7, జూన్ 2025, శనివారం

నేస్తం మాటలు...మదిలో మెదిలే కథలు

అదేమిటో...ఎన్నిసార్లు కొట్టించిన మూడునాళ్ళ ముచ్చటే. మూడు నెలల క్రితమే కొట్టించి, యు ఎస్ వెళ్ళి వచ్చేసరికి, గుంపులు గుంపులుగా పుట్టుకొచ్చాయి. అయినా వీటిని అనుకొని ఏం ప్రయోజనం? నాలుగు తలలేసుకొన్న ఆ పెద్దాయనను అనాలి. ఆ క్షణంలో వారి కార్యం నెరవేర్చుకోవడానికి దీనిని సృష్టించి, మనల్ని అవస్థల పాలుచేయడం బ్రహ్మకు తగునా? పైగా వీటికి ఓ పెద్ద వరమివ్వడం ఒకటి. అక్కడే ఉన్న ఇంద్రాది దేవతలు మా పని పూర్తయితే చాలనుకొని వీటి సృష్టిని తిలకించారే గానీ, భూలోక వాసులకు కష్టమౌతుందననే తలపే లేదు. పైగా వారి మాట, చేత, లోక కళ్యాణార్థమేనని ముక్తాయింపు ఒకటి..... 

శ్రీమతి ఈ దండకం ఎందుకో అర్ధం కాక, ఏమిటోయ్... ఎప్పుడూ నన్నూ, పిల్లల్ని దులిపేసే నీవు, ఇప్పుడు ఆ భగవంతునిపై దాడి చేస్తున్నావు. ఏమిటి కత? కాస్త ఆ దండకం ఆపి, అసలు సంగతి చెప్పు అని అడుగుతున్న శ్రీవారిని పట్టించుకోకుండా, తన ధోరణిలో తనుంటూ, 
ఆ విష్ణుమూర్తికి నిద్ర ముంచుకురావడం ఏమిటో, ధనస్సునే శేషపాన్పుగా చేసుకోవడం ఏమిటో... ధనస్సు కొసపై గెడ్డం పెట్టుకొని పడుకోవడం ఏమిటో... ఆయనను లేపడానికి ఈ బ్రహ్మ గారు దీనిని సృష్టించడం ఏమిటో... ఏమిటో ఆ మహామాయ, పెనుమాయ... మనకు పెను బాధలు...
ఇంతలో లోపలున్న అత్తగారు సోధ్యం కాకపోతే,
ఏ చిన్న పొరపాటు చేసినా క్షమించు దేవుడా అంటూ లెంపలేసుకుంటూ, గుంజీలతో నీ బారీకాయాన్ని కష్టపెట్టే నీవు,  పొద్దస్తమాను ఆరాధించే దేవుళ్ళను ఆడిపోసుకోవడమేమిటే...తప్పు తప్పు...అని అనడంతో, 
ఆరాధించేవారికే ఆక్షేపించే అర్హత ఉంటుంది అత్తయ్యా... భక్తులు నిందాస్తుతి చేయడం సహజమే కదా! అయినా... నా గోడు వెళ్ళబోసుకుంటున్నానే తప్పా, ఆడిపోసుకుంటున్నానా... తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అంటూ, అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మాయా| దాసో యమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర| అంటూ చెంపలు వాయించుకుంటున్న మిత్రురాలిని చూసి, అంతవరకు ఈ సన్నివేశానికి మౌన వీక్షకురాల్ని అయిన నేను, ఇక నవ్వు ఆపుకోలేకపోయాను. అంతవరకూ నా రాకను గమనించని తను, కాస్త ఉలిక్కిపడి దరిచేరింది. మా ముచ్చట్లు అయి ఇంటికి వచ్చినా, అదే సన్నివేశం మదిలో మెదలడం, తన దండకంలో కథా, భగవత్ లీలలను, హయగ్రీవ వృత్తాంతంను స్మరించుకున్నాను ఆనందంగా.

ఎవరీ హయగ్రీవస్వామి?
ఎప్పుడు ఎందుకు ఎలా అవతరించారు?
సకల విద్యలకు, జ్ఞానానికి ఆధారం ఈయనే అని ఎందుకు కీర్తిస్తున్నారు?
తొలుత శ్రీమహావిష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించి, ఓరోజు ఆయనకు శబ్ద తేజోరూపంగా (హయగ్రీవునిరూపం) దర్శనమిచ్చి, వేదాలను అనుగ్రహించెను. వాటి సహాయంతో బ్రహ్మ సృష్టిని ప్రారంభించెను. మొదటగా బ్రహ్మకు వేదములు ఇచ్చిన శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం హయగ్రీవఅవతారం.  
ఇదే మొదట అవతారమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కథనం బట్టి విష్ణువే స్వయంగా హయగ్రీవుడయినది ఒక పార్శమైతే, ఇతర కారణాలచే ఆయనకు హయశీర్షం తగిలించినట్లు మరికొన్ని కథనాలు ఉండడం మరొక పార్శం. ప్రతీ కథనం వెనుక అంతరార్థం అద్భుతం అద్వితీయం. 
హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు. లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకుని, తెల్లని పద్మంపై ఆసీనులై ఉంటారు. కుడిచేతిలో చక్రం, పై ఎడమచేతిలో శంఖం, కింది ఎడమచేతిలో పుస్తకం, కింది కుడి చేయి చిన్ముద్ర ధరించి ఉంటారు. 
శ్వేతపద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికి, పుస్తకం సకల విద్యలకు, శంఖం సకల సృష్టికి కారణభూతమైన నాదానికి, చక్రం అజ్ఞాన సంహారానికి చిహ్నాలు.
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీమన్నారాయణుడు దాల్చిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. అయితే ప్రముఖంగా పేర్కొన్న దశావతారాల్లో ఈ అవతారం గురించి చెప్పకపోయినా, భాగవతంలో, మహాభారతంలో ఈ స్వామి గురించి వర్ణింపబడినది.

ఒకానొక శ్రావణ పౌర్ణమినాడు వేదోద్ధరణకై, గుర్రపుముఖంతో నరశరీరంతో చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి, వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హయగ్రీవస్వామి.

పూర్వం మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను అపహరించి, పాతాళలోకానికి వెళ్ళిపోవడంతో, బ్రహ్మకు అజ్ఞానం ఆవహించి మందుడై, కర్తవ్యతామూఢుడు కావడం వలన, విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, మధుకైటభులను వధించి, వేదాలను తిరిగి బ్రహ్మకు ఇవ్వడం, బ్రహ్మదేవుడి బుద్ధి చైతన్యవంతమై వికసించడం, సృష్టికార్యం యథావిధిగా కొనసాగించడం జరిగింది. శుక మహర్షి హయగ్రీవుని గురించి వర్ణిస్తూ అనంతమైన వేదరాశి ఆయన యొక్క ఊర్పులు అని చెప్తారు. ఇందువల్లనే హయగ్రీవ స్వామిని జ్ఞానానందమూర్తిగా, వేదాది సకలవిద్యారక్షకుడుగా, విద్యా ప్రదాతగా కొలుస్తారు.

'హయ' అనగా విజ్ఞానం. 'గ్రీవ' అనగా కంఠం. అన్ని విద్యలూ కంఠస్థమై ఉన్న సర్వ విద్యారూపమే హయగ్రీవ మూర్తి.  

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||

ఇకపోతే, ఈ హయగ్రీవ అవతారం గురించి మరికొన్ని కథనాలు - 

ముందుగా దేవి భాగవతంలో ఉన్న కథ - 
కొన్ని సంవత్సరాలు (పదివేల సంవత్సరాలు)
ఏకధాటిగా రాక్షససంహారం చేసిన శ్రీ మహావిష్ణువు అలసటతో ఓ చోట, అల్లెత్రాడు గట్టిగా బిగించి ఉన్న ధనుస్సును నేలమీద నిలబెట్టి, దాని కోపు మీద గడ్డాన్ని ఆనించి, విశ్రాంతిగా కనులు మూసుకొని యోగ నిద్రలోనికి జారుకొనెను. ఇదో యోగమాయ. 
ఇదిలా ఉండగా - 
తాము చేస్తున్న యజ్ఞ హవిస్సులు అందుకోవడానికి విష్ణువును ఆహ్వానించడానికి(వేదవాఙ్మయంలో యజ్ఞోవైవిష్ణుః... విష్ణువే యజ్ఞస్వరూపుడు అని స్తుతింపబడింది) బ్రహ్మాది దేవతలు  వైకుంఠంకు వెళ్ళి, అక్కడ విష్ణువు లేకపోవడంతో, దివ్యదృష్టితో విష్ణువును గాంచి, యోగనిద్రలో ఉన్న విష్ణువు దరిచేరి, లేపడానికి సందేహిస్తూ, ఎలా అని యోచిస్తుండగా, బ్రహ్మ వమ్రి (చెదపురుగు)అనే కీటకాన్ని సృష్టిస్తాడు. ఈ వమ్రి నన్ను ఎందుకు సృష్టించారని ప్రశ్నించగా, ధనుస్సు నారిని తెంపితే ధనస్సు కదిలి విష్ణువు మేల్కొంటాడు కాబట్టి, వింటి నారిని కొరకమని చెప్పగా, నిద్రా భంగం చేయడం, కథా ప్రవచనాలను మధ్యలో ఆపడం, దంపతుల నడుమ అన్యోన్యతకు భంగం కలిగించడం, తల్లీ బిడ్డలను విడదీయడం... బ్రహ్మహత్యాపాతకంతో సమానమంటారే. ఈ మహాపాపం నేను చేయలేను, అని అనగా, లేదు లేదు, ఇది దైవ కార్యం. నీకు ఏ పాపమూ అంటదు, మేము చేసే యజ్ఞంలో హోమగుండం వెలుపల పడిన హవిస్సులు నీకే ప్రసాదిస్తాం అని వరమిచ్చాడు బ్రహ్మ. పవిత్ర హవిస్సు దొరుకుతుందనే సంతోషంతో వింటినారిని చెద పురుగు కొరకడం, నారి తెగి విష్ణువు తలకు తగిలి, తల తెగిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. ఈ ఊహించని పరిణామానికి మ్రాన్పడిపోయి, అపరిమిత వేదనకు అందరూ లోనయ్యారు. 
ఏదైనా కష్టం వచ్చినా, బాధ కలిగిన, భయం వేసినా ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మే. శ్రీ మహావిష్ణువు తల తెగి ఎక్కడ పడిందో తెలియక భయభ్రాంతులైన వీరికి కూడా ఆ జగన్మాతే గుర్తుకు వచ్చి, ఈ విపత్తు నుండి రక్షించమని ఆమెను ప్రార్ధించగా, ఆ పరాత్పరి ప్రత్యక్షమై, ఇదంతా దైవ ఘటన. ఇలా జరగడం నా సంకల్పములో  భాగమే, ఈ లోకంలో ప్రతికార్యమూ కారణ సహితమే. విష్ణువు శిరస్సు ఇలా తెగిపడడంలో కూడా కారణం ఉన్నదని  జగన్మాత ఇలా చెప్పెను -
ఒకానొక రోజు వైకుంఠంలో శేషపాన్పుపై పవళిస్తున్న శ్రీ మహావిష్ణువు ఏదో ఆలోచిస్తూ, తనకి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవిని చూస్తూ, వంకరగా నవ్వడం, అంతట ఆ నవ్వుకు అర్ధం తెలియక మదిలో కదిలాడే అనేక ఆలోచనలతో అసహనంకు లోనై, కుపితురాలై, 'స్వామి!నన్ను గేలి చేస్తూ నవ్విన మీ తల తెగిపడును గాక!' అని ఆవేశంతో అన్నది లక్ష్మీదేవి. ఈ హఠాత్సంఘటనకు ఉలిక్కిపడి, ఈ సంఘటన యాదృచ్చికం కాదు, భవిష్యత్తులో జగత్కల్యాణం కోసమే అయి వుంటుందని భావించారు ఇరువురు.
ఇదియే కాదు, ఈఘటనకు మరో కారణం కూడా ఉంది...
పూర్వం గుర్రం తలతో ఉండే హయగ్రీవుడనే లోక కంటకుడైన రాక్షసుడొకడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. నేను అతనికి ప్రత్యక్షం కాగా, 'మరణంలేని జీవితం కావాల'ని వరం కోరుకున్నాడు. అది అసంభవమని, పుట్టినవారు మరణించక తప్పదని నచ్చజెప్పి, మరో వరం కోరుకోమన్నాను. తనలాగే గుర్రంతల ఉన్నవాని చేతిలోనే మరణం సంభవించాలనే వరం కోరడంతో నేను అతనికి ఆ వరం అనుగ్రహించాను. తనలా గుర్రం తలతో మరొకరు పుట్టడం అసంభవం కనుక, తనకి చావే ఉండదని మరింత అహంతో కొంతకాలంగా విజృంభిస్తున్నాడు ఆ రాక్షసుడు. ఇపుడు ఆ హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి హయగ్రీవ అవతారం విష్ణువుకు అవసరం. అందుకే విష్ణువు శిరస్సును అదృశ్యం చేశాను. మీరు విచారించకండి. గుఱ్ఱపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి అతికించండి. విష్ణువు హయగ్రీవుడై అవతరిస్తాడు. రాక్షస సంహారం సాగిస్తాడు. నేను హయగ్రీవుడనే రాక్షసుని కిచ్చిన వరమూ, లక్ష్మీదేవి శ్రీహరికి ఇచ్చిన శాపం రెండూ ఈ రీతిలో నెరవేరతాయని పలుకగా, అమ్మ ఆదేశం మేరకు గుర్రపు తలను విష్ణువు మొండేనికి అతికించారు. విష్ణువు హయగ్రీవుడై కనులు తెరచి, జగన్మాత మాయా విలాసాన్ని, జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి, హయగ్రీవ రాక్షసుణ్ణి సంహరించి, లోక కల్యాణం కలిగించాడు.

ఇక బ్రహ్మాండపురాణంలో శ్రీ లలితా పరాభట్టారిక యొక్క దివ్య సహస్రనామ స్తోత్రాన్ని, సాక్షాత్తు చతుర్భుజుడై శంఖచక్రాలతో లక్ష్మీదేవితో కూడి ఉన్న శ్రీ హయగ్రీవ స్వామియే అగస్త్య మహర్షికి ఉపదేశించిన దివ్య కథనం ఉంది. 
శ్రీలక్ష్మీ హయగ్రీవస్వామిని ఉపాసించిన అగస్త్య మహర్షిని అనుగ్రహిస్తూ ప్రత్యక్షమైన హయగ్రీవస్వామిని మహర్షి ప్రార్థిస్తూ, స్వామీ! జగన్మాత అయిన లలితా పరాభట్టారిక యొక్క అవతార విశేషాలను, ఆమె చేసిన భండాసుర వధలను లోగడ తెలిపారు. శ్రీచక్ర మహత్యాన్ని, పంచాక్షరీ మహిమను, విధివిధానాలను  చక్కగా వివరించారు కానీ, లలితాదేవి సహస్ర నామాలను, వాటి విశిష్టతను ఉపదేశించలేదు. వాటిని వినే అర్హత నాకు లేదా స్వామీ... అని ఆసక్తితో ఆర్తిగా అడుగగా, 
అగస్త్యా! మహిమాన్వితమైన ఈ నామాలు అందరికీ ఉపదేశించరానివి. అతి రహస్యమైనవి. అయినా ఎంతో ఆర్తిగా నీవు అర్థిస్తున్నావు కనుక, ఆ పరమేశ్వరి సంకల్పంతో లోక క్షేమం కోసం లలితా సహస్ర నామస్తోత్రాన్ని ఉపదేశిస్తున్నాను. 

శ్రీమాతా శ్రీమహారాజ్జీ శ్రీమత్సింహాసనేశ్వరీ | చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || 
............................................................
............................................................

శ్రీ శివా శివశక్త్యాక్య రూపిణీ లలితాంబికా | 
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్రకథనం ...

ఈ విధంగా శ్రీ హయగ్రీవ స్వామి అగస్త్యుల సంవాదం వల్ల మహిమాన్వితమైన ఈ స్తోత్రం మనకి అందింది. పరిపూర్ణ వేదమూర్తి స్వరూపుడైన హయగ్రీవ స్వామిచే 
ఈ లోకానికి లలితా సహస్రనామం, దుర్గా త్రిశతి మొదలైన విద్యలు అందాయి. అంతేకాదు, సకల మంత్రతంత్రాలకు సైతం హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండాది పురాణాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. మహోన్నత అవతారమూర్తి అయిన హయగ్రీవస్వామిని అర్చించిన ఎందరో రుషులు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన ఆదిశంకరులు, విశిష్టాద్వైత మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవ ఉపాసనతో సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారని చెబుతారు. హయగ్రీవ ఉపాసన పుణ్యఫలితం వల్ల శ్రీపాద రాజతీర్థులనే పండితుడు రాజాస్థానంలో జరిగిన పండిత సభలో విజయం సాధించాడు. దుష్టమంత్ర ప్రభావం వల్ల శ్రీపాదుడికి కలిగిన వాగ్బంధనం కూడా హయగ్రీవ ఉపాసన వల్ల తొలగిపోయింది. సూర్యుడు సహా దేవతలందరూ హయగ్రీవుడి ఉపాసన చేసినట్లు హయగ్రీవ ఉపనిషత్ చెబుతున్నది.

శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం - 

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ | నరం ముంచన్తి పాపాని దరిద్రమివ యోషితః ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ | తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః | విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ||

శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదమ్ ||

ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచితం హయగ్రీవసంపదాస్తోత్రం సంపూర్ణమ్ ||

హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు, పాపాలన్నీ పోయి, దరిద్రం తొలగుతుంది.

హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా సర్వవిద్యలూ ప్రాప్తిస్తాయి. 

హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకొని వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది.

హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు దివ్యమైన శ్లోకములను ఎవరైతే స్మరిస్తారో, వారికి సంపదలు కలుగుతాయి.

హయగ్రీవస్వామి శీఘ్ర అనుగ్రహప్రదాత అని స్వామి ఉపాసుకుల మాట. హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం. అందుకే పిల్లలకు హయగ్రీవ స్తోత్రంను గానీ, మంత్రమును గానీ నేర్పించమని పెద్దలు చెప్తుంటారు.

ఓం నమో భగవతే హయగ్రీవాయ
                               [ద్వాదశాక్షర మంత్రం]

విశ్వోతీర్ణ స్వరూపాయ చిన్మయానంద రూపిణే, 
తుభ్యం నమో హయగ్రీవాయ విద్యారాజాయ విష్ణవే
                                    [హయగ్రీవ మంత్రం]

హయగ్రీవాయ విద్మహే విద్యానాథాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్
        [కపింజల సంహితలోని హయగ్రీవ గాయత్రి]


11 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా వివరించారు భారతీగారు. మీ నెచ్చెలి కారణంగా హయగ్రీవ స్వామి చరితం తెలుసుకోగలిగాను. మీ స్నేహితులంతా మీలాగే భక్తి, ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన ఉన్నారు. మీ ఇద్దరికీ 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు పద్మగారు.
      నిజమేనండీ...ఉన్న మిత్రులు కొద్దిమందే అయినా, వారంతా ఆధ్యాత్మిక భావాలున్నవారే. ఈ విషయంలో అదృష్టవంతురాల్ని.

      తొలగించండి
  2. శ్రీనివాసరావు9 జూన్, 2025 10:27 PMకి

    హయగ్రీవ దేవుడు గురించి బాగా వివరించారు. ఆ కథలు చక్కగా చెప్పారు. మా చిన్నతనంలో మా తాత మాచే ఈ స్వామి స్తోత్రం వల్లె వేయించేవారు. ఇప్పటికీ రోజూ చదువుకుంటాం. మా పిల్లలకు నేర్పాను. అయితే మా తాత వేదాంత దేశికులు గురించి, వాళ్ళు ప్రసాదం స్వయంగా స్వామి తిన్నారని, ఏదో కథ...గుర్తు లేదు. మీకు తెలిస్తే ఆ కథ కూడా చెప్పండి. గుడికి మా తాతతో వెళ్ళినపుడు, కాసేపు కూర్చొని అనాయాసేన మరణం అన్న శ్లోకం చదవాలని చెప్పేవారు. అది ఎందుకో సరిగ్గా తెలియదు. ఇది కూడా తెలిస్తే చెప్పండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాసరావు గారు, వేదాంతదేశికులవారు రచించిన ముప్పైరెండు శ్లోకాలు గల హయగ్రీవ స్తోత్రం గురించి తప్పా, వారి గురించి నాకు ఏమీ తెలియదు. మీ ప్రశ్నతో కొందరు పెద్దవారిని, మిత్రులను అడుగుతూ తెలుసుకున్న విషయాలు ఈ క్రింద సంక్షిప్తంగా తెలుపుతున్నాను - ముందుగా మంచి ప్రశ్నతో దేశికులవారి గురించి నేను తెలుసుకునేలా చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      వేదవాజ్మయంలో విష్ణువు హయగ్రీవుడుగా ప్రాదుర్భావం అయిన అనంతర కాలంలో, ఒక అవతారమూర్తిగా పూజింపబడుతున్న వివరణను చారిత్రకంగా పరిశీలిస్తే, నాల్గవ శతాబ్దం అనగా గుప్తులకాలం నుండి హయగ్రీవోపాసన గోచరిస్తుంది.

      అద్వైత ద్వైత విశిష్టాద్వైత సంప్రదాయాల్లో ఈ మూర్తి ఆరాధన ఉంది. త్రిమతాచార్యులైన శ్రీ ఆదిశంకరుల వారు, శ్రీ రామానుజుల వారు, శ్రీ మధ్వాచార్యులవారు ఈ స్వామిని ఉపాసన చేయడంలోనే ఈ అవతార శ్రేష్ఠత్వం స్పష్టమౌతుంది.

      అటులనే రాఘవేంద్రస్వాముల వారి కంటే పూర్వులు, మధ్వ సంప్రదాయ ప్రవర్ధకులయిన వాదిరాజతీర్దులవారు హయగ్రీవోపాసకులుగా ప్రసిద్ధులు. వీరు పిలిస్తే, హయగ్రీవస్వామి పలికేవారని, అలాగే పూజానంతరం హయగ్రీవులకు ఇష్టమైన ప్రసాదాన్ని ఒక తట్టలో పెట్టి తలమీద మ్రోసేవారని, స్వామి హయరూపంలో విచ్చేసి, ఆరగించేవారని ప్రశస్తి. ఇప్పటికీ కన్నడిగులు "హయగ్రీవమడ్డి" అనే తియ్యటి వంటకాన్ని చేసి, భక్తితో స్వామికి నివేదిస్తుంటారు.

