13, ఆగస్టు 2012, సోమవారం

సప్తగిరివాసుడు "వేంకటేశ్వరుడు"ని సందేశము

దివ్యమంగళకరం శ్రీవేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం.
ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే  వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం.
హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం :-
'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా -
కుడిహస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతుమాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా, ఎడమచేతితో నాభి క్రిందస్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయంచెయ్యమన్న సందేశముంది. 
కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమచేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ.
శంఖు నామ చక్రములు ద్వారా ఇస్తున్న సందేశం :-
శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది. 
కుడి ప్రక్కగల నామమును సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుంటారు.
చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.
జ్ఞానమును పొందమని జ్ఞానచిహ్నముగా శంఖమును, మోక్షచిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తృత్వభావం లేకుండా జ్ఞామును పొంది, తద్వారా కుండలినీ జాగృతమొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది.
ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది.
వేంకటేశ్వరుని కళ్యాణములో అంతరార్ధం :-
వేంకటేశ్వరుడు ఉన్నది ఏడుకొండలమీద. ఏడుకొండలు మానవశరీరంలో ఏడు చక్రాలు. సహస్రారం మీద ఉండే ఈశ్వరుడే వేంకటేశ్వరుడు. 
ఇక పద్మావతి అమ్మవారు. ముందుగా ఈ తల్లీ జననం గమనిస్తే -
నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఆకాశరాజు, ఓసారి యజ్ఞమును ఆచరింపదలచి ఆరణీనదీ తీరంలో బంగారునాగాలితో కర్షణం చేస్తూ, నవధాన్యములు చల్లుచుండగా పద్మశయ్యపై పరుండి బంగారుబొమ్మ వలె ఉన్నబాలిక కనబడగానే, అశరీరవాణి ఈ బిడ్డ నీదే, పెంచుకో అని పలికెను. పద్మావతి అన్న పేరు పద్మమునందు జన్మించినందున వచ్చింది. 
అంతరంగమనే హృదయతీరంలో బంగారునాగలి అనే శుద్ధ సంకల్ఫంతో ప్రాణాయామం ద్వారా సాధన చేస్తూ, నవవిధ భక్తిమార్గములను అనుచరించగా మూలాధారపద్మమునందు ఉన్న పద్మావతి సాక్షాత్కరిస్తుంది. అంటే -
మానవశరీరంలో జగన్మాత కుండలినీరూపంలో మూలాధారంలో మూడున్నర చుట్టాలు చుట్టుకుని ఉంటుంది. ఈ మూలాధార పద్మమునుండి ఉద్భవించిన కుండలినీశక్తియే పద్మావతీదేవి. ఈ పారమార్ధిక అంతరార్ధతత్త్వమును అందరూ గ్రహించలేరు కాబట్టి  సర్వశక్తిమయి జగన్మాత అందరూ ఆరాధించడానికి అనువుగా దాల్చిన భౌతికరూపం పద్మావతి. ఇది సూచించడానికే ఇక్కడ కూడా అమ్మ ఏడుకొండలకు మూలంలో వెలిసింది.  ప్రాణాయామం అనే సాధన ద్వారా మూలాధారపద్మచక్రమందున్న పద్మావతి అంటే కుండలినీశక్తి జాగృతమై భక్తిమార్గంలో ఊర్ధ్వముఖంగా పయనిస్తూ, ఆ మార్గంలో ఉన్న మిగిలిన చక్రాలను (అన్ని చక్రాలు పద్మావతి స్థానములైన పద్మాలే) అధిరోహిస్తూ, సహస్రారం మీదున్న పరమాత్మ వెంకటేశ్వరునిని యందు లయించడమే కళ్యాణం. 
ప్రతినిత్యం తన కళ్యాణం ద్వారా ఇస్తున్న ఆత్మజ్ఞాన సందేశమిదే. 





2 కామెంట్‌లు:

  1. భారతి గారూ!
    చాలా బాగా వివరించారు ఆ శ్రీనివాసుని అలంకారాలు..
    హస్త భూషణాల గురించి...
    అభినందనలు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి