12, అక్టోబర్ 2012, శుక్రవారం

చిత్తుకాగితమే అనుకున్నా........ కానీ, చిరు కధనే తెలిపింది

ఉదయం ప్రక్కింటి ఆమె ఓ కాగితంలో కొన్ని పువ్వులు పంపారు. ఆ కాగితంను డస్ట్బిన్లో పడేయబోతు చూశాను. చిత్తుకాగితమే అనుకున్నా........ కానీ, చిరు కధనే తెలిపింది.
ఆ కధ ఏమిటంటే -

పూర్వం ఓ మహారాజుగారికి ఓ సందేహం వచ్చింది. అది ఏమిటంటే - మహత్వపూర్ణమైన సమయమేదీ? మహత్వపూర్ణమైన పని ఏమిటీ? మహత్వపూర్ణమైన వ్యక్తి ఎవరు? రాజుగారికి సందేహం రావడంతోనే వెంటనే సభని ఏర్పర్చమని ఆదేశించించడం జరిగింది. మంత్రులు, పండితులు, ఆస్థాన విద్వాంసులు....... తదితరులతో సభ కొలువై వుండగా, రాజుగారు పై మూడు ప్రశ్నలడిగారు. ఎవ్వరు ఎన్నివిధాలుగా సమాధానలిచ్చిన రాజుగారు వాటితో ఏకీభవించక అసంతృప్తి వ్యక్తం చేయగా, అప్పుడు మహామంత్రివర్యులు లేచి, రాజా! మన రాజ్యం బయట ఓ యోగిపుంగవుడు ఉన్నాడు. అతను మీ సందేహాలను తీర్చగలని నా నమ్మకం అని చెప్పగా -
మరునాటి ఉదయమునే ఆ యోగి ఉన్న ఆశ్రమానికి కొంతమంది అంగరక్షకులతో కల్సి బయలుదేరాడు. ఆశ్రమం కొంతదూరంలో ఉండగానే, తను మాత్రమే వెళ్తానని, మీరంతా ఇక్కడే ఉండండీ అని అంగరక్షకులను ఆదేశించి ఆశ్రమమును చేరతాడు. ఆశ్రమమునందు ఆ యోగి రాజుగారు వెళ్ళే సమయానికి పలుగుపారలతో చెట్ల మొదలు తవ్వుతూ చదును చేస్తున్నాడు. రాజు ఆ యోగికి నమస్కరించి తన సందేహాలను తెలిపి సమాధానం చెప్పమని కోరుతాడు. కానీ, ఆ యోగి మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటున్నాడు. అంతట రాజు యోగి చేతిలోని పలుగు తీసుకొని చదును చేయనారంభిస్తూ మరల పై ప్రశ్నలు అడుగుతుండగా... శరీరం నిండా గాయాలతో, రక్తం కారుతుండగా, భయంతో ఓ వ్యక్తి ఆశ్రమంలో ప్రవేశించి సృహతప్పి పడిపోతాడు. వెంటనే ఆ యోగితో పాటు ఈ రాజు కూడా ఆ పడిపోయినవ్యక్తికి సపర్యలు చేయడం ప్రారంభిస్తారు. రాజు నీటిని తెచ్చి, తన తలపాగా చించి రక్తం కారకుండా గాయాలను శుభ్రపరుస్తూ కట్లు కడుతుండగా ఆ పడిపోయిన వ్యక్తికి సృహ రాగా, తనకి సేవలు చేస్తున్న రాజుని గుర్తించి, తనని క్షమించవలసిందిగా కోరాతాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియని రాజు నీవెవరవు అని ప్రశ్నిస్తాడు. అప్పుడా వ్యక్తి మీరెప్పుడూ నన్ను చూడలేదు. కొంతకాలం క్రితం జరిగిన యుద్ధంలో నా సోదరుడు మీ చేతిలో చంపబడ్డాడు. అందుకు నేను ప్రతీకారం తీర్చుకోవడానికై మిమ్మల్ని వెంబడించాను. మీ అంగరక్షకులు నన్ను పసిగట్టి చుట్టుముట్టి గాయపరచగా తప్పించుకొని ఈ ప్రదేశమునకు చేరుకున్నాను. నాకు మీరిప్పుడు సపర్యలు చేస్తున్నారు. మీరు ఎంత ఉత్తములో, ఎంత దయగలవారో అర్ధమైంది. నా అపరాధాన్ని క్షమించండి అని అనగా, అతనిని క్షమించి విడిచిపెట్టేస్తాడు. కాసేపటికి మరల ఆ రాజు తన సందేహాలను తీర్చమని ఆ యోగిని కోరగా -
రాజా! ఈ సంఘటనల ద్వారా నీకు సమాధానం దొరికింది, గ్రహించు. నీవు మొదట ఈ ప్రశ్నలు అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నానని నీవు వెళ్ళిపోకుండా పాదులు తీశావు. అలా కాకుండా వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తి నిను వధించడానికి ప్రయత్నించేవాడు. కాబట్టి ఇది నీకు మహత్వపూర్ణమైన సమయం. ఇక ఆ వ్యక్తికి నీవు సేవ చేయడమే మహత్వపూర్ణమైన పని. ఎందుచేతనంటే సేవ చేసి ఇతనిని బ్రతికించక పోయినట్లయితే నీ మీద శత్రుత్వంతో మరణిస్తాడు. మీ మధ్య అప్పుడు జన్మజన్మల శత్రుత్వం సాగుతుంది. ఇప్పుడు నీ సేవలవలన అతను పశ్చాత్తాపపడి, తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఇక మహత్వపూర్ణ వ్యక్తిని నేనే. ఎందువల్లనంటే నావలన నీ ప్రశ్నలకు జవాబు లభించి నీవు శాంతచిత్తంతో తిరిగి వెళ్తావు. మహారాజా! ఇప్పుడు దీనిని సరిగ్గా అర్ధం చేసుకో. మహత్వపూర్ణ సమయమంటే వర్తమాన సమయం. దాన్ని చక్కగా ఉపయోగించడం నేర్చుకోవాలి. మహత్వపూర్ణమైన పని అంటే వర్తమానంలో నీవు చేయవలసిన సత్కర్మ. ఆ పనిని ఏకాగ్రతతో, సావధానంగా చేయాలి. మహత్వపూర్ణమైన వ్యక్తి అంటే వర్తమానంలో నిను సన్మార్గంలో నడిపించేవాడు. అతనితో సముచితంగా వ్యవహరించాలి. దీనినే ఆధ్యాత్మికపరంగా అవగాహన చేసుకో. 
'అధాతో బ్రహ్మ జిజ్ఞాస' అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే మహత్వపూర్ణమైన సమయం. అంటే మనల్ని మనం తెలుసుకోవాలనే సంకల్పం చేసిన సమయమే మహత్వపూర్ణమైన సమయం.
నీలోనికి నీవు పయనించు యోగమే మహత్వపూర్ణమైన పని.
అది ఉపదేశించే సద్గురువే మహత్వపూర్ణమైన వ్యక్తి.

6 కామెంట్‌లు:

  1. "చిరు కధ" అంటూనే ఆధ్యాత్మికపరంగా చాలా గొప్ప విషయాలను చెప్పారండీ..
    ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. అజ్ఞాత గారు!
      కధ నచ్చినందుకు సంతోషం.
      ధన్యవాదములండి.

      తొలగించండి
  3. చాలా బాగా చెప్పారు భారతి గారూ!...
    చిన్న విషయంలా మొదలుపెట్టి వివరించిన తీరు బాగుంది...
    అభినందనలు మంచి పోస్ట్ కి...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ గారు!
      ప్రతీ పోస్ట్ చదివి మీ స్పందనను తెలిపి ప్రోత్సాహిస్తున్నందుకు ధన్యవాదాలండి.

      తొలగించండి