7, ఏప్రిల్ 2016, గురువారం

ఉగాది పండుగ - పరమార్ధం



భారతీయ సంస్కృతికి దర్పణం పండుగలు. భారతీయ జీవనగమనం నుండి ఈ పండుగలు విడదీయలేనివి. ఆరోగ్యవంతమైన ఆచారాలతో, ఆధ్యాత్మిక సందేశాలతో, ఓ చక్కటి ఉన్నత జీవనశైలిని అలవడేలా చేస్తాయి మన ఈ పండుగలు.  
మానవాళికి ప్రాపంచిక విజ్ఞానాన్ని, పారమార్ధిక జ్ఞానాన్ని అందించి, శారీరక మానసిక శక్తులను యినుమడింపజేస్తూ, మనలో చైతన్యంను సంఘటితం చేసి, విశ్వశాంతి కోసం, మానవజన్మ సార్ధకత కోసం, ఇహ పర శ్రేయస్సుల కోసం, ఎన్నెన్నో అత్యంత ఉన్నత ఆచారముల పేరిట ఆచరణకు శ్రీకారం చుట్టేవే మన పండుగలు.
ఈ పండుగలు ఆహ్లాదభరితంగా వుంటూ, 
ఇటు ... యాంత్రిక ప్రాపంచిక జీవనం నుండి సేద తీర్చే విధంగా, శారీరకంగా ఆరోగ్యంను ప్రసాదించే ఆచారాలతో...  
అదే సమయంలో అటు ... అంతర్గత జీవితసత్యాలను ప్రబోధిస్తూ, ఆధ్యాత్మిక తత్త్వాన్ని తెలుపుతూ, మనస్సును పారమార్ధికం వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ఈ పండుగలన్నీ మానవజన్మ పరమార్ధాన్ని చాటిచెప్పేవే.

యుగస్య ఆది: ఉగాది అని శాస్త్రం తెలుపుతుంది. యుగం ఆరంభమైన మొదటిరోజు యుగాది లేదా ఉగాది. 
చిత్త చిత్ర అనే పేర్లు కలిగిన నక్షత్రమున పూర్ణిమ వచ్చే మాసం చైత్రమాసం. 
చైత్రశుద్ధ పాడ్యమినాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించడంచే ఆ రోజునే ఉగాదిగా పెద్దలు పేర్కొన్నారు.
ఉగాది వసంత ఋతువులో వస్తుంది. వసంతాగమనం శుభకరమైన నూతన ఆశయాలకు, సంకల్పాలకు స్పూర్తిదాయకంగా చెప్తారు.
'వసంతి సుఖం యధా తధా అస్మిన్నితి'... వసంతంలో ప్రజలు సుఖంగా వుంటారని భావం.
కోయిలలు కుహు కుహురావాలతో, అత్యంత రమణీయ శోభాయమానమైన ప్రకృతితో రంజింపజేసే కాలమిది. ఈ వసంతంలో ప్రకృతి నూతనత్వాన్ని సంతరించుకుంటూ పచ్చదనంతో చిగురిస్తూ, ఆహ్లాదభరితంగా శోభాయమానంగా వుంటుంది.
అదేరీతిలో అంతరంగికంగా మన మానసిక జగత్తును పారమార్ధిక జ్ఞానంతో చిగురింపజేస్తే ... మన జీవనం ఆనందమయంగా, ఆధ్యాత్మికభరితముగా ఇహ పర తృప్తినిస్తుంది. 
ప్రకృతిలో భాగమైన మానవుడు నిర్మలమైన అంతఃకరణంతో, మానవత్వంతో కూడి వున్నప్పుడే నిజమైన మనిషి అవుతాడనే శుభాసందేశాన్ని తెలుపుతుంది ఉగాది.
నిశితంగా పరిశీలిస్తే ... పండుగ దినాల్లో పాటించాల్సిన నియమధర్మాలు, ఆచార వ్యవహారాల్లో ప్రాపంచిక పారమార్ధిక ప్రగతే వుంటుంది.


ఈ ఉగాదినాడు ఆచరించవలసిన ముఖ్య విధులు... 

అభ్యంగే నూత్న వ స్త్రే పంచాంగ శ్రవణే ద్విజాత్ / షడృచే నింబపుష్పేచ యుగాదౌ నివసామ్యహమ్ //

అభ్యంగనం :-
పర్వదినాల్లో మహాలక్ష్మి నూనెలోనూ, గంగాదేవి జలములోను ఉంటారని ప్రతీతి. సూర్యోదయంనకు ముందే అభ్యంగస్నానం చేయాలి.
శారీరక ఆరోగ్యం దృష్ట్యా తైలాభ్యంగనం. 
నువ్వులనూనె మర్దనం ఉష్ణాన్ని వెలికితీసి, వాతాన్నీ, చర్మదోషాల్ని హరిస్తుంది. దేహపుష్టినిస్తుంది, దేహంపై వున్న సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. అలానే ఈరోజున మఱ్ఱి, మామిడి, నేరేడు, మేడి, జువ్వి ఆకుల్ని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళతో తలస్నానం చేయడం వలన దేహవర్చస్సుతో పాటు కళ్ళకు మంచిదని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది. 
అలానే,  మానసిక ఆరోగ్యం దృష్ట్యా హృదయాభ్యంగనం చేస్తే -
తైలమర్దనం ద్వారా శరీర జడత్వమును తొలగించుకున్నట్లే ...
 ప్రేమ, దయ, కరుణ శాంతి, సహనం క్షమత్వం, అవగాహన, విశ్వాసం పరోపకారం.....ఇత్యాది సద్గుణంలతో అభ్యంగనం... మానసిక వర్చస్సుని పెంచడమే కాకుండా యిది పారమార్ధిక ప్రగతికి సోపానమని ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలుపుతున్నాయి. 

నూతన వస్త్రధారణ :-
పాతదుస్తులనువిడిచి నూతనవస్త్రధారణచేయడం శుభప్రదం. ఈ ప్రక్రియ ఉత్సాహాన్ని, సంతోషాన్నిస్తుంది. 
పాత దుస్తులను విడిచిపెట్టినట్లు ... చెడును అహాన్ని వర్జించి సద్భావన ధారణ చేయడం మానవజన్మకు సార్ధకతను చేకూర్చుతుంది. 

'సంకల్పాదీ నూతన సంవత్సర నామ కీర్తనం'. 
చైత్రశుద్ధ పాడ్యమినాడు తైలాభ్యంగనము చేసి ఆ తర్వాత నూతన సంవత్సరము పేరు చెప్తూ, సంకల్పం మార్పుచేసి చెప్పాలి. అటుపై కాలస్వరూపుడైన పరమాత్మ అనుగ్రహంను కోరుతూ దైవపూజ చేయడం... ధూప దీప నైవేద్యాలు పూర్తిచేసుకొని నైవేద్యంగా పెట్టిన వేపపూత ఉగాది పచ్చడిని సేవించాలి.

నింబకుసుమ భక్షణం / ఉగాది పచ్చడి సేవనం :-
ఈ రోజున షడ్రుచులతో అలరారే ఉగాది పచ్చడిని సేవించడం ప్రధానమైనది. ఆరు ఋతువుల తత్త్వాన్ని ఆరు రుచుల పదార్ధంగా మలచి, కాలస్వరూపుడైన పరమాత్మునికి నివేదించి, ఆరగించడం ఆచారం.
                                 


ఆరుఋతువులకు ఆరు ధర్మాలున్నాయి. వాటిలో కొన్ని సుఖానికి, కొన్ని దుఃఖానికీ కారణమౌతున్నాయి. ఆయా ఋతువుల్లో అనుభవించబోయే సుఖదుఃఖాలని ఉగాది పచ్చడి రుచులలో నేడే చవిచూసి సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగక ధైర్యంగా వుండడం అలవర్చుకోవాలనే ఈ పచ్చడి సంకేతం. ఆరోగ్య ప్రదాయిని అయిన ఉగాది పచ్చడిని సుఖదుఃఖ సమ్మిళతమైన మానవజీవితానికి సంకేతంగా పరిగణిస్తారు.
శతాయుర్వజ్రదేహృయు: సర్వసంపత్కచ రాయచ / సర్వారిష్ట వినాశాయ, నింబ కుసుమ భక్షణం //
ఈ వేప పూత పచ్చడి సేవనం...  
సర్వమైన అనగా చెడుగ్రహాలు, విపత్తులు, అనారోగ్యదాదులును నివారించి, సర్వ సంపదలను కల్గించే అదృష్టాన్ని వృద్ధిచేసి, దీర్ఘాయువును, వజ్రము వంటి దేహదారుడ్యము ప్రసాదిస్తుంది.
'మధురామ్ల లవణ తిక్తకటు కషాయాః' అని అంటుంటారు. మధురం(బెల్లం), ఆమ్లం(మామిడికాయ, చింతపండు), లవణం(ఉప్పు), తిక్తం(వేపపూవు), కటు(మిర్చి), కషాయం(మిరియం). 
కొన్ని ప్రాంతాలలో ఈ పచ్చడి తయారి కొంత భిన్నంగా వున్నప్పటికీ, వేపపూవు తప్పనిసరిగా వుంటుంది. అలానే ధర్మసింధు లాంటి శాస్త్రాలలో అశోక పల్లవాన్ని కూడా ఈ క్రింది శ్లోకం చదువుతూ సేవించమని తెలుపుతుంది. అశోక పల్లవం దుఃఖ నివారకం.
త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ/ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు //
ఓ అశోక కలికమా! జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను నిన్ను సేవించుచున్నాను. మధుమాసంలో చిగిర్చిన అశోకమా నీవు నన్ను శోకములు లేకుండా చేయుదువుగాక.
వేప క్రిమిసంహారిణి, ఆరోగ్య వర్ధిని. వేపపువ్వు రక్తశుద్ధిని చేసి, రోగానిరోధకశక్తిని పెంచుతుంది. మామిడి, చింతపండు ఆలోచనాశక్తిని, బుద్ధి సూక్ష్మతను పెంపొందిస్తుంది. మిగిలినవి శరీరపుష్టిని, మంచి ఆరోగ్యాన్ని, ఉష్ణ ఉపశమనాన్ని కల్గిస్తాయి. అంతే కాకుండా తీపి (బెల్లం) గురుగ్రహ అనుగ్రహాన్నిస్తుంది. రాహు కేతు కుజాది గ్రహాల పీడలకు ఔషదం మిరియాలు. కాబట్టి వీటిని సేవించడం ద్వారా గ్రహానుకూలతలు కూడా లభిస్తాయని పెద్దల వాక్కు. 

పంచాంగ శ్రవణం :-
అనంతమైన కాలాన్ని భగవంతుడిగా భావించి, ఆరాదించడం ఉగాది పండుగలో ఓ విశేషాంశం. కాలగణనకు ఓ నిర్దిష్ట రూపం పంచాంగం.
అనంతమైన కాలాన్ని మన వ్యవహార నిమిత్తం నామరూపాత్మకంగా విభాగించారు మన పూర్విజులు.
ఈ కాలాన్ని సూర్యసంచారాన్ని బట్టి - క్షణాలు, నిముషాలు, గంటలు, పగలు, రాత్రి, దినాలు, పక్షాలు, నెలలు,ఋతువులు, ఆయనాలు, సంవత్సరాలుగా విభజించారు. దీనిని తెలియజేస్తూ  పంచాంగమును రూపొందించారు. ఈ విధంగా కాలగణనను చేసి మొదటి ఋతువు అయిన వసంతంలో మొదటిమాసమైన చైత్రంలో మొదటి పక్షంలో మొదటిరోజైన పాడ్యమిని ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితి.   సృష్టి ఆరంభం, రాబోయే మార్పులు, భవిష్యత్ కాలగమనం, మంచిరోజులు, చెడుకాలం, కష్టాలు నష్టాలు, లాభాలు, నక్షత్ర గమనాలు, సూర్యోదయ అస్తమయ సమయాలు, నవగ్రహ సంచారాలు ... ఇత్యాది విషయాలు తెలియజేసేది పంచాంగం.
కాలగణనం మూడువిధాలుగా శాస్త్రం తెలుపుతుంది. అవి - 1సౌరమానం (సూర్యుని ఉదయాస్తమయాలను ఆధారంగా చేసుకొని నిర్ణయించేది)
2. చాంద్రమానం(చంద్రుని ఉదయాస్తమయాలు, వృద్ధి క్షయాల ఆధారంగా చేసే కాలనిర్ణయం)
3. బార్హస్పత్య మానం (గురుగ్రహంఅంటే బృహస్పతి గ్రహం యొక్క చలనమాధారంగా చేసే కాలగణన) మనం పాటించేది చాంద్రమానం.

పంచాంగం - ఐదు అంగములు. అవి ... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం. 
కాలస్వరూపుడైన 'దైవం' నివసించి ఉండేది 'తిధి'లో. నవగ్రహాలు ఆ దైవాన్ని సేవిస్తూ ప్రదక్షిణం చేసేదినం వారం. క్షతం కాకుండా కాపాడేది నక్షత్రం. చంద్రుడు నక్షత్రంతో కలిసివుండే కాలం యోగం. కరణ మంటే సాధనలో కార్యసాఫల్యత. అందువలన కాలస్వరూపుడైన పరమాత్ముణ్ణి పంచాంగ రూపంలో  పూజించడం, పెద్దల చెంత శ్రవణం చేయడం ఓ సంప్రదాయం.
తిధేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్య వర్ధనమ్
నక్షత్రార్ధరతే పాపం, యోగాద్రోగ నివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు, పంచాంగ ఫల ముత్తమమ్
కాల విత్కర్మా కృద్దీయాన్ దేవతానుగ్రహం లభతే
పంచాంగ శ్రవణంచే తిధివల్ల సంపదయును, వారము వలన ఆయుష్షును, నక్షత్రం వలన పాపపరిహారమును, యోగము వలన వ్యాధినివృత్తియును, కరణము వలన కార్యానుకూలతయును కలుగును. కావున కాలము దెలిపి కర్మము చేయువారు భగవదనుగ్రమును పొందుదురు. ఈ ఐదును కాలదేవత అంగాలుగా చెప్తారు.
పంచాంగ శ్రవణం ఉగాది నాటి విశేష ఆచారం. ఈ రోజున పంచాంగ శ్రవణం గంగాస్నానంతో సమానమైన ఫలాన్నిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
తిధిర్యారం చ నక్షత్రం యోగః కరణఏవచ / పంచాంగస్య ఫలం శ్వణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్://
పెద్దల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం, వారి ఆశిస్సులు పొందడం, కష్టసుఖాలను, ఏది మంచో చెడో తెలుసుకుంటూ... వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం... ఇదో శుభపరిణామంనకు నాంది. 
ప్రపాదానం :-
సేవాభావం, సాటి ప్రాణుల యందు దయ లాంటి సద్గుణాలు అలవడాలని బాటసారులకై, సర్వప్రాణులకై ... ఉష్ణశాంతిని, దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మన శాస్త్రాలు ఉద్భోదిస్తున్నాయి. దీనినే ప్రపాదానమని అంటారు.
సమాజసేవకై చలివేంద్రాల ఏర్పాటు ... 
ఇక్కడ ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. ఈ మధ్యనే నా ప్రియనెచ్చలి 'విశాల' వాట్సఅప్ లో ఓ సందేశం పంపింది - 
                                        
ఓ చిన్ని గిన్నిలో నీరు పోసి పక్షుల దాహార్తిని తీర్చడమ్... ఇదికూడా ప్రపాదానమే
ఈ ప్రపాదానము వలన పితృదేవతలు సంతృప్తులై సుఖశాంతులను ప్రసాదిస్తారని, మనోరధములన్నీ సిద్ధిస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఈ ప్రక్రియ సేవాభావాన్ని, మానవత్వాన్ని మేల్కొలుపుతుంది. 

 గురు రాజ మిత్ర బంధు సందర్శనం :- 
గురువులను, పెద్దలను, బంధుమిత్రులను కలుసుకొని అత్మీయాతానుబంధాలను పెంచుకోవడం ... నేను, నా కుటుంబం అని అనుకోకుండా వ్యక్తులమధ్య సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకోవడం ... మంచి భావనతో, మంచి సంకల్పంతో, మంచి ఆకాంక్షతో శుభాకాంక్షలు తెలుపుకోవడమనే అద్భుత ప్రక్రియలను పెద్దలు పెట్టడానికి కారణం... ఈ విధమైన విధివిధానములు బాహ్యంగా దేహాన్ని, అంతరంగికంగా హృదయాన్నిశుద్ధి చేస్తాయి. 'నా' సంకుచితభావం నుండి 'మన' అని అనుకునే సద్భావన సహృదయత అలవడుతుంది. 
ఒక్క మాటలో చెప్పాలంటే - "మనలో వున్న స్వభావదోషాలను వదులుకొని సరిక్రొత్తగా సరైనరీతిలో మనల్ని తీర్చుదిద్దుకోవడమే ఉగాది అంతరార్ధం". 
                                     

ఈ ఉగాది అందరిలో...  
సత్సంకల్పానికి నాంది పలుకుతూ,  వినూత్న జీవనానికి క్రాంతులను వెదజల్లుతూ ఆయురారోగ్య ఆనందాలను నింపుతుందని కాంక్షిస్తూ ... 

అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. 

4 కామెంట్‌లు:



  1. స్మరణన యుగస్య ఆదిగ
    నిరతము మనలకు యుగాది నిర్మల మిచ్చున్ !
    కరతాళము గొమ్మా! మన
    పరమార్థపు భారతీ టపా యిది! హరి ఓం !

    ఉగాది శుభాకాంక్షల తో

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు, నమస్తే!
      శుభాకాంక్షలతో మీ ఈ స్పందన చాలా ఆనందదాయకం.
      మీకు మీ కుటుంబసభ్యులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.

      తొలగించండి
  2. అబ్బ! యెన్నెన్ని విషయాలు!!, హాయి గొలుపు
    కథన చాతురి , భారతి గారి పోష్టు
    జదువ , 'చదివించు గుణము'తో సుధలు గురియు ,
    అరయ 'నన్వర్థ' నామధేయమ్ము మీది .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టారుగారు, నమస్తే!
      మీ స్పందనలు ...
      మనస్సు మూగబోయి హృదయం గౌరవాభిమానాలతో స్పందించేటట్లు చేస్తుంటాయి.
      మీకు, మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

      తొలగించండి