17, నవంబర్ 2020, మంగళవారం

కార్తీకశుద్ద చవితి - నాగుల చవితి

పరమాత్మ యొక్క వ్యక్తరూపమే ప్రకృతి అని, అన్నింటిలోనూ ఆయా ఉపాధుల ద్వారా, పరమాత్మతత్త్వం వ్యక్తమౌతుందన్న విశ్వాసం భారతీయులది. అందుకే మన దృష్టిలో, ప్రకృతిలోని సర్వజీవులు, సర్వ పదార్ధాలూ పూజనీయమే.  ప్రకృతిలో కనిపించే ప్రతీజీవికి, అవి మనకు చేసే మేలుకు కృతజ్ఞతగా -  సందర్భానుసారంగా పూజలు చేస్తుంటాం. ఇది మన ఔనత్యం. ఇంతటి మహత్త్వభావన విశాలవిశ్వంలో భారతీయులకే సాధ్యమైంది. పంచభూతాలను, సముద్రమును, పర్వతాలను, వృక్షాలను, గోవులను, సర్పాలను, విగ్రహాదులను ఆరాధించడం ప్రాచీనకాలం నుండి వస్తున్న సంప్రదాయం. సనాతనధర్మంలో - సమస్తాన్ని భగవన్మయంగా భావించడం, పూజించడం ఓ భాగం. పూజలు చేయడం వలన, సాత్త్వికమైన మనస్సుతో పరమార్ధ విచారణ చేయడానికి అవసరమైన శక్తి ఏర్పడుతుంది


కార్తీకశుద్ద చవితి - నాగుల చవితి

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ !
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!


                       

నాగుల చవితి రోజున నాగేంద్రునిని శివభావముతో అర్చిస్తే, శారీరకరోగాలు  తగ్గుతాయని, సౌభాగ్యవంతులవుతారని, సర్పపూజ చేసే వారి వంశం చక్కగా వర్ధిల్లుతుందని పెద్దలు చెప్తుంటారు. 

నాగారాధన - వేదకాలం నుండి ఉంది. నాగేంద్రుడు శివునికి ఆభరణముగా, శ్రీమహావిష్ణువుకు శయ్యగా ఉన్నాడు. నాగులు బ్రహ్మదేవునికి పౌత్రులు (మనవళ్ళు). కనుక నాగరాజున్ని పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినట్లేనని పెద్దల వచనం. 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, సాధరణంగా సర్పాలను చాలామంది దేవతలు ఆభరణంగా ధరిస్తారు. వినాయకుడి వడ్డాణం, యజ్ఞోపవీతం సర్పమే. ఇక, సుబ్రహ్మణ్యుడునయితే... నాగస్వరూపునిగా పూజిస్తారు. జంటపాములును సుబ్రహ్మణ్యుడే అని ఆరాధిస్తుంటారు. 

ఇక, సర్పపూజ విషయానికి వస్తే - ప్రాణులన్నిటా పరమాత్మ ఉన్నాడని, ఏ ప్రాణిని అనవసరంగా భాదించకూడదని, దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతుంటుందనే ఓ చక్కటి సందేశంకు దర్పణం సర్పపూజ. 
పుట్టను పూజించడం, పాలు తేనె పోయడం...రావి వేప చెట్ల దరి, నాగప్రతిష్ఠ చేసి ప్రదక్షిణాలు చేసి పూజించడం... వీటన్నిటిలో ఎన్నో ఆరోగ్యకర, వైద్య, విజ్ఞాన రహస్యాలున్నాయి.

తలస్నానం చేసి ఉపవాసంతో వుండి పెసలు/పెసరపప్పు, మొలకెత్తిన/నానబెట్టిన అపక్వాహారంతో పాటు నువ్వులు దంచి, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి ప్రసాదమును, బియ్యపుపిండి బెల్లం కలిపి చేసిన చలివిడి మొదలగునవి నాగులకు నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తారు. ఎందుకంటే - పుట్ట దరికి వెళ్లడం, తాకడం, పుట్టమన్ను వాసన పీల్చడం వలన మరియు ప్రసాదములుగా పెట్టిన పై పదార్ధములు తినటం వలన, స్త్రీలకు నాడీమండలం శుద్ధై, సంతానోత్పతికి అవసరమైన శక్తులు వృద్ధి అవుతాయని, గర్భధారణకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయని ఆయుర్వేదం తెలుపుతుంది. ఈ కారణం చేతనే, సంతానం లేనివాళ్ళు నాగపూజలు, నాగప్రతిష్టలు చేసే ఆచారాన్ని పూర్విజులు ప్రతిపాదించారు. అలాగే పుట్ట బంగారం (పుట్ట మన్ను) చెవులకు రాసుకుంటారు. పుట్టలోకి పాములు వెళ్లి వస్తున్నప్పుడు పుట్ట అంచులకు శరీర రాపిడితో పాములనుండి స్రవించే ద్రవం ఆ మట్టికి అంటి ఓ ఔషధంలా పనిచేస్తుందని చెప్తుంటారు. 
                           

ఆధ్యాత్మిక అంతరార్ధం -  మన శరీరాన్ని నవరంద్రాలున్న పుట్టగా పోల్చుతారు. పుట్ట క్రిందభాగం విశాలంగా వుండి పోను పోను సన్నగా ఎలా అయిపోతుందో, అలానే మనం కూర్చున్నప్పుడు మన దేహాకృతి వుంటుంది.
మన దేహంలో ఉండే మనస్సుకు కేంద్రం మెదడు. ఈ మెదడు పాముపడగ ఆకారంలో వుంటుంది. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని వ్యవహరిస్తారు. కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం చెబుతోంది. 'కుండల'మంటే పాముల చుట్ట. పుట్ట అడుగున చుట్ట చుట్టుకొని పాము  ఉన్నట్లే, మన శరీరంలోనూ మూలాధార చక్రమునందు కుండలినీ శక్తి చుట్ట చుట్టుకున్న పాములా ఉంటుంది. ఈ కుండలినీ శక్తిని సాత్త్విక విధానంలో ఉద్ధీపింపజేయడమే నాగపూజ పరమార్ధం. 
                           

తలనుంచీ తోకవరకు మెలికలు ఉన్న రెండుపాముల రాయి ఒకటి రావిచెట్టు క్రింద ఉండడం కొన్ని దేవాలయాల్లో చూస్తుంటాం. 
                         

                                     
ఆ విధంగానే కుడి ఎడమ ముక్కు రంద్రాలతో పీల్చేగాలి, పింగళ ఇడ నాడుల ద్వారా, పాములు మెలిక వేసుకొని ఉన్నట్లు శరీరంలోనికి పోయి, సంచరిస్తూ వుంటుంది.

తమో రజో గుణాలనే విషాన్ని పాము చిమ్మకూడదని, సత్త్వగుణంతో ఉండి మనల్ని రక్షించాలని ప్రార్ధిస్తూ, సత్త్వగుణ ప్రతీకయైన పాలును పుట్టలో ఎలా వేస్తున్నామో... అలానే, మనలో  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, రజో తమో గుణాలు క్షయమై సత్త్వగుణ సంపత్తి పెంపొందించుకోవడానికి, భగవత్ భక్తి అనే క్షీరాన్ని పోయాలని పెద్దలు పేర్కొంటారు. 

ఒకోసారి మన దేవతామూర్తులను పరిశీలిస్తే, చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. వారు చెంత కొలువై ఉన్నవి ... పరస్పర శతృవర్గం వారు.  విష్ణువుకు ఆదిశేషువు శయ్య కాగా, గరుత్మంతుడు వాహనం.  ఒకే ఇంట ఉన్న - శివునికి, వినాయకునికి పాములు ఆభరణములు కాగా, కుమారస్వామికి వాహనం నెమలి. ఆపై అమ్మవారో...నకులేశ్వరి (నకుల అంటే ముంగిస). ముంగిస స్వరూపంలో కూడా అమ్మ వారు ఉంటారట. అంతేనా...మానవదేహమునందలి వెన్నెముక యందు కుండలినీ శక్తిగా సర్పాకారంలో ఉన్నదీ...  ఆ శ్రీవిద్యా స్వరూపిణి జగన్మాతయే.

పాముకు ప్రధాన శతృవులు - గరుడపక్షి, నెమలి, ముంగిస. మరి ఇవన్నీ మనం ఆరాధించే దేవతల చెంతనే ఉండడం వెనుక మర్మమేమిటి? 
అధోగతి పట్టించే అంశాలను సంహరించే స్థితిని దేవతలు అనుగ్రహిస్తారు. అందుకే మనకు అనుకూల్యతగా శతృత్వం ఉన్న వాటిని తమకి ఆభరణాలుగా, వాహనములుగా మలుచుకుంటారు. వాటి  ద్వారా మన పంచేంద్రియాలతో అపసవ్యంగా చరించే మనస్సును సవ్యదిశలో నడిపిస్తారు. దీనిని కాస్త కూలంకుషంగా  పరిశీలిద్దాం -
సృష్టిలో ప్రతీ అంశంలో అనుకూలతలు, ప్రతికూలతలు ఎలా ఉంటాయో, మనలో ఉన్న కుండలినీ  సర్పములో కూడా అనుకూలత, ప్రతికూలతల అంశాలు ఉంటాయి.  అనుకూలతగా ఉన్న అంశం ఉద్ధరణలోనికి తీసుకొస్తే,  ప్రతికూలతగా ఉన్న అంశం  క్షీణింపచేస్తుందని పేర్కొంటారు. 

క్షీణింపచేసే అంశం - మనలో తేజస్సుని ఇంద్రియలౌల్యం కొరకు క్షయం చేసే సర్పం. ఇది శరీరంలో మూలాధార చక్రంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. బుద్ధిని మందగింపజేస్తుంది. బ్రహ్మమునందు నిలబడనీయదు. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. తేజస్సుని అదోముఖంగా క్రిందకు వెళ్ళేటట్లు చేస్తుంది. తత్ఫలితంగా పురోగతి చెందలేం. భగవంతున్ని చేరుకునే దిశగా వెళ్ళలేం.
                       

ఉద్ధరణలోనికి తీసుకొచ్చే అంశం - భగవంతుని యందు భక్తితో బ్రహ్మచర్యమందు పూనికతో ఉండేటట్లు చేస్తుంది. తేజస్సును ఓజస్సుగా మార్చుతుంది. ఉన్నతపధం వైపు నడిపిస్తుంది. 

జన్మ సార్ధకతకు కావల్సిన స్థితిని పొందాలంటే కేవలం మనశక్తే సరిపోదు. ఈశ్వరశక్తి కూడా తోడవ్వాలి. అందుకై భగవంతున్ని త్రికరణశుద్ధిగా ప్రార్ధించాలి. అలా ప్రార్ధించినప్పుడు ప్రతికూలత అంశాలను సంహరింపజేసి, అనుకూలత అంశాలను ప్రేరేపించడానికి దోహదపడేవి దేవతల చెంతనున్న ఆ శతృవర్గం వారే. ఎలాగంటే - 
శ్రీహరిని ఆశ్రయిస్తే, ఆయన వాహనమైన గరుత్మంతుడు సర్పంలో ప్రతికూలత అంశాలను సంహరించి, అనుకూలతను  ప్రేరేపిస్తాడు.
శివున్ని, అమ్మవార్ని, వినాయకుడిని, సుబ్రహ్మణ్యుడుని ప్రార్ధిస్తే -
జగన్మాత, ముంగిస రూపంలో వచ్చి, కుండలిని రూపంలో ఉన్న సర్పంలో ప్రతికూలతాంశాలను సంహరించి అనుకూలతాంశలను ఉద్ధీపనజేస్తుంది.  లేదా సుబ్రహ్మణ్యుడు తన వాహనమైన నెమలి ద్వారా, ప్రతికూల అంశాలను సంహరించి అనుకూలతను  పురోగమింపచేస్తాడు. 
 
పుట్టకు వెళ్ళడం ఏమిటీ...పూజించడం ఏమిటీ...
పుట్టలో పాలు పోయడం  ఏమిటీ...మూఢ నమ్మకాలు...అని కొందరు విమర్శించడం విన్నాను. అయితే మన పెద్దలు దేనినీ ఊరకనే చెప్పరు. వారు చెప్పినదాంట్లో పరమార్ధం మనకు తెలియకున్న, మన శ్రేయస్సుకై చెప్పారన్నది సత్యం. 
                      

మన ఆచారాల వెనుకనున్న ఆంతర్యాన్ని గ్రహిస్తే ... భారతీయుల జ్ఞాన విజ్ఞాన దృష్టి ఎంత సమున్నతమైందో అర్ధమౌతుంది.

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారిని  నాఇంటివారిని ఆప్తమిత్రులనందరిని ఏలు. 
పడగ తొక్కిన పగవాడనుకోకు, నడుము తొక్కిన నావాడనుకో.
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో... నూకలిచ్చెదను, మూకలిమ్ము...  పిల్లల మూకను నాకిమ్ము .


16 కామెంట్‌లు:

  1. మన ఆచారాల వెనుక ఎంతటి ఆధ్యాత్మిక తత్త్వబోధో చాల చక్కగా వివరించారు.🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన ఋషులు మహర్షులు పూర్విజులు తెలిపిన ఈ ఆచారాలు మహోన్నతమైనవి. మన ఆచారాల అంతరార్ధాలు గ్రహించి ఆచరిస్తే తరిస్తాం.
      ధన్యవాదములు వసుంధర గారు.

      తొలగించండి
  2. పుట్టలో పాలు ఎందుకు పోస్తారంటే.... దీపావళి రోజు బాణాసంచా ప్రభావం వల్ల చాలా పాములు కాలిన గాయాలతో ప్రాణభయంతో తమ నివాసాలు వదిలి దూరంగానూ, వేగంగానూ పోతూ ముళ్ళ పొదల్లోనూ, రాళ్ళూరప్పల్లోనూ పయనించి తీవ్ర గాయాలకు గురౌతాయి. ఆ సమయంలో కొన్ని పాములు కనిపించిన పుట్టలలో చేరతాయి. ఆ పుట్టల్లో ఉన్న చీమలు, ఇతర పురుగులూ కీటకాలూ ఈ పాముల మీద దాడి చేస్తే 'బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ' అన్నట్లు ఎంత పెద్ద పామైనా చీమల ధాటికి గాయాల పాలవుతుంది. అలా గాయాలకు గురైన పాములకు కాస్త ఉపశమనం కలిగించడానికే వెన్న శాతం ఎక్కువగా ఉండి చర్మానికి రక్షణ, సంరక్షణ కలిగించే ఆవు పాలను నాగులచవితి రోజున పుట్టల్లో ఉన్న పాములపై పోస్తారు. ఇది ఈ పుట్టలో పాలు పోసే ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం. జంతుప్రేమకూ , జీవకారుణ్యానికీ నిదర్శనం.

    ఇలా హిందూమతంలో ఉన్న ప్రతీ పండుగ వెనుక, ఆచార వ్యవహారాల వెనుక ఖచ్చితంగా చాలామందికి తెలియని కొన్ని సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలూ ప్రయోజనాలు ఉంటాయి. వాతిని విపులంగా తెలియజేసారమ్మా. ధన్యవాదాలమ్మా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాముల నివాసమైన పుట్టలో చెంత అతిగా కాకుండా, పాలు పోయడం ఎందుకో నన్నది అవగాహన చేసుకొని, మితంగా భక్తిపూర్వకంగా చేస్తే అది చక్కటి జీవకారుణ్యతే.
      మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు జోగరావుగారు.

      తొలగించండి
  3. నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
    నాకన్నవారిని నాఇంటివారిని ఆప్తమిత్రులనందరిని ఏలు.
    పడగ తొక్కిన పగవాడనుకోకు, నడుము తొక్కిన నావాడనుకో.
    తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
    ఇదిగో... నూకలిచ్చెదను, మూకలిమ్ము... పిల్లల మూకను నాకిమ్ము .
    👌👌👌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారు,
      ధన్యవాదములండి.
      కాస్త అటు ఇటూగా ఇటువంటి పాటలు పుట్ట దగ్గర కొందరు పాడుతుంటారు. వినడానికి ఎంతో బాగుంటాయి ఈ జానపదులు.

      తొలగించండి
  4. భారతి గారు ఆధ్యాత్మిక పరంగా చక్కగా వివరించారు. టపా చివర్లో వ్రాసిన కవిత చూస్తే అలనాటి ప్రసిద్ధ భావకవులలో ఒకరైన బసవరాజు అప్పారావు గారు "నాగులచవితి"అనే పేరుతో 1930లలో వ్రాసిన ఒక గేయం గుర్తొచ్చింది. మనోహరమైన గేయం. ఈ క్రింది లింకులో చదవచ్చు.

    "నాగులచవితి" (బసవరాజు అప్పారావు గారి గేయం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసింహా రావుగారు,
      ఎంతో చక్కటి గేయాన్ని తెలియజేసారు.
      మీకు మనసార ధన్యవాదములండి 🙏

      తొలగించండి
  5. గతంలో కంటే ఈసారి నాగులచవితి చేసుకోవడంలో ఓ ప్రత్యేకత ఉంది. గతంలో పూజకు కావల్సిన సరంజామ సిద్ధం చేసుకొని కుటుంబపాది చక్కగా ముస్తాబై పుట్టకు వెళ్ళి పూజ చేసుకునేవాళ్ళం. రాత్రి మీ వివరణ చదివి పూజలో పరమార్ధమెరిగి ఆ భావన మనస్సులో మెదులుతుండగా ఈసారి ఈ పండుగ జరుపుకోవడం ఎంతో తృప్తిగా ఆనందంగా ఉంది భారతిగారు.

    రిప్లయితొలగించండి
  6. భారతి గారు, హిందుత్వాన్ని ,ఆచార సంప్రదాయాలని ..ప్రకృతి గురించి, అందులోని రహస్యాాలను గ్రహించలేని వారు నిరతం ప్రశ్నిస్తూనే ఉంటారు.
    మంచి విషయాలను తెలియజేసారు.. ధన్యవాదాలు మీకు.

    రిప్లయితొలగించండి
  7. నాగులచవితి గురించి చక్కటి విశ్లేషణ

    రిప్లయితొలగించండి
  8. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న , అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’ మే.
    శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే. కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.

    కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం "కార్తీక శుద్ధ చవితి"నాడు నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. పాములు రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే దేవతలుగా తలుస్తారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం.అందుకే రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ, పంటలు ఏపుగా పెరిగేకాలంలో కార్తీక శుద్ధ చవితినాడు నాగులచవితిని పర్వదినంగా ఆచరిస్తారు.
    భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా - సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.
    కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.
    పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు.

    పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.
    ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. నాడు ఆస్తీకుడు వంటి జ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి, ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
    Cont....
    శివ

    రిప్లయితొలగించండి
  9. Cont...
    ఆధ్యాత్మిక యోగా పరంగా ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను, 'వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ, కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే శ్రీమహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే. ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది. పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం,సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

    "దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి" అనేది ప్రమాణ వాక్యం. అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

    *నాగుల చవితి మంత్రం*
    పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని (అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, ఆశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియా, తక్షక, పింగళ)మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
    ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తామని అర్ధము. పిల్లలకు ఇవి చెప్పటం మన ధర్మం. ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము, మన ముఖ్యవుద్దేశాలను తెలియజెప్పటం మన బాధ్యత. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పరోపకారబుద్ధిని పిల్లలకు నేర్పాలి.

    మీ చక్కటి టపా చదివాక నాకు తెలిసిన కొంత సమాచారాన్ని జోడించాను భారతీగారు.
    నాగుల చవితి శుభాకాంక్షలు మేడమ్...
    శివ

    రిప్లయితొలగించండి