29, నవంబర్ 2015, ఆదివారం

మాతృమూర్తులకు ఆహార నియమావళి

హిందూ సంస్కృతిలో మాతృస్థానం మహోన్నతమైనది. మాతృదేవోభవ  అని వేదమే మాతృస్థానంను శ్లాఘిస్తుంది. ఓ బిడ్డకు జన్మమిస్తున్న స్త్రీ మూర్తిని దైవంగా కొనియాడే శాస్త్రాలు ఆ పుట్టబోయే బిడ్డ మంచిగా మేధావిగా ప్రజ్ఞా ధీశాలిగా జనించాలంటే గర్భవతి అయిన ఆ స్త్రీ ఏం చేయాలో కూడా శాస్త్రాలు తెలుపుతున్నాయి .
మాతృమూర్తి గర్భంలో ప్రవేశించిన జీవకణం క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది.  అట్టి శిశువుని మొదటిమాసం నుండి నవమాసముల వరకు, వరుసగా ఒక్కొక్క మాసం వివిధ దేవతాశక్తుల రూపేణా లలితా అమ్మవారు ఎలా పరిరక్షిస్తూ వుంటారో లలితా సహస్ర నామములయందు చక్కగా తెలపబడింది. ఆయా మాసముల యందు ఆయా దేవాతశక్తులకు ప్రీతికర ఆహారమును గర్భవతులు అయినవారు స్వీకరిస్తే, ఆయురారోగ్య తేజోవంత సత్సంతానంను పొందుదురు.

మాతృమూర్తులగు స్త్రీలకు ఆహార నియమావళి -
                                                   

మాతృమూర్తులగు స్త్రీలకు లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.


విశుద్ధి చక్రనిలయా,‌ రక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,‌உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,‌உతిగర్వితా || 104 ||
మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ || 105 ||
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,‌உస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||


సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,‌உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||


పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది 

మొదటినెల -
విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై వుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి వుంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి, మొదటినెలలో గర్బస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్ స్థ. ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి, బెల్లం జోడించి, తదుపరి ఆవునెయ్యిని కలిపిన పాయసాన్నప్రసాదమును లలితా సహస్ర నామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి, దానిని పవిత్రభావనతో గర్భిణీ స్త్రీ మొదటినెలలో స్వీకరిస్తే, చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది.

రెండవ నెల -
అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకిని దేవతగా కొలువై వుంది. ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో, అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి యుంటుంది. ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవనెలలో స్వీకరిస్తే, శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది.

మూడవ నెల -
మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకిని దేవతగా కొలువై వుంది. ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి యుంటుంది. ఈమె మాంస నిష్ఠ. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం,  బెల్లం, ఆవునెయ్యిలతో తయారుచేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ మూడవనెలలో స్వీకరిస్తే, శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది.

నాల్గవ నెల -
స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకిని దేవతగా కొలువై వుంది. ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో, శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి యుంటుంది. ఈమె మేధో నిష్ఠ. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దద్ధ్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ నాల్గవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది.

ఐదవ నెల -
మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత  సాకిని దేవతగా కొలువై వుంది. ఈమె ఐదు ముఖాలతో, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి యుంటుంది. ఈమె ఆస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి.

ఆరవ నెల -
ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలుతో శోభిల్లుతుంది. ఈమె మజ్జా సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు.  ఈమె మజ్జా దాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి. ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తి విశ్వాసంలతో గర్భిణీ స్త్రీ ఆరవనెలలో స్వీకరిస్తే, శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది.

ఏడవ నెల -
సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె సర్వ వర్ణాలతో, సర్వాయుధాలను ధరించి యుంటుంది. ఈమె శుక్ల సంస్థిత. జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దద్ధ్యన్నం, కట్టుపొంగలిహరిద్రాన్న ప్రసాదంలు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుసక్రమంలో ఆరురోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే, శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి, పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది.

ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు -
సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలితా అమ్మవారిని ఆరాధిస్తూ, క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ, స్వీకరిస్తే,చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తధ్యం. 

15, నవంబర్ 2015, ఆదివారం

మిత్రమా! నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!

మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!
ఆహా ... ఎంతటి భరోసా, ఎంతటి సౌఖ్యత, ఎంతటి భద్రత...
ఏ బంధము ఇవ్వగలదు... ఇంతటి హాయిని. ఇది ఒక్క స్నేహమునకే చెల్లుతుంది.

నిన్న వుదయం నా మిత్రురాలు 'హరిప్రియ' వస్తూనే అడిగిన ప్రశ్న 'భారతీ, స్నేహమంటే ఏమిటీ'?

అంతరంగమున అదో ఆత్మీయస్పర్శ, హృదయాన్ని తాకే ఆనందవీచిక, అపురూపమైనది, అమృతతుల్యమైనది, మదిని మురిపించే, మరిపించే మధురభావన. అంతా తానై లోలోన ఆత్మీయంగా కదిలాడే ఆ అవాజ్యనురాగభావం అనిర్వచనీయం. ఎంతచెప్పినా తక్కువే అయ్యేటటువంటి ఆ అద్భుతబంధంగురించి ఏమని చెప్పగలను... అందుకే  దానిని ఆస్వాదించగలనే తప్ప, వ్యక్తం చేయలేనురా అన్నదే నా ప్రత్యుత్తరం మయింది. అప్పుడు చూశా... తన కళ్ళలో కన్నీరు. ఏమైందిరా అని అనునయంగా అడగగా అడగగా ...
ఎంతో ఆధ్యాత్మిక అవగాహన, వాక్పటిమ, మంచిమనస్సున్న తన సత్సంగమిత్రురాలు ఓ విషయంలో సరైన మార్గంలో వెళ్ళడం లేదని, అందుకే తన శ్రేయస్సును కోరుకుంటూ, ఆ విషయమై వారిస్తూ, తప్పనిసరై పరుషంగా తనతో మాట్లాడానని, దానికై తను నాకు స్నేహమంటే ఏమిటో తెలియదని, స్నేహానికి వున్న విలువను గుర్తించడం నాకు చేతకాదని, ఇకపై నాతో మాట్లాడానని, నా స్నేహమే వద్దనేసింది... అని చెప్పింది.
అందర్నీ అర్ధం చేసుకుంటూ, అందరితో ఆత్మీయంగా మసులుకుంటూ, ఎవ్వరినీ, ఎప్పుడూ నొప్పించని స్వభావం నా ప్రియాకు పెట్టని ఆభరణం. అలాంటిది తనే పరుషంగా, చెలిమిలో స్పర్ధ కలిగేటట్లు మాట్లాడడమా ... ఆశ్చర్యంగా అన్పించి అదే అడిగాను. తన మేలు కోరి, తప్పక కటినంగా మాట్లాడానని అన్నది. స్నేహమనే కాదు, ఏ బంధంలోనయినా కటినంగా మాట్లాడితే ఆ బంధం బలహీనపడదా? అలా ఎందుకు చేశావమ్మా ... అని అడగగా, గతంలో సరళంగా చెప్తే తను విన్పించుకోలేదు, కాబట్టి కాస్త కరుకుగ్గా చెప్పాను, ఏం ... నీవు కూడా నాకు స్నేహం తెలియదని, స్నేహధర్మాలు తెలియవని, తప్పు చేశానని అంటావా అని అంటుంటే ...
లేదు నాన్న, నిజమైన స్నేహం అమ్మలా లాలిస్తుంది, ప్రేమిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది, రక్షిస్తుంది. గురువులా బోధిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ మువ్వురిలా తప్పుచేస్తే శ్రేయస్సు కోరి దండిస్తుంది. నీవు తన హితాన్ని కోరి ఇలా చేశావని తప్పక తను గ్రహించి, మరల నీదరి చేరుతుంది. బాధపడకురా, తాత్కాలిక మనస్పర్ధలు ఎదురైనా ఉత్తమమైత్రి బలపడుతూనే వుంటుందిరా...  అని నేననగా, తను నన్ను అర్ధంచేసుకున్నా, లేకున్నా; నాతో మాట్లాడినా, మాట్లాడకపోయినా ... పర్వాలేదు భారతీ, నేను కోరుకున్న మంచి తనకి జరిగితే చాలు అని అంటున్నా ప్రియను చూస్తూ మనస్సులో ఇలా అనుకున్నా ... "ఎవరుంటారు మిత్రుల కంటే శ్రేయోభిలాషులు".

ప్చ్ ... తనను తననుగా గుర్తించి, అభిమానించి, ఆత్మసములుగా భావించి, ఆత్మీయంగా స్వీకరించే స్నేహితులుతో చిరు బేదాభిప్రాయం వచ్చిందనో, పరుషంగా మాట్లాడిందనో ఆ స్నేహంను వదులుకునే ముందు నన్ను నన్నుగా అభిమానించే ఫ్రెండ్ ఎందుకు అలా మాట్లాడిందో అవగాహన చేసుకోవడం మిత్రధర్మం.

కృష్ణ కుచేలల మైత్రి, రామసుగ్రీవుల మైత్రి చిరస్మరణీయాలు. ఒక్కసారి వారి వారి స్నేహాలను గమనిస్తే, మిత్రులు ఎలావుండాలో. మిత్రధర్మాలు, మిత్రలక్షణాలు అవగతమౌతాయి.
ఉదాహరణకు రామ సుగ్రీవ మైత్రిని పరిశీలిద్దాం -
వాలిని సంహరించి, తన మిత్రుని కష్టాన్ని తొలగించి వానరరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. కొన్ని నెలల అనంతరం (వానాకాలం ముగిశాక) సీతాన్వేషణ జరిపి, ఆమెను సంపాదించడంలో నీవు చేసే ప్రయత్నంలో సహకరిస్తానని మాట ఇచ్చిన సుగ్రీవుడు ఆ మాట మరిచాడు. తన మిత్రుడు మాట తప్పాడని నింద పడకూడదని, తన వాగ్ధానమును తనకి గుర్తుచేయాలని భావించి, లక్ష్మణుని పంపి సుగ్రీవుణ్ణి హెచ్చరించాల్సివచ్చింది. ఎంతటి ఉదాత్తమైన ఆలోచనిది.
వానరులంతా సేతునిర్మాణం చేసుకొన్నా మొదటి రాత్రి, వానరులతో కలిసి ఒక ఎత్తైన పర్వతం ఎక్కిన రాముడు లంకానగరపు నిర్మాణక్రమాన్ని గమనిస్తుండగా, అదే సమయంలో లంకానగరంలో ఓ ఎత్తైన మేడపై తిరుగుతున్నా రావణుని గమనించిన సుగ్రీవుడు, నా మిత్రునికి ఇంత కష్టాన్ని కలిగించినది ఈ రాక్షషుడే అని అనుకుంటూ, తన శక్తియుక్తులను మరిచి, ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరి, రావణుని పై దూకి, పిడిగుద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసి, తిరిగి రక్తసిక్తమైన దేహంతో ఎగశ్వసతో రాముని ముందు వాలగా, సుగ్రీవుడు చేసిన పనికి నొచ్చుకొని, నీవు మా అందరికీ నేతవు... నేత తలతో సమానం, తలపోతే మిగతా శరీరానికి ఏం విలివ? 'సుగ్రీవా! నీకు ఏమైనా అయితే, నాకు సీతతో ఏం పనయ్యా' అని అంటాడు రాముడు. పైగా, నీకు ఏమైనా అయితే, నీ మాట నిజం చేయటం కోసం రావణున్ని చంపి, సీతను విడిపించి, అయోధ్యకు చేర్చి, వానరులందరినీ కిష్కింధకు చేర్చి, ప్రాయోపవేశంలో మిత్రువైన నిన్నే తలచుకుంటూ వదిలేద్దాం అనుకున్నాను అని అంటాడు రాముడు. ఎంతటి అవాజ్యనురాగమిది.

జీవితంలో ఎందఱో తారసపడుతుంటారు. అందులో కొందరు మంచి పరిచయస్థులుగా వుంటారు. అతికొద్దిమంది అతి తక్కువ సమయంలోనే స్నేహితులుగా, ఆత్మసములై అల్లుకుపోతారు. శరీరాలు రెండయినా, ఏకాత్మభావనతో ఒకటిగా వుండటం నిజమైన మైత్రి.

నిజమైన మైత్రి, తన మిత్రులు సరైన మార్గం తప్పితే వెంటనే హెచ్చరిస్తుంది. అపార్ధం చేసుకున్నా, తిట్టినా, చివరికి దూరం చేసినా వారి శ్రేయస్సును కోరి మంచినే చేస్తుంది, చెప్తుంది. చిరు భేదాభిప్రాయాలు వచ్చాయనో, పరుషంగా మాట్లాడారనో అపార్ధం చేసుకోకుండా, అవగాహన చేసుకుంటూ, అర్ధంకాకుంటే ఎందుకలా మాట్లాడావని తననే అడిగి తెలుసుకోవడం ఉత్తమగుణం.

పాపా న్నివారయతి యోజయతే హితాయ
గుహ్యంచ గూహతి గుణాన్ ప్రకటీ కరోతి
అపద్గతంచ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణ మిదం ప్రవదంతి సంతః
సన్మిత్రులు తమ స్నేహితులను చెడుపనులనుండి వారిస్తారు. మంచి పనులు చేయుటకు ప్రోత్సహిస్తారు. రహస్యాలను గోప్యంగా వుంచుతారు. స్నేహితుల సద్గుణాలను ప్రకటిస్తారు. ఆపదవచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోక, ఆదుకుంటారు. సమయం వచ్చినప్పుడు అవసరమైన వాటిని సమకూర్చుతారు.

కరా వివ శరీరస్య నేత్రయోరివ పక్ష్మణీ / అవిచార్య ప్రియం కుర్యాత్ తన్మిత్రం మిత్రముచ్యతే... శరీరానికి చేతులవలె, కళ్ళకు రెప్పలవలె అప్రయత్నంగా అనుకోకుండా, అలవోకగా మంచిచేసే మిత్రులే మిత్రులు.
సుహృదం హితకామానాం యం: శృణోతి న భాషితం ... మన మేలు కోరేవారే నిజమైన మిత్రులు. అట్టి మిత్రుల మాటలను వినాలి.

మైత్రీ సమానుశీలేషు ... సమానశీలం కలిగిన వారియందు మైత్రిభావం అధికం. వారి అనుభూతులు, ఆలోచనలు, స్పందనలు ఒకేలా వుంటాయి. వారి హృదయాలు ...  ప్రతీక్షణం సంభాషించుకుంటాయి, మనకోసం మనకై వున్నారో ఆత్మీయ వ్యక్తి అన్న మధురభావనతో అనిర్వచనీయ ఆనందంను పొందుతుంటాయి. ఓ అనియంత్రణశక్తి ఏదో కలిపి వుంచుతుందన్న అనుభూతి. అయితే, స్నేహితుల స్వభావాల రీత్యా అప్పుడప్పుడు వారి వారి అభిప్రాయలు నప్పనూ వచ్చు, నప్పకపోవచ్చు. అప్పుడే విభేదించక సరికానివి సరిచేసుకుంటూ, సరైనమార్గంలో సాగిపోవడమే సన్మిత్రుల లక్షణం.

స్నేహితుడంటే ... నవమాసాలూ మోయని తల్లి, రక్తం పంచిన తండ్రి, బెత్తం పట్టుకోని గురువు, చుట్టరికం లేని బంధువు, అక్షరాలకతీతమైన పుస్తకం. ఇంకా యింకా ... స్నేహం గురించి చెప్పడానికి ఎన్ని ఉపమానాలైన తక్కువే. ఆ అనుబంధం అన్ని బందాలకన్నా బెత్తుడు ఎక్కువే ... అని స్నేహ రసజ్ఞులు అంటుంటారు.
యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం ... మిత్ర ముండె నేని సిద్ధౌషదం అక్కరలేదన్నది భర్తృహరి సుభాషితం.


మరి ఇటువంటిస్నేహాన్ని జీవితాంతం నిలుపుకోవడం ఎంతో ఉత్తమోత్తమం కాదా?
                                          మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక... కాదు కాదు మరుజన్మలో కూడా!