11, అక్టోబర్ 2011, మంగళవారం

సాధన - అష్టాంగయోగం (ద్వితీయ భాగం)

                                                      నియమము 

వ్యక్తిగత ప్రవర్తనా నియమావళిని సూచించేది నియమం. నియమాలన్నీ కూడా ఎప్పుడూ ఎరుకతో, సమభావముతో, ఆత్మకేంద్రంగా ఉండాలనే సూచిస్తున్నాయి. ఈ నియమావళిని సూచించేది నియమం 
ఈ నియమాలన్నీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి బాగా సహకరిస్తాయి 
శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానని నియమాః
ఇందులో కూడా ఇదు అంశాలు ఉనాయి  :
౧.శౌచము ౨. సంతోషము ౩.తపస్సు ౪.స్వాధ్యాయము ౫.ఈశ్వరప్రణిధానము
                                          
                                                           ౧.శౌచము
బాహ్యార్ధం :- బాహ్యంతర్గత శుభ్రతే శౌచం. బాహ్య భౌతిక పరిశుభ్రత, మానసిక పరిశుద్ధత(అంతఃకరణ శుద్ధి) యే శౌచం. శౌచమనగా పారిశుద్ధ్యం, పవిత్రత, నైర్మల్యం, యోగ్యత, మంచితనం. స్నాన సాత్వికాహారముల ద్వారా శరీరము శుభ్రపడి ఆరోగ్యం ద్రుఢపడును. యోగాభ్యాసం చేయదలచిన సాధకులు ఆరోగ్యవంతులై మానసిక బలవంతులై ఉండాలి. దేహము,మనస్సు పరిసరములు పరిశుభ్రమైనప్పుడు (సాధకుని ఆరోగ్యం, భావనలు కూడా శుద్దమై) వాటిని గురించి చింతన నశించి జ్ఞానమార్గ అన్వేషణలో ముందుకు వెళ్ళగలుగుతారు. బాహ్యశౌచం స్నానాదులవలన, అంతరశౌచం భగవన్నామ స్మరణాదులవలన కలుగుతుంది. దేహ శుభ్రత వలన ఆరోగ్యం, మానసికశుద్ధివలన ఉల్లాసం, ప్రశాంతత కలిగి సత్యబుద్ధి అలవడుతుంది. ఏకాగ్రత కుదురుతుంది. బ్రహ్మనిష్ఠ కుదురుతుంది. జ్ఞానేంద్రియాలు  స్వచ్ఛంగా ఉండాలి. చూసే చూపు, వినే మాటలు, రుచి, స్పర్శ, వాయువు స్వచ్ఛంగా ఉండాలి. పంచతన్మాత్రలు (భూమి,ఉదక,అగ్ని,వాయు,గగనతత్వాలు), పంచాకోశాలు (అన్నమయ, ప్రాణామయ,మానోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాలు) శుద్ధంగా ఉండాలి.దేహమాలిన్యం జలమృత్తకలచే ఎలాగున శుద్దమగునో అలాగనే జ్ఞానరాగాదులచే ఆత్మశుద్ధి కలిగి ఉండుటయే శౌచమనబడును. జ్ఞానవైరాగ్యములనెడి మృత్తిక చేత క్షాళనము గావించి వాసనత్రయమును నశింపజేసుకొని చిత్తశుద్ధిని గావించుటయే శుద్ధశౌచం. (మైత్రేయోపనిషత్)
క్షమ ద్వారా విద్వాంసులు; దానం ద్వారా దుష్కర్మలు చేసినవారు; జపాదుల ద్వారా రహస్య పాపములు చేసినవారు; తప్పస్సు ద్వారా వేదవిదులు పరిశుద్దులౌతారు.
అంతరార్దం :- తాము నిత్యశుద్ధ స్వయంప్రకాశజ్ఞాన స్వరుపములమని స్పురించు శుద్దత్వమే శౌచం.

                                                     ౨.సంతోషము 
బాహ్యార్ధం :- ఏ సమయములో ఏది లభించినను హర్షశోకములు పొందక ఎల్లప్పుడు ఒకేవిధముగా ఉండు సంతుష్టియే సంతోషం. తమ శ్రమకు ఫలితముగా వచ్చినదానితోనే సంతృప్తి చెంది అంతకన్న ఎక్కువ ఆశించకుండ ఉండడం సంతోషం. "నిర్ధనోపి సదాతుష్టః (వివేకచూడామణి) ధనం లేకపోయినా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడమే సాధకుని లక్షణం. సాధకులు సంతోషం వలన సత్యబుద్ధి కలిగి దృఢలక్ష్యంతో పారమార్ధిక పయనంలో పరమానందస్థితిని పొందే అర్హతను పెంచుకుంటారు. ఆత్మనాత్మ విచక్షణ, అనిత్యవస్తువైరాగ్యం గలవానికి తానే బ్రహ్మమని తెలియడంవలన దుఃఖం వుండనేవుండదు.
అంతరార్ధం :- బ్రహ్మాదిలోకపర్యంతంగల సమస్త విషయాది భోగములలో విరక్తి కలిగి పరమాత్మ ధ్యానమందు కలిగేడు త్రుప్తానుభూతిని సంతోషమని అందురు.

                                                   ౩.తపస్సు 
తరింపజేసేదే తపస్సు.
తపస్సంటే సర్వం త్యజించి నిర్మానుష్య ప్రాంతానికి తరలి,మనస్సు, ఇంద్రియాలు నియంత్రించి అన్నింటిని నిరోధించి తీవ్ర కఠోరంగా సుదీర్ఘకాలం సాధన చేయడాన్ని తపస్సు అంటారు.కానీ ఇది కలియుగం. ఈ యుగ ధర్మానుసారం తపస్సంటే ___
తపించుట అని అర్ధం. భగవంతునికై నిరంతరం పరితపించుటే నిజమైన తపస్సు. దేహేంద్రియ మనోబుద్దులను ఆధ్యాత్మికకార్యంలలో ఉంచి, భగవదాలోచనలలో రమించుటయే తపస్సు. ఇటువంటి తపస్సు వలన అంతఃకరణశుద్ధి, మనోనిర్మలం వచ్చును. శాంతం, రజోగుణ జనిత ఆవేశం, తమోగుణ జనిత అలసత్వం నశించి, సత్వగుణ ప్రధానమైన ఆనందం కల్గును. ఆంతర్యంలో విషయలోలత్వం ఉండదు... అని శంకరాచార్యులవారి ఉద్భోధ.
నిరహంకారంగా ఉండడమే మహోగ్రమైన తపస్సని శ్రీరమణలు అన్నారు.
సత్యవ్రతం,సమదర్శిత్వం, కోపమే లేకుండ ఉండుటను అలవర్చుకోవడమే తపస్సు.(భర్తృహరి)
'మనసశ్చ ఇంద్రియాణాంచ ఇకాగ్ర్యం నిశ్చితం తపః' మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం ఒనర్చుటయే తపస్సు.
"తపమనగ సకల విషయ
వ్యపేత మగునట్టి బుద్ధి వైభవం సుమీ
తపమున సుస్థిరుడగు యో
గపరునకుం గలవే యొండు కర్తవ్యంబున్"
(ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్పినట్లుగ భారతంలో ఉంటుంది)
భావం: అన్ని ఇంద్రియాలకు దూరమైన బుద్ధి వైభవమే తపస్సు, తపస్సులో స్థిరపడిన యోగికి కర్తవ్యాలుండవు,అంటవు) 
రాగకారణం వున్నా రాగం లేకుండా వుండడం, ద్వేష కారణం వున్నా ద్వేషం లేకుండా వుండడం తపస్సు. ఏ తలంపైతే, ఏ  వాసనైతే నిన్ను దేహంతో బంధిస్తుందో, నీ మనస్సును బయటికి తీసుకుపోతుందో దానిని కాల్చి బూడిద చేయడమే తపస్సు.(జిన్నూరు నాన్నగారు)
బ్రహ్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే అడ్డు వస్తున్నాయో వాటిని తొలగించుకోవడానికి నీవు చేసే ప్రయత్నమే తపస్సు.
కొందరు విజ్ఞులు తపస్సు మూడురకాలని అంటారు--- 
వాచక తపస్సు--- నేర్పుగా, ఓర్పుగా, ప్రియముగా, హితకరంగా, మృదువుగా, సౌమ్యముగా, ఎదుటివార్ని నొప్పించక సంభాషించడం...
శారీరక తపస్సు--- పనిని శ్రద్ధగా, ప్రేమగా, నిష్కాముగా, నిండుమనస్సుతో, అంకితభావముతో,పరోపకారంతో చేయడం...
మానసిక తపస్సు--- ఏకాగ్రంగా, నిశ్చలంగా, నిర్మలంగా, దయగా,నిగ్రహంగా, శాంతిగా వుండడం...
సూక్ష్మంగా చెప్పాలంటే నిర్మలంగా ఆలోచించండీ, నిష్కామంగా పనిచేయండీ, హితవుగా మాట్లాడండి.
భక్తి, జ్ఞాన, కర్మ యోగముల ద్వారా బ్రహ్మానందానుభావాన్ని పొందడానికి చేసే సాధనే సాత్విక తపస్సని గీతలో వుంది. అలానే శారీరక సుఖాన్ని, ప్రాపంచిక భోగానందముల గురించిన చింత ఆవంతైనా లేకుండా భగవంతున్ని చేరాలనే సాధనే సాత్విక తపస్సని, అధికారం, ధనం, కీర్తీ, వాటికొరకు ప్రయత్నించడం రాజసికతపస్సని, ఇతరులను నాశనం చేయాలనుకోవడం, కీడు చేయడం, ఇంద్రియాలకు లోనై పనిచేయడం తామసికతపస్సని గీత చెప్తుంది.
తపస్సంటే నియమబద్ధమైన జీవితం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరములను స్వాధీనపర్చుకొని వాటి సహకారంలతో ఆత్మనిగ్రహములతో చేసే సాధనయే తపస్సు. ఎటువంటి ఆపదలకు, ఆటంకాలకు చలించకుండ సమభావనతో వుండగలగడమే తపస్సు. శత్రుత్వమైన, మిత్రుత్వమైన; పొగడ్త అయిన, నింద అయిన; సంతోషమైనా,దుఃఖమైన; వేడైన, చల్లనైన; ఇలా ద్వందాలన్నిటిని చలించక సమభావనతో అంగీకరించడమే తపస్సు.
మోక్షప్రాప్తి కొరకు సాధకుడు చేయు ఎట్టి సాధనయినను అది తపస్సే. తీవ్రవైరాగ్యవిచారతపమును కూడా తపస్సందురు. మనసేంద్రియములను ఏకాగ్రపరచి బ్రహ్మనిష్టయందు నిశ్చలముగా వుండుటయే తపస్సు.
అంతరార్ధం :- ఆత్మానాత్మ వివేకజ్ఞానం చేత అవిద్యాసంబంధమైన సమస్తదోషములను దహింపజేయుటయే తపస్సు.

                                            ౪.స్వాధ్యాయము 
బాహ్యార్ధం :- ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిబింబించి ముక్తికి దారితీసే శాస్త్ర, గ్రంధ పఠనం స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే స్వానుభవమును చేకూర్చిపెట్టే సద్గ్రంధ పఠనం. (సద్గ్రంధ పఠనమంటే సత్యమును, భగవత్తత్త్వమును బోధించేది). సద్గ్రంధ పఠనంచేత సద్భావనలు వృద్ధి చేసుకొని వాటిని సదా మనస్సుచేత మననం చేయించడమే స్వాధ్యయనం. స్వాధ్యయనమంటే మంత్ర జపం, భగవన్నామ స్మరణ కూడా. స్వాధ్యయనం వలన చిత్తశుద్ధి కలుగును. సంచితమునందలి పాపములు నశించును. భక్తీ, ఏకాగ్రత పెరుగును. బాహ్యప్రపంచమునుండి మనస్సు విడువడుటకు అలవడును. గ్రంధ పఠనం, అభ్యచించడమే కాదు, భావనామయ ప్రజ్ఞతో (అనుభవజ్ఞానంతో) తనని తాను(స్వ స్వరూపం) తెలుసుకోవడం స్వాధ్యాయం.   
అంతరార్ధం :- తాను నిత్యశుద్ధ బ్రహ్మమనెడు చలింపని భావమందు నిలిచి ఆత్మజ్ఞానమాత్రంచేతనే సంసారంనుండి విముక్తి కలుగునే గానీ మరి యేయొక్క మార్గం చేతను కాదన్న దృఢమైన జ్ఞానమును గ్రహించుటయే స్వాధ్యాయం.

                                         ౫.ఈశ్వర ప్రణిధానము 
బాహ్యార్ధం :- తనని, తాను చేసే కర్మల ఫలాన్నీ సంపూర్ణంగా పరమాత్మునికి అర్పించుటయే ఈశ్వర ప్రణిధానం. భౌతిక శరీరం చేతగానీ, ధ్యానంచేతగానీ లబించే కర్మఫలాలను అంటే ఫలితాన్ని ఈశ్వరునికి అర్పించుటవలన యోగం సిద్ధిస్తుంది. మనం నిమిత్తమాత్రులం, జయాపజయాలుతో మనకెలాంటి సంబంధం లేదు, వుంచుకోకూడదు. అంటే కర్తవ్యమూ ఈశ్వరుడిదే అన్న భావంతో కార్యభావం వహించి, దాని ఫలితం ఏదైనా ఈశ్వరుడిదే అన్నట్లు నిమిత్తమాత్రులై ప్రతీపనిలో పూర్తిప్రయత్నమును పెట్టి ఫలితాన్ని పరమాత్మునికి ఒదిలిపెట్టి తాను ఉదాసీనముగా ఉండడం ఈశ్వర ప్రణిధానం. తనకి అనేదేది ఉంచుకోకుండా తనకి లబించిన దానంతటిని తనది కాదన్న సద్భావంతో తనకలాంటి శక్తి ప్రసాదించిన ఈశ్వరునికే అర్పించాలి. 
అంతరార్ధం :- సర్వదా, సర్వత్రా సర్వమూ భగవదనుసంధానం చేయడమే ఈశ్వర ప్రణిధానం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి