6, నవంబర్ 2019, బుధవారం

🕉 కిరాతార్జునీయం - అంతరార్ధం 🕉

మన పురాణ ఇతిహాసాల్లో ప్రతీ సంఘటనకీ అంతరార్ధం, బాహ్యార్ధం తప్పక వుంటాయి. బాహ్యార్ధాన్ని మాత్రమే తెలుసుకుంటే కేవలం విషయజ్ఞానంతో పాటు భక్తిత్వం పెరుగుతుంది. అదే అంతరార్ధాన్ని గ్రహిస్తే ఆత్మజ్ఞానం కలిగి ముక్తిని చేరే మార్గం బోధపడుతుందని ప్రముఖ బ్లాగర్ రసజ్ఞగారు తన ఓ పోస్ట్ లో అంటారు. నాది కూడ అదే భావన. ఆ కోణంలోనే ఈ కధకు చక్కటి అంతరార్ధమును మా తాతయ్యగారు చెప్పారు కానీ, పూర్తిగా జ్ఞాపకంలేదు. లీలగా జ్ఞాపకమున్నది ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. 
                                                         
కృష్ణపరమాత్మ(భగవత్ స్వరూపులు)మరియు
వ్యాసమునీంద్రులవారు(గురు స్వరూపులు) శివునికై తపస్సు చేయమని అర్జునుడికి సూచించారు.  
భగవంతుడు మరియు గురువు...వీరిరువురి సూచన అంటే - నిస్సందేహంగా ఇందులో పరమార్ధమున్నట్లే.
మానవుడిని మాధవుడిగా చేయడానికీ, మనల్ని తరింపచేయడానికి ఏదో అర్ధముందని గ్రహించగలగాలి. జీవాత్మకు ప్రతీక అయిన అర్జునుడిని మిషగా మానవుడు తరించడానికి ఓ గొప్ప సందేశాన్నే ఈ సంఘటన ద్వారా సకల మానవళికి అందించారు. 

శివుడినే ఎందుకు ఆరాధించమని చెప్పారంటే - "శామ్యతి పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతిశివః" అని అర్ధం చెప్తుంది అమరకోశం. పరమానంద స్వరూపుడు, ఏ వికారాలు లేనివాడు శివుడు. 
జీవులన్నింటికీ షడ్వికారాలు (జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశాంగ) ఉంటాయి. శివుడు మాత్రమే ఏ వికారాలు లేని పరమానందమయుడు. మనలో వికారాలు పోవాలంటే -  ఏ వికారాలు లేనివాడిని ఆశ్రయించాలి. అలానే శివుడు పశుపతి. పశువులు అనగా ఇంద్రియములు అని అర్ధం. దిక్కులని మరియొక అర్ధం. వీనికి అధిపతి అయిన పశుపతిని/శివుడిని అందుకే ఆరాధించమని 
సూచించారు.

                           


ఇక కధలోని పరమార్ధం పరిశీలిద్దాం -

మనుషుల్లో  పశుభావమును [నేను జీవుడనే భావమును] పొగొట్టునది పాశుపతాస్త్రం. అంటే అజ్ఞానం పొగొట్టు అస్త్రం. అజ్ఞానం పొగొట్టుకొని ఆత్మజ్ఞానం పొందాలని సాధకుని ప్రయత్నమే ఈ కిరాతార్జునీయం. 
ఇక్కడ అర్జునుడు ఓ ఆధ్యాత్మిక సాధకునిగా పరిగణిస్తూ పరిశీలిద్దాం. ప్రాపంచిక జీవనంలో అలసిసొలసి...ఏమిటీ జీవితం...ఇది కాదు జీవితం...మొన్న ఆనందం...నేడు అజ్ఞాతం...దుఃఖం...ఏది శాశ్వతం...ఏది అశాశ్వతం...ఇత్యాది భావనలతో వైరాగ్యం...అజ్ఞానమును వీడి యధార్ధజ్ఞానమును తెలుసుకోవాలన్న వైరాగ్యసహిత ఆకాంక్ష కల్గింది. ఇదే శుభకరమైన ఇచ్ఛ... 'శుభేచ్ఛ'. ఇది సాధకుని మొదటిస్థాయి.
వైరాగ్యం చేత మనకున్నది మనమున్నది సత్యమూ నిత్యమూ కాదని తెలుసుకొని, ఇంద్రియాల ద్వారా వచ్చే భౌతిక విషయపరిజ్ఞానం, ఆనందాల పట్ల అనురక్తి తగ్గి, సజ్జనసాంగత్యం, స్వాధ్యాయం ద్వారా జ్ఞానప్రాప్తికై... ఏం చేయాలి...ఎలా సాధించాలి అన్న 'విచారణ' మొదలౌతుంది. ఇది సాధకుని రెండో స్థాయి. 

జగద్గురువు కృష్ణపరమాత్మ, వ్యాసమునీంద్రులవారు సూచన మేరకు, అర్జునుడు పాశుపతాస్త్రం సాధించుట కోసం, శివుడికై తపస్సు చేయడానికి ఈశాన్యదిక్కుగా బయలుదేరి ఇంద్రకీలాద్రికి వెళ్ళెను. {ఈశాన్యం - పరమాత్మను ఉపాసించే దిక్కుయని అందరికీ విధితమే} వెళ్ళి పశుపతి అయిన శివుడిని ఆరాధించడం ప్రారంభించెను.
విచారణ ద్వారా ధ్యానసాధనలో నిమగ్నమై ఇంద్రియార్ధముల యందు ప్రీతి  శుష్కించిపోవు స్థితి 'తనుమానసి'. ఇది సాధకుని మూడవ స్థాయి.
అర్జునుడు తపస్సు చేస్తున్నాడు ఎంతోకాలంగా. అయిన శివదర్శనం కానరాలేదు. ( మన హృదయంలో ఓ సత్యముంది. ఆ సత్యం ఎంత లోతులో ఉందో, అంత లోతులోనికి మనం వెళ్ళితే గానీ, ఆ జ్ఞానం దొరకదు. మనం ఆ జ్ఞానాన్ని పొందడానికి స్వప్రయత్నంగా కొంతదూరం వెళ్ళగలం. ఆపై ఎంత సాధన చేసిన వెళ్ళలేం. యిన ఆగక సంకల్పబలంతో ముందుకు సాగితే, తప్పక గుర్వనుగ్రహం లభిస్తుంది).
                            
సడలని సంకల్పంతో సాధన చేస్తుంటే ఇంద్రుడు (గురువు) {దృవుడికి నారదమహర్షి గురువైనట్లు, ఇక్కడ ఇంద్రుడు అర్జునుడికి గురువై మంత్రోపదేశం చేసిరి} వచ్చి, ఎందుకు తపస్సు చేస్తున్నావని ప్రశ్నించి, అర్జునుడనే సాధకుని హృదయక్షేత్రధర్మ పటిమను పరిశీలించి, పట్టుదలను పరీక్షించి, అంతర్గత శత్రువులు...అరిషడ్వర్గాలను జయించాలనే సంకల్పంతో పాశుపతాస్త్రముకై తపస్సు చేస్తున్నాడని మెచ్చి,  పార్ధివలింగమును పంచాక్షరి మంత్రంతో ఆరాధించమని అనుగ్రహించెను. అర్జునుడు గుర్వనుగ్రహంతో కఠోర తపానికై పూనుకున్నాడు. తపోదీక్షలో చాలాకాలం గడిచింది. అప్పుడు పరమేశ్వరుడు పరీక్షించదలచి 
రాక్షసుడిని రొద చేస్తూ తపోభగ్నం చేయమని చెప్తాడు. అంటే అంతరమునున్న ఆంతర్యామి మనస్సనే రాక్షసుడిని ప్రేరేపిస్తాడు. మనస్సు రొదను తన అస్త్రంతో (సాధనాశక్తితో) సంహరిస్తాడు అర్జునుడు. కానీ యధార్దానికి అదే క్షణమున శివాస్త్రం (శివానుగ్రహం) సంహరిస్తుంది మనస్సనే రాక్షసుడిని. 
కానీ, 'నేనే' చంపాననే భావం అర్జునునిది. జీవుని యందు 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. ఇట్టి అహంకారం వలన జీవుడు తనని తాను పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేను అను సంకల్పంగా పనిచేయుచున్నది. ఈ అహంకారమే ఇంకా అర్జునుడిలో వుండడం వలన, వాదిస్తూ ఘర్షకు దిగాడు. కొంత ఘర్షణ తర్వాత శివుడు అపారకృప కనబర్చగా; తనవలననే జరిగిందనిపించినను, నిజమునకు పరమేశ్వరుని సంకల్పం వలనే జరిగెనను పరమసత్యం అవగతమై, అహంకార నిర్మూలనం కాగా పరమాత్మ పాదములను పట్టుకొనెను. పాశుపతాస్త్రమును పొందెను.
పరిపూర్ణభక్తిలో అహం కాలిపోతేనే గానీ తత్త్వజ్ఞానం అనుభవమవ్వదు
ఈ అహంకారమన్నది నీటిలో తేలు మంచుగడ్డ వంటిది. మంచుగడ్డ నీరు ఒకటే అయినను మంచుగడ్డకున్న భౌతికరూపం వలన నీటినుండి తాత్కాలికంగా వేరగుచున్నది. అహంకారం వలన మనకొక స్వభావమేర్పడును. స్వభావం వలన కోపతాపాదులు మమకార బంధాలు ఏర్పడుచున్నవి. తత్ఫలితంగా సమస్త కర్మలు...బంధనాలు. ఎవరికైనను పనులు తాము చేయుచున్నామను అహంకారమే అజ్ఞానం. దే మాయ. దే బంధనం. పరమేశ్వరుని అనుగ్రహం వలననే సమస్తం జరుగుచున్నదని తెలియుటే అహంకార నిర్మూలనం. 
పై మూడు స్థాయిలు తపోసాధనలో అధిగమించి నాల్గవ స్థాయికి చేరడానికి చేసే సాధనలో జరిగే సంఘర్షణ, మనస్సు చేసే కల్లోలములు మాటల్లో కుదించలేం. అంత తీవ్రంగా సంఘర్షణ ఉంటుంది. ఈ 
మనస్సు చేసే రొద సాధనకు అడ్డంకమని అర్ధమై మనస్సుని నిర్వీర్యపరచాలని , సంకల్పం ధనస్సుతో సాధనశక్తి అస్త్రమును సంధిస్తాడు. ఇక్కడ ఈశ్వరానుగ్రహంతో మనస్సును జయిస్తాడు. కానీ ఇంకా వీడని అహంకారం...'నేనే', నా సాధనతో జయించాననే అహంకారదర్పం. కరుణాంతరంగని కృపచే,
ఆ దర్పమూ దమించి, శుద్ధ సాత్త్వికంతో చిత్తశుద్ధి పొంది తద్వారా నాడీమండలం శుద్ధమై కుండలిని జాగృతి అయిన స్థితి యిది. హృదయగ్రంధి విచ్ఛేదమే జ్ఞానం. మనస్సు నశించే సాధనే యోగం.
'అహం బ్రహ్మాస్మి' అని చక్కగా తెలుసుకున్న స్థితి. ఇలా స్వాత్మ యందు నిలకడ పొందడమే 'సత్త్వాపత్తి'. ఇది సాధకుని నాల్గవ స్థితి.
అటు పిమ్మట అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. ఈ స్థితిలో కూడా సాధకునికి పరీక్షలు తప్పవు.
ఇంద్రాది దేవతలు జీవునికింకను సుఖములయందు వ్యామోహం వుందా అని పరీక్షిస్తారు. ఇక్కడ కూడా సాధనాశక్తితో స్థిరుడై సాగిపోవాలి. అప్పుడే సాధకుని జీవప్రజ్ఞకున్న పరిమితి తొలగిపోతుంది. తాను వేరన్న భావం నశించి సమస్తముతోను ఒకటియై ఉండును.
పై నాలుగుస్థాయిల అభ్యాసంచే సత్యరూఢస్థితిని పొంది,అనాసక్తితో, తటస్థ దృష్టితో, సత్యద్రష్టుడై విషయవాసనా రహితమగు అసంగస్థితియందు యుండుటయే 'అసంసక్తి'. ఇది సాధకుని  ఐదవ స్థితి.
ఈ స్థాయికి చేరిన సాధకుడు, కర్మ సంస్కారములు పూర్తిగా భస్మమైపోయేంతవరకు శరీరంతో ఉండాలి కాబట్టి తిరిగి జనవాసంలోనికి వచ్చి సాటివారికై శ్రమిస్తూ అందరి పరిపూర్ణతకు ప్రయత్నిస్తాడు. 
సత్యదర్శనం పొంది, సమాధిస్థితికి చేరిన సాధకుడు, సంకల్పమాత్రంచేత ఆ స్థాయినుండి క్రిందకు వచ్చి ఇతరులకు మేలు చేయునట్టి స్థితి 'పదార్ధభావన'. 
(ఈ స్థాయికి చేరినా సాధకునికి, ఎన్నో సమాధానాలు దొరికినా, ఎంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించిన కొన్ని సందేహాలు మిగిలి వుంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తుంటారు) ఇది సాధకుని ఆరవస్థాయి.

సప్తజ్ఞానభూమికలలో అర్జునుడు అనే సాధకుడు సాధించిన ఆరుస్థాయిల యోగసాధన కధనమే ఈ "కిరాతార్జునీయం". 


ఇప్పుడు మనకో సందేహం రావచ్చు. మరి జ్ఞానభూమికలో సప్తమస్థాయికి అర్జునుడు సాధించలేదా అని.
సాధించాడు..... ఎప్పుడు?
                                


కురుక్షేత్రమున యుద్ధారంభమునకు కాస్త ముందు. కృష్ణభగవానుడు అర్జునునకు గీతను ఉపదేశించి అతని సంశయములను తీర్చి జ్ఞానమును సంపూర్ణంగా అందించి శోకమోహములనుండి ఉద్ధరించాక ఏడవస్థాయిని సాధించెను.

కేవలం ఆత్మనిష్ఠలో అంటే జీవన్ముక్తస్థితిలో వుంటూ శేషజీవితాన్ని గడపడం. వీరికి సుఖదుఃఖాలుండవు. ప్రాప్తించిన కార్యములను అసంగత్వభావంతో చేస్తూ ముక్తులై యుందురు. ఇది 'తుర్యగ'స్థితి.ఇది సాధకుని సప్తమస్థితి.


                          🔱 ఓం నమః శివాయ 🔱

12 కామెంట్‌లు:

  1. అద్భుతః
    అమూల్య విశ్లేషణ.
    ఏం చెప్పాలి
    మీకు 🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగ్ సాధకులకు ప్రేరణామయం. ఓ దిక్సూచి. ఇది అతిశయోక్తి కాదు. ముఖస్తుతి కాదు. అద్భుతంగా వివరించారు.

    రిప్లయితొలగించండి
  3. అవును..ముమ్మాటికీ నిజం మీలో ఉన్న జ్ఞాన తృష్ణ మీ బ్లాగ్ ద్వారా మాకు అందరికీ ఆత్మోన్నతి కలిగేలా వివరిస్తున్నారు

    రిప్లయితొలగించండి
  4. అస్త్రంలేని యుద్ధం తెలుసా..

    మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు మరణించి నప్పుడు అశ్వత్థామకు చాలా కోపం వచ్చింది..

    తన తండ్రిని హత్య చేసిన సైన్యం పై అతను "నారాయణాస్త్రం" అనే భయంకరమైన ఆయుధాన్ని, పాండవ సైన్యంపై వదిలాడు ..

    ఆ అస్త్రం పై, ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేరు, ఇది ప్రజలను కాల్చివేస్తుంది, మరియు చేతిలో ఆయుధాలు ఉన్నవారిని లేదా పోరాడటానికి ప్రయత్నిస్తున్న వారిని కూడా వెంటనే నాశనం చేస్తుంది ..

    *శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని, వారి వారి ఆయుధాలను విడిచిపెట్టి, ముడుచుకున్న చేతులతో, నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు, మరియు యుద్ధం యొక్క ఆలోచనను కూడా మనస్సులోకి రానీయకండి, అది మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది అని చెప్పారు .

    *కొంత సమయం ముగిసి తర్వాత నారాయణ అస్త్రం క్రమంగా శాంతించింది, ఈ విధంగా పాండవ సైన్యం రక్షించబడింది, పోరాటంలో దాడి ఎదురు ఎదురుదాడియో సమాధానం కాదు, కొన్ని యుద్ధాలు నిశ్శబ్దంగా ఉండడం ద్వారా కూడా గెలుస్తారు ..

    కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న ఈ సమయంలో, ప్రకృతి కోపం నుండి తప్పించుకోవటానికి, రక్షణ పొందడానికి, అందరూ కొంతకాలం (అవసరం లేనప్పుడు) బయటకు వెళ్లడం మానేయడం, ఆనందంగా, నిశ్శబ్దంగా తమ ఇళ్లలోనే ఉండటం మరియు ఈ సమయంలో మంచి విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం, చెడు విషయాలను మరిచిపోవడం ఎంతో మేలు చేస్తుంది, అవసరం కూడా ఉంది..

    ముసలి వాళ్లు, పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ...

    🙏 లోకా సమస్త సుఖినో భవంతు 🙏

    Idi WhatsApp forward msg

    రిప్లయితొలగించండి
  5. కిరాతార్జునీయం గురించీ సప్తభూమిఋల గురించీ చక్కగా.వివరించారు. ధన్యవాదాలు. వ్యాసంలో భాషాపరంగా కొన్ని దిద్దుబాటుల అవసరం ఉన్నది. దయచేసి సరిచేయగలరు.

    రిప్లయితొలగించండి
  6. శ్యామలీయంగారు,
    నమస్తే!
    వ్యాసంలో భాషాపరంగా కొన్ని దిద్దుబాటుల అవసరం ఉన్నది...

    దయజేసి ఎక్కడ సరిచేయాలో సూచిస్తే తప్పకుండా సరిచేస్తాను సర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా చోట్ల చిన్నపాటి భాష పరమైన తప్పిదాలున్నవి భారతి గారు. మొదటిగా శిర్షికయే తప్పు.. కిరాతార్జునియం కదా.. వేరేలా ఉంది.. అక్కడక్కడ వ్యాకరణ దోషాలు కలవు.. అర్జునుని, శివుని అని ఉండాలి.. స్పేసర్ లను మరిచారు కొన్ని చోట్ల.. అవి మినహాయిస్తే తక్కినవి అద్భుతంగా అభివర్ణించారు. శ్యామల్ రావు గారి సముచిత వ్యాఖ్యననుసరించి, మీ ప్రత్యుత్తరానికి ఇతివృత్తంగా నేను ప్రస్తావించాను. నేనేదో భాష పండితుడినైతేని కాదు, ముప్పై ఆరేళ్ళ వయస్కుడినంతే.. ఏదైనా తప్పులు దొర్లి ఉంటే మన్నించేదురు.

      ~శ్రీత ధరణి

      తొలగించండి
    2. భారతి గారు, మీ చక్కని వ్యాసంలో తప్పులెన్నాలన్న దురద కాదు, కేవలం మంచివ్యాసంలో భాషకూడా అదేవిధంగా ఉదాత్తంగా ఉండాలన్న ఆశతో చేస్తున్న సూచనలే‌ కాబట్టి అన్యథా భావించరన్న నమ్మకంతో నా దృష్టికి వచ్చిన పొరపాట్లను గురించి వివరిస్తున్నాను.
      1. "భక్తిత్వం" ? భక్తితత్త్వం అనా మీ ఉద్దేశం?
      2. "శివుడుకై తపస్సు చేయమని అర్జునుడుకి" , "మానవుడుని మాధవుడుగా", "శివుడునే ఎందుకు", "పశుపతి/శివుడును", "శివుడుకై తపస్సు", " దృవుడుకి", "రాక్షసుడుని", "అర్జునుడులో" వంటివి ఏమాత్రమూ సరికాదు. ఔపవిభక్తికాలు (ఇ-టి-తి) మరిచిపోతే ఎలాగండీ? అర్జునుడికి, మానవుడిని, మాధవుడిగా, శివుడినే (శివుణ్ణే), శివుడిని(శివుణ్ణి), శివుడికై, ధృవుడికి, రాక్షసుడిని(రాక్షసుణ్ణి), అర్జునుడిలో అన్నవి సరైన విధానంలో ప్రయోగాలు. ఈపొరపాటు నేటికాలంలో అందరూ సాధారణంగా ఎందుకు చేస్తున్నారో బోధపడదు. మొబైల్ మీద తెలుగులో టైప్ చేసేటప్పుడు శివుడు అని ఆటో‌సెలక్ట్ రాగానే తీసుకొని కై అని చేర్చటం సులువు కావచ్చు కాని పదరూపం తప్పుకదా.ఇత్యాదులు పరిహరించండని విన్నపం.
      3. "కిరాతార్జనీయం"? కిరాతార్జునీయం అని సరిచేయాలి. అర్జునుడు కాని అర్జనుడు కాదు కదా. ఈపొరపాటు వ్యాసంలో చాలా చోట్ల ఉన్నది.
      4. " శివున్ని"? " శివుణ్ణి" అని ఉండాలి.
      5. "గుర్వానుగ్రహం"? గుర్వనుగ్రహం అని ఉండాలి.
      6. "పాశుపతాస్త్రంకై"? పాశుపతాస్త్రానికై అని ఉండాలి.
      7. "అపారకృపానుగ్రహం"? కృప అన్నాక అనుగ్రహం అనవసరం కదా. పునరుక్తి ఎందుకు? అపారకృప అంటే చాలు.
      8. "తత్ ఫలితంగా"? తత్ఫలితంగా అని సంధిచేసి వ్రాయటం సముచితం.
      9. "సంఘర్షన"? సంఘర్షణ అని ఉండాలి.
      10. "మనో కల్లోలము"? మనఃకల్లోలం సరైన రూపం.
      11. "మనోరొద"? ఇది దుష్టసమాసం. సంస్కృతపదానికి తెలుగుముక్క జోడించి సమాసం చేయరాదు.
      12. "కరుణాంతరంగడు కృపాకటాక్షంచే"? పొరపాటులున్నాయి. "కరుణాంతరంగుని కృపచే" అంటే చాలు కృపాకటాక్షం పునరుక్తి.
      13. "పరిమితత్వం"? పరిమితి అంటే చాలు కదా? పరిమితత్వం అన్న పదరూపం లేదు.
      14. "పరిపూర్ణత్వమునకు"? పరిపూర్ణతకు అన్నది సరిగా ఉంటుంది.
      వీలు చూసుకొని మీ వ్యాసంలో దిద్దుబాట్లు అవసరమైన చోట చేస్తే వ్యాసం మరింత రమ్యంగా ఉంటుందని నా నమ్మకం.

      తొలగించండి
    3. శ్యామలీయంగారు,
      ఎంతో ఓపికగా చదివి భాషాపరంగా దొర్లిన తప్పులను తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు.
      విలువైన మీ సూచనల ప్రకారం సరిజేసానండి. 🙏

      తొలగించండి
  7. శ్రీత ధరణి గారు,
    భాష పరమైన తప్పిదాలను గుర్తించిన మేర సరిదిద్దాను.
    మీ చక్కటి సూచనలకు హృదయపూర్వక ధన్యవాదములు.

    మీ పేరు చాలా బాగుందండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు భారతి గారు. పురాణేతిహాసాలు భారతీయ సాంప్రదాయల పట్ల నేటి సమాజంలో వాటికుండే ప్రాముఖ్యతలను గూర్చి చక్కగ విశదికరిస్తున్న తీరు శ్లాఘనీయం.. అనట్టు నా ఆ పేరు నా కలం పేరండి.. నా పేరు+నా సహధర్మచారిణి పేరును కలగాపులగం చేస్తే వచ్చిన పేరది.. ప్రోఫైల్ నేమ్ ను గమనించ గలరు. తనని నేను, నన్ను తాను ధరణి అనే పిలుచుకుంటాం. అది అసలు విషయం.

      ~శ్రీత ధరణి

      తొలగించండి