http://www.sodhini.com
సందేహాలు - సమాధానాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సందేహాలు - సమాధానాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, సెప్టెంబర్ 2026, గురువారం

అమ్మ లలితాంబిక శరణాగతి - గృహస్థ సాధకులకు దిశానిర్దేశం

భక్తి మార్గంలో నడుస్తున్న చాలామంది సాధకులకు ఏదో ఒక దశలో ఒక విధమైన మానసిక వేదన, ప్రశ్నలు ఎదురవుతుంటాయి: "నేను ఇంత పూజ చేస్తున్నాను... ఇంత ప్రార్థిస్తున్నాను... మరి నా మనస్సు ఎందుకు కుదుటపడటం లేదు? మనస్సు లేని పూజ వ్యర్ధమేనా? అమ్మ ఎందుకు పలకడం లేదు? నాలో భక్తి లేదా? నా సాధన తప్పా?" అని. 

ఇలాంటి సందేహాలే నా మిత్రురాలుకు కలుగగా, ఇలా వ్యాఖ్య పెట్టింది -

వ్యాఖ్య లింక్ : కుమారసంభవం - పునరావలోకనం

వ్యాఖ్య : భారతీ, ఈ మధ్య మానసికంగా చాలా వేదన అనుభవిస్తున్నాను.
లలితమ్మను ఎలా పూజించాలో తెలియడం లేదు. ఎంత శ్రద్ధ పెట్టినా ఏకాగ్రత కుదరదు. మనస్సు పూజా సమయంలో ఎటో వెళ్ళిపోతుంది. కళ్ళు పుస్తకాన్ని చూస్తుంటాయి, నోరు చదివేస్తుంటుంది. "అమ్మా! నాకు చేతకావడం లేదు. నా మనస్సును నీ యందే లగ్నం చేసుకో" అని ఎన్నిసార్లు అడిగినా, ఆ తల్లి పలకదు. 
కొందరు దత్తుడు దర్శనం ఇచ్చాడు, పిలిస్తే పలుకుతాడు అని ఎన్నో వీడియోస్. మొన్నటికి మొన్న అమ్మ పాలు త్రాగిందని, గజ్జెలు చప్పుడు ఇంట్లో వినిపించిందని కొందరు వీడియోస్. వాళ్ళు ఎలా పూజ చేస్తున్నారో, ఏమో నాకు తెలియదు. వాళ్ళంత భక్తి నాకు లేకపోవచ్చు. అంత చక్కగా నేను పూజ చేయలేకపోవచ్చు. అంత శక్తి నాకు లేదు. అందరూ శక్తివంతంగా ఆరోగ్యంగా అందంగా పరిపూర్ణంగా ఉండరు. బలహీనులు ఉంటారు... తల్లి బలహీనులను మరింత చక్కగా చూసుకోవాలి గానీ, ఇలా పలకకుండా ఉండడం ఏమిటి?????? గాఢ భక్తి, మూఢ భక్తి లేకపోవచ్చు గానీ, నాలో అమ్మ పట్ల భక్తి తపన ఉంది. భక్తిగా చెయ్యాలని నాకూ ఉంది గానీ, నాకు చేత కావడం లేదు, నా శక్తి చాలడం లేదు. నాలాంటివారిని అమ్మ అనుగ్రహించదా? ఆదరించదా? నేను ఉన్నానని పలకదా? ఇంకెలా సాధన చేయాలి? సంసారంలో ఉంటూ, సాధన చేయడం ఎలా? సంసారం సాధనకు అడ్డంకి నా? ఏడుపోస్తుంది. నేను ఎవరో నీకు తెలుసు. నీకు తెలిస్తే చాలు. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందుకే అజ్ఞాతగా వ్యాఖ్య పెట్టాను. జవాబు ఇవ్వవా?
నీ మెసేజ్ చదివాను.
ముందుగా ఒక మాట చెబుతాను - నీకు భక్తి లేదని మాత్రం అనుకోకు.
"అమ్మా, నా మనస్సును నీయందే లగ్నం చేసుకో" అని నువ్వు పదేపదే అడుగుతున్నావంటే, అమ్మ మీద నీకు ఎంత తపన ఉందో అర్థమౌతుంది.
పూజలో మనస్సు ఎక్కడికో వెళ్తుంది అని బాధపడకు. మనస్సు చంచలంగా ఉండటం దాని సహజ స్వభావం. మనస్సు చెదిరిన ప్రతిసారీ దానిని అమ్మ దగ్గరకు తీసుకురావడమే సాధన. 
మనస్సు ఎప్పుడూ చెదరకుండా ఉండటమే భక్తికి ప్రమాణం కాదు. చెదిరిన మనస్సును మరల మరల అమ్మ పాదాల దగ్గరకు తీసుకురావడమే భక్తి.
💭మనస్సు లేని పూజకు ప్రయోజనం ఉందా?
ఉంది కానీ, అది ప్రధానంగా బాహ్య సాధన స్థాయిలో ఉంటుంది.
మనస్సు ఎక్కడో ఉన్నప్పుడు చేసే పూజకు ప్రయోజనం అసలు లేదని చెప్పడం సరైంది కాదు; సంపూర్ణ ఫలితం వస్తుందని చెప్పడం కూడా సరైంది కాదు.
చేతులు పూజలో, నోరు మంత్రంలో, మనస్సు మాత్రం ప్రపంచంలో ఉంటే, ఆ పూజ మనలో లోతైన పరివర్తన కలిగించడానికి చాలా తక్కువగా సహాయపడుతుంది.
✂️అయితే పూజ ఆపేయాలా?
ఆపకూడదు. మనస్సు చెదిరిపోతున్నందుకే పూజ మానేస్తే, మనస్సు ఎప్పటికీ శిక్షణ పొందదు.
పిల్లవాడికి మొదట అక్షరాలు సరిగ్గా రావు కదా! అందుకని చదువు మాన్పించేయం కదా. 
ప్రయత్నానికే ప్రాధాన్యత: అమ్మ మన మనస్సు ఎంత స్థిరంగా ఉందనే దానికన్నా, మనం ఎంత నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం అనేదాన్నే చూస్తుంది. అటు ఇటు పరిగెడుతున్న మనస్సును బలవంతంగా లాక్కొచ్చి దేవుడిపై పెట్టడమే ఒక పెద్ద తపస్సు.
కల్మషం లేని భక్తి చాలు: చిన్న పిల్లలు సరిగ్గా మాట్లాడలేక ముద్దు ముద్దుగా మాట్లాడినా తల్లి ఎలా సంతోషిస్తుందో, మనకు ఏకాగ్రత కుదరకపోయినా తపనగా పిలిస్తే, అమ్మ మనల్ని అంతే అమితంగా ఆదరిస్తుంది.
అభ్యాసంతోనే సాధ్యం: ఒకే రోజులో మనస్సు నిలబడదు. ప్రతిరోజూ పూజ చేయడం వల్ల, కాలక్రమేణా మనస్సు దానంతట అదే కుదుటపడుతుంది. రోజూ పూజ చేయడం వల్ల మనలో ఒక నియమం, పవిత్రమైన వాతావరణం, దైవస్మరణకు అలవాటు ఏర్పడతాయి. ఈరోజు మనస్సు చెదిరిపోయినా, మరోరోజు కొంచెం స్థిరపడుతుంది.

మనస్సు పూజలో నిలబడకపోయిందని ఆ పూజ వ్యర్థం కాదు. నిజానికి, మనస్సు చెదిరినప్పుడే మన సాధనకు ఒక గట్టి అవకాశం వస్తుంది.

పూజలో మనస్సు ఎక్కడికో వెళ్లిపోయిందని గుర్తించిన క్షణమే -
“అయ్యో, నా మనసు మళ్లీ వెళ్లిపోయింది” అని బాధపడకుండా, ప్రేమగా తిరిగి అమ్మ దగ్గరకు తీసుకురావాలి.

"పూజలో మనస్సు నిలబడటం సాధన యొక్క ఫలితం; మనస్సు చెదిరినప్పుడల్లా దాన్ని తిరిగి అమ్మవైపు తిప్పడం సాధన. కాబట్టి మనస్సు చెదిరిందని పూజ వ్యర్థం కాదు. ఒక్కసారి చెదిరి, ఒక్కసారి తిరిగి అమ్మ దగ్గరకు వచ్చినా - ఆ తిరిగి రావడమే మన సాధన."

"నా మనస్సు ఎందుకు నిలబడటం లేదు?" అని బాధపడటం కంటే, "అమ్మా, నా మనస్సు మళ్ళీ మళ్ళీ బాహ్య విషయాలపైకి వెళ్ళిపోతుంది దానిని నువ్వే తిరిగి తీసుకురా" అని అనుకోవడం ఎంతో మధురమైన సరళ సాధన.
🪔అసలు పూజ ఎప్పుడు మొదలవుతుంది?
పూజా సామగ్రి సిద్ధం చేసినప్పుడు కాదు.
"అమ్మా, నా మనస్సు నీ దగ్గర నిలబడటం లేదు" అని మన నిజమైన స్థితిని అమ్మ ముందు ఒప్పుకున్న క్షణం నుంచే అంతరంగ పూజ మొదలవుతుంది.
అమ్మకు మనం ఎంతసేపు ఏకాగ్రంగా కూర్చున్నామన్నదానికంటే, మనస్సు చెదిరిపోయిన ప్రతిసారీ మళ్ళీ ఆమెను ఆశ్రయించామా లేదా అన్నదే సాధనలో ఎంతో విలువైనది.
📿సాధన అంటే ఏమిటి?
సాధన అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, అంతరంగాన్ని దైవస్వరూపానికి దగ్గర చేయడం.
పూజ చేసే సమయంలో అమ్మవారిని బయట ఉన్న విగ్రహంలో దర్శించడం ఒక దశ అయితే, అదే అమ్మను మన హృదయంలో అనుభవించడం మరొక దశ.
అందుకే సాధనలో మూడు విషయాలు ముఖ్యమైనవి:
1. బాహ్య సాధన - పూజ, జపం, స్తోత్రం, పారాయణం.
2. అంతర సాధన - మనస్సును పరిశీలించడం, కోపం,అహంకారం, అసూయలను తగ్గించడం.
3. జీవన సాధన – ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు, మాట, ప్రవర్తన అన్నింటినీ భగవదర్పణంగా చేయడం.
ఒక చిన్న గమనిక :
మనము రోజూ ఒక గంట పూజ చేసి, మిగిలిన ఇరవైమూడు గంటలు మనసుకు నచ్చినట్లు జీవిస్తే, అది సంపూర్ణ సాధన కాదు.

పూజలో అమ్మను స్మరించడం చిన్న సాధన.
పూజ అయిపోయిన తర్వాత కూడా అమ్మను మరచిపోకుండా ఉండటం ఉన్నత సాధన.

🧠 ఏకాగ్రత లేకపోవడం అంటే, భక్తి లేకపోవడం కాదు

ఏకాగ్రత అనేది భక్తికి ముందస్తు అర్హత కాదు. ఏకాగ్రత సాధనలో క్రమంగా పెరుగుతుంది. కొంచెం నీ ఆలోచనా సరళి మారితే, ఏకాగ్రత తప్పక వస్తుంది.
పూజలో కూర్చుంటే, కళ్ళు పుస్తకంను చూస్తుంటాయి, నోరు మంత్రం చదువుతుంది కానీ; మనస్సు మాత్రం ఎక్కడికో వెళ్తుంది...
ఇది మనస్సు నైజం. పూజ చేసేటప్పుడు మనస్సు ఎటో వెళ్ళిపోవడం కేవలం నీ ఒక్కదానికే కాదు, చాలామందికి జరిగేది ఇదే.
మనస్సు చెదిరితే - "అమ్మా" అని తిరిగి తీసుకురా.
మళ్ళీ చెదిరితే - మళ్ళీ "అమ్మా" అని తీసుకురా.
ఒకసారి కాదు, పది సార్లు కాదు. వందసార్లు అయినా సరే.
అది ఎన్నిసార్లు జరిగినా నువ్వు ఓడిపోయినట్టు కాదు. ప్రతిసారి అమ్మ దగ్గరకు తిరిగి రావడమే నీ విజయం.
నీ మనసులోని ఆరాటం, ఆవేదన చూస్తుంటే, నాకు లలితా సహస్రనామాల్లోని ఒక అద్భుతమైన నామం గుర్తొస్తోంది. అమ్మవారికి 'అంతర్ముఖ సమారాధ్యా... బహిర్ము సుదుర్లభా' అనే పేరు ఉంది. అంటే... బయట ఎక్కడో చమత్కారాల్లో వెతికితే అమ్మ దొరకదు. నీలాగా గుండెల్లో ఆరాటపడుతూ, కన్నీళ్లు పెట్టుకునే బిడ్డ అంతరంగంలోనే అమ్మ కొలువై ఉంటుంది. అది గుర్తించు.
♥️ అమ్మకు భాష కాదు; భావం ముఖ్యం.
నీ కళ్ళు పుస్తకాన్ని చూస్తున్నా, నోరు చదివేస్తున్నా, మనసు ఎటో వెళ్ళిపోతోందని బాధపడుతున్నావు కదా! కానీ ఆ సమయంలో కూడా నువ్వు 'అమ్మ కోసమే' కూర్చున్నావు. నీ శరీరం, నీ సమయం అమ్మకే ఇచ్చావు. అమ్మా! నా మనస్సు నీ దగ్గరే ఉండాలి అనే నీ తపన... అదే భక్తికి గుర్తు. చంచలమైన మనస్సును లాగి పట్టుకోవడం మన తరం కాదు. అందుకే ఆ మనస్సును కూడా అమ్మ పాదాల దగ్గర పడేసి... 'అమ్మా! ఇదిగో నా చంచల మనస్సు, దీనిని ఎలా లగ్నం చేయాలో నీకే తెలియాలి' 'నాకు తెలియడం లేదమ్మా' అని లొంగిపో. అదే నిజమైన శరణాగతి.
  • మనస్సు స్వభావం చంచలం: మనస్సు స్వభావమే ఆలోచించడం. ఒక ఆలోచన నుంచి మరొకటి రావడం సహజం. పూజ చేస్తుండగా వంటగదిలో పని గుర్తొస్తే అది తప్పు అని బెంబేలు పడకు. వేరే ఆలోచన వచ్చిందని గ్రహించి, "అమ్మా! ఇది కూడా నీ పనే. ఇప్పుడీ పూజను పూర్తి చేయడానికి నా మనస్సును నీ దగ్గర ఉంచు" అని మళ్లీ అమ్మవారి రూపం, మంత్రం లేదా ఉపచారం మీదకు తీసుకు రావాలి. ఇదే ఏకాగ్రతకు సాధన.
  • జాగృతి (అవేర్‌నెస్) ముఖ్యం: "నా మనస్సు నిలబడటం లేదు" అని నీవు గమనించిన క్షణమే నీలో జాగృతి వచ్చింది. అది గమనించి, ఆ మనస్సును మరల మంత్రం లేదా దైవ రూపం దగ్గరకు తీసుకురావడమే సాధన.
  • కన్నీళ్లే గొప్ప ప్రార్థన: ఏకాగ్రత అనేది సాధన ఫలం. భక్తి మాత్రం హృదయపు తపన. "అమ్మా! నా మనస్సు నీ దగ్గర నిలవడం లేదు. నువ్వే దాన్ని నిలుపు" అని బాధపడుతున్న నీలో అమ్మను చేరాలనే తపన ఉంది. కొన్నిసార్లు ఏకాగ్రత కోసం ఏడుస్తున్న ఆ కన్నీళ్లే ఏకాగ్రత కంటే గొప్ప ప్రార్థనగా మారవచ్చు.
  • అవగాహన ముఖ్యం:  నువ్వు పిలిస్తే అమ్మ పలకడం లేదు అనుకోకు. నీ హృదయంలో ఇంతటి తపనను కన్నీటిని పుట్టించిందే ఆ లలితమ్మ. నిన్ను తన వైపు తిప్పుకోవడానికి అమ్మ వేసిన ముడి ఇది...అని అనుకుని చూడు ఒకసారి... మనస్సుకు ఎంతో ప్రశాంతత.

