది చదువు యొక్క మొదటి లక్షణం. అర్థమయిందా" అని చెప్తూ, "ముందు నన్ను సరిపడినంత తిననివ్వు. మిగిలినది తరువాత చెపుతా" అంటూ తినటం కొనసాగించింది. గోపి ఆవుని బాగా గమనిస్తూ ఆలోచనాపరుడై, తినటంలో ఉన్న శ్రద్ధ వినటంలో ఉండాలన్నమాట అని గ్రహించాడు. కాసేపు గడిచాక ఆవు, గోపి ఇద్దరూ చెట్టు కిందకు చేరారు. "అదేంటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నములుతున్నావ్" వింతగా అడిగాడు గోపి. దానికి ఆవు నవ్వుతూ ..... "దీనిని నెమరు వేయటం అంటారు. అంటే జీర్ణక్రియ. ఇందాక తిన్న ఆహారాన్ని, తీరుబడిగా నోటిలోకి తెచ్చుకొని నమలటం. ఇది చాలా ముఖ్యం. "ఎందుకలా" అడిగాడు గోపి. "సర్ చెపుతున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి. కానీ, కాసేపటికి మర్చిపోతాం. అందుకే ఇంటికి వచ్చాక తీరుబడిగా నెమరు వేసుకోవాలి. ఎవరికైతే నెమరు వేసే అలవాటు ఉంటుందో, వారికి చదువు బాగా జీర్ణమౌతుంది... నిజానికి చదువు లోని మర్మం ఇదే" అని రహస్యంగా చెప్పింది ఆవు. గోపీకి తన పొరపాటు ఇప్పుడు అర్ధమైంది. తాను ఏనాడు ఇంటికొచ్చి పుస్తకం పట్టింది లేదు. సాయంత్రమయ్యింది. గేదలు అవులు ఇంటికి మరలాయి. గోపి చూపు అంతా ఆవు మీదనే ఉంది. అది ఉదయం కన్నా హుషారుగా ఆనందగా ఉంది. "ఏంటి విషయమ"ని గోపి అడిగగా, ఆ ఆవు ఇలా అంది... "దీనిని శోషణం మరియు స్వాంగీకరణ అంటారు. జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి, మనకు శక్తిని హుషారును ఇస్తుంది. జీర్ణం సరిగ్గా జరిగితేనే, ఈ ఆనందం అనుభవించగలం. దీనిని నీ చదువుకు అన్వయించుకో... శోషణం మరియు స్వాంగీకరణ అంటే చదువు నీకు అర్థమై ఒంటపట్టటం. అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది. నీకు ఒక పేరును గుర్తింపును తెస్తుంది. నీ ముఖంలో ఓ వెలుగు, నీ పేరుకు ఓ మెరుపు వస్తాయి" అంది ఆవు. గోపి గుండె పట్టుదలతో కొట్టుకోగా, రక్తం వేగంగా, పంతంగా పరిగెత్తింది. "ఇంతేనా... ఇంకేమైనా ఉందా? ఆలోచనగా అడిగాడు గోపి. ఇంకో విషయం ఉంది. పేడతట్ట తీసుకొని రా, చెపుతా అంది అవు. గోపీకి విషయం అర్థమై తట్ట తెచ్చి, పేడ పట్టి, పక్కన పెట్టి, చెప్పు అన్నాడు. "చివరి విషయం మల విసర్జన. చదువులో కూడా ఇంతే. పనికి మాలిన పనులు వదిలేయడం. కబుర్లు.... సెల్ ఫోన్, టీవి, ముచ్చట్లు తదితర వాటిని విసర్జించాలి. అప్పుడు నీకు జీర్ణం చేసుకోవటానికి మరింత సమయం దొరుకుతుంద"ని నవ్వుతూ చెప్పి ముగించింది ఆవు. ఆవుకు మేత పెట్టి, గోపి ఇంటికెళ్లాడు. నెల గడిచింది. గోపికి ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ .... సర్ ఆశ్చర్యముగా మెచ్చుకోలుగా చూస్తూ, ఎంతగానో అభినందించారు. ఈసారి గోపి ఇంటి కెళ్లకుండా నేరుగా ఆవుల కొష్టం వద్దకు బయలు దేరాడు. "ఆ రోజు" సాయంత్రం ఆవు నడిచిన నడకలోని శక్తి, ఆనందం "ఈ రోజు" గోపి అడుగులలో కనిపిస్తుంది. ఈ కథను అర్థం చేసుకొని కొన్నేళ్లుగా వదిలేసిన పుస్తక పఠనం తిరిగి ప్రారంభించు, మననం చేసుకుంటూ ఉండు. అలానే మునుపటిలా సత్సంగములో చర్చించడం, చక్కటి ప్రవచనాలు వినడం మొదలెట్టు... అన్నీ గుర్తుకొస్తాయని అంది. ఇక మిత్రులందరూ చక్కటి టాపిక్స్ ప్రస్తావిస్తూ చర్చించడం ప్రారంభించారు. మరో మిత్రురాలు శారద ఈమధ్య కుటుంబ నిర్వహణలో సాధన లేక ఆధ్యాత్మిక అంశాల్లో కొంత మరుపు వచ్చిందనుకుంటాను. ఏది ఏమైనా రామనామం మర్చిపోలేదు. అదొక్కటి బలంగా పట్టుకో...
నామమే కలియుగంలో రక్ష. అదొక్కటి బలంగా నీ మనస్సులో నాటుకుంటే, నిరంతరం స్మరిస్తుంటే చాలు.....అని చెప్తూ, తనూ ఒక కథను ఫార్వర్డ్ చేసింది. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. పువ్వులు, పండ్లు, ధూప దీప నైవేద్యాలతో పాటు, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మినవాడు. కానీ, అలా ఏమీ జరగకపోవడంతో అసంతృప్తి మనసులో ఉండేది.
ఒకసారి ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. అతను మహా జ్ఞాని అని విని, ఏదైనా మంత్ర దీక్ష తీసుకుని చేస్తే బాగుంటుందని తలచి, ఆ జ్ఞాని దగ్గరకు ఎంతో ఆశగా వెళ్ళి, దర్శనం చేసుకుని , తన మదిలో మాటలను విన్నవించాడు. సాధువు అంతా శాంతంగా విని, "నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను. కానీ, నీ తపన చూస్తుంటే ఇవ్వాలనిపిస్తుంద"నగానే, భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు. "అయితే, ఈ జప విధానం కొంచెం కష్టం. నీవు చేయగలవో, లేదో" అని సాధువు అనగా, "ఎంత కష్టమైనా, నేను చేయగలను... మంత్రం ఫలిస్తే చాలు" అన్నాడు భక్తుడు ఆనందంగా. ఐతే విను... నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు కానీ, రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి... అలా తొమ్మిది రోజులు చేయు...ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే......."దేవుడున్నాడు". భక్తుడు అయోమయంగా చూసాడు. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఇన్ని లక్షల... కోట్ల జపం చేయాలని విన్నాడు కానీ, ఇదేమిటి? పైగా ఇది పంచాక్షరి మంత్రమట... ఏమిటది... దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది... మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి? అదీ ఇంకొకరితో... తనను పిచ్చివాడి క్రింద జమ కడ్తారేమో....ఎన్నెన్నో సందేహాలు భక్తునికి. సాధువు ఒకటే మాట చెప్పాడు "నన్నేమీ ప్రశ్నించ వద్దు. మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి, ఆపై నాకు కనిపించు". భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా, ఎవరితోనైనా "దేవుడున్నాడు" అని ఎలా అనటం? ఏమిటీ గందరగోళం... ఇంతలో అతని భార్య వచ్చి, పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను అప్రయత్నంగా అన్నాడు... "దేవుడున్నాడు". అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా, లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనికి ఏదో అర్థమయి కానట్లు... వింత భావన కలిగింది. ఆపై, ఇంక ఏ మంచి కనిపించినా "దేవుడున్నాడు" మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతోనూ, ఏదైనా చెడు కనిపిస్తే "దేవుడున్నాడు" అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతోనూ , అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే... "దేవుడున్నాడు" శిక్షిస్తాడనే అర్థంతోనూ, పూజలు అనే విషయం వస్తే "దేవుడున్నాడు" అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. తొమ్మిది రోజులు గడిచాయి. అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అన్నాడు "నువ్వు ఎప్పుడు, ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు" భక్తుడు మొదట తెల్లబోయినా, వెంటనే తేరుకుని అన్నాడు... "నాకు తెలిసింది ఏమిటంటే, దైవం సర్వాంతర్యామి. అంతటా వున్నాడు. సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది, మనం దాచగలిగేది ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు. ఎప్పుడు ఏది ఎవరికి ఇవ్వాలో తెలిసినవాడు, దయాసాగరుడు, ఆనందస్వరూపుడు…" అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు... "ఇప్పుడు చెప్పు... నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు?" భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని అన్నాడు "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులోనుండి "దేవుడున్నాడు" అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు"...అని చెప్తుండగా, ఆపి, ఆహా! మంత్రం ఫలించింది...ఆనందంగా ఉండు...చెప్పాడు సాధువు. ఈ కథను ఒకటికి రెండుసార్లు చదవండి. మనసారా విశ్వసించటమే మనం చేయాలి. రాముడున్నాడని విశ్వసించండి...
"రాముడున్నాడు" అనేపంచాక్షరీ మంత్రాన్ని నిర్మలమైన మనస్సుతో నిత్యం జపించండి...అంతా సర్ధుకుంటుంది భారతిగారు... అని! 


అలాగే మరో సత్సంగ మిత్రురాలు అనవసరంగా భయపడకండి. ఒకోసారి మరుపు సహజం. నామాన్ని మర్చిపోలేదు కదా. రామ నామం చేస్తున్నారంటే అది రామానుగ్రహం. అది ఎన్నటికీ మర్చిపోలేరు...అని ఎన్నో రీతుల్లో ధైర్యం చెప్తూ, తనూ ఓ చక్కటి కథను చెప్పింది. కొన్ని శతాబ్దాల క్రితం, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు భక్తులు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజూ వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టు పట్టేవాడు. ఇలా రోజూ ఆలయ అధికారులకి అతనికి క్రొంత వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే, ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుందని ఆలయ అధికారులు మందలించేవారు. నా ఆరుగురు కొడుకులు బ్రక్క చిక్కి పోయారు, కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు. ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి, ఏమి జరిగిందని వాకబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా! నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. స్వామి, నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి, రోజంతా వారికీ సేవలు చేయడంతోనే నా సమయం సరిపోతుంది, వారిని వదిలేసి, నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను. పైగా, నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను, నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను? మీరే దయతల్చండి అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. సరే, నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడుగగా, ఎంతో ఇబ్బందిగా "విశ్వం విషు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు:, భూత కృత్ భూత భృత్.. నాకంత వరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే నీకు భూత భృత్ అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారార్థి యై రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు. ఆ నాటి నుండి ఆ వైష్ణవుడు మరల కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాల భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరిదీ. చివరకి రామానుజులకి తెలియ చేసారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకు రమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా, ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు. కొంత కాలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటుతుండగా, ఈ వైష్ణవుడు స్వామీ, స్వామి అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయన కనుల నుండి ధారగా కన్నీరు కారుస్తూ, మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు ఆ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను "భూతభృతే నమ:" జపాన్ని చేస్తున్నాను...అని చెప్పాడు ఈ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎవరా పిల్లవాడు? వాని పేరేమి అని అడుగగా, ఆ పిల్లవాడు తాను రామానుజా దాసుడనని చెప్పాడని చెప్పాడు వైష్ణవుడు. ఆ బాలుడు ఇంకెవ్వరు సాక్షాత్ శ్రీరంగనాదుడే...అని గ్రహించి, ఉప్పొంగి పోయారంతా. భూత భృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని అర్ధం.
అందుకే భారతి, నామానికి ఉన్న శక్తి ఎంతటిదో అర్థం చేసుకుని, ఆ నామ పారాయణం అఖండంగా చేయు...నీకు ఏది అవసరమో, అది ఆ పరమాత్ముడే ఇస్తాడు. 

ఇలా ఇంకా చాలామంది సహృదయంతో చక్కని మాటలతో, సలహాలతో ఎంతో ఊరటని ఇచ్చారు. 


ఇక, పై స్ఫూర్తిదాయక కథా రచయితలు ఎవరో గానీ... వారికి, అనునిత్యం రాములోరికి వారి కీర్తనల ద్వారా అక్షరార్చన చేస్తున్న శ్యామలీయం గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. అందరి సలహాలను వందశాతం అమలు చేశాను. రామానుగ్రహంతో ఇప్పుడు నా పరిస్థితి మెరుగ్గా ఉంది. కొద్దిరోజులు క్రితం మా అక్కగారమ్మాయి విద్య సాయి, 'భారతాంటీ! ఈ మధ్య ఏమీ వ్రాయడం లేదు, వ్రాయండి' అనడం...ఇదే మాటను మరి కొొందరు అడగడంతో... గత కొంత కాలముగా, నాలో జరిగిన సంఘర్షణలో కొంత ఈ టపా ద్వారా తెలుపుతున్నాను. 
 అలాగే ఝాన్సి అనే మిత్రురాలు ఓ చమత్కారపు సలహా ఇచ్చారు. దాని గురించి మరో టపాలో ...

1, మే 2020, శుక్రవారం

"చెప్పాలని ఉంది, మనసిప్పాలని వుంది"...

లాక్డౌన్ ప్రకటించిన మొదట రెండుమూడురోజులు... మావారు టి.వి చూస్తూ, కబుర్లు చెప్తూ, కాస్త నా పనుల్లో సహాయపడుతూ హుషారుగా గడిపేశారు. ఆ తర్వాత రెండురోజులు... అబ్బా ఏ చానల్ చూసిన కరోన, కరోన... భయం వేస్తుంది, టి.వి చూడడానికి విముఖత, టైం గడవడంలేదు, బోర్, విసుగు, నిట్టూర్పులు. 
                              
ఒకరోజు బంధువులతో, స్నేహితులతో ఫోన్ లో కబుర్లు. ఆరోజు ఉత్సహాంగా గడిచింది. మరుసటిరోజు ముందురోజు మాట్లాడిన వారి ద్వారా, మరికొందరు బంధువుల, మిత్రుల ఫోన్ నంబర్స్ తెలుసుకొని, వరుసగా ప్రతీరోజూ కొందరితో మాట్లాడడం...ఆనాటి బంధాలు, అలనాటి జ్ఞాపకాల ముచ్చట్లు... ఓహో... ఎన్నెన్ని కబుర్లో.....వీరు చెప్పుకునే కబుర్లకు కొదవేలేదు.పెరట్లో ఆడుకునే ఆటలు మొదలు ప్రపంచాన్ని అల్లాడిస్తిస్తున్న కరోన వరకు, మారిన పల్లెలు లగాయతు దేశాల్ని దాటిన పిల్లల వరకు, కర్రబిళ్ళ మొదలు క్రికెట్ వరకు...ఒకటని ఏముందీ...పాత సైకిల్ టైరుని ఒక కర్రతో తోసుకుంటూ ఊరంతా తిరిగేయడం, గోళీలాటలు, గడ్డివాముల్లో దొర్లడాలు, పొలాలగట్ల వెంబడి పరుగులు, తాటిముంజులు, జీళ్ళు పంచుకొని తినడాలు, పిట్టగోడలు పై కూర్చొని దొంగతనంచేసిన జామకాయలు కాకి ఎంగిలి చేసుకొని తినడాలు, పిల్లకాలవలో ఈత కొట్టడాలు, కొబ్బరివాచ్ పెట్టుకొని కొట్టే పోజులు, ఆరుబయట నులకమంచంపై పడుకొని, చేతుల్ని తలక్రింద దిండుగా చేసుకొని  చుక్కల్ని లెక్కిస్తూ, మేఘాలతో ఆడుకుంటున్న చందమామని చూస్తూ పాడుకునే పిల్లరాగాలు మొదలు .....ఎన్నెన్నో కబుర్లు... అహంలేని అప్పటి అమాయకత్వంలో ఆనందం, అహంతో పాటు పెరిగిన  ఆస్తులు, అనారోగ్యాలు గురించి వీరు మాట్లాడుకుంటూ, ఆ ఆత్మీయత పలకరింపుల పులకరింతల నడుమ లాక్డౌన్ మాటే మరిచారు. మావారి తీరు బహు బాగు బాగు అనిపించి, ఈ విషయాన్ని నా సన్నిహితులతో చెప్పాను. 
                         
మన జీవితాల్లో ఎన్నో బంధాలు, ఎందరో బంధువులు, ఎన్నెన్నో పరిచయాలు, మరెన్నో స్నేహాలు....కానీ; నేడు బంధాలన్నీ ఒకప్పటిలా లేవు.  కొన్ని సజీవంగా, కొన్ని మరుగున పడి, మరికొన్ని ఉండీ ఉన్నట్లు...వున్నాయని అర్ధమైంది. ఎందుకిలా బంధాలు బలహీనమౌతున్నాయని మమ్మల్ని మేం ప్రశ్నించుకుంటూ, తరచి చూసుకున్నాం. 
                          
నావరకు నాలో నాకు నచ్చని అంశాలు రెండున్నాయి. మొదటిది - నా వ్యక్తిగత బాధ్యతల నిర్వహణలో మునిగి, నా కుటుంబంకే పరిమితమై, మిగతా బాంధవ్యాలను సరిగ్గా పట్టించుకోక పోవడం. వ్యక్తిగత బాధ్యతలకు పూర్తిగా ప్రాధన్యత ఇచ్చి, ఎదుటివారికి అవసరమైన సందర్భాలలో స్పందించకపోవడం... ఇదీ ఓ విధమైన నిర్లక్షమే. మనుషుల్ని దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషాలు కంటే ప్రధానమైంది నిర్లక్షమే. నిజానికి ఈ మధ్యనే ఇలాంటి నిర్లక్ష్యానికి నేనూ గురైయ్యాను. ఆ బాధ వర్ణానాతీతం. ఇప్పుడర్ధమైంది, నేను కొందర్ని ఎంతగా నొప్పించానన్నది.  మనవళ్ళ సంరక్షణ, కుటుంబ బాధ్యతలతో తీరిక లేకుండా వున్నను, అప్పుడప్పుడైన కొంత సమయం ఆత్మీయ బంధాలకు కేటాయించాల్సింది...ఇప్పుడు కాస్త తీరికై వెనక్కి చూసుకుంటే, బంధాల నిర్వహణలో ఒకింత విఫలమైనయ్యానని అర్ధమైంది. ఆత్మీయంగా ఓ పలకరింపు, చిరునవ్వుతో ఓమాట... వీటితో పోయేదేముంది, అవతల మనిషిలోని కలత తప్ప. తప్పు చేసాను... సరిదిద్దుకున్నానిప్పుడు. 
ఇక రెండవది చివర్లో ప్రస్తావిస్తాను.  
                           
నా సన్నిహితులతో ఈ విషయమై మాట్లాడాక, 'బంధాలు - అనుబంధాలు' సాధారణంగా ఏ కారణాలచే బలహీనమౌతాయో అర్ధమైంది. మేమందరం వీలైనంతవరకు మా మా బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకొని, అందరికీ ఫోన్ చేసి, సడలిన, వడలిన బంధాలను పునరుద్దరించుకోవడానికి శ్రీకారం చుడుతూ, "చెప్పాలని ఉంది, మనసిప్పాలని
వుంది" అనుకుంటూ, కొందరి దగ్గర ఆత్మీయంగా ఒదిగి, కొందరికి పెద్దరికంగా హితం చెప్పి, కొందరికి  ఏం కోల్పోయామో మృదువుగా తెలుపుతూ, కొందరికి క్షమపణలు, కొందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ... ప్రేమతో మనసార మాట్లాడి, అందర్నీ అభిమానంగా పలకరించడంతో, అన్నీ మరచి, ఆత్మీయంగా అందరం ఆనందంతో అనుబంధాలను దృఢపర్చుకున్నాం.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఆత్మీయ అనుబంధాలతో విరాజిల్లేవి.  ఉమ్మడి కుటుంబాలల్లో ఆప్యాయతలు, ఆ ఆప్యాయత వెనుక ఆశీర్వాదాలు, ఆ ఆశిస్సులు వెనుక అండదండలు... అద్భుతం. అర్ధవంతమైన ఆరోగ్యకరమైన వాతవరణంలో స్థిరంగా సాగే తొందరలేని జీవనాలు ఆనాటివి. కానీ; కాలమాన పరిస్థితులబట్టి కుటుంబవ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. 
చాలావరకు చాలామంది వ్యక్తిగత అభిరుచులకు, ఆకాంక్షలకు భిన్నంగా వున్నాయి, నేటి బ్రతుకులు. తప్పదు, ఈమార్పులకు సహకరించక తప్పదు. ఈ మార్పును స్వాగతించక తప్పని నేపద్యాలు...అంత మాత్రమున మంచి బంధాల నుండి, మంచి స్నేహాల నుండి దూరం కానవసరం లేదు.

మనం సంఘజీవులం. బంధాలు లేనిదే మనుగడ లేదు. మనకు అనుబంధాలు తప్పనిసరి. పరస్పరం సహకరించుకుంటూ జీవనగమనం సాగించడానికి, జీవితమును అర్ధవంతం చేసుకోవడానికీ, ఆనందమును అనుభవం లోనికి తెచ్చుకోవడానికి అనుబంధాలను ఏర్పరచుకుంటాం. ఇలా ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యాల విషయంలో అందరికీ చిరు చిరు ఒడిదుడుకులు వొస్తుంటాయి. అందరం చిన్న చిన్న తప్పుల్ని చేస్తుంటాం. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ వుండరు కదా. బంధాలు అనుబంధాలు ఆనందంగా ఆహ్లాదంగా కలకాలం సాగాలని, సాగించాలని ఎవరికుండదు? అందరికీ ఉంటుంది. కాకపోతే ఏ బంధంలోనైన అప్పుడప్పుడు చిరు చిరు మాటపట్టింపులు, కలతలు, అపోహాలు సాధరణంగా వుంటుంటాయి. అలానే కుటుంబీకులు కూడా ఒకోసారి మన ఆలోచనలకు విలువనివ్వకపోవడమో, అర్ధం చేసుకోలేకపోవడమో, వారి భావాలను మనమీద రుద్దడమో జరుగుతుంటుంది. అటువంటప్పుడు ఆవేదన కలుగుతుంది. కానీ, అప్పుడు ఒకటి గుర్తుంచుకొండి...ఎదుటివారు మన సంబంధీకులు, మనవారు! వారితో వెంటనే వాదనచేసి దూరం పెంచుకోకండి. తర్వాత మనకు కల్గిన బాధను నెమ్మదిగా అర్ధమయ్యేటట్లు చెప్పవచ్చు. అంతేగానీ, తక్షణమే గొడవపడి అహమును అడ్డుతెరగా నిలపకండి. అపార్ధమనే అడ్డుగోడల్ని కట్టకండి. అర్ధం చేసుకొనే వారధిని కట్టుకొండి. అలానే, ఎవరేం అనుకుంటారో, ఎవరెలా అర్ధం చేసుకుంటారో...ఇత్యాది సంశయాలతో మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం కూడా తప్పే. దానివలన సంబంధాలు బలహీనమవ్వవొచ్చు. అపార్ధాలు తొలగాలంటే వాదించడంవలనో, మౌనంగా ఉండడంవలనో ప్రయోజనం వుండదు. నేర్పుతో, ఓర్పుతో, సహృదయతతో అవతలివ్యక్తి అభిప్రాయాన్ని అర్ధం చేసుకుంటూ, ప్రేమతో మాట్లాడవలసిన చోట మాట్లాడండి...నిదానంగా స్పష్టంగా! 
ఇక, వాదించేవారికి మనం ఎంత తక్కువగా స్పందిస్తే, అంత ప్రశాంతంగా వుండగలుగుతాం. అలానే అప్పుడప్పుడు మన అభిరుచుల్ని మార్చుకోవల్సి వస్తుంది. ఒకానొక చిరాకు స్థితిలో, వాళ్ళకోసం నా ఇష్టాల్ని వదులుకున్నాను, వాళ్ళకై ఇది చేసాను, అది చేసాను, మరి వాళ్ళు ఏం చేసారు నాకై... అని దుఃఖపడతాం. ఎన్నో త్యాగాలు చేసినట్లు భావిస్తాం. ఒకటి గుర్తుంచుకొండి - ఇది వ్యాపారం కాదు; బంధం! శాశ్వతబంధాలలో చిన్న చిన్న త్యాగాలు తప్పనిసరి. ఏ బంధంలోనైన కాస్తంత సంయమనం, సర్ధుబాటుతత్త్వం తప్పనిసరి.

అలానే  సన్నిహితులతో బంధాలు గురించి మాట్లాడుతున్నప్పుడు, మా గమనిక లోనికి వచ్చిన మరికొన్ని విషయాలు ఏమిటంటే - మనముందు ఒకలా మన పరోక్షంలో మరోలా కొందరు  మాట్లాడుతుంటారు. ఒకరి గురించి మంచిగా చెప్పకపోయిన పర్వాలేదు, చెడుగా మాత్రం చెప్పకండి. మీరు చేసే కామెంట్స్ వలన కొందరి బంధాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. నిజాన్ని కప్పిపుచ్చి సగం సగం మాట్లాడకండి. మనిషి మంచివాడు కావాలంటే మంచిపనులు చేయనక్కరలేదు, ఎదుటివారు గురించి చెడుగా  మాట్లాడకుండా వుంటే, అంతేచాలు.

ఒకోసారి ఏదీ నిర్ణయించుకోలేని సందిగ్ధపరిస్థితులు ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, కుటుంబ పెద్దలు లేదా దగ్గరలోనే ఉండే శ్రేయోభిలాషులు తగు సూచనలు, చేయూత ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితి లేదు కాబట్టి, స్నేహితులనో సన్నిహితులనో సలహా అడగడం  సహజం. అలా అడిగినప్పుడు - 'కొంచెం బిజీగా ఉన్నాను కాసేపు ఆగి నా పనులు పూర్తయ్యాక చెప్తాను'...అని చెప్పి, అలా... గంటలు రోజులు, రోజులు వారాలౌతాయి. వారినుండి బదులుండదు. చిన్నమాట చేయూతకు అంత జాప్యమా? నిజంగా వారికి ఏం చెప్పాలో తెలియకపోతే, ఆ మాటే చెప్పేయవచ్చు ముందుగా. కానీ, వారిని నిరీక్షణలో పెట్టేస్తారు. మాట లేదా చేత...చేయూత అడిగినప్పుడు చేయగలిగితే వెంటనే చేయండి. లేదంటే, 'చేయలేనిప్పుడు ఏ సహాయమును' అని ముందే చెప్పేయండి. దాహంగా ఉండి నీరు అడిగినప్పుడు ఉంటే ఇవ్వండి, లేదంటే లేవని వెంటనే చెప్పేయండి. తీరిక అయినప్పుడు ఇద్దామనుకుంటే, ఆ వ్యక్తి అంతవరకు నిలబడి ఉంటారో, సొమ్మసిల్లి పడిపోతారో ఆలోచించండి. (ఇది ఒక సారూప్యత కోసం ఉదహరించాను)

ప్రతీ మనిషిలో మంచి చెడు ఉంటాయి, మంచినే చూద్దాం. ప్రతి ఒక్కరు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు, ఇతరుల ప్రవర్తనని సానుకూలంగా నిర్వచించుకుందాం. స్వంత అభిప్రాయాలు ఏర్పరచుకొని ఆ కోణంలో ఎదుటివార్ని విశ్లేషించక, వారి కోణంలో కాస్తా ఆలోచించండి. నిజానికి ఏ బంధంలోనైన, చాలావరకు విభేదించే విషయాలకంటే ఏకీభవించే విషయాలే ఎక్కువ. ఇది నిదానంగా మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఏదీ పోట్లాడి, పోరాడి సాధించలేం. మంచిగా బ్రతకాలంటే మేధస్సు కాదు, మనస్సు వుండాలి. పొరపాట్లు మన్నించే మనస్సుండాలి.  ప్రేమించే మనస్సుండాలి. సఖ్యసంబంధాలు నెలకొనాలంటే సమైక్యభావన వుండాలి, అధికులమన్న భావన, చిన్నచూపు తగదు. అతిగా స్పందించడం తగదు. చిన్న చిన్న అపార్ధాలతో, అందమైన ఆనందకర అనుబంధాలను అర్ధరహితంగా, అర్ధాంతరంగా ఆపేయకండి. కలుపుకు పోయే తత్త్వం మనలో వుంటే, అందరూ మనతోనే ఉంటారు. పొరపాట్లు అవతలివారిలో ఉందనుకుంటే క్షమించడం, అవసరాలకి కాక ఆత్మీయతలకి విలువనిచ్చినప్పుడు, మనుషులతో కాకుండా మనసులతో మాట్లాడినప్పుడు, ఏ బంధమైన దృఢంగానే నిలుస్తుంది.

మనిషికి ఎన్నోరకాల ఆలోచనలు కలుగుతుంటాయి. అందులో ఏవి మంచివి, ఏవి చెడువి అంటే, అవి ఆయా సందర్భాల మీద అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. మనిషికి ఇలాగే వుండాలి, ఇలాగే ఆలోచించాలి, ఈ పనులే చెయ్యాలి, ఈ అలవాట్లే వుండాలి అని అందరికీ వర్తించేటట్లుగా సిద్ధాంతీకరించడం అసాధ్యం. కానీ, ప్రేమతత్వంలో ఉన్న ఘనతను, మహత్తును తెలుసుకుంటే, సాధ్యమైనంతవరకు మన సంబందీకులతో ప్రేమగా సఖ్యతగా ఉంటూ జీవితాన్ని నందనవనం చేసుకోవచ్చు. కానీ, ప్రేమను పంచుకోం, మనసార మాట్లాడం, ఏదీ ఒకంతట వ్యక్తం చేయం, అన్నీ మనసుపొరల్లో దాచిపెడతాం. కొందరైతే వారి మాట, చేత, ఇష్టాలకు తందాన తాన అంటేనే, వారి ప్రేమను అందిస్తారు. ఇదా ప్రేమంటే? ఈ ప్రేమలో సహజత్వం ఉందా? స్వచ్చత ఉందా? స్వార్ధం ఉందా? ఇలాంటి ప్రేమతో బంధాల్లో అశాంతి, అసహనం, అపశృతులు రావా మరి. ఒక్కసారి మనలో మనం మధించి చూసుకుంటే ప్రేమలో ఎన్ని లోపాలో... ఇష్టాయిష్టాలతో ప్రేమను ముడిపెట్టి చూడకండి. ప్రేమంటే మానసికమైన ఉద్రేక ఉద్వేగాలు కాదు, కరచాలనం ఆలింగనాలు కాదు, ప్రేమంటే హృదయాన్ని స్పృశించడం. ఇది అంతర్గత స్పందన, నిరంతర ప్రవాహం. శాసింపులు, షరతులు ఉండవు. అవసరమైన చోట చిరు కఠినత్వమే తప్ప, నిరంకుశత్వమెరుగదు. ప్రేమ మృదువుగా మాట్లాడిస్తుంది, మృదువుగా వ్యవహారాల్ని చక్కబెడుతుంది, మృదువుగా హెచ్చరిస్తుంది. నిజానికి ప్రేమకి మించిన పదునైన ఆయుధం లేదు. ఈ ప్రేమ మనలో లేనిది కాదు, మనలోనే అనేక భావోద్వేగాల (ఆవేశం, అసహనం, ఆవేదన, అవమానం, అసూయ, అసంతృప్తి లాంటివి)క్రింద అణిగివుంది. ఆ ఆయుధాన్ని బయటికి లాగండి.  ద్వేషించడం వలన ద్వేషాన్ని రూపుమాపలేం. ద్వేషానికి సరైన మందు ప్రేమ. ప్రేమతోనే మానవసంబంధాలు పటిష్టంగా ఫరిడిల్లుతాయి.

చీకటితో ఎంత పోరాడినా ఏమీ లాభం వుండదు, వెలుగు వైపు అడుగులేస్తేనే చీకటి తనదారి తాను చూసుకుంటుంది. వెలుగు విలువ తెలుస్తుంది. అలానే వడలిన బంధాలను తలచుకొని బాధపడితే ఏమీ లాభం వుండదు, సరిచేసుకోవడానికి ఓ అడుగు ముందుకువేయండి. బంధాల్లో ఆనందం తెలుస్తుంది. 

మన కుటుంబవ్యవస్థను "ఉదారచరితానాంతు వసుదైక కుటుంబం" అని కీర్తిస్తారు. కుటుంబీకుల నడుమ పరస్పర అనురాగం గౌరవం ఉన్నను;  ఒకొకప్పుడు కుటుంబీకులను బాధపెట్టలేక కొన్ని విషయాల్లో రాజీపడతాం. ఎదుటివారి అభిరుచుల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం కోసం  కొంత తగ్గుతాం. అవతలివారి ఆధిపత్యానికో, పెద్దరికానికో ... భయంతోనో, భక్తితోనో కొంత మూగబోవల్సివస్తుంది... ఫలితం అసంతృప్తి. ఇలా ప్రతీ బాంధవ్యంలో ఎంతో కొంత అసంతృప్తి సహజం. అటువంటప్పుడు స్నేహితుల చెంత, ఆ అసంతృప్తి మర్చిపోవడానికి ప్రయత్నించిన, అదీ అన్నివేళలో సంతృప్తికరంగా ఉండదు. 
వీటన్నిటినీ అధిగమించడానికి మన ప్రవర్తనా శైలిలో, మన అభిరుచుల్లో, ఆలోచన సరళిలో ఓ మార్పు రావాలి. ఆ మార్పు మనకి ఆహ్లాదపరిచే తోడు కావాలి. ఆ తోడు మన అభిరుచుల్లో దొరుకుతుంది. ఎవరికో నచ్చినట్లుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సివస్తుంది. అదే మనకి నచ్చినట్లుగా బ్రతికితే, జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మనస్సు హాయిగా వున్నప్పుడే, సవ్యంగా ఉండగలుగుతాం. మనస్సుని నిర్మలంగా, వ్యవహారశైలిని సౌమ్యంగా నిలపగల్గేవి, మన అభిరుచులే. బంధాలు అప్పుడే పటిష్టంగా శోభిల్లుతాయి.

నా ఆత్మీయ నేస్తమొకరు ప్రకృతి ప్రేమికురాలు. సూర్యోదయమును ఆస్వాదిస్తారు, చంద్రరాజును చూస్తూ పులకిస్తారు, పక్షుల కువకువలు, పుష్పాల సొగసులు, గాలి గుసగుసలు...అన్నీ ఆమె మురిపింపులకు హేతువులే. రంగవల్లులు, పుష్పాలంకరణలు, దీపారాధనలు, మంచి సంగీతం మంచి సాహిత్యం ...ఇలా ఆమె అహ్లాదంగా సాగే దారులు ఎన్నెన్నో! తన ఈ అభిరుచులే తనకి చక్కటి తోడు. వీటితో తనకి చక్కటి అనుబంధం. ఇలా అభిరుచులతో అనుబంధం ఏర్పరచుకున్న ఆమె, తన అన్ని సంబంధబాంధవ్యాలతో ప్రేమగా నిత్యనూతనంగా నిలకడగా ఆనందంగా ఉండగలుగుతున్నారు.
ఈ కాంక్రీట్ కట్టడాల్లో, ఉరుకుల పరుగుల కాలంలో... ప్రకృతి, భావుకత్వంలతో జీవించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు కదా...ఒక మిత్రురాలి సందేహం. ఊహు...నా ఉద్దేశ్యం తనని అనుసరించమని కాదు, చక్కటి అభిరుచులు ఇచ్చే మానసిక, శారీరిక ఉల్లాసాలు అత్యద్భుతమని తెలుసుకోమంటున్నాను. 
అందరం  ప్రకృతిశక్తితో అనుబంధం ఏర్పరచుకొని జీవించడం సాధ్యం కాదు కానీ, అసంతృప్తి లేకుండా, జీవించడం అసాధ్యం కాదు కదా. బాహ్య పరిస్థితుల మీద, ఆనందం ఎప్పుడు ఆధారపడదు. అది మన మనస్సులోని 
కదిలాడే భావాల పరిస్థితి మీద ఆధారపడి వుంటుంది. మానసిక ఉల్లాసం ఇచ్చే క్రొంగ్రొత్త దారులు కోకొల్లలు. ఎవరి అభిరుచులుకు తగ్గట్లు ఆ అభిరుచులతో అనుబంధం ఏర్పరచుకొని నచ్చిన మార్గంలో పయనిస్తే జీవనగమనం సవ్యంగా సాగదా? అయితే అభిరుచుల అన్నింటా అంతర్లీనంగా, ఇది అంతా భగవంతుని సృజన, ప్రతిభ అన్న స్పృహ, భగవత్ప్రేమ ఉంటే ఆ పొందే ఆనందంలో నిండుతనం ఉంటుందని నా భావన.
గమనించండి... మంచి ఆరోగ్యకర అభిరుచులతో(పుస్తకపఠనం, చక్కటి సంగీతమును ఎంజాయ్ చేయడం, మంచిపాటలువినడం, హయిగా పాడుకోవడం ఫోటోగ్రఫీ చిత్రలేఖనం మొ||) అనుబంధం ఉంటే మనస్సు హడావిడి తగ్గిపోతుంది ముందు. మనస్సెంత సందడి లేకుండా నిర్మలంగా వుంటే జీవితం అంత ఆనందంగా ఉంటుంది.

మంచి చెడు, కష్టం సుఖం, రాత్రి పగలు, చీకటి వెలుతురు...ఇలా ద్వంద్వాలతోనే జగత్తు ముడిపడి ఉంది.  కొన్ని బంధాలు బాగా బాధపేట్టేవిగా ఉంటాయి. రెచ్చగొట్టేవారు, చిచ్చు పెట్టేవారూ ఉంటారు. వారికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. అవే గుణాలు మనలో ఉంటే మార్చుకోవడం మంచిది. అహం, సంకుచిత్వం, స్వార్ధం ఉన్నవారితో కాస్త దూరంగా ఉండవచ్చు. అవే లక్షణాలు మనలో ఉంటే వదిలించుకుంటేనే ఆనందం. ఒకోసారి ఒకొకరికి వారితో వున్నవారి వలన చితికిపోయే స్థితి కలుగుతుంది. అప్పుడు వారు, వారివారి అనుభవాల బట్టి వారి బంధాలను నిర్ణయించుకుంటారు. అది ఇక్కడ చర్చాంశం కాదు. 
                          
ఇక నాలో నాకు నచ్చనిరెండవ అంశం - నన్ను ఎవరైన నొప్పిస్తే మాటకు మాట అన్నట్లుగా, వెంటనే బదులిచ్చి వార్ని నొప్పించలేక, వారే తెలుసుకుంటారు వారి తప్పుని, అన్న భావంతో మౌనమైపోతాను కొద్దిరోజులు. నా ఆత్మీయ నేస్తాల్లో ఓ ఇద్దరు అప్పుడప్పుడు వారి మాటలతో, చేతలతో బాగా గాయపరిచేవారు. వారిని ఏదో అని బాధపెట్టలేక, వారే తెలుసుకుంటారు వారి తప్పుని అన్న భావనతో, మౌనమైపోయేదానిని కొద్దిరోజులు. తర్వాతమాములుగా మాట్లాడేదానిని. కానీ చిత్రమేమిటంటే, వారు తప్పును గ్రహించేవారు కాదు, అదే నడవడిక... ఎందుకిలా జరుగుతుందని... నాలో ఏమైన లోపముందేమోనని స్వీయ పరిశీలన చేసుకునేదానిని. నా తప్పు నాకు తెలియరాక, సూటిగా వార్నే అడిగేదానిని... నాలో ఏమైన లోపాలున్నాయా...చెప్తే సరిదిద్దుకుంటానని. ఏమీ లేవనేవారు. మీ ప్రవర్తన నన్ను నొప్పిస్తుంది అని కూడా చెప్పేదానిని. కొద్దిరోజులు బాగా ఉండేవారు. ఆపై మరల మాములే. నేనే సర్ధుకుపోయేదానిని బంధానికి విలువనిస్తూ. కానీ, నా ఈ బలహీనత వారికి ఆట అయింది. కోపం వచ్చిన రెండు మూడు రోజులే... తనే మరల మాట్లాడుతుంది అన్న భావన వారిది. ఇది సరికాదని నాకే అనిపించి, వారంటే ఎంత అభిమానం ఉన్నను, వారికి కారణం చెప్పి, పూర్తిగా మౌనమైపొయి, కొన్ని నెలలు అయింది. కొన్ని పరిచయాలు మనకు ఎంతో దూరంగా ఉన్నా, దగ్గరనిపిస్తాయి. కొన్ని బాంధవ్యాలు ఎంత దగ్గరగా ఉన్నా, దూరంగా అనిపిస్తాయి.
ఎందుకో మరి కొందరు మనస్సుకు చేరువుగా వచ్చి బరువుగా మారిపోతుంటారు. ప్చ్... మనస్సు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానముండదు. ఒకోసారి మనస్సుకు తగిలిన మాట చాల లోతుగా గాయం చేస్తుంది. కాలానికి కూడా దానిని మాన్పించే ఔషదం దొరకకపోవచ్చు. ఈ విషయం గ్రహించి చక్కటి చేతలతో, చల్లని మాటలతో, చిక్కటి బంధాలకు శ్రీకారం చుడితే బాగుంటుంది. 