      వైష్ణవంలో ఆళ్వారులలో నమ్మాళ్వార్, తిరుమంగైఆళ్వార్, కులశేఖరాళ్వార్లు ఈ స్వామిని ఎంతగానో స్తుతించేవారు. వీరి తరువాత ఆచార్యులలో ప్రముఖులైన వేదాంతదేశికుల వారు ప్రముఖ హయగ్రీవోపాసకులు. వేదాంతదేశికుల వారు తమిళనాడు దక్షిణ ఆర్కాటు జిల్లా లోని కడలూరు సమీపంలో గల తిరువెండిపురంలో గల హయగ్రీవ దేవాలయంలో యోగముద్రతో పద్మాసనస్థితిలో ఉన్న స్వామివారు భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఈ దేవాలయంలో దేశికుల వారు మొదట గరుడమంత్రాన్ని భక్తితో జపించి, గరుడుని ప్రత్యక్షం చేసుకొని, గరుడుని నుండి హయగ్రీవ మంత్రాన్ని ఉపదేశంగా పొంది, ఆ మంత్రంతో ఆరాధించగా, హయగ్రీవ స్వామి ప్రత్యక్షమై, తన అర్చా విగ్రహాన్ని వీరికి అనుగ్రహించారు. ఈ విగ్రహాన్ని అర్చించి, నైవేద్య సమర్పణ చేయడం దేశికులవారికి నిత్య దినచర్య. ఒకరోజు నైవేద్య సమర్పణానంతరం భిక్ష స్వీకరణకై నది దాటి, పొరుగూరు వెళ్ళేరు. తిరుగు ప్రయాణవేళ కావేరి నది ఉదృతంగా పొంగడం వలన వారు ఆరోజు తిరిగి స్వగ్రామం రాలేక, ఆ రాత్రి అక్కడే ఉండిపోవడం వలన, మరునాడు అర్చనా సమయానికి రాలేకపోయారు. ఆ రోజు సమయానికి దేశికులవారు నైవేద్యం పెట్టకపోవడం వలన, హయగ్రీవ విగ్రహం శ్వేతాశ్వంగా మారి బయటకు వెళ్ళి, ఇతరుల పొలాల్లో మేయసాగింది. వారా అశ్వాన్ని బంధించారు. నదీ ప్రవాహం తగ్గిన తర్వాత, దేశికులవారు ఇంటికి వచ్చి చూస్తే, అర్చా విగ్రహం కనిపించక పోవడంతో బాధతో,
      హయావదన భగవతో మయి యది కరుణాస్యాత్ అనర్గలం సపది|
      అత్ర సమేత్య శుచమ్ మే నిరాకరిష్యత్య సంశయం క్షిప్రమ్||
      (హయగ్రీవస్వామికి నాయందు దయ ఉంటే వెంటనే వచ్చి నా బాధను తొలగిస్తాడు)
      అని ప్రార్ధించినట్లు శ్రీమద్వేదాంత దేశిక దివ్యచరితంలో ఉంది. వెంటనే స్వామి పూజామందిరంలో ప్రత్యక్షమైనట్లు కథనం.

      మీరు అడిగిన మొదట ప్రశ్నకు నేను సేకరించిన సమాచారమిది. ఇక మీ రెండవ ప్రశ్నకు సమాధానం తదుపరి టపాలో వివరిస్తాను.

      తొలగించండి
    2. శ్రీనివాసరావు12 జూన్, 2025 11:30 AMకి

      అమ్మా!నమస్కారం!
      మర్చిపొయిన కధను తిరిగి గుర్తు చేసారు. మీకు తెలియకపొయినా తెలుసుకొని చెప్పినందుకు థాంక్స్ అండి. పద్మగారు ఏమీ అనుకోనండి.తదుపరి టపా కొసం ఎదురుచూద్దాం.

      తొలగించండి
  3. వేదాంతదేశికుల వారి గురించి తెలిపిన వారందరికీ వందనాలు🙏

    రిప్లయితొలగించండి
  4. ఇదేం బాగాలేదు భారతీ గారు. నేను ఎప్పటినుండో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, నాకు బదులివ్వలేదు గానీ... ముందు వచ్చిన చెవులు కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నది ఇందుకేనా? హన్నా! ఇలా అన్నానని తప్పుగా అనుకోవద్దు శ్రీనివాసరావు గారు,సారీ. ఇదో నానుడి అంతే.

    రిప్లయితొలగించండి
  5. అదేం లేదు పద్మగారు. తదుపరి టపాలో మీరు అడిగిన ప్రశ్నలతో పాటు శ్రీనివాసరావు గారి ప్రశ్నకు బదులిస్తాను.

    రిప్లయితొలగించండి
  6. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయైనమః
    టపా బాగుంది
    శ్రీమాతాయైనమః

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీమాతాయై నమః
      బాగున్నారా?
      మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదాలు
      🙏

      తొలగించండి
    2. శ్రీ మాత్రేనమః
      కుంటుతూ బండి నడుస్తోందమ్మా!
      అంతా అమ్మ దయ!
      ధన్యవాదాలు

      తొలగించండి