15, ఏప్రిల్ 2021, గురువారం

సదా స్మరణీయులు | సద్గురువులు (ద్వితీయ భాగం)

 శ్రీ వేంకటేశ్వర అపారకృపాకరుణా పాత్రులైన ఆ దంపతులకు వరప్రసాదిగా జన్మించిన ఆ పుత్రునికి 'వేంకటనాధుడ'ని నామకరణం చేసిరి. దినదిన ప్రవర్ధమానుడయ్యే వేంకటనాధుని బాల్య చేష్టాలకు, ముద్దుమాటలకు ఆ తల్లితండ్రులు మురిసిపోతూ, ఆ బిడ్డకు చిన్నప్రాయంలోనే సాంప్రదాయబద్ధంగా చౌల, అక్షరాభ్యాసములు నిర్వర్తించారు. అక్షరభ్యాసం రోజున - తండ్రి తిమ్మన్నభట్టు బిడ్డ వేంకటనాధున్ని ఒడిలో కూర్చుండబెట్టుకుని,  ఓంకారం వ్రాసి, 'ఓం' అని చదువమని బిడ్డను కోరగా - 

                 

'ఓం' అనే ఆ ఒక్క అక్షరాన్ని గమనించిన బాల వేంకటనాధుడు 'తండ్రీ! ఈ ఒక్క గీత నిగమాగమ వేద్యుడయిన ఆ పరధామున్ని లేదా వారి తత్వాన్ని సూచిస్తుందా లేకా తెలియబరుస్తుందా'? అని అనడంతో, అందరూ ఆశ్చర్యపోయి, ఈ బాలుడు సామాన్యుడు కాదని, పరమజ్ఞాని అని గ్రహించి ఆనందంగా ఆశీర్వదించి, తిమ్మన్నభట్టు దంపతుల అదృష్టానికి అంజలి ఘటించారు. 

ఆ తర్వాత కొద్ది కాలానికే - వేంకటనాధుని తల్లితండ్రులు పరమపదించడం... అన్నావదినల చెంత వుంటూ, అన్న దగ్గరే బాల్యశిక్షణ పొందడం జరిగింది. అన్నగారు గురురాజాచార్యులవారు గ్రామస్థుల సౌజన్య సహకారములతో, వేంకటనాధుని ఎనిమిదవ యేట ఉపనయనము గావించి, బ్రహ్మోపదేశం చేసి, తన కుటుంబ పరిస్థితి, పోషణశక్తి అంతంత మాత్రం అవడంతో, విధిలేక తన నిస్సహాయతను, అశక్తతను తెలియబరుస్తూ, తమ్మున్ని సేరదీయమని, మధుర లోని తన బావగారు లక్ష్మీనసింహాచార్యులవారి వద్దకు వేంకటనాధున్ని పంపడం జరిగింది. కుశాగ్ర బుద్ధి, ఏకసంధాగ్రాహి, చదువుల సరస్వతిగా భాసిల్లే ఆ బాబును, అక్కా బావగార్లు ఎంతో లాలించి, ఆదరించి ప్రేమించారు. అనతికాలంలోనే శ్రీ వేంకటనాధులు, అష్టాదశ పురాణాలను, షట్ శాస్త్రములను మహర్షి అగస్త్యులవారివలె పుక్కిటబట్టి, వేదవ్యాసుల వారివలె మనోజ్ఞానియై విరాజిల్లారు. శ్రీ వేంకటనాధుడు వంశపారంపర్య  వీణా విద్వాంసుడు, తర్కవ్యాకరణాలను తరచి చూసిన పండితుడు. 

ఒకరోజు - 
పద్దెనిమిది సంవత్సారాలు వచ్చిన
వేంకటనాధున్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని, 'ఇంకా చదువుతావా...లేదా ఏదైన వ్యాపకం చూసుకొని అన్నయ్యకు తోడుగా ఉంటావా? ఉంటే బాగుంటుందేమో...కాస్తా ఆలోచించు' అని అక్కాబావగార్లు అనడంతో - 
"మీ మాటలు శిరోధార్యలే కానీ, ఏదో వ్యాపకం దొరికేవరకు అన్నగారికి బరువు కాకుండా కుంభకోణానికి వెళ్ళి, మరింత విద్య సంపాదించుకుంటా"నని, అంతవరకు విద్యా, అన్నప్రదాతలు, ప్రేమమూర్తులు, పూజ్యులైన అక్కాబావగార్లకు పాదాభివందనం చేసి, విద్యాసక్తుడై కుంభకోణానికి చేరి, శ్రీ సురేంద్ర గురుతీర్ధులను దర్శించి, ఆచారానుసారం గోత్ర ప్రవరులు చెప్పుకొని, సాష్టాంగ దండ ప్రణామం ఆచరించగా... ఆ గురువర్యుల వారికి, తిమ్మన్నభట్టు వారు స్మృతిపధంలో కదలాడుతుండగా, ఆదరాభిమానాలతో ఆశీర్వదించి, తమ శ్రీపీఠంలో విద్యాభ్యాసం చేయమని చెప్పిరి. సహవిద్యార్ధుల అసూయ ద్వేషాల నడుమ ఇబ్బంది పడుతున్నను, గురువుగారి వాత్సల్యతతో విద్యను కొనసాగిస్తుండెను. ఆ సమయంలో వేంకటనాధుడు శ్రీసుధాపాఠానికి ఎంతో చక్కగా పూవుకు తావి అబ్బినట్లు పరిమళ సొగసులు కూర్చుతూ వ్రాసిన వ్యాఖ్యానం గురించి అందరికీ తెలిపి, వేంకటనాధుని ప్రతిభను మెచ్చి, నీలాంటి మంచి బిడ్డను కన్న నీ తల్లితండ్రులు, శిష్యునిగా పొందిన నేనూ, నీ సహ విద్యార్ధులు ధన్యులమయ్యా అని, శ్రీ సురేంద్రతీర్ధులవారు ఆ ప్రియ శిష్యునికి 'పరిమళాచార్యులు' అనే బిరుదుతో సత్కరించిరి. వేంకటనాధుడు పరిమళాచార్య బిరుదం పొందిన కొద్దిరోజులకు, శ్రీ గురుతీర్ధుల దిగ్విజయ యాత్రలో భాగంగా, తమ శిష్యబృందంతో కలసి సంచారము చేస్తుండగా, గురువర్యుల ఆదేశానుసారం దక్షిణ మధురలో, ఓ ద్రవిడ సన్యాసితో మహాబాష్యంపై వాద చర్చ చేసి, ఓడించి, శ్రీ గురుదేవులచే 'మహాభాష్యాచార్య' అను బిరుదు పొందెను. అటులనే, తంజావూరులో గురువర్యుల ఆజ్ఞానుసారం అద్వైత, వేదంత పాండిత్యమునందు అసాధరణ ప్రజ్ఞ గల యజ్ఞనారాయణ దీక్షితులుగారితో, ద్వైత అద్వైత విషయంలపై పద్దెనిమిది దినముల సుదీర్ఘ చర్చ గావించి, పందొమ్మిదవ దినమున తన లోకోత్తర శాస్త్రార్ధ వాద పటిమకు ఎదురు లేదని నిరూపించుకొని, 'భట్టాచర్య' బిరుదమును పొందెను. ఇలా వేంకటనాధుడు అసాధరణ ప్రజ్ఞావంతులయ్యాక, శ్రీ గురు సుధీంద్ర తీర్ధులవారు గురుకులం విడిచి గృహస్థాశ్రమము స్వీకరించమని ఆశీర్వదించి, అనుమతిచ్చి ఇంటికి పంపించగా - 
గురుతీర్ధుల వారి అనుమతితో అన్నగారింటికి చేరెను. యుక్తవయస్సు వచ్చిన వేంకటనాధునికి సరస్వతి అను కన్యనిచ్చి వివాహం చేయగా, వారికి పుత్రుడు జన్మించడం, ఆ పుత్రునికి లక్ష్మీ నారయణుడు అని నామకరణం చేయడం జరిగింది. ఈ మహానీయునికి సరస్వతీ కటాక్షం మాత్రమే లభించింది గానీ, లక్ష్మీదేవి కరుణించలేదు. వీరి పాండిత్యం విన్న ఎందరెందరో తమ పిల్లలను విద్యాభ్యాసమునకు పంపుతుంటే, ఆనాటి గురుకులాచారం ప్రకారం ఇంత తిండిపెట్టి చదువు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఈ పండితుడు కొట్టుమిట్టాడుతుంటే, తమ తాహతును బట్టి కొందరు ఆర్ధిక సహాయమందించ తలచితే, సరస్వతిని అమ్ముకొనరాదనే భావంతో ఆ సహాయాన్ని తిరస్కరిస్తూ, భార్య పుత్రునికి సరైన తిండి సమకూర్చలేక దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న తరుణంలో, 

ఓ నాడు - 
ఓ వ్యక్తి వచ్చి,  ఈరోజు న్యాయాధికారి ఇంట్లో బ్రాహ్మణ సంతర్పణ, పండిత పరిషత్తు, సన్మానాలు జరుగుతున్నాయి. కావున సకుటుంబముగా విచ్చేయండి అని చెప్పి వెళ్ళగా, 'పోన్లెండి, రెండురోజుల నుండి మంచితీర్ధంతో కాలం గడుపుతున్న మనకీనాడు మృష్టాన్న బోజనాన్ని ప్రసాదిస్తున్నాడా శ్రీహరి' అని ఆ ఇంటి ఇల్లాలు పలుకగా, ఈనాడు ఎవరో పెడుతున్నారు, మరి రేపో? నెలకు రెండు ఏకాదశులు అందరికి తెలుసు. మనకెన్నో  ఆ దేవునికే తెలియాలి. (ఏకాదశి నాడు ఉపవశించటం మధ్వ సాంప్రదాయం) ఈనాడు జిహ్వచాపల్యానికి గురయ్యేకన్నా ఏకాదశి అనుకుంటే బాగుంటుందని వేంకటనాధులు అన్ననూ, అప్పటికే పిల్లవాడిని తీసుకొని వెళ్ళడానికి సిద్ధమైన బార్యను చూసి, ఇల్లాలును సంతృప్తిపరచటం తన విధిగా తలచి, బయలుదేరారు వేంకటనాధులు. అప్పటికే ఎందరో పండితులు విద్వాంసులు... ఎవరిస్థాయికి తగ్గట్లు వారు వారలతో చర్చలు జరుపుతుంటే, వేంకటనాధులు మాత్రం అందరికీ కాస్త దూరంగా తన అనుష్టానాన్ని చేసుకుంటూ, ఒక పక్కగా కూర్చొని ఉండగా - 
                       

ఓ పెద్దాయన అటుప్రక్కగా వచ్చి, 'అయ్యా! అలా ఏదో గొణుగుకుంటూ కూర్చునే బదులు ఈ సాన, చెక్క తీసుకొని కాస్త గంధం తీసి యజమాని పనుల్లో సాయం చేయరాదు' అని అనగా... "గంధం తీయటానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ, ప్రస్తుతం నేను అగ్నిసూక్తం పఠనం చేస్తున్నాను. ఈ సమయంలో గంధం తీయవచ్చునా" అని బదులివ్వగా, నోటికి చేతికి సంబంధం లేదు, తీయు తీయు అని గదమాయించి హడావిడిగా ఆ పెద్దాయన చెప్పి వెడలెను. అంతట వేంకటనాధులు సాన, చక్క అందుకొని అగ్నిసూక్త పఠనం గావిస్తూ గంధం తీయడం, ఓ కుర్రవాడు ఎప్పటికప్పుడు వచ్చి ఆ గంధాన్ని పండితులకి అందించగా,  గంధం పూసుకున్న ఆ పండితులు కాసేపటికి
మంట మంట అని గగ్గొలు పెడుతుంటే... 
'ఎక్కడా ఎక్కడా' అని పరిగెత్తుకొచ్చెను బ్రహ్మాణ సమారాధాన సన్మాన కార్యక్రమాల నేర్పాటు చేసిన న్యాయాధికారి. పండిత బృందం గంధం రాసుకుంటే మంటలు పెడుతున్నాయని చెప్పగా, ఎక్కడిదా గంధం అని ఆరా తీస్తూ, వేంకటనాధుని దగ్గరకు వచ్చి, రెండు చేతులు జోడించి 'మహాత్మా! మన్నించండి. మీరు మహాపండితులుగా ఉన్నారు. మీకీ పని అప్పగించిన వారెవరూ? ఇందులో పొరపాటున ఏదో కలిసినట్లుంది, ఈ సద్బ్రాహ్మణులు మంటలు మంటలు అని గగ్గోలెత్తుతున్నారు అని వినయవిధేయతలతో న్యాధికారి చెప్పగా -
"ఆర్యా! ఇందులో ఏమీ కలువలేదు, ఎవరో గంధం తీసిపెట్టమని అడిగారు, అగ్నిసూక్తం పఠిస్తున్నాను ఇప్పుడు గంధం తీయవచ్చునా అని అడిగితే, 'నోటికి, చేతికి సంబంధం లేదు, తీయు తీయు' అని చెప్పేసరికి మధ్యలో ఆపకూడదని, అగ్నిసూక్త పఠనం చేస్తూ గంధం తీసాను, అందుకే ఆ మంటలు" అని చెప్పగా -
ఆ పని అప్పగించిన బ్రాహ్మణుడు, 'ముప్ఫై ముప్ఫై ఏళ్ళ పౌరహిత్యం నాది. ఎన్నో వ్రతాలు, సూక్తాలు, పారాయణాలు చేయించాను, చేశాను. ఇలా మంత్రాలకు చింతకాయలు రాలటం చూడలేదు, ఈ గంధంలో ఏమి కలిపావేమిటి' అని గుర్రుగా చూస్తూ, గదమాయిస్తుంటే... "అయ్యా! తాము పెద్దలు, ఎన్నోయేళ్ళుగా వైదికవృత్తిలో వున్నవారు, తమను కించపరచటం, తమ మాటలను ఖండించటం నా అభిమతం కాదు. కాకపోతే -
"దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం
తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణోమమ దేవతా"
అని, సత్యాన్ని నేలపాలు చేయరాదు. ఇప్పుడు చూడండి, వరుణసూక్త పారాయణంతో గంధం అరగదీస్తాను. ఇది పూసుకుంటే మంటలు తగ్గుతాయి. మంత్రశక్తిని అర్ధం చేసుకుని పదిమందికి ఆ దివ్యశక్తిని పంచండి. మంత్రాలను, మహాపురుషులను, దైవాన్ని హేళన చేయకండి" అనగా...
ఇదంతా ప్రత్యక్ష దర్శనం గావించిన అక్కడ వారంతా అవాక్కయి, అంజలి ఘటించారు. ఆ యజమాని పరిపరివిధాల క్షమాపణ చెప్పి సమారాధనలో తగు మర్యాదలు అందించి, ప్రతి మాసం తమ గృహవసరాల నిమిత్తం కొంత దక్షిణ సమర్పించుకోదలిచాను, అందుకు అనుగ్రహించవలసిందిగా కోరెను. కానీ, దూషణభూషణలు, చీత్కార సత్కార్యాలు సర్వమూ సమమనుకునే సమర్ధరూపికి, ఎందుకో ఆ తరుణమున గురుదేవులు జ్ఞప్తికి రావటంతో, భార్య సరస్వతితో, "ఇక్కడెవరికో భారమౌతు బ్రతికేకన్న, శ్రీ గురుతీర్ధుల సందర్శనం గావిస్తే, ఇహపరాలు లభిస్తాయి. ఈ ఇహలోక సంసార గుంజాటనకు సుగమమార్గం లభిస్తుంద"నగానే, "అవశ్యం, శుభస్యశీఘ్రం" అందా ఇల్లాలు. తమ చిరంజీవితో ఆ దంపతులు వెంటనే కుంభకోణానికి బయలుదేరారు.
శ్రీ గురువులను దర్శించి ప్రణమిల్లి, శ్రీ గురువుల చరణ సన్నిధిలో కూర్చుందా కుటుంబత్రయం. వారిని చూసిన శ్రీ సుధీంద్ర తీర్ధులవారి ఆనందానికి అవధులు లేవు. 
ఎన్నాల్టికి చూశాం, ఇన్నాల్టికి నువ్వు మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుని వచ్చావు, సంతోషం నాయనా. ఇక్కడ నువ్వు కుటుంబ సమేతంగా ఉండి, నీ విద్యను పదిమందికి పంచు. నిన్ను నీవభివృద్ధిని చేసుకోమని ఆశీఃపూర్వకంగా సమయోచిత  సూచననొసంగారు శ్రీ గురుతీర్ధులవారు.  వారి కరుణను స్మరించుకుంటూ కృతజ్ఞతా పూరితులై సంతోషంగా కాలం గడుపుతున్న తరుణంలో... 
మరల దిగ్విజయ యాత్రను చేయడం, అక్కడ కొందరితో వ్యాకరణ మహా భాష్యములతో, వాక్యార్ధ శాస్త్ర చర్చలు సలిపిన శిష్యుని అమోఘ ప్రతిభా సంపత్తికి, మహా పాండిత్యానికి శ్రీ గురుదేవులు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. తమ దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకుని శ్రీ పీఠానికి తిరిగివచ్చాక, శ్రీ గురుతీర్ధుల ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నది. ఇకపై కొత్త పీఠాధిపతిని నియమించాలని అనుకున్న గురుదేవులవారికి శ్రీమూలరాముని ఆశయం ఆదేశం వినిపించి, వేంకటనాధున్ని పిలిపించి "వేంకటనాధా! కాస్త ఓపిక ఉండగానే కొత్త పీఠాధిపతిని నియమించాలని మా మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. ఇందుకు శ్రీవారి అనుమతి లభించినట్లు మా ఆరాధ్యదైవం శ్రీ మూలరాములవారు స్వప్న దర్శనం ప్రసాదించి, మాకు వారసుడవు నీవని సెలవిచ్చారు. నీకు దీక్ష యిమ్మన్నారు అని చెప్పగా -
గురుదేవా! మీరు మాట్లాడుతున్నదేమిటో, దాని పర్యావసాన మేమిటో నాకు అర్ధం కావటంలేదు. నేనిమిటి? మీకు వారసునిగా పీఠాధిపత్యం స్వీకరించటమేమిటి? చిన్నప్పుడే తల్లితండ్రులు పోయారు. ప్రేమగా చూస్తున్న అన్నావదినలు వారికి తెలిసిన కొంత విద్యను గరపి, వారి ఆర్ధిక పరిస్థితి అనుసరించి నన్ను అక్కాబావల దగ్గరకు పంపారు. వారు నన్ను కన్న తల్లితండ్రులు కన్నా మిన్నగా, ప్రేమతో పెంచి పెద్దచేశారు. విద్యాబుద్ధులు గరిపారు. ప్రపంచజ్ఞానంలేని నేను, ఇంకా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడకు ఈ ఆశ్రమానికి వచ్చాను. ఈ ఆశ్రమంలో మొదట ఎన్ని అగచాట్లు పడ్డానో, సర్వం మీకు తెలుసు. సమయానికి మీరు ఆదుకొని కరుణించబట్టి, ఆ మనోమధనం నుండి భయటపడి ఈ మాత్రం విజ్ఞానాన్ని పొందాను. మీ కరుణ, ఆశీర్వాదబలాలతో పండిత పరిషత్తులలో గణుతికెక్కి, అనేక బిరుదులు పొందాను. ధన్యుడును. ఆపై మీ అనుమతితో అన్నగారింటికి వెళ్ళగా, వివాహం చేసారు. నా ఇల్లాలు అయిన సరస్వతి ఏనాడు సుఖపడలేదు. మా కడుపున పుట్టినందువలన ఆ చిరంజీవి దుర్భర దారిద్ర్యమనుభవించాడు. గుక్కెడు పాలు కూడా ఇవ్వలేని దీనాతిదీన హీనస్థితిలో ఇలా అందరం శ్రీగురుచరణాలను చేరి సుఖిస్తున్నాం. మీ కరుణ కటాక్షాల వలన ఇంత తిని తృప్తిగా బ్రతుకుతుంది నేడు మా కుటుంబం. ఇప్పుడు ఈ తరుణంలో నేను తురీయాశ్రమాన్ని స్వీకరిస్తే, వారికి అన్యాయం చేసినట్లే. ముక్కుపచ్చలారని బిడ్డడు, ఎండకన్నెరగని భార్య, జీవితమంటే ఏమిటో తెలియని, వారు ఎంతటి పరితాపానికి లోనవుతారో ఆలోచించండి. సంసారాన్ని ఈదలేక సన్యాసినయ్యానని లోకం కోడై కూస్తుంది, ఇది నావల్ల కాదు. వీలుకాదంటే చెప్పండి, ఇక్కడనుండి ఎక్కడికైనా వెళ్ళి ఏదో విధంగా బ్రతుకుతాం. నన్నేవిధంగా నిర్భందించనని వాగ్దాన మొనరిస్తేనే,  ఇక్కడ ఉంటామని అన్న వేంకటనాధుని తేరిపారచూసిన సుధీంద్ర తీర్ధులవారు ... 
నాయనా! శ్రీ మూలరాముని ఆశయం చెప్పానే తప్ప, నిన్ను నిర్భందించి తురీయాశ్రమంలో ప్రవేశపెడతాననలేదు. విషయం వివరించటం మా వంతు. అంతా మూలరాముని దయ. నిన్ను బలవంతం చేయం. భయపడక నిర్భయముగా ఉండమని అభయమిచ్చారు. ఆ పిమ్మట పూర్వాశ్రమ దూరపుబంధువు నొకరిని శ్రీ గురువర్యులు పిలిపించి, వారికి ఆశ్రమవాసమొసగి 'యాదవేంద్రతీర్ధులు 'అని నామకరణమొసగారు. ఆశ్రమ స్వీకారం గావించిన శ్రీ యాదవేంద్ర తీర్ధులు గురువర్యుల అనుమతి పొంది క్షేత్రసంచారానికి బయలుదేరారు. 

ఇలా రోజులు గడుస్తున్నను, గురుతీర్ధుల వారి మనస్సులో మాత్రం వేంకటనాధునికి మహా మధ్వపీఠ సామ్రాజ్యాన్నప్పగించాలని ఉండేది. ఆ కోరిక తీరే సమయం కోసం ఎదురు చూస్తున్నారు.  ఇక్కడ వేంకటనాధునికి కూడా ఇది శ్రీమూలరాముని ఆశయం, ఆదేశమయ్యా... అన్న మాటలు చెవుల్లో గింగురుమంటుండగా, ఎంతో అంతర్మధనముకు  లోనౌతూ అన్యమనస్కుడై తిరుగాడుతుండెను. ఇలా కొన్ని రోజులుగా చింతావ్యాకులుడైన వేంకటనాధుని అంతర్మధనానికి స్వస్తి పలికినట్లైనది ఓ నాటి నిద్రలేని రాత్రి. 
                      

వీణాధారి సర్వాలంకార భూషితమైన స్త్రీ మూర్తి  వాగ్దేవి కనుల ముందు సాక్షాత్కారమవ్వగా, ఆశ్చర్యానందాలతో లేచి చేతులు జోడించి నిలబడగా, ఆ తల్లి మదస్మిత చిరుదరహాసంతో - "వత్సా! వేంకటనాధా! నేను నీ ఆశ్రయము, నీడకోరి భాగ్య భవిష్యత్తును పొందవచ్చిన విద్యాలక్ష్మినయ్యా. ఈ మధ్వ మహపీఠ అనంత విద్యాలక్ష్మినై, వ్యాసరాజుల హయాములో తరించాను. సుధీంద్రుల పలుకబడిలో పరవశించాను. నీ సన్నిధిలో శాశ్వతకీర్తిని పొందాలని ఉవ్విళ్ళూరుతున్నాను. బిడ్డా! నీవు ధన్యచరిత్రుడివి, కారణజన్ముడవు, ఉభయులమూ తరించే ఈ మహాద్భాగ్యాన్ని చేజేతుల విడిచిపెట్టి నన్ననాధను చెయ్యకు. ఒక్కసారి నీ జ్ఞాననేత్రాన్ని తెరు... నువ్వేవరివో, నీ జన్మ రహస్యం ఏమిటో, నీవు సాధించవసిన దేమిటో, ఈ మహామాయ ఏమిటో, ఈ మాయాప్రకృతికి నీవెలా తగులుకున్నావో...సర్వం బోధపడుతుంది. అప్పుడు తప్పక ఈ తల్లి కోర్కెను మన్నిస్తావు. 

విద్యాయత్తంతేయతిత్వమ్నశక్యం:, త్యుక్తుం ప్రాప్తుం తద్వశత్వంకుమాపి |
ఇత్యుక్తాసామంత్రమస్యోపదిశ్వ, స్వీయందేవి వశ్యతోం తర్ధదేద్దా ||

నువ్వు యతివి కావాలని, నీకువశవర్తినినై, నీ నీడలో నేను ప్రభవిల్లి ప్రకాశించాలని, పరమాత్మ వ్రాసిన లలాటలిఖితం. ఈ విధి వ్రాతను తప్పించ నెవరికీ సాధ్యంకాదు. ఇది పరమాత్మ మొసగిన ఆదేశం. ఇది ఎవరు కాదన్నను జరిగి తీరవలసినదే.
ఈ మాటలు వింటున్నతనికి గతంలో తన జన్మలు, చేయవలసిన కర్మలు, సర్వం కనుల ముందర కదలాడుతున్నాయి. గతంలోంచి వర్తమానంలోకి, వర్తమానంలోంచి భవిష్యత్తులోకి...తిరుగాడుతూ సర్వమూ దర్శిస్తున్నాడు. శ్రీ గురుతీర్ధుల మాటలు, శ్రీమూలరాముని ఆదేశం, విద్యాలక్ష్మి అభ్యర్ధన... అన్నీ వినబడి మనస్సును వేగిరపరుస్తున్నాయి. వాగ్దేవి ఆశీస్సులతో భవిష్యద్దర్శనం గావించిన ఆ పరమపురుషుడు అందరి ఆశల,  ఆశయ కర్తవ్య నిర్వహణకోసం ఆశ్రమ స్వీకారం చేయాలని నిర్ణయంచుకోగా, సరిగ్గా అదే క్షణంలో... వేంకటనాధుడు ఆశ్రమ స్వీకారం గావించడం కోసం రాబోతున్నాడని శుభవర్తమానం శ్రీమూలరాముని ద్వారా శ్రీ గురుతీర్ధులవారు విని పరమానందంతో పరవశత్వాన్ని పొందారు. 
తెల్లవారింది -
త్వరత్వరగా కాలకృత్యములు తీర్చుకుని శ్రీ గురుతీర్ధులవారిని దర్శించి, "ఓం శ్రీ గురుభ్యోం నమః" అని సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, గురుదేవా! మీ మాట శిరసావహిస్తాను, సన్యాసాశ్రమం స్వీకరిస్తాను, శ్రీమూలరాముని సేవలో తరిస్తాను, అనంత విద్యాలక్ష్మి ఆజ్ఞను శిరమున దాల్చి అందరి అభీష్టం మేరకు నడుచుకుంటాను..." ఎంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, చెప్తున్న వేంకటనాధుని గాంచి, "చాలా సంతోషం. అందరి అభీష్టం నెరవేరే శుభ సమయం ఆసన్నమైంది. ఆ శ్రీహరి కరుణతో, సర్వ శుభంకరుడవై వెలుగొందుతావ"ని దీవించారు శ్రీ గురుతీర్ధులవారు. శ్రీ గురుతీర్ధుల ఆశీస్సులను పొందిన వేంకటానాధుడు తమ చిరంజీవి లక్ష్మీనారాయణుకి ఉపనయనము గావించి, భార్యతో తన నిర్ణయం చెప్పి, ఆమె పరిపరి విధాల వాపోతున్న, కేవలం నీ నుండి అనుమతిని అభ్యర్ధిస్తున్నానే తప్ప, దైవ ఆదేశాన్ని ధిక్కరించలేను అని తన దృఢ నిర్ణయాన్ని తెలిపెను. నూతన పీఠాధిపతి పట్టాభిషేక సందర్భాలు తగు విధాన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

దైవం నిర్ణయించిన సుముహుర్తం వచ్చింది -
                       

1621 శ్రీ దుర్మతినామ సంవత్సరం ఫాల్గుణ శుక్ల విదియ నాడు - 
తంజావూరు రాజ ప్రసాదమున, పురాధిపతి శ్రీ రఘునాధనాయకులవారు ఆధ్వర్యంలో విద్వాన్మణుల సమక్షంలో, ప్రస్తుత మహా మధ్వ పీఠాధిపతులు సుధీంద్ర గురుతీర్ధులవారు పర్యవేక్షణలో, శ్రీ వేంకటనాధుడు తను దేహిగా చేసుకోవలసిన సర్వకర్మలను ప్రాయశ్చిత్తాదులతో జరుపుకొనడం, పూర్వనామ దేహాన్ని తృణం వలె విసర్జించి, నూతన నామధేయ దేహంతో "శ్రీ రాఘవేంద్ర తీర్ధులు"గా ప్రకటితమై, మధ్వ పీఠాధిపతిగా పట్టాభిషిక్తులైరి.

 శ్రీరాఘవేంద్రుల చరిత్రకు కావల్సిన చిత్రాలు ఇచ్చిన గూగులమ్మకు ధన్యవాదములు. 

ఆనాటి సంఘటనలకు దర్పణం పట్టినట్లు, చిత్రాలు గీసిన చిత్రాకారునికి నమస్సులు. 

లీలావిభూతులు తదుపరి టపాలో -

5 కామెంట్‌లు:

  1. సుదీర్ఘ విరామం,
    దాదాపు 5 నెలల అనంతరం,
    క్షేమమేనా భారతిగారు?
    ఎంతో చక్కటి పోష్ట్.
    మా అమ్మాయి గ్రహదోష నివారణకై శెనగల మాల గురువారం నాడు గురు రాఘవేంద్ర గుడికి వెళ్ళి సమర్పించేవాళ్ళం కానీ స్వామి వారి చరిత్ర తెలియదు. ఇప్పుడు ఇలా తెలుసుకోవడం ప్రాప్తమైంది.🙏

    రిప్లయితొలగించండి
  2. శ్రీ గురు రాఘవేంద్రాయ నమః
    శృంగేరి పీఠాధిపతుల కధనమని అనుకున్నాను.
    చాల బాగ వివరిస్తున్నారు

    రిప్లయితొలగించండి
  3. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః

    చాలా విషయాలు తెలుసుకోగల్గుతున్నాం మీ బ్లాగ్ ద్వారా...

    రిప్లయితొలగించండి