ఆపేక్ష సత్సంబంధాలకు పునాది. మంచివ్యక్తిగా ఉండటంకన్నా, ఆపేక్ష చూపించగల మనిషిగా ఉండటం తృప్తినిస్తుంది. 
అర్ధం చేసుకోగల మనస్తత్వం, ప్రేమతత్వం, క్షమాతత్వం వున్నప్పుడే అన్ని అనుబంధాలు చక్కగా అమరుతాయి.
మనజీవితం ఆనందాన్ని వెతుక్కునేదిగా కాకుండా ఆనందాన్ని పంచుకునేదిగా అయినప్పుడు మన అనుబంధాలు అద్భుతంగా రాజిల్లుతాయి.

నా బంధువొకామె, నేను ఫోన్ చేసి మాట్లాడేసరికి ఆశ్చర్యంతో అమితానందంగా, నిజంగా నీవేనా...నీవేనా అక్కా... మాట్లాడుతున్నది... మన పెద్దవారి మధ్య స్పర్ధలు రావడం ఏమిటో, వారి ఆంక్షలకు... వారి పిల్లల కుటుబాలు కుటుంబాలు దూరమవ్వడం ఏమిటో, ఇప్పటికీ అర్ధం కాదు. ఆ పెద్దలు ఇప్పుడు లేరు కానీ,  ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది కష్టసుఖాల్లో కూడా కలుసుకొలేంతగా! ఎన్నోసార్లు అనుకున్నాను, నీతో మాట్లాడలని...కానీ, నీగురించి ఎప్పటికప్పుడు చాలామందిని అడిగి తెలుసుకుంటాను. ఒకప్పుడు తరచుగా మాట్లాడేదానివని, ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు వెళ్ళి తక్కువగా మాట్లాడుతున్నావని వినడంతో, బంధాలు మరల గుర్తుచేయడం ఎందుకని మాట్లాడలేకపోయానని... ఎన్నో చెప్తున్న తనని, ఒక ప్రశ్న అడిగాను - ఆధ్యాత్మికం అంటే ఏమిటమ్మా అని. 

చక్కటి మంత్రాలతో పద్ధతిగా పూజలు చేయడం, శ్లోకాలు వల్లెవేయడం, ఎప్పుడూ భగవంతుని ధ్యానంలో ఉండడం, ప్రాపంచిక విషయాలు పట్టించుకోకపోవడం, బంధాలకు దూరంగా ఉండడం, ఏ ఆలోచనలూ లేకుండా ఉండడమే కదక్కా ఆధ్యాత్మికత్వం...
తన భావన అర్ధమై, నాకు తెలిసినంతలో చిన్న వివరణ ఇచ్చానిలా - 
ఆధ్యాత్మికత అంటే మంత్రాలు వల్లెవేయడాలు,  శ్లోకపూరిత అనుష్టానాలూ కాదమ్మా. ప్రాపంచికతను పట్టించుకోకపోవడం కాదు, బంధాలును వదిలించుకోవడం కాదు. ఆధ్యాత్మిక పయనం పలాయనవాదం కాదమ్మా. 
ఆధ్యాత్మికత అంటే - తొలుత అపార శ్రద్ధ, నమ్మకం, భక్తితో కూడిన దైవచింతనగా మొదలై, క్రమేణా మానసిక పరివర్తనకు దారితీయడం. దైవత్వం అంటే ఏమిటో అవగాహనకు రావడం. ధ్యానాదులచే మనలోనికి మనం చూసుకోవడం. మనోశుద్ధతకై 
యత్నించడం. పరిపక్వత చెందడం...ఇలా ఒకో మెట్టు అధిరోహిస్తూ, ఆత్మతో అనుబంధం ఏర్పర్చుకోవడం. 
ఆధ్యాత్మికత ఒక్కటే మనిషి దైనందిక జీవితంలో సృజనాత్మక వైఖరిని ప్రవేశపెట్టి, ఆనందమయమైన మనుగడను ఇస్తుంది. ఆధ్యాత్మికత మనిషిని ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితిలోనికి తీసుకెళ్ళే చైతన్య స్రవంతి. ప్రేమ కరుణ కృతజ్ఞతల కలబోత ఆధ్యాత్మికం. అందుకే, ఆధ్యాత్మికతత్వాన్ని జీవితం నుండి విడదీసి చూడకు, అలా విడదీసి చూస్తే అది ఆధ్యాత్మికమే కాదు. ఇది మనల్ని మనకి చూపిస్తుంది. మానసిక కాలుష్యాన్ని తొలగిస్తుంది, మనకి ఏది అక్కర్లేదో ఏది కావాలో తెలుపుతుంది, అంతర్గత శక్తిని పెంచుతుంది. జీవితం మీద ప్రేమ నశించపోకుండా ఉండటానికి, ప్రాప్తించిన దాంతోనే సంతోషంగా సంతృప్తిగా జీవించడానికి, సంపూర్ణత్వం తీసుకురావడానికి దోహదపడుతుంది. జరిగే అన్నింటినీ అంగీకరించడం నేర్పుతుంది. సరళంగా, సదావగాహనతో, సానుకూలంగా జీవించడం అలవర్చుతుంది. జరిగే సంఘటల వలన మనకి సుఖదుఃఖాలు కలగవు, మన కర్మల ఫలితంగా సుఖదుఃఖ అనుభవాలను పొందాలి కాబట్టి, ఆయా సంఘటనలు జరుగుతున్నాయనే అవగాహన వస్తుంది. ఆధ్యాత్మికం వలన సుఖదుఃఖాలు తొలగవు. సుఖదుఃఖాలను కూడా ఆనందంగా అంగీకరించే శక్తినిస్తుంది. మితిమీరిన మనో వ్యాపకములన్నీ మరణమృదంగములే అని గ్రహింపుకుతెచ్చి ఆ వ్యాపకాలను తగ్గించుకొని జీవనగమనం ఇష్టంగా (ఇలా వుంటేనే కావాలి అనిపించడం ఇష్టం)కాకుండా, ప్రేమతో (ఎలా వున్నా కావాలి అనిపించడం ప్రేమ)సాగేటట్లు చేస్తుంది. ఇక, ఆలోచనలు ఎవరికీ అస్తమించవమ్మా, కాకపొతే ఆలోచనలలో కామ్యకమైన ఆర్తి చల్లబడుతుంది, అంతే! ఇది అర్ధమౌతే, అన్నీ అవే అవగాహనకొస్తాయిరా... అని సంభాషనను ముగించి ఇవన్నీ స్మరణలో పదిలపర్చుకుంటుండగా, వాట్సాప్ లో ఓ విడీయో...ఆ విడీయో నచ్చి దానిని పదిలపరుస్తున్నాను ఇక్కడ -
                            

25, మార్చి 2020, బుధవారం

శార్వరి సంవత్సరాది - "శ్రీకారం చుడదాం ఓ చక్కటి ప్రార్ధనకు"🛐🛐🛐

చైత్ర శుద్ధ పాడ్యమి...
శార్వరి నామ సంవత్సర యుగాది...
తెలుగు సంవత్సరాది...

ఈరోజు ఆనందంగా గడిపితే సంవత్సరం అంతా ఆనందంగా గడుస్తుంది - ఓ నమ్మకం.
ఈరోజు షడ్రుచుల పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం - ఓ నిజం.

నాకు తెలిసి, పచ్చడి లేకుండా 'ఉగాది'ని మేం స్వాగతించడం ఇదే మొదటిసారి. 
కారణం కరోనా.....ఇల్లు విడిచి బయటకు వెళ్ళాలనిపించక...మామిడికాయలు తెచ్చుకోక!

యావత్తు ప్రపంచావళి చర్చించుకుంటున్న ఈ కరోనా వైరస్ గురించి ప్రస్తావించదలచుకోలేదు కానీ, అందరం అవగాహనతో, అప్రమత్తతో, స్వీయ సంరక్షణ, స్వీయ నియంత్రణ, స్వీయ నిర్భందనలతో ఐక్యతగా ఉండడం తప్పనిసరి అని చెప్తాను. 

అందరికీ ఓ అభ్యర్ధన 🙏
                     

ఈ  వైరస్ అంతమవ్వాలని, అందరికీ ఆయురారోగ్యలు ప్రాప్తించాలని, భగవంతున్ని ఈ వసంత నవరాత్రులు ప్రార్ధిద్దాం.
                             
             

మనకోసం చేసుకునే నిత్యపూజలో " సర్వేజనాః సుఖినో భవంతు" అనే ప్రార్ధనను జోడిద్దాం. 
                      
                

గమనించండి మనకై కంటే, అందరికై చేసే పూజలో ఎంత తృప్తని. 
                              

అలానే ఈ ఉగాదిన మరిన్ని తృప్తినిచ్చే మంచి సంకల్పాలకు శ్రీకారం చుడదాం

⛧ స్వార్ధం తగ్గించుకొని, ప్రక్కవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయడంలో ఎంత హాయి.

⛧ అత్యాశతో ప్రాకులాడడం, మితికి మించి ఆరాటపడడం మాని, ఏదీ శాశ్వతం కాదని ఎఱిగి, బుద్ధిలో స్థిరపడితే ఎంత హాయి.

⛧ అవి కావాలి, ఇవి కావాలి, అవి తినాలని, ఇవి తినాలని పరితపించేకంటే, కాళ్ళూచేతులు శుభ్రంగా ఉన్నాయి, ఆరోగ్యం వుంది, కూటికి వుంది, గూడు ఉంది... అని ఉన్నంతలో తృప్తి పడడంలో ఎంత హాయి. 

⛧ ఉపకారం చేసే శక్తి లేకున్నా అపకారం చేయకుండా ఉండడంలో ఎంత హాయి. 

⛧ కాళ్ళకు ఖరీదైన బూట్లు లేవని బాధపడకుండా, నడవడానికి కాళ్ళు ఉన్నాయి కదా అని... ఇలా అన్నింటా ఆశావహదృక్పధంతో వుంటే ఎంత హాయి.

⛧ ధనం, విద్య, అధికారంల గర్వంతో, నాకేంటి అని అనుకోకుండా పదిమందికి మేలు చేసే చిన్నపనైన చేయడంలో ఎంత హాయి. 

⛧ ఇతరులు ఏది చేస్తే మనకు బాధ కల్గుతుందో అది ఇతరులకు చేయకుండా ఉండడంలో ఎంత హాయి. 

⛧ అసూయ, అహం లను ప్రక్కకు నెట్టేసి, ప్రేమను పంచడంలో ఎంత హాయి. 
                         

సద్బుద్ధితో మనస్సు వంగినప్పుడే సర్వేశ్వరుని అనుగ్రహ పాత్రులౌతాం. 
తపనతో ఆర్తిగా ప్రార్ధిస్తే పరమేశ్వడే రక్షిస్తాడు
                   
              

ఇలా సద్భావనలతో, సహృదయంతో, సరళంగా, సామరస్యంగా, సమిష్టిభావంతో జీవనయానం సాగిస్తూ, మానవత్వాన్ని పరిమళింపజేసుకుంటే అది మాధవత్వం కాదా? మానవుడు మాధవుడు కాడా?
                         

శార్వరి నామ సంవత్సరం - శ్రీకారం చుడదాం ఓ చక్కటి ప్రార్ధనకు 🛐🛐 🛐

స్వాగతిద్దాం సత్ కాంక్షలను... సంకల్పించుకుందాం సత్ కార్యలకై!    


21, డిసెంబర్ 2019, శనివారం

సాధకులారా ఒక్క క్షణం ...{విగ్రహారధన}

ఇక విగ్రహారధన గురించి -
                    

సాధరణంగా మనం ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఆకారం, ఒక ధ్యేయం లేనిదే సాధన చేయలేము. అందుకే సాధకులకు ఉపయుక్తంగాను, సులభసాధ్యంగాను ఉండటానికి సహస్రనామాలు, స్తోత్రాలు, మంత్రాలు, విగ్రహారాధనలు అంటూ ఆధ్యాత్మికమార్గాన్ని సుగమం చేశారు మనఋషులు.
                      
పరబ్రహ్మం సర్వవ్యాపియై యుండినను, అది అవ్యక్తమైయుండిన కారణమున, ఒక  వ్యక్తవస్తువు నాశ్రయించక పోతే గోచారం కానేరదు.  అటులనే మనసు చంచలమైనది. ప్రతిక్షణం చింతుస్తూ ఉంటుంది. దానిని నియంత్రించి ఏకాగ్రత సాధించటానికి కూడా ఓ మార్గం  విగ్రహారాధన.

సగుణ జ్ఞాన హీనస్య న హి నిర్గుణవేదనమ్'
సగుణజ్ఞానం లేనివారికి నిర్గుణజ్ఞానం సిద్ధింపదు.

మనోధృతిర్ధారణా స్యాత్ మాధిర్బ్రహ్మాణి |
అమూర్తో చేత్ స్థిరా న స్వాత్ తో మూర్తి || 
మనస్సు యొక్క ధృతి (స్థిరత్వం) ధారణ అనబడుతుంది. బ్రహ్మస్థితి పొందటం సమాధి అవుతుంది.కానీ, మనసు స్థిరంగా ఉండదు కాబట్టి ఆలంబనగా విగ్రహాన్ని గ్రహించటం అవసరమౌతుంది.
అంటే జ్ఞానస్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి. అది విగ్రహారాధన వలన సాధ్యమౌతుంది.
     
కావున, నిర్గుణ నిరాకార పరబ్రహ్మను ధ్యానించగలిగే స్థితిని చేరేవరకు సగుణమూర్తిని ఉపాసించటం సముచిత విధానమే.

భగవంతుని విగ్రహాన్ని చూడగానే ఇంద్రియాలు శాంతిస్తాయి. మనస్సు ప్రశాంతతను పొందుతుంది. పరమేశ్వరుని నామాలను కీర్తించగానే బుద్ధికి ప్రశాంతత చేకూరుతుంది. ఇది పారమార్థిక పురోగతికి దోహదపడుతుంది.
                 

గురువైన వషిష్టులవారు ద్వారా జ్ఞానాన్ని పొందినా, శ్రీరాముడు ఎందుకు లింగప్రతిష్టలు చేసి పూజించాడు? 
ఏ శక్తి లేకుంటే శ్రీరామచంద్రుడు, హనుమా మరియు కపిల, నారద, వశిష్ట, భరద్వాజ, అగస్త్య, భృగుమహర్షులు, శ్రీశంకరులు విగ్రహప్రతిష్టలు, శ్రీచక్రస్థాపనలు ఎందుకు చేస్తారు? 

మానవనిర్మిత వ్యవస్థలోఒకకాగితముపై ప్రభుత్వ కరెన్సీ ముద్రవుంటే దానికి విలువ ఏర్పడినప్పుడు సర్వేశ్వరసృష్టిలో వేదాల ప్రాతిపదికన ఆగమశాస్త్రం ప్రకారం మంత్రశక్తులతో ఆవాహనంచేస్తూ ప్రతిష్టించిన విగ్రహాలలో దైవత్వం ఉండదా?

రాతిలో దైవమును చూడలేనివారు, వాదనలు ఎన్నో చేయవచ్చు. కాని రాతిలో కొలువై ఉండగల శక్తి దైవానికి ఉంది. దానిని దైవమహత్యంగా మనం తీర్మానిస్తే అది భక్తి అవుతుంది. ప్రహ్లాదుడు భక్తిగా అలా ప్రార్ధించాడు కాబట్టే, రాతిస్థంబం నుండి నృసింహస్వామి ప్రత్యక్షం అయ్యాడు. 
                
ఇక విగ్రహమును ఆరాధించడం అంటే విగ్రహంలోవున్న విశ్వవ్యాప్తచైతన్యమును ఆరాధించడం.  భక్తులు విగ్రహంలో దైవమును చూస్తారు. అది విశ్వాసం.

మార్కేండేయుడు శివలింగమందు పరమేశ్వరుడు ఉన్నాడని నిశ్చయభక్తితో పూజించినప్పుడు వానియొక్క యమబాధ నివృత్తికొరకు ఈశ్వరుడు ఆవిర్భవించి కాలున్ని నిలువరించలేదా? తరిగొండ వెంగమాంబకు, హత్తిరాంబావాజీ గారికిని శ్రీ  
వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షం కాలేదా? 

సాకారమా, నిరాకారమా, ద్వైతమా, అద్వైతమా అనే వాదనలు ఎందుకు? పరమసత్యం తెలుసుకోవడానికి ఇన్ని వివరణలు విశ్లేషణలు ఎందుకు? ఈ వివరణలు, విశ్లేషణలు అన్నీ మనస్సుతో ఇచ్చినవే. ఇవన్నీ అహంలోనివే. అసలు తత్త్వానికీ, ఆత్మకు వీటికి సంబంధంలేదు. మనస్సు నశించడానికి అవన్నీ తెలియాల్సిన పనిలేదంటారు శ్రీరమణులు.

వేదాంతపుస్తకాలు చదవడం, మననంచేసుకోవడం, కంఠస్థంచేయడం, తర్కించడంవలన జ్ఞానంరాదు. ఇవన్నీ సాధనాక్రమంలో సోపానాలు. ఆధ్యాత్మిక పరిణితికి దోహదంచేస్తాయి. మనం తెలుసుకుంటుంది విషయజ్ఞానం. విషయజ్ఞానం చాలావరకు అవగాహనకి తప్ప ఆత్మానుభవానికి ఉపయోగపడదు. శాస్త్రప్రమాణంతో శోధనవలన కలిగే ప్రయోజనం కంటే హృదయనివేదనవలన కలిగే ప్రయోజనం శక్తివంతమైనది.   
                   
సాధక మిత్రులారా! 
ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తిగతభావననే పరమావధిగా బ్రతకడం సరికాదు. ఆత్మానుభవం కోసమే, ఈ సాధన చేస్తున్నామన్న విషయం గ్రహించండి. మాది ఈ మార్గం, మాది ఈ సిద్ధాంతం, మాది ఈ తత్త్వం అనే బదులు మన అందరిది భగవంతుని మార్గం అని అనుకోవడంలో ఎంతటి సామరస్యత. ఆధ్యాత్మికమార్గాలన్నీ ఆత్మానుభవానికే అనుకోవడంలో ఎంతటి సానుకూలత.
భగవంతుడు మన మన యోగ్యతలబట్టి ఓ మార్గాన్ని చూపిస్తాడని నమ్మి, మనం నిమిత్తమాత్రులమని భావించి, అన్నింటినీ అనంతునికి నివేదిస్తూ, వినయంగా మసులుకోవడంలో  ఎంతటి సౌహార్ధత.
వ్యక్తిగతభావనను అనుభవిస్తున్నంతవరకు మనలో అనంతత్వ పూర్ణత్వం అవగతం కానట్లే. 
ఎవరు ఏ మార్గముననుసరించినా, తమలోని అహంభావనను పొగొట్టుకొనుటకే. ఎవరు ఏ మార్గముననుసరించినను చివరకు వారు తెలుసుకున్నది తాను ఆత్మయేనని. 
భిన్నత్వాన్ని చూడటం జీవత్వం. ఏకత్వాన్ని చూడటం దివ్యత్వం. ఏకత్వం వచ్చినప్పుడు మనకంటే భిన్నంగా ఏదీ ఉండదు. స్వీకరించడం, విడిచిపెట్టడం, దోషాలను గుర్తించడం...అంటూఏదీఉండదు.

భౌతికం-ఆధ్యాత్మికం, జగం-బ్రహ్మం, నేను-నీవు, అజ్ఞానం-జ్ఞానం ... ఈ ప్రతిపాదనలన్నీ ఆత్మానుభవం కల్గినంతవరకే. అది గ్రహించి ఈ ప్రతిపాదనలు ఏవీ లేకుండా సాధన చేస్తే - అన్యంగా ఏదీ ఉండదు. అంతా బ్రహ్మత్వమే. అంతా సత్యమే. సదా సత్యాన్ని సమ్మతిస్తే సరిపోతుంది.

సాధన అనగా అహమునకు జన్మస్థానమైన నేను ఎవరో తెలుసుకొనుటకు చేయు నిరంతరాన్వేషణ. ఆత్మలో  సుస్థితులై ఉండుటయే సరైన సాధన. 'నేను' అన్నప్పుడు హృదయంలో వున్న సత్యం గనుక స్ఫురిస్తే అది జ్ఞానస్వరూపం.

సాధకులారా! ఒక్కక్షణం...

సాధకులు అనేకమార్గాల్లో తమ గమనమును సాగిస్తారు. ఎవరి అభిరుచికి తగినట్లుగా వారు ఓ మార్గాన్ని అవలంభిస్తారు. ఏ మార్గంలో గమనమున్న అందరి గమ్యామూ, లక్ష్యమూ ఒక్కటే. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలు వేరువేరు కానీ; అన్నిమార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం నిర్ధేశింపబడినవే. అన్ని మార్గాలు పరమాత్మ బోధించినవే.
ఇన్ని మార్గాలు ఎందుకు చెప్పారంటే, మన ప్రవృత్తిని బట్టి తగినదానిని అనుసరించటానికి. ఏదీ ఎక్కువ కాదు, తక్కువా కాదు. ఎవరి యోగ్యత బట్టి, అర్హతకు అణుగుణంగా ఆ మార్గంలో నడిపిస్తాడు. మనమో మార్గంలో వెళ్తున్నామంటే, అది ఆ భగవంతుని ప్రేరణే. ఎవరు ఏ మార్గంలో సమర్ధవంతంగా నడవగలరో, వారిని ఆ మార్గంలో నడిపించేది ఆ భగవంతుడే. 
అయితే ఏ మార్గంలో పయనించిన సడలని విశ్వాసంతో, దృఢసంకల్పంతో, శ్రద్దగా వెళ్ళగలిగితే- భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు, నాతో ఉన్నాడు అన్న భావన క్రమేపి మాయమై, భగవంతుడే ఆత్మస్వరూపుడై మనలో ఉన్నాడు, మనలా నడుస్తున్నాడన్న భావనామయప్రజ్ఞ కలుగుతుంది. ఉన్నది ఉన్నట్లు ఎరుకై సర్వమూ శివమౌతుంది. 

అయితే కొందరు భగవంతుని యందు ప్రేమ(భక్తి)తో సాధన ప్రారంభం చేసి, ఆ సాధన గొప్పది, ఈ సాధన గొప్పది, మా సాధనామార్గం గొప్పదన్న తారతమ్యభావన కనబర్చడం సమంజసమా? చేసేది, చేయించేది ఆ భగవంతుడే అన్న భావనను విస్మరించి వ్యక్తిగత అభిప్రాయాలతో మాట్లాడడం సముచితమా? 

1. ఈమధ్య వాట్సాప్ లో ఓ వీడియో వచ్చింది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు.  
                 
తాను, తన చుట్టూ ఉన్న ఈ జగత్తు, అంతా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకున్న జ్ఞాని, ఇలా మంత్రజపాలు, నామస్మరణలు, విగ్రహారధనలు చేయడు. కేవలం భక్తునికి మాత్రమే ఇలాంటి పరితపన. ఈస్వామిజీ అంతిమక్షణాల్లో కూడ శివారాధన చేస్తున్నారంటే ఈయన పరమభక్తుడే గానీ జ్ఞానికాదు...అని కొందరి వ్యాఖ్యానం.

2. ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. అందుకు వనరులు సమకూర్చుకుంటాం. పునాదులు వేస్తాం. చక్కటి ఇల్లు కట్టుకుంటాం. సౌఖ్యంగా అందులో ఉంటాం. ఇల్లు నిలబడేంతవరకే పునాదిని గుర్తిస్తాం. ఇల్లు కట్టాక, రోజూ పునాదిని చూస్తామా, తలుస్తామా? అలానే నామం, జపం, విగ్రహం అనే వనరులుతో భక్తనే పునాదులు వేసి, ఆపై జ్ఞానమనే గృహంలో ప్రవేశించాక, పూజాదికాలు అనవసరం. ప్రారంభంలోనే అవన్నీ. భక్తిమార్గం విడిచి జ్ఞానమార్గం పట్టాలి గానీ, ఇంకా భక్తి, పూజలు, నామజపాలు అనుకుంటే ఏం ఎదుగుతారు? 

3. భగవంతున్ని సామాన్యులు విగ్రహాల్లో పటాల్లో చూస్తూ నామ, మంత్రజపాలు చేస్తుంటారు. ఇది భక్తిస్థాయి. కానీ, జ్ఞాన
సాధకులు ప్రపంచమంతా పరమేశ్వరున్ని చూస్తారు కాబట్టి, పూజాదికాలు అవసరం లేదు. శ్రీ రమణమహర్షి ఏనాడైన మంత్రోపదేశాలు విగ్రహారాధనలు చేసారా? సత్యం నిరాకారం. అది గ్రహించినచో నామజపాలు, పూజలు వుండవు.

4. ఏ రోజుకారోజు స్వీయపరిశీలనలు, స్వభావదోషనిర్మూలనలు అనుకుంటే ఎన్ని జన్మలు ఎత్తాలో లక్ష్యసాధనకై. 
ఒహ్హో...ఎనెన్ని వాదనలో తమమార్గమే అనుసరణీయమని. 

నేనొక అతి సామాన్య సాధకురాలిని. ఇటువంటి ప్రశ్నలకు బదులిచ్చేశక్తి నాకు లేదుగానీ, ఇటువంటి వాదనలు విన్నప్పుడు నాలో కొన్నిభావాలు కదలాడుతుంటాయి. ఆ భావాల సమాహారమే ఈ టపా.
ముందుగా వీడియో గురించి - 
నావరకు ఆ వీడియో చూడగానే అణువణువు అవ్యక్తభావంతో స్పందించగా, గీతలో ఈ శ్లోకం స్ఫురించింది. 

యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః |  
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే|| 

ఉత్తములు ఏయే కర్మను ఆచరించెదరో, దేనిని ప్రామాణికంగా గ్రహించిదరో, దానిని ప్రాపంచిక జనులు ప్రమాణంగా విశ్వసించి ఆచరించుదురు.
శ్రేష్ఠులకు(జ్ఞానులకు) అనుష్టానం అవసరం లేనప్పటికిని, ఇతరులకై పూజాదికాలు అనుష్టిస్తారు. లోకోద్ధారణకై దేహమును వీడువరకు మనం తరించుటకై, ఇట్టి సందేశాత్మక క్రియలను ఆచరించుదురు. జ్ఞానులు తాము తరించినవారైనను ఇతరులను తరింపజేయువారై జనోద్ధరణే జీవితాదర్శమై వుందురు.
ఇటువంటి స్వామీజీలు మన ఉద్ధరణకై వైయుక్తిక ధర్మాచరణను దేహము  వీడువరకు ఆచరిస్తూ మార్గదర్శకం చేస్తారు. 

నిజమే, ప్రాపంచిక ప్రపంచంలో -
సౌఖ్యవంతమైన ఇల్లు నిర్మించుకున్నాక పునాదులును తలవనవసరం లేదు. కానీ, ఏ భవంతి నిర్మాణానికైన బలమైన పునాదులు అవసరమన్న విషయం ఎరుకై, అయినవారికో, అడిగినవారికో తదుపరి నిర్మాణధారులకు, అనుభవంతో అవగాహనతో చెప్తాం. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ అన్వయింపు సరికాదు. ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి సంబంధించినది. సత్యాన్ని బాహ్యవస్తువులతో ముడిపెట్టి చూచుట తగదు. అందరి శ్రేయస్సు కోరే పెద్దలు ఓ మాట చెప్తుంటారు. ఏరు దాటాక తెప్ప తగలేయవద్దని. ఎందుకంటే ఆ తెప్ప మరికొందరు ఏరు దాటడానికి ఉపయోగపడుతుందని. అలానే జ్ఞానులు వారికి అవసరం లేకున్నా, మనందరి శ్రేయస్సుకై పునాదుల్లాంటి మూలాల్ని విస్మరించక, కడవరకు ఆచరించి చూపిస్తూ ఎలా తరించవచ్చో అడగకపోయిన ఆ జ్ఞానాన్ని అందిస్తారు.  ఆచరించమని సూచిస్తారు.  

భక్తిమార్గం అనుసరించువారు ప్రపత్తిద్వారా అనగా శరణాగతం కావడంద్వారా, కర్మమార్గం అనుసరించువారు కర్మఫలత్యాగంద్వారా, ధ్యానమార్గం అనుసరించువారు తమ చిత్తవృత్తులను నిరోధించడంద్వారా, జ్ఞానమార్గం అనుసరించువారు ఆత్మవిచారణద్వారా అహంను పొగొట్టుకుందురు. 
                 
  

భక్తి - పూజాదికాలు -నామజపం 
విశ్వాసంతో అంతర్యామికి అనుసంధానం (కనెక్ట్) అవడం భక్తి. నాలో నాతో నేను అనుసంధానం అవడం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతకు ఆలంబన- భక్తిపూర్వక పూజాదికాలు నామజపాలు విగ్రహారధన.
దైవం వైపు విశ్వాసంతో మనసుపెట్టి ప్రయాణం చేయడమే భక్తిమార్గం. విశ్వచైతన్యమును ఏ రూపనామాలు లేకుంటే మనం దేనినీ తెలుసుకోలేం కాబట్టి, మన ఋషులు ఏర్పరిచినదే ఈ ఆరాధన విధానం.
'మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరియసీ'... 
మోక్షమునకుండు అనేకసాధనలలో భక్తి ముఖ్యమైనదని శ్రీ శంకరభగవద్పాదులవారు అంటారు.
                  

తైలం లేక దీపమెట్లు ఉండదో, పుష్పం లేక ఫలమెట్లు కలుగదో, అలాగుననే పవిత్ర హృదయమను ప్రమిద యందు, భక్తియను తైలం నిండుగా లేనివారికి అజ్ఞానాంధకార నాశకమైన పరంజ్యోతియను జ్ఞానదీపం ప్రకాశించదు. అలాగుననే భక్తియను సుగంధపుష్పం లేనియెడల, శాశ్వతానంద జ్ఞానఫలం కలుగదు. కనుక అనన్యమైన భక్తిని, అనన్య చింతనను కలిగి యుండమని శ్రీ మళయాళస్వామి తదితరులు చెప్తుంటారు.  

నిజమే సత్యం నిరాకారమైనది. రూపనామాలు లేనిదాని మీద మనస్సును నిలపడం కష్టం.  సాకారాన్ని పట్టుకుంటూ తద్వారా నిరాకారాన్ని చేరుకోగలం. దైవస్మరణ నుండే అహంస్ఫురణ వరకు వెళ్ళగలం. భగవంతుడు నుండే భగవత్ తత్త్వంలోనికి ప్రవేశించగలం. దైవం నుండే దైవత్వం
వైపు పయనం చేయగలం. సాకారంతో సంబంధం లేకుండా నిరాకారం లోనికి వెళ్ళిపోవడం శ్రీరమణులు వంటి వారికే సాధ్యం. అంతటివారితో మనకు పోలికేమిటి? 
           
ఆ మహర్షిలా 'విచారణా మార్గం' మనకు త్వరగా అంతుపట్టదు. అందుకే ఏకవస్తువును చింతించడం...అది నామమో, రూపమో...ఏదో ఒకటి...మనో నిశ్చలతకై!

అన్ని మార్గాలలో జ్ఞానమార్గమే శ్రేష్ఠమైనదని  చెప్తున్నా, మిగతా మార్గాలు తక్కువ అని అనుకోవడానికి లేదు. 




               
కబీర్ దాసు, తులసీదాసు, తుకారామ్, రామదాసు, ఘోరాకుంబార్ తదితరులు భక్తిచే నామోచ్చరణ, పూజాదికాలు చేస్తూ తరించారన్నది మరువరాదు. 
               


             
పంచేంద్రియాలతో పంచోపచారాలు,  పుష్పాదుల అలంకరణ, మంత్రమూ, నామోచ్చరణ... వీటన్నిటితో తాదప్యతే పూజ. 
భక్తులకు నామామృతం పానం చేయుటయే సులభ సరళమార్గం. మానసికశక్తి, ఏకాగ్రత, మనోనిగ్రహతలను పెంచేశక్తి శబ్ధంలో ఉంది. వేదాలలో ఉన్నది తమ స్వీయప్రజ్ఞతో గ్రహించి మన ఉద్ధరణకై ఋషులు అందించినవే- ఈ నామాలు మంత్రాలూ. నామ మంత్ర జపోచ్ఛరణ చేస్తున్నప్పుడు, ఆ శబ్ధ తరంగాలలో శక్తి అపారంగా ఉంటుంది. ఆ నామ మంత్రాలలో అక్షరాలు జపిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ షట్చక్రాలను జాగృతి చేయడం ద్వారా కుండలినీశక్తి జాగృతమౌతుందని అనుభవజ్ఞులు చెప్తుంటారు. ఇనుమును కొలిమియందుంచి కమ్మరివాడు ఊదునప్పుడు అగ్నివలె ప్రకాశం, దహనశక్తి యెట్లు కలుగుచున్నదో, అలాగుననే నామ, మంత్ర, ధ్యానాదుల శక్తిచే ధర్మనిష్ట పెరుగుతుంది. క్రమేణా వైరాగ్యం అలవడుతుంది. నామ మంత్రాలు ముక్తిప్రదాయకమైనవే. ఒక కరకు బోయవాడిని మహర్షిగా మార్చింది నామమే. ధృవుడును ధృవతారగా నిలిపింది నారాయణ నామతపస్సే.
                   
    విషయవాంఛలతో, మమకారబంధాలతో, 
ఇతరత్రా బంధనాలతో సతమతమౌతు, కలుషితంగా వున్న మనస్సులోనికి భగవన్నామం ప్రవేశిస్తే, కుండలోని కలుషితమైన నీరు చిల్లగింజతో శుద్ధి అయినట్లుగా, పరిశుద్ధమౌతుంది. భక్తివిశ్వాసాలే కాలక్రమేణ విచారణలోనికి మారి, జ్ఞానమార్గంలోనికి పయనింపజేస్తాయి. జ్ఞానమార్గంలో ఉన్నా, వైయుక్తిక ధర్మాచరణను విడిచిపెట్టక ఆచరిస్తునే, లక్ష్యం వైపు పయనం సాగించాలి. అప్పుడే లోకం చూపు పోయి లోచూపు వస్తుంది. మహాజ్ఞానులైన నారదుడు నారాయణమంత్రాన్ని, హనుమా రామమంత్రాన్ని విడిచిపెట్టేరా? శ్రీరమణులు అరుణాచలేశ్వరున్ని తలవడం మానేసారా?

శ్రీరమణులు మంత్రోపదేశంగానీ, దీక్షనివ్వటంగాని  చేయకున్నా, నామజపం యొక్క ప్రాశస్త్యాన్ని కొనియాడేవారు. శరణాగతి నొందగోరేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనేవారు. భగవంతుని నామమూ ఆత్మా ఒకటేననేవారు. అంతేకాక ఆత్మసాక్షత్కారమైన పిదప భగవన్నామస్మరణ హృదయంలో అప్రయత్నంగా సాగిపోతుందనేవారు. అసలు చేయవలసింది ఆత్మవిచారమే అని తెలిసినా, నామజపం చేయుట మంచిదేనా అని ఒకరు ప్రశ్నించగా- "అన్ని పద్ధతులు విచారణకే దారితీస్తాయి. అందువల్ల అన్నీ మంచివే. మన నిజతత్త్వం జపమే. ఆత్మసాక్షత్కారమైతే జపం తనంతట తానే సాగిపోతుంది. ఒక దశలో సాధనమే మరొకదశలో సాధ్యమౌతుంది. అప్రయత్నంగా నిరంతరంగా సాగే జపమే - సాక్షత్కారమంటే" అని బదులిచ్చింది గమనించండి. అలాగే మూర్తిధ్యానం జ్ఞానం పొందడానికి ఉపయోగపడదా అన్న ప్రశ్నకు, "తప్పకుండ ఉపయోగపడుతుంది. ఈ ఉపాసనవలన మనస్సుకి ఏకాగ్రత ఏర్పడుతుంది. ఇతర భావాలేవీ లేకుండా, ధ్యానించిన మూర్తితోనే మనస్సు నిండిపోతుంది. తరువాత మనస్సు ఆ ధ్యానింపబడే మూర్తితో ఏకమై నిర్మలమౌతుందని" బదులిచ్చారు. మరిన్ని వివరణలకై 'నీ సహజస్థితిలో ఉండు 'అన్న పుస్తకమును చూడండి. 

భిక్షాటనం జపో ధ్యానం స్నానం శౌచం శివార్చనమ్|కర్తవ్యాని షడేతాని యతీనాం నృపదండవత్ ||
భిక్షాన్నం, జపం, ధ్యానం, స్నానం, బహిరంతరశౌచం, దేవతార్చనం... ఈ ఆరును యతీశ్వరులకు కూడ రాజదండనం వలె కర్తవ్యమని శ్రుతి తెలుపుతుంది. యతీశ్వరులకే ఇవన్నీ ఉండాలని అంటున్నప్పుడు మనం దేవతార్చనలు, నామజపాలు వద్దనుకోవడం సమంజసమా?
                 
    శాంతి జీవనానికైన ఆత్మానుభూతికైన సద్గుణాలే అవసరం. అందుకే ఉదయం లేచేటప్పుడే, మనం సద్బుద్ధితో, సత్ ప్రవర్తనతో నడుచుకోవాలనే దృఢసంకల్పం చేసుకోవాలని, రాత్రి పడుకునేముందు ఆనాటి మన దినచర్యలను సమీక్షించుకొని తప్పులుంటే సవరించుకోవాలనే సంకల్పం చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. మన ప్రవర్తనలో దోషాలు లేకుండా చూచుకోవాలి. మన గుణాల్లో మార్పు రావాలి. అప్పుడే ధర్మనిష్ట పెరుగుతుంది. మనో శుద్ధత ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కల్గుతుందో అప్పుడే లోపలున్న సత్యంతో సంధానమవగలం. అందుకై స్వీయపరిశీలన తప్పనిసరి. 
                    
అన్ని మార్గాలు ఆత్మసాధనతోనే ముగుస్తాయని శ్రీరమణమహర్షి 
అనేవారు. అలానే మన సాధనలో ప్రతి అంకం, కేవలం సోపానాలు మాత్రమే. నామజపం, ధ్యానసాధన, దేవతార్చన ఇవన్నీ మనలోని నిరాకార దైవాన్ని తెలుసుకునే వరకు సాగాల్సిందే! ఏ సాధనా మార్గమైనా సత్ప్రవర్తనతోనే ముడిపడి ఉంది. మనం చేసే అర్చన వల్ల మనం కోరుకున్నది వస్తుంది. మనం సత్ప్రవర్తనతో ఉంటే దైవమే మన వద్దకు వస్తుంది. 
అందుకే మనల్ని మనం సత్శీలకులమై ఉన్నమో, లేమో అని శోధన చేసుకోవాలనేవారు.

మనస్సు అణిగేందుకే స్వీయవిచారణ, నామజపం, పూజాదికాలు. భక్తిమార్గంలో వెళ్ళేవారికి ఇంతకన్నా సమర్ధవంతమైన పద్ధతి  ఏముంది?

ఇక విగ్రహారధన గురించి తదుపరి టపాలో...