22, డిసెంబర్ 2015, మంగళవారం

"సత్య"సాధన

                                                   "సత్యమేవ జయతే"
                        సత్యమేవ జయతే అనేది భారత ప్రభుత్వం స్వీకరించిన ధ్యేయవాక్యం. 


సత్యంకు ఇంతటి ఘనత ఎందుకు? అసలు సత్యమంటే ఏమిటీ?

పరబ్రహ్మ స్వరూపమే సత్యము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్ లో చెప్పబడింది.
అటులనే ముండకోపనిషత్ సత్యమేవ జయతి (సత్యమే జయిస్తుంది)అని వక్కానిస్తుంది. 
బ్రహ్మసత్యం జగత్ మిధ్య (బ్రహ్మమే సత్యమని, జగత్తే మిధ్య)అని శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు.

సత్యమే అత్యున్నత సద్గుణం.
సత్యమే సకల సుగుణాలకు మకుటం.
సత్యమే సాధకునికి ఆలంబనం.
సత్యమే సత్య వాదులకు లక్ష్యం. 
సత్యమే పరమపదం.
సత్యమే పరమాత్మ.
సత్యమే సత్ సాధకులకు అత్యుత్తమ అనుష్టానం. 

సత్య పధంలో సాధన, సాధ్యం రెండూ కూడా 'సత్యమే'.

"మంచి నడవడిక అనేది ఒక మహాసాగరం. ఆ సాగరం నుండి తరింపజేసేందుకు ఓడలాగా ఉపయోగపడేది సత్యవాక్యం" అని తెలియజెప్తుంది విదురనీతి.  

"సత్యానికి సరి సమానమైన తపస్సు లేదు.అసత్యాన్ని మించిన పాపము లేదు.ఓ దేవా! ఎవరు సత్యాన్ని అనుష్థిస్తారో వారి హృదయంలో నీవు నెలకొని వుంటావు" అని సత్యం యొక్క ఔనత్యాన్ని కీర్తిస్తాడు కబీర్ దాసు.

"యవ్వనం, సౌందర్యం అదృశ్యమౌతాయి; జీవితం, సంపద మాయమౌతాయి; పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి; పర్వతాలు సైతం దుమ్ము ధూళిగా మారతాయి; సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి; సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది" అని నినదించారు వివేకానందులవారు. 

మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం అన్న సుభాషితం ప్రకారం మనస్సులోని భావన, మాట, చేత ఈమూడు ఒకేరీతిలో వుండడం సత్యవ్రతుని లక్షణం. ఇలా మనస్సు, వాక్కు, కర్మల సమన్వయంలో చేసిన సాధనే సత్యవంతమైన జీవితానికి 'అత్యావశ్యకం '.

సత్యానుసారిణీ లక్ష్మీ: కీర్తి స్త్యగానుసారిణీ
అభ్యాస కారిణీ విద్యా బుద్ధి: కర్మానుసారిణీ
సత్యం మానవుణ్ణి తరింపజేస్తుంది. గౌరవం, సంపద మొదలైనవి సత్యాన్ని అనుసరించి వస్తాయి.

శ్రీ వసిష్టవారు దిలీప మహారాజుతో దేనివలన జనన మరణ భవసాగరము తరింపబడునో, దానికే తీర్ధమని అంటారని, మానసాది తీర్ధంలను గురించి వివరిస్తూ మొదటగా చెప్పింది ... సత్యము గురించే! సత్యమే ఓ తీర్ధమని... ఇలా తెలిపారు -

సత్యాదీనాంచ తీర్దానాం లక్షణం శృణు పార్ధివ/
యస్య శ్రవణ మాత్రేణ సర్వస్నాన ఫలం లభేత్//
అనుద్వేగ కరం హృద్యం సజ్జనానంద కారణమ్/
ఏవం లక్షణ సంయుక్తం సత్యం ప్రాహుర్మ నీషిణః //
సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయాన్న బ్రూయాత్సత్యమప్రియమ్/
ప్రియం చ నానృతం బ్రూయా దేష ధర్మస్సనాతనః //
ఓ రాజా! సత్యాది తీర్ధముల కధనమును వినిన మాత్రమునే సమస్త తీర్ధముల యందును స్నానం చేసిన ఫలం లభించును. మనస్సుకు ప్రియమైనది, ఇంపైనది, సత్పురుషులకు ఆనందం కలుగజేయునదియు ఏదియో,  అది సత్యమని మహాత్ములు  చెప్పుదురు. ఓ రాజా! ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను. ఆ సత్యమునే ప్రియంగా హితంకల్గేలా చెప్పవలెను. ఇదే అనాది ధర్మమని  పెద్దలు చెప్పుదురు... అని వసిష్టులవారు చెప్పగా -

అనుద్వేగ కరంవాక్యం సత్యం ప్రియం హితం చ యత్ అన్నది గీతాచార్యుని బోధన.

సత్యం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషధర్మ స్సనాతనః
సత్యం చెప్పినా అది ఎదుటివారికి ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని కలిగించకుండా ప్రియంగా చెప్పగలగాలి. అలా చెప్పలేని సత్యమైతే, అట్టి సత్యాన్ని చెప్పకుండా నిగ్రహించుకోవాలని మనుస్మృతి తెలుపుతుంది.
అంటే ... సత్యం చెప్పడం వలన ప్రాణి హింస,  ప్రాణాంతకమైన స్థితి వస్తే, హింసకు తావీయకుండా సత్యంను  వెల్లడి చేయకుండా నిగ్రహించుకోమనే శాస్త్రం చెప్తుంది.
ఇక్కడ ఎప్పుడో చదువుకున్న ఓ కధ గుర్తుకొస్తుంది -
పూర్వం సత్యవ్రతుడనే మహాపురుషుడు ఉన్నచోటుకు ఓ జింక పరుగెత్తుకొని వచ్చి దాక్కుంది. దానిని తరుముకొని వచ్చిన వేటగాడు 'స్వామీ! ఈ వైపు జింక పరుగెత్తుకొచ్చిందా' అని అడుగగా -
నిజం చెబితే జీవహింసలో తనకూ భాగం ఏర్పడుతుంది, లేకుంటే అసత్యదోషం వస్తుంది, అందుకని చాలా జాగ్రత్తగా మృదువుగా 'చూసిన కంటికి చెప్పేశక్తి లేదు, చెప్పగల నోటికి చూసేశక్తి లేదు' అని బదులిచ్చి ఊరుకోగా... ఆ బోయకు ఈ మాటలు అర్ధంకాక తనదారిన తాను వెళ్ళిపోయాడు. 

ఇక; సత్యం చీర కట్టుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చింది, సత్యం చెప్పులేసుకొని బయల్దేరేలోపు అసత్యం వాడవాడలా తిరిగివచ్చింది ... అని లోకోక్తి. 
సత్యవాది లోక విరోధి, సత్యాన్ని చెప్పినా వినేవారు ఎవరు... విలువ ఇచ్చేవారు ఎవరు ... ఒకోసారి కోరి కష్టాలను తెచ్చుకోవడమే అనేవారు వున్నారు.  
నిజమే ... సత్యనిర్వహణ చాలా కష్టమైన విషయం. కానీ, సత్యసంధతదే అంతిమ విజయం ... శాశ్వత విజయం! సత్యాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తే విజయం తధ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించక తప్పదు.

చిన్నప్పుడు చదువుకున్న సత్యసంధత పాఠమొకటి గుర్తుకొస్తుంది -
పులివాత పడిన ఒక గోవు తన లేగదూడకు పాల్లిచ్చి తిరిగి వస్తానని ప్రమాణం చేసి వచ్చి, దూడకు పాలిచ్చి పులి ఆహారంనకై మరల తిరిగివెళ్ళిన గోవు తన సత్యసంధతతో ఆపదనుండి బయటపడినది.    

ఇక సత్యం విలువను తెలిపే మరో ఘటన -
నుతజల పూరితంబులగు నూతులు నూరింటి కంటె సూ
న్నతవ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూరింటి కంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్త్కతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్
                                                                 -నన్నయ్య (మహాభారతం)
తియ్యటి నీటితో నిండిన నూరు నూతుల కంటే ఒక దిగుడుబావి మేలు. ఆ దిగుడుబావులు నూరింటికంటే ఒక యజ్ఞం గొప్పది. అటువంటి నూరు యజ్ఞాలు కంటే, ఒక కొడుకు గొప్ప. అటువంటి నూరుగురు కుమారులు కంటే ఒక సత్యవాక్యం మిన్న ... అని శకుంతల దుష్యంతునికి చెప్పిన ఈ మాటలు సత్యవాక్య విలువను తెలుపుతుంది.  

సీతమ్మను అపహరించడానికి రావణుడు, మారీచుని సహాయం కోరినప్పుడు ... మారీచుడు, 
రావణా! ధర్మమూర్తి అయినా రామునితో వైరం పెట్టుకోవద్దు, నీతో పాటు నీ వంశమంతా నాశనమౌతుంది అని చెప్తూ ... 
సులభాః పురుషాఃరాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్యచ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః // అని అంటాడు. 
రాజా! నీకు ప్రియవచనాలతో, స్తోత్రవ్యాక్యాలతో సంతోషం కల్గించేవాళ్ళు చాలామంది వున్నారు. కానీ, నీకు వినడానికి అప్రియంగా వున్నా, హితకరమైన సత్యమైన మాట చెప్పేవాళ్ళు దొరకరు. చెప్పినా వినేవాళ్ళు దొరకరు...

సత్యమును మారీచుడు చెప్పిన గ్రహించక ధర్మాన్ని తప్పిన రావణుడు సత్యవాక్కు పరిపాలకునిచే సంహరింపబడ్డాడు.
అసత్యం చెప్పదగిన సందర్భాలు శుక్రాచార్యుడు ఉదహరించిన వినక మానధనులు మాటతిరగరాదని, సత్యహీనున్ని కాలేనని, సత్యవాక్కుకు కట్టుబడిన బలిచక్రవర్తి ....
అటులనే -
విశ్వామిత్రుడు కల్పించిన అనేక కష్టాలను ఎదుర్కొన్న సత్యదీక్షను విడవకపోవడంతో సత్యవాక్పాలకుడు అయిన హరిచంద్ర చక్రవర్తి ...
ఎంతటి ఘనకీర్తిని పొందారో జగద్వితితమే.

సత్యపధగాములందరూ తమ మాటలలో, నడవడికలో బహు జాగ్రత్త వహిస్తారు. ఈ రకమైన నియమపాలన సహజంగానే మనిషిని నిరంతరం జాగరూకతలో ఉండేలా చేస్తుంది.ఇది తీవ్రమైన తపస్సుగా, అనుష్ఠానంగా రూపుదిద్దుకుంటుంది.ఈ విధంగా సాధకుని 'సత్య సాధన ' అతని మనోప్రపంచంలో నూతన పరిధిలను ఆవిష్కరించుకునేలా చేస్తుంది.

అలానే, ఒక వ్యక్తి సత్యానుష్ఠానం వల్ల సత్యసంధుడు అయినప్పుడు అద్భుతమైన సంకల్పశక్తిని సంతరించుకుంటాడు.

ఇక మన జ్ఞానేంద్రియముల పరిధిలోనికి వచ్చే విషయాలను యధాతధంగా చెప్పడం వ్యవహారిక సత్యం కాగా, కొన్ని కొన్ని సందర్భాల్లో అసత్యమైనవి సత్యంగా భ్రమింపజేస్తాయి. దీనిని ప్రాతిభాషిక సత్యమంటారు. శాస్త్రం ఇటువంటి భ్రాంతిని 'రజ్జు సర్ప భ్రాంతి'గా పేర్కొంటుంది.  ప్రాపంచిక వ్యవహారాల్లో ఇటువంటి భ్రాంతులకు లోను కాకూడదనే పెద్దలు కళ్ళతో బాగుగా పరిశీలించి,
సత్యమును గ్రహించి మనస్సులో వడబోసిన మాటనే పలకాలి... అని చెప్తారు. ఇక బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య అనే పారమార్ధిక సత్యమే అసలైన సత్యం. ఈ పారమార్ధిక సత్యంకై చేసే సాధనే "సత్య"సాధన. 

అటువంటి సాధనకై -  
సత్యవంతమైన జీవితాన్ని గడిపిన హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, యుధిష్ఠరుడు మొదలైన వారి జీవితం, సందేశాలను పఠించి,తద్విషయముపై ధ్యానించాలి.........

ఎంతసేపు పురాణ పురుషులనే ఉదాహరణలుగా చూపడమే గానీ, అటుపై అన్యులెవరూ లేరా ... ఇది నేను ఈ పోస్ట్ టైపు చేస్తుండగా వెనక నిల్చొని చదివిన ప్రక్కింటి అమ్మాయి ప్రశ్న ... 
లేకేం ... సత్యము, అహింస అను  రెండు సద్గుణములును పాటిస్తూ, భారతీయ పతాకమును ఎగురవేసి, మన ఖ్యాతిని పెంచిన జాతిపిత మహాత్ముడు బాపూజీ ఉన్నారు. అలానే దేశ విదేశాలలో మన భారతీయ ఔనత్యాన్ని, తానూ నమ్మిన సత్యాన్ని చాటిచెప్పి మన స్థాయిని చిరస్థాయిగా నిలిపిన వివేకానందుడు ఉన్నారు.... 




29, నవంబర్ 2015, ఆదివారం

మాతృమూర్తులకు ఆహార నియమావళి

హిందూ సంస్కృతిలో మాతృస్థానం మహోన్నతమైనది. మాతృదేవోభవ  అని వేదమే మాతృస్థానంను శ్లాఘిస్తుంది. ఓ బిడ్డకు జన్మమిస్తున్న స్త్రీ మూర్తిని దైవంగా కొనియాడే శాస్త్రాలు ఆ పుట్టబోయే బిడ్డ మంచిగా మేధావిగా ప్రజ్ఞా ధీశాలిగా జనించాలంటే గర్భవతి అయిన ఆ స్త్రీ ఏం చేయాలో కూడా శాస్త్రాలు తెలుపుతున్నాయి .
మాతృమూర్తి గర్భంలో ప్రవేశించిన జీవకణం క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది.  అట్టి శిశువుని మొదటిమాసం నుండి నవమాసముల వరకు, వరుసగా ఒక్కొక్క మాసం వివిధ దేవతాశక్తుల రూపేణా లలితా అమ్మవారు ఎలా పరిరక్షిస్తూ వుంటారో లలితా సహస్ర నామములయందు చక్కగా తెలపబడింది. ఆయా మాసముల యందు ఆయా దేవాతశక్తులకు ప్రీతికర ఆహారమును గర్భవతులు అయినవారు స్వీకరిస్తే, ఆయురారోగ్య తేజోవంత సత్సంతానంను పొందుదురు.

మాతృమూర్తులగు స్త్రీలకు ఆహార నియమావళి -
                                                   

మాతృమూర్తులగు స్త్రీలకు లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.


విశుద్ధి చక్రనిలయా,‌ రక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,‌உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,‌உతిగర్వితా || 104 ||
మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ || 105 ||
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,‌உస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||


సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,‌உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||


పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది 

మొదటినెల -
విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై వుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి వుంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి, మొదటినెలలో గర్బస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్ స్థ. ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి, బెల్లం జోడించి, తదుపరి ఆవునెయ్యిని కలిపిన పాయసాన్నప్రసాదమును లలితా సహస్ర నామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి, దానిని పవిత్రభావనతో గర్భిణీ స్త్రీ మొదటినెలలో స్వీకరిస్తే, చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది.

రెండవ నెల -
అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకిని దేవతగా కొలువై వుంది. ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో, అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి యుంటుంది. ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవనెలలో స్వీకరిస్తే, శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది.

మూడవ నెల -
మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకిని దేవతగా కొలువై వుంది. ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి యుంటుంది. ఈమె మాంస నిష్ఠ. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం,  బెల్లం, ఆవునెయ్యిలతో తయారుచేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ మూడవనెలలో స్వీకరిస్తే, శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది.

నాల్గవ నెల -
స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకిని దేవతగా కొలువై వుంది. ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో, శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి యుంటుంది. ఈమె మేధో నిష్ఠ. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దద్ధ్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ నాల్గవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది.

ఐదవ నెల -
మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత  సాకిని దేవతగా కొలువై వుంది. ఈమె ఐదు ముఖాలతో, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి యుంటుంది. ఈమె ఆస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి.

ఆరవ నెల -
ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలుతో శోభిల్లుతుంది. ఈమె మజ్జా సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు.  ఈమె మజ్జా దాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి. ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తి విశ్వాసంలతో గర్భిణీ స్త్రీ ఆరవనెలలో స్వీకరిస్తే, శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది.

ఏడవ నెల -
సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె సర్వ వర్ణాలతో, సర్వాయుధాలను ధరించి యుంటుంది. ఈమె శుక్ల సంస్థిత. జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దద్ధ్యన్నం, కట్టుపొంగలిహరిద్రాన్న ప్రసాదంలు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుసక్రమంలో ఆరురోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే, శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి, పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది.

ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు -
సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలితా అమ్మవారిని ఆరాధిస్తూ, క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ, స్వీకరిస్తే,చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తధ్యం. 

15, నవంబర్ 2015, ఆదివారం

మిత్రమా! నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!

మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!
ఆహా ... ఎంతటి భరోసా, ఎంతటి సౌఖ్యత, ఎంతటి భద్రత...
ఏ బంధము ఇవ్వగలదు... ఇంతటి హాయిని. ఇది ఒక్క స్నేహమునకే చెల్లుతుంది.

నిన్న వుదయం నా మిత్రురాలు 'హరిప్రియ' వస్తూనే అడిగిన ప్రశ్న 'భారతీ, స్నేహమంటే ఏమిటీ'?

అంతరంగమున అదో ఆత్మీయస్పర్శ, హృదయాన్ని తాకే ఆనందవీచిక, అపురూపమైనది, అమృతతుల్యమైనది, మదిని మురిపించే, మరిపించే మధురభావన. అంతా తానై లోలోన ఆత్మీయంగా కదిలాడే ఆ అవాజ్యనురాగభావం అనిర్వచనీయం. ఎంతచెప్పినా తక్కువే అయ్యేటటువంటి ఆ అద్భుతబంధంగురించి ఏమని చెప్పగలను... అందుకే  దానిని ఆస్వాదించగలనే తప్ప, వ్యక్తం చేయలేనురా అన్నదే నా ప్రత్యుత్తరం మయింది. అప్పుడు చూశా... తన కళ్ళలో కన్నీరు. ఏమైందిరా అని అనునయంగా అడగగా అడగగా ...
ఎంతో ఆధ్యాత్మిక అవగాహన, వాక్పటిమ, మంచిమనస్సున్న తన సత్సంగమిత్రురాలు ఓ విషయంలో సరైన మార్గంలో వెళ్ళడం లేదని, అందుకే తన శ్రేయస్సును కోరుకుంటూ, ఆ విషయమై వారిస్తూ, తప్పనిసరై పరుషంగా తనతో మాట్లాడానని, దానికై తను నాకు స్నేహమంటే ఏమిటో తెలియదని, స్నేహానికి వున్న విలువను గుర్తించడం నాకు చేతకాదని, ఇకపై నాతో మాట్లాడానని, నా స్నేహమే వద్దనేసింది... అని చెప్పింది.
అందర్నీ అర్ధం చేసుకుంటూ, అందరితో ఆత్మీయంగా మసులుకుంటూ, ఎవ్వరినీ, ఎప్పుడూ నొప్పించని స్వభావం నా ప్రియాకు పెట్టని ఆభరణం. అలాంటిది తనే పరుషంగా, చెలిమిలో స్పర్ధ కలిగేటట్లు మాట్లాడడమా ... ఆశ్చర్యంగా అన్పించి అదే అడిగాను. తన మేలు కోరి, తప్పక కటినంగా మాట్లాడానని అన్నది. స్నేహమనే కాదు, ఏ బంధంలోనయినా కటినంగా మాట్లాడితే ఆ బంధం బలహీనపడదా? అలా ఎందుకు చేశావమ్మా ... అని అడగగా, గతంలో సరళంగా చెప్తే తను విన్పించుకోలేదు, కాబట్టి కాస్త కరుకుగ్గా చెప్పాను, ఏం ... నీవు కూడా నాకు స్నేహం తెలియదని, స్నేహధర్మాలు తెలియవని, తప్పు చేశానని అంటావా అని అంటుంటే ...
లేదు నాన్న, నిజమైన స్నేహం అమ్మలా లాలిస్తుంది, ప్రేమిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది, రక్షిస్తుంది. గురువులా బోధిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ మువ్వురిలా తప్పుచేస్తే శ్రేయస్సు కోరి దండిస్తుంది. నీవు తన హితాన్ని కోరి ఇలా చేశావని తప్పక తను గ్రహించి, మరల నీదరి చేరుతుంది. బాధపడకురా, తాత్కాలిక మనస్పర్ధలు ఎదురైనా ఉత్తమమైత్రి బలపడుతూనే వుంటుందిరా...  అని నేననగా, తను నన్ను అర్ధంచేసుకున్నా, లేకున్నా; నాతో మాట్లాడినా, మాట్లాడకపోయినా ... పర్వాలేదు భారతీ, నేను కోరుకున్న మంచి తనకి జరిగితే చాలు అని అంటున్నా ప్రియను చూస్తూ మనస్సులో ఇలా అనుకున్నా ... "ఎవరుంటారు మిత్రుల కంటే శ్రేయోభిలాషులు".

ప్చ్ ... తనను తననుగా గుర్తించి, అభిమానించి, ఆత్మసములుగా భావించి, ఆత్మీయంగా స్వీకరించే స్నేహితులుతో చిరు బేదాభిప్రాయం వచ్చిందనో, పరుషంగా మాట్లాడిందనో ఆ స్నేహంను వదులుకునే ముందు నన్ను నన్నుగా అభిమానించే ఫ్రెండ్ ఎందుకు అలా మాట్లాడిందో అవగాహన చేసుకోవడం మిత్రధర్మం.

కృష్ణ కుచేలల మైత్రి, రామసుగ్రీవుల మైత్రి చిరస్మరణీయాలు. ఒక్కసారి వారి వారి స్నేహాలను గమనిస్తే, మిత్రులు ఎలావుండాలో. మిత్రధర్మాలు, మిత్రలక్షణాలు అవగతమౌతాయి.
ఉదాహరణకు రామ సుగ్రీవ మైత్రిని పరిశీలిద్దాం -
వాలిని సంహరించి, తన మిత్రుని కష్టాన్ని తొలగించి వానరరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. కొన్ని నెలల అనంతరం (వానాకాలం ముగిశాక) సీతాన్వేషణ జరిపి, ఆమెను సంపాదించడంలో నీవు చేసే ప్రయత్నంలో సహకరిస్తానని మాట ఇచ్చిన సుగ్రీవుడు ఆ మాట మరిచాడు. తన మిత్రుడు మాట తప్పాడని నింద పడకూడదని, తన వాగ్ధానమును తనకి గుర్తుచేయాలని భావించి, లక్ష్మణుని పంపి సుగ్రీవుణ్ణి హెచ్చరించాల్సివచ్చింది. ఎంతటి ఉదాత్తమైన ఆలోచనిది.
వానరులంతా సేతునిర్మాణం చేసుకొన్నా మొదటి రాత్రి, వానరులతో కలిసి ఒక ఎత్తైన పర్వతం ఎక్కిన రాముడు లంకానగరపు నిర్మాణక్రమాన్ని గమనిస్తుండగా, అదే సమయంలో లంకానగరంలో ఓ ఎత్తైన మేడపై తిరుగుతున్నా రావణుని గమనించిన సుగ్రీవుడు, నా మిత్రునికి ఇంత కష్టాన్ని కలిగించినది ఈ రాక్షషుడే అని అనుకుంటూ, తన శక్తియుక్తులను మరిచి, ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరి, రావణుని పై దూకి, పిడిగుద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసి, తిరిగి రక్తసిక్తమైన దేహంతో ఎగశ్వసతో రాముని ముందు వాలగా, సుగ్రీవుడు చేసిన పనికి నొచ్చుకొని, నీవు మా అందరికీ నేతవు... నేత తలతో సమానం, తలపోతే మిగతా శరీరానికి ఏం విలివ? 'సుగ్రీవా! నీకు ఏమైనా అయితే, నాకు సీతతో ఏం పనయ్యా' అని అంటాడు రాముడు. పైగా, నీకు ఏమైనా అయితే, నీ మాట నిజం చేయటం కోసం రావణున్ని చంపి, సీతను విడిపించి, అయోధ్యకు చేర్చి, వానరులందరినీ కిష్కింధకు చేర్చి, ప్రాయోపవేశంలో మిత్రువైన నిన్నే తలచుకుంటూ వదిలేద్దాం అనుకున్నాను అని అంటాడు రాముడు. ఎంతటి అవాజ్యనురాగమిది.

జీవితంలో ఎందఱో తారసపడుతుంటారు. అందులో కొందరు మంచి పరిచయస్థులుగా వుంటారు. అతికొద్దిమంది అతి తక్కువ సమయంలోనే స్నేహితులుగా, ఆత్మసములై అల్లుకుపోతారు. శరీరాలు రెండయినా, ఏకాత్మభావనతో ఒకటిగా వుండటం నిజమైన మైత్రి.

నిజమైన మైత్రి, తన మిత్రులు సరైన మార్గం తప్పితే వెంటనే హెచ్చరిస్తుంది. అపార్ధం చేసుకున్నా, తిట్టినా, చివరికి దూరం చేసినా వారి శ్రేయస్సును కోరి మంచినే చేస్తుంది, చెప్తుంది. చిరు భేదాభిప్రాయాలు వచ్చాయనో, పరుషంగా మాట్లాడారనో అపార్ధం చేసుకోకుండా, అవగాహన చేసుకుంటూ, అర్ధంకాకుంటే ఎందుకలా మాట్లాడావని తననే అడిగి తెలుసుకోవడం ఉత్తమగుణం.

పాపా న్నివారయతి యోజయతే హితాయ
గుహ్యంచ గూహతి గుణాన్ ప్రకటీ కరోతి
అపద్గతంచ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణ మిదం ప్రవదంతి సంతః
సన్మిత్రులు తమ స్నేహితులను చెడుపనులనుండి వారిస్తారు. మంచి పనులు చేయుటకు ప్రోత్సహిస్తారు. రహస్యాలను గోప్యంగా వుంచుతారు. స్నేహితుల సద్గుణాలను ప్రకటిస్తారు. ఆపదవచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోక, ఆదుకుంటారు. సమయం వచ్చినప్పుడు అవసరమైన వాటిని సమకూర్చుతారు.

కరా వివ శరీరస్య నేత్రయోరివ పక్ష్మణీ / అవిచార్య ప్రియం కుర్యాత్ తన్మిత్రం మిత్రముచ్యతే... శరీరానికి చేతులవలె, కళ్ళకు రెప్పలవలె అప్రయత్నంగా అనుకోకుండా, అలవోకగా మంచిచేసే మిత్రులే మిత్రులు.
సుహృదం హితకామానాం యం: శృణోతి న భాషితం ... మన మేలు కోరేవారే నిజమైన మిత్రులు. అట్టి మిత్రుల మాటలను వినాలి.

మైత్రీ సమానుశీలేషు ... సమానశీలం కలిగిన వారియందు మైత్రిభావం అధికం. వారి అనుభూతులు, ఆలోచనలు, స్పందనలు ఒకేలా వుంటాయి. వారి హృదయాలు ...  ప్రతీక్షణం సంభాషించుకుంటాయి, మనకోసం మనకై వున్నారో ఆత్మీయ వ్యక్తి అన్న మధురభావనతో అనిర్వచనీయ ఆనందంను పొందుతుంటాయి. ఓ అనియంత్రణశక్తి ఏదో కలిపి వుంచుతుందన్న అనుభూతి. అయితే, స్నేహితుల స్వభావాల రీత్యా అప్పుడప్పుడు వారి వారి అభిప్రాయలు నప్పనూ వచ్చు, నప్పకపోవచ్చు. అప్పుడే విభేదించక సరికానివి సరిచేసుకుంటూ, సరైనమార్గంలో సాగిపోవడమే సన్మిత్రుల లక్షణం.

స్నేహితుడంటే ... నవమాసాలూ మోయని తల్లి, రక్తం పంచిన తండ్రి, బెత్తం పట్టుకోని గురువు, చుట్టరికం లేని బంధువు, అక్షరాలకతీతమైన పుస్తకం. ఇంకా యింకా ... స్నేహం గురించి చెప్పడానికి ఎన్ని ఉపమానాలైన తక్కువే. ఆ అనుబంధం అన్ని బందాలకన్నా బెత్తుడు ఎక్కువే ... అని స్నేహ రసజ్ఞులు అంటుంటారు.
యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం ... మిత్ర ముండె నేని సిద్ధౌషదం అక్కరలేదన్నది భర్తృహరి సుభాషితం.


మరి ఇటువంటిస్నేహాన్ని జీవితాంతం నిలుపుకోవడం ఎంతో ఉత్తమోత్తమం కాదా?
                                          మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక... కాదు కాదు మరుజన్మలో కూడా! 
                                                                                                               



12, అక్టోబర్ 2015, సోమవారం

ఆధ్యాత్మిక అభిరుచి గల బ్లాగర్స్ అందరికీ ఓ అభ్యర్ధన ...

                                                                


నాకు రామాంజనేయులంటే అమిత ఆరాధన. ఆధ్యాత్మికతను అర్ధం చేసుకుంటూ, అటు పయనించాలనే అభిలాష. 
ఆధ్యాత్మిక విషయాలు పఠన, శ్రవణముల ద్వారా తెలుసుకున్నవి మర్చిపోకుండా, మననం చేసుకోవడానికి వీలుగా వుంటుందని, మంచివిషయాలు నలుగురితో పంచుకోవడం కూడా అవుతుందని, వాటిని "స్మరణ"లో పదిలపరుస్తున్నాను.

ఈ మధ్య నా అవగాహన మేరకు చక్రాలు గురించి వివరణను పెట్టాను. అయితే, అనాహత చక్రం గురించి టపా పెట్టాక, ఒకరు వ్యాఖ్యకు బదులిచ్చాను గానీ, ఆ సందేహం నన్ను తొలుస్తుంది. దయజేసి ముందుగా ఆ లింక్ ను ఇక్కడ చూడండి.

అనాహతచక్రమునకు అధిదేవత లలితా సహస్ర నామముల యందు ఇలా తెలపబడింది.
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిరసంస్ధితా
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణీ.

ఈ విధంగా చూస్తే ఈ చక్రంనకు అధిదేవత 'రాకిని' గా తెలుస్తుంది. 
అయితే ఓ సత్సంగ మిత్రురాలు ఈ చక్రమునకు అధిదేవత 'కాకిని' అని చెప్తూ, కొన్ని పుస్తకములు ఇచ్చారు. అందులో అధిదేవత 'కాకిని' అనే వివరణే ఉంది. అటుపై కొందరు పెద్దలను అడిగాను. 'రాకిని' కదండీ అని వారిని నేనడిగితే, అన్ని పేర్లూ అమ్మవేనమ్మా, కానీ, అనాహత చక్రమందు యున్న పరాదేవత "కాకిని" అని చెప్తూ, వారు కూడా ఆ టపాకు వచ్చిన వ్యాఖ్యకు నేనిచ్చిన జవాబునే వివరణగా తెలిపారు. కానీ, ఎందుకో ఏదో అశాంతి. లలితలో వున్నది తప్పని అనగలమా? అమ్మో! ఈ భావనే నన్ను వణికిస్తుంది. మనసంతా వేదనమయంగా వుంది. 
ఇక, నేను చదివిన, విన్న వాటిని తప్పని అనుకోవడమా?  ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఆవేదనగా ఉంది.  

ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది. ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది. అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను.  అప్పటినుండి నాలో తెలియని అపరాధభావన. సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన. ఆ తపనతో  ఆర్తిగా మీ ముందుకు వచ్చి అభ్యర్ధిస్తున్నాను. దయజేసి మీ  సమాధానంను వివరంగా తెలిపి నాకు సరైన అవగాహనను కల్పించి, సరైన మార్గంలో నేను పయనించడానికి సహకరించవలసిందిగా మీ అందర్నీ ప్రార్దిస్తున్నాను. 

6, అక్టోబర్ 2015, మంగళవారం

"పంచభూతాలు"సాక్షిగా...

ఈ మధ్య నాకో సందేహం వచ్చింది, "పంచభూతాలు"సాక్షిగా అని ఎందుకంటారని?

న్యాయస్థానాలు 'భగవంతుని సాక్షిగా' అని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. అగోచరుడయిన భగవంతునికి ప్రతినిధిగా, తనచే చెప్పబడిన గీతను భగవత్ స్వరూపంగా భావిస్తూ ప్రమాణం చేయిస్తారని ఎక్కడో విన్నట్లు జ్ఞాపకం.  ఈ రీతిలోనే భగవంతునిచే సృజింపబడిన పంచభూతాలను భగవత్ స్వరూపంగా భావించి అలా అంటారా??? మరికొంత వివరణగా తెలుసుకోవాలనిపించి, కొందరు బ్లాగ్ మిత్రులను ఈ ప్రశ్నను అడగగా -
వారు వారి అభిప్రాయాలను తెలిపారు. వారి అమూల్య అభిప్రాయాలను  స్మరణలో పదిలపరుచుకునే ముందు, ముందుగా అసలు  ఈ పంచభూతాలు అంటే ఏమిటీ?  వాటి  ప్రాముఖ్యత ఏమిటీ ... అన్నది నేను చదివిన, విన్నదానిబట్టి నాకు తెలిసినది నా అవగాహన మేరకు ఒకింత వివరణ -

పంచభూతాలు :- పృథ్వి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం.
నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, శక్తిమంతుడు, చైతన్యుడు, అతీంద్రియుడు, సర్వాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ ... అని మనం పిలిచే కొలిచే భగవంతుడు నుండే ఈ పంచభూతాలు ఓ క్రమపద్ధతిలో ఉత్పన్నాలైనాయి. ముందుగా శబ్దమయమైన ఆకాశం పుట్టగా, దాని నుండి స్పర్శతత్వం గలవాయువు పుట్టింది. ఈ వాయువు నుండి ఘర్షణ చేత రూపం గల అగ్ని పుట్టింది. అగ్ని నుండి రస స్వరూపమైన జలము పుట్టింది. దీని నుండి వాసన కలిగిన పృథ్వి పుట్టింది.
                                                                   
                                           

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే.
ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.

సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి. ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం. ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం. ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.

మన స్థూల దేహంలోని పంచభూతముల అమరిక ఇలా వుంటుంది -

పృథ్వి :- 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం /వాసన.  

అగ్ని :- 
శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 

జలం :- 
రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  

వాయువు :- 
శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 

ఆకాశం :- 
అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం 
ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 

ఇక సూక్ష్మ దేహంలో పంచభూతాల అమరిక -  

మనలో పంచకోశాలు వున్నాయి మొదటిది అన్నమయకోశం. ఇది భూతత్వం నకు సంబంధించినది. రెండవది జలతత్వంతో కూడిన ప్రాణమయకోశం. మూడవది అగ్నితత్వంనకు సంబంధించిన మనోమయకోశం. నాల్గవది వాయుతత్వంనకు చెందిన విజ్ఞానమయకోశం. ఐదవది ఆకాశతత్వంనకు చెందిన ఆనందమయకోశం. ఈ ఐదు కోశాల మధ్య పరబ్రహ్మతత్వమైన ఆత్మ యున్నది. 

అలానే పంచభూతాలకు ప్రతీకలుగా మనలో ఐదు శక్తి నాడీకేంద్రములున్నాయి. ఇవే శక్తి చక్రాలు.  అవి భూతత్వంనకు చెందిన మూలాధారం, జలతత్వానికి చెందిన స్వాధిష్టానం, 
 అగ్నితత్త్వానికి ప్రతీకగా మణిపూరకచక్రం, వాయువుకు ప్రతీకగా అనాహతం, ఆకాశతత్త్వానికి ప్రతీకగా విశుద్ధిచక్రం. {ఆజ్ఞా, సహస్రారాలు తత్త్వాతీత చక్రాలు}. మన నడవడిక, అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు, ప్రారబ్ధ వాసనలు బట్టి ప్రభావితమౌతూ ఇవి పనిచేస్తుంటాయి. 

ఇక "పంచభూతాల సాక్షిగా" అని ఎందుకంటారన్న నా ప్రశ్నకు నా మిత్రులిచ్చిన వివరణ - 


సరళ స్వభావి, మృదుభాషిణి, 'నా ప్రియనెచ్చలి' విశాలాక్షి గారు (వనితావని వేదిక  బ్లాగర్) వివరణ -

భారతిగారూ! నాకు మంచి పరీక్షే పెట్టారు. అయినా చూద్దాం. నేను రాసింది మీకు సమ్మతమో, కాదో....
పంచభూతాలు:-- పృధివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం...
పంచ ప్రాణాలు :__ ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము...

వసుదేవత- వసువులంటే ప్రాణులు నివసింప యోగ్యమైనవి. భూమి మనకు నివాస యోగ్యము.
మృగాలకు, పశుపక్ష్యాదులకు,క్రిమికీటకాదులకు ఈ భూమే నివాసం. అన్నింటికి ఆశ్రయమిచ్చే ఈ పృధివి దేవత మనం తినే ఆహార పదార్ధాలు - ధాన్యాలు,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, సుగంధంతో పరిమళాలు వెదజల్లే పుష్పాలు ఇవన్నీ భూమి ద్వారా లభ్యమవుతాయి. ఇవేకాక విలువైన ఖనిజాలు,లోహాలు, సువర్ణము, రత్నాలు, వజ్రాలు మొదలైన విశేషమైన ధాతువులు మనకు భూమి నుండే లభిస్తాయి.

జలదేవత:-- మన జీవనానికి నీరు చాలా అవసరం. నీరు లేకుంటే సమస్త ప్రాణులు నిర్జీవంగా ఉంటాయి. నీరు లేకపోతే వృక్షసంపద క్షీణించిపోతుంది. ఎన్నో ప్రాణులు నీటిలోనే నివసిస్తాయి.అందుకే జలం దేవత. 

 వాయుదేవత:-- గాలి లేనిదే సృష్టిలో ఏ ప్రాణి కొన్ని నిమిషాల కంటే ఎక్కువకాలం జీవించలేదు. మనం  తీసుకున్న ఆహారం జీర్ణమవ్వాలంటే జఠరాగ్నికి వాయువు తోడ్పడుతుంది.మన రక్తం శుద్ధి కావాలంటే ప్రాణవాయువు కావాలి. ఈ విశ్వమంతా వివిధరకాల వాయువుతో నిండి వుంది. కేవలం వాయువులో నివసించే ప్రాణులు కూడా కొన్ని ఉన్నాయి. కనుక వాయువు దేవత.

అగ్నిదేవత:-- మన నిత్య జీవితంలో అగ్ని ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారపదార్ధాలు తయారుచేయడానికి, చలినుండి ఉపశమనం పొందడానికి, అగ్ని తోడ్పడుతుంది. "అగ్ని సమస్త దేవతలకు ముఖం- నోరు వంటిది. అగ్నిలో వేసిన పదార్ధాలు సూక్ష్మమై గాలిలో కలసి సమస్తప్రాణులకు ఆరోగ్యాన్ని, సుఖశాంతులను కలిగిస్తాయి.భూమ్యాది పంచ భూతాల వలన, సూర్యాది గోళాల వలన మానవులకు అన్న వస్త్రాలు, ప్రకాశం, వేడి మొదలైన జీవన ఉపయుక్త పదార్ధాలు లభిస్తాయి. అందుకే అవి దేవతలు. ఈ దివ్య పధార్ధాలను  ఉపయోగించుకొని, వాడుకొని వాటిని మరల అగ్నిలో పవిత్రం చేయాల్సిన బాధ్యత మానవులకే ఉంది.అగ్నిలో నేయి, ఓషదులు ఆహుతిగా ఇవ్వడం వలన అపవిత్రమైన వాయు,జలాదులు పరిశుద్ధమై పుష్టికారకమవుతాయి.

ఆకాశదేవత:-- అంటే అవకాశం కల్పించేది. మనం చూసే ఖాళీ ప్రదేశం. దాని ద్వారానే శబ్ద తరంగాలు,ఒకరి నుండి మరొకరికి చేరుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలేవీ లేకపోతే ప్రాణులేవీ జీవించలేవు. అంతరిక్షంలోని గ్రహాలకు గ్రహాలకు మధ్య, గ్రహాలకు ఉపగ్రహాలకు మధ్య, నక్షత్రాలకు నక్షత్రాలకు మధ్య ప్రదేశం ఆకాశం. మానవులు ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాలు 'శాటిలైట్స్ ' అన్నీ అంతరిక్షంలోనే తిరుగుతూ భూమి మీద ఉన్న వార్తలను చిత్రాలను ఒకచోటి నుండి మరొక చోటికి అందిస్తున్నాయి. ఆకాశం లేకపోతే ఇది సాధ్యం కాదు. కనుక ఇది దేవత.

కాబట్టి పంచభూతాల సాక్షిగా.. అంటే దేవతల సాక్షిగా.. మరియు పంచభూతాలే పరమాత్మ..పరమాత్మ సాక్షిగా... సమ్మతమేనా మిత్రమా నా ఈ వివరణ. 

స్పూర్తిమయి, సద్గుణ సంపన్నమయి, సాహిత్య ప్రజ్ఞామయి, 'నా స్నేహమయి' వనజ గారు (వనజవనమాలి  బ్లాగర్) వివరణ - 

భారతి గారు ... 
పంచభూతాలు ... ఆకాశం భూమి వాయువు ,నీరు,  అగ్ని  ఈ సమస్త సృష్టి అంతా వీటితోనే నిర్మితమై ఉంటుంది .. పదునాలుగు లోకాలన్నీ కూడా !  మనం ఏ క్రియ నిర్వహించినా  వీటి సాక్ష్యం ఉంది తీరుతుంది.  అందుకే పంచ భూతాలూ సాక్షిగా అంటారని అనుకుంటున్నాను . శివుడుకు  పంచ ముఖాలు... ఆద్యంతాలు లేనివాడు సమస్త జగత్ ని తనలో నిమ్పుకున్నవాడు ఆది పురుషుడు శివుడు కాబట్టి ఆయన ఈ పంచ భూతాలని అయిదు ముఖాలు చేసుకున్నాడని ఎక్కడో చదివాను . నాకు తెలిసింది ఇదేభారతీ గారు .

స్నేహశీలి, శ్రేయోభిలాషి, సహృదయులు ' నా ఆత్మీయ నేస్తం' రుక్మిణీదేవి గారు ( భారతీయం బ్లాగర్) వివరణ - 

భారతి గారు!
సమస్త ప్రాణికోటి జీవనాధారములైన పృథ్వి, అగ్ని, జలము ,వాయువు , ఆకాశము - పంచ భూతములుగా పేర్కొనబడినవి .. వీటిలో ఎ ఒక్కటి లేకపోయినా జీవి మనుగడ దుర్లభం ..అందుకే సమస్త ప్రాణికోటి అని అనేకన్నా పంచభూతముల సాక్షిగా అని చెప్పబడి వుంటుంది అని నా వుద్దేశ్యం .

ముగ్గురు మిత్రుల అమూల్య వివరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. 

బహుశా అందుకేనేమో ... మన పూజా పద్ధతిలో- గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవిగా పేర్కొంటారు, ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలను భగవత్ స్వరూపములుగా గుర్తించి ఆరాదించే పద్ధతిని పెద్దలు ప్రవేశపెట్టారనుకుంటాను . 

28, సెప్టెంబర్ 2015, సోమవారం

స్థూలం నుండి ప్రజ్ఞామయం వరకు - - - చక్రశుద్ధి - ఆనందసిద్ధి (చివరిభాగం)

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి. 

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. 
తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే. 
రజస్సు వలన శరీరం నందలి వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే,  భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా  మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి. 

గత టపాల్లో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు సహస్రారచక్రం గురించి తెలుసుకుందాం. 

సహస్రారచక్రం : -              
                                                   
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ 

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి. 
                                           

                                       
మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. 
ఈ చక్ర మానసిక స్వభావం - 
ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు. 
ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - 
తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతవరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు  ఆనంద నందనవనములు అవుతాయి. 
ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం. 

కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్ధించాలి. {ప్రార్ధన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, పూజగదిలో దేవుని పటాల ముందు దీపారాధన చేసి భగవంతుణ్ణి ఏదో ఒకపేరుతో నుతించడం, స్తుతించడం కాదు,  శ్లోకపూరితమైన అనుష్టానాలు కాదు. దేవుడు అంటే పటమో విగ్రహమో కాదు, దేవుడు అంటే గుడి లోనో, దివిలోనో ఉండేవాడు కాదు, పటమైనా, విగ్రహమైన, శ్లోకమైన, మంత్రమైన, నామమైన ... ఇవన్నియూ మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్ధన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. మనకేం కావాలో, మన గమ్యమేమిటో, ఏమార్గంలో పయనించాలో తెలుసుకుంటూ (శోధిస్తూ) సప్తచక్రాలను చైతన్యపూరితం చేయగలిగే సాధన చేయగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ విధంగా సాధన సాగిస్తున్న కొలది ...  ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. పారమార్ధికంగా పురోగతి సాధించామన్నదానికి గుర్తు - ఆనందంగా ఉండటమే. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. 
ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారం నందు తిరిగి జన్మింపరు. మూడులోకములయందు సయితం బద్ధులు కారు.  

మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో  స్థూలంనుండి  ప్రజ్ఞామయం వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి. 




18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

"అచ్చంగా బాలగోవిందులు"

కొన్నిరోజుల క్రితం తిరుపతి వెళ్ళాం, నా మనవళ్ళు {మా అమ్మాయి సంతానం, మొదటపాప శ్రీమాన్వి (స్మరణ సందర్శులకు సుపరిచితం), రెండవసారి ఇద్దరు బాబులు (కవలలు), అభినవ్ రామ్, అభిజిత్ రామ్} బాబులిద్దరికి పుట్టుజుత్తు తీయించడానికి. 

పుట్టుజుత్తు తీసేసిన తర్వాత దర్శనానికి వెళ్తుండగా ఓ ఆమె వచ్చి నామాలు బాబులకు పెట్టి "అచ్చంగా బాలగోవిందులు"లా వున్నారు అని అనగా, 
                                              అచ్చంగా బాలగోవిందులు                

ఆహా! బాల గోవిందులు నా మనవళ్ళు అని అనుకోగా, మనసంతా ఆనందంతో నిండిపోయింది. 'ఇంతటి అదృష్టాన్ని అనుగ్రహించిన నీకు నేనెమివ్వగలను వేంకటేశా' అని అనుకోగానే నవ్వువచ్చింది. సర్వమూ తనదైన ఆ సర్వేశ్వరునికి  నేనిచ్చేది ఏముంటుందీ? మనసార నమస్కరించడం, పాహిమాం పాహిమామని ప్రార్ధించడం, శరణు శరణని వేడుకోవడం తప్ప... అని అనుకుంటుండగా, నాకెంతో ఇష్టమైన అన్నమయ్య సంకీర్తన గుర్తుకొచ్చింది. ఆ సంకీర్తన మదిలో కదులాడుతుండగా, శరణాగతి భావంతో  దైవాన్ని దర్శించుకోవడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. 

ఇంతకీ నా మదిలో కదిలాడే ఆ సంకీర్తన ఏమిటో చెప్పనే లేదు కదా. ఆ పరమోత్తమ సంకీర్తన ఇదే - 

ఏ దుపాయము యే నిన్ను చేరుటకు / ఆదినంత్యములేని                                                                                                                        అచ్యుతమూరితివి 
వెలయ నీగుణములు వినుతించేనంటే /తెలియ నీవు గుణాతీతుడవు 
చెలరేగి నిన్ను మతి జింతించేనంటే / మలసి నీవచింత్యమహిముడవు
పొదిగి చేతుల నిన్ను బూజించేనంటే / కదసి నీవు విశ్వకాయుడవు 
అదన నేమైన సమర్పించేనంటే / సదరమై అవాప్తసకలకాముడవు 
కన్నులచేత నిన్ను గనుగొనేనంటే / సన్నిధి దొరక నగోచరుడవు
యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవవి / వన్నెల శరణనేవాక్యమే చాలు  

ఆదీ అంత్యమూ లేని అచ్యుతమూర్తివి అయిన నిన్ను ఉపాసించే మార్గం ఏదీ? నిన్ను చేరాడానికి ఉపాయం ఉందా? ఉంటే అది ఏదీ? అని అన్నమయ్య అంటూ ఇలా కీర్తించాడు -

నీ గుణములు కీర్తించుదామంటే నీవు గుణాలకన్నింటికీ అతీతుడవు. మదిలో నిన్ను గూర్చి చింతించుదామనుకుంటే నీకై చింతించుటకు సాధ్యంగాని అనంతమైన మహిమలు కలవాడివి. ఇక నా చేతులతో నిన్ను పూజిద్దామంటే, నీవు అందుకు సాధ్యంగాని విశ్వమయుడవు. మరి ఏదైనా నీకు సమర్పించుదామంటే, నీవు అన్నికోరికలు తీరినవాడివి. నా కన్నులతో నిన్ను చూద్దామంటే, నీవు అగోచరుడవు. అందువల్ల ఓ వేంకటేశా! అన్నింటా మేలైనది, నీకు శరణు అనడమే, నిన్ను శరణుపొందడమే. 
                                                          *****
                      
                                        

                              వావ్ ... బాలగోవిందులు ఇక్కడ బాలకృష్ణులయ్యరే!

నా మనవళ్ళు బాలగోవిందులై గుర్తుచేసిన అన్నమయ్య సంకీర్తన పైనది కాగా, బాలకృష్ణులై  గుర్తుచేసిన మరో సంకీర్తన యిది - 

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు / వాని పట్టితెచ్చి పొట్టనిండా పాలు వోయరే 
గామిడై పారితెంచి కాగెడి వెన్నలలోన / చేమపూవు కడియాల చేయిపెట్టి 
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార / వేమరు వాపొయె వాని వెడ్డువెట్టరే 
ముచ్చువలె వచ్చి తన ముంగిట మురువుల చేయి / తచ్చెడి పెరుగులోన తగవెట్టి 
నొచ్చెనని చేయిదీసి నొరినెల్ల జొల్లుగార / వొచ్చిలి వాపోవువాని నూరడించరే 
ఎప్పుడు వచ్చెనో మా యిల్లుజొచ్చి / పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయిపెట్టి 
అప్పడైన వేంకటేశుడా సపాలకుడు గాన / తప్పకుండా బెట్టె వాని తలకెత్తరే //

కుదురుగా కూర్చోక, ఉన్నచోట వుండక, ఆ వాకిట ఈ వాకిట, చెట్టూపుట్టా, సందూ గొందూ అనక అటూ ఇటు పరుగులు తీసే చిలిపికన్నయ్యను చూస్తూ గోపకాంతలు మురిపంగా ఇలా అనుకుంటున్నారట ... 

ఈ ముద్దులోచ్చే బాలుడు ఎక్కడివాడమ్మా, వాని పట్టితెచ్చి పొట్టనిండా పాలు పోయండే. 
వెన్నను కాజేద్దామని ఆరిందలా పరిగెట్టుకుంటూ వచ్చి కాగుతున్న వెన్నకుండలో తన కడియాల చేయిపెట్టి, చేయి చురుక్కుమని, చెక్కిట కన్నీరు కారుతుండగా, తన నవనీతచోరత్వం బయటపడకూడదని మనల్ని ఏమార్చుతూ చీమకుట్టిందని వాపోతున్న కృష్ణయ్యను ఊరడించరే ... 
దొంగలా వచ్చి తన బుజ్జిచేతిని చిలుకుతున్న పెరుగులోన పెట్టగా, కవ్వం తగలగా, చేయినొచ్చెనని నోరంతా జొల్లుకారెట్లు ఏడుస్తున్న ఈ కన్నయ్యను కాస్తా ఊరడించండ్రా  ... 
బాలకృష్ణుని చిలిపిచేష్టలు, రేపల్లే పడుచుల ముచ్చట్లూ, మురిపాలు ... ఎంతవిన్నా, ఎంతచదివినా ఆ ఆనందం తనివి తీరనిది. 
మొదటంతా తన భక్తులైన గోపకాంతల చెంత నవనీతచోరత్వం గురించి ఆ గోపికలు మురిపంగా చెప్పుకోవడంను అన్నమయ్య కీర్తించాడు. {భక్తుల భవబంధపాశాల విమోచన చేసే ఈ చోరత్వం వెనుక ఓ మర్మముంది. ఆ వివరణ

 ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు}. ఇంతవరకు కృష్ణయ్య బాలలీలలు తెలిపిన అన్నమయ్య చివరి చరణంలో ఇలా కీర్తించాడు  -

ఎప్పుడు వచ్చెనో మాయింట్లోనికి. వచ్చి పెట్టెలో చెయ్యి పెట్టెను. ఇక ఈ పెట్టెను తప్పకుండా అసమానుడైన వేంకటేశ్వరుని తలకెత్తరే ... అని అన్నమయ్య అనడంలో అంతరార్ధం అనంతం. 
ఇంట్లోనికి రావడం, పెట్టెలో చెయ్యి పెట్టడం, ఆ పెట్టెను భగవంతుని తలపై పెట్టమనడం ... కాస్తా ఆలోచిస్తే ఇందులో సూక్ష్మార్ధం అవగతమౌతుంది. 
ఆ సూక్ష్మార్ధం తెలుసుకునే ముందు ఓసారి మనసార అన్నమయ్యను స్మరించుకోవాలని వుంది. 
తాను తరించి, మనలనూ తరింపజేసే వాగ్గేయకారుడు "అన్నమయ్య". ఈయన సంకీర్తనలు వేదాంత భావగర్భితాలు. ప్రతీ కీర్తనలో వేదాంత రహస్యాలు, ఆధ్యాత్మిక సూచనలు వుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ సంకీర్తనలో బ్రహ్మతత్త్వ సారాంశముంటుంది. 

ఆధ్యాత్మిక సాధకుని ప్రయత్నంలో తొలుత ఎంతో అయోమయం, ఎన్నో అర్ధంకాని విషయాలు, అటుపై ఎంతోకొంత అస్థిరత్వం, అంతం అగుపించని అన్వేషణ, తీరం తెలియని పయనం, అంతర్యామిని కనుగొంటానా అన్న ఆవేదన, అనంతున్ని పొందాలన్న ఆరాటం, వీడని వాసనల వలన ఆందోళన, అన్నింటినీ వీడి మనస్సుని అధిగమించాలన్న పోరాటం ... ఇలా ఎంతో సంఘర్షణతో నలిగిపోతున్న మనస్సును చల్లగా తాకి, దారిచూపేవే అన్నమయ్య సంకీర్తనలు. సాధకునికి అన్నమయ్య ప్రతీ సంకీర్తన సదా స్మరణీయం.
అయితే, అన్నమయ్య పాటలు కొన్ని త్వరగా అర్ధం కావు. అందుకు కారణం - ఈయన వాడిన కొన్ని పదాలు నేడు మరుగున పడిపోయాయి. జన వ్యవహారికంలో లేవు. అయినను అవగాహన చేసుకోవడానికి ఒకింత ప్రయత్నం చేస్తే, ఆప్పుడు అవగతమౌతుంది ఈయన పలికిన పలుకెల్ల పదకవితై పరమాత్ముణ్ణి ఎలా మెప్పించ గలిగిందన్నది. 
పదకవితా పితామహుడయిన ఆన్నమయ్య విరచిత సంకీర్తనలు వేనవేలు. 
దాచుకో, నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి 
పూచి నీ కీరితి రూపు పుష్పములివియయ్యా 
ఒక్క సంకీర్తనే చాలు, ఒద్ధికై మము రక్షింపగ
తక్కినవి భండారాన దాచి ఉంచనీ ... అన్న ఆయన భావంలో అతిశయోక్తి లేదు. 
 
ప్రతీ పలుకు పారమార్ధిక పాటైన పదజీవనునికి పాదాభివందనాలు.  

ఇక పై సంకీర్తనలో ఆ చివరి చరణం యొక్క సూక్ష్మార్ధంను పరిశీలిస్తే - 

కర్మ చేయక క్షణమైనను జీవించలేం. ఉన్నస్థితినుండి ఉన్నతస్థితికి చేరుకోవాలనే ప్రయత్నమే ప్రతీ ప్రాణీ చేయు 'కర్మ'.  చేసే ప్రతీ కర్మ యొక్క ఫలితం మనస్సులో సూక్ష్మాతి సూక్ష్మమైన ముద్రను వేస్తుంది. దీనినే 'వాసన' అంటారు. ఈ వాసనలననుసరించే మనలో కోరికలు, తలపులు జనిస్తుంటాయి, పునర్జన్మలకు హేతువవుతుంటాయి. అందుకే ఈ వాసనలుగా పరిణమించే కర్మలు ఉన్నతంగా, అచ్యుతున్ని అందుకునేలా ఉండాలి. ఏ కర్మలాచరిస్తే అది 'వాసన'గా మనల్ని బాధపెట్టాక, బంధీ చేయక వుంటుందో, అటువంటి సత్కర్మలు సద్భావనతో ఆచరించగలగాలి. అటుపై ఆ సత్కర్మ ఫలితాన్ని ఆసక్తితో, ఓ సంపదగా మన మది అనే బోషానంలో దాచుకోక, ఆ బోషానాన్ని అంటే ఆ పెట్టెను ఆ అనంతున్నిపై పెట్టేస్తే ... అంతా ఆయనకే సమర్పించేస్తే ... మనసు వెదురుబొంగులా డొల్లవ్వదా, అది ఆ భగవంతుని చేతిలో పిల్లనగ్రోవి కాదా? ఇలా చేస్తే జీవితం సార్ధకం కాదా? ఈ ప్రయత్నం పరమాత్ముణ్ణి చేర్చదా? 
నిష్కామ కర్మయోగం అంటే ఇదే. దీనిని ఆచరిస్తే జన్మ పావనమౌతుందన్న సత్యాన్ని తెలియచెప్తుంది పై కీర్తనలో చివరి చరణం. 
                                                                                                                                                 అమ్మమ్మా! నేను కూడా కృష్ణునిలా తయారయ్యాను చూడు అని అంటున్న నా  చిట్టితల్లి శ్రీమాన్వి 

ఇంత చక్కటి సంకీర్తనలను స్మరించుకునేటట్లు చేసిన నా చిన్నారి మనవళ్ళుకు శుభాశీస్సులతో ఈ పోస్ట్ ను ప్రేమగా  వారికి అంకితమిస్తున్నా. 






    26, ఆగస్టు 2015, బుధవారం

    జీవాత్మ-పరమాత్మ --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఆరవభాగం]


    గత టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధచక్రాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరవచక్రమైన ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుందాం -
    ఆజ్ఞాచక్రం -
    ఐం హ్రీం శ్రీం హాం హం సశ్శివస్సోహం సోహం, సశ్శివ ఆజ్ఞాదిష్టాన దేవతాయై హాకినీ సహిత పరమాత్మస్వరూపిణ్యై నమః
    ఈ కమలం రెండు దళాలుతో వుంటుంది. మనోతత్త్వం. అధిదేవత హాకీని. ఈమె హ, క్ష అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పులిహార ప్రీతి. ఈమె మజ్జాధాతువునకు అధిపతి.
    భ్రూమధ్యమందు విలసిల్లే ఈ చక్రం మనలో 3,240 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఈ స్థానం మనస్సుకు మనకు సంధానం చేస్తుంది. ఇది ఈ శరీర మనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది. 

    ధ్యానమను స్థితిచేత ప్రకాశించు ఈ చక్ర కమలమందు రెండు దళాలు కలవని తెలుసుకున్నాం. ధ్యానమనగా ధ్యానింపబడు విషయం, ధ్యానించువాడు అను రెండు మాత్రమే కలిగిన స్థితి. 'హ'కారం, 'క్ష'కారం అను రెండు దళాలతో కూడిన ఈ పద్మం అదే స్థితిని సూచిస్తుంది. ద్యానింపబడు పరమాత్మ, ధ్యానించే జీవాత్మ మాత్రమే వుండే స్థితి. ఈ ధ్యానంను సాధన చేస్తే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం. తద్వారా పొందే స్థితి బ్రహ్మత్వపు స్థితి. బ్రహ్మమే తానని తెలుసుకునే స్థితి. ఇక్కడ అన్నింటిని పరిత్యజించి జీవుడు బ్రహ్మభూతుడవుతాడు . సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. 

     'శ్వాస' ప్రక్రియకూ, ఆధ్యాత్మిక శక్తికీ చాలా సంబంధముంది. స్థూలశరీరానికి సంబంధించి లంగ్స్, తద్వారా హార్ట్, బ్లడ్ లో ఆక్సిజన్ సరిపడినంతగా సరఫరా చేయటానికి ఈ శ్వాస ప్రక్రియే ఆధారం. అందులోని  వొడిదుడుకులు సరిచెయ్యటానికి, దాని శక్తి యింకా పెంచటానికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది. ఈ శ్వాస వలన వచ్చేశక్తి స్థూలశరీరానికి ఎంత అవసరమో, సూక్ష్మశరీరానికి కూడా అంతే అవసరం. మనం లోపలకు తీసుకునే గాలి మూలాధారం వరకు వెళ్ళి, తిరిగి పైకి వస్తూ స్వాధిష్టాన చక్రంలో చైతన్యం పొంది ప్రాణశక్తిగా, జీవశక్తిగా మారుతుంది. తద్వారా ఇడా పింగళ సుషుమ్నా నాడుల ద్వారా ఆజ్ఞాచక్రంకు చేరుతుంది. ఈ చక్రమే శ్వాస చంచలగతిని అదుపుచేసి క్రమక్రమంగా నిశ్శలం చేసి కైవల్యానికీ, మోక్షానికీ, జీవన్ముక్తికీ కారణమౌతుంది. ఈ చక్రాన్నే దివ్యనేత్రమనీ, జ్ఞానచక్షువనీ అంటారు. అలానే ఈ స్థానాన్నే త్రివేణీసంగమం అంటారు. 'త్రివేణిసంగమం' గురించి మరికొంత వివరణకై  ఇక్కడ చూడండి.  
    ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని రక్తప్రసరణవ్యవస్థతో సంబంధం.

    ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
    రక్తక్షీణత, రక్తస్రావం అను వ్యాధులు సంభవించును. వినాళ గ్రంధులవ్యాధులు, అధిక రక్తపోటు, ప్రేగులలో పుండ్లు లాంటి వ్యాధులు కలుగును.  
    ఈ చక్ర మానసిక స్వభావం -
    మూసుకుపోవడం వలన మానసిక స్థిరత్వం లేకపోవటం, కనులలో లోపాలు,క్షమాగుణం లేకపోవటం, నిరాశ నిస్పృహలతో కూడిన అలసట, అన్ని విషయాలయందు సందేహస్పదులు.  
    తెరుచుకుంటే మనసులో, దృష్టిలో స్థిరత్వం, ఏకాగ్రత వుంటుంది. సూక్ష్మ బుద్ధి అలవడుతుంది. వివేకానికి మూలమై సత్యాన్ని గ్రహించమని నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తి, ఆలోచన, అంతరదృష్టిలను  పెంపొందిస్తుంది. నీటియందు మంచుగడ్డ కరిగిపోయినట్లు 'నేన'ను అహం అంతర్యామి యందు కరిగిపోవును. 
    ఈ చక్రమును శుద్ధిచేసుకోవడం ఎలా???
    శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
    ఈ చక్రంనకు హాకీని అధిష్టానదేవత. ఈమెకు పులిహార మందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పులిహారను స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో తగు ఔషదములను ఉపయోగిస్తూ 'ఓం' అను బీజాక్షరమును ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. ఓంకారం వేదమునకు మొట్టమొదటి బీజం. ఈ ఓంకారం వివరణకై ఇక్కడ ఓంకారం - 1&2చూడండి.
    ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
    నియంత్రణతో కూడిన భావనలు చేయడం అవసరం. ధారణ, ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది.
    ఈ చక్రమునకు అధిపతి గ్రహం చంద్రుడు. మనిషి మానసిక స్థితికి, ధన సంపాదనకు చంద్రుడు కారకుడు. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా వుండడు. వృద్ధి క్షయాలు కలిగినవాడు. అందుకే జాతకంనందు చంద్రుడు సరిగ్గా లేకుంటే చంచల స్వభావం కలిగి వుంటారు. చంద్రుడు నీటికి కారకుడు. అందువల్ల మంచినీరు ఎక్కువగా త్రాగాలి. అలాగే చంద్రుడు తెలుపువర్ణమునకు సంకేతం కావున సాధ్యమైనంతవరకు తెలుపురంగు వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు వుండేలా అభ్యాసం చేయడం, మృదువుగా మసులుకోవడం చేస్తే చంద్రానుగ్రహం సాధించినట్లే. తత్ఫలితంగా ఆజ్ఞాచక్రం సానుకూలంగా పనిచేస్తుంది.
    తదుపరి చక్రం 'సహస్రారం' గురించి తదుపరి టపాలో ...