💥బాహ్య చమత్కారాలు

గజ్జెల చప్పుడు వినపడడం,  పాలు తాగడం... లాంటివి మాత్రమే భక్తి అనుకోవడం పొరపాటు. మన భక్తిని వేరొకరి అనుభవాలతో పోల్చుకుని చిన్నబుచ్చుకోవడం తగదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. భగవంతుడు ప్రదర్శన వస్తువు కాదు.
  • దైవానుభవం పోటీ కాదు: మనకు కనిపించేది వారి వారి అనుభవాలు మాత్రమే; వారి అంతరంగం, సాధన మనకు తెలియదు. ఇతరుల అనుభవాలను మన సాధనకు కొలమానంగా పెట్టుకోకూడదు. అమ్మ కృపకు బాహ్య అద్భుతాలే ప్రమాణాలు కావు.
  • నిజమైన అద్భుతం (మిరకల్) ఏంటి?: నిజమైన భక్తుడికి లభించే అతిపెద్ద అద్భుతం ఏంటో తెలుసా? ఎంత కష్టం వచ్చినా... 'నా వెనుక అమ్మ ఉంది' అనే ధైర్యం, విశ్వాసం కలగడం. ఆ నిశ్శబ్ద అనుభూతిని పక్కనపెట్టి శబ్దాల కోసం ఆరాటపడకు. మనలో కోపం తగ్గడం, అహంకారం కరగడం, దైవాన్ని వదలకపోవడం, తప్పు చేస్తున్నానేమో అని భయపడడం, తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపపడడం - ఇదంతా అమ్మ అనుగ్రహమే. అమ్మ చేస్తున్న అంతఃకరణ శుద్ధే. 
  • అమ్మకు రూపం కాదు, భావం ముఖ్యం: ఒక తల్లి తన బిడ్డను ప్రేమించడానికి బిడ్డ ప్రతిరోజూ ఏదైనా అద్భుతం చేయాలని చూస్తుందా? అలాగే లలితాంబిక కూడా మనం పూజను ఎలా చేశామా అని చూడదు; మన హృదయం ఎంత నిజంగా ఆమెను ఆశ్రయించిందో చూస్తుంది.

⚡నీ
బలహీనతే - నీ బలం

నువ్వు అన్న మాట చాలా నిజం... 

"బలహీనులను తల్లి మరింత చక్కగా చూసుకోవాలి కదా!"

అవును. అందుకే నీ బలహీనతను కూడా అమ్మ పాదాల దగ్గరే పెట్టు.

పూజ చేయలేకపోతున్నానని బాధపడుతూ కూడా అమ్మను వదలకుండా ఉండటం… అదే నీ నిజమైన బలం. 

అమ్మతో ఇలా చెప్పు...

"అమ్మా… నాకు ఏమీ చేతకావడం లేదు. నువ్వే నన్ను నీ దగ్గరకు తీసుకో. నువ్వే నాకు శరణు"

ఇది కూడా పూజే. ఇది కూడా ప్రార్ధనే. ఇది కూడా భక్తే. ఇది కూడా శరణాగతే. 

నీకు పెద్దగా పూజలు చేయడం చేతకాక పోవచ్చు. ఏకాగ్రత కుదరక పోవచ్చు కానీ, నాకు చేత కావడం లేదు అనే నీ అమాయకత్వమే అమ్మను నీ వైపు తిప్పుకుంటుంది. తెలివైనవాడు తన జ్ఞానంతో అమ్మను చేరాలని చూస్తే, నీలాంటి అమాయకపు బిడ్డ కేవలం ప్రేమతో అమ్మను లాగేసుకుంటుంది.

ఆమె మనం కోరుకున్న విధంగా పలకకపోవచ్చు కానీ,  మన హృదయంలో నెమ్మదిగా ఆమె కృప పని చేస్తూనే ఉంటుంది. 

కాబట్టి ఇక “అమ్మ ఎందుకు పలకడం లేదు?” అని అడగకు.

“అమ్మా, నేను ఎలా ఉన్నా… నన్ను మాత్రం వదలకమ్మా” అని అడుగు.

అంతే చాలు. 🙏

🪔 పూజను సులభం చేయండి (భారాన్ని అమ్మకు వదిలేయండి)

పూజను ఒక ఫలితాన్ని పొందే వ్యాపార ప్రయత్నంగా మార్చుకోవద్దు (“నేను జపం చేస్తాను నాకు ఏకాగ్రత రావాలి”, “నేను ప్రార్థిస్తున్నాను, నా కోరిక నెరవేరాలి” "నేను పూజ చేస్తున్నాను, నాకు అనుభూతులు కావాలి"...అని). గమనించావా... మనకు తెలియకుండానే పూజను కూడా ఒక ఫలితాన్ని పొందే ప్రయత్నంగా మార్చుకుంటున్నాం. పూజను ఒక పరీక్షగా తీసుకోకుండా, అమ్మతో కలిసి కూర్చునే సమయంగా తీసుకో.
"అమ్మా నాకు ఏకాగ్రత ఇవ్వడం కూడా నీ బాధ్యతే" అని పూజా భారాన్ని కూడా ఆ తల్లిపైనే వేసేయ్
  • పుస్తకాలు పక్కన పెట్టండి:  ఏకాగ్రతతో చదవలేనప్పుడు, ఒత్తిడికి లోనవ్వకుండా పుస్తకాలు పక్కన పెట్టు. కేవలం అమ్మ విగ్రహం లేదా చిత్రం వైపు చూస్తూ ఒక చిన్న బిడ్డలా నీ కష్టసుఖాలు చెప్పు. మనసారా కబుర్లు చెప్పు.
  • పూజా విధానాన్ని అంతరంగ సమర్పణగా మార్చండి: మరోసారి చెప్తున్నాను "నాకు భక్తి లేదు, నా పూజ సరిగ్గా లేదు, అమ్మ నన్ను పట్టించుకోవడం లేదు, పలకలేదు" అని తీర్పు చెప్పుకోవడం మొదటి పొరపాటు. మనస్సు చంచలంగా ఉండటం దాని సహజ స్వభావం. సాధన అంటే మనస్సును ఒక్కసారి పట్టుకుని ఇక ఎప్పుడూ కదలకుండా చేయడం కాదు. మనస్సు వెళ్లిన ప్రతిసారీ మళ్లీ అమ్మ దగ్గరకు తీసుకురావడమే సాధన. 
  • పూజ చేసేటప్పుడు కేవలం యాంత్రికంగా మంత్రం చదవడం కంటే, భావాన్ని విశ్వాసాన్ని జోడించండి: ఉదాహరణకు పంచోపచార పూజ చేసేటప్పుడు బాహ్యంగా పూజా ద్రవ్యాలు సమర్పిస్తూ మనసులో ఈ వాక్యాలను ఒక్క క్షణం తలుచుకుంటే చాలు, ఆ పూజ ఎంతో శక్తివంతమైన మానస పూజగా మారుతుంది.  
    1. గంధం - శాంతి, సుగంధమైన మనస్సు

      • గంధం (పృథివీ తత్త్వం మూలాధార చక్రం)
      • "లం" పృధివ్యాత్మికాయై గంధం సమర్పయామి 
      •  భావన : "శ్రీమాతా! నీ చల్లని చూపుల లాగే నా మనస్సును ప్రశాంతంగా, శీతలంగా మార్చు."
      • విశ్వాసం : అమ్మ నాలోని కోపతాపాలను మాలిన్యాలను అరగదీసి, చల్లగా ప్రశాంతంగా నా మనస్సును మారుస్తుంది.
    2. పుష్పం - హృదయవికాసం

      • పుష్పం   (ఆకాశ తత్త్వం - విశుద్ధ చక్రం)
      • "హం" ఆకాశాత్మికాయై పుష్పం సమర్పయామి 
      •  భావన : "కామేశ్వరీ! నీ చేతిలోని పాశాంకుశాలు, చెరకు విల్లు, పుష్ప బాణాల సాక్షిగా... నా హృదయ పుష్పాన్ని నీకే అర్పిస్తున్నాను."
      • విశ్వాసం : ప్రేమ భక్తి కరుణ వినయం అనే సుమ సౌరభాలతో అమ్మ నా హృదయాన్ని వికసింపజేస్తుంది.
    3. ధూపం - వాసనల శుద్ధి

      • ధూపం (వాయు తత్త్వం అనాహత చక్రం) 
      • "యం" వాయ్యాత్మికాయై ధూపం ఆఘ్రాపయామి 
      • భావన :"మహాజ్ఞానీ! ఈ ధూప సుగంధం లాగే నా బుద్ధిని వికసింపజేసి, నాలోని కామక్రోధాలను కాల్చివెయ్యి."
      • విశ్వాసం : అమ్మా నాలోని చెడు ఆలోచనలనే పొగను తొలగించి నా బుద్ధిని సువాసనతో నింపుతుంది. 
    4. దీపం - జ్ఞానజ్యోతి

      • దీపం (తేజో తత్త్వం మణిపూరక చక్రం) 
      • "రం" అగ్న్యాత్మికాయై దీపం దర్శయామి
      • భావన : "చిదగ్నికుండ సంభూతా! నాలోని అజ్ఞానాన్ని రూపుమాపి, నీ స్వరూపాన్ని చూసే జ్ఞానజ్యోతిని వెలిగించు."
      • విశ్వాసం : అమ్మవారి జ్ఞాన దీపం నాలోని అజ్ఞాన చీకట్లను తొలగిస్తోంది.
    5. నైవేద్యం — సంపూర్ణ సమర్పణ

      • నైవేద్యం (జల తత్త్వం-స్వాధిష్ఠాన చక్రం) 
      • "వం" అమృతాత్మికాయై నైవేద్యం నివేదయామి  
      • భావన : "ఆనందరూపిణీ! నా కర్మలను, వాటి ఫలితాలను నీకే నివేదిస్తున్నాను. వాటిని నీ ప్రసాదంగా స్వీకరించు."
      • విశ్వాసం : నా సర్వస్వాన్ని (కర్మలు, వాటి ఫలితాలు) స్వీకరించి అమ్మే అన్నీ చూసుకుంటుంది.

    శ్రీ లలితా త్రిపురసుందరి దేవి పరమ దయామయి, మాతృ స్వరూపిణి. లలిత అమ్మవారికి పూజ చేసేటప్పుడు నీవు అనుకునే అంతర భావన నేరుగా అమ్మ గుండెకు చేరుతుంది. ఎందుకంటే ఆమె "భావనామాత్రా సంతుష్టా" (కేవలం స్వచ్ఛమైన భావనతోనే సంతోషించే తల్లి).

  • ఇప్పుడు పంచోపచారం కేవలం ఐదువస్తువులతో చేసే పూజగా ఉండదు

  • మనలోని ఐదు పరివర్తనలను అమ్మ పాదాల వద్ద సమర్పించే సాధనగా మారుతుంది.

 📚 మనస్సు తీరును, నిరంతర సాధనను తెలిపే 5 కథలు

మనస్సు ఎలా పనిచేస్తుంది? నిరంతర సాధన విలువ ఏమిటి? అనే విషయాలను మన పెద్దలు కొన్ని అద్భుతమైన కథల ద్వారా వివరించారు:
  • 🏹 అర్జునుడి పక్షి కన్ను (లక్ష్యం): ద్రోణాచార్యుల పరీక్షలో అందరికీ చెట్టు, పక్షి కనిపిస్తే... అర్జునుడికి మాత్రం పక్షి కన్ను మాత్రమే కనిపించింది. ఏకాగ్రత అంటే ప్రపంచాన్ని మరవడం కాదు; ఆ క్షణంలో చేసే పనిపై మనస్సును నిలపడం. మన పూజలో పుష్పం సమర్పిస్తున్నప్పుడు ఆ రూపం, సమర్పణే మన దృష్టిలో ఉండాలి.
  • 🐦 కొంగ నిరీక్షణ (ఓపిక): కొంగ చేపల కోసం నీటి ఒడ్డున గంటల తరబడి కదలకుండా వేచి చూస్తుంది. సాధనలో కూడా మనం వెంటనే ఫలితం ఆశించకూడదు. "నేను సాధన చేస్తాను; ఫలితం ఎప్పుడు ఇవ్వాలో అమ్మకు తెలుసు" అనే ఓపికే నిరీక్షణ.
  • 🐜 చీమ ప్రయత్నం (పట్టుదల): చీమ గోడ ఎక్కుతూ ఎన్నిసార్లు జారిపడినా ప్రయత్నం ఆపదు. మనస్సూ అంతే. జపంలో పారిపోయినా, ధ్యానంలో నిద్ర వచ్చినా మళ్లీ లేచి ప్రయత్నించాలి. పడిపోకపోవడం కాదు; పడిపోయిన ప్రతిసారీ లేవడమే సాధన.
  • 🪷 రామకృష్ణ పరమహంస చేపల వేట (ఆసక్తి): చేపలు పట్టేవాడి చుట్టూ ఎవరు మాట్లాడినా అతని దృష్టి గాలంపైనే ఉంటుంది. ఎందుకంటే అతనికి దానిపై ఆసక్తి ఉంది. మనకు దైవంపై నిజమైన ఆసక్తి పెరిగినప్పుడు, ఏకాగ్రత బలవంతంగా పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సహజంగానే వస్తుంది.
  • 🪔 దీపపు జ్వాల (స్థిరత్వం): గాలి లేని చోట దీపపు జ్వాల స్థిరంగా ఉంటుంది. అలాగే కోరికలు, భయాలు, ఆందోళనలు అనే గాలి తగ్గితే మనస్సు స్థిరపడుతుంది. ఏకాగ్రతను బలవంతంగా తెచ్చుకోవడం కంటే, మనస్సును చంచలం చేసే కారణాలను తగ్గించుకోవడమే లోతైన సాధన.

⚖️ సాధనలో నియమం ముఖ్యమా? భావం ముఖ్యమా?

ఇది చాలా లోతైన విషయం. నిజానికి రెండూ అవసరమే; కానీ ప్రాణం మాత్రం భావమే. "నియమం సాధనకు ఆకారం ఇస్తే, భావం దానికి జీవం పోస్తుంది."
  • భావం లేకుండా నియమం: రోజూ నిర్ణీత సమయానికి పూజ చేయడం క్రమశిక్షణ మాత్రమే; అంతరంగ పరివర్తన కాదు. యాంత్రికంగా చేసే పూజ కంటే, ఒక్క పుష్పాన్ని ప్రేమతో సమర్పించడం గొప్పది.
  • నియమం లేకుండా భావం: "నాకు భక్తి ఉంది" అని చెప్తూ స్థిరమైన సాధన లేకపోతే ఆ భావం బలహీనపడుతుంది. నియమం భావాన్ని కాపాడుతుంది. మనసు బాగున్నా లేకపోయినా రోజూ 15 నిమిషాలు జపానికి కూర్చోవడం స్థిరత్వాన్ని ఇస్తుంది.
  • సూత్రం: నియమం రథం అయితే, భావం దాని ప్రయాణ దిశ. నియమంతో ప్రారంభించి, భావంతో చేస్తూ, విచారణతో లోతుకు వెళ్లి, శరణాగతితో ముగించాలి. ఇక్కడ "ముగించాలి" అన్నది సాధన ఆగిపోవడం కాదు. "నేను సాధన చేస్తున్నాను" అనే కర్తృత్వభావం కూడా అమ్మ పాదాల దగ్గర సమర్పించబడటం.

🛐నిజమైన శరణాగతి అంటే ఏమిటి?

శరణాగతి అంటే మనం బలవంతంగా మనస్సును కట్టడి చేసి, ఏకాగ్రత సాధించి, ఏదో గొప్ప అనుభవం పొందడం కాదు. “నా వల్ల కాదు అమ్మా… నీ వల్లే” అని మన అహంకారాన్ని, అసమర్థతను, ఆందోళనను కూడా అమ్మ పాదాల వద్ద ఉంచడం. అక్కడ ఒక అందమైన మార్పు వస్తుంది.
శరణాగతి అంటే -
"అమ్మా, నేను పూజను చాలా గొప్పగా చేస్తాను. అందుకే నాకు అనుభవం ఇవ్వాలి" అని కాదు.
"నాకు ఏకాగ్రత లేదు - ఇది కూడా నీకు తెలుసు. నాకు శక్తి లేదు - ఇది కూడా నీకు తెలుసు. నా మనస్సు నాదగ్గర ఉండడం లేదు - అదీ నీకు తెలుసు. అయినా నేను నిన్ను వదలను. నువ్వూ నన్ను వదలకమ్మా.”
ఇది చాలా గొప్ప స్థితి.
మరొకటి...
అమ్మ నిన్ను పట్టించుకోవడం లేదని అనుకోకు.
నువ్వు అమ్మను పట్టుకుని ఉన్నావనుకుంటున్నావు. కానీ ఇంతకాలం నువ్వు అమ్మను వదలకుండా ఉండటమే అమ్మ నిన్ను పట్టుకుని ఉంచిన కృప కావచ్చేమో! 
కాబట్టి ఇక అపరాధ భావన వద్దు.
నీ ఆలోచనలను అమ్మకే సమర్పించు. నీ అసమర్థతను కూడా అమ్మకే సమర్పించు. నీ చంచలమైన మనస్సును కూడా అమ్మకే సమర్పించు.
"అమ్మా! నాలో ఉన్నదంతా నీదే. నన్ను నువ్వే నడిపించు"
ఇంతకంటే గొప్ప శరణాగతి మనకు ఏముంటుంది చెప్పు?
ఇప్పుడు పూజలో అమ్మను వెతుకుతున్నావు.
ఏదో ఒకరోజు నీకు అర్థమవుతుంది... నీవు అమ్మను వెతుకుతున్న ప్రతి క్షణంలోనూ, నిన్ను అమ్మే తనవైపు తిప్పుకుంటోందని.
అందుకే ఎప్పుడూ పోలికలు వద్దు. అద్భుతాల కోసం ఎదురుచూడటం వద్దు. అపరాధ భావన వద్దు.
కేవలం - "అమ్మా! నిన్ను పూజించడం కూడా నాకు సరిగ్గా రావడం లేదు. నిన్ను ధ్యానించడం కూడా రావడం లేదు. అయినా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. నువ్వే నన్ను పట్టుకో."అని చెప్పగలిగితే...
అదే పూజ.
అదే ప్రార్థన.
అదే శరణాగతి.
అదే అమ్మ పాదాల దగ్గర బిడ్డగా ఉండగలగడం.
🧘పూజ ప్రారంభించే ముందు ఒక చిన్న సాధన:
పుస్తకం తెరవకముందు, మంత్రం మొదలు పెట్టకముందు, కళ్ళు మూసుకుని మనసులో ఇలా అనుకో:
"అమ్మా, నేను నీకు పూజ చేయడానికి కూర్చోలేదు. నీ కృపతో, నాలోని నిన్నే స్మరించుకోవడానికి కూర్చునున్నాను. ఈ రోజు నా మనస్సు ఎక్కడికి వెళ్లినా నేను దానితో పోరాడను. అది వెళ్లిన ప్రతిసారీ నీ దగ్గరకు తీసుకొస్తాను. నాకు అనుభవం కావాలని కాదు,  నీ సాన్నిధ్యంలో కూర్చోవాలని మాత్రమే వచ్చాను. నా పూజను నీకే సమర్పిస్తున్నాను.”

🏡 సంసారాన్ని వదలడం కాదు - సంసారాన్నే సాధనగా మార్చడం

సంసారంలో ఉంటూనే సాధన చేయడం అంటే పూజకు ప్రత్యేకంగా ఒక సమయం కేటాయించడం మాత్రమే కాదు. మన రోజువారీ జీవితాన్ని క్రమంగా అమ్మకు సమర్పణగా మార్చడం. సంసారం వదిలి సాధన చేయమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. సంసారంలోనే ఉండి సంసారాన్ని సాధనగా మార్చుకోవడం చాలా గొప్ప.
"దేవుడే కావాలి" అనే తపన వస్తే బాధ్యతలను, సంసారాన్ని వదిలేయాల్సిన పని లేదు. గృహస్థ జీవితం కూడా గొప్ప సాధనా మార్గమే. నిజమైన వైరాగ్యం అంటే బాధ్యతల నుంచి పారిపోవాలనే అసహనం కాదు. సంసారాన్ని నిర్వహిస్తూ, "ఇది నాది" అనే మమకారాన్ని క్రమంగా అమ్మ పాదాల వద్ద వదలడమే గొప్ప సాధన.
ఇంట్లో పిల్లలు, కుటుంబం, వంట, బాధ్యతలు ఉంటే -

"ఇవన్నీ నా పనులు; పూజ మాత్రం దేవుడి పని" అని విడదీయాల్సిన అవసరం లేదు.

ఇలా చూడవచ్చు:

• 🫕 వంట చేయడం - అమ్మకు నైవేద్యం సిద్ధం చేయడం.
• 🏠 కుటుంబాన్ని చూసుకోవడం - అమ్మ అప్పగించిన జీవులను సేవించడం.
• బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం - అమ్మకు సమర్పణ.
• పూజ చేయడం - అదే భావాన్ని స్మరణలోనికి, స్పురణ లోనికి, ఆచరణ లోనికి తీసుకురావడం.

అప్పుడు సంసారం సాధనకు అడ్డంకి కాకుండా సాధనలో భాగమవుతుంది.

భగవద్గీతలో కూడా కర్మను విడిచిపెట్టడమే మార్గం అని కాకుండా, కర్మ చేస్తూనే దాని ఫలాసక్తిని విడిచిపెట్టడం గురించి శ్రీకృష్ణుడు బోధిస్తాడు.

♦️ ఒక చిన్న ఉదాహరణ

ఒక తల్లి పిల్లవాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.
పిల్లవాడికి భోజనం పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, అనారోగ్యంలో చూసుకుంటుంది.

అది చేస్తూ—

"నేను ఇంత చేస్తున్నాను; నాకు ప్రతిఫలం ఏమిటి?"

అని ప్రతి క్షణం ఆలోచించదు.

అలాగే సాధకుడు కూడా,

"నేను నా ధర్మాన్ని చేస్తున్నాను. ఫలితం అమ్మది."

అనే భావాన్ని పెంచుకోవచ్చు.

ఇదే కర్మయోగ భావన.

  • 🌅 ఉదయం లేచిన వెంటనే: "అమ్మా, ఈ రోజు నా మాట, నా పని, నా ఆలోచన - అన్నీ నీకు సమర్పణ. నిన్ను మరచిపోకుండా ఉండేలా నడిపించు" అని రెండు నిమిషాలు ప్రార్థించండి.
  • 🍳 వంటగదిలో: "ఇది కేవలం కుటుంబానికి వంట కాదు; అమ్మ ఇచ్చినవారికి అమ్మ ప్రసాదం సిద్ధం చేస్తున్నాను" అని భావించండి. అప్పుడు కూర కోయడం, వంట చేయడం అన్నీ సేవే అవుతాయి. పని మీద శ్రద్ధ కూడా సాధనే.
  • 🗣️ కుటుంబంతో ప్రవర్తన: కొంత ప్రయత్నిస్తే పూజలో ప్రశాంతంగా ఉండటం సులభం, కానీ మనకు నచ్చని మాట ఎవరో అన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కష్టం. అప్పుడు ఒక్క క్షణం ఆగి, "ఇప్పుడు నా సాధన ఏమిటి? మాట్లాడకుండా ఉండటమా, లేక ప్రేమగా స్పష్టంగా చెప్పడమా?" అని వివేకంతో ఆలోచించాలి. కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా కొన్ని సెకండ్లు ఆగి ఆలోచించడం జీవితాన్ని మారుస్తుంది.
  • 🌜 రాత్రి వేళ ఆత్మపరిశీలన: పడుకునే ముందు మూడు నిమిషాలు... ఈరోజు ఎక్కడ నేను ప్రేమగా ఉన్నాను? ఎక్కడ కోపం, అహంకారం వచ్చాయి? రేపు దేన్ని మెరుగుపరుచుకోవాలి? అని చూసుకోండి. ఇది నిన్ను నీవు నిందించుకోవడం కాదు; నిన్ను నీవు తెలుసుకోవడం.

🛐 నిత్యజీవితమే ఆశ్రమం:

ఈ భావన అలవడితే ఇల్లే ఆశ్రమంగా మారుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఒక సాధన అవుతుంది:
  • ఎవరైనా బాధిస్తే - క్షమాభావం సాధన 🕊️
  • బాధ్యత వస్తే - కర్తవ్య సాధన 📋
  • మనసుకు నచ్చనిది ఎదురైతే - సమత్వ సాధన ⚖️
  • కోరిక కలిగితే - వివేక సాధన 🧭
  • మనస్సు చెదిరితే - ఏకాగ్రత సాధన 🎯
  • ఏమీ మన చేతిలో లేకపోతే - శరణాగతి సాధన 🛐
ముఖ్యంగా - సాధన పేరుతో ఇంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేయకండి. నిజాయితీగా బాధ్యత నిర్వర్తిస్తూ, అంతరంగాన్ని అమ్మ పాదాల వద్ద ఉంచుకోవడం గృహస్థునికి ఎంతో అందమైన మార్గం.
🙏 శ్రీమాతా శరణం🙏


2, జులై 2025, బుధవారం

నా జీవితానికి ధన్యత చేకూర్చవా శివా🙏

సనాతన సాంప్రదాయంలో భాగంగా మన ఋషులు సమాజ శ్రేయస్సు, చైతన్యం కొరకు అనేక సూచనలు చేశారు. అందులో భాగంగా ఆలయాల ఆవశ్యకత, సాకారోపాసన, దైవ దర్శనం అనంతరం ఆలయ మండపంలో కూర్చొని, భగవంతుణ్ణి కాసేపు ధ్యానిస్తూ ఈ క్రింద శ్లోకాన్ని, లేదా వేరే మంత్రాల్ని లేదా నమ్మే నామాన్ని మననం చేసుకోమని చెప్పడం...ఇత్యాదివి మరి కొన్ని.

స్థల పరిశీలన, వాస్తుశాస్త్ర నిబద్ధత, నిష్ణాతుల పరివేక్షణ, అద్భుత శిల్పకళా నైపుణ్యతల నడుమ ఆధ్యాత్మిక శోభతో అద్భుతంగా నిర్మితమయ్యే దేవాలయాల గర్భగుడిలో, మంత్ర యంత్ర బీజాక్షరాల శక్తితో ప్రతిష్ట అయిన అర్చా మూర్తులు... నిత్య దీప ధూప మంత్ర సహిత ఆరాధనలు... అందుకే ఆలయం లోనికి అడుగుపెట్టగానే, మంద్రంగా వినిపించే భక్తి పాటలతో తనువు పులకిస్తుంది. గుడి గంటల సవ్వడితో సడి చేయక మనస్సు నెమ్మదిస్తుంది. సర్వాలంకృత అర్చా మూర్తిని చూడగానే చేతులు అప్రయత్నంగా నమస్కరిస్తాయి. శిరస్సు వంగుతుంది. వేద మంత్రోచ్ఛరణతో జరిగే అభిషేక అర్చనాదులతో, కర్పూర నీరాజనాలతో హృదయం లయిస్తుంది. మూల విరాట్ ను ప్రతిష్టించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలతో అంతరంగం పరవశిస్తుంది. ఇన్ని విధాల సానుకూల భావాలు సమీకృతమై భగవంతుని పట్ల భక్తిభావంతో ఏకాగ్రమై మనమున్న ఆ సమయంలో, దివ్య చైతన్యంతో బాసిల్లే ఆ ప్రాంగణంలో కూర్చొని, దర్శించిన అర్చామూర్తిని ధ్యానిస్తూ, నిర్మలమైన మనస్సుతో ఈ శ్లోకాన్ని చదవమని చెప్తుంటారు. 


 వేదన లేని మరణాన్ని, ఒకరిపై ఆధారపడని జీవితాన్ని, మరణ సమయంలో నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు పరమేశ్వరా...అని!

కొందరు ఇలా చదువుతారు -


వేదన లేని మరణం, ఒకరిపై ఆధారపడని జీవనం, నీ పట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించు శంభో శంకరా...అని!

అనాయాసేన మరణం
నాకు నొప్పి, బాధ  లేని, మరణాన్ని ప్రసాదించు.

{ఓ పరమేశ్వరా! తనువు రోగగ్రస్తమై మంచాన పడి యాతనపడుతూ ఇతరులకు భారంగా మారేక, వచ్చే మరణం కాకుండా, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ పండు తొడిమ నుండి సునాయాసంగా విడివడినట్లు సునాయాస మరణం ప్రసాదించు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు నిష్క్రమించాల్సిందే. ఆ క్షణం బాధతో కూడిన క్షణంగా ఉండకూడదు, కృతజ్ఞతతో భగవంతుణ్ణి తలచుకుంటూ చిరునవ్వుతో సంతృప్తిగా కనులు మూయాలి. ఆ స్థితికి రావడానికి కావలసిన సన్నాహం మొదట నుండి చేసుకోవాలని సాధకులు చెప్తుంటారు}

వినా దైన్యేన జీవనం
ఎవరి మీదా ఆధారపడకుండా, జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు.
{ఇలాంటి జీవితాన్ని కోరుకోవడం తప్పు కాదు గానీ, విలాసాల కోసం ఆశిస్తూ కోరుకుంటే అది దురాశే. ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు ఇది తగదు. ఏది కోరుకోవాలో, ఏ కోరిక విడవాలో అన్న వివేకం ఉండాలి}

దేహాంతే తవ సాన్నిధ్యం
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

{దీనికంటే రెండవ శ్లోకంలో చెప్పినట్లుగా ముందు త్వయి భక్తిమచంచలం (అచంచలమైన భక్తినిప్రసాదించమని) కోరుకోవడం ఉత్తమం. ఎందుకంటే అచంచలమైన భక్తి లేనిదే మరణ సమయంలో భగవంతుని స్పురణ కలగదు}

దేహిమే పరమేశ్వరా!
ఓ పరమేశ్వరా! నాకు ఈ మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను. 

మామూలుగా చూస్తే, ఇది సాధారణభక్తితో కూడిన ప్రార్థనా శ్లోకం. కానీ, ఆధ్యాత్మిక అన్వేషకులు భగవంతునిపై భక్తి ప్రేమ విశ్వాసం కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం కాదని, దీనిలో మార్మికతను శోధించి సాధన చేయమంటారు. గుడిలో కాసేపు కూర్చొని ఈ శ్లోకం వల్లెవేస్తే పరమేశ్వరుడు ఈ మూడు కోరికలు తీర్చేస్తాడు అని అనుకంటే, అది పొరపాటే. 

జీవిత పరమార్థం కోసం కోరే మూడు ముఖ్యమైనవాటిని పొంది తరించాలంటే మనం ముందు శ్లోకం అంతరార్థం అర్ధం చేసుకొని, తదానుగుణంగా మనల్ని మనం మలుచుకున్నప్పుడు మాత్రమే పరిపూర్ణ ఫలితాన్నిస్తాయి.

ఇక్కడ రెండు సందేహాలు వస్తాయి మొదటిది - ఈ శ్లోకం తెలియని వారు, రానివారు ఉంటారు కదా...వారిని పరమేశ్వరుడు అనుగ్రహించడా? 
రెండవది - అన్నింటికీ అర్థం తెలుసుకొని చేయలేం కదా... మరి అర్ధం తెలియకుండా మననం చేసుకుంటే ఫలితం ఉండదా? అని.
మొదట సందేహంకు పెద్దవారు ఇలా సమాధానం చెప్పారు - 

భగవంతునికి మంత్రాలు కాదు మన మనస్సు కావాలి. మన భావం కావాలి. ఆ భావం శ్లోకాలలోనో మంత్రాల్లోనే వ్యక్తం చేయనవసరం లేదు. మన భాషలో మన మాటల్లో వ్యక్తపరచవచ్చు. ప్రార్ధించవచ్చు.

"యే యథా మాం ప్రపద్యంతే తాంసదైవ భజామ్యహమ్..." ఎవరు ఎలా భావించి సేవిస్తారో వారిని నేను అలా అనుగ్రహిస్తాను అన్న కృష్ణ పరమాత్మ మాటలయందు విశ్వాసం ఉంచి, నిర్మల మనస్సుతో ఆ భగవంతునితో మాట్లాడవచ్చు. ఆ మాటలే నిజమైన ప్రార్థన.

రెండవ దానికి కూడా సమాధానం చెప్పారిలా - 
నీటిలో తెలిసి పడినా, తెలియక పడినా తడిసిపోతాం. అలానే, దేవుణ్ణి తెలిసి తలచినా, తెలియక తలచినా తప్పక అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కాకపోతే,  సునాయాస మరణం, తిండికి బట్టకి ఇంటికి ఎవరిపై ఆధారపడని సౌకర్యవంతమైన జీవితం... ప్రాప్తించవచ్చు గానీ, దేహాంతే తవ సాన్నిధ్యం... మృత్యువు సమీపించినప్పుడు భగవంతుడినే స్మరించుకోవడం, దర్శించుకోవడం జరగాలంటే, ఎంతో సాధన కావాలి. 

మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. తెలిసినా అంతవరకు జీవించిన కాలంలో స్మరణలో లేనిది ఆ క్షణంలో స్ఫురణకు ఎలా వస్తుంది? మరణం వచ్చే సమయానికి మన మతి గతి స్థితి లకు భగవంతుడు స్పురించాలంటే నిరంతరం భగవత్ ధ్యానంలో ఉండాలి. అందుకు ఎంతో సాధన అవసరం. 

మనమెన్ని సాధనలు చేసినా, మనసులో గూడు కట్టుకుని ఉన్న దుర్గుణాలు వదిలించుకోకపోతే, సాధనంతా వృథాయే. రావణుడు గొప్ప సాధకుడు. తన తపస్సు చేత బ్రహ్మ, శివుని సహితం మెప్పించి గొప్ప వరాలు పొందినాడు. ప్రతి దినం సూర్యోదయం కాక మునుపే, కోటి శివలింగాలకు అభిషేకం చేసిన గొప్ప భక్తుడు. అంత సాధకుడు అయిననూ, తనలో ఉండిన అసుర గుణాలు వదులుకోలేక నాశనం అయిపోయాడు. సాధన చేశాం అంటే దుర్గుణాలు వదిలి పోవాలి. అంతే తప్ప, ఏదో చేసాం, ఎన్నోసార్లు మంత్రాలు వల్లె వేశాం చాలు, అనుకుంటే సరిపోదు. అందుకే పెద్దలు ఇలా చెప్తుంటారు - దేహి దైవాన్ని నిత్యం దర్శించాలి, స్పృశించాలి, సేవించాలి, సంభాషించాలి, తన వేదనను రోదనను వాదనను ఆర్తిని అర్ద్రతను స్వామి ముందుంచాలి, సహాయం కోరాలి, ఆశలను తిరస్కరించాలి, ప్రాప్తించిన వాటిని స్వీకరించాలి, సమాధాన పడాలి, అహంకారం వీడాలి, సాష్టాంగపడి శరణాగతి కావాలి, సద్గుణాలు అలవడాలి, సంస్కారం పరిమళించాలి, ఓంకారంతో నమస్కారం సమన్వయపడాలి, ప్రియంగా మాట్లాడాలి, హితంగా పలకరించాలి, చేతలు పరహితం కావాలి, మన స్వార్థం మరొకరికి అపకారం కారాదు, ఉపచారాలు ఉపకారాలు అలవడాలి, సాత్త్వికతతో ఉద్వేగాలు ఉద్రేకాలు అంతరింపజేయాలి... అప్పుడే భక్తి భావన ప్రేమతత్వంగా రూపుదిద్దుకుంటుంది. మనసంతా భగవన్మయం అవుతుంది. 

అప్పుడే సాధనకు సార్థకత చేకూరుతుంది. ఆధ్యాత్మికతకు అర్థం ఉంటుంది. జన్మ పరమార్థం సార్థకమవుతుంది. అన్నివేళలా అంతటా భగవంతుడు స్ఫురిస్తాడు,గోచరిస్తాడు. 

ఇంత సాధన చేస్తేనే, "దేహాంతే తవ సాన్నిధ్యం" అనే కోరిక తీరుతుంది.

పై రెండు వీడియోస్ వాట్సప్ సేకరణ. రూపకర్తకు 🙏
 

17, జూన్ 2025, మంగళవారం

విగ్రహం అంటే మృణ్మయమూర్తి కాదు, చిన్మయమూర్తి!

 వేదం "ఏకం సత్" అని చెపుతుంటే, ఇందరు దేవుళ్ళు ఏమిటి? ఇన్ని రకాల దేవాలయాలు ఏమిటి? శైవ వైష్ణవ శాక్తేయ వైషమ్యాలు ఏమిటి? 

ఇలా ప్రశ్నలు ఎన్నో... ఇలా అడిగిన వారికి తగు సమాధానాలు మన శాస్త్రాలు, ప్రవచనకారులు, పెద్దలు చెప్తున్నప్పటికీ సందేహాలు వస్తూనే ఉన్నాయి. నేను చదివిన, విన్న వాటి ద్వారా నా అవగాహన మేరకు కొందరి ప్రశ్నలకు కొంత సమాచారం ఈ టపాలో -

"ఏకం సత్" అని వేదం చెప్పిన మాట నిజం. ఉన్నదొక్కటే. అదే సత్యం. అదే నిత్యం. అదే పరమాత్మ. అదే నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్యం. 
పరమాత్మ  నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్య శక్తిగా ఏకత్వం గానే ఉంటే, ఈ సృష్టే లేదు, ఈ జగత్తే లేదు. దేవుడు లేడు, జీవుడు లేడు. కానీ, పరమాత్మ సంకల్పించాడు. 

ఆ సంకల్పానుసారమే ఈ సృష్టి స్థితి లయలు... ఈ సగుణ సాకారాలు. 

అందుకే వేదం పరమాత్మను "త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం .... ప్రజాపతిః" "స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సో క్షరః పరమః స్వరాట్" అని కూడా ప్రవచించింది. అంతియే కాదు,  "త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం, త్వం బ్రహ్మ భూర్భువస్స్వరోమ్" (నువ్వే బ్రహ్మవి, విష్ణువివి, రుద్రుడవు, అగ్నివి, వాయువువి, సూర్యుడవు, చంద్రుడవు, భూమి ఆకాశం అంతటా ఉన్న పరబ్రహ్మవి...అని ఈ శ్లోకం భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, అన్ని రూపాలలోనూ ఆయన ఉనికిని తెలియజేస్తుంది)అని అభివర్ణించింది. 
ఏకో విష్ణుః మహద్భూతం ప్రుదాగ్భూతా న్యనే కశః ...ఇత్యాది వాక్యాలన్నీ ఏకత్వం పొందిన అనేకత్వాన్ని తెలియజేస్తున్నాయి. మరి వేదం చెప్పిన ఆ ఒక్క వాక్యాన్నే కాదు, ఈ వాక్యాలను పరిగణలోనికి తీసుకోవాలి కదా.

దేశ వ్యవస్థ సవ్యంగా నడపడానికి దేశాధినేత, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు... ఇలా ఎలా అవసరమో, సృష్టి క్రమంలో కూడా అనేక రూపాలు అంతే అవసరం. 

ఒకసారి వివేకానందులవారిని ఒకరు అడిగారట, భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? ఇన్ని రకాల విగ్రహాలు ఎందుకని...
బంగారం ఒక్కటే గానీ, ఆభరణాలు అనేకం. ఎవరి అభిరుచి బట్టి ఆయా ఆభరణాలు ఉంటాయి. అలాగే భగవంతుడు ఒక్కడే అయినా, మేం మాకు కావలసిన రూపులో తలచుకొని ఆరాధిస్తుంటాం. భక్తుల భావాలు బట్టే భగవంతుడు రూపాలు ధరిస్తాడు అని చెప్పారట. 


భగవంతుడు సర్వవ్యాపి కదా. సర్వత్రా ఉన్న భగవంతునికి ఆలయాలు ఎందుకు?

నిజమే. పరమాత్మ సర్వవ్యాపి అనేది సత్యం. కానీ, ఆ పరమాత్మను మనం ఎలా గుర్తించగలం? 
నిర్గుణుడు, నిరాకారుడు, విశ్వవ్యాపి అయిన పరమాత్మను కారణజన్ములైన మహాయోగులు, ఋషులు, మహర్షులు దర్శించగలరేమోగాని, సామాన్యులు తమ భౌతికదృష్టితో దర్శించలేరు. వారు అర్చించి తరించగలరేమేగాని, సామాన్యులకు ఇది అసాధ్యం. మరి మనం తరించేది ఎలా? ముక్తి పొందేది ఎలా? ఈ జన్మపరంపరలో చిక్కుకొని జీవితం సుఖ దుఃఖాలతో సాగించవలసిందేనా? అలాంటప్పుడు పశు పక్షాదులకు మనకి తేడా ఏముంది? మానవజన్మ నిరర్ధకమే కదా. మనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికశక్తిని జాగృతం అయ్యేదెలా? ఆత్మ సాక్షాత్కారం అయ్యేదెలా? సత్యాన్ని తెలుసుకోవడం ఎలా? అందుకనే మహాద్రష్టలైన  మన మహర్షులు మనం తరించడానికి వేదానుసారం అనేక మార్గాలను సూచించారు. అందులో భాగంగానే ఆలయ నిర్మాణాలు, సాకారార్చనలు.
ఆలయాలు గురించి మరింత వివరణ ఈ లింక్ లో - ఆలయాల ఆవశ్యకత
అంతర్యామి ఆత్మ రూపేణా హృదయంలోనే ఉంటాడు కదా. హృదిలో ఉన్న హరిని దర్శించక ఆలయాలకు వెళ్ళడం ఎందుకు? విగ్రహారాధన ఎందుకు?


ఇక విగ్రహారాధన ఎందుకంటే - భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక ఆకారం అవసరం. విశ్వాసంతో ఓ విగ్రహాన్ని దైవంగా ఆరాధించడం ద్వారా మనలో ఆరాధన భావం పెంపొంది, క్రమేణా మనోబుద్ధులు సంస్కరింపబడి, విచారణతో ముందుకు సాగుతూ నిజాన్ని ఆవిష్కరించుకోమని హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకాదు, ఒక రూపాన్ని పెట్టి, ఆ రూపాన్ని ధ్యానం చేయమంటేనే, మనస్సు మర్కటంలా పది చోట్లకు పరుగులు తీస్తుంది. అలాంటిది ఏ ఆలంబన లేకుండా అదృశ్యమైన, అత్యున్నతమైన దానిని ధ్యానించాలంటే... అది మనకు సాధ్యమేనా? నిరంతరం చలించడం మనస్సు స్వభావం. ఒక పట్టాన ఒకదానిపై నిలవదు. అందుకే సాకార ఆరాధన. మన హైందవ ధర్మం ఇలా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళే మార్గాలన్నింటినీ సూచిస్తుంది. ఈ విగ్రహ ఆరాధనే క్రమేపి రూపానికి అతీతమైన తత్త్వానికి తీసుకెళ్తుంది. ముందు సాకారం, సగుణం. ఆ తర్వాత నిరాకారం, నిర్గుణం.

దారు లోహ రాయి... విగ్రహాల్లో భగవంతుడు వ్యక్తమౌతాడా? అంతటి శక్తి ఎలా వస్తుంది? ప్రాణ ప్రతిష్ట అంటారు కదా. నిజంగా విగ్రహాల్లో ప్రాణం ఉంటుందా?

విద్యుత్ శక్తి ఒకచోట బల్బ్ లో, మరోచోట ఫ్యాన్ లో, ఏసీ, మిక్సీ..... ఇలా పలు ఉపకరణాలు ద్వారా వ్యక్తమైనప్పుడు, అంతటా ఉన్న విశ్వశక్తి విగ్రహాల్లో వ్యక్తమవ్వదా?

ఒక వంద రూపాయల నోటును చూడండి. అది మొదట ఒక కాగితం. దానిపై వంద రూపాయల విలువను సాధికారంగా ముద్రించినప్పుడు దానికి ఆ విలువ వచ్చింది. ఒక విలువ వ్యక్తమవాలంటే  ఒక సాధికార ముద్ర కావాలి. అలానే విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు మహత్తరమైన బీజాక్షరాలతో ఆయా దేవతల శక్తిని ఆవాహన చేసి, చేస్తారు. మానవ నిర్మిత ముద్రలకే విలువ ఉన్నప్పుడు మన మహర్షులు తెలిపిన మంత్రాల్లో విశ్వశక్తి ఉండదా? అంతటి మహత్తర బీజాక్షరాలతో ప్రతిష్ట చేసిన విగ్రహాల్లో ప్రాణ శక్తి ఉండదా? అంతటా ఉన్న భగవంతుడు విగ్రహంలో ఉండడా?  చూసే భక్తి, విశ్వాసం మనకుంటే తప్పక కనిపిస్తాడు. అందుకు నిదర్శనాలు అనేకం.

మచ్చుకు ఓ రెండు - 
రాజస్థాన్ లోని ఉదయపూర్ దగ్గర శ్రీరూప్ చతుర్భుజ్ స్వామి పేరిట విష్ణుమూర్తి ఆలయం ఉన్నది. ప్రతిరోజూ ఉదయం అప్పటి ఉదయపూర్ మహారాజు రాణా వారు ఈ స్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చేవారు. అప్పటి ఆ ఆలయ అర్చకులు దేవాజీ పండా గారు భగవంతునికి అలంకరించిన పూలమాల తీసి రాజుగారి మెడలో వేసేవారు. ఒకరోజు మహారాజు ఆలయానికి ఉదయం రాలేదు. రాత్రి ఆలయ తలుపులు మూసివేసే సమయం అవడంతో, ఇక మహారాజు రారని భావించి, ఆ పూజారి పూలమాలను తన మెడలో వేసుకొనెను. ఇంతలో మహారాజు వారు వస్తున్నట్లు కబురు రావడంతో, మెడలో వేసుకున్న మాలను తీసి పళ్ళెంలో పెట్టి, రాజుగారు రాగానే ఆయన మెడలో వేసెను. అయితే, పూజారి తన మెడలో వేసుకొని తీసినప్పుడు అతని తెల్లని వెంట్రుక ఆ మాలలో ఉండిపోవడం గమనించలేదు గానీ, అది చూసిన మహారాజు, ఆ వెంట్రుకను చూపిస్తూ, ' ఏమిటీ భగవంతునికి జుట్టు కూడా ఉందా? అదీ పండిపోయిందా?' అని అడుగగా, ఆ...అవును అన్న మాటలు అనుకోకుండా పూజారి అనడం జరిగింది. వెంటనే మహారాజు ' నేను రేపు ఉదయాన్నే వచ్చి విగ్రహాన్ని చూస్తాను' అని చెప్పి వెడలిరి. ఇక పూజారికి భయం మొదలయింది. భగవంతుని విగ్రహానికి తల వెంట్రుకలు ఎలా వస్తాయి? అవి కూడా తెల్లనివి. అబద్ధం చెప్పినందుకు కఠిన దండన తప్పదు. నా కుటుంబంకు ఇక ఏ ఆధారం ఉండదు, ఆ దీనజన రక్షకుడైన విష్ణుమూర్తే తనని రక్షించాలని తెల్లవార్లు ప్రార్థిస్తూ, శరణువేడుకున్నారు. మరునాడు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి చూడగా, స్వామి వారు తెల్లటి జుట్టుతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి, స్వామి తన ప్రార్థన విన్నందుకు అమితానందం పొందుతూ, భగవంతుని కరుణకు కన్నీటి పర్యాంతమైన సమయంలో, రాజుగారు ఆలయానికి వేంచేసి, తెల్లటి జుట్టుతో ఉన్న భగవంతుని విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. ఇది నిజమా కాదా అని పరీక్షించడానికి ఒక వెంట్రుకను లాగగా, వెంటనే అక్కడ నుండి రక్తం స్రవించింది. అది చూసి మహారాజు మూర్చపోయారు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన మహారాజు భగవంతుని ఉనికిని సందేహించినందుకు పశ్చాత్తాపం పడి, స్వామి ముందు సాష్టాంగ పడి క్షమాపణ కోరెను. అంతట స్వామి ప్రత్యక్షమై, మహారాజా నీవు నా ఉనికిని సందేహించావు. విశ్వాసం లేని నీలాంటి వారు నన్ను దర్శించడానికి అర్హులు కారు. అందువల్ల నేటి నుండి ఈ ఉదయ పూర్ సింహాసనాన్ని అధిరోహించే ఏ మహారాజుకైనా ఆలయ ప్రవేశం నిషిద్ధం అని ఆజ్ఞాపించెను.  అందువల్లనే ఆనాటి నుండి ఉదయపూర్ మహారాజుకు ఈ దేవాలయంలోనికి ప్రవేశం లేదు. నేటికీ ఇది అమలులోనే ఉంది. 


ఇలాగే, సాక్షి గోపాల్ కథ. ఒడిశాలోని పూరీ సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆలయం, సాక్షి గోపాల్ ఆలయ కథ ప్రకారం, యాత్రా సమయంలో అస్వస్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఆ సమయంలో తనకు సేవ చేసిన ఒక పేద బ్రాహ్మణ యువకుడుకు  తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మధురలోని బృందావనంలో ఉన్న గోపాలుని గుడిలో వాగ్దానం చేస్తాడు. అయితే, స్వగ్రామం చేరాక, ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అతని కుటుంబం వారి అమ్మాయిని ఆ యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోరు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు వాగ్దానం చేశాడనడానికి సాక్ష్యం ఎవరున్నారని అడగగా, ఆ యువకుడు సాక్షిగా ఉండమని బృందావనం వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించగా, ఆ విగ్రహం బృందావనం నుండి పూరీ వరకు నడిచి వచ్చి సాక్ష్యం చెప్పి, సాక్షి గోపాల్ గా అక్కడే నిలిచెను.
విగ్రహాలలో భగవంతుడు ఉన్నాడనడానికి ఇలాంటి నిదర్శనాలు చాలవా?

ఏకేశ్వరోపాసన, బహు దేవతారాధనలలో ఏది ఉత్తమం? అయినా ఒక్క రూపం చాలదా? ఇన్ని రూపాలు ఎందుకు?

ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే, భగవంతుడు ఒక్కడే కాని, రూపాలు నామాలు అనేకం. 


ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే కాబట్టి, మనం ఈశ్వరుడిని అభిషేకించినా, విష్ణువుని అర్చించినా, అమ్మని ఆరాధించిన మనకు లభించిన అనుగ్రహంలో ఎటువంటి తేడా ఉండదు. ఆకాశాత్పతితం తోయం యధాగచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి...అంటారు శంకర భగవత్పాదులవారు. ఆకాశం నుంచి జాలువారే ప్రతి చిన్న నీటి బిందువూ అంతిమంగా సముద్రాన్ని చేరి లేనమైనట్లే, మనం ఏ దేవుడికి నమస్కరించినా, ఆరాధించినా, అవన్నీ  అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకే చేరతాయి. 

ఒక వ్యక్తి ఒకరికి కొడుకు, మరొకరికి సోదరుడు, మరొకరికి స్నేహితుడు, మరొకరికి భర్త, మరొకరికి తండ్రి, ఇంకొకరికి తాత...ఇలా పలు బంధాల్లో వ్యక్తమై, పలు పేర్లతో అభిమానింపబడినప్పుడు;
పరమాత్మ పలు రూపాల్లో వ్యక్తమై, పలు పేర్లతో ఆరాధింపబడడంలో అభ్యంతరమేముంది?
సాధకుడిని అనుగ్రహించడానికి భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపాల్లో వస్తాడన్నది ఆది శంకరులవారి మాట. ఈ ఉపాసనలు అన్నీ, ఆరాధనలు అన్నీ, రూపాలు అన్నీ, నామాలు అన్నీ అద్వైతం లోనికి చేరడం కోసమే. మనలో ఆత్మశక్తికి ఒక కొనసాగింపే ఈ ఆరాధనలు. ఈ ఆరాధనల కొనసాగింపే ఏకత్వం...అద్వైతం!


ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడుగుతారు గానీ, ఎప్పుడైనా ఇన్ని రకల పండ్లు ఎందుకని, ఇన్ని రకాల కూరగాయలు ఎందుకని ఇన్ని రకాల రుచులెందుకని ఎవరైనా ఎందుకు ప్రశ్నించుకోరు? 

అనాయాసేన మరణం  వినాదైన్యేన జీవనం ... అన్న శ్లోకం తదుపరి టపాలో ...

31, డిసెంబర్ 2024, మంగళవారం

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏



క్రిందటి టపాలో ఓ అజ్ఞాత గారు చేసిన అనేక వ్యాఖ్యలలో ఇది ఒకటి.



అజ్ఞాత గారు,
మీరు చేసిన అనేక వ్యాఖ్యలను ప్రచురించలేదు గానీ, మీరడిగిన వాటికి కాస్త వివరంగా సమాధానం ఇవ్వాలి. అందుకు సమయం లేక కుటుంబ వ్యవహారాలు నడుమ తీరిక కుదరక బదులివ్వడం ఆలస్యమైంది. మన్నించగలరు. ఈ క్రింద వివరణ అంతా మీ పలు ప్రశ్నలను, మీ ఆలోచన సరళిని దృష్టిలో పెట్టుకొని సమాధానం ఇస్తున్నాను.

ఈ యుగంలో ఎవరు గొప్పవారు?

అజ్ఞాత గారు, ఈ యుగంలో గొప్పవారే లేరనా మీ అభిప్రాయం? మరి వీరంతా ఎవరు? గొప్పవారు కాదా?

శంకర భగవత్పాదులు వారు (సా.శ. 788–820)

ఊహూ..... వీరు సాక్షాత్ శివాంశ సంభూతులు. గొప్పోరు కాక, ఏమౌతారు? వీరు కాకుండా చెప్పమని అడుగుతారా? సరిసరే...

రామానుజాచార్యులు (సా.శ.1017 - 1137)
మధ్వాచార్యులు (సా.శ.1238 - 1278)

అబ్బే...రామానుజాచార్యుల వారిని ఆదిశేషుని అవతారంగా చెప్తుంటారు. అలాగే మధ్వాచార్యులు వారిని హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయాంశ అవతారం అని కొందరు, భీముని మరుజన్మ అని కొందరు చెప్తుంటారు. కాబట్టి వీరు కాక ఇంకెవ్వరైనా ఉన్నారా...అని మరల ప్రశ్నిస్తారేమో...

శ్రీపాద శ్రీవల్లభులు (1323-1344)
వేమన (1550-1650)
సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి (1560-1750)
నారాయణ తీర్థులు (1580-1680)
మంత్రాలయం రాఘవేంద్రస్వామి (1596-1671)
త్రైలింగ స్వామి (1607-1887)
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (1608-1693)
సమర్ధ రామదాసు(1608 - 1682)
సొరకాయ స్వామి(1700-1902)
పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి (1710– 1800)
తరిగొండ వెంగమాంబ (1730-1817)
ఆదోని లక్ష్మమ్మ (1815-1933)
లాహిరి మహాశయులు (1828 - 1895)
స్వామి యుక్తేశ్వర్ (1855 - 1936)
బ్రహ్మానంద సరస్వతీ స్వామి (1863-1938)
కుర్తాళం మౌనస్వామి (1868-1943)
నార్పల తిక్కయ్యస్వామి (1870-1924)
కురుముద్దాలి పిచ్చయ్య అవధూత (1870-1951)
కదిరిమంగళం మునీంద్రస్వామి (1876-1961)

ఇలా ఎందరో గొప్పవారు ఉన్నారు కదండీ.

నిజమే కానీయండీ, వీరంతా అవధూతలు, యోగులు, కారణజన్ములు అయి ఉంటారు కదండీ... అని అంటారేమో...

రామకృష్ణ పరమహంస(1836 -1886)
వివేకానంద స్వామి (1863 - 1902)
కావ్యకంఠ వాసిష్ఠగణపతి ముని(1878 - 1936)
శ్రీ అరవింద యోగి (1872 - 1950)
మలయాళ స్వామి (1885 - 1962)
జిడ్డు కృష్ణమూర్తి (1895 -1986) గురువు
మాష్టర్ సి వి వి (1868 - 1922) యోగులు
పరమహంస యోగానంద (1893-1952)
శ్రీ రమణ మహర్షి (1879 - 1953)
పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (1894 - 1994)
వీరంతా గొప్పవారే కదండీ...

ఊ...కానీ, వీరిలో కొందరు తాత్వికులు, పరమగురువులు ఉన్నారు. పరమ గురువులంతా పరమాత్మ ప్రతినిధులే, పరబ్రహ్మాంశలో జన్మించిన వారే అని పెద్దలు అంటుంటారు. ఇంకనూ వీరిలో కొందరు అసామాన్య భక్త మహాశయులు...వీరు గొప్పవారేనండీ నిస్సందేహంగా. కానీ, సామాన్యులు గొప్పవారు కాదు కదా...

ఇది సరైన మాట కాదు అజ్ఞాత గారు. సామాన్యులు తమ అసామాన్యమైన భక్తితో ఎంతో గొప్పవారైనవారు చాలామంది వీరిలో ఉన్నారు. నిజానికి అందరి కంటే గొప్పవాడు భక్తుడే. ఎప్పుడో విన్న ఓ కథ గుర్తుకు వస్తుంది.
'భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమనే పంచభూతాలలో ఏది గొప్ప'దని అడిగాడు శ్రీ మహావిష్ణువు, నారదుల వారిని. 'భూమి గొప్పద'న్నాడు నారదుడు. 'భూమండలంలో ఒక వంతే భూమి, మూడొంతులు నీరు కదా, భూమి గొప్పదెలా అవుతుంద'న్నాడు విష్ణువు. 'అయితే జలం గొప్పద'న్నాడు నారదుడు. 'అంతటి జలాన్ని అగస్త్యుడు తాగేశాడు కదా' అన్నాడు విష్ణువు. 'అయితే అగస్త్యుడు గొప్పవాడ'న్నాడు నారదుడు. 'అంత పెద్ద ఆకాశంలో అగస్త్యుడు ఒక చిన్న నక్షత్రమే కదా' అన్నాడు విష్ణువు. 'అయితే ఆకాశమే గొప్పద'న్నాడు నారదుడు. 'అంతటి ఆకాశాన్ని భగవంతుడు వామనరూపంలో తన పాదంతో కప్పేశాడు కదా' అన్నాడు విష్ణువు. 'అయితే భగవంతుడు పాదం గొప్పద'న్నాడు నారదుడు. భగవంతుని పాదమే అంత గొప్పదైనప్పుడు మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయంలో బంధిస్తున్నాడు కదా అన్నాడు విష్ణువు. 'అయితే భక్తుడే గొప్పవాడ'న్నాడు నారదుడు.

సుదీర్ఘమైన కాలవాహినిలోఎందరో భక్తులు పూజాపుష్పాల్లా తేలియాడి పరమాత్మలో లయించి పోయారు. వారు ఇప్పుడు లేరు కానీ, వారి జీవిత గాథలు ఎందరో సాధకులకు ప్రేరణగా నిలిచి ఉన్నాయి.

అలాంటి గొప్ప భక్తులు ఎందరో.... ఉదాహరణకు -



"తుమ్ భయే సరోవర్, మై బనీ మఛియా
తుమ్ భయే చందా, మై బనీ చకోరా
తుమ్ భయే తరూవర్ మై బనీ ఫఖియా"

"నీవనే సరస్సులో చేపవై నేను సంచరిస్తాను. నీవనే చంద్రుడికై తపించే చకోరాన్నై జీవిస్తాను. నీవనే చెట్టుపై నేను పక్షినై మనుగడ సాగిస్తాను"

"జో తుమ్ తో డో పియా మైనహీ తోడోరే
తోరీ ప్రీత్ తోడో కృష్ణ కౌన్ సంగ్ జోడో...జో తుమ్"

"నీకు దూరమై నేను జీవించలేను. నిన్ను వదిలి నేను మరెవరినీ ఆశ్రయించలేను. మన చిరకాల బంధాన్ని నీవు త్రెంచుకున్నా, కృష్ణా! నేను నిన్ను విడిచిపెట్టను".

తన సర్వస్వమయిన గిరిధర గోపాలుని కోసం ఇంతలా పరితపిస్తూ అకుంఠిత భక్తితో ధన్యత పొందిన మీరాబాయి గొప్పది కాదా?

సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలి పురందరదాసు గొప్పవాడు కాదా?

అవివేకం, దుర్జనమిత్రుల సాంగత్యం కామాంధకారంతో ఉండే ఓ వ్యక్తి పరివర్తునుడై, ఇక తన జీవితంలో మళ్ళీ బాహ్య ఆనందాలపై మనసు మరలకుండా తన కళ్ళను తానే పొడుచుకొని, మనో నేత్రాల ముందు శ్రీకృష్ణుడే కదలాడేటట్లు ప్రార్థిస్తూ, కృష్ణ భక్తుడై పరితపిస్తూ ఆకలిదప్పులు లేకుండా తిరుగాడుతుండగా, ఆ సమయంలో బాల గోపాలుడుగా వచ్చి తనకు ఆహారం అందిస్తున్నది కృష్ణుడే అని గ్రహించి, కృష్ణ సాక్షాత్కారం పొంది ధన్యుడైన బిల్వమంగళుడు గొప్పవాడు కాదా?

సూరదాసు పాడుతుంటే శ్యామనాథుడు కూర్చుని చేతులు కట్టుకొని మరీ వినేవాడట. మరి సూరదాసు గొప్పవాడు కాదా?

అలనాడు యశోదమ్మ త్రాడుకు కట్టుబడినట్లు, భక్తురాలి రూపం దాల్చి, తనకు తానే త్రాడుతో బంధీ అయి, సక్కుబాయిని అనుగ్రహించిన విధం జగత్తుకు విధితమే. సక్కుబాయి గొప్ప భక్తురాలు కాదా?

శివుడును అభిషేకించడానికి చందనం దొరకక, తన మోచేతిని చందనానికి బదులుగా అరగదీసి అభిషేకించాలని తలచి, చర్మం రగిలి, ఎముకలు కనిపించేతగా మోచేతిని అరగదీసుకొని, శివయ్య దర్శనం పొందిన మూర్తి నాయనార్ గొప్పవారు కాదా?

హనుమంతుడి గుండెల్లో సీతారాములు కొలువైనట్లు తన గుండెల్లో కోదండరాముడును దర్శింపజేసిన బూర్లె రంగన్న బాబు (1895 - 1979) గొప్పవారు కాదా?

అమ్మవార్నే తన ఇంటిలో తిరుగాడునట్లు చేసుకున్న మహాభక్తుడు, చితిలో కూడా దేవత దర్శనం అయిన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (1897 - 1990) గారు గొప్పవారు కాదా?

భద్రాచలంలో రామదర్శనంకై వచ్చే భక్తులకు ఏదైన సహాయం చేయాలన్న సంకల్పం పమిడిఘంటం వెంకటరమణ దాసుది. కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని ఆయన యాయవార వృత్తి ద్వారా సంపాదించిన దానితోనే, అన్నదానం చేసేవారు. ఒకనాడు దాసు గారి ప్రయత్నంకు విఘాతం రాకుండా రామలక్ష్మణులే స్వయంగా వచ్చి వండి వార్చేరంటే ఈయన ఎంతటి గొప్పవారో కదా.





సంకీర్తనలతో అన్నమయ్య త్యాగయ్యలు దైవాన్ని మెప్పించి తమ సన్నిధికి రప్పించుకొన్నారు. తులసీదాసు తన రామచరితమానస్‌ ద్వారా శ్రీరాముడి మనసు దోచాడు. మూఢభక్తితో కన్నప్ప తన రెండునేత్రాలను శివుడికి సమర్పించి దివ్య సాక్షత్కారం పొందాడు. పోలి తన భక్తితో శివయ్యను మెప్పించి, కార్తీక మాస చివరాఖన బొందితో స్వర్గానికి వెళ్ళింది.

కష్టాల్లో ఉన్నప్పుడు సీతారామ సమేతంగా వారి పరివారమంతా వచ్చి, త్యాగరాజును ఆదుకోవడం, అలానే వెంకటాద్రి నాథుడే బోయిలా అన్నమయ్య పల్లకిని మోయడం, తులసీదాసు వాకిట రామలక్ష్మణులు కాపలాదారులై నిలవడం, శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారు తినడానికి ఏమీ లేక నీరసించి సొమ్మసిల్లగా ఆ జగన్మాతే స్వయంగా అన్నం తినిపించడం..... ఇలాంటి భక్తుల కథలు వింటున్నప్పుడు వారి అసామాన్యమైన భక్తితో ఎంత గొప్పవారు అయ్యారో అని అనిపిస్తుంది కదా.

మీ మరో ప్రశ్న 'ఇప్పుడు ఎవరున్నారు గొప్పవారు'?

ఎందుకు లేరు?

భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వామి వారిలాంటి పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వామి, మాతా అమృతానందమయి, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు..... ఇలా మనకి తెలిసిన వారు కొందరు... తెలియని వారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

అజ్ఞాత గారు!
అన్ని సంబంధాల కన్నా అపురూపమైనది అద్భుతమైనది భగవత్ సంబంధమే. జన్మించక ముందు, జన్మించిన తరువాత, జన్మ చాలించిన అనంతరం, నిరంతరం వెన్నంటి ఉండే బంధం దైవానుబందం మాత్రమే. పై గొప్పవారినంతా పరిశీలిస్తే భగవంతునితో అనుసంధానం చేసేది భక్తి మాత్రమేనని తెలుస్తుంది.

భక్తి అంటే -


ఇది నా మనమరాలు చిట్టితల్లి శ్రీమాన్వి 5th std లో వేసిన చిత్రం.

భక్తి అంటే -


భగవంతుణ్ణి మనసార స్మరిస్తూ, 'అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అని మనల్ని మనం పరమాత్మకు అర్పించుకోవడం. అందుకే కదా, నారద మహర్షులవారు 'అన్యస్మాత్ సౌలభ్యం భక్తా' భక్తికి మించిన సాధన లేదని అన్నది.

ఇలా వీరు గొప్పవారని, వారు గొప్పవారని ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు. తమ భక్తి ప్రపత్తులతో పై వారంతా ఉదాహరణగా నిలబడటం చాలా గొప్ప విషయం. మరి అలా ఉదాహరణగా నిలబడే ప్రయత్నం మనమెందుకు చేయకూడదూ ....

అత్యాశ అంటారేమో...
కానే కాదు,
ప్రయత్నం చేద్దాం.
ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి లేదా ఆ మరుసటి రోజు...
ఈజన్మ కాకపోతే వచ్చేజన్మ, వచ్చేజన్మ కాకపోతే ఆ మరుజన్మ లేదా ఆ పైజన్మ...
ఏదో ఒకరోజునా...
ఏదో ఒక జన్మనా...
మన ప్రయత్నముకు ఫలితం రాక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం.

అందుకే దైవాన్ని భక్తిగా నిత్యం ప్రార్ధిద్దాం. ప్రార్థన అంటే అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం కాదు. అంతా నువ్వే అంతా నీదే అంటూ, మనల్ని మనం అర్పణ చేసుకోవడం. సంపూర్ణ శరణాగతి చెందడం.

ఈ భ్రమా భరిత జీవిత నాటకం నుండి ముందుగా మనం బయటపడదాం. అంతులేని ఆశలతో, అర్థంకాని ఆవేదనతో రగిలిపోయే మనస్సుకు కళ్లెంవేసి కుదురుగా కూర్చోపెడదాం. నిలువుదోపిడి ఇచ్చినట్లు మనసునంతా శూన్యం చేసి ఆయన పాదాలముందు ఒరిగిపోదాం. హృదయాన్ని ఖాళీ చేసి వేణువులా ఆయన హస్తాల్లో ఒదిగిపోదాం. ఆరంభంలో అసాధ్యంగా అన్పిస్తుంది కానీ, ప్రయత్నిస్తూ పోతే, ఏదో ఒకనాటికి సాధ్యంకాక తప్పదు. ప్రయత్నించడం మన వంతు, ఫలితాన్ని ఇవ్వడం పరమాత్మ వంతు.

నిజమే గానీ, ఇదంతా కష్టం, కొంచెం సులువైన మార్గం లేదా?

ఎందుకు లేదండీ...

మన శాస్త్రాలు పట్ల వివేచన, మన మహర్షులు యోగులు తాత్వికులు జీవన విధానం పట్ల ఓ పరిశీలన, సదవగాహన అలవడితే, మనలాంటి సాధకులకు తత్వచింతన, దైవం పట్ల అనురక్తి, భగవత్ నామం పై ప్రీతి కల్గుతాయి. అప్పుడు అర్థమౌతుంది...
నామ స్మరణ, దైవ చింతన అని రెండు మార్గాలు ఉన్నాయని.
అమ్మా లలితాదేవి...
రామ రామా...
కృష్ణ కృష్ణా...
అని జపించటం స్మరణ.
ఆ జగన్మాత కథలను, రామకథను, కృష్ణుడు చేసిన లీలలను మహిమలను మననం చేసుకోవటం చింతన. కలియుగంలో నామస్మరణను మించింది లేదని శాస్త్ర వచనం. భక్తి ప్రేమలను అంతరంగంలో నింపి, చేసే నామస్మరణకు మించిన యోగం లేదు.

రామమంత్రం యో జపేత్ స రామో భవతీతి రామేణోక్తాః
"రామమంత్రమును జపించువాడు రాముడే యగునని రాముడే వచించినాడు" రామరహస్యోపనిషత్తు తెలిపినది. అటులనే,

యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్

"ఎవరు నన్ను భక్తితో భజింతురో వారు నాయందు ఉందురు. నేను వారి యందు ఉందును" అని భగవద్గీత తెలిపింది.

భగవంతుడు భక్తసులభుడు. ఇక, ఇంతకంటే సులువైన మార్గం, సున్నిత మార్గం, సురక్షిత మార్గం, సుశిక్షిత మార్గం వేరొకటి ఏముంటుంది? ఆ నామాన్ని సదా స్మరిద్దాం... నమ్మే నామాన్ని మనసార భజిద్దాం. పెదవుల నుండి కాక, హృదయం లోంచి ఉచ్చరిద్దాం. నామాన్ని (భగవత్ నామాన్ని) నామికి ( భగవంతునికి) వినిపిస్తుందనే నమ్మకంతో కీర్తించుదాం. భగవంతుడు వింటున్నాడనే అకుంఠిత విశ్వాసంతో పలుకుదాం. నామాన్ని మించింది ఏముంది? అందుకే కదా ... మోక్షాన్ని వద్దని, నిరంతరం నీ నామం నా నాలుక మీద నర్తించగలిగేటట్లు చేయు రామా, అది చాలు నాకు అని కోరుకున్నాడు రామదాసు.



ఈ సాధన త్రికరణ శుద్ధిగా సాగితే, హృదయమనే సరస్సులో నామం ఓ తామరపూవులా వికసిస్తుంది. తామరపూవు లోని మకరందాన్ని త్రాగడానికి మనస్సు ఐహికభావనలు వదిలి తుమ్మెద వలె పరుగుతీస్తుంది.
అప్పుడే, పరిపక్వత చెందిన మనసే ఫలంగా, కోరికలులేని సమర్పణా భావాలు సుగంధపుష్పాలుగా, సర్వుల క్షేమమే మహత్వాకాంక్షగా, నిర్మల నివేదనగా హృదయాన్ని సమర్పించ గలుగుతాం. ఇప్పుడు మన సాధనకు సఫలత లభించగలదు. పరిపూర్ణ ప్రేమతో, ఆర్తిగా ఆరాధిస్తే భగవత్సాక్షాత్కారం లభిస్తుంది.



అలా భగవత్ సాక్షాత్కారాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తశ్రేష్ఠులు ఎందరో ... వీరంతా సజీవ సాక్ష్యంగా కాలవాహినిలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి చాటి చెప్పినవారే.



హృదయపూర్వకంగా మనం దైవ స్మరణ చేస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు. తులసీదాసు విషయంలో ఇది నిజమే కదా.

నిజమే సుమండీ...కానీ, అలా అతికొద్దిమంది మాత్రమే చేయగలరు.

ఆ కొద్దిమందిలో మనం ఎందుకుండకూడదు?

ఓ ఇనుపముక్కను ఓ రాయి మీద రాస్తూ రాస్తూ పోతే, వేడి పుడుతుంది. భగవన్నామం అనే ఇనుపముక్కతో రాయిలాంటి మనసుని అటు ఇటు అనంతంగా అఖండంగా రాస్తూ పోతే, భక్తి అనే వేడిపుడుతుంది. పుట్టిన భక్తి అనే వేడి పరమాత్మునికి ఉండే వెన్నలాంటి హృదయాన్ని కరిగిస్తుంది, కదిలిస్తుంది. కరుణింపజేస్తుంది.

అంతటి భక్తితో ఆర్తిగా వెన్నలాంటి హృదయమున్న భగవంతుణ్ణి కరిగించాలంటే చాలా ఏళ్ళు పడుతుందేమో కదండీ...

పడుతుంది. నిరీక్షించాలి!
కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేయకూడదు. విశ్వాసంతో నిలబడాలి.



నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది.బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి 'నారాయణా! నారాయణా!' అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది. అప్పుడు దైవం అనుభవం అవుతుంది.

 

ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పని చేస్తున్నా,
భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో పాలలో కాస్త చక్కెరనో, తేనెనో కలుపుకొన్నట్లు, జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. పరమాత్మ నామ ధ్యానంలో మునిగిపోవాలి. నిరంతర భగవన్నామ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట.


4, ఏప్రిల్ 2023, మంగళవారం

భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి?

భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా?

ఇది క్రిందటి టపాలో పద్మగారి ప్రశ్న. 

ఇందు గలడందు లేడని
సందేహం వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదికి జూచిన
అందందే కలడు.....
సర్వాంతర్యామి... 
ఎక్కడని వెతకగలం?
అంతర్యామి...
పట్టుకునే శక్తి మనకు ఉందా?
భగవంతుణ్ణి మనం పట్టుకోలేం కానీ, భగవంతుడు ఉన్నాడన్నది సత్యం. మనల్ని పట్టుకు నడిపిస్తున్నడన్నది సత్యం. ఆయన మనల్ని పట్టుకునే వున్నాడు, మనల్ని పట్టుకున్న ఆయన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత. ఆ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికే శోధన, సాధన... అని వాట్సప్ లో తనకి బదులిచ్చాను. వెన్వెంటనే తన నుండి ప్రశ్నల పరంపర.
ఒక చేతితో సంసారమును, మరో చేతితో భగవంతున్ని పట్టుకోవాలన్న రామకృష్ణ పరమహంస మాటలపై మీ అభిప్రాయం? మనం పట్టుకోలేమనుకుంటే ఆయన ఎందుకు పట్టుకోమని చెప్పినట్లు? 
త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య కబీర్ తదితరులు భక్తితో పరమాత్మను పట్టుకొని పరమపదించి ముక్తి పొందలేదా? 
ఆధ్యాత్మికత అంటే ఏమిటి? శోధన సాధన ఎలా చేయాలి? 
అర్థమైంది తన మనోస్థితి. ఆ ప్రశ్నలకు నాలో కదలాడే భావనలను తనకి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలా అని, ఓ స్పష్టతకై ఆలోచిస్తూ... ఈలోగా కొందరి మిత్రుల అభిప్రాయం తెలుకుంటే బాగుంటుందనిపించి, వార్ని అడిగాను - భగవంతుణ్ణి మనమా...మనల్ని భగవంతుడా... ఎవరు ఎవర్ని పట్టుకోవాలి? అని!
'భగవంతుడు మనల్ని పట్టుకోడు, భగవంతుడునే మనం భక్తి ద్వారా సాధనల ద్వారా పట్టుకోవాలి. అందుకు గురువు అత్యవసరం. భగవంతునికి భక్తునికి వారధిగా గురువు ఉండాల్సిందే' అని కొందరు, 'మనల్ని భగవంతుడు పట్టుకోడు, అవతార పురుషులు, కారణజన్ములు, జ్ఞానుల లాంటివార్నే భగవంతుడు పట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా భగవంతుణ్ణి పట్టుకునే అవకాశం మనకి కల్పిస్తాడు'...ఇది మరొకరి భావన. 'ఈ భౌతిక ప్రపంచం ఓ పెద్ద మాయాజాలం. ఈ సంసారం ఓ మహా సముద్రం. లేచిన దగ్గర నుండి పడుకునేంతవరకు పనులు చేయడానికే సమయం సరిపోవడం లేదు. ఈ ప్రాపంచిక ప్రపంచంలో పారమార్ధిక జీవనానికి మనుగడ లేదు. రెండూ భిన్న రహదారులు, భిన్న జీవన విధానాలు. మనం బలహీనులం కాబట్టి మనం దైవాన్ని గానీ, దైవం మనల్ని గానీ  పట్టుకోవడం ఎలా సాధ్యమౌతుంది'...ఇది మరొకరి మాట. మా అమ్మాయి (అనూష)ను అడగగా, ఏమాత్రం ఆలోచించకుండా, 'భగవంతుడే మనల్ని పట్టుకు నడిపిస్తున్నాడు. నా జీవితమే చూడు, ఎన్నో మలుపులు...ఊహించనివి, ఆశించనవి... ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది. ఆ విశ్వాసంతో నడుస్తున్నాను. అయితే బుద్ధి అనేది మనకుంటుంది కదా, దాని సహాయంతో మన నడత సరిగ్గా ఉండేటట్లు చూసుకుంటే చాలు. భగవంతుణ్ణి పట్టుకునే శక్తి మనకెక్కడిది? భగవంతునికి నచ్చేలా మనముంటే, ఆ పట్టుకునేవాడే ఏదో క్షణాన్న పూర్తిగా తనవైపుకు తిప్పుకుంటాడు. అన్నమయ్య, రామదాసు లాంటివార్ని త్రిప్పుకోలేదా'? అని బదులిచ్చింది.
ఇదే ప్రశ్న నా పుత్రున్ని (అనుదీప్)ను అడిగా...'అమ్మా? అంతా దేవేచ్ఛ. ఆయన నడిపిస్తున్నాడు. ప్రతీది అంగీకరిస్తూ, దైవ స్ఫురణతో మన పనిని మనం ప్రశాంతంగా చేసుకుపోవడమే. దొంగ పోలీసును పట్టుకుంటాడా? పోలీసు దొంగని పట్టుకుంటాడా? ఎవర్ని పట్టుకునేశక్తి ఎవరికున్నట్లు? సింపుల్ లాజిక్'...అంటూ సింపుల్ గా చెప్పాడు. అందరి అభిప్రాయాలు ఆలోచింపజేసేవే. 

పద్మగారు పశ్నలకు నాకున్న చిరు అవగాహనతో బదులివ్వడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పులుంటే పెద్దలు మన్నించి సరైన అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను. 
భగవంతుడు మనల్ని పట్టుకోడు... 
ఈ మాటతో నేను ఏకీభవించలేను. ఈ సమస్త సృష్టి సర్వేశ్వరుని సృజనే. భగవంతుని శక్తిచే ఈ జగత్తు నడుస్తుంది. 
కేనోపనిషత్తులో, అమరత్వాన్ని గురించి చూచాయగా ఎఱిగిన శిష్యుడు ప్రశ్నిస్తాడు - 'ఏ శక్తి మనల్ని నడిపిస్తుంద'ని .
కేనేషితం పతతి ప్రేషితం మనః కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః|
కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి||
ఎవ్వనిచే మనస్సు విషయాలపై పడుతుంది? ఎవనిచే ప్రేరేపింపబడి ముఖ్య ప్రాణం తన పనులను నిర్వహిస్తుంది? దేనిచే ప్రేరేపింపబడి మాట్లాడుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం?
దీనికి గురువుగారు ఏం చెప్తారంటే -
శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః|
చక్షుషః చక్షురతిముచ్య ధీరాః ప్రేతస్మాత్ లోకాత్ అమృతా భవంతి||
అది ఆత్మ. దాని శక్తిచేతనే చెవి వింటుంది, కన్ను చూస్తుంది, జిహ్వ మాట్లాడుతుంది, మనస్సు గ్రహిస్తుంది, ప్రాణాలు పనిచేస్తాయి. ఈ ఇంద్రియాల నుండి ఆత్మను వేరేగా చూసే ధీరులు, ఈ ఇంద్రియబద్ద లోకంనుండి బైటపడి అమృతత్వాన్ని పొందుతారు. ఈవిధంగా పరమాత్మ శక్తే మనల్ని పట్టుకు నడిపిస్తుందని తెలుస్తుంది.
దీనినే శ్రీరామకృష్ణ పరమహంస వారు ఒక విశ్లేషణతో చెప్తారు, ఒక కుండలో నీరు పోసి, బియ్యం వేస్తే, అవి ఉడికి, అన్నం తయారుకావడానికి  కారణం క్రింద అగ్ని అయ్యేటట్లు, శరీరమనే కుండలో మనస్సు, బుద్ధి, ఇంద్రియాదులు పనిచేయడానికి కారణం ఆత్మ శక్తి. అదే భగవత్ శక్తి. ఈ శక్తితోనే ఇవన్నీ నడుస్తున్నాయని తెలుసుకోవాలంటారు. ఇప్పుడు ఆలోచించండి పరమాత్మ మనల్ని పట్టుకు నడిపిస్తున్నాడా లేదా? 
                      

మరి, భగవంతుడు మనల్ని పట్టుకోలేదనడానికి తావెక్కడ?

భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా?
భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప మనం భగవంతుణ్ణి పట్టుకోలేం.  
                     

ఎవరికి సాక్షాత్కరించాలో ఆత్మే ఎన్నుకుంటుంది అని అంటుంది కఠోపనిషత్తు. అంటే ఎన్నుకోవడం మన ప్రయత్నాలతో, సాధనతో ముడిపడి లేదు. భక్తులు చెప్పే భగవదేచ్ఛ అన్నా, కర్మయోగులు చెప్పే దేవేచ్ఛ అన్నా, మహర్షులు చెప్పే ఈశ్వరేచ్ఛ అన్నా ఇదే. ఆయన ఇచ్ఛ ఉంటే ఆయనే పట్టుబడతాడు. 

భాగవతం దశమ స్కంధములో ఉలూఖల (ఉలుకల) బంధనమనే ఓ అద్భుత లీల ఉంది. గోపికలంతా కృష్ణుని అల్లరి గురించి యశోదకు చెప్పినప్పుడు, యశోదమ్మ ఎలాగైనా కృష్ణుని పట్టుకొని అక్కడవున్న రోలుకి కట్టేయాలని చాలా ప్రయత్నిస్తుంది. 
                      

కట్టడానికి శక్యం కాని తనని, కట్టివేయాలని పట్టుదలతో, తంటాలు పడుతూ తల్లి చేస్తున్న ఎడతెరపని ప్రయత్నం చూసి, అయ్యో! అమ్మ నన్ను పట్టుకోడానికి ఇంతలా ప్రయత్నిస్తుంది కదా, నేను యశోదమాతకు పట్టుబడాలని అనుకొని పట్టుబడతాడు. తనకి తాను భగవంతుడు పట్టుబడాలని అనుగ్రహిస్తేనే తప్ప పట్టుకోలేం అంటున్నది భాగవతం. 
                  

తల్లి యశోద కృష్ణునితో, నిన్ను పట్టుకుందామంటే, ఎవరికీ చిక్కవట కదా... నేను నిన్ను పట్టుకోవాలని పట్టుదలతో పట్టుబడితే నీవు తప్పకుండా అందుతావు...కృష్ణుని నోటిలో విశ్వ ప్రదర్శన చూసినా, అన్నీ మరిచి మాయలో పడి అంటుంది.  అలాగే మనం కూడా ఏమనుకుంటామంటే, చాలా సాధన చేస్తున్నాం, భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం... గురువును ఆశ్రయించి ఉన్నాం... ఎప్పటికైనా భగవంతుణ్ణి పట్టుకోగలం అని! కానీ, ఈ భావన మాత్రమే సరిపోదు. అలాగని మనం కలత పడాల్సిన పని లేకుండా మనకి కూడా ఎలా తనకి తాను భగవంతుడు పట్టుబడతాడో యశోదమ్మను పరిశోధిస్తే, ఆ సూక్ష్మతత్వం అర్థమవుతుంది. 
                       

కృష్ణుని గురించే అనుక్షణం తపన, హృదయం నిండా అనన్య ప్రేమ, నిరంతర స్ఫురణ, శరణాగతి భావన, పట్టుబడతాడనే పరిపూర్ణ విశ్వాసం వుండి, ఆమెలా ప్రయత్నిస్తే యశోదమ్మకు పట్టుబడినట్లే, తనకి తానై పట్టుబడతాడు. భగవంతుణ్ణి అనుమతి లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు. భగవంతుని అనుగ్రహం లేనిదే ఎవరూ ఏమీ సాధించలేరు. 

సాధన ద్వారా పట్టుకోగలం అనుకుంటే అది మన మనో మాయే. మనం చేస్తున్న సాధన ఆత్మ దర్శనానికి కాదు, చిత్తశుద్ధికి. 

మన ప్రతిబింబం కనిపించాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలానే ఆత్మ దర్శనం కావాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి. మనస్సును వాక్కును ఏకం చేసి భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ నిష్కపటంగా ఉండాలి. మనం చిత్తశుద్ధితో ఉంటే చాలు, మిగిలినదంతా ఆ భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు. 

గొడ్డలి కట్టెలను కొడుతుంది, అది గొడ్డలి గొప్పతనం కాదు. కలం గ్రంథాలను వ్రాస్తుంది, అది కలం గొప్పతనం కాదు. మనం మంచి పనులు చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, అది మన గొప్పతనం కాదు. అన్నింటికీ కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనమని, మనం కేవలం ఈశ్వరుని చేతిలో పనిముట్లం అన్న భావనతో సర్వకర్మలను, కర్మాఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు ఉన్నప్పుడు చిత్తశుద్ది అలవడుతుంది. 
                      

పామరుడు అయిన, పండితుడు అయినా సరే, తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో, అప్పుడో, ఎప్పుడో ఫలం అనుభవించాలి. కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి.  దైవానికి కాదు, కర్మకు భయపడాలి.  దైవం క్షమించినా కర్మ వదలదు, కర్మ ఫలితం అనుభవించాల్సిందే. 
జీవించినంతకాలం కర్మ చేయక తప్పదు. కర్మ ఫలితం తప్పదు. మరి కర్మ ఫలం అంటకుండా ఏం చేయాలి? 
కర్మ ఎరుకతో చెయ్యి, లేకపోతే కర్మే ఎరుకులోకి తీసుకువస్తుంది అంటారు తాత్వికులు.
ఒకసారి మన ఋషులు తెలిపే సంప్రదాయాలను పరిశీలిస్తే, ఆధ్యాత్మికతను దైనందిక జీవితంలో ఎంత చక్కగా ముడిపెట్టి చూపించారో తెలుస్తుంది.
నదులు, చెట్లు, పుట్టలు... అన్నింటినీ పూజించే పద్దతి ద్వారా అన్నింటా దైవం ఉన్నాడనే భావం నెలకొల్పారు. గాలి - వాయుదేవుడు, నిప్పు - అగ్నిదేవుడు, వాన - వరుణదేవుడు, భూమి - భూదేవి...ఇలా ప్రతీ దాంట్లో భగవంతుని ఉనికి అనుభవంలోకి తెచ్చుకోమంటుంది సనాతన ధర్మం. ఆ ఉనికిని అనుభవంలోనికి తెచ్చుకుంటూ చేసే కర్మలు ఈశ్వరునికి పూజలు అని అన్నారు మహర్షులు. ఎవరు ఏపనిలో ఉన్నా దైవస్ఫురణతో చేయాలి.
                      

స్నానం చేస్తున్నప్పుడు - మనలో చెడు వాసనలను శుభ్రం చేసుకుంటున్నాను
బిడ్డకు స్నానం పోస్తూ - దైవానికి అభిషేకం చేస్తున్నాను
ఇల్లు ఊడ్చుతూ - భగవంతుణ్ణి నాలో ప్రతిష్ఠించుకోవడానికి హృదయాన్ని పరిశుద్ధం చేస్తున్నాను
వంట చేస్తూ - దైవానికి నైవేద్యం సిద్ధం చేస్తున్నాను
కూరగాయలు తరుగుతూ - నాలో ఉన్న కామక్రోదాధి దుర్గుణాలను జ్ఞానమనే కత్తితో తరుగుతున్నాను
భర్త పిల్లలు తదితరులకు వడ్డిస్తూ - దైవానికి ఆరగింపు చేస్తున్నాను... 
ఈ రీతిలో ప్రతీ పనిని దైవసేవగా, దైవ స్ఫురణతో సాగిస్తే, ఇంతకంటే సాధన వేరొకటి వుంటుందా అని అంటారు సత్య సాయిబాబా వారు. ఏ పని చేస్తున్న, 'నేను చేస్తున్నాను' అనే అహంకార భావనని దివ్యత్వంలో లీనం చేసి పడే శ్రమను ఒక నివేదనగా భగవంతునికి అర్పించడం అత్యుత్తమ భావన. దైనందిక కార్యక్రమంలో భగవంతుణ్ణి ఉనికి లోనికి తెచ్చుకోవడానికి, నిష్కామ కర్మకు ఇదో చక్కని ప్రక్రియ.
                     

రామకృష్ణ పరమహంస వారు చెప్పిన ఓ చక్కటి కథ గుర్తుకొస్తుంది.
నిరంతరం అంతా రామేచ్ఛ అన్న భావనలో ఉండే  ఓ సాలెవాడు, ఒకరోజు రాత్రి నిద్రపట్టక ఆరుబయట కూర్చొని భగవత్ నామజపం చేస్తున్నాడు. అదే సమయంలో ఆ దారిలో వచ్చిన దొంగలు, మూటలు మోయలేక ఈ సాలెవాన్ని తమతో పాటు నడవమని, ఆ మూటలు ఆయనపై వేసి తీసుకెళ్తుండగా, రక్షకభటులు రావడంతో ఆమూటలను, సాలెవాన్ని వదిలి దొంగలు పారిపోయారు. ఈ సాలెవాన్ని రక్షకభటులు న్యాయాదికారి ఎదుట హాజరు పర్చగా, ఎప్పుడూ అంతా రామేచ్ఛ అన్న భావనలో ఉండే సాలెవాడు 'రామేచ్ఛ వలన అంతవరకు మగ్గం నేస్తున్న నేను అలసి పడుకుందామనుకుంటే, నిద్ర పట్టక నామజపం చేసుకుంటూ ఆరుబయట కూర్చున్నాను. రామేచ్ఛ వలన అటుగా వచ్చిన దొంగలు, వారు మోస్తున్న మూటలు నాపై వేసి వాళ్ళతో పాటు నడవమన్నారు. రామేచ్ఛ వలన కొంతసేపటికి ఈ రక్షకభటులు వచ్చి నన్ను పట్టుకున్నారు. రామేచ్ఛ వలన ఇప్పుడు మీ ముందు నన్ను హాజరుపర్చారు' అని చెప్పగా, ఇతను సజ్జనుడు విడిచిపెట్టండి అని న్యాయాధికారి ఆదేశించెను. ఈ కథలో మాదిరిగా ప్రతీది ఆధ్యాత్మిక కోణంలో స్వీకరించాలి. ఎదురయ్యే కష్టసుఖాలను కూడా భగవత్ ప్రసాదంగా / దేవేచ్ఛగా భావించడం కూడా భగవత్ ఉనికిని అనుభవం లోనికి తెచ్చుకోవడమే. నేరుగా పట్టుకొలేకపోయినా, ఇలా భగవత్ ఉనికిని గుర్తించడం వలన కొంత పట్టుకున్నట్లే.
                       

అలా ప్రతీ పనిలోనూ భగవంతుని ఉనికిని అనుభవంలోనికి తెచ్చుకోవడమే సరైన ఆద్యాత్మికత. ఇలా అనుభవంలోనికి తెచ్చుకోవడం అంత సులువు కాదు, అందుకు ఎంతో అభ్యాసం, పూర్తి విశ్వాసం, సర్వమూ భగవన్మయంగా చూడగలిగే చిత్తశుద్ధి ఉండాలి. 
                     

ఇక ఆధ్యాత్మికత అంటే ఏమిటో గత కొన్ని టపాలలో తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నాను.
ఆధ్యాత్మికత అంటే -
"ఆది నుండి ఉన్న ఆత్మ కథ".
"నిత్యమూ ఆత్మను అధ్యాయనం చేయడం".
"శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే సద్వస్తువు ఉంది అనే జ్ఞానపు ఎఱుక".
"నేను అంటే ఏదో నాకు తెలిపే యోగం".
"ఎఱుక కోల్పోకుండా దైవ స్ఫురణలో ఉండడం"
"బహిర్ముఖమైన మనస్సును అంతర్ముఖం చేయడం".....

ప్రాపంచిక జీవితం, పారమార్థిక జీవితం అని రెండు జీవితాలు లేవు. ఉన్నది ఒకటే జీవితం. ఆధ్యాత్మికత వ్యవహార జీవితానికి అతీతం కాదు. అందులో పార్శమే.
భౌతిక ప్రపంచం పెద్ద మాయాజాలం... మనం బలహీనులం... ఊహూ.....ఈ భావమూ సరికాదు.
                   

భౌతిక ప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం వుండాలి. అంతరంగంలో ఆత్మ స్వరూపుడైన భగవంతుడు ఉన్నాడనే స్పృహ వుండాలి. . అసలు భౌతిక ప్రపంచం మాయకాదు. అంతర ప్రపంచం యొక్క కొనసాగింపే భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచమే అంతర ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి దారి చూపిస్తుంది. మాయ అనేది మనం ఏర్పరుచుకున్న అజ్ఞానం. మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ, ఇదే సత్యమనుకొని ఏర్పరుచుకున్న అభిప్రాయాలు భావాలు నమ్మకాలు వదిలితే, మాయ వీడుతుంది. 
దేనిని మనం మాయ అంటున్నామో, అది సాక్షాత్ బ్రహ్మమే అని తెలుసుకునేంతవరకు ఆధ్యాత్మిక సాధన పరిసమాప్తం కాదు. 
అలానే, మనం బలహీనులం కావొచ్చు. కానీ, మనం ఎవరి శరణు పొందామో, ఆయన సర్వశక్తి సంపన్నుడని మరిచిపోకూడదు. భగవంతుడు అండగా ఉన్నాడన్న విశ్వాసం మనకున్నప్పుడు బలహీనులమనే భావనకు తావులేదు.
                    

పద్మగారు రామకృష్ణ పరమహంస వారి మాటలను ప్రస్తావిస్తూ... భగవంతున్ని మనం పట్టుకోలేనప్పుడు ఆయన పట్టుకోమని ఎందుకు చెప్పారని అడిగారు.
వైద్యులు తమ దగ్గరకు వచ్చిన రోగులందరికీ ఒకే రకమైన మందులు ఇవ్వరు. రోగులను పరీక్షించి, వారికి ఏ మందు చక్కగా పనిచేస్తుందో గుర్తించి, తగు మందులు సూచించి వాడమంటారు. వాళ్ళకి పలానా మందులు వాడమన్నారు, నేనూ అవే వాడతానంటే కుదరదు కదమ్మా.
అలానే, రామకృష్ణుల వారైనా, రమణుల వారైనా, సద్గురువులైనా మన మనస్సు ఎలాగైతే చక్కగా కుదురుకుంటుందో గుర్తించి, తరించడానికి తగు సూచనలు ఇస్తారు. కొందరికి కర్మ యోగం, కొందరికి భక్తి యోగం, కొందరికి జ్ఞాన యోగం ...ఇలా మన ఉపాసన సౌలభ్యం కోసం పలు మార్గాలు చెప్తారు. ఈ సూచనలు మన మానసిక పరిపక్వత, అభిరుచి బట్టి వుంటాయి. 
                      

ఈ యోగ మార్గాలలో కొంచెం వైవిధ్యం ఉన్నా, ఫలితం మాత్రం ఒక్కటే. అన్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి తీసుకెళ్లేవే. మనకు అనువైన ఒక యోగపద్ధతిని చిత్తశుద్దిగా అనుసరించి అందులో పరిపూర్ణత సాధించాలి. 
ఈ శరీరం అశాశ్వతమైనదని, మలినమైన అంశాలతో కూడినటువంటిదని శాస్త వచనం. 
ఈ శరీరం మహా దివ్యమైనది, యోగ సాధనకు అనువైనది, పరమాత్మకు ఆలయం వంటిది అనే ఈ మాటలు కూడా శాస్త్ర వచనాలే.
పరస్పర విరుద్ధమైన ఈ మాటలు ఏయే సందర్భంలో ఎందుకు శాస్త్రం చెప్పిందో ఆ ఆంతర్యం గ్రహించాలి. ఈ శరీరమే నేను అని భ్రమిస్తూ, దాని సుఖపెట్టడానికి ప్రయాస పడేవారికి, ఈ శరీరంపై మోహంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించేవారికి... నాయనా! ఈ శరీరం అశాశ్వతం, ఈ శరీరం నీటి బుడగ లాంటిది, ఈ శరీరమే నీవని భ్రాంతితో దారి తప్పకు అని మొదట మాట చెప్పింది. ఇక రెండవ మాట ఎవరికంటే - ఈ శరీరాన్ని భౌతిక సుఖాలకై పోషించే లాలస లేకుండా, ఈ శరీరాన్ని భగవత్ ఉపకరణగా భావించి, దీనినే ఓ సాధనగా మలుచుకొని, దివ్యత్వం పొందేవారికి చెప్పింది. 
తేనెటీగలు పువ్వుల నుంచి పువ్వులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మకరందాన్ని స్వీకరించినట్లు, మనం నిరంతర జిజ్ఞాసపరులై, జ్ఞానసముపార్జనకి మహర్షులు యోగులు సద్గురువుల నుండి వారి మాటలలో వున్న ఆంతర్యాన్ని, జ్ఞానాన్ని గ్రహించాలి.

త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య తదితరులను భగవంతుడు తన అనుగ్రహంతో తనవైపు త్రిప్పుకున్నాడు. వారి భక్తి అలాంటిది. జ్ఞానంతో కూడిన భక్తి వారిది. 
                        


అనుక్షణం తమలోని అంతర్యామితో అనుబంధం కల్గి వున్నవారు. ఆత్మ జ్ఞానం పొందినవారు. అందుకే అన్నమయ్య "బ్రహ్మ మొకటే, పరబ్రహమొకటే"... అని ఆలపించగలిగారు.  
అంతరంగమున ఉన్న సత్యాన్ని కాంచి,
మనుగేలరా ఓ రాఘవా! 
మరుగేల చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన
అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదికి తెలుసుకొంటినయ్య... అని కీర్తించాడు త్యాగరాగేయుడు.
                  

వారు పరమపదించి ముక్తి పొందలేదు. ముక్తస్థితి పొందే తనువు చాలించారు. ముక్తి అనేది మరణం తర్వాత వచ్చేది కాదు, ముందే పొందేది.
ఇంతటి భక్తి మనలో ఉందా? కన్నప్పలా కన్ను ఇచ్చే భక్తి, రామకృష్ణునిలా అలౌకిక స్థితిలో నృత్యం చేసే భక్తి, రామదాసులా వ్యాకులతతో పరితపిస్తూ గుండె చీల్చుకునే భక్తి మనకుందా?
ఈ ప్రశ్నలు మనమెవరమూ వేసుకోం. ప్రహ్లాదుడు పిలవగానే స్తంభం పగలుగొట్టుకొని నరసింహుడు సాక్షాత్కరించాడు. మరి ఎన్నో లక్షలసార్లు నారాయణ మంత్రజపం చేసిన మనకెందుకు ఆయన కలలోనైనా కానరావడం లేదని మనల్ని మనం ఏనాడైనా సమీక్షించుకున్నామా?
ఏదో కొంతసేపు పూజగదిలో భగవంతున్ని ఆరాధించడం, కొంతసమయం జపం, కొంతసేపు ధ్యానం, సద్గ్రంధాల పారాయణం, వీలైనప్పుడు ఆలయ దర్శనాలకు సత్సంగాలకు వెళ్ళడం...ఇది కాదు భక్తి అంటే. ఇవన్నీ ప్రత్యేక విద్యలను అభ్యసించడానికి అర్హతకై పెట్టిన ప్రవేశ పరీక్షలు లాంటివి.నిజమైన భక్తి అంటే పరమాత్మతో అనుక్షణం అనుబంధం కల్గివుండడం. ఈశ్వరుడు ఉన్నాడనే స్ఫ్రుహతో జీవించడం నిజమైన ఈశ్వరారధన. పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన ధర్మాధర్మాలను గమనిస్తుంటాడు, ఆయన ప్రీతికోసం నేను ధర్మబద్ధంగా జీవించాలనే ఉదాత్త భావన కూడా భక్తే. ఇందుకు కావల్సింది ఎంతో విశ్వాసం, ఆర్తి, శ్రద్ధ. భక్తి ఉన్నవారందరూ భగవంతుణ్ణి ఆరాధిస్తారు. భక్తితో పాటు శ్రద్ధ కలిగినవారు మాత్రమే భగవంతుని అనుగ్రహం పొందుతారు. 
                       

పువ్వులో మకరందం ఉంటే, భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది. అలానే మనలో భక్తి మాధుర్యం ఉంటే, భగవంతుడు తనకి తానే పట్టుబడతాడు.