http://www.sodhini.com
చిరు ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిరు ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఫిబ్రవరి 2025, శనివారం

అవగాహన - ఆచరణ

మా సత్సంగంలో ఒకామె -
సర్వం ఆత్మగా దర్శించినప్పుడు, సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు, శోకం మటుమాయమవుతుందని తెలిపే ఉపనిషత్ ఈశావాస్యోపనిషత్ అని,

అంతా ఏకత్వమే అని గ్రహించాక, నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని, ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనని, ఒక్కమాటలో చెప్పాలంటే 'తత్వమసి' సారం చాందోగ్యం అని,

మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు, సాధన అంతరంలో చేయాలని తెలిపేది, 'అహం బ్రహ్మాస్మి' అనే సిద్ధాంతం ప్రతిపాదించేది బృహదారణ్యక ఉపనిషత్ అని...
ఈ మూడు ఉపనిషత్తుల గురించి అనర్గళంగా మాట్లాడగలరు.

భగవద్గీత, కపిల గీత, ఋభు గీత... వీటిలో ఏ సందేహం అడిగినా, అడిగిందే తడవుగా, తడబడకుండా తడుముకోకుండా చెప్పగలరు.

రామాయణం, భారతం, భాగవతం, యోగ వాసిష్టం ల గురించి విపులంగా వివరించగలరు. నాకు ఏ సందేహం వచ్చిన ముందుగా కాల్ చేసేది తనకే. అలాంటి ఆమెలో ఏదో నిరాశ, బాధ, నిర్లిప్తత. ఉత్సాహమనేది కనిపించదు. కొంతకాలం తర్వాత ఒకానొక సందర్భంలో వ్యక్తమయ్యారు.

నేను ఈ సత్సంగముకు రాకముందు ధ్యాన తరగతులకు వెళ్ళేదానిని. అక్కడ ఓ అరగంట ధ్యానం గురించి చెప్పి, ఆ తర్వాత ఓ గంట నిటారుగా కూర్చొని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమనేవారు. ఆలోచనలు వస్తే, ఆ ఆలోచనలు వెంబడే వెళ్ళిపోకుండా, ఆ ఆలోచనలను కట్ చేసి వెనక్కి వచ్చి శ్వాస మీదే దృష్టి పెట్టండని చెప్పేవారు. ఆ తర్వాత మరో గంట ధ్యాన అనుభవాలు చెప్పమనేవారు. సప్త ఋషులు కనిపించారని, నీటి ప్రవాహం నెత్తి మీద పడి ప్రవాహంతో సాగిపోతున్నానని, గాలిలొ తేలిపోతున్నానని... ఒకటని ఏముందీ... ఎన్నో అనుభూతులు... అక్కడి సాధకులవి. 
ఒకరోజు మాష్టారు గారు నన్ను అడిగారు...ఎప్పుడూ మీ అనుభూతులు చెప్పరేమని? 'కదలకుండా కూర్చోవడమే కష్టంగా ఉంది. వీపు నొప్పి వస్తుంది. ఆలోచనల వెంబడి పరుగులు తీస్తున్న మనస్సును శ్వాస మీద పెట్టడం... మరల ఆలోచనలు... వెనక్కి రావడం... ఇదో ఆటలా ఉంది తప్ప, ఏ అనుభూతి లేద'ని చెప్పేను. దాంతో అందరూ నన్ను ఏదోలా చూసారు. మీరు ధ్యానంకు పనికిరారు. నిటారుగా కూర్చోలేరు. మీకు గూని ఉంది. ధ్యానం ద్వారానే ముక్తి వస్తుంది. ఈ జన్మలో మీకు ముక్తి రాదు. మరు జన్మలోనైనా ఈ వైకల్యం లేకుండా పుట్టించమని దైవాన్ని వేడుకోండి. రేపటి నుండి క్లాస్ కు రాకండి అని చెప్పేసారు. నాకు ముక్తి రాదు, ధ్యానం కుదరడం లేదు. నా గూనే నాకు అవరోధం. నా వైకల్యమే నాకు శాపం...అంటూ ఏడ్వడం ప్రారంభించారు.


ఆశ్చర్యం....ఒక ప్రతికూల భావం అన్నీ తెలిసిన ఆమెను మాయలా కమ్మేసింది కదా.

ఏదైనా చదివిన, విన్నా... దానిని ఒక విజ్ఞానంగా మెదడులో నిక్షిప్తం చేసుకుని అక్కడే ఆగిపోతే, అది ఓ జ్ఞాపకంలా మాత్రమే నిలిచిపోతే...మాటలు నేర్చిన చిలుకలా పలకడానికే ఆ విజ్ఞానం పనికి వస్తుందని జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలు ఉదహరిస్తూ ఒకరు చెప్పిన చిలుక కథ చెప్పనా -

ఒకానొక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక తన పిల్లలతో వుండేది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోననీ, భయపడి, ఒకరోజు రెపరెపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్నిచూసి, పిల్లల్లారా! రండి, మీకొక సత్యాన్ని పాటగా నేర్పిస్తాను అంది సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు...

వేటగాడొస్తున్నాడు జాగ్రత్త.
గింజలు ఎరగా విసురుతాడు జాగ్రత్త.
వలవేస్తాడు జాగ్రత్త.
పట్టుకుంటాడు జాగ్రత్త.
మెడ విరిచేస్తాడు జాగ్రత్త.

అనే పాటనేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు రమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు, అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఒకనాడు ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త... అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చాటున నక్కి, పోనీ గింజలు విసిరి చూద్దామనుకొని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త... అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త... అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు ........ అంటూనే చచ్చిపోయాయి.

చూసారా... ఆ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని అవగాహన చేసుకోలేదు, ఆచరణలో పెట్టలేదు.

మనమందరము కూడా, అలానే వున్నాము. తెలుసుకున్న సత్యాన్ని జీవితంలో ప్రవేశపెట్టడమే ఆచరణ. తెలుసుకున్న సత్యాలను ఆచరణలో పెట్టకపోతే, తెలుసుకొని ప్రయోజనం ఏముంది? ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృథాయే కదా!

ఇక ధ్యానమంటారా... కొందరు నిటారుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతారు. కొందరు పద్మాసనం వేసుకొని చేస్తారు. సుఖాసనం అని పంతజలి చెప్పారు. ఆటంకం కలిగించని, ఎవరి సౌలభ్యం కొద్దీ వారు కూర్చోవచ్చు. ఒత్తిడికి గురైన భంగిమలో ధ్యానం చేయడం వల్ల శరీరం యొక్క అసౌకర్యంపై మనస్సు నిలిచిపోతుంది. ఏకాగ్రత కుదరదు. కూర్చోవడం ధ్యాన ముద్ర. శ్వాస మీద ధ్యాస పెట్టడం ధ్యాన నిష్ఠ. ఇవి ధ్యాన ప్రక్రియలు. అయితే ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చొని, రోజంతా మనకు నచ్చేలా ఉండడం ధ్యానం కాదు.


నిరంతరం ఎరుక లో ఉండడం ధ్యానం. చేస్తున్న ప్రతీ పనినీ ఎరుకతో చేయడం ధ్యానం. ధ్యానం యొక్క అంతిమ గమ్యం సాక్షితత్వమే.

గూని... ఇది ఓ చిరు శారీరక లోపం మాత్రమే. ఒకటి గుర్తించండి... శారీరక వైకల్యాలు ఎప్పుడూ ప్రాపంచికంగానైనా, పారమార్ధికంగానైనా మన లక్ష్యాలకు అడ్డు కావు. ప్రాపంచిక పరంగా ఉదాహరణలు చూస్తే -

అరుదైన వ్యాధితో వచ్చిన పూర్తి పక్షవాతం చక్రాల కుర్చీలో కుదేసినా, మాట పెదవి దాటలేనంతగా వైకల్యం కుదిపేసినా, కృత్రిమ పరికరంతోనే విశ్వాంతరాలను శోధించి, కృష్ణబిలాలు, వర్క్హోల్స్, క్వాంటమ్ మెకానిక్స్, టైమ్ ట్రావెల్... అంటూ, శాస్త్ర ప్రపంచాన్ని కుదిపేసే సిద్ధాంతాన్ని వెలువరించిన మహా శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ గురించి విన్నాం కదా.

పుట్టుకతోనే చేతులు లేని జర్సికా, కాళ్లతో విమానం నడిపిన ఏకైక పైలెట్ గా గిన్నిస్ రికార్డు సాధించారు కదా.

1981 జూన్ నెలలో తమిళనాడులోని త్రీచీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినా, కృత్రిమ కాలితో నాట్య ప్రదర్శనలు ఇచ్చి, వందలాది అవార్డులను అందుకున్న నాట్య మయూరి సుధాచంద్రన్ గురించి అందరికీ తెలుసు కదా.

వాలీబాల్, ఫుట్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఉత్తరప్రదేశ్ అంబెద్కర్ నగర్ కు చెందిన అరుణిమా సిన్హా, 2011 ఏప్రిల్ లో జరిగిన ఓ ఘటన కారణంగా తన కాళ్లను కోల్పోయినా, కృత్రిమ కాళ్ళు అమర్చుకుని, ఎవరెస్టు శిఖరం ఎక్కాలని నిశ్చయించుకుని, 2013 లో పట్టుదలతో 52 రోజులపాటు ఎముకలను కొరికేసే చలిలో సైతం ప్రయాణించి, శిఖరాగ్రాన్ని చేరారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన వికలాంగ మహిళగా అరుణిమ చరిత్రకెక్కారు కదా.

3 సంవత్సరాల వయస్సులో అంధుడిగా మారిన లూయిస్ బ్రెయిలీ అంధులు చదవగలిగే వ్రాయగలిగే లిపిని కనుగొనలేదా?

పారమార్థిక పరంగా చూస్తే -
ఏడు గుర్రాలున్న రథంపై నిరంతరం సంచరిస్తూ, అఖిల జగాలకూ వెలుగునిచ్చే మహత్కర్యాం నిర్వర్తిస్తున్న సూర్యుని రథ సారథి ఎవరు? కాళ్ళు, తొడలు లేని సమర్ధుడైన అనూరుడు కాదా?

అంధత్వం కలిగిన భక్తిపూర్వక కీర్తనలతో సూరదాసు కృష్ణ పరమాత్మను సాక్షాత్కారింప జేసుకోలేదా?

కాళ్ళు చేతులు లేని కూర్మదాసు అనే పాండురంగ విఠల భక్తుడు పండరీపూర్ సందర్శించాలని తలచి, దృఢ చిత్తంతో నాలుగు నెలలు రోడ్డుపై పాకుకుంటూ బహుల ప్రాంతం చేరుకొని, ఇక కదలలేక విఠలునే ప్రార్ధించగా, భక్తునికై విఠలుడే కదిలి రాలేదా? భక్తుని కోరిక మేరకు అక్కడ విగ్రహంలా వెలియలేదా?

ఎనిమిది అంగ వంకరలు కలిగిన అష్టావక్రుడు బ్రహ్మర్షి కాలేదా?


ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం శరీరానికే గానీ; మనసుకు కాదంటూ చాటిచెప్పిన మహర్షులు, మహా భక్తులు, మహానుభావులు ఎందరో కదా🙏
నిజం చెప్పాలంటే, ఆలోచనా వైఫల్యమే వైకల్యం. ఆచరణా వైఫల్యమే వైకల్యం.

ఆఁ అన్నట్లు అష్టావక్రుడు అంటే గుర్తుకు వస్తుంది. ఒకనాడు మా తాతయ్య గారు (నాలో ఆధ్యాత్మికత పట్ల అభిరుచి, అవగాహనలకు బీజం వేసిన గురువర్యులు) చెప్పిన విషయం -

ఒకసారి ఎందరో పండితులు, వేదాంతవేత్తలు, తత్వవేత్తలుతో జనక మహారాజు ఏర్పాటు చేసిన పండిత మహాసభకు వచ్చిన అష్టావక్రుడును చూసి సభలో వారంతా నవ్వగా, వారందర్నీ చూస్తూ, అష్టావక్రుడు కూడా బిగ్గరగా నవ్వెను. కొంతసేపటికి నవ్వులు సర్ధుమణిగాక, "మిమ్మల్ని చూసి సభలో వారంతా నవ్వినందుకు అందరి తరుపున క్షమాపణలు చెప్పుకుంటున్నాను. వారంతా ఎందుకు నవ్వారో అర్థమైంది కానీ, మీరు అంత బిగ్గరగా ఎందుకు నవ్వారో అర్థం కావడం లేదు. మీ నవ్వుకు కారణం తెలియజేయగలరా" అని వినయంగా జనక మహారాజు అడిగెను. అంతటా అష్టావక్రుడు జనకుడితో, "ఈ సమావేశం జ్ఞాన కోవిదులు, వేద పండితులు మరియు తత్వవేత్తల కోసం అని నేను అనుకున్నాను. వారిని దర్శించుకుని తరిద్దామని వచ్చాను కానీ; వీరందరూ అజ్ఞానులు. వీరికి భౌతిక దృష్టే తప్పా, ఆత్మ దృష్టి లేదు. వీరంతా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ శరీరం లోపల వెలుగులీనుతున్న ఆత్మను దర్శించలేకపోతున్నారు. ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన అందులోని ప్రతిమ వంకర తిరిగి ఉంటుందా? వీరంతా దేహాత్మ భావనలోనే ఉన్నారు. బాహ్యదృష్టే తప్ప అంతర దృష్టి అలవడలేదు. వారికి పైకి కనిపించే చర్మమే తప్ప, దాని వెనక ఉన్న తేజోమయమైన ఆత్మతత్వం అవగతం కాలేదని అర్థమైంది. పుస్తక పాండిత్యమే తప్ప, అనుభవ జ్ఞానం లేని అజ్ఞానులను చూసి అందుకే నవ్వెన"నెను.



శాస్త్ర జ్ఞానంతో వెలుతురు పుట్టించవచ్చు. అనుభవ జ్ఞానమే నీలో అంధకారాన్ని తొలగిస్తుందని అంటారు స్వామి మైత్రేయ.

ఆధ్యాత్మిక ఆకాంక్షలు, శాస్త్రపరిజ్ఞానం ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి. మనం తెలుసుకున్న వాటిని మన జీవితంలో ఆచరించగల్గినప్పుడే అందులో మహా సత్యాన్ని అనుభూతి చెందగలం.

ఇక ముక్తి -
అన్నింటి నుంచి విముక్తం చేసేదే ముక్తి. ఇది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతుంది. ఎవరి యోగ మార్గం వారిది. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి సాధనా విధానం వారికి సరైనది. ఇది తప్పు కాదు. ఒక గమ్యానికి వెళ్ళినప్పుడు అన్ని దిశల నుండీ ఎన్నో దారులుంటాయి. ఏ దారిలో వెళ్ళినా, గమ్యస్థానం చేరగలం. ఎన్నో వాహనాలు... ఏ వాహనం మీద వెళ్ళినా, గమ్యం చేరుకోగలము. అల్లోపతీ, ఆయుర్వేదం, హోమియోపతీ, మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం, ఆక్యుపంచర్, ఫిజియోథెరఫీ... వైద్యవిధానాలు ఏవైనా, రోగికి స్వస్థత చేకూర్చేందుకే. వారి వారి శరీరతత్వం బట్టి, విశ్వాసం బట్టి వైద్య మార్గం అనుసరిస్తారు. ఒక వైద్య విధానముతో లొంగని రోగం మరొక విధానముతో తగ్గవచ్చును.

అలానే ముక్తే గమ్యమైనప్పుడు, అక్కడికి చేరడానికి ఎన్నో మార్గాలను కృష్ణ పరమాత్మ, ఋషులు తెలిపారు. కొందరు వేద మార్గంలో, కొందరు క్రియాయోగ మార్గంలో, కొందరు ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో..... ఇలా పలు మార్గాలు. ఎవరి విశ్వాసం బట్టి వారు ఆ మార్గంలో వెళ్తారు. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.

మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. మన ప్రవర్తన మన ఆలోచన విధానాలే మనం వ్యక్తి నుండి శక్తిగా ఎదగడానికి దోహదపడుతాయి. కొన్నిసార్లు ఎక్కడా దొరకని ప్రశాంతత, మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. అంతేగానీ, చిత్తాన్ని చంచలం చేసుకుంటే దాని ఫలితంగా లక్ష్య సాధన సిద్ధించదు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే.

దృఢసంకల్పానికి ఏకాగ్రత, విశ్వసనీయత తోడైనప్పుడు, ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింప జేయాలన్న లక్ష్యం భగీరథుడిది. అకుంఠిత దీక్షతో దివి నుంచి భువికి గంగ దిగి వచ్చేలా చేశాడు.


ఎవరు ఏమైనా చేయనీ, ఎన్నైనా చెప్పనీ, మనదృష్టి మన లక్ష్యంపై మాత్రమే వుంటే, మనం మనతోనే విశ్వాసంగా వుంటే, మనం సాధించాలనుకున్నదాన్ని ఎవ్వరూ ఆపలేరు! తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తిమార్గాన్ని వీడలేదు.

దారిలో నది అడొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు - నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులోస్తే ఆపాల్సింది పని కాదు - ప్రయత్నించే పద్ధతి.

బాహ్య సంఘటనలకి ఉద్రేక పడకుండా నిలకడగా మనసును జాగ్రత్తగా ఉంచుకోవడమే సాధన. అలానే మనం చేసే సాధనలన్నీ ఆత్మను పొందటానికి కాదు, శరీరం నేను కాదు అని తెలుసుకోవటానికే.


శరీరం దైవదత్తం - మనసు మానవ కల్పితం
బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్ష సిద్ధి తధ్యం.
                                                   - స్వామి మైత్రేయ


తను గురించి, తనలా ఆలోచించేవారి గురించి మీరు మాట్లాడుకున్నది బాగుంది. కానీ, నాకు ధ్యానం కుదరదు, జ్ఞానం నా ఊహకు అందని పదం. కర్మ చేయడమే తప్ప, కర్మ ఫలత్యాగం అంటే అర్థం కాదు. నాకు తెలుసిందంతా ఒకటే...ఉదయం దైవ స్మరణతో లేవడం, స్నానాదికాలు అయ్యాక దైవాన్ని పూజించడం,  పనులు చేసుకుంటూ, మధ్య మధ్యలో నేను నమ్మిన దైవాన్ని తలుచుకోవడం, రోజు చివరలో అంటే పడుకునేముందు, నేను ఈరోజు నా మాట చేతలతో చేసే పనులలో తప్పున్నా, ఒప్పున్నా నన్ను మన్నించు అని మనస్సులో దైవం ముందు సాగిలపడడం తప్పా, ఏ శాస్త్ర పరిజ్ఞానం లేని నాకోసం ఏం చెప్తారని అడిగిన మరొకామెకు నా సమాధానమిదే -


31, అక్టోబర్ 2024, గురువారం

కాదేదీ కబుర్లకనర్హం - 2




అనే టపాలో చెప్పినట్లుగా కర్మల బట్టే జన్మ ఉంటుందని, కర్మల ఫలితం అనుభవించక తప్పదని, ఎవరి కర్మలకు వారే బాధ్యులని...ఇత్యాది విషయాలు గురించి మాట్లాడుకుంటుండగా...

రాముడు ఎక్కువ కష్టాలు పడ్డాడా? కృష్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డాడా...అకస్మాత్తుగా అడిగిన పద్మగారి ప్రశ్నతో, అంతా ఒక్కసారిగా మౌనమవ్వగా, అదే దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయా అనే పాటలో "నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా" అని విన్నప్పుడంతా, నాకీ సందేహం వస్తుంది. మరల మనమంతా ఎప్పుడు కలుస్తామోనని అష్టావధానంలో అప్రస్తుత పృచ్చకునిలా అడిగేసాను... ఏమనుకోకండి అని అన్నారు పద్మగారు కాస్త తడబాటుతో.

శ్రీరాముని గురించి చెప్పాలంటే - 
శ్రీరాముని జననం, తన తల్లితండ్రులతో సహా అందరూ ఆనందకరంగా ఎదురుచూస్తున్న సమయంలో అంతఃపురంలో జరిగింది. అందరి ఆలనాపాలనలో అల్లారుముద్దుగా పెరిగిన బాల్యం. చక్కటి విద్యాభ్యాసం. సుమారుగా పదహారవ యేట మొదటిసారి రాక్షస సంహారం చేసి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని పూర్తి చేయించడం, ఆపై మిథిలానగరానికి వెళ్ళి శివధనస్సు విరిచి, అందరి ఆమోదయోగ్యంతో సీతాదేవిని వివాహమాడడం... ఇప్పటివరకు అంతా ఆనందకరమే. అటుపై పట్టాభిషేకం అనుకున్న సమయంలో పినతల్లి స్వార్థానికి ఆ ముహూర్తానికే అడవుల బాటపట్టాడు. తోడుగా భార్య, తమ్ముడు లక్ష్మణుడు. తండ్రిని పోగొట్టుకున్నాడు. అరణ్యవాసం తన తండ్రికి ఇచ్చిన గౌరవంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. మొదట పదమూడేళ్ళు ఋషి నియమాలను పాటిస్తూ, ప్రకృతిలో మమేకమై చెట్లను పుట్లను చూస్తూ, వన్య ప్రాణులతో చెలిమి చేస్తూ, సెలయేర్లు సవ్వళ్లును ఆస్వాదిస్తూ, ఎంతో ఆనందంగా హాయిగా గడిపారు. చివరి ఏడాది తోడుగా ఊరటగా నిలిచిన భార్యకు దూరమయ్యాడు. కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెలో మోస్తూనే రాక్షసవధ చేశాడు. తిరిగి అయోధ్య వచ్చి ఎన్నో వేల సంవత్సరాలు ఆనందంగా అద్భుతంగా పరిపాలన చేశాడు. రాముని జీవితకాలం 11000 సంవత్సరాలు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ...దశవర్ష శతానిచ అని విడిగా చెప్పడానికి కారణం సీతమ్మ భూమి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అని పెద్దవారు చెప్పగా విన్నాను. అంటే వివాహ అనంతరం ఒక్క యేడాది మినహా ఇద్దరు కల్సి ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నారు. 1001 సంవత్సరాలు సీతమ్మతో ఎడబాటు...దుఃఖ భారం. ఇక  లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా, తాను మాత్రం అహం దశరథాత్మజః... దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమేనని ప్రకటించాడు. మాయలు మంత్రాలు చూపించలేదు. విశ్వరూపం ప్రకటించలేదు. అందరిలాగే ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. సాధారణ మనిషి ఎన్ని ఇబ్బందులు పడతాడో అన్ని యిబ్బందులు పడ్డాడు కానీ, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. నరుడు నారాయణుడు ఎలా కాగలడో జీవించి చూపాడు.

ఇక కృష్ణుడు విషయానికి వస్తే - 
తల్లితండ్రుల ఆవేదన నడుమ జననం. పుట్టక ముందే సంహరించాలనే మేనమామ పథక రచన. కారాగారమే జన్మస్థలం. ఆదినుండి అడుగడుగునా గండాలే. ఏ పసివాడూ అనుభవించనన్ని కష్టాలు. పుట్టిన క్షణాల్లోనే తల్లితండ్రులకు దూరం. పెరిగింది ప్రమాదకర పరిస్థితులలో. అనుక్షణం గడిపింది ప్రాణాపాయకర విపత్తులలో. హతమార్చాలని నలుదిక్కుల నుండి అసుర గణాలచే దాడి చేయిస్తున్న మేనమామ. పాలుత్రాగే ప్రాయంలోనే  పూతన, ఆపై శకటాసురుడు, తృణావర్తుడు... ఒకరని ఏముంది... ముప్పైకి పైగా అసురదాడులు... బాల్యమంతా జీవన్మరణ పోరాటమే. ఆపై మధురకు వెళ్ళడం, కంసున్ని సంహరించడం. ప్రతీ వివాహం అనేక యుద్ధ సంఘర్షణల నడుమే జరగడం. కష్టాలతో కూడిన ఎన్నో ఘట్టాలు, ఎన్నో గండాలు, ఎన్నో నిందలు, ఎన్నో కుట్రలను ఎదుర్కోవడం, తప్పు లేకున్నా గాంధారి శాపం స్వీకరించడం, జీవితం మొత్తం విషాదమయం. చరమఘట్టంలో తనవారంతా ఒక్కొక్కరుగా కొట్టుకొని దుర్మరణం పాలవుతుంటే, కళ్ళారా చూస్తూ, నిర్వికారంగా కదిలివెళ్ళి సాధారణ వేటగాని బాణం దెబ్బకు అవతార పరిసమాప్తం చేయడం. జీవితంలో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని, దేనికీ ఎవరికీ అంకితమవ్వక సాగించిన జీవితం.  ఒక్కమాటలో చెప్పాలంటే, కుదురుగా ఉండనివ్వని పరుగు పందెంలా సాగే జీవనం కృష్ణుడిది. అయినా ఏ క్షణంలోనూ సమ్మోహనకరమైన చిరునవ్వు వీడని చిద్విలాసుడు. లీలామానుష విగ్రహుడు. దార్శనికుడుగా యుద్ధవీరుడిగా, తాత్వికుడిగా, రాజనీతిజ్ఞుడిగా  వ్యూహకర్తగా కనబడతాడు. 
ఈ రెండు అవతారాలను పరిశీలిస్తే, శ్రీరాముడు కంటే శ్రీకృష్ణుడే ఎక్కువ కష్టాలు పడినట్లు నాకు అనిపిస్తుందని అన్నాను.

అయితే రాముని కంటే కృష్ణుడే గొప్ప అన్నమాట... ఇది పద్మగారి ఉవాచ. 
వెంటనే అలా ఎలా చెప్పగలరు పద్మగారు? శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడే గొప్పయని కొందరు... లేదు లేదు శ్రీకృష్ణుడే గొప్పయని మరి కొందరు. అక్కడున్న వారంతా రెండు వర్గాలుగా విడిపోయి చమత్కారంగా వాగ్వివాదంకు దిగారు.

కృష్ణ వర్గం : నేటికీ భగవద్గీత అంతటా అందరిచే ఆదరింపబడుతుందంటే, ఆదర్శవంతంగా నిలబడిందంటే అది మా కృష్ణుని గొప్పతనం.

రామ వర్గం : ఆహా...ఇప్పటికీ రామరాజ్యం కావాలని, వస్తుందా...మనం చూడగలమా... అని కోరుకుంటున్నామంటే, అదీ మా రాముని గొప్పతనం. 

కృష్ణ వర్గం : ఓహో... మా కిట్టయ్య పసిప్రాయం నుండే పూతనాది రాక్షసులను సంహరించాడు. మరి మీ రాముడో, యుక్తప్రాయం అంటే పదహారు ఏళ్ళు వచ్చేక తాటకిని సంహరించాడు. పుట్టినప్పటి నుండే దుష్టశిక్షణ చేయనారభించిన మా కిట్టయ్య మీ రాముని కంటే గొప్పవాడమ్మా.

రామ వర్గం : అబ్బో... బాల్యం నుండే వెన్న దొంగలించడం, అత్తా కోడళ్ళు మధ్య తగాదాలు పెట్టడం, మాయలు చేయడం...అన్నీ తుంటరి చేష్టలే. ఇత్యాదివి మీ మాయావికి చేతనయినట్లు మా మర్యాద పురుషోత్తమునికి రావు లేమ్మా.  అయినా దరిజేరిన పూతనను స్త్రీ అని ఆలోచనైన లేకుండా వెన్వెంటనే సంహరించాడు. అదే మా రామయ్యో ... తాటకిని చూడగానే ఒక్కక్షణం తటపటాయిస్తూ ఆగేడు. గురువుగారు చెప్తే తప్ప, తాటకి మీద బాణాలు వేయలేదు. స్త్రీ అని జాలి చూపాడమ్మా... ఇదీ మా రాముడంటే. 

కృష్ణ వర్గం : మీ చోద్యం బంగారం కానూ... మీ రామునిలా తటపటాయింపులు తగ్గడాలు మాకృష్ణునికి తెలియవమ్మా...అంతా స్ట్రెయిట్ ఫార్వర్డ్... అవతరించిందే దుష్టశిక్షణ కోసం. అందుకే ఏ అవకాశం ఇవ్వకుండా చిన్ననాటి నుంచే రాక్షసవధ కావిస్తూ, భూభారాన్ని తగ్గించాడు. ఇప్పుడు చెప్పండి, మా కిట్టయ్యా గొప్పా? మీ రామయ్య గొప్పా? 

రామ వర్గం : చాలమ్మా సంబడం... కొన్ని క్షణాల్లోనే ఖర దూషణాది పద్నాలుగు వేల రాక్షసులను చంపిన పరాక్రమవంతుడు మా రాముడు. అయినా
మా రాముని ఔదార్యం మీ కృష్ణునికి ఎక్కడ? ఒకరోజు యుద్ధంలో రావణాసురుని అస్త్రాలను నిర్వీర్యం చేసి, రథాన్ని కూల్చి, నేల మీద నిలబెట్టాడు గానీ, సంహరించలేదు. "రావణా!  వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకొని, బలాన్ని సమకూర్చుకుని, ఆయుధాల్ని సిద్ధం చేసుకొని రేపు రా" అని, అవకాశం ఇచ్చిన ధర్మ ప్రభువు మా రాముడు. నిస్సహాయ స్థితిలో వున్న శత్రువు పట్ల దయ జాలి చూపించడం, అవకాశం వచ్చినా, శత్రువు అధర్మంగా ప్రవర్తించినా తను నిగ్రహం కొల్పోక, ధర్మానికే విలువనిచ్చి, సంయమనంతో వ్యవహరించడం రామునికే చెల్లింది. ధర్మమే పాటించని మీ కృష్ణునికంటే మా రాముడే గొప్పవాడు. 

కృష్ణ వర్గం : అవునవును...అందుకే కదా...రావణాసురుడిని చంపకుండా అవకాశమిచ్చి పంపడం వలన మరిన్ని ఉపద్రవాల్ని తెచ్చుకున్నది. రావణుడు సంధించిన ఓ అస్త్రానికి లక్ష్మణుడు  మూర్చల్లగా, హనుమంతుడు ఔషది పర్వతాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అవకాశం ఇవ్వకుండా ఉంటే అప్పుడే అంతా అయిపోయేది. అదే మా కృష్ణుడైతే అవకాశం ఇవ్వకుండా దుర్మార్గులను సంహరించడమే.  శిష్టరక్షణ చేయడమే మా కన్నయ్య ధ్యేయం. ఇక ధర్మ ప్రభువు అయిన మీ రామయ్య సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించడం, గర్భవతిగా ఉన్న తనని అడవిలో విడిచిపెట్టడం తగునా? 
రామ వర్గం : చాలు చాలు... చాలించండి మీ మాటలు. వాల్మీకి రామాయణంలో ఏముందో ముందు తెలుసుకోండి. రావణ వధ అనంతరం దగ్గరకు వచ్చిన సీతమ్మను చూసి, అనేకం మాట్లాడుతూ, చివరగా నీవు ఇప్పుడు స్వతంత్రురాలివి. నీవు నీకు నచ్చిన చోట ఉండవచ్చు. నీవు ఇక్కడ ఉన్న  విభీషణుడు దగ్గరగానీ, సుగ్రీవుడు దగ్గరకు గానీ, లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు దగ్గరకు గాని...నీకు నచ్చిన చోటకు వెళ్ళి ఉండమని అనగా, కోపంతో సీతమ్మ, ఒక పామరుడు ఒక పామర స్త్రీతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని.....అని అనేక మాటలు పలుకగా, ఊ...నేత్రరోగికి దీపంలా నాకంటికి ఇబ్బంది కల్గిస్తున్నావు ..... అని అనెను మా రామయ్యతండ్రి. 
రాముని మాటల్లో ఎంత ఔన్నత్యం ఉందో సూక్ష్మ రహస్యముందో గ్రహించండి. అక్కడ రామ లక్ష్మణులు తప్ప ఉన్నవారంతా వానరులు, రాక్షసులు. వాలి సుగ్రీవుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు, రాక్షసుల పద్ధతి అంతే... రాక్షసుల వానరుల నీతి అలా ఉండేది. వారు గానీ, లేదా మున్ముందు మానవజాతి గానీ సీతమ్మపై ఎటువంటి అపవాదం చేయకూడదని, సీతమ్మ పాతివ్రత్యం అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత తనపై ఉండడంతో అలా నర్మగర్భంగా మాట్లాడెను. పైగా ఏ కారణం చేతనైనా భర్త దగ్గర లేనప్పుడు ఆ స్త్రీ తన బిడ్డల చెంత గానీ, పుట్టింట గానీ, అత్తింట గానీ ఏదైనా తనకి సురక్షిత ప్రాంతంలో ఉండడం మంచిది. అందుకే పరమ భక్తులైన తండ్రి సమానులైన సుగ్రీవ విభీషణుల దగ్గర గానీ, పుత్ర సమానులైన లక్ష్మణ భరత శతృఘ్నల దగ్గరగాని సురక్షితంగా ఉండమని సూచన చేసేను. ఆపై మాట్లాడుతూ నీవు దీపం లాంటిదానివి, స్వచ్చమైనదానివి కానీ, లోకాపవాదం అనే నేత్రరోగం నాకు వచ్చింది. అందుకే నేను నిన్ను చూడలేకపోతున్నాను అనెను. అంతట సీతమ్మ భర్త మనసెరిగి, పరాయివాని చెరలో కొంతకాలం ఉండి వచ్చిన నన్ను రాముడెలా స్వీకరించాడన్న లోకాపవాదు రాకూడదని, రాక్షస చెరలో పది మాసాలు ఉన్నప్పటికీ, కొందరికి మాత్రమే తెలిసిన (సుందరకాండలో హనుమంతుని తోకకు నిప్పు పెడితే, అది తెలిసిన సీతమ్మ, “ఓ అగ్నిహోత్రుడా! నేను పతిసేవ చేసి ఉన్నట్లయితే, నేను తపస్సు చేసి నిరంతరం రామ ధ్యానం చేసింది నిజమైతే, నేను పతివ్రతను అయివున్నట్లయితే, నేను భాగ్యవంతురాలను అయి ఉన్నట్లయితే రాముడు నన్ను కలుసుకోవలెను అనుకుంటున్నట్టయితే  హనుమంతుడి తోకను దహించక చల్లగా చూడు" అని ప్రార్ధించగా... తోకపై మంచు రాసినట్లు మంట చల్లబడిన ఘటనలో ఆమె ఎంత పవిత్రురాలో హనుమకు, హనుమ ద్వారా రామ లక్ష్మణ సుగ్రీవ తదితర కొద్ది మందికి తెలుసు) తన పవిత్రతను అందరికీ నిరూపించాల్సిన బాధ్యత తనదేనని గ్రహించి, 'లక్ష్మణా! చితిపేర్చు అని అగ్నిప్రవేశానికి తనకి తాను సిద్ధమయ్యేను. అంతేగానీ, రాముడు అగ్నిప్రవేశం చేయమనలేదు. అయితే రాముడు ఆపకుండా, ఆమె చెప్పినట్లు చేయమని లక్ష్మణుడికి సంకేతమివ్వడమేమిటి అని మీరు అనవచ్చు. కానీ, సీతారాముల ఇరువురికీ తెలుసు... సత్యవంతురాలు పవిత్రమయి అయిన సీతను అగ్ని కాల్చలేదని. లోక అపవాదు లేకుండా నిరూపించుకోవడానికి ఇదే సరైనదని.

అయినా చాలా ఏళ్ళ తర్వాత అయోధ్య ప్రజలు అపవాదు తప్పలేదు. సీతమ్మ గర్భవతి అయ్యాక ఆమె ఋష్యాశ్రమంకు వెళ్ళాలని ఉందని కోరుకోవడం, అదే సమయంలో ప్రజల అపవాదు... తత్ఫలితంగా ప్రజా రక్షణ, ప్రజాభిప్రాయం గౌరవించడం, వ్యక్తి ధర్మం కంటే రాజ ధర్మం ముఖ్యం అనే ధర్మానుసారం సీతమ్మను వాల్మీకి ఆశ్రమం దగ్గరలో విడిచిపెట్టమని ఆజ్ఞాపించెను. ఇక్కడ ఓ విషయం గుర్తించండి. ప్రజలు ధర్మమార్గంలో ప్రవర్తించడం గురించి ఎంత ఆలోచించాడో, సీతమ్మ కోరిక మేరకు ఆమెకు ఋష్యాశ్రమం ప్రాప్తమయ్యేటట్లు చూసాడు. అంటే మా రాములోరు అటు రాజా రామునిగా, ఇటు సీతారామునిగా ధర్మమార్గంలో నడిచారు. 

లోతైన ధర్మగతిని లౌకిక దృష్టి గ్రహించలేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ; ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తియని లోకమంతా ఇన్ని యుగాలు తర్వాత కూడా గొప్పగా చెప్పుకుంటుంది.
ఇక మీ కృష్ణులవారో...ధర్మాన్ని తప్పి ద్రోణాచార్యుడుని, కర్ణుడిని సంహరించేలా చేయలేదా? ఇప్పుడు చెప్పండి సఖులారా! ఎవరు గొప్పో? 

కృష్ణ వర్గం : ఓహో.....ధర్మ సూక్ష్మాలు మీకూ, మీ రాములోరికేనా... మాకూ ఎఱుకే. మీ ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి. నగలు సొమ్ము మూట కట్టుకుని పారిపోతున్నారు. వారిని పట్టుకోవడానికి మీరు  తరుముకుని వెళ్తున్నారు. దొంగలు సందుల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వారిని పట్టుకోవాలని వెంబడిస్తున్న మీరు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగలను పట్టుకోవాలంటే వారిని అనుసరిస్తూ, వారు వెళ్ళిన మార్గంలోనే మీరూ వెళ్ళాలి కదా.
సరిగ్గా ద్వాపరయుగంలో ఇదే జరిగింది. ధర్మవిరుద్ధంగా వెళ్ళేవారిని అదే మార్గంలో వెళ్ళి శిక్షించడం జరిగింది.
ద్రోణాచార్యుడు గురువు అయి వున్నందున యుద్ధం
చేయరాదు. రెండు వైపులా న్యాయం చెప్పాలి. మంచి చెడులను వివరించాలి. అంతే గానీ ఆయుధాలు పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం. అలానే బ్రాహ్మణుడు అయివుండి సాత్త్విక గుణం కంటే మెండుగా రజోగుణం కలిగి ఉండడం, స్నేహితుడు ద్రుపదుడుపై ప్రతీకారం, దృతరాష్ట్రుడు మాదిరిగా కాస్త పుత్రప్రేమతో అధర్మవర్తనం, ద్రౌపది వస్త్రాపహరణ సమయమందు అధర్మాన్ని నిలువరించకపోవడం... ఇవి ద్రోణాచార్యునికి తగునా? ఇది అధర్మం కాదా? అందుకే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు "అశ్వత్థామ హతః" అని పెద్దగా చెప్పి, "కుంజరహః" అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతోనే జయించాలి, తప్పదు. ఏ కార్యమైనా లోక కళ్యాణానికే చేయించాడు.
ఇక కర్ణుడు - 
కర్ణుడి రథచక్రం భూమిలో దిగిపోవడంతో, రథం దిగి దాన్ని సరిచేస్తున్న సమయంలో, శ్రీకృష్ణుడు వెంటనే కర్ణున్ని చంపమన్న ఆదేశం ఇవ్వడంతో అర్జునుడు కర్ణునిపై బాణాలు సంధిస్తుండగా, నిరాయుధుడుపై బాణాలు సంధించడం ధర్మమేనా... ఇత్యాది ప్రశ్నలతో కృష్ణా! నీవే ఆజ్ఞాపిస్తున్నావా..... ధర్మం నన్నెందుకు రక్షించడం లేదని ప్రశ్నించగా - 

 

కర్ణా! ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మం వదిలిపెట్టడం వలనే నేడు ఈ పరిస్థితి వచ్చింది. నిన్ను అంగరాజు చేశాడన్న ఒకే ఒక కారణంతో ధర్మహీనుడైన దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి ఏదైనా చేస్తాను, మాట్లాడతాను అన్నట్లు ప్రవర్తించావు. ఎన్ని తప్పు పనులు చేశావో, తప్పు పనులు చేయడానికి ప్రోత్సహించావో గుర్తుతెచ్చుకో. దురాభిమానంతో గర్వంతో ఉండేవాడివి. లక్క ఇంటిని కాల్చేస్తున్నప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా? కపట జూదంతో నీ మిత్రుడు దుర్యోధనుడు ధర్మరాజును ఓడిస్తున్నప్పుడు ధర్మం జ్ఞాపకం రాలేదా? మిత్రుడు అధర్మ మార్గంలో నడిస్తే  మిత్రుడుగా మంచిమార్గంలో పెట్టడం నీ ధర్మం కాదా? నిండుసభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తున్నప్పుడు నీవు అన్న మాటలు ధర్మబద్ధమైనవా? చక్రవ్యూహంలో బాలుడైన అభిమన్యుడు వీపుపై బాణాలు సంధించి, నిరాయుధుడైన సమయంలో, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు, ధర్మం తెలియరాలేదా? ఇది నీ కర్మ ప్రతిఫలం. ఇదే న్యాయమని ఆనాడే కృష్ణుడు చెప్పింది మీరు మరిచారా? అధర్మ ఆశయం ధర్మం నిలబెట్టడమే అయితే, ఆ అధర్మం కూడా ధర్మమే అవుతుంది. ఇప్పటికైనా మా కృష్ణ తత్త్వం గ్రహించి ఒప్పుకొండి కన్నయ్యే గొప్పవాడని. మీకో కథ చెప్పమా...విని మీరే చెప్తారు మా కిట్టయ్యే గొప్పయని. 
ఒకానొక రోజు గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్ళు తోడుతోంది. కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తి పెడతారేమో అని ఇటూ అటూ చూసింది. అటుగా వెళుతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. "కృష్ణా కృష్ణా" అని పిలిచింది. కృష్ణుడు వినిపించనట్టు వెళ్ళిపోయాడు. కృష్ణకు ఏమైంది ఈరోజు అని అనుకుంటూ, ఎలాగోలా కుండ ఎత్తుకొని ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె ఇంటికి ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. "రా! కుండ దించి పెడతాను," అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో అడిగింది. "అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావో... నాకేం అర్ధం కావడం లేదు, కృష్ణా!" అంది. కృష్ణుడు నవ్వి, "నేను భారం దించేవాడిని, భారం ఎక్కించడం నా పని కాదు" అని వెళ్ళిపోయాడు. ఇదీ మా కృష్ణుని గొప్పతనం. కృష్ణా కృష్ణా అని పిలిస్తే చాలూ, మన భారాల్ని ఆయనే దించుతాడు. ఇప్పుడు చెప్పండి మా కన్నయ్యే గ్రేట్ అని.
ఓసోసి... మేమూ ఇలాంటి బోలెడు కథలు విన్నాం, చదివాం. మేమూ కథలు చెప్పగలం. 
ఒకానొకరోజు ఒకచోట రామనామ భజన జరుగుతుండడం చూసి, ఒకతను అపహాస్యం చేస్తూ మాట్లాడం గమనించిన ఒక జ్ఞాని, అతనని వారించి, నీకు తెలుసివస్తుందిలే త్వరలో రామ నామ మహిమ అని చెప్పి, అతనికి రామనామాన్ని ఉపదేశించి, 'దీన్నెప్పుడూ ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు, నీకు వీలున్నప్పుడల్లా చెప్పుకో' అన్నాడు. కాలక్రమంలో అతను చనిపోయాడు. యమదూతలు అతని ఆత్మను తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. యమధర్మరాజు అతని పాపపుణ్యాల లెక్కలను పరిశీలించి, 'ఓమారు రామ నామాన్ని ఉచ్ఛరించావు. అందుకు నీకు ఏం కావాలో అడుగు?' అన్నాడు. అయితే అతనికి జ్ఞాని చెప్పిన 'ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు' అన్నమాట గుర్తుకు వచ్చింది. కనుక అతను యమధర్మరాజుతో 'మీరు ఏమి ఇవ్వదలచుకున్నారో అది మీరే ఇవ్వండి. నేనుగా ఏదీ అడగను' అన్నాడు. అతని మాటలకు యమధర్మరాజు విస్తుపోయాడు. రామనామానికి తాను ఎలా వెల కట్టగలనని అనుకున్నాడు. ఎందుకైనా మంచిది ఈ విషయమై ఇంద్రుడిని కలిసి ఆయననే ఓ నిర్ణయం తీసుకోమంటే సరిపోతుందనుకున్నాడు. అతనితోపాటు యమధర్మరాజు ఇంద్రుడి వద్దకు బయలుదేరబోయాడు. అయితే అతను ఓ షరతు విధించాడు. 'నేను మీతో రావాలంటే నన్ను పల్లకీలో తీసుకుపోవాలి. పైగా ఆ పల్లకీని మోసేవారిలో మీరొకరై ఉండాలి' అన్నాడు. ఇందుకు సమ్మతమైతే వస్తానన్నాడు. ఇతను నన్నూ ఓ బోయిగా చూడాలనుకుంటున్నాడంటే రామనామ మహిమ ఘనంగానే ఉందన్న మాట అని అనుకున్నాడు యమధర్మరాజు. అందుకే అతను ఇలా షరతు విధిస్తున్నాడని భావించాడు. అందుకు సమ్మతించాడు. పల్లకీ మోసే బోయీలలో యమధర్మరాజు ఒకడయ్యాడు. ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు. యమధర్మరాజుకు తన రాక కారణం చెప్పాడు. అయితే ఇంద్రుడు రామనామ మహిమకు నేను వెలకట్టలేనన్నాడు. మనమందరం కలిసి బ్రహ్మ దగ్గరకు పోదామన్నాడు. యమధర్మరాజుతోపాటు ఇంద్రుడు కూడా పల్లకీ మోస్తేనే తాను బ్రహ్మ వద్దకు వస్తానన్నాడతను. చేసేది లేక ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించాడు. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అయితే బ్రహ్మ కూడా తాను రామనామ మహిమకు వెలకట్టలేననీ, వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదామనీ అన్నాడు. యమధర్మరాజు, ఇంద్రుడితోపాటు బ్రహ్మ కూడా పల్లకీ మోసే బోయీలలో ఒకడయ్యారు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు. విష్ణువుతో తామెందుకు వచ్చామో చెప్పారు. 'ఇతను ఒక్కసారి రామనామాన్ని ఉచ్ఛరించాడు, అందువల్ల అతనికి ఏ పుణ్యం దక్కుతుందో మీరే చెప్పా'లన్నారు యమధర్మరాజాదులు. 'ఈ జీవిని మీరందరూ కలిసి పల్లకీలో కూర్చోపెట్టి మోసుకువచ్చారు కదా, దీని బట్టి ఇంకా మీకు రామనామ మహిమ అర్థం కాలేదా?' అని ప్రశ్నిస్తూ ఆ ఆత్మను తనలో కలుపుకొన్నాడు విష్ణుమూర్తి. ఇప్పుడు చెప్పండి కృష్ణ భక్తమహాశయులారా! మీ అభిప్రాయాన్ని...

బాబోయ్...ఇక ఆపండీ...మనందరికీ తెలుసు. ఇద్దరూ శ్రీమన్నారాయణుని అవతారములే. 


రాముడు పూర్ణ మానవవతారం. కృష్ణుడిది పరమాత్మ అవతారం. ఒకరు మాయామానుష విగ్రహులు, మరొకరు లీలామానుష విగ్రహులు.

ఒకరిది త్రేతాయుగం, మరొకరిది ద్వాపరయుగం. రామునిలా ధర్మంగా ఉంటానంటే ద్వాపరయుగంలో కుదరదు. ఇక్కడ ధర్మానికి ధర్మమే సమాధానం, అలాగే మోసానికి మోసమే సమాధానం. ధర్మ రక్షణ యుగయుగానికి భిన్నం. యుగధర్మాలు, అవతార బేధాలు గమనిస్తే ఈ ధర్మ సూక్ష్మాలు అవగతమౌతాయి. 
త్రేతాయుగంలో అప్పటి ధర్మశాసనాలు, ఆనాటి కాలానుగుణంగా రాముడు గొప్పవాడు. ద్వాపరయుగంలో అప్పటి కాలపరిస్థితులను బట్టి కృష్ణుడు గొప్పవాడు. త్రేతాయుగంలో రాముడు చేసిన పనిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పి చేయించాడు. 
రాముడు చేసి చూపించినది ఆచరణీయ ధర్మమార్గం.
కృష్ణుడు చెప్పి చేయించింది ఉపదేశ ధర్మమార్గం. అందుకే పెద్దలు అంటుంటారు 'రాముడు చేసింది చేయరా, కృష్ణుడు చెప్పింది వినురా' అని.
రాముడుని అనుసరించాలి, రాముని పనులను అనుకరించాలి. 
కృష్ణుడిని ఆశ్రయించాలి, కృష్ణుడు చెప్పినదానిని ఆచరించాలి. 

ధర్మాన్ని అనుసరించిన దేవుడు శ్రీరాముడు కాగా, ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు.
కాబట్టి ఇద్దరూ ఇద్దరే. ఇక ఈ చర్చ ఇంతటితో ఆపి ఇళ్ళకు వెళ్ళకపోతే భగవంతుని అనుగ్రహం ఉన్నా లేకున్నా, భర్త ఆగ్రహం తప్పక చవి చూడాల్సి వుంటుంది. ఇక  నడవండి అంటూ ముగించింది ప్రియంవద.

14, జనవరి 2024, ఆదివారం

కాదేదీ కబుర్లకనర్హం.....

కొన్ని నెలల క్రితం మిత్రురాలు రుక్మిణి జీ (రుక్మిణీదేవి | భారతీయం బ్లాగర్) వాట్సప్ లో పంపిన ఈ క్రింద వీడియో నచ్చి, మరి కొందరు స్నేహితులకు ఫార్వర్డ్ చేసాను.



{तूने जो कमाया है दूसरा ही खायेगा
खाली हाथ आया था खाली हाथ जाएगा
जब तलक ये सांसे हैं तब तलक ये रिश्ता है
सांस जिस घड़ी टूटी तो रिश्ता टूट जायेगा
जीते जी तू माया में राम नाम को भुला
मौत का समय आया तो राम याद आएगा

మీరు సంపాదించినది ఇతరులు తింటారు లేదా  అనుభవించుతారు
ఖాళీ చేతితో వచ్చావు ఖాళీ చేతితో పోతావు
ఈ శ్వాస ఉన్నంత కాలం ఈ సంబంధ అనుబంధాలు ఉంటాయి 
శ్వాస విడిపోయిన  మరు క్షణం సంబంధ అనుబంధాలు విచ్చిన్నమవుతాయి
జీవించి ఉండగా మీరు మాయలో పడి రాముని నామమును మరచి పోతారు
మరణ సమయం వస్తే ఆ రామ నామం  గుర్తు వస్తుంది}

ఈ వీడియో చూసి ఇది సత్యం అని కొందరు, నైస్ వీడియో అని కొందరు బదులివ్వగా, కొన్ని కొన్ని తరచి చూసి చర్చించే సత్సంగ మిత్రులు ఎప్పటిలా చర్చకు తెర తీసారు. 

మిత్రురాలు శారద మాట్లాడుతూ -
భౌతికంగా ఖాళీ చేతులతో రావడం, పోవడం కన్పిస్తుంది గానీ, పాప పుణ్య కర్మ మూటలు మరణించినప్పుడు తీసుకొని వెళ్తాం, అవి అనుభవించడానికి మరల పుడతాం. 


కర్మలు చేయకుండా ఉండలేం, కర్మ ఫలితాలు అనుభవించకుండా తప్పించుకోలేం. ఈ కర్మ వలయాన్ని భేదించుట అంత సులువు కాదు. అలానే మరణ సమయంలో భగవంతుని నామం గుర్తు రావాలంటే, అందుకు తగ్గ అభ్యాసం ముందు మనం చేస్తేనే గుర్తుకు వస్తుంది. లేదంటే మన ప్రారబ్దంలో ఏదైనా పుణ్య ఫలం ఉంటేనే సాధ్యమౌతుందనగా,

నిజమే, ఎవరూ వట్టిగా పుట్టలేదు, ప్రారబ్ధం అనే మూటలను నెత్తిన పెట్టుకుని మరీ పుడతాం. కర్మ ఫలం బట్టే జన్మలు. ఇక జన్మించాక కర్మలు చేయాల్సిందే. ఆ కర్మ ఫలితాలు ఇప్పుడో (ఈ జన్మలోనో) మరెప్పుడో (మరు జన్మలలోనో) అనుభవించక తప్పదు. అవతార పురుషులకైనా తప్పదు. రాముడు వాలిని చెట్టు చాటు నుండి ఒక్క బాణం వేటుతో హతమార్చిన ఫలితంగా, మరు జన్మలో కృష్ణ నిర్యాణం ఓ వేటగానిచే ఒక బాణం దెబ్బతో అనుభవించాల్సి వచ్చింది.  వెళ్ళి పోయేటప్పుడు ప్రాణవాయువు కర్మ వాసనలను తీసుకెళ్తుంది. ఏ వాసనలతో పోతామో అది మరుజన్మకు నాంది అవుతుంది. ఆ కర్మ వాసనల వలనే కదా, శ్రీకృష్ణ పరమాత్మ సాంగత్యం పొందినా సరే, అర్జునుడు కన్నప్పగా, భీముడు మధ్వాచార్యులుగా పుట్టారని పెద్దలు చెప్తుంటారు. మరి ఈ కర్మ వలయాన్ని చేధించడం ఎలా భారతీ గారు? ఇది పద్మగారి ప్రశ్న.

చెప్పారుగా గీతాచార్యుడు... "కర్మయోగం".
కర్మయోగమే మనకున్న ఏకైక అవకాశం.  కర్మని ఓ యోగంలా చేయడమే. మన దైనందిక కర్మలను, బాధ్యతలను కర్తవ్యమును ధర్మబద్దంగా నిర్వహిస్తూ, దైవస్మరణ విడువకుండా సాధనా మార్గంలో సాగిపోవాలి. మనకోసం, మన కుటుంబం కోసం కర్మలు చేయక తప్పదు! అంటే పనులు చేయడం ఎలాగూ తప్పదు. ఆ పనులేవో భగవంతుడుని స్మరిస్తూ చేస్తే, అది ఉపాసన అవుతుంది. ఏ ఉపాసనా చేయకున్నా మన రోజులు గడిచిపోతాయి. నిస్సారంగా జీవితం ముగిసిపోతుంది. పుట్టాం...గిట్టాం... అంతే! అదే మన జీవనవిధానం ఉపాసనతో అనుసంధానం చేస్తే జీవితం సారవంతమై అర్థవంతంగా పూర్తి అవుతుంది. 


కర్మని భగవత్ స్మరణతో చేస్తే, ఆ కర్మ యోగమౌతుందని నేను చెప్తుండగా...

ఏమిటో... ఈ కర్మ బంధనాలు...
ప్రారబ్ధ మూటలను భారంగామోస్తూ, ఇది నా తలరాత, విధిరాత అనుకుంటూ మరిన్ని కర్మలు మూట కట్టుకుంటూ...కర్మత్రయానికి లోబడి చావు పుట్టుకల చక్ర భ్రమణంలో పడి బ్రతుకుతున్నవారు కొందరు.
నిండు గుండెతో, మెండైన నమ్మికతో దైవాన్ని ఆశ్రయించి  మోసేది ఆయన, చూసేది నేను అనుకుని భక్తి మార్గంలో జీవిస్తూ జన్మ పరంపరను తగ్గించుకునేవారు మరికొందరు.
మోసేది ఎవరు? చూసేది ఎవరు? ఉన్నది ఒక్కటే... చావు పుట్టుకలు శరీరానికే అని ధ్యానమార్గంలో నడిచేవారు మరికొందరు.
పై మూడు సిద్ధాంతాలు గురించి ఔనని చెప్పిన, కాదని చెప్పినా, అవి ఎఱుకలో లేని మాటలే.  అన్నీ భ్రమ, భ్రాంతి లోవే... అన్నీ స్వప్న సదృశ్యమే... అని కొట్టిపారేస్తూ జ్ఞానమార్గంలో ఇంకొందరూ...
హూ... ఈ కర్మల గురించి ఎంతని చెప్పగలం? ఎంతని తెలుసుకోగలం? భగవాన్ గీతలో చెప్పారుగా... అభ్యాస జ్ఞాన ధ్యానాలకంటే కర్మఫల త్యాగమే గొప్పదని.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ||

కర్మఫల త్యాగం మనం చేయలేం. అంతటి పరిణితి రాలేదు కాబట్టి. నన్నడిగితే కర్మలను భగన్నామస్మరణతో కలిపి సాధన చేయడమే ఒకింత సులభం అన్పిస్తుందని రజినీ గారు చెప్తుండగా...

మనతో పాటు మన కర్మ మూటలు మోసుకుపోవడం తప్పనప్పుడు, ఆ కర్మ మూటలేవో సుకర్మ అంటే పుణ్య మూటలైతే బాగుంటుంది కదా... నాకో కథ గుర్తుకొస్తుందంటూ -
ఒకానొక ధనవంతునికి ఓ సందేహం వచ్చింది. మరణించినప్పుడు మనతో ఈ సంపద రాదంటారే...ఊహు ...ఈ సంపద అంతా నాతోనే వుండాలి, నేను మరణించాక కూడా నాతో పాటే వుండాలి...ఎలా మరి...ఎన్నో విధాల యోచించిన సరైన ఆలోచన తట్టక, ఓ ప్రకటన చేస్తాడు. నేను మరణించాక కూడా నా సంపదనంతా నేను తీసుకెళ్ళడానికి సరైన సలహా ఇచ్చిన వార్కి లక్ష బంగారు వరహలిస్తానని.
ఈ ధనికునికి డబ్బు పిచ్చి కాకపోతే, ఇదెలా సాధ్యమని అందరూ అనుకుంటున్న తరుణంలో ఓ యువకుడు వచ్చి, నేను మీకో సలహా ఇస్తాను. మీరు నా సలహా అమలు చేస్తే, మీ సంపద అంతా మీతో తీసుకు వెళ్ళవచ్చునని చెప్పగా, ఎంతో ఆతృతగా, 'ఎలా' అని ప్రశ్నిస్తాడు కోటీశ్వరుడు. మీరు అమెరికా వెళ్ళారనుకొండి, అక్కడ ఈ ఇండియా రుపీ చెల్లుతుందా? చెల్లదు కదా. మరి అక్కడ చెల్లాలంటే మీకు కావల్సిన డబ్బు మొత్తం బ్యాంక్ లో ఎక్సేంజ్ చేసుకొని డాలర్లుగా మార్చుకొని తీసుకువెళ్ళి ఉపయోగించుకుంటారు. అదే రష్యా వెళ్తే రూబుల్ గా, జపాన్ వెళ్తే యెన్ గా మార్చుకొని వెళ్తాం. అదే రీతిలో మీ డబ్బు / సంపద స్వర్గానికి తీసుకు వెళ్ళాలంటే మార్చుకొని తీసుకు వెళ్ళాలి. 
'అవునా! ఏ బ్యాంక్ లో ఎక్సేంజ్ చేయాలి? ఆ బ్యాంక్ ఎక్కడుంది? ఆ బ్యాంక్ లోనికి నా డబ్బును ఎలా ట్రాన్స్ఫర్ చెయ్యాలి'? 


మీ దగ్గర ఉన్న సంపదను సేవా కార్యక్రమాలకు, సత్కర్మలకు వినియోగించి పుణ్యంగా మార్చుకుంటే, మీతో పాటు మీ పుణ్య సంపదను తీసుకువెళ్ళవచ్చు..... అని చెప్పిన యువకుడిని ఎంతో సంతోషంతో సత్కరించి, ఆ సూచననుసరించి తరించెను ఆ ధనికుడు.
నిజమేకదా...మానవసేవే మాధవసేవని పార్వతి గారు చెప్పారు.

నామ స్మరణ చేయువారికి పాపాలు పోతాయన్నది నిజమేనా? నాకు తెలిసిన కొందరు నామ స్మరణ చేస్తునో, స్తోత్రాలో మంత్రాలో పఠిస్తునో, వంట చేస్తుంటారు. పూజలు, ఆలయ దర్శనాలు, అర్చనలు చేస్తుంటారు. మరి వారికి పాపాలు పోయినట్లేనా? పాప ఫలితం వారికి ఉండదా? ముక్తస్థితిలో వారున్నట్లా? వారనే కాదు, మిమ్మల్నే తీసుకొండి...రామ స్మరణంలో ఉంటారు. మరి మీకు ఇక ఏ పాప కర్మ ఫలితాలు లేనట్లేనా...
ఆగండి వాణిగారు, మీ మనోభావం నాకు అర్థమైంది. 
నామ స్మరణ చేస్తే పాపాలు పోతాయన్నది సత్యం. ఇది శాస్త్ర వచనం. అయితే కుంజర శౌచం మాదిరిగా చేస్తే, కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు. అంటే, నామజపం చేస్తున్నా, పాప కర్మలు మరల మరల చేస్తే ఆ కర్మ ఫలాలు అనుభవించాల్సిందే. 
ఇక నా గురించి అంటారా... ప్రాపంచిక బంధపాశముకు కట్టుబడి, కాలానుగుణంగా ఎవర్నీ నొప్పించక నొవ్వక సాగుతున్న నేపథ్యంలో చిరు చిరు తప్పులు తప్పవు. నా దృష్టిలో ఒప్పైన కర్మ, మీ దృష్టిలో తప్పు కావచ్చు.  మా తాతయ్య గారు ఓ మాట చెప్పేవారు...కర్మ అంటే, మనం చేతులతో చేస్తున్నదే కాదు, మనో వాక్కులతో చేసేది కూడా కర్మే. అలానే ప్రస్తుతం మనకు ఏం జరుగుతుందో అది మాత్రమే కాదు, మనకు ఏదైతే జరుగుతోందో, దానికి మనం ఎలా అనుభూతి చెందుతున్నామో, ఎలా స్పందిస్తున్నామో అనేది కూడా మన కర్మే. మనం చెడు చేయకపోవచ్చు కానీ; మన కళ్ళెదుట జరిగే చెడును చూస్తూ అడ్డుకోక పోవడం కూడా తప్పే. అది కూడా మన కర్మల ఖాతాలో జమవుతుంది. ఉదాహరణకు మహాభారతంలో భీష్మ, ద్రోణులు పెద్దలైనా, ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకోలేకపోతారు. రాజుకు విధేయులై ఉండాలన్న ధర్మం పాటించినా, కళ్ళముందు జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డుకోరు. జీవితమంతా మంచిగా బ్రతికినా, కళ్లెదుటి అధర్మ కార్యాన్ని అడ్డుకోలేని ఫలితానికి శిక్షగా యుద్ధంలో చంపబడతారు. నాది సర్ధుబాటు మనస్థత్వం. తటస్థ వైఖరి. వెంటనే దేనిని ఖండించలేను. కానీ, ఆ క్షణాల్లో నాలో రామ స్మరణం రెట్టింపు అవుతుంది. కొంతసేపటికి ప్రశాంతత... అలాగని మనస్సులో దేనిని మోయను... ఏదీ నిలవదు. నా ఈ వైఖరి కొంత తప్పే... కావున, నా కర్మ ఫలాలు నేను అనుభవించక తప్పదు. ఐతే రామ స్మరణ నడుమ పాపపుణ్యాల గురించి చింతన, చింత లేనే లేదు. కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడం స్థితప్రజ్ఞత. అంతటి ప్రజ్ఞ నాలో రాలేదింకా వృద్ద పక్షిలా. ఇక రామ నామ స్మరణం భక్తిగా అలవర్చుకున్నది... శ్రీరాముడు అంటే అమిత ప్రేమ, నా అంత్యకాలంలో రామ ధ్యాసలోనే తుదిశ్వాస విడవాలని. ఓ గృహిణిలా నా కర్మలు నేను సరిగ్గా నిర్వర్తిస్తూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, అప్పుడప్పుడు మీలాంటి వారితో సద్గోష్టిలో పాల్గొంటూ, మాయలో పడి గాడి తప్పుతున్న మనస్సును రామ స్మరణతో తిరిగి గూటిలో పెడుతూ సరళమైన జీవనం సాగిస్తున్నాను వాణి గారు. ఇదే నా కర్మలన్నింటిలో ప్రధాన కర్మ. ఇంతకు మించి నాకేమీ తెలియదని చెప్పగా, బాగుంది బాగుంది కానీ, ఆ వృద్ధ పక్షి ఊసేమిటి మధ్యలో...అని అడిగిన మిత్రులకు ఎప్పుడో చదివిన ఈ కథను చెప్పాను.
అనగనగా ఓ ఎడారి ప్రాంతంలో నివాసముండే ఓ పక్షి వృద్ధాప్య దశకు చేరుకున్నాక, జవసత్వాలు తగ్గి బక్క చిక్కేక, తన దీనావస్థకు దుఃఖిస్తూ,
అయ్యో! యవ్వనంలో వున్నప్పుడు ఎట్లా వుండేదానిని, ఇప్పుడు ఇలా వున్నాను...ఆహా... ఏమి నా తలవ్రాత అని అనుదినం చింతుస్తూ  కృంగిపోసాగింది. 
అలాంటి తరుణంలో ఆ పక్షి మసకబారిన కంటి చూపుకి, 
ఒక దేవదూత పక్షి అటుగా వెళ్ళడం కనిపించింది. వెంటనే కాస్తా సత్తువ కూడబెట్టుకొని, ఆ పక్షిని పిలుస్తూ, 
ఓ దైవ కపోతమా! నీవు ఎటు వెళ్ళుచున్నావు? అని అడుగగా...
ఆ దేవదూత పక్షి "నేను దైవం వద్దకు వెళ్తున్నానని" బదులిస్తుంది.
అంతట ఈ వృద్ధపక్షి, ఓ దేవదూత! నా ఈ దీన స్థితిని నీవు చూసితివి గదా, నాయందు దయపూని, నాకీ దైన్యత ఇంకెంతకాలమో దైవాన్ని అడిగి బదులీయరాదా? అంటూ వినమ్ర పూర్వకంగా, ఆర్తిగా అడిగింది.
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ద పక్షి ఎంతో ప్రాదేయపూర్వకంగా, దేవుని సమాధానం తెలుసుకోవాలనే తపనతో దేవదూత కపోతమును హృదయపూర్వకంగా వేడుకోగా,  ఆ పక్షి దైన్యతను చూసిన, ఈ దేవదూత పక్షికి కళ్ళు చెమర్చగా, 'నీకేం భయంలేదు, నీ తరఫున నేనడుగుతా, దైవం నుంచీ సమాధానం తప్పకుండా తీసుకుని వస్తాను అంటూ బయలుదేరిన ఆ దేవదూత పక్షి భక్తితో దైవం వద్దకు వెళ్ళి, సమయాసమయాలు చూసుకుని, మంచి తరుణంలో ఈ వృద్ధపక్షి ఉదంతం అంతా చెప్పి, హే! పరమ దయాళు! స్వామి! ఆ వృద్ధ పక్షి దైన్య స్థితి పోవడానికి ఎంత కాలం పడుతుందోనని తెలుసుకుని రమ్మని చెప్పిందని విన్నవించుకోగా -
అంతట దైవం, "ఆ వృద్ధ పక్షి రూపంలో వున్న జీవుడికి "వినాదైన్యేన జీవితం, అనాయాసేన మరణం" సంప్రాప్తమవ్వాలంటే, ఇంకా ఏడు జన్మలు పడుతుంద"ని పలికెను.

అప్పుడు ఆ దేవదూత పక్షికి ఆ వృద్ధ పక్షి దైన్య రూపం, హృదయపూర్వక ప్రార్థన గుర్తుకువచ్చి, 'అలా కాదు... స్వామి! ఏదైనా తరుణోపాయం వుంటే సెలవీయండి' అని వేడుకోగా, అంతట ఆ పరందాముడు దయామృత వదనుడై, కృపా రసార్ద్ర హృదయుడై, చిరు మందహాసంతో, "దైన్య స్థితినుంచీ దైవ స్థితికి చేరేందుకు మార్గమొక్కటి వున్నది, ఏది జరిగినా, ఏది ప్రాప్తించినా, ఏది ఏమైనా, అంతా ఈశ్వరేచ్ఛ మేరకే, అంతా భగవదనుగ్రహం మేరకే జరుగుతుందని, నేను చేసింది ఏమీ లేదని, పరిపూర్ణ విశ్వాసంతో, బలీయమైన నమ్మికతో, దృఢమైన చిత్తంతో... ఎదురౌతున్న ప్రతీదీ ఈశ్వర ప్రసాదమనే భావించి, 'సర్వకారణమీశ్వరం' అనెడి వాక్యాన్ని ఆశ్రయించి వున్నట్లయితే, అప్పుడు పరిస్థితి మారవచ్చును" అని సూచన చేసెను.
అంతట ఆ దేవదూత పక్షి శీఘ్రగతిన వృద్ధ పక్షి వద్దకు వచ్చి, పరమాత్ముని మాటలు వినిపించి, ధైర్యాన్ని ఆనందాన్ని నింపి, సంతోషంగా వెడలిపోతుంది.


ఇక ఈ వృద్ధపక్షి దేవ కపోతం మాటలను శ్రద్ధగా విని, విశ్వాసంతో ఆచరణ లోనికి తెచ్చుకుంది. 
ఎంతలా అంటే - ఇవాళ ఆహారంగా కాసిన్ని రెక్కల పురుగులు దొరిగాయి... సంతోషం, ఈశ్వర ప్రసాదం... ఈశ్వరా! నీకు కృతజ్ఞతలు.
మరోరోజు ఆహారంగా పప్పు ధాన్యాలు లభించాయి... ఇది ఈశ్వర అనుగ్రహం... ఈశ్వరా! నీకు ప్రణతులు. 
ఇంకో రోజు ఆహార అన్వేషణ గావిస్తుంటే, కంట్లో నలుసుపడి తీవ్రంగా బాధించింది, అప్పుడు కూడా, ఇదీ ఈశ్వర ప్రసాదమే, ఈశ్వరా! నీకు కన్నీటితో నమస్సులు..
వేరొక రోజు ఆహారంకై వెళ్తుండగా... ముళ్ళకంప గీరుకుంది... మరీ సంతోషం... ఇదీ ఈశ్వరానుగ్రహమే... ఈశ్వరా! నమోనమః ఇలా... ఆహారం దొరికినా, దొరకున్నా, ఎక్కువైనా, తక్కువైనా, భుక్తాయాసమైన, కడుపుమాడిన... ఏది ఏమైనా సరే, ప్రతీసారి, ప్రతీ చోట... ఈశ్వర, ఈశ్వర, ఈశ్వరా నీవే సర్వమూ, అంతా నీ అనుగ్రహమే... నీకు మనసా, వాచా, కర్మణా మ్రోకరిల్లుతున్నాను తండ్రీ... అని శరణాగతి భావంతో జీవించ సాగింది.
కొన్ని నెలలు అనంతరం అటుగా మరల వచ్చిన దేవపక్షి ఈ వృద్ధపక్షి కేసి ఆకాశం నుంచే చూస్తూ, ఆహా! ఎంతటి మార్పు... మచ్చుకైనా మునుపటి దైన్యత, వృద్దచాయలు లేవే... అని ఆశ్చర్యానందాలకు లోనై, వెంటనే దైవం వద్దకు వెళ్ళి విషయం చెప్పి, ఏమిటి ఆ వృద్ద పక్షిలో ఇంత మార్పు? ఏడు జన్మల వరకూ దుఃఖ ఛాయలు కూడా పోవు అని మీరు నాకు సెలవిచ్చారు... ఇప్పుడు ఏడు నెలలలోనే ఇంత మార్పా? అని అడుగగా, అప్పుడు పరమాత్ముడు చెబుతాడు... ఇదంతా నేను అన్న అహాన్ని వీడిన ఔన్నత్యమని. శరణాగత సమర్పణ ఫలితమని. ఈ కథ విన్నాక,

భారతీ గారు, మీరు భక్తితో రామ నామస్మరణం ఎందుకు అలవర్చుకున్నారోనన్న మాటలు వింటుంటే -

అంతకాలే చ మావేవ స్మరన్ ముక్త్వా కలేబరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః||

మరణసమయంలో ఎవరైతే నన్నే స్మరించుచు దేహమును వీడుదురో వారు నన్నే చేరుదురు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరమ్|
తం తమేవైతి కౌంతేయః సదా తద్భావభావితః||

ఓ కుంతీపుత్రా! ఎవరేయే భావమును స్మరించుచు తుదకు దేహత్యాగ మొనర్చునో వారు ఆ భావమునే పొందుదురు. అంటే మన ఉత్తరజన్మ మన కట్టకడపటి భావముపై ఆధారపడి ఉంటుందన్నది యదార్థం... అన్న గీతాచార్యుని మాటలతో పాటు ఎక్కడో చదివిన ఓ కథ కూడా గుర్తుకు వస్తుంది.

ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి మరు జన్మకు కారణమవుతాయి.

ఒకసారి ఒక రాజ్య కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చి, రాజు వద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వుంది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొనగా, రాజు అందుకు సమ్మతించాడు.
రాత్రి అయింది. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే తలంపుతో, ఆ రాజు మారువేషంలో చాటుగా మూగవాన్ని గమనిస్తూ బయల్దేరాడు.
 
అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ కాపలాదారుని కొడుకు కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు -

కామం క్రోధంచ, లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః.

(మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని, జ్ఞానమనే రత్నాన్ని అపహరించడానికి పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త)

ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. మూగవానిగా నటిస్తున్నాడు. ఇతణ్ణి వెంబడించి, గమనించాలి' అని రాజు భావించాడు. 

రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు -

జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః

(పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, ఇవి మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త)

ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది.

మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః 

(తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు [ఇదంతా మిథ్య అని అర్థం] జాగ్రత్త! జాగ్రత్త) అని చాటాడు. 

ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ యువకుడు
 
ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః

(ఆశాపాశంచేత కట్టుబడి తిరుగుతూ, లోక కర్మల చేత బహుచింతలకు లోనై, ఆయువు క్షీణించడం ఎరుగలేరే... జాగ్రత్త జాగ్రత్త) అని చాటాడు...

ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మ గల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతణ్ణి తన రాజప్రాసాదానికి రప్పించి, అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకొని రాజు తన కోటకు వెళ్ళి పోయాడు.

మర్నాడు ఆ యువకుని తండ్రిని పిలిపించి,
అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగవాడు కాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు... అని. తండ్రి ఆశ్చర్యానందంకు లోనై, తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక, ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.
అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. 
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ యువకుడు. ఈ కోరిక విని రాజు అమితాశ్చర్యపోయి, ఇచ్చిన మాట ప్రకారం అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ యువకుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించగా,
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి, “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని, ఇప్పుడు ఎందుచేతనో ఒక దేశం నుండి చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, ఆ దేశంలో పాపాత్ములే లేరా! లేదా పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం”... అని చెప్పగా, బ్రహ్మకీ ఇది విచిత్రంగా తోచి, అసలు విషయం పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. 
ఇక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు ఈ జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతున్నారు. 
ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి ఈ జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా, బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది.

అదేమంటే - మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా, ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది.

మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింప చేసి, వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, భక్తితో తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి, వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు భక్తి మైకంలో గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.

ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై, ఈ జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.

"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో 
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. 
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు -
"ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా?నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు. కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం నాకు ఒక పాఠమైనది” అని తెలపగా...

అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి, సత్యలోకం చేరుకొన్నాడు. 
మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేదా ముక్తి లభిస్తుంది. 
సత్ చింతన కాక, వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తున్నది.
నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక! కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా అలవర్చుకోవాలని ఎప్పటిలా ప్రియంగా చెప్పింది ప్రియంవద.

జహా జహా చలూ కరూ పరిక్రమా, జో జో కరూ సో సేవా
జబ సోవూ కరూ దండవత్, జానూ దేవ న దూజా 
                          - సంత్ కబీర్
నేను నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది చేసినా, అది భగవత్ సేవ గానే భావిస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను... 
సంత్ కబీర్ లా కర్మలను భగవత్ తలపుతో జత చేసే భావన మనలో ధృఢమౌతే ధన్యులమే కదా... కానీ, అంత ధృఢ సంకల్పం లేదే... నిట్టూర్పుతో నెమ్మదిగా అన్నారు నిర్మల గారు.

గత మూడు దశాబ్దాలుగా మీకు నేను తెలుసు. నేను తెలిసి తెలిసీ ఏ తప్పులు చేయలేదు, భగవత్ ఆరాధన మానలేదు. నా జీవితం ఓ సుడిగుండం. అయినా ఈ ఆధ్యాత్మిక చింతన అలవడేకా మునుపటిలా దుఃఖం లేదంది నీరజ.

అసలు ఎందుకీ కష్టాలు? కొందరికి బ్రహ్మరాత ఇలా ఉంటాదేమిటి? ఇది వారి ప్రారబ్దం అంటారు...
 అసలు ఈ ప్రారబ్ధం ఏమిటి? ఈరోజు చేసిన వంట ఈరోజే తింటున్నాం కదా. అలాగే ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవించేయాలి కదా... మరు జన్మలకు ఎందుకు? 
హైమ గారి ఈ ప్రశ్నలకు, ఈరోజు వంట ప్రిజ్ లో దాచుకొని దాచుకొని తింటారు కదా, ఈరోజు చేతికి అందిన పంట ఫలాదులను ఈరోజే తినేయరు కదా,  గర్భంలో పడిన బిడ్డను వెంటనే కనేయలేరు కదా. దేనికైనా సమయం రావాలి. విత్తనాలు చల్లగానే అవి అంకురించవు. నియమిత కాలంలోనే మొలకెత్తుతాయి కదా! ఈ ఏడాది పండిన ధాన్యం కొన్ని మరుసటి సంవత్సరపు పంటకు కారణమయినట్లే, కొన్ని మన కర్మలు మరుజన్మకు కారణమవుతాయి. 


మనం చేసిన సత్కర్మలైనా, దుష్కర్మలైనా కొన్ని వెంటనే ఫలితాన్ని ఇస్తే, కొన్ని కొన్ని వెను వెంటనే తమ ప్రభావాన్ని చూపవు, కాలానుగుణంగా తమ ఫలితాన్ని చూపుతాయి. 
ఇక బ్రహ్మ కాదు, మన తలరాతలు మనమే వ్రాసుకుంటాం.
కర్మ ఎలా ఉంటుందో ఒక దగ్గర చదివాను. కృష్ణుడు కంసుని సంహరించి, తన తల్లిదండ్రులను కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూడగానే "నాయనా! నీవే పరమాత్మవి కదా. నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. ఎందుకు 14 ఏళ్ళు ఆగావు... కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి" అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు "అమ్మా! నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? విన్న దేవకి ఆశ్చర్య చకితురాలయింది.
"కృష్ణా ఇదెలా సాధ్యము? ఎందుకిలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ, గత జన్మలో నీవు " కైకేయివి", నీ భర్త "దశరథుడు". 
ఇక ప్రారబ్ధం అంటారా... కర్త, కర్మ, క్రియ మూడూ భగవంతునివే. కానీ; ఈ మూడు మనవే అని మన నెత్తిన వేసుకుని మోయడమే ప్రారబ్దం... ఝాన్సీగారు ఈ వివరణ ఇస్తూ, ఈమధ్య నేనో పాట విన్నాను, చాలా బాగుంది... వినడంటూ పార్వర్డ్ చేసిన వీడియో -


పైన ఉదాహరించిన కథా రచయితలకు హృదయపూర్వక నమస్సులు.

                ఈ కబుర్లు కొనసాగుతునే ఉన్నాయి...

12, మార్చి 2023, ఆదివారం

నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి...

                      


భారతీ, 

ఓ మాట చెప్పనా? ఏదైనా కావలిస్తే, అది అమ్మకి చెప్తే, నాన్నకు చెప్పి త్వరగా మన కోరికను తీరేటట్లుచూసేది అమ్మే. అమ్మ ద్వారానే అయ్యగారు దగ్గరకు చేరాలి. ఎంతసేపు రామా, హనుమా...అని మొర పెట్టుకోవడమే తప్ప, అమ్మ సీతమ్మను తలచేవా ఏనాడూ? నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లికి... అని అంతటి రామ భక్తుడే వేడుకున్నాడే... నీవూ అలా వేడుకోవచ్చు కదా... నేను తలచినా, తలవకున్నా, మరిచినా... నా చేతిని వదలవద్దని రామయ్యకు చెప్పు సీతమ్మ తల్లీ... అని అమ్మని అడుగు...అమ్మని ప్రేమతో పట్టుకుంటే, రాముడు నీ చెంతే...ఇక నీకూ ఎంతో నిశ్చింత..... అని చమత్కారంగా చెప్తున్న, మిత్రురాలు ఝాన్సి మాటలకు నవ్వుకుంటూ, రామ రామా అని స్మరించడంలో సీతమ్మ కూడా ఉంటుంది కదా, వేరేగా సీతమ్మ అని అనుకోకపోయినా, శ్రీ రామ అనుకోవడంలో సీతమ్మను తలచినట్లే కదా. చిత్ రాముడైతే, చిచ్చక్తి సీతమ్మ. శుద్ధబ్రహ్మము రాముడైతే, శబ్ధబ్రహ్మరూపిణి సీతమ్మ. ఆయన ఆత్మయోగి, ఈమె చిచ్చక్తి. రాముని తోడనే సీతమ్మ. రాముని లోనే సీతమ్మ. వేరు భావం లేదని, అందుకే ప్రత్యేకంగా సీతా అని స్మరించడం లేదని అన్నాను. 

ఊహూ...అది కాదు... నేను చెప్పింది ఏమిటంటే, సీతమ్మ ప్రకృతి. ప్రకృతిని ఆరాధించటం ద్వారానే పురుషుడిని చేరుకోగలం. ఒకసారి కొంతకాలం రామయ్యతో పాటు అమ్మనీ స్మరించి చూడు...ఒక విధమైన హాయి వస్తుంది. సీతమ్మ కోణంలో రామాయణం పరిశీలించి స్మరణలో సీతమ్మ గురించి వ్రాయవచ్చు కదా...ఆ తర్వాత నీ ఇష్టం అని అంది.
నాకోసం చెప్పిన మాటలు వినక మానతానా? రామునితో పాటు సీతమ్మ నామం మదిలో స్మరణం. ఆ సమయాల్లో కొన్నిసార్లు అనిర్వచనీయమైన ధ్యానానుభూతి.

సీతమ్మతో కాసేపు -

అమ్మా! ఇదిగో అప్పటి నుండి నిన్నే చూస్తున్నాను. నిన్ను మాత్రమే చూస్తూ, రామాయణం చదవడం ప్రారంభించాను. సీతోపనిషత్ చదువుతూ, నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినా నా అమాయకత్వం గానీ, లోక కల్యాణార్థమై అవతరించిన ఆదిపరాశక్తి అపరాంశవైన నిన్ను అణుమాత్రమైనా చూడగలనా? 
    
ప్రథమా శబ్దబ్రహ్మమయీ స్వాధ్యాయకాలే ప్రసన్నా,
ఉద్భవా నరకాత్మికా, ద్వితీయా భూతలే హలాగ్రే సముత్పన్నా |
తృతీయా ఈకారరూపిణీ, అవ్యక్తస్వరూపా భవతీతి సీతా 
ఇతి ఉదాహరంతి శౌనకీయే ||
మొదటి రూపం - శబ్దబ్రహ్మమయి రూపం. స్వాధ్యాయకాలంలో ప్రసన్నమవుతుంది.
రెండవ రూపం -  నరకాత్మికా (స్వాతిరిక్తే యేన రమంతే తే నరాః తేషాం కం, తదేవాత్మా స్వరూపం యస్యాః) భగవంతుని కంటే అన్యమైనది ఏది లేదని తెలిసి, ఆ భగవత్ స్వరూపమే తనదిగా, తానుగా, తనలో తాను రమిస్తూ వుండే నరులలోని బ్రహ్మానందమే జగన్మాత స్వరూపం. (నిరావృత సుఖ స్వరూపేణ సకృత్ ఉద్భవా) బ్రహ్మ జ్ఞానులలోని ఆ బ్రహ్మానందరూపిణి ఐన తానే భూమిపై హలాగ్రమున అంటే నాగేటి చాలున ఉద్భవించిన సీత.
మూడవ రూపం - 'ఈ'కారరూపిణి. అవ్యక్తరూపిణి... జగత్తంతా నిండి ఉండే జగదానందకారిణి అని తెలిపింది, శౌనకీయం.

ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తిత్రయం యద్భావసాధనమ్| 
తాధ్భ్రహ్మ సత్తాసామాన్యం సీతా తత్వ ముపాస్మహే|| 
ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులకి యే భావం సాధనం అయిందో, ఆ బ్రహ్మసత్తే సీతతత్త్వము.
(ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులైన మూడింటి స్వరూపమే సీతాదేవి. అంతటా అన్నిటా సామాన్యంగా వ్యాపించి ఉన్న సత్ బ్రహ్మభావాన్ని సాధించటానికి ఈ శక్తి త్రయాన్ని సాధకుడు ఉపాసించాలి. మనిషి తన లోని ఈ మూడు శక్తులు సరిగ్గా ఉపయోగించుకొనకపోతే బ్రహ్మభావాన్ని పొందలేడు)

దేవతలు బ్రహ్మను అడిగారు - "కా సీతా, కిం రూప మితి"| (సీత ఎవరు? ఆమె స్వరూపం ఏమిటి?)

మూలప్రకృతిరూపత్వాత్ సా సీత ప్రకృతిః స్మృతా|
ప్రణవప్రకృతిరూపత్వాత్ సా సీత ప్రకృతి రుచ్యతే||
సీత మూల ప్రకృతి మరియు ప్రణవప్రకృతి అగుటచేత ఈ సీతాదేవి మూలప్రణవప్రకృతి స్వరూపిణి అన్నది బ్రహ్మ వాక్కు.
(మొట్ట మొదట అవ్యక్తపరబ్రహ్మంలో నుండి వ్యక్తమైనది ప్రణవం (ఓం) సీతాదేవియే. అలాగే మొదట ఉద్భవించిన మూలప్రకృతి కూడా సీత స్వరూపమే)

శ్రీరామసాన్నిధ్యవశా జ్జగదానందకారిణీ|
ఉత్పత్తిస్థితిసంహారకారిణీ, సర్వదేహినామ్||
సీతా భగవతీ జ్ఞేయా మూలప్రకృతి సంజ్ఞితా|
ప్రణవత్వాత్ ప్రకృతి రితి వదంతి బ్రహ్మవాదినః ఇతి||
సీతాదేవి శ్రీరాముని సన్నిధిలో ఉండి జగదానందకారిణి అవుతుంది. సమస్త ప్రాణులను సృష్టి, స్థితి, లయములు గావిస్తుంది. కావున ఈమె మూలప్రకృతిగా తెలుసుకోవాలి. ప్రణవరూపిణి యగుటచేత ప్రకృతి అని బ్రహ్మవాదుల భావన.

తల్లీ!
జనకుడికి నాగేటి చాలున దొరకక ముందు, రామచంద్రుణ్ణి మనువాడక ముందు కూడా వున్న మహాశక్తి స్వరూపిణివి కదా...
రాక్షసులు హనుమ తోకకి నిప్పంటించారని రాక్షసాంగనలు ద్వారా విని, దుఃఖితురాలివై అగ్నిదేవుడుని ప్రార్థించి, మంటలు ప్రజ్వరిల్లుతున్నా, ఆ వేడి బాధ హనుమకు లేకుండా చేసిన నీవు, నీవుగా సంకల్పం మాత్రంచే రావణుని వధించగలవు కానీ, రాముడే చేయాలని ఎందుకు తలచావో, మొదట అర్థం కాలేదు. తరచి తరచి ఆలోచిస్తే, అర్థమైందమ్మా ... నీ మనోగతం.  

దేవ మాయేనా నిర్మితవై, అయోనిజవై, యజ్ఞదాత్రిలో నాగేటి చాలున ఉద్భవించి, నరుడుగా పుట్టిన రాముణ్ణి వివాహం చేసుకొని నరకాంతగానే నడుచుకున్న సాధ్విమణివి.

అందుకే అయోనిజగా ఉద్భవించి, నరకాంతగా జీవించి, రాముని భార్యగా నరకాంత ధర్మాన్ని లోకానికి నిరూపించి, ప్రాతివ్రత్యంలో  నిలబడి, రావణున్ని రామునిచే పడగొట్టించినంతవరకు ఓర్పుగా ఉన్నావని! 
                   

రావణుడు పరమ శివభక్తుడు, శాక్తేయుడు, సర్వవేదార్ధ పరిజ్ఞాత... బ్రహ్మ వరాల కారణంగా (దేవతలు, దానవులు, పన్నగులు, యక్షులు, రాక్షసుల నుండి చంపబడకుండ ఉండేటట్లు రావణుడు బ్రహ్మ దగ్గర వరం పొందాడు. మానవులు నుండి చంపబడకుండా ఉండే వరాన్ని కోరుకోలేదు. అప్పుడే మానవుడు వలనే మరణం కలుగుతుందని బ్రహ్మ వాక్యం) 
అంతటి వానిని వధించడానికి విష్ణువే నరునిగా అవతరించాలి. శక్తివైన నీవు రావణ మారణ సంగ్రామానికి నాందివి అయ్యావు. రావణునికి రాముడు మహావిష్ణువని తెలియదు. రావణునికి ఈ సంగతి తెలియాలి. రాముని రూపంలో నరుడుగా జన్మించింది నారాయణుడేనన్నది అందరికీ తెలియాలి. మానవుడు మాధవుడు ఎలా కాగలడో, రాముని జీవన నడవడి ద్వారా ముందు యుగాల వారికి తెలియాలి, బ్రహ్మ వాక్యం నిజం చేయాలి. ఇందుకే కద తల్లీ! మహాశక్తివైన నీవు రావణుని సహరించకుండ సహనంతో ఉన్నదీ...

అయోజనిగా వచ్చి కూడా, రావణాసురుడిచేత బంధింపబడి, అశోకవనంలో రాక్షసస్త్రీలచేత అన్ని బాధలను కేవలం ధర్మరక్షణార్ధమే అనుభవిస్తూ, భర్తను అనుగమిస్తూ, నరకాంతగా నడుచుకోవడం... 

నిజం చెప్పొద్దూ... కొన్ని కొన్ని సందర్భాల్లో రామయ్య కంటే, ఒకింత నీవే గొప్పనిపిస్తుంది తల్లి.

పద్నాలుగువేల మంది ఖర దూషణాదులను చూసినప్పుడు రాముడు కోపించినట్లుగా, రాముని కళ్ళలో ఎరుపు జీరలు వచ్చాయట కానీ, లంకలో పలు రీతుల్లో రాక్షసులు బాధ పెట్టినా, ఏనాడూ నీ కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదట కదమ్మా... అందరి పట్లా నీకు కారుణ్యమే...క్షమాగుణ సంపన్నురాలివి తల్లి.

కడగండ్లు పాల్జేసిన రావణుని కూడా రక్షింపదలచి రాముణ్ణి శరణు కోరమని హితవుపదేశించడం... ఎవరికైనా సాధ్యమా?  అందరి హితైషిణివి తల్లి.

రావణ సంహారం అయ్యాక, నీ దగ్గరకు వచ్చిన హనుమ, రావణ సంహారం, రాముని విజయం చెప్పేక, అమ్మా! ఆరోజు నేను వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలు ఎంత బాధ పెట్టారో చూసానమ్మా... అనుమతి నివ్వు, వీరిని నా పిడికిలి పోట్లతో చంపేస్తాను అని అనగా, వాళ్ళకి నా రక్ష. నీ ప్రభువు చెప్పింది నీవు చేసినట్లే, వాళ్ళ ప్రభువు చెప్పింది వాళ్ళు చేసారు. వాళ్లనెందుకు చంపడం? అంటూ...వేటగాడు, పెద్దపులి, భల్లూకం కథ చెప్పి వారించిన నీ వాత్సల్యమే వాత్సల్యం. అందుకే అమ్మ అమ్మే. 

అమ్మా! 
శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, మునులు వచ్చి రాక్షసుల బారినుండి కాపాడమని కోరడం,  రాముడి అభయంను పొందడం, సుతీక్ష్ణ మహర్షిని దర్శించి, కులాసాగా మాట్లాడుకుంటూ 
ప్రయాణం కొనసాగిస్తూ, రాముడికి నీవు చేసిన ఉపదేశం... అమ్మా! నిజం చెప్పొద్దూ.....
మొదట "మీరు మహాత్ములంటూ రాముడితో సంభాషణ ప్రారంభించి, రాముడి సత్యసంధత, దర్మనిష్ఠ కొనియాడుతూ, పూర్వవైరం ఏమీ లేకపోయినా, ఇతరుల ప్రాణాలు తీయడం అనే మూడో వ్యసనం భయంకరంగా ఉంటుందంటూ... క్రూరులైన సరే, మనజోలికి రానంతవరకు వాళ్ళను దండించే హక్కు ధర్మవరులకు ఉండదు కదా...అంటూ నీలో కదలాడిన భయాన్ని దిగులును చెప్తూ, సమయోచితంగా ఓ కథను కూడా చెప్పి, ప్రస్తుతం జటావల్కలాలను ధరించి, తాపస వృత్తి చేపట్టాక, ఆయుధం పట్టడం తగునా... అని చెప్పాలనుకున్నదంతా చెప్పేసి, చివరగా, మీకు ధర్మాన్ని ఉపదేశించే సామర్థ్యం నాకే కాదు, ఎవరికీ లేదు' అని అంటూనే... మీ తమ్ముడితో ఆలోచించి ఏది ధర్మమని అనుకుంటారో అది చేయమని..... ఎంత చక్కగా మాట్లాడావో... అమ్మా! నీకంటే  మృదుభాషిణి ఎవ్వరుంటారు తల్లి? 
                    

లంకా పట్టణంలో అశోకవనంలో శింశుపా వృక్షం క్రింద బంధించి ఉన్న నీతో, 'అమ్మా! నిను తీసుకొని వెళ్ళి రాముడి వద్దకు జేర్చి, ఇప్పుడే నిన్ను దుఃఖం నుండి విముక్తురాలను చేస్తాను, ఓ మంగళప్రదురాలా! నీవు సందేహించక నా భుజంపై కూర్చొమ్మా... అని హనుమ అన్నప్పుడు,  
ఓ వానరశ్రేష్టుడా! నీవంతవాడవగుదువు కానీ, రాముడే వచ్చి రావణుడిని చంపి, విజయం సాధించి నన్ను తీసుకెళ్లినట్లయితేనే ప్రతిష్టాత్మకంగా ఉంటుంది.   దొంగిలికొని పోవదగునే దొరలకు నెందున్ (మొల్ల రామాయణం) ఇప్పుడు నీతో నేను వచ్చేస్తే, రావణుడు నన్ను అపహరించి తెచ్చినట్లుగానే ఉంటుంది.... రావణుడి దొంగతనబుద్ధికి, రాముడి దొరతనంతో బదులివ్వాలని, రాముడు కీర్తిని ఇనుమడించే రీతిలో ఎంత చక్కగా మాట్లాడవో కదా తల్లి. రాముడి కార్యం చెడిపోయే పనులేవీ మనం చేయకూడదు. రాముడు తన పరాక్రమంతో రావణుడుని సంహరించి, నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళితే అది ఆయన కీర్తికి, గౌరవానికి, ప్రతాపానికి తగినట్లుగా ఉంటుంది... ఇది కదమ్మా రాజపౌరషమంటే! భర్త ప్రఖ్యాతే భార్యకు ముఖ్యమని ఎంత చక్కగా చూపించావో తల్లి.
ప్రాతివ్రత్య దర్మాన్ననుసరించి నా అంతట నేనుగా పర పురుషుణ్ణి స్పృశించనని అన్నావు... రావణుడు బెదిరించిన, ప్రలోభ పెట్టినా, రాక్షస స్త్రీలు భయపెట్టినా, మనస్సులో రాముణ్ణే నిలుపుకొని ఓర్చుకోవడం...ఇది కదా ప్రాతివ్రత్యం. రావణుడు, రాక్షసులు నిన్ను ఎంత బాధించిన, అక్కడ నుండి తప్పించుకునే అవకాశం హనుమ రూపేణా వచ్చిన, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలని ప్రకటన చేసి నిలబడ్డావు...ఇది కదా ఓర్పు. అందుకే కదమ్మా, ఇప్పటికీ ఓర్పు అంటే మా అమ్మ సీతమ్మదే అని చెప్పుకుంటున్నాం.
                     

 
ఆ పిమ్మట హనుమ మాటలు బట్టి, హనుమ ఒకింత నొచ్చుకున్నాడని గ్రహించి, నీవు నాకు అత్యంత ఆప్తుడివి అని స్పురింపజేసెలా మాట్లాడి, నీకూ రామయ్యకు, దేవతలకు మాత్రమే తెలిసిన కాకాసురుని వృత్తాంతం చెప్తూ, ప్రియంగా మాట్లాడిన నీకంటే మృదుస్వభావి ఎవరుంటారు తల్లి? 

అమ్మా! 
ఇలా ఎన్నెన్ని చెప్పను... నీకు నీవే సాటి తల్లి.
                      

ఇంతటి సద్గుణ సంపన్నురాలివి కాబట్టే, వాల్మీకి మహర్షి సీతాయః చరితమ్ మహత్..... మహత్తరమైన చరిత్ర నీదని శ్లాఘించారు.

ఆత్మదర్శనం కల్గించి మనిషిని తరింపజేసే మహాశక్తివి. కారణము నుండి వచ్చిన కార్యములన్నీ కారణము కంటే వేరు కానట్లు, మూలప్రకృతి రూపిణి అయిన నీలో నుంచి వచ్చిన అన్ని నామరూపాలు నీవే తల్లి. నిజానికి నీవు ఏకరూపిణి ఐనా, అనేక నామరూపాలతో గోచరిస్తున్నావు.

శక్తిస్వరూపిణివి నీవేనంటూ ... మందా హిమవతః సృష్ఠే గోకర్ణే భద్రకళా, చిత్రకూటే తధాసీతా వింధ్యే వింధ్యాధికారిణీ... అంటూ దేవీ భాగవతం తెలిపాక, వేయి మాటలేలా తల్లీ.

అమ్మా!
ఇంతకు ముందు ఆనందంలోనైన, ఆవేదనలోనైన అప్పుడప్పుడు రామయ్య తండ్రితో ఏదేదో మాట్లాడడం పరిపాటి. ఆపై ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించవయ్యా అనుకోవడమూ అలవాటే. కానీ, నీతో ఇలా ముచ్చటించడం ఇదే మొదటిసారి అయినను, మన్నించమని అడగను తల్లి... ఎందుకంటే నీవు అమ్మవు, అప్పుడే మాటలొచ్చిన బిడ్డ మాటలు తల్లికి మురిపమే కదమ్మా.

తల్లీ!
నీవు ఎంతో సౌందర్యవంతురాలివని, లోకోత్తర సౌందర్యవతివని వాల్మీకి మహర్షి మొదలు మొల్ల తదితర కవులెందరో కొనియాడారు. కానీ నిను కాంచే కవి హృదయం నాకు లేదమ్మా... పోనీలే అని కలలోనైనా కానరావు. ప్చ్...
నీ అంతర సౌందర్యం మాత్రం చూసానమ్మా.... అత్యంత అద్భుతం. కానీ, వర్ణించే భాషా సౌందర్యం నాలో లేదని నీకు తెలుసు కద తల్లి.

త్రేతాయుగంలోనే ముందు ముందు యుగాలలో మానవులు ఎలా నడుచుకొని తరించాలో, జీవన వాహినిలో ఎదురయ్యే ఒడిదుడుకులును ఎలా అధిగమించాలో, జీవితమంటే ఏమిటో నన్నది, అనుభవించి చూపించావు కద తల్లి. అందుకే ఎన్ని యుగాలు మారినా, నీవు అందరి గుండెల్లో అందరిదానివై నిలిచావు.

అమ్మా! 
ఏదైనా బాధలో ఉన్నప్పుడు, తెలిసి తెలిసి ఈ జన్మలో ఏ తప్పూ చేయలేదు, మరి ఏ జన్మ పాపమో, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నననో, ఎవర్ని బాధ పెట్టానో...ఇంత కష్టమొచ్చింది అనో...సామాన్య మానవులు తమ తప్పుని తెలుసుకోవడానికి తమలో తాము తర్కించుకుని మాట్లాడినట్లే, నీవు కూడా నీలో నీవు తర్కించుకొని, అరణ్యాలకు వస్తానని నీవు అన్నప్పుడు, రాముడు వద్దన్నప్పుడు, పరుషంగా మాట్లాడినందుకు, అలానే, మాయ లేడిని కోరేక, మరిది లక్ష్మణుడుని కఠినంగా నిందించినందుకే నాకీ వెతలని, వేదనతో ఓ మామూలు మానవకాంతలా పశ్చాత్తాప పడుతూ మాట్లాడడం...
అన్నీ తెలిసినా -
ఓ మాయలేడిని కోరుకుంటూ, రామలక్ష్మణులను పంపడం ...
మాయలవాడి మాటలు నమ్మి భిక్ష పెట్టి మోసపోవడం...
స్త్రీ సహజ చిత్తవృత్తిని ఎంత చక్కగా లోకానికి తెలిపావో కదమ్మా.

అయ్యోయ్యో... జగన్మాతవి, అందర్నీ చూడాలి...అయినా నా ముచ్చట్లతో నిన్ను చాలాసేపు కూర్చోబెట్టేసాను. కృష్ణుడటమ్మా రాసలీలప్పుడు ఒకేసారి  గోపికలందరు చెంతన  ఉన్నాడట. అదెలా సాధ్యమంటే, కృష్ణుడు పరమాత్ముడు, తనను తాను పలు కృష్ణులుగా విస్తరించుకొని, గోపికలందరి దగ్గర ఉన్నాడని చెప్తారు. మరి నీవో... పరాశక్తివి... జగన్మాతవి...నా దగ్గర కూర్చొనే, ఒకేసారి అందర్నీ చూసుకోగలవు. ఇదో భావ సదృశ్యం. ఏమనుకోకు తల్లీ... మరి కాసేపు కూర్చో... చివరగా నీ కళ్యాణ ముచ్చటా విను.
                     

              
అమ్మా! 
నీ తండ్రి జనకుడు బ్రహ్మజ్ఞాని. నీవేవరో తెలుసు...అందుకే నీవు వీర్యశుల్క వంటూ, ఎవరూ ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి వీలు కానటువంటి శివధనస్సుని ఎక్కుపెట్టిన వారితోనే నీ వివాహమని ప్రకటించడం... 
                           
రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తలపెట్టిన యాగ సంరక్షణ చేయడం, విశ్వామిత్రుడు రామునికి దివ్యాస్త్రాలు అనుగ్రహించడం, సిద్దాశ్రమంలో కొన్ని రోజులు గడపడం అయ్యాక, ఒకరోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో, మిథిలా నగరంలో జనక మహారాజు గొప్పయాగం చేస్తున్నాడట, అందరూ వెళ్తున్నారు, మనమూ వెళ్దాం, పైగా ఒకప్పుడు మిధిలాధిపతియైన దేవరాతుడు దేవతల నుండి ఒక ధనస్సును పొందాడు. ధృఢమైన ఆ ధనస్సును వంచి ఎవరూ నారిని సంధించలేరట... దానిని చూద్దాం పదండి... అని బయల్దేరదీసి, దారి పొడుగునా కుశనాభుని నూరుగురు కుమార్తెలు గూనివారయ్యే ఇతివృత్తం, సగరుని వృత్తాంతం, అహల్య వృత్తాంతం ... ఇలా ఒకోచోట ఒకో ఇతివృత్తం చెప్పడం ద్వారా గృహస్థాశ్రమ ధర్మం, వివాహం ఎవరు చేయాలి, ఎలా చేయాలి... వివాహం అయ్యాక ఎట్లా ఉండాలి... అనేక అనేక సూక్ష్మ ధర్మాలను చెప్పకనే చెప్పి, భవిష్యత్తులో రామచంద్రుని యందు ప్రకాశించే సద్గుణాలన్నిటికీ సానబెట్టి, ఓ వజ్రంలా చేసి, మిధిలకు యేతించి, నీ తండ్రికి, వీరు దశరథ మహారాజు పుత్రులని పరిచయం చేసి, శివధనుస్సును చూపమని, రాముణ్ణి చూడమనడం... అనాయాసంగా రాముడు ఎక్కుపెట్టగా ధనుర్భంగం కావడం... అప్పుడు కదమ్మా, నీ వివాహ సన్నాహాలు ప్రారంభమైనవి.

తల్లీ!
తాటకవధ... అహల్యశాపవిమోచనం... శివ ధనుర్భంగం చేసినప్పుడే రాముడు అవతార పురుషుడని గ్రహించి, నీ పాణిగ్రహణ సమయంలో జనకులవారు నిన్ను ఎంతో గొప్పగా పరిచయం చేస్తూ -
                  

ఈమె సీత. నా కూతురు. ఇకనుంచి నీకు ధర్మ మార్గంలో తోడుగా చరిస్తుంది. ఈమె పాణిని గ్రహించు, నీకు భద్రం కలుగుతుంది. ఈమె పతివ్రత, మహా భాగ్యశాలి, నీడవలే నిన్ను అనుసరిస్తుంది...అని అన్నారట కదమ్మా...
 
బ్రహ్మజ్ఞాని అయిన నీ తండ్రి భవిష్యత్ దర్శించారా ఏమిటి తల్లి? 
ఇయం సీతా... ఈమె నాగటి చాలున ఉద్భవించిన సీత. అయోనిజ. నాగటి చాలు రైతు కృషి ఫలింపజేస్తుంది. అలానే నీ కృషిని ఫలింపజేసే ఈమె సీత.

మమసుత... నా కుమార్తె.  నేను కనలేదని నాకూతురు కాదనుకుంటావేమో... ఆకాశవాణి చెప్పింది ఈమె నాకుమార్తె అని!

సహధర్మ చరితవ... నీకు దర్మమార్గంలో తోడుగా చరిస్తుంది... అంటే ధర్మం లేకపోతే ఈమె వుండదు, నీతో చరించదు, నీవు లేకుండా ఉండదు, ఈమెకు భర్తవయినందుకు ఇక నీవు ధర్మ మార్గంలో చరించి తీరాల్సిందే ... ఏం ముడి పెట్టారమ్మా... ధర్మ మార్గంలోనే చరించాలని శాసనమే చేసేశారు.

భద్రం తే... నీకు మంగళము అగుగాక. నిన్ను పెళ్లాడాక భద్రం (శుభమ్) కాకుండా ఎలా వుంటుంది?

ప్రతీచ్ఛచైనాం...ఈమెను పరిగ్రహింపుము. 
(మా అమ్మాయిని ఇస్తున్నాను, పుచ్చుకో...అని కాకుండా, ఈమె సాక్షాత్తు నీ దేవేరి, నీ అన్ని అవతారాల్లో ఈమెనే నీ సహదర్మచారిణి. ఈమెను గుర్తించి స్వీకరించు అన్న భావం ప్రస్పుటింపజేసిన నీ తండ్రి ఎంతటి జ్ఞానియో...)

పాణిం గృహ్ణీష్వ పాణినా...నీ చేతిలో ఆమె చేతిని తీసుకొనుము. ఇక ఈమె రక్షణా బాధ్యత నీదే సుమా అన్నట్లు చెప్పారు కదమ్మా.

పతివ్రతా... ఏ స్థితిలోనైన భర్తనే అనువర్తించే ఇల్లాలవుతుందని, 

చాయేవానుగత సదా... ఎప్పుడూ నిన్ను నీడలా అనుసరిస్తుందని ... (నీవు తండ్రి మాట ప్రకారం ఈ ప్రాయం లోనే విశ్వామిత్రుని వెంట వచ్చిన పితృవాక్య పరిపాలకుడువి అయినట్లే, ఈమె కూడా నా మాటకు విలువనిస్తూ నీ వెన్నంటే ఉంటుందని)...ఏం చెప్పారమ్మా.

రాముడు అరణ్యవాసంకు సిద్ధమైనప్పుడు, ఈ మాటలనే చెప్పి, ఒకింత పరుషంగా మాట్లాడి, రామయ్యను ఒప్పించావు కదా. ఈ ధర్మాచరణ వైశిష్టమే ఉన్నత పథంలో నిలుపుతుందనడానికి తార్కణమై నిలిచావు. ఎంత చక్కటి చరితం తల్లి నీది... 
                   

అమ్మా!
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి...అని, నేను రామ ధ్యానం మరిచిన, నా ధ్యాస మరలిన, నన్ను నిరంతరం అనుగ్రహించమని రామయ్యకు చెప్పు తల్లి... అని చెప్పాలనుకున్నాను కానీ, నిజం చెప్పనా తల్లీ...నీతో ఇలా మాట్లాడుతుంటే, ఏదో భరోసా... ఎంతో భద్రత... ఎనలేని నిశ్చింత. ఇంకా దేనికమ్మా... సిఫారసులు?

అమ్మా! 
నీతో ఇంకా ముచ్చటించాలని ఉంది, అదేమిటో తల్లి, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే, తనివి తీరదెన్నటికీ. ఇది అనంతం. అయినా నా పిచ్చిగానీ, తరించడానికి అమృతం అంతా కావాలా... ఒక్క చుక్క చాలదూ.....