30, జనవరి 2013, బుధవారం

ఆహా... వారు మరింత చతురులు కదా !

ఆహా ..... ఎంతటి చతురుత అన్న టపా చదివిన ఓ మిత్రురాలు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి ఇలా అంది ...
భారతీ! గురువులు కూడా ఎంతో చమత్కారంగా మాట్లాడతూ, శిష్యుల తప్పులను సున్నితంగా సరిదిద్దుతూ నీతిబోధలు చేస్తుంటారు. అందుకు ఉదాహరణంగా నేను విన్నది,  
'శ్రీ రమణులది' చెప్తాను విను-

విదేశీయులూ శ్రీ రమణుల దర్శనార్ధం వచ్చేవారు. ఓసారి అలా రమణాశ్రమమునకు వచ్చిన ఓ విదేశీ స్త్రీ క్రింద కూర్చోలేక కూర్చోలేక కూర్చుని భగవాన్ కూర్చునే సోఫా వైపుకు కాళ్ళు చాచింది. ఇది అక్కడే ఉన్న భగవాన్ శిష్యుడొకరికి సహింపరానిదిగా తోచి, అమ్మా! కాళ్ళు ముడుచుకొండని చెప్పడాన్ని చూసిన మహర్షి; "సరి సరి, ఆమె క్రింద కూర్చోటానికే కష్టపడుతుంటే కాళ్ళు ముడుచుకోవాలా?" అన్నారు నవ్వుతూ. అంతట ఆ శిష్యుడు భయపడుతూ 'లేదు లేదు, ఇక్కడి మర్యాద ఆమెకు తెలియదని చెప్పాను, అంతే' అని బదులివ్వగా; "ఓహో... అట్లాగా... మర్యాద కాదా? అయితే వాళ్ళవైపు కాళ్ళు చాపటం నాకున్నూ మర్యాద కాదు కదా మరి. ఆ మాట నాకున్నూ తాకి వస్తుంది కదా" అని నవ్వుతూ మందలించి కాళ్ళు ముడుచుకున్నారు శ్రీ రమణులు. ఆ మరుసటి రోజు కూడా ఎంతో కాళ్ళు నొప్పులున్న రమణమహర్షి, కాళ్ళు చాచటం, అంతలోనే మర్యాద కాదు కాబోలు అని కాలు ముడుచుకోవడం చేయగా..., ఇది చూసి దుఃఖితుడైన తన శిష్యుణ్ణి చూసి నవ్వేస్తూ కాళ్ళు చాచి ఎప్పటిలా కూర్చుంటూ, "మీరంతా కూడా ఇలా కూర్చోండి ఓ రెండు కధలు చెప్తాను, వినండి" అంటూ అవ్వయార్ కధను, నామదేవ్ కధను చెప్పారట భారతీ... 

శ్రీ రమణులు చెప్పిన అవ్వయార్ కధ -

కైలాసంనుంచి వచ్చిన తెల్లఏనుగును ఎక్కి సుందరమూర్తి వెడుతుంటే చూసి చేరరాజు అశ్వం చెవులో పంచాక్షరి మంత్రమును చెప్పి, దానినెక్కి తానూ వెళ్ళాడట కైలాసానికి. వాళ్ళిద్దరూ వెళ్తున్నారని గణపతిపూజ చేస్తున్న అవ్వయారుకి తెలిసి తానూ పోవాలని తొందరపడుతుంటే ఆ గణపతి అవ్వను చూసి 'అవ్వా! తొందరపడకు, పూజ సావకాశంగా కానియ్యి, నేను వాళ్ళకంటే ముందు నిన్ను కైలాసంకు చేరుస్తాలే' అని అన్నాడట. సరేనని భక్తితో పూజ పూర్తిచేయగానే "అవ్వా! కళ్ళు మూసుకో" అన్నాడు. అంతే, కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల ఎదుట కూర్చొని ఉంది. సుందరమూర్తీ, చేరరాజూల కంటే తన భక్తి వలన ముందుగానే వచ్చింది. అవ్వ పాపం పెద్దదాయే. పరమేశ్వరున కెదురుగా ఇట్లా నాలాగే కాళ్ళు చాచి కూర్చున్నది. ఇది చూసిన పార్వతీదేవికి పట్టరానిబాధ. పరమేశ్వరునికి ఎదురుగా కాళ్ళు చాచిందే, ఇది అపరాధం కదా అన్న దిగులుతో 'నేను చెప్పనా అవ్వతో' అని పరమేశ్వరునికి మనవి చేయగా, "అమ్మో, మాట్లాడకు, ఆమెనేమీ అనరాదు" అని అన్నాడట ఈశ్వరుడు. అయినా ఆ అమర్యాదను సహించలేక చెలికత్తెతో చెప్పగా, ఆ చెలికత్తె అవ్వను సమీపించి 'అవ్వా అవ్వా, కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు అని అన్నాదట. 'అట్లాగా అమ్మా, ఈశ్వరుడు ఎటులేడో చెప్పు, ఇటు తిప్పానా?' అని కాళ్ళు ఇటు తిప్పితే ఇటు, అటు తిప్పితే అటు పరమేశ్వరుడు తిరగవలసి వచ్చింది. అప్పుడు పార్వతిని చూసి, "చూసావా? నేను చెబితే విన్నావు కాదు, ఆమె ఇప్పుడు నన్నెలా తిప్పుతుందో చూడు, అని ఈశ్వరుడు అనగా అంతట  అవ్వని క్షమించమని అడిగింది  పార్వతీదేవి. ఇట్లాగే ఉంటుంది కాలు చాపవద్దనటం.....!

శ్రీ రమణులు చెప్పిన రెండవ కధ నామదేవునిది -

స్వామి విఠల్ తనయందే ఎక్కువ మక్కువగా ప్రీతిగా ఉన్నాడని నామదేవ్ గర్విస్తే, జ్ఞానదేవాదులొకసారి ఘోరా కుంభారునింటికి నామదేవున్ని విందుకు తీసుకువెళ్ళి, విందనంతరం ఇష్టాగోష్టిలో ఘోరాకుంభారునీతో 'ఏమోయ్! నీవు కుండలు బాగా చేస్తావ్ కదా, మరి ఈ మా కుండల్లో పక్వమైనవి ఏవో, కానివేవో నాణ్యం చూసి చెప్పవోయ్...' అని చమత్కరించగా -
వారి ఒక్కొక్కరి తలమీద రెండు మొట్టికాయలు వేస్తూ పరీక్షించడం మెదలుపెట్టారు ఘోరాకుంభారులవారు. అక్కడున్న వారంతా తలవంచి నమ్రతతో వూరుకోగా, నామదేవుడు మాత్రం 'ఏమిటేమిటీ, నన్నే కొట్టవస్తావా?' అని ఎదిరించగా; వెంటనే ఇది పక్వంలేని కుండ అని ఘోరాకుంభారులవారు అనగానే అందరూ పక్కున నవ్వారు. ఇక వెంటనే ఉక్రోషంతో, అవమానభారంతో నామదేవుడు లేచి, విఠల్ దగ్గరకు వచ్చి విలపించగా -
"అందరూ కొట్టినప్పుడు నమ్రతగా ఉన్నప్పుడు నీవెందుకు అలా ఉండలేకపోయా"వని విఠల్ ప్రశ్నించగా; మీకు ఎంతో చేరువైన నేనూ, వారూ ఒకటేనా? నన్నా కొట్టేది అని నామదేవుడు బదులివ్వగా -
"అదే అహంకారం. వాళ్ళంతా నా యదార్ధ స్వరూపం తెలుసుకొని స్వస్థచిత్తులై మౌనంగా వున్నారు. ఓ పనిచేయ్... ఇక్కడికి సమీపంలో ఉన్న అడవిలో ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఉన్న సాధువును సేవించి యదార్ధం తెలుసుకో" మన్న స్వామి విఠల్ మాటలు విని అక్కడికి వెళ్ళిన నామదేవునికి లింగంపై కాళ్ళుపెట్టి పడుకున్న సాధువు కనబడగానే, 'అయ్యయ్యో... స్వామీ అపరాధం, అపరాధం; దేవుడినెత్తిన కాళ్లేమిటీ?' అని కపించిపోతూ అనగా, 'ఓహో... నామదేవా... విఠల్ పంపాడా?' అని ఆ సాధువు అడగడం చూసి, ఆశ్చర్యపడిన నామదేవుడు ఆవేదనతో 'అయ్యా! లింగం మీద కాళ్లేమిటీ?' అని మరల అడగగా; 'అట్లాగా నాయనా! నాకు తెలియదే, కాళ్ళు ఎత్తలేకుండా యున్నాను, కాస్తా అవతల పెట్టవయ్యా' అంటే; సరేనని, కాళ్ళు ఎత్తి ఎటు పెడితే అటు లింగం కన్పించడంతో తనపై పెట్టుకుంటే తానూ లింగంలా గోచరించేసరికి విభ్రాంతితో నిలిచాడు. ' హు... తెలిసిందా ఇప్పుడు' అని సాధువు ప్రశ్నించగా 'తెలిసింది స్వామీ' అంటూ జ్ఞానేశ్వరుల శిష్యుడైన ఆ విశోబాకేశునకు నమస్కరించి ఇంటికి వెళ్లి గదిలో కూర్చొని ధ్యానమగ్నుడై విఠోబా వద్దకు వెళ్ళడం మానాడు నామదేవ్.
కొన్నాళ్ళకు విఠల్ పరుగెత్తుకొని వచ్చి, "నామా! నామా! నీవు రావటం లేదేమీ?" అని ఆర్తిగా అడగగా, 'ప్రభూ! నీవు లేని చోటేది? నిన్ను సదా ఇక్కడే, నాలోనే చూస్తున్నా'ని అనగా ఆనందంతో స్వామి విఠల్ అంతర్ధానమయ్యాడు...అని మహర్షి చెప్పి తన శిష్యునికి జ్ఞానోదయం చేసెనట. 
భారతీ!  రమణమహర్షి ఎంత చమత్కారంగా తన శిష్యుల తప్పులను సరిదిద్దుతూ జ్ఞానబోధ చేసేవారో కదా ... ఆహా... వారు మరింత చతురులు కదా !

4 కామెంట్‌లు:

  1. బాగున్నాయండి. చక్కటి విషయాలను తెలియజేసారు.

    రిప్లయితొలగించండి
  2. మీ ఈ స్పందన సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు అనూరాధ గారు.

    రిప్లయితొలగించండి
  3. సకల సృష్టి యందు సర్వేశ్వరుని గాంచు
    దివ్య దృష్టి గల్గు ధీర మతులు
    చతుర భాషణముల శక్తి సంపన్నులు
    శ్రీ రమణులు - మనసు సేద తీరె

    రిప్లయితొలగించండి
  4. చతుర భాషణముల శక్తి సంపన్నులు, శ్రీ రమణులు .....
    లెస్సగా చెప్పారు మాస్టారు గారు.
    ